http://youtu.be/EXjl1To0jxQ?t=7m4s
Thursday, March 5, 2015
Tuesday, March 3, 2015
Monday, March 2, 2015
కేంద్ర బడ్జెట్: మోడీ ఆర్థిక 'నీతి'
ప్రచురణ: మార్చి3,2015 సూర్య దినపత్రిక
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే తొలి పూర్తి
స్థాయి వార్సిక బడ్జెట్ వైపు దేశ ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూశారు. తీరా బడ్జెట్
తీరుతెన్నులు చూశాక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అవాక్కయ్యారు. దానికి ప్రజల అవగాహనా లోపమే
తప్ప మోడీది కాదు. తనది 'బిజినెస్ ప్రెండ్లీ' ప్రభుత్వమని పదేపదే మోడీ చెబుతూనే వస్తున్నారు. ఆ మాటకు
మనసా వాఛా కట్టుబడి ఉన్నట్లు 2015-16 వార్సిక బడ్జెట్ ప్రతిపాదనలతో దేశ ప్రజానీకానికి మరొకసారి
విస్పష్టంగా వెల్లడించారంతే. దాన్ని ఆయన దాచుకోలేదు కూడా. పెట్టుబడికి అనుకూలమైన
బడ్జెట్ ఇది అని ఆయన నిర్భీతిగా ప్రకటించుకోవడాన్ని అభినందించాలి. తద్వారా దాగుడు
మూతల ఆటకు తెరదించారు. తాను ప్రధాన మంత్రి కావడానికి ప్రజలు ఓట్లు వేసివుండవచ్చు, కానీ తన ఆర్థిక నీతికి
అనుగుణంగానే పాలన సాగిస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశాభివృద్ధికి
ఉపకరించే పారిశ్రామిక మరియు వాణిజ్యాభివృద్ధి, తద్వారా ఉపాథి కల్పన అన్న లక్ష్యసాధనే తన ధ్యేయమని చెప్పే
మోడీ మాటలు ఆచరణలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే!
సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు కాబట్టి సంపన్న వర్గాలకు అనుకూలమైన ఆర్థిక
సంస్కరణల అమలులో వడివడిగా అడుగులు వేయాలన్న కృతనిశ్చయంతో మోడీ ఉన్నట్లు బడ్జెట్
వెల్లడిస్తున్నది. కార్పోరేట్ రంగం తనకు వెన్నుదన్నుగా నిలవక పోతే తానీ స్థితిలో
ఉండేవాడిని కాదన్న నగ్న సత్యం ఆయనకు తెలియంది కాదు. కాబట్టే! కార్పోరేట్ రంగం రుణం
తీర్చుకోవడానికి 30% ఉన్న కార్పోరేట్ పన్నును రాబోయే నాలుగేళ్ళలో 25%కి క్రమంగా తగ్గించే
ప్రక్రియకు ఈ వార్సిక బడ్జెట్ తో శ్రీకారం చుట్టారు. తద్వారా తాను కార్పోరేట్
రంగం పక్షపాతినే అన్న సందేశాన్ని దేశ
ప్రజలకు విస్పష్టంగా తెలియజేశారు. మరొక వైపు ప్రస్తుతం 12.23%గా ఉన్న సేవల పన్నును 14%కి పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారు.
