Tuesday, April 24, 2018
Monday, April 16, 2018
వైద్య విద్యా శాఖ - వింత పోకడలు:
నైర్యాశ్యంలో అధ్యాపకులు - సంక్షోభంలో వైద్య విద్య
నైర్యాశ్యంలో అధ్యాపకులు - సంక్షోభంలో వైద్య విద్య
1. మొదట తాజా సమస్యను ప్రస్తావిస్తా. ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు పదోన్నతులలో 2010 సం. నుండి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతామని ఉత్తర్వులు జారీ చేసి ఆరు మాసాలు గడచి పోతున్నా అమలు చేయకుండా జాప్యమెందుకు చేస్తున్నట్లని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధ్యాపకులు ఆందోళన చేయడం సమర్థనీయం.
2. ప్రభుత్వం వైద్య విద్యను అంగడి సరుకుగా మార్చి, ప్రమాణాలకు పాతరేసింది. దాని దుష్పలితాలను సమాజం అనుభవిస్తున్నది.
3. ప్రభుత్వ వైద్య కళాశాలలు నైపుణ్యం ఉన్న అధ్యాపకుల లేమితో కునారిల్లి పోతున్నాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన, బాధ్యతారహితమైన, అనాలోచిత విధానాలు, అవినీతే ప్రధాన కారణం.
4. గడచిన దశాబ్ధ కాలానికి సంబంధించిన అధ్యాపకుల పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తే వైద్య విద్యా శాఖ డొల్లతనం బోధపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించి, సరిదిద్దడానికి నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "Career Advancement Scheme(Time bound pay scales)" ను అమలు చేస్తామని 2017 అక్టోబర్ 16న జి.ఓ.నెం.163ని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నేటికీ అమలుకు నోచుకోలేదు. పర్యవసానంగా అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు.
5. సమస్య నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల ఆందోళన ఎంతటి న్యాయబద్ధమైనదో బోధపడుతుంది. ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల పదోన్నతుల విధానంపై పిల్లి మొగ్గలు వేయడం చూస్తుంటే ప్రభుత్వానికి ఒక స్థిరమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లోపించినట్లు భావించాల్సి వస్తున్నది.
6. యు.జి.సి. నిబంధనల మేరకు "Career
Advancement Scheme"ను అమలు చేయడానికి ఉద్ధేశించిన జి.ఓ.నెం.32ను 2010 ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇంత కాలం దాన్ని అటకెక్కించి కూర్చున్నారు.
Advancement Scheme"ను అమలు చేయడానికి ఉద్ధేశించిన జి.ఓ.నెం.32ను 2010 ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇంత కాలం దాన్ని అటకెక్కించి కూర్చున్నారు.
7. ఆయా విభాగాల్లో ఖాళీలు ఏర్పడితేనే పదోన్నతి కల్పించే అసంబద్ధమైన పదోన్నతుల విధానాన్నే కొనసాగించారు. పర్యవసానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులైన వారు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారి జాబితా పెద్దది. అలాగే, సర్వీసు మొత్తంలో ఒక్క పదోన్నతి పొంది అసోసియేట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు. పదోన్నతులలో 'రోస్టర్ పాయింట్స్' అమలులో అవకతవకలకు పాల్పడడం, పైరవీకారుల ప్రలోభాలకు లొంగి అవినీతికి పాల్పడి అనర్హులకు పదోన్నతి ఇవ్వడం వంటి అక్రమాల వల్ల అర్హులైన వారికి నష్టం వాటిల్లిన ఉదంతాలూ ఉన్నాయి.
8. పదోన్నతులలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దమని 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32ను అమలు చేయాలని అధ్యాపకులు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 అక్టోబరు 16న జి.ఓ.నెం.163 ను విడుదల చేయడంతో అధ్యాపకులు కాస్తా సంబరపడ్డారు.
9. ఆ జి.ఓ. లో "The Career Advancement Scheme (CAS) shall be implemented with effect from 01.11.2006 and monetary benefit shall be given with effect from the date of issue of these orders" అని పేర్కొన్నారు. 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32 ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పని చేసిన అధ్యాపకుల సర్వీసును లెక్కగట్టి, ఎం.సి.ఐ. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తామని, తదనుగుణంగా 'స్కేల్స్' ను నిర్ధారించి, వేతనాల పెరుగుదలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాన్ని మాత్రం 2017 అక్టోబరు 16 నుండి వర్తింప చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతులు వస్తే చాల్లే అన్న సద్భావనతో అధ్యాపకులు సంతోషపడ్డారు.
10(a). 2017లో ఎం.సి.ఐ. జారీ చేసిన సవరణలతో కూడిన నిబంధనలకు లోబడి ప్రచురించబడిన అధ్యయన పత్రాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పదోన్నతులు కల్పిస్తామని షరతు విధించారు. గతంలో పదోన్నతులు పొందిన వారికి ఈ షరతును సడలింపులతో అమలు చేస్తూ వచ్చారు.
