Sunday, August 9, 2015

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా: పార్లమెంటు విశ్వసనీయత ?

విభజనతో సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంజుకొని, బలమైన పునాదులపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి " ప్రత్యేక తరగతి హోదా"ను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్ట సభ అయిన‌ రాజ్యసభ వేదికగా వ్రాత పూర్వకంగా ఇచ్చిన హామీ అమలులో రెండు నాలుకల దోరణి ప్రదర్శిస్తుండడంతో ప్రజల్లో నిరాశ, నిస్పృహలు రోజు రోజుకూ బలపడుతున్నాయ‌నడానికి ప్రబల నిదర్శనం తిరుపతిలో ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని, నిప్పు పెట్టుకొని, ఆత్మహత్య చేసుకోవడం. ఈ ఘటన అత్యంత విషాదకరమైనది, హృదయ విదారకమైనది. వ్యక్తి గత సమస్యలకు గానీ, ప్రజలు లేదా సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలకు గానీ ఆత్మ‌హత్యలు ఏ మాత్రం పరిష్కారం కావు, కాబోవు. ప్రజల చైతన్యం, శక్తి సామర్థ్యాలు, సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో అవగాహన చేసుకొని, అంకిత భావంతో పోరాడి సాధించుకోవాలే గానీ ఆవేశాలకు లోనై, నిర్వేదంతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు.
రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకొచ్చాక నాలుక మడత పెట్టి మరొక మాట మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడ‍డం క్షమించరాని నేరం. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుక పోయింది. విభజనకు భేషరతు మద్దతు ఇచ్చిన బిజెపి అధికారంలోకొచ్చి, విభజన చట్టంలో పేర్కొన్న మరియు రాజ్యసభ వేదికగా వ్రాత పూర్వకంగా నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదనే భావన ప్రజల్లో బలపడే తీరులో వ్యవహరించడం తీవ్ర గర్హనీయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ విజ్ఞత, చిత్తశుద్ధి ప్రదర్శించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో సన్నగిల్లి పోతున్న విశ్వాసాన్ని పునరుద్ధించాలంటే చట్టాలు, చట్ట సభల వేదికగా ఇచ్చిన వాగ్ధానలకు కట్టుబడి, త్వరితగతిన అమలు చేయాలి. రాష్ట్ర‌ విభజనతో ఆర్థికంగా, పారిశ్రామికంగా తీవ్ర వెనుకబడిన రాష్ట్రంగా బలవంతంగా మార్చబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవలసిన నైతిక బాధ్యత, రాజ్యాంగ బద్ధమైన కర్తవ్యం కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ బాధ్యతను విస్మరించి, వ్యవహరిస్తే కాంగ్రెసుకు పట్టిన గతే బిజెపికి పడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరంకుశంగా, అప్రజాస్వామికంగా విభజించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన రాజకీయ పార్టీలన్నీ చరిత్రహీనుల ఖాతాలో చేరిపోయాయి. ఇప్పటికైనా సంకుచిత, స్వార్థ‌ రాజకీయాలకు స్వస్తి పలికి, దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తే ప్రాయచిత్త‍ం చేసుకొన్న పార్టీలుగానన్నా కాస్త మిగులుతాయి.

Monday, July 27, 2015

మనది సంక్షేమ రాజ్యమేనా!