బడ్జెట్ ప్రతిపాదనలతో తీవ్ర నిరాశకు గురై ఇంకా తేరుకోని ప్రజానీకానికి గోరుచుట్టపై
రోకటిపోటులా కొన్ని గంటల వ్యవధిలోనే
పెట్రోల్, డీజిల్ ధరలను
ఒక్కసారిగా లీటరుకు రు.3.50 చొప్పున పెంచారు. ఇప్పటికే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్
డ్యూటీని పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయినా ఆ నిష్పత్తిలో
వినియోగదారులకు లబ్ధి చేకూరకుండా కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకొంటున్నది. ఈ
చర్యలను చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు అన్న సామెత గుర్తుకు
రాకమానదు. భ్రష్టు పట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి,
పరుగులు తీయించే లక్ష్యంతోనే ఈ చర్యలన్నింటినీ
అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జెట్లీ నమ్మబలుకుతున్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా మన దేశం మాత్రం 2014-15లో 7.4% ఆర్థిక వృద్ధి రేటు
నమోదు చేసుకొని వెలిగి పోతున్నదని (లెక్కల గారడీ చేయడానికి స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేసే
కొలబద్దను మార్చి, నూతన పద్ధతిలో
గణాంకాలు తయారు చేశారు), 2015-16లో 8.1% నుండి 8.4% వృద్ధి రేటుకు చేరుకొంటామన్న ధీమాను 14వ ఆర్థిక సంఘం వ్యక్తం
చేసింది. దానిపట్ల ఆర్థిక సర్వే
నివేదిక పెదవి విరిచింది. ప్రస్తుతానికి మన ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్న స్థితిలో
మాత్రమే ఉన్నదని, ఉరకలు వేసే స్థితిలో లేదని పేర్కొన్నది. పారిశ్రామిక ఉత్పత్తులు, వాణిజ్యం మరియు వ్యవసాయ
రంగాలకు సంబంధించిన గణాంకాలను పరిగణలోకి తీసుకొంటే ఆర్థిక సంఘం వ్యక్త చేసిన
అభిప్రాయం నమ్మశక్యంగా లేదని ఆర్థిక సర్వే
నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి రేటును పెంచుకోవాలంటే ప్రజలకిచ్చే సబ్సిడీల్లో
భారీగా కోత పెట్టాలని, మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెద్ద
ఎత్తున పెట్టాలని, పెట్టుబడుల కోసమే ప్రభుత్వం అప్పులు చేయాలి తప్ప
ప్రణాళికేతర ఖర్చుల కోసం అప్పు చేయకూడదని ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసింది.
ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ 14వ ఆర్థిక సంఘం నివేదిక చెప్పినట్లు దేశం ఆర్థికాభివృద్ధిలో
వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నదని ఘనంగా ప్రకటించుకొన్నారు. కానీ ఆ అభివృద్ధి
ఫలాలను సంపద సృష్టికర్తలైన శ్రామికవర్గానికి, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందించకపోగా సబ్సిడీల్లో భారీ కోత
విధించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రు.2,66,692 కోట్లు సబ్సిడీలపై
వెచ్చిస్తే 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో రు.2,43,811 కోట్లకు కుదించారు. అంటే ఆర్థిక సర్వే నివేదికలోని
సిఫార్సు మేరకు పేదలకు, రైతాంగానికిచ్చే సబ్సిడీల్లో రు.22,881 కోట్లు కోత పెట్టారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5.1%గా ఉన్నదని, భవిష్యత్తులో ఎట్టి
పరిస్థితుల్లోనూ 6% మించకుండా కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పుకొచ్చారు.
ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు తగ్గుతాయని ఆర్థిక వేతలు చెబుతారు. కానీ నిత్యావసర
వస్తువుల ధరలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు కనపడవు. పైపెచ్చు ఈ బడ్జెట్ లో ద్రవ్య లోటు 3.9% ఉంటుందని అంచనా వేశారు. అంటే దాన్ని పూడ్చుకోవడానికి
కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టక పోవడమో! లేదా మరిన్ని అప్పులు చేయడమో! లేదా ప్రజలపై
మరింత పన్నుల భారం మోపడమో! చేస్తారు.
ఈ బడ్జెట్లో చెప్పుకోవడానికి మంచేమి లేదా! అంటే కొన్ని రంగాలకు సంబంధించి ఉన్నది.