(b) అధ్యయన పత్రాలకు సంబంధించి గతంలో 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్' అనే నిబంధన ఉండేది. ఇప్పుడు, 'పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్' అన్న కొత్త నిబంధన మేరకు ప్రచురించబడిన అధ్యయన పత్రాలనే పరిగణలోకి తీసుకొంటామని పేచీకోరు నిబంధనొకటి ఉత్తర్వుల్లో పొందు పరిచారు.
(c) 'కరస్పాండింగ్ ఆథర్' అన్న 'కాన్సెప్ట్' ను ఎం.సి.ఐ. 2017 నుండి మాత్రమే అమలు చేస్తున్నది. ఆ షరతును ఈ జి.ఓ. అమలుతో ముడిపెట్టడం అర్థరహితం.
(c) 'కరస్పాండింగ్ ఆథర్' అన్న 'కాన్సెప్ట్' ను ఎం.సి.ఐ. 2017 నుండి మాత్రమే అమలు చేస్తున్నది. ఆ షరతును ఈ జి.ఓ. అమలుతో ముడిపెట్టడం అర్థరహితం.
(d) ఎవరైతే ప్రచురించబడిన అధ్యయన పత్రాలను సమర్పిస్తారో వారే పదోన్నతులకు అర్హులు అన్నంత వరకు సబబే. అంతే కానీ, 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్/ కరస్పాండింగ్ ఆథర్' అన్న పేచీ పెట్టి అర్హులైన అధ్యాపకులకు పదోన్నతులు నిరాకరించడమో! లేదా! జి.ఓ. మొత్తం అమలుకే ఎసరు పెట్టడం గర్హనీయం.
(e) ఈ వివాదానికి తెరదించుతూ ఎం.సి.ఐ. విస్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎం.సి.ఐ. నోటిఫికేషన్ జారీ చేసిన 2017 జూన్ 5కు ముందు "పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్" నిబంధన వర్తిస్తుందని, తరువాత మాత్రమే "పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్" అన్న నిబంధన వర్తిస్తుందని అందులో పేర్కొన్నది. అయినా "Career Advancement Scheme Scales and grade pay" అమలుకు త్వరితగతిన చర్యలు చేపట్టక పోవడాన్ని ఏమనాలి?
11. అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా కొనసాగేలా ప్రోత్సహించడానికి దోహదపడే నిబంధన "పదోన్నతులు పొందడానికి పరిశోధనా పత్రాల ప్రచురణ నకళ్ళను సమర్పించాలి" అన్న నిబంధనను అమలు చేయడం సమంజసం, సమర్థనీయం, విధిగా అమలు చేయాల్సిన నిబంధన.
కానీ, ఈ నిబంధన అమలులో వైద్య విద్యా శాఖ పిల్లిమొగ్గలు వేయడం అత్యంత గర్హనీయం. ఒక్కొక్కసారి ఈ నిబంధనొకటి ఉన్నదనే అంశాన్ని విస్మరించి పదోన్నతులు కల్పించిన ఉదంతాలు కోకొల్లలు. సర్వీసుంటే చాలని పరిశోధనా పత్రాల నిబంధనను ప్రక్కన పెట్టి గతంలో పదోన్నతులు ఇచ్చారు. దాంతో అధ్యాపకుల్లో పరిశోధనల పట్ల అనాసక్తత నెలకొన్నది. అడపాదడపా వైద్య శాఖాధికారులు ఈ నిబంధనను అమలు చేయడానికి పూనుకొంటున్నారు కాబట్టి 'కట్ & పేస్ట్' తరహాలో పత్రాలను తయారు చేసి, ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అంతర్జాల పత్రికలలో ప్రచురింప చేయించుకొని, నకళ్ళు సమర్పించి, అడ్డదారులు తొక్కిన అధ్యాపకులు లేరని చెప్పలేం!
మొత్తం సర్వీసులో ఒక్క అధ్యయన/పరిశోధన పత్రాన్ని ప్రమాణాలున్న పత్రికలో ప్రచురించురింప చేసుకోని వారిలో పదోన్నతులు పొంది అధికారులుగా, అధ్యాపకులుగా ప్రస్తుతం ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య విద్యా శాఖ అనుసరించిన, అమలు చేసిన అసంబద్ధ, అలసత్వంతో కూడిన విధానాలే కారణమని చెప్పక తప్పదు. నిబంధనలను నిస్పాక్షికంగా, విధిగా అమలు చేసి ఉంటే నేడు ఈ దుస్థితి దాపురించేది కాదు.
12. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు వెళ్ళి, డబ్బు సంపాదించుకొని కొన్ని సంవత్సరాల తరువాత తిరిగొచ్చి ఉద్యోగంలో చేరినా వారికి క్రమశిక్షణారాహిత్యం క్రింద చర్యలు తీసుకోక పోగా పదోన్నతులు కల్పించడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయో ఊహించవచ్చు.