హ్యదయ విదారకమైన ఘటనపై హెచ్.యం.టీ.వి.లో జరిగిన చర్చలో నాతో పాటు టిడిపి శాసనమండలి సభ్యులు శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్, బిజెపి నాయకులు శ్రీ కుమార్, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ రాజయ్య‌ యాదవ్, కొత్త చెరువు గ్రామ సర్చంచ్ శ్రీ మాణిక్యం బాబు పాల్గొన్నారు. ఘటన వివరాల్లోకి వెళితే కరువుకు ఆట పట్టు, అత్యంత వెనుకబడిన అన‍ంతపురం జిల్లా కొత్త చెరువు గ్రామంలో ఒక నిరుపేద తన తల్లి మరణించిందనే భావనతో చాప‌ మీద పడుకోబెట్టి లాక్కొంటూ శ్మశానానికి తీసుకెళుతుంటే ఒక విలేకరి గమని‍ంచారు. ఏం జరిగిందని వివరాలు అడిగి తెలుసుకొనే సంద‌ర్భంలో ఆమె బ్రతికే ఉన్నట్లు గ్రహించి, వెంటనే వైద్యుడిని రప్పించి, పరీక్ష చేయించగా ఆ మాతృమూర్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.
ఆమె కుమారుడు అవివాహితుడు. ఆ వూరి స‌త్రంలోనే నివాసం. రాళ్ళను తనకున్న నైపుణ్యంతో రోళ్ళుగా తయారు చేసి అమ్ముకొని తద్వారా వచ్చిన‌ డబ్బుతో తాను పొట్టపోసుకొంటూ, తల్లిని పోషించుకొంటూ వస్తున్నాడు. తల్లి వృద్ధాప్యంలో అనారోగ్యంతో నరకయాతన పడుతున్నది. తన వయసు మీద పడుతున్నది. రాళ్ళను రోళ్ళుగా మలచగలిగిన సత్తువ నశించి పోయింది. ఇల్లు లేదు. రేషన్ కార్డు లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు. బ్రతుకే భారంగా తయారయ్యింది. ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజాప్రతినిథుల నిరాధరణ ఫలితంగా ఒక వృత్తి నైపుణ్యం ఉన్న అసంఘటిత కార్మికుడు అనాధగా జీవచ్ఛవంగా బ్రతుకీడుస్తున్నాడు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నసామాజిక భద్రతా చట్టాలు, సంక్షేమ పథకాలేవీ ఆ తల్లీ, తనయుల దరిదాపుల్లోకి చేరలేదు. ఆహార భద్రతా చట్టం, అంత్యోదయ అన్న యోజన పథకం, రూపాయికి కేజీ బియ్యం పథకం, జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం, పేదలందరికీ శాశ్వత గృహ నిర్మాణం వగైరా వగైరా ప్రభుత్వ పథకాలేవీ ఆ అభాగ్యుల దరి చేరలేదు. పైపెచ్చు ఆ గ్రామం ఒక రాష్ట్ర మంత్రివర్యుల నియోజకవర్గం పరిథిలో రోడ్డు ప్రక్కనే ఉన్న గ్రామమది.
ఇదే! ఈనాటి హెచ్.యం.టీ.వి. వార్తల విశ్లేషణలో చర్చనీయాంశం. భూతద్దంతో నిశితంగా పరిశీలిస్తే గానీ ఒక దిన పత్రికలో ప్రచురించబడిన ఆ వార్తా కనిపించని ఒక హృదయ విదారకమైన ఘటనపై స్పందించిన హెచ్.యం.టీ.వి. ఛీప్ ఎడిటర్ దాన్నే చర్చనీయాంశం చేశారు. ఒక విలేకరి ఆ మాతృమూర్తి ప్రాణాలను కాపాడడంతో పాటు సభ్యసమాజం దృష్టికి ఆ ఘటనను తెచ్చారు. వారిరువురు అభినందనీయులు. ఈ ఉదంతంపై జరిగిన‌ చర్చలో పాల్గొని నా గుండె చప్పుడును వినిపించాను. ఇతర మిత్రులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

Sunday, July 26, 2015

పుష్కరాలతో తెలుగు నేల పుణ్య భూమిగా మారిపోయిందా!