అసంఘటిత రంగంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడానికి వీలుగా రు.20,000 కోట్ల మూలధనం, రు. 3,000 కోట్ల బడ్జెట్
కేటాయింపుతో 'మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర)
నెలకొల్పబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పేదలకు సామాజిక భద్రత
కల్పించడానికి వీలుగా రెండు భీమా పథకాలను ప్రకటించారు. రు.12 వార్షిక ప్రీమియంతో రు.2,00,000 ప్రమాద భీమా పథకం, రు.330 ల వార్షిక ప్రీమియంతో
జీవిత భీమా పథకం, అలాగే రు.1,000 వార్షిక ప్రీమియం వరకు చెల్లించే పథకం ద్వారా జీవితాంతం
చెల్లించే వృద్ధాప్య పెన్షన్ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ
పథకాల్లో చందాదారులు చెల్లించే మొత్తాలకు సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం వార్షిక
ప్రీమియం మొత్తాలను చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. వీటి ద్వారా ఎంత మంది లబ్ధి
పొందుతారో ఆచరణలో చూడాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం అమలుకు గత
ఏడాది కంటే రు.5,000 కోట్లు పెంచి రు.34,699 కోట్లు కేటాయించారు. గత ఏడాది
అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకొంటే కేటాయించిన మొత్తంలో రు.14,000 కోట్లకు లోపే
ఖర్చు చేశారన్న వాస్తవాన్నికూడా గమనించాలి. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో మోడీ
ప్రభుత్వం ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పథకం చట్టబద్దమైనది కాబట్టి పేదల్లో
వ్యతిరేకత పెల్లుబకకుండా జాగ్రత్త పడడానికి కేటాయింపులైతే చేశారు. ఎంత వ్యయం
చేస్తారో చూడాలి. రహదారులు, రైల్వేలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు.70,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక
సదుపాయాల అభివృద్ధికి రు.25,000 కోట్లు కేటాయింపు చేశారు. నాబార్డుకు రు.25,000 కోట్లు కేటాయించారు.
ఇలాంటి కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి కొన్ని మంచి పనులకు
నిథులను కేటాయించక తప్పదు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చేసిన
సిఫార్సును సమాఖ్య వ్యవస్థ స్పూర్తికి కట్టుబడి అమలు చేస్తున్నామని గొప్పగా
చెప్పుకొంటున్న మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో
ఎనిమిదింటిని రాష్ట్రాల ఖాతాలోకి నెట్టేసింది. ఆ జాబితాలో వెనుకబడిన ప్రాంతాల
అభివృద్ధి పథక కూడా ఉన్నది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకాలను తమ నిథులతో
కొనసాగించాలి, లేదా అటకెక్కించాలి. పన్నుల్లో వాటాను 42%కి పెంచి నిథులను
కుడి చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకొన్నట్లుగా ఉన్నది. యాతావాతా
కేంద్రం నుండి రాష్ట్రాలకు గత ఏడాది లభించిన 62% ఆర్థిక వనరుల తరలింపుకే పరిమితం
చేయబడింది. మరి రాష్ట్రాలకు ఒరిగిన మేలేంటో అరుణ్ జెట్లీ గారే చెప్పాలి.
బడ్జెట్ లక్ష్యమేమిటి?: బడ్జెట్ అంటే సాధారణ పరిభాషలో జాతీయ స్థూల ఉత్పత్తి మూలంగా
సృష్టించబడే అదనపు విలువ(సర్ ప్లస్
వ్యాల్యూ) నుండి కేంద్ర
ప్రభుత్వానికి వివిధ రూపాలలో సమకూరబోయే వార్షిక ఆదాయాన్నిఅంచనా వేసి, హేతుబద్దంగా వ్యయం
చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. జాతీయోత్పత్తి నుండి అదనపు విలువ రూపంలో
సంపదను గుట్టలు గుట్టలుగా పోగేసుకొంటున్న కార్పోరేట్ మరియు సంపన్న వర్గాలకు ఇబ్బడి
ముబ్బడిగా రాయితీలు ఇచ్చి, తమ శారీరక మరియు మేథో శ్రమ శక్తితో జాతీయోత్పత్తికి
కారకులైన శ్రామికులకు సంపద పంపిణీలో న్యాయబద్దమైన వాటా కల్పించకపోగా దోపిడీదారుల
ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్ద పీఠ వేయడం అత్యంత దారుణం, రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక లక్ష్యాలకే వ్యతిరేకం.
సంక్షేమ రాజ్యంలో సామాజిక న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ
దృక్పథంతో పరిశీలిస్తే బడ్జెట్ వర్గ స్వభావం బోధపడుతుంది. కార్పోరేట్ సంస్థలు
ఆర్జించే లాభాలపై పన్ను, వ్యక్తులుగా శ్రామికులు లేదా ఉద్యోగులు మరియు యజమానులు
ఆర్జించే వ్యక్తిగత ఆదాయంపై మినహాయింపులకు మించిన ఆదాయంపై పన్ను, అలాగే మినహాయింపులకు
మించిన బహుమతులపై పన్ను వగైరా ప్రత్యక్ష పన్నుల పద్దు క్రిందికి వస్తాయి.
పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే ఎక్సజ్ డ్యూటీ, విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వస్తువులపై విధించే
కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను తదితరాలు పరోక్ష పన్నులుగా పరిగణించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం
అమలు చేస్తున్న ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల విధానానికి సంబంధించి ఏ ఏ
వర్గాలకు రాయితీలు ఇచ్చారు, ఏ ఏ వర్గాలపై పన్ను భారం మోపారు అన్న అంశాన్ని నిశితంగా
పరిశీలించాలిస్తే గానీ బడ్జెట్ ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నదో! ఎవరికి హానికరంగా ఉన్నదో!
బోధపడదు. పరోక్ష పన్నుల పెంపు అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడమే. అలాగే ప్రభుత్వ
ఖజానాకు చేరే ఆదాయాన్ని, వ్యయం
చేసేటప్పుడు అనుసరించబోయే ప్రభుత్వ
ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే కేటాయింపులు ఏఏ వర్గాల ప్రయోజనార్థం
చేశారో అర్థమవుతుంది. ఈ కోణంలో అరుణ్ జెట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2015-16 సంవత్సరం వార్షిక
బడ్జెట్ నిస్సంకోచంగా సంపన్నులకు, కార్పోరేట్ మరియు వ్యాపార వర్గాల ప్రయోజనాలకే పెద్ద పీఠ
వేసిందనడం నిర్వివాదాంశం.
ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి: రాష్ట్ర విభజనతో నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర
సంక్షోభంలోకి నెట్టారు. ఆ పాపంలో విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఎంత వాటా ఉన్నదో!
సహకరించిన బిజెపికి అంతే వాటా ఉన్నది. కనీసం విభజన చట్టంలో పొందుపరచిన మరియు
రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి చేసిన వాగ్దానాలకు అనుగుణంగా వార్షిక బడ్జెట్లలో
నిథుల కేటాయింపు ద్వారా న్యాయం చేయాల్సిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై
ఉన్నది. 2015-16 బడ్జెట్ కేటాయింపులను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గోడు
పెడచెవిన పెట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నది. రాజధానిలేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
గుడ్డిలో మెల్లన్నట్లు విశాఖ మినహా పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రం.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగమే వెన్నుముకగా కొనసాగుతున్న రాష్ట్ర
ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతున్నది.
ఈ పూర్వరంగంలో రాజధాని నిర్మాణనికి నిథులను సమకూరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్లో ఆ వూసే ఎత్త లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఊదరగొట్టి
ఇప్పుడేమో రాబోయే రెండేళ్ళలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న బీహార్, పశ్చిమ బెంగాల్ సరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చేర్చి ప్రత్యేక ఆర్థిక సహాయ నిథిని నెలకొల్పి
దాని ద్వారా ఆదుకొంటామని సెలవిచ్చారు. అంటే ప్రత్యేక హోదా వాగ్దానాన్ని గాలిలో
కలిపేశారన్న మాట. రాష్ట్ర రెవెన్యూ
లోటు భర్తీకి సంబంధించి నిథుల కేటాయింపు చేయలేదు. ఏ మేరకు చేస్తారో కూడా
చెప్పలేదు. వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి
ప్యాకేజీలను అమలు చేస్తామన్నారు. నేటి బడ్జెట్లో ఆ మాటే మరిచారు. ఆచరణలో నిష్ప్రయోజనకరమైన
ఒకటి అర రాయితీలనే మళ్ళీ ఏకరువు పెట్టారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని
నెలకొల్పుతామన్న హామీ అమలు ప్రస్తావన లేదు.
బహుళార్థ సాధక ప్రాజెక్టయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర
ప్రభుత్వం రు.16,000 కోట్లకుపైగా వ్యయం చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రు.100 కోట్లు కేటాయించడమంటే ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వ
చిత్తశుద్ధి బహిర్గతమతున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ
వెచ్చించిన రు.3,500 కోట్లకు పైచిలుకు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందో
లేదో కూడా స్పష్టం చేయలేదు. విభజన చట్టం మేరకు నెలకొల్పుతామని చెప్పిన విద్యా
సంస్థలకు తదితర అన్ని కేటాయింపులను కలుపుకొంటే రు.400 కోట్లు కూడా కేటాయించలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రీతిలో దేశంలోని
మిగిలిన రాష్ట్రాలకు సరిసమానంగా అభివృద్ధిలోకి తెస్తారో! దేశ ప్రధాని నరేంద్ర మోడీ
గారే సెలవియ్యాలి. చాలా చాలా మాటలు, పెద్ద పెద్ద వాగ్దానాలు
చేశారు, మరి వాటి అమలుకు గీటు రాయి ఆచరణే కదా!