13. వృత్తి ధర్మానికి అంకిత భావంతో కట్టుబడి, నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, నాణ్యతా ప్రమాణాలతో వైద్య విద్యను బోధించాలన్న తృష్ణ, తపన పడుతున్న అధ్యాపకులు లేక పోలేదు.
14. ఒకేసారి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా సర్వీసులో చేరిన వారిలో కొందరు పదోన్నతికి నోచుకోక అదే స్థాయిలో పని చేస్తుంటే కొందరేమో అసోషియేట్ ప్రొఫెసర్లుగా, మరికొందరు ప్రొఫెసర్లుగా, శాఖాధిపతులుగా పదోన్నతి పొందారు. అలాగే తమ దగ్గర విద్యనార్జించి పట్టభద్రులైన విద్యార్థులు ప్రయివేటు వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రవేశించి, త్వరితగతిన పదోన్నతులు పొంది ప్రొఫెసర్లు అయ్యి 'ఎగ్జామినర్స్' గా, ఎం.సి.ఐ. పర్యవేక్షక అధికారులుగా వస్తున్నారనే న్యాయమైన మనోవేదన కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు ఉన్నది.
15. వైద్య విద్యా రంగంలో అధ్యయనాలను, పరిశోధనలను ప్రోత్సహించే వాతావరణం యన్.టి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయంలో పూర్తిగా కొరవడింది. వైద్య విద్యా రంగంలోని వివిధ విభాగాలలో పరిశోధనలపై ఆసక్తి కనబరిచే విద్యార్థులకు ప్రవేశం కల్పించే విధానం లోపభూయిష్టంగా ఉన్నది, కళాశాలల్లో 'గైడ్స్' కొరత తీవ్రసమస్యగా ఉన్నది. ఈ సమస్యను అదిగమించాలన్న ద్యాసే విశ్వవిద్యాలయానికి లేదు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఈ దృక్పథమే లోపించింది.
16. ఎం.సి.ఐ. బృందాలు ప్రతి ఏడాది వైద్య కళాశాలలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోషియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ అన్ని విభాగాల్లో ఉన్నారా! లేదా! అన్న వాస్తవాలను నిర్ధారించుకొన్న మీదటే 'గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్' ఉన్న సీట్ల సంఖ్యను కొనసాగించడం కానీ, పెంపుదలకు అనుమతించడం కానీ చేస్తుంటుంది. ఈ నిబంధనను అక్రమ మార్గాలలో అధిగమించడంలో ప్రయివేటు వైద్య కళాశాలల యాజమన్యాలది అందె వేసిన చేయి.
ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో అన్ని స్థాయిల్లో అధ్యాపకుల కొరత లేకుండా నియమించి లేదా పదోన్నతులు కల్పించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా ఎం.సి.ఐ. బృందాలు పర్యవేక్షణకు వచ్చినప్పుడు 'డెప్యూటేషన్స్' లేదా తప్పుడు రికార్డులను సృష్టించి చూపెట్టడం లాంటి తప్పుడు పద్ధతులను కూడా అనుసరిస్తున్నారనడంలో సందేహం లేదు.
17(a). ఏడవ వేతన సంఘం సిఫార్సులకు (యు.జి.సి. కమీషన్) అనుగుణంగా "Career Advancement Scheme Scales and grade pay" సవరించి అమలు చేయాలని కూడా జి.ఓ.లో పేర్కొన్నారు.
(b).7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా సవరించిన యు.జి.సి. వేతనాల చెల్లింపుకు సంబంధించిన జి.ఓ.ను కూడా విడుదల చేశారు. కానీ, దాన్ని అమలు చేయలేదు.
18. ఇలాంటి అసంబద్ధ విధానాలతో నైపుణ్యం ఉన్న నిపుణులైన అధ్యాపకులను ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలు కోల్పోతున్నాయి. పని చేస్తున్న అధ్యాపకులను నిరుత్సాహానికి గురిచేసి వారిలో అలసత్వం పెరిగేలా ప్రభుత్వ చర్యలు దోహదపడుతున్నాయి.
19. జాప్యం చేయడం కానీ, జి.ఓ.నెం.163 ను అటకెక్కించాలని భావించినా వైద్య విద్యా రంగానికి తీవ్రహాని తలపెట్టిన వారౌతారు.
20. చివరలో ఒక్క మాట. ఎం.సి.ఐ. సంస్థే అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కుంభకోణాలు వేలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై వైద్య విద్యా రంగ ప్రక్షాళనకు పూనుకోవాలి.
"వైద్య విద్యా ప్రమాణాలను పరిరక్షించాలి! సమాజానికి నైపుణ్యం గల వైద్యులను అందించాలి".
టి.లక్ష్మీనారాయణ
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు
Saturday, February 10, 2018
కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి పట్టదా!
1. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి నిథులిచ్చామని దగాకోరు ప్రకటన చేశారు.
2. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హరిబాబు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి శ్రీ నరసింహరావు మూడేళ్ళలో ఇచ్చిన నిథుల మొత్తం చాలా పెద్ద మొత్తమన్నట్లు ప్రకటించుకొన్నారు.
3. రాష్ట్ర ప్రభుత్వం రు.24,350 కోట్ల వ్యయం అంచనాతో రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు శాసనసభలో ప్రకటించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం తృణీకార భావంతో చెత్తబుట్టలో వేసినట్లున్నది.
4. జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు ఏడాదికి రు.350 కోట్ల చొప్పున మూడేళ్ళలో రు.1,050 కోట్లు ఇచ్చారట. ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా ఈ నిథుల కేటాయింపును గొప్పగా చెప్పుకొంటున్నారంటే వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి కి ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదో తేటతెల్లమౌతున్నది.
5. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశాభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని ఉపన్యాసాన్ని మొదలెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీకి ఆ అభివృద్ధిలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను భాగస్వాములను చేయాలన్న స్పృహ ఎందుకు లేక పోయింది? ఈ ఏడాది బడ్జేట్లో నిథుల కేటాయింపు ఊసే లేదే?
6. దేశ వ్యాపితంగా 117 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించారట, వాటి అభివృద్ధికి పాటు పడతామని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆ జాబితాలో కలిపేశారా? విభజన చట్టంలో పొందు పరచిన అభివృద్ధి పథకానికి స్వస్తి పలికారా?
7. విభజన చట్టం మేరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాన్ని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు కనపడడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యుల్లోనూ ఆ స్పృహ కొరవడింది.
8. కేంద్ర ప్రభుత్వం దగాకోరు విధానాలతో వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాలను వివక్షతకు గురి చేస్తున్నది. రాయలసీమ ప్రాంతంలో ఒక్క భారీ పరిశ్రమ లేదు. విభజన చట్టంలో పొందు పరచిన మేరకు కడప ఉక్కు పరిశ్రమనైనా నెలకొల్పితే, పారిశ్రామికాభివృద్ధి వైపు అడుగులు పడతాయన్న ఆ ప్రాంత ప్రజల ఆశలను అడియాశలను చేసే దోరణిలో కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది.
9. రాయలసీమ ప్రాంతం నుండి పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నా వారికి ఈ సమస్యలపై గట్టిగా పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేద్ధామన్న స్పృహ లేక పోవడం గర్హనీయం.
10. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి గడచిన పది రోజుల్లో ఎనిమిది టీవిల్లో పదమూడు, పద్నాలుగు 'డిబేట్స్'లో విభజన చట్టంలో పొందు పరచిన అంశాలను త్వరితగతిన అమలు చేయడానికి వీలుగా నిథులను కేటాయించక పోగా వివక్షతకు గురి చేయడంపైన ప్రజల పక్షాన గొంతెత్తడంతో పాటు వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల ప్రజల వాణిని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశాను. ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిథులు అనుసరిస్తున్న విధానాలు, వైఖరులపై ప్రజలే ఆలోచించుకోవాలి.
టి.లక్ష్మీనారాయణ
Wednesday, January 24, 2018
ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం పని విధానం ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలియజేస్తున్న ఒక స్వానుభవాన్ని మిత్రులతో పంచుకొంటున్నాను.
1. ఇరవై ఐదు రోజుల అనుభవంతో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. పౌరులు హక్కుగా అధికార యంత్రాంగం నుంచి పొంద వలసిన సేవలకు కూడా లంచం ఇచ్చుకొని అవినీతికి పాల్పడక పోతే, లేదా, దళారుల ద్వారా పైరవీలతో పనులు చక్క బెట్టుకొనే కళ లేక పోతే, లేదా, ధౌర్జన్యంతో అధికారులను లొంగగొట్టుకొనే కండ బలం లేక పోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టమన్న భావన సామాన్యుల్లో రోజు రోజుకూ బలపడుతున్నది.
2. ప్రభుత్వాలు, వాటి అధినేతలు జవాబుదారీతనంతో, సుపరిపాలన అందిస్తామని వల్లించే మాటలు దగాకోరు మాటలుగా ఆచరణలో మిగిలి పోతున్నాయి.
3. జరిగిన ఉదంతం: అత్యున్నత వృత్తి విద్యా సంస్థ(వైద్య కళాశాల), వైద్య విద్యా డైరెక్టర్ కార్యాలయం, వైద్య ఆరోగ్య- వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రిన్సిపుల్ సెక్రటరీ కార్యాలయం, ఇవన్నీ ఎంత గొప్పగా పని చేస్తున్నాయనడానికి ఈ ఘటన ప్రబల నిదర్శనం!
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒక డాక్టర్ ఇంగ్లండ్ కు వెళ్ళి తన అక్క కుమార్తె "డిగ్రీ కాన్వకేషన్" కు హాజరు కావడం కోసం " నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్.ఒ.సి.) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంటే 25 రోజులు గడచి పోయినా అనుమతి మంజూరు చేయడమో, తిరస్కరించడమో చేయక పోతే, ఈ ప్రభుత్వం పని చేస్తున్నట్టా, నిద్ర పోతున్నట్టా!