ప్రజల విశ్వాసాన్ని అరమరికలు లేకుండా నేను గౌరవిస్తాను. మతాన్ని అనుసరించడం, భక్తి ప్రపత్తులతో వ్యక్తిగత జీవితాలను క్రమశిక్షణాయుతంగా మలచుకోవడం, ఆయా సమాజాల్లో ఉన్నతంగా భావించబడే నైతిక విలువల ప్రాతిపథికపై వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని, పది మందికి ఆదర్సప్రాయంగా నిలవాలని పరితపించే మహోన్నత వ్యక్తులపై నాకు అపారమైన గౌరవం ఉన్నది.  కానీ, భారత‌ రాజ్యాంగం ప్రభోదిస్తున్న లౌకిక వ్యవస్థకు, శాస్త్రీయ భావజాలానికి తూట్లు పొడుస్తూ, మూఢత్వాన్ని పెంచి పోషిస్తూ  ప్రభుత్వాలే ఈ తరహా కార్యక్రమాలను బుజానికెత్తుకోవడం చూస్తే జుగుప్స కలుగుతుంది. ఈ పనికి పూనుకోవడంలో పాలకుల‌ తాత్విక ప్రయోజనాలు వారికున్నాయనడంలో నిస్సందేహం.
గొంతు లెండి పోతున్న కరువు సీమల్లో త్రాగు, సాగు నీరు పారించక పోయినా తెలుగు నాట భక్తి రసాన్ని మాత్రం ఏరులై పారించారు. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేవు కానీ, పాలకులు తలచుకొంటే పుష్కరాలకు డబ్బుల కొదవే లేదని రుజువు చేశారు. మానవ సేవే మాధవ సేవన్నారు పెద్దలు. అది మాత్రం గుర్తు లేదన్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు. గోదావరి పుష్కరాలకు విడ్కోలు పలుకుతూ, కృష్ణా పుష్కరాలకు తెరలేపారు. శభాష్! అటుపై పెన్నార్ పుష్కరాలొస్తాయేమో! కాకపోతే ఆ పెన్నార్ నది నీళ్ళులేక ఒట్టిపోయింది.
స్వాతంత్ర్యానంతరం దశాబ్ధాల పాటు సాగిన‌ నీతి మాలిన పాలన, పనులతో తెలుగు గడ్డపై అన్ని సామాజిక రంగాలు విషతుల్యంగా మారి  దుర్గంధం వెదజల్లబడుతున్నది. కులం, మతం, ప్రాంతీయ విద్వేషాలు, అవినీతి, అక్రమాలు, అక్రమార్జన, విచ్చల విడిగా దోపిడీతో పాపాల పుట్టగా తెలుగు నేల‌ కంపుకొడుతున్న నేపథ్యంలో గోదావరి పుష్కరాల సంబరాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. గోదావరిలో మునగండి, పాపాల మురికి వదిలించుకోండి, పుణ్యాన్ని మూట కట్టుకోండి, సుఖమయ జీవితానికి మరియు స్వర్గానికి మార్గాన్ని సుగమం చేసుకోండని ప్రచార హోరు సాగించాయి. పులకించి పోయిన తెలుగు ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆలశించిన‌ ఆశాభంగం అన్నట్లు గోదావరి వైపు పరుగులు తీశారు. తెలంగాణలో 6.4, ఆంధ్రప్రదేశ్ లో 4.89, మొత్తం 11.29 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారని ఘనంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించుకొన్నాయి. అంకెలు ప్రకటించుకోవడంలో కూడా అనారోగ్యకరమైన పోటీనే సుమా! పాపం తృప్తిగా గోదావరి స్నానం చేసి, పాప పరిహారం చేసుకొని వద్దామని వెళ్ళిన భక్తులు కొన్ని ఘాట్ల వద్ద‌ మురికి నీటిలో, బురదలో పొర్లాడి వెనుదిరగాల్సి వచ్చింది. మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆ నీటిలో ఉంటే చర్మ వ్యాధుల భారిన పడతారని అధికారికంగానే హెచ్చరికలు కూడా జారి చేశారు.
ప్రభుత్వాలు ప్రకటించిన‌ గణాంకాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే! రెండు రాష్ట్రాల జనాభా 8.5 కోట్లకు మించి లేదు. పాప భీతిలేని నాలాంటి లక్షలాది మందో! కోట్లాది మందో! గోదావరిలో మునగలేదు. తెలుగు ప్రజలే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల ఉంచి కూడా మునకేసి పోయారని పాలకులు సమర్థించుకొంటున్నారు. పోనీలేండి వారు ప్రకటించుకొన్న సంఖ్య గోల ప్రక్కనబెడదాం! దాని వల్ల వచ్చే నష్టం లేదు.
మన తెలుగు నేల గోదావరి పుష్కరాలతో ఒక్క దెబ్బతో పుణ్య భూమిగా మారిపోయింది. ఈనాటి నుండి దోపిడీలు, దొంగతనాలు, నీతి మాలిన పనుల నుండి తెలుగు జాతికి విముక్తి లభిస్తుందని ఆశిద్దాం! పాత ఖాతాలోని పాపాల మూటను గోదావరిలో ముంచేసి వచ్చాం కదా! ఇహ! స్వేచ్ఛగా మళ్ళీ కొత్త ఖాతా తెరవచ్చులే అని అవినీతిపరులు, ప్రజాకంఠకులు భావిస్తారేమో! తస్మాత్ జాగ్రత్త.