Monday, February 23, 2015
రైతు ఆత్మహత్యల సమస్యపై సాక్షి టీవి చర్చా కార్యక్రమం వీడియో.
http://www.sakshi.com/video/daily-programmes/the-fourth-estate-discussion-on-ap-govt-admitting-farmers-suicide-26868
Monday, February 16, 2015
మాటలకు కొదవ లేదు...మరి చేతలో!
ప్రచురణ: పిబ్రవరి 17, 2015 సూర్య దినపత్రిక
భారత పరివర్తన జాతీయ సంస్థ(నీతి) ఆయోగ్ పాలక మండలి ప్రథమ సమావేశంలో ప్రధాని
నరేంద్ర మోడీ మాట్లాడుతూ 'అందరితో కలిసి...అందరి
వికాసం కోసం' జట్టుగా పని చేయాలని రాష్ట్ర
ప్రభుత్వాలకు పిలుపిచ్చారు. నినాదం బాగానే ఉన్నది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కాళ్ళు ఇరగ్గొట్టారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడలేని నికృష్టమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టారు. జవసత్వాలను కూడగట్టుకొని ఇతరులతో సరిసమానంగా ప్రగతి మార్గంలో పరిగెట్టాలంటే కేంద్ర
ప్రభుత్వం కనీసం విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, రాజ్యసభ వేదికగా నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ నిర్దిష్టంగా
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమలు చేయాలి.
రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అదోగతి పాలు
చేసిన కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకు పోయింది. రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించిన బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ.
కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్రానికి సముచిత రీతిలో న్యాయం చేయకుండా కాలం వెళ్ళబుచ్చితే కాంగ్రెసుకు
పట్టిన గతే నేటి పాలకులకూ పడుతుందన్న మాట ప్రజల నోట వినిపిస్తున్నది. అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచారు.
ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. వర్ణనాతీతమైన కష్టాల పాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశమని కాలరెగేస్తూ పార్లమెంటు సభామందిరాల ద్వారాలు మూసేసి, మైకులు ఆపేసి, గొంతులు నొక్కేసి విభజన చట్టం
ఆమోదించబడిందని ప్రకటించుకొన్నారు. ఆ అప్రజాస్వామిక చట్టాన్నైనా గౌరవించి విభజనతో
తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాస్తా నిలదొక్కుకోవడానికి కేంద్ర
ప్రభుత్వం అండగా నిలుస్తుందేమో! అనుకొంటే రిక్త హస్తం చూపెట్టే దోరణి కనబడుతున్నది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక
అభివృద్ధి ప్యాకేజీలు, రాష్ట్ర రాజధానీ నిర్మాణానికి నిథులు, రాష్ట్ర వార్షిక బడ్జెట్
లోని రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఆర్థిక సహాయం వగైరా చట్టబద్ధమైన
హామీలిచ్చారు. దుష్టపాలన సాగించిన కాంగ్రెసు
పార్టీకి ప్రజలు రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి
రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్నందించినా, కష్టాల కడలి నుండి గట్టెక్కడానికి బిజెపి చేయూతనిస్తుందని
ప్రజలు గంపెడాశ పెట్టుకొన్నారు. రాష్ట్రంలో తెలుగు దేశంతో కలిసి బిజెపి అధికారంలో
ఉన్నదని, బిజెపితో
జట్టుగట్టి టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది,
కాబట్టి కొంతైనా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి
ఎనిమిది మాసాలు గడచి పొయాయి. కేంద్ర మంత్రులు హామీల వర్షం కురిపిస్తూనే
ఉన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయ్! కానీ అడుగు గడప దాటడం లేదు అన్న నానుడిగా ఆచరణ ఉన్నది.