4. ఫైల్ క్లియర్ చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి బృందంలో దావోస్ పర్యటనకు వెళ్ళి, ఫైల్ ను పెండింగ్ లో పెట్టి కూర్చొన్నారు. ' ఇన్ ఛార్జ్' గా మరొక ఐ.ఎ.ఎస్. అధికారికి ' బాధ్యత బదలాయించి, వెళ్ళారు. కానీ, సాదాసీదా ' పైల్స్ ను క్లియర్' చేసే అధికారాన్ని కూడా ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వలేదు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. బాధ్యతారహిత్యం కాదా! దీన్ని జవాబుదారీతనంతో కూడిన పాలనంటారా!
5. ఆ దరఖాస్తు ప్రిన్సిపల్ ఆఫీసు నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసు చేరడానికి వారం రోజులు పడితే, డి.యం.ఇ. ఆఫీసులోని 'ఇన్ వర్డ్ సెక్షన్' నుండి దరఖాస్తును పరిశీలించే సెక్షన్ కు చేరడానికి నాలుగు రోజులు, ఆ కార్యాలయం నుండి విముక్తి పొంది సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు చేరిన ఫైల్ రోజులు గడచి పోతున్నా, ఆ ఫైల్ కు మోక్షం లభించ లేదు. వీసాకు దరఖాస్తు చేసుకొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్యుమెంట్స్ సమర్పించు కోవలసిన గడువు ముగిసి పోతున్నా, ఉన్నతాధికారి అలసత్వం పర్యవసానంగా "యన్.ఒ.సి." సమర్పించుకోలేని దుస్థితి నెలకొన్నది.
6. ఉన్నత విద్యా సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికే ఈ చేదు అనుభవం ఎదురైతే పేద, సామాన్య ప్రజలకు పౌర సేవలు ఏ విధంగా అందని ద్రాక్ష పండ్లులా తయారైనాయో ఊహించవచ్చు.
7. నిజాయితీగా, బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవమే ఈ ఘటన. తన శ్రమతో ఆర్జించుకొన్న సొమ్ములతో, తనకు హక్కుగా లభిస్తున్న సెలవు దినాలను వినియోగించుకొని, పక్షం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఈ అధికార యంత్రాంగం సృష్టిస్తున్న అవరోధాలు వర్ణనాతీతం. వారు మాత్రం ప్రజాధనంతో నిత్యం విదేశీ పర్యటనల్లో కాలం గడిపేస్తూనే ఉంటారు.
8. పౌరులకు హక్కుగా అందించ వలసిన సేవల పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టి, పని సంస్కృతి పెంపొందించి, ప్రక్షాళన చేయక పోతే ప్రజాస్వామ్యం మరింత దిగదుడుపుగా తయారౌతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించండి.
9. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలనే సదుద్ధేశంతో రెండు లేఖలు వ్రాసి "ఎపి సియం కాన్టాక్ట్" అన్న కైజాలా ఆప్ ద్వారా పంపాను. కానీ, స్పందన లేదు.
టి.లక్ష్మీనారాయణ
కమ్యూనిస్టు, రాజకీయ విశ్లేషకులు
1. ఇరవై ఐదు రోజుల అనుభవంతో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. పౌరులు హక్కుగా అధికార యంత్రాంగం నుంచి పొంద వలసిన సేవలకు కూడా లంచం ఇచ్చుకొని అవినీతికి పాల్పడక పోతే, లేదా, దళారుల ద్వారా పైరవీలతో పనులు చక్క బెట్టుకొనే కళ లేక పోతే, లేదా, ధౌర్జన్యంతో అధికారులను లొంగగొట్టుకొనే కండ బలం లేక పోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టమన్న భావన సామాన్యుల్లో రోజు రోజుకూ బలపడుతున్నది.
2. ప్రభుత్వాలు, వాటి అధినేతలు జవాబుదారీతనంతో, సుపరిపాలన అందిస్తామని వల్లించే మాటలు దగాకోరు మాటలుగా ఆచరణలో మిగిలి పోతున్నాయి.
3. జరిగిన ఉదంతం: అత్యున్నత వృత్తి విద్యా సంస్థ(వైద్య కళాశాల), వైద్య విద్యా డైరెక్టర్ కార్యాలయం, వైద్య ఆరోగ్య- వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రిన్సిపుల్ సెక్రటరీ కార్యాలయం, ఇవన్నీ ఎంత గొప్పగా పని చేస్తున్నాయనడానికి ఈ ఘటన ప్రబల నిదర్శనం!