Thursday, June 25, 2015

ఎమర్జన్సీకి నాలుగు పదుల వయసు


బిజెపి అగ్రనేత శ్రీ యల్.కె.అద్వానీ య‌దాలాపంగా వ్యాఖ్యాని‍ంచారో! లేదా హృదయాంతరాళ నుండి ఆ మాటలు బయటికి తన్నుకొచ్చాయో! తెలియదు గానీ దేశ ప్రజలను, ఆ మాటకొస్తే అంతర్జాతీయ సమాజాన్ని మాత్రం ఉలికి పాటుకు గురిచేసి, కాస్త ఆలోచనలో పడేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమర్జన్సీ విధించబడదని చెప్పలేని పరిస్థితులు నేడు దేశంలో నెలకొని ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలను ఆషామాషిగా కొట్టిపారేయలే‍ం. ప్రజాస్వామ్య శక్తులు అత్య‍ంత‌ బలహీనంగా ఉన్నాయని, నియంతృత్వ శక్తులు పై చేయి సాధిస్తున్నాయని ఆద్వానీ గారు నేటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించడమే విశేషం. నలబై ఏళ్ళ నాటి చేదు అనుభవాలను నెమరు వేసుకొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సంఘ్ పరివార్ కూటమి తేలిక భావంతో కొట్టిపారేసింది. కాషాయదళం అధికారంలోకి వచ్చినా పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదన్నఅసంతృప్తితో ఆయన లోలోపల కుమిలిపోతున్నారేమో! అది కొంత వరకు వాస్తవం కావచ్చు. కానీ మరొక కోణంలో నుంచి ఆలోచిస్తే మోడీ ఏడాది పాలనను నిశితంగా గమనిస్తున్న రాజకీయ కురువృద్ధుడుగా మోడీ పరిపాలనా శైలి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, అధికార యంత్రాంగం పట్ల ఆయన ప్రదర్శిస్తున్న వైఖరి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదన్న భావన ఆద్వానీకి కలిగిందేమో! పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతాతానై అధికార కేంద్రీకరణతో పెత్త‍దారీ పోకడలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అందుకే ఒక హెచ్చరికగా ఆద్వానీ ఆ వ్యాఖ్యలు చేశారేమోననిపిస్తోది. ప్రణాళికా సంఘం రద్దు మొదలుకొని న్యాయ వ్యవస్థను తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని వ్యూహాత్మకంగా మోడీ వేస్తున్న అడుగులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కాషాయీకరణ చేసే ప్రక్రియ చాప క్రింద నీరులా జరిగిపోతున్నదన్న‌ ఆరోపణలు గుప్పు మంటున్నాయి.
స్వాతంత్య్రానంతరం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎంచుకొన్న భారత దేశంలో నియంతృత్వం పెచ్చరిల్లి, అత్యవసర పరిస్థితి(ఎమర్జన్సీ) విధించబడి 22 నెలల పాటు చీకటి పాలన సాగింది. 40 సంవ‌త్సరాల క్రితం, 1975 జూన్ 25న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలతో ఎమర్జన్సీని విధించి, ప్రజాస్వామ్య హక్కులు మ‌రియు మానవ హక్కులపై ఉక్కు పాదం మోపారు. స్వేచ్ఛను హరించారు. ప్రజా ఉద్యమాలపై కన్నెర్ర చేశారు. పోలీసు రాజ్యం చేదు అనుభవాలు నాటి తరం ప్రజల స్పృతి పథం నుండి తొలగిపోలేదు. ఆ అనుభవాలు లేని నేటి తరానికి అత్యవసర పరిస్థితి అంటే ఎంతటి దుర్మార్గమైన పాలనో ఊహించుకోవడమే కష్టం.