దీన్ని ఆర్థిక ప్యాకేజీ అనగలమా?: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 లోని సెక్షన్ 46(2), (3) మేరకు ఆంధ్రప్రదేశ్ కు తోడ్పాటునందించడానికి, వెనుకబడ్డ
రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయడానికి
కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉన్నదని చెబుతున్నా ఆచరణలో దగాకోరుతనం కనబడుతున్నది. వెనుకబడిన ఏడు జిల్లాలలో
అభివృద్ధి పనుల నిమిత్తం 2014-15 ఆర్థిక సంవత్సరంలో
జిల్లాకు రు.50 కోట్లు చొప్పున రు.350 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసే అవకాశం ఉన్నదని, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వనరుల స్థితిగతులపై అంచనా వేసి, 2014-15 కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర రాబడి వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన అంశంపై సిఫార్సులు
చేయమని అంతర్ మంత్రిత్వ శాఖల సంయుక్త కమిటీని గృహ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ తాత్కాలికంగా రు.500 కోట్ల మేరకు తోడ్పాటును ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తున్నట్లు 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మరియు పన్ను
రాయితీలు" ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పిబ్రవరి 4వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది.
విభజన చట్టంలోని సెక్షన్ 94(1) మేరకు రెండు రాష్ట్రాలలో
పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి వీలుగా పన్ను
రాయితీలతో పాటు ద్రవ్య పరమైన చర్యలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై
ఉన్నదని గుర్తు చేసుకొంటూనే ఒకటి, రెండు నామమాత్రపు
ప్రోత్సాహాలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రాయలసీమ
మరియు ఉత్తరాంధ్ర వెనుకబడిన
ప్రాంతాలలో తాయారీ రంగంలో పరిశ్రమలను నెలకొల్పితే నూతన ప్లా౦ట్ మరియు యంత్రాలపై
మొదటి ఏడాదిలో 15% అదనపు తరుగుదల రాయితీ
కల్పించబడుతుంది. అలాగే రానున్న ఐదేళ్ళ
కాలంలో ఎప్పుడు నూతన పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టినా 15% అదనపు పెట్టుబడుల అలవెన్సు రాయితీ ఇవ్వబడుతుందని, రు.25 కోట్లకు తక్కువగా పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఇది
వర్తిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహ
విభాగం పరిశీలనలో మరికొన్ని ప్రతిపాదనలున్నట్లు ముక్తాయింపు పలుకు కూడా పలికారు.
కనీసం రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన మేరకు మరియు చట్ట సభ అయిన రాజ్యసభలో
నాటి ప్రధాన మంత్రి హోదాలో డా.మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్ధానాలకు అనుగుణంగా
ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు పూనుకొని, అవసరమైన నిథుల కేటాయించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర
ప్రభుత్వంపై ఉన్నది. తబ్ధిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రనిరాశ కల్గిస్తూ, అరకొర నిథుల కేటాయింపు, పారిశ్రామికాభివృద్ధి
పేరుతో లోపభూయిష్టమైన ఒకటి, రెండు నామమాత్రపు రాయితీలతో కేంద్ర
ప్రభుత్వం చేసిన ప్రకటన జుగుప్సాకరంగా ఉన్నది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీని కలిసి మాట్లాడితే విభజన
చట్టంలో పేర్కొన్న,
రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలు, అన్నింటినీ గౌరవిస్తున్నామని, అమలు చేస్తామని మరొకసారి హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ మాత్రం నోరువిప్పి ఒక్క
మాట మాట్లాడడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు
ప్రశ్నార్థకంగా తయారవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి జాతీయ అభివృద్ధి మండలి
ఆమోదించాల్సి ఉన్నదని స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర
ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని
ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశాయని, తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే
ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని చెబుతూ ఈ సమస్యను అటకెక్కించే ప్రయత్నం
చేస్తున్నారు. ప్రత్యేక హోదా పొందడానికి ఈ రాష్ట్రానికి అసలు అర్హత ఉన్నదా! అన్న
సంశయాన్ని కొందరు బిజెపి నేతలు ప్రసార మాధ్యమాల చర్చల్లో వ్యక్తం చేస్తున్నారు.