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒక డాక్టర్ ఇంగ్లండ్ కు వెళ్ళి తన అక్క కుమార్తె "డిగ్రీ కాన్వకేషన్" కు హాజరు కావడం కోసం " నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్.ఒ.సి.) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంటే 25 రోజులు గడచి పోయినా అనుమతి మంజూరు చేయడమో, తిరస్కరించడమో చేయక పోతే, ఈ ప్రభుత్వం పని చేస్తున్నట్టా, నిద్ర పోతున్నట్టా!
4. ఫైల్ క్లియర్ చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి బృందంలో దావోస్ పర్యటనకు వెళ్ళి, ఫైల్ ను పెండింగ్ లో పెట్టి కూర్చొన్నారు. ' ఇన్ ఛార్జ్' గా మరొక ఐ.ఎ.ఎస్. అధికారికి ' బాధ్యత బదలాయించి, వెళ్ళారు. కానీ, సాదాసీదా ' పైల్స్ ను క్లియర్' చేసే అధికారాన్ని కూడా ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వలేదు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. బాధ్యతారహిత్యం కాదా! దీన్ని జవాబుదారీతనంతో కూడిన పాలనంటారా!
5. ఆ దరఖాస్తు ప్రిన్సిపల్ ఆఫీసు నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసు చేరడానికి వారం రోజులు పడితే, డి.యం.ఇ. ఆఫీసులోని 'ఇన్ వర్డ్ సెక్షన్' నుండి దరఖాస్తును పరిశీలించే సెక్షన్ కు చేరడానికి నాలుగు రోజులు, ఆ కార్యాలయం నుండి విముక్తి పొంది సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు చేరిన ఫైల్ రోజులు గడచి పోతున్నా, ఆ ఫైల్ కు మోక్షం లభించ లేదు. వీసాకు దరఖాస్తు చేసుకొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్యుమెంట్స్ సమర్పించు కోవలసిన గడువు ముగిసి పోతున్నా, ఉన్నతాధికారి అలసత్వం పర్యవసానంగా "యన్.ఒ.సి." సమర్పించుకోలేని దుస్థితి నెలకొన్నది.
6. ఉన్నత విద్యా సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికే ఈ చేదు అనుభవం ఎదురైతే పేద, సామాన్య ప్రజలకు పౌర సేవలు ఏ విధంగా అందని ద్రాక్ష పండ్లులా తయారైనాయో ఊహించవచ్చు.
7. నిజాయితీగా, బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవమే ఈ ఘటన. తన శ్రమతో ఆర్జించుకొన్న సొమ్ములతో, తనకు హక్కుగా లభిస్తున్న సెలవు దినాలను వినియోగించుకొని, పక్షం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఈ అధికార యంత్రాంగం సృష్టిస్తున్న అవరోధాలు వర్ణనాతీతం. వారు మాత్రం ప్రజాధనంతో నిత్యం విదేశీ పర్యటనల్లో కాలం గడిపేస్తూనే ఉంటారు.
8. పౌరులకు హక్కుగా అందించ వలసిన సేవల పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టి, పని సంస్కృతి పెంపొందించి, ప్రక్షాళన చేయక పోతే ప్రజాస్వామ్యం మరింత దిగదుడుపుగా తయారౌతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించండి.
9. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలనే సదుద్ధేశంతో రెండు లేఖలు వ్రాసి "ఎపి సియం కాన్టాక్ట్" అన్న కైజాలా ఆప్ ద్వారా పంపాను. కానీ, స్పందన లేదు.
టి.లక్ష్మీనారాయణ
కమ్యూనిస్టు, రాజకీయ విశ్లేషకులు
Thursday, November 9, 2017
ఈ ఏడాదికి నీటి అవసరాలు తీరినట్లేనా!
- శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, జూరాల, పులిచింతల జలాశయాల్లో 330 టియంసిల నీరు వినియోగానికి అందుబాటులో ఉన్నదని, 2017 నవంబరు 4న హైదరాబాదులో సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ధారించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో 217.8, 112.2 టియంసిల చొప్పున వినియోగించు కోవాలని నిర్ధేశించింది. ఆ నిర్ణయానికి లోబడి వివాదరహితంగా 2018 జూన్ వరకు త్రాగు నీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ నీటిని వినియోగించు కోవాలని ఆదేశించింది.
- నైరుతీ రుతుపవనాలు ప్రారంభంలో నిరాశ పరిచినా, ముగింపులో కాస్తా ఆనందాన్నినింపి నిష్క్రమించాయి. మంచి వర్షాలు పడ్డాయన్న భావన కలిగించి వీడ్కోలు తీసుకొన్నాయి. కొన్ని మినహాయింపులతో మొత్తం మీద వాగులు, వంకలు, చిన్న పెద్ద నదులు ప్రవహించాయి. అత్యధిక భాగం కుంటలు, చెరువులు నిండాయి. భూగర్భజలాలు కాస్తా పెరిగాయి. ఖరీప్ సాగుకు నీరు లభించక పోయినా ఏడాది పాటు నీటి కష్టలుండవన్న భావన నెలకొన్నది. నిత్య కరవులతో బాధపడుతున్న రాయలసీమ ప్రాంతంలో కూడా కురిసిన వర్షాల పట్ల ప్రజలు స్థూలంగా సంతృప్తితో ఉన్నారు. ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా ప్రయోజనం వనకూడుతుందని ఆశిద్దాం.