ఆ నిరంకుశ పాలనలో నాకు ఒక చిన్న‌ చేదు అనుభవం ఉన్నది. డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన ఒక న్యాయబద్ధమైన సమస్యపై కార్యాచరణకు పూనుకొంటే పోలీసులు నిష్కారణంగా అరెస్టు చేశారు. నెనప్పుడు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బి.కాం. ప్రథమ సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. నాడు డిగ్రీ విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలను రోజుకొకటి చొప్పున నిర్వహించేది. పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించాలని కోరుతూ మా యస్.వి.ఆర్ట్స్ కళాశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపై ఒక రోజు అర్థరాత్రి వాలరైటింగ్స్ వ్రాస్తుంటే రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు దళం నాతో పాటు ఉన్న మరో నలుగురిని అరెస్టు చేసింది. మమ్మల్ని ఏ చట్టం క్రింద అరెస్టు చేశారని అడిగిన పాపానికి నా మిత్రులిద్దర్ని పోలీసులు చితకబాదారు. తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, తూర్పు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ఖాళీ లేకపోవడంతో పశ్చిమ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ‌ నిర్భందించి, ఉదయం బేయిల్ పై విడుదల చేశారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో ఒకతను హెడ్ కానిస్టేబులు కుమారుడు కూడా ఉన్నాడు. కారణం చెప్పకుండా అప్రజాస్వామ్యంగా అరెస్టులు చేసి జైళ్ళలో నెలల తరబడి నిర్భందిచే వారు. ఎలాంటి విచారణలు జరిపే వారు కాదు.
సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన ఉద్యమాన్ని మితవాద అభివృద్ధి నిరోధక ఉద్యమంగా, ఫాసిస్టు ఉద్యమంగా అభివర్ణించి, ఆ ప్రతీఘాత ఉద్యమానికి వ్యతిరేకంగా 1975 డిసెంబరు మొదటి వారంలో ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక మహాసభను పాట్నాలో నిర్వహించారు. దానికి 50 దేశాల నుండి సౌహార్థ ప్రతినిథులు కూడా వచ్చి పాల్గొన్నారు. భారత దేశ‍ నలుమూలల నుండి దాదాపు ఆరు వేల మంది ప్రతినిథులు హాజరైనారు. నేను ఎ.ఐ.యస్.ఎఫ్. ప్రతినిథిగా తిరుపతి నుండి వెళ్ళి పాల్గొన్నాను. మహాసభ ముగింపులో జరిగిన బహిరంగ సభకు ఐదు లక్షల మందికిపైగా ప్రజానీకం పాల్గొన్నారని వేదికపై నుంచి నిర్వాహకులు ప్రకటించారు. నా జీవితంలో మొట్టమొదట పాల్గొన్న‌ భారీ బహిరంగ సభ అదే. గడ్డ గట్టే చలిలో తరలివచ్చిన ఆ ప్రజానీకానికి వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిథులు జేజేలు పలికారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా జనభాహుళ్యం కదం తోక్కిందని నా నాంటి వెర్రి వెంగళప్పలు కేరింతలు కొట్టాం. విషాదకరమైన అంశమేమంటే అత్యవసర పరిస్థితిని విధించడాన్ని బలపరచి, అటుపై దుష్టపాలనను కళ్ళారా చూసి నాలుక కరుచుకొని, బహిరంగంగా పక్షాత్తాపం వ్యక్తం చేసింది నా మాతృ సంస్థ. ఆ నియంతృత్వ పాలన చరిత్ర‌ భావితరాలకు తెలియాలి. భారత దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టవంతంగా రూపుదిద్దుకోవాలని బలంగా కోరుకొంటూ! నియంతృత్వ పోకడలు ఏ రూపంలో ఎక్కడ పొడచూపినా మొగ్గలోనే తుంచేసే చైతన్యం భారతీయ సమాజంలో పెంపొందాలని ఆకాంక్షిస్తున్నా!