అంటే పరోక్షంగా అర్హతలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గారే
ప్రత్యేక హోదా అంశంపై బహిరంగంగా మాట్లాడడానికి
స్వస్తి చెప్పాలని తమ మిత్రపక్షమైన టిడిపికి పత్రికాముఖాన హితబోధ చేశారు. రంగాల
వారిగా కేంద్ర మంత్రిత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపుకొని ఆర్థిక సహాయం కోసం
ప్రయత్నాలు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి
ప్రత్యేక హోదా కల్పించే అవకాశం లేదనే విషయాన్ని అన్యాపదేశంగానే సెలవిస్తున్నారు.
ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా? రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో మరే రాష్ట్రమైనా ఉన్నదా? ఇంత కంటే హేతుబద్ధమైన
కొలబద్ధ మరొకటి కావాలా? పచ్చగా కళకళ లాడుతున్న రాష్ట్రాన్ని రాజకీయ కారణాలతో
నిట్టనిలువునా చీల్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎలా
వ్యవహరిస్తుంది? ఇతర రాష్ట్రాలు అభ్యంతారాలు లేవనెత్తుతాయన్న అంశం విభజన చట్టానికి మద్దతు
పలికినప్పుడు తెలియదా? విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు
చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ప్రత్యేక హోదా కల్పించడానికి ఏ శక్తి అడ్డగా నిలవగలదు. ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలు అవరోధంగా ఉంటే వాటిని
సవరించైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం వారి బాధ్యత.
వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అమలు
చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసింది. రు.24,500 కోట్ల అంచనా వ్యయంతో ఒక అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర
ప్రభుత్వం రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించిందని చెప్పబడుతున్నది. ఏడు
జిల్లాల్లో 347 మండలాలున్న ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రాకేజీ అంటూ కేవలం
జిల్లాకు రు.50 కోట్లు చొప్పున రు.350 కోట్లు కేటాయిచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ నామమాత్రపు
నిథులతో ఏ పాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? పైపెచ్చు 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చింది. వాటిని ఖర్చు
చేస్తారా లేదా అన్న సందేహం రావడం సహజం. వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఒక
సమగ్ర ప్రణాళికను రూపొందించి, దాని అమలుకు ఏ మేరకు
నిథులను వెచ్చించాల్సి ఉంటుంది, ఏ గడువు లోపు అమలు చేసి
నిర్ధేశిత లక్ష్యాలు సాధించాలనే ఆలోచనే చేయకుండా కంటి తుడుపు చర్యగా
భిక్షమేసినట్లు అరకొర నిథులను కేటాయిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం.
అలాగే, వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో తయారీ
రంగంలో నూతనంగా పరిశ్రమలు, నూతన యంత్రాలను
నెలకొల్పితే 15% అదనపు తరుగుదల రాయితీని ఐదేళ్ళ పాటు కల్పిస్తామని, పెట్టుబడులపై కూడా 15% పన్ను రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.
ఐదేళ్ళ గడువు అన్నదే ఆచరణాత్మకం కాదు. ఈ గడువులోపు నూతన పరిశ్రమలు నెలకొల్పి ఈ
రాయితీలు ఉపయోగించుకోవడం సాధ్యమా! కాదా! అన్న అంశాన్ని ప్రక్కనబెడితే ఈ తరహా
రాయితీలతో వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమేనా! అన్నది ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో
పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర స్థానం విశాఖపట్నం. ఆ నగరాన్ని ఇన్పర్మేషన్
టెక్నాలజీకి హబ్ గా మారుస్తానని, ఐ.టి. రంగాన్ని అభివృద్ధి
చేయడం వల్లనే హైదారాబాదు ఈనాడు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మహానగరంగా
వెలిగిపోతున్నదని చంద్రబాబునాయుడు
చెబుతున్నారు. తిరుపతిని ఐ.టి.కేంద్రంగా మారుస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం
ఒక్క తయారీ రంగానికే ఈ కాస్త రాయితీలను కూడా పరిమితం చేస్తే ఐ.టి. రంగంలో
పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ ముందుకొస్తుంది?
స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటును రానున్న మూడు నాలుగేళ్ళలో
ఏడెనిమిది శాతానికి తీసుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తున్నది. ఆ వృద్ధి రేటును సాధించాలంటే రాష్ట్రాల స్థూల ఉత్పత్తి
(జి.యస్.డి.పి.) కూడా వేగంగా పెరగాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి అతిముఖ్యమైన రాష్ట్రం
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే దేశం ఎలా నిర్ధేశిత వృద్ధి
రేటును సాధించగలదు?