- ఈ ఏడాది జూన్ 1 నుండి నవంబరు 9 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ వర్ష పాతం 775 మి.మీ. గాను 729 మి.మీ. నమోదయ్యింది. సాధారణ వర్షపాతం కంటే 6% తక్కువ. శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు సాధారణ వర్ష పాతం కంటే తక్కువ నమోదైతే, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాలలో సాధారణ వర్షపాతం, అనంతపురం, కడప మరియు చిత్తూరు జిల్లాలలో 21% నుంచి 25% వరకు అధిక వర్షపాతం నమోదయ్యిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర సగటు వర్షపాతం కంటే రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల సగటు వర్షపాతం తక్కువ. ఉదా: తూర్పు గోదావరి జిల్లాలో 1003 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 814 మి.మీ. నమోదయ్యింది. అనంతపురం జిల్లాలో 462 మి.మీ. సాధారణ వర్షపాతంకు గాను 559 మి.మీ. నమోదు కావడంతో 21% అధికంగా వర్షం పడ్డట్లు పేర్కొనబడింది. కడప జిల్లాలో 565% మి.మీ. సాధారాణ వర్షపాతానికి గాను 690 మి.మీ. నమోదైనా కోడూరు శాసనసభా నియోజకవర్గంలోని చెరువుల్లోకి పెద్దగా నీరు చేరలేదు. పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు ప్రవహించినా, చెయ్యేరుకు ఉపనదిగా ఉన్న గుంజన ప్రవహించ లేదు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక సగటు వర్ష పాతం 852 మి.మీ. తూర్పు గోదావరి జిల్లా సగటు వర్షపాతం దాదాపు 1100 మి.మీ.గా ఉంటే అనంతపురం జిల్లా 550 మి.మీ. మాత్రమే. రాయలసీమ ప్రాంత సగటు వర్ష పాతం 645 మి.మీ. నైరుతీ రుతు పవనాల వల్ల లభించాల్సిన సగటు వర్షపాతం కంటే కాస్తా అధికంగా వర్షపాతం నమోదైనా రాయలసీమ ప్రాంతం సగటు వర్షపాతం తక్కువన్న వాస్తవాన్నిపరిగణలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నీటి వాడకంలో ఆ ప్రాంత నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- నైరుతి రుతు పవనాల వల్ల జూన్ నుండి సెప్టంబరు వరకు కురిసే వర్షాల ద్వారానే 65% నీటి లభ్యత ఉంటుంది. గోదావరి నదీ జలాలు పుష్కలంగా లభించడంతో గోదావరి డెల్టా ఆయకట్టులోను, కృష్ణా జలాలపై ఆధారపడిన క్రిష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేయడం, వాటికి తోడు నాగార్జునసాగర్ క్రింది భాగంలో లభించిన వర్షపు నీటితో ఖరీప్ పంటను సాగు చేసుకొన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లోను, అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల క్రింది ఆయకట్టుకు ఖరీప్ పంట సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేదు. రబీలో ఆరుతడి పంటలు పండించు కోకపోతే రైతాంగం నిలదొక్కుకోలేదు.
- కృష్ణా, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లోని తాజా నీటి నిల్వలను పరిశీలిద్దాం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాలు నిండి పొంగి పొర్లిన తరువాతనే క్రిందికి నీరు వదిలి పెట్టబడింది. ఆల్మట్టి, నారాయణపూర్ దాటుకొని జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపించేలా నీరు చేరింది. శ్రీశైలంలోకి ఆశాజనకంగా నీరు చేరిన మీదట నాగార్జునసాగర్ జలాశయానికి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి.కి మరియు తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు రిజర్వాయరుకు, హంద్రీ - నీవాకు, తెలంగాణలోని కల్వకుర్తికి నీటిని తరలించడం ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. నవంబరు 9వ తేదీ నాటి గణాంకాలను బట్టి శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం ఆగి పోయింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216 లకు గాను 185 టియంసిలు ఉన్నాయి. నాగార్జునసాగర్ లో 312కు గాను 270 టియంసిలకు నిల్వ చేరింది. పులిచింతలలో 46కు గాను 9 టియంసిలే ఉన్నాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 17కు గాను 16 టియంసిల నిల్వ చేయబడింది. కానీ 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం జలాశయంలో రెండు, మూడు టియంసిల నీరు కూడా చేరలేదు. శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడ్డ ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగమైన గోరకల్లులో 12.5కు గాను 7, ఔక్ లో 4కు గాను 2 టియంసిలు ఉన్నాయి. గండికోటలో 28కి గాను 4, మైలవరం 10కి 2, అలగనూరులో 2.6 టియంసిల నీటి నిల్వలు ఉన్నాయి. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టియంసిలకు గాను ప్రస్తుతం 75 టియంసి లున్నాయి. పిఎబిఆర్ లో 11కు గాను తుంగభద్ర జలాశయం మరియు హంద్రీ – నీవా ద్వారా వచ్చిన నీరు 3 టియంసిలు మాత్రమే చేరాయి. పెన్నా నదికి ఉపనదులైన కుందు, చెయ్యేరు, పాపాఘ్ని ప్రవాహంతో నెల్లూరు జిల్లాలోని సోమశిలలో 78కి గాను 50 టియంసిలు, కండలేరులో 68కు గాను 18 టియంసిలకు మాత్రమే నిల్వలు చేరాయి.