జాతి ప్రయోజనాల దృష్ట్యా కూడా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయట పడవేసి, ప్రగతి బాట పట్టించడానికి యుద్ధ ప్రాతిపదికపై కార్యాచరణ అమలు చేయాలి. కేంద్ర
ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ సంస్థను నెలకొల్పింది. దాని
తొలి సమావేశంలో పాల్గొన్న ఆర్థిక నిపుణులు ప్రయివేటు రంగంపైనే ఆధారపడకుండా
ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఆశించిన వృద్ధి రేటును
సాధించ గలమని విస్పష్టమైన సూచనలు చేసినట్లుగా ప్రసారమాధ్యమాల్లో వార్తలొచ్చాయి.
వాటిని మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
కరవు కాటకాల మధ్య చిక్కిశల్యమవుతున్న రాయలసీమ ప్రాంతం ప్రధానంగా మెట్ట
వ్యవసాయంపై ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. ప్రయివేటు
రంగంలోనే పరిశ్రమలను ప్రోత్సహిస్తామంటే ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి
మిథ్యగానే మిగిలిపోతుంది. ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి భారీ పరిశ్రమ లేదు. ప్రభుత్వ రంగం అభివృద్ధితోనే హైదరాబాదు అభివృద్ధి
చెందింది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలి. కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీని
నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజీలో దాని ఊసే ఎత్తలేదు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికాభివృద్ధికి
నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి. త్రాగడానికి, సాగు నీళ్ళ కోసం ప్రజలు నిరంతరం ఆకాశం వైపు ఎదురు చూసే దుస్థితిలో ఉన్న ఈ
ప్రాంతలో పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత అతిపెద్ద సమస్య. కాబట్టి నిర్మాణంలో
ఉన్న తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాలి. తాగు, సాగు, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నీటిని గోదావరి - క్రిష్ణా - పెన్నా నదుల
అనుసంధానం ద్వారా రాయలసీమకు అందించాలి. ఈ అంశాలతో పాటు విద్య, వైద్య, పర్యాటక తదితర రంగాల
అభివృద్ధి ప్రాతిపదికపై సమగ్రాభివృద్ధికి ప్రణాళికను రూపొందించి, రానున్న నాలుగైదేళ్ళ కాలంలో అమలు చేయడానికి వీలుగా కేంద్ర
వార్షిక బడ్జెట్స్ లో నిథులను కేటాయించి, ఖర్చు చేయాలి. అప్పుడే
వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యo నెరవేరుతుంది.
రానున్న కేంద్ర బడ్జెట్ లో నిథులను కేటాయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం
చిత్తశుద్ధి ప్రదర్శించాలి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం నిర్మాణానికి
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం
చెల్లించాలి. ప్రస్తుత వేతనాలనే చెల్లించడానికి ఖజానాలో డబ్బుల్లేని దుస్థితిలో
ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు జీతాలు పెంచితే పడే
భారాన్ని భరించే స్థితి లేదు. అందు వల్ల ఐదేళ్ళ పాటు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని
రెవెన్యూ లోటును పూర్తిగా కేంద్రం భర్తీ చేయాలి. రాజధానేలేని ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి అభివృద్ధికి తోడ్పాటునందించాలి, అన్ని హంగులతో కూడిన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిథులను
పూర్తిగా కేంద్రమే భరించాలి. వెనుకబడిన ప్రాంతాల్లో నెలకొల్పే నూతన పరిశ్రమలకు
ఇచ్చే ప్రోత్సాహకాలను,
రాయితీలను 15% నుండి స్పెషల్ క్యాటగిరీ
రాష్ట్రాలలో ఇస్తున్న మేరకు ఇవ్వాలి. అలాగే ఒక్క తయారీ రంగానికే కాకుండా సేవా రంగం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, పర్యాటక రంగానికి కూడా వర్తింప చేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్
ప్రజానీకం యొక్క భవిష్యత్తుకు బరోసా ఇచ్చినట్లవుతుంది.
Subscribe to:
Posts (Atom)