- మహారాష్ట్ర, కర్నాటక మరియు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతగా చెన్నయ్ నగరానికి 15 టియంసిల త్రాగు నీటిని కండలేరు నుంచే సరఫరా చేయాల్సి ఉన్నది.
- రాయలసీమ ప్రాంతంలోని వెలుగోడు మినహాయిస్తే మిగిలిన జలాశయాలలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టానికిపైన నీటి నిల్వ ఉన్న కాలంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నయ్ నగరానికి 15 టియంసిలను త్రాగు నీటి కోసం సరఫరా చేయడానికి కండలేరులో నిల్వ చేయాలి, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.)కి 19 మరియు కె.సి.కెనాల్ కు 10, మొత్తం 44 టియంసిల నికరజలాలతో పాటు తెలుగు గంగకు 29, గాలేరు – నగరి సుజల స్రవంతి పథకానికి 38 కలిపి 67 టియంసిల వరద నీటితో కలిపి స్థూలంగా 112 టియంసిల నీటిని తరలించాల్సి ఉన్నది.
- కృష్ణా నదీ ప్రవాహ కాలం 30 రోజులకు మించి ఉండడం లేదన్న ఉద్ధేశ్యంతోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుండి 44,000 క్యూసెక్కుల తరలింపుకు వీలుగా విస్తరించడానికి 2005 డిసెంబరు 21న జరిగిన అఖిల పక్ష సమావేశం ఆమోదం తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్నెండేళ్ళు గడచి పోతున్నా హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మధ్య 16 కి.మీ. పొడవున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులను పూర్తి చేస్తే తప్ప 44,000 క్యూసెక్కుల నీటిని తరలించడం సాధ్యం కాదు. ఈ ఏడాది 14,000 క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్ళ లేక పోయారంటే నిర్మాణ పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. పర్యవసానంగా బి.మఠానికి నీరు పెద్దగా చేరలేదు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జారీ చేసిన జి.ఓ.నెం.69 మేరకు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులుగా నిర్ధారించినా, గత ఏడాది 785 అడుగుల వరకు నీటిని తోడేశారు. పర్యవసానంగా ఈ ఏడాది 854 అడుగులకు నీరు చేరడానికే చాలా రోజులు పట్టాయి. ఇప్పుడు నదీ ప్రవాహం ఆగిపోయింది. నాగార్జునసాగర్ ఇంకా నిండలేదు. దాన్ని నింపడానికి శ్రీశైలం నుండి జలవిద్యుదుత్పాదన చేసుకొంటూ నీటిని క్రిందికి వదులుతున్నారు. పర్యవసానంగా శ్రీశైలంలో ఇప్పటికే 191 టియంసిలకు నిల్వ పడిపోయింది.
- ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగంగా నిర్మించబడిన గోరకల్లు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 12.5 టియంసిలైతే నేడు 7 టియంసిలకు మించి నిల్వ చేయలేని దుస్థితి. నాసిరకం నిర్మాణం పర్యవసానంగా లీకేజీల సమస్య వెంటాడుతున్నది. 4 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన ఔక్ రిజర్వాయరులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు అటవీ భూముల ముంపు సమస్య అపరిష్కృతంగా కొనసాగుతున్నది. ఫలితంగా 2 టియంసిలకు మించి నిల్వ చేసుకోలేని దుస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 1,95,000 ఎకరాల నిర్ధేశిత ఆయకట్టుకు నీరెలా అందిస్తారు?
- గండికోట జలాశయం నిల్వ సామర్థ్యం 27 టియంసిలు. పెన్నా నది వరద నీరు, ఔక్ నుండి విడుదల చేసిన కొద్దిపాటి కృష్ణా నదీ జలాలు కలిపి దాదాపు ఐదు టియంసిలు మాత్రమే చేరాయి. అందులో 10 టియంసిల సామర్థ్యమున్న మైలవరానికి 2 టియంసిలను, మరికొంత నీటిని పైడిపాళెంకు ఎత్తిపోతల ద్వారా తరలించారు. గండికోట జలాశయంలో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేయాలంటే ముద్దనూరు, కొండాపురం మండలాల్లో ముంపుకు గురయ్యే 22 గ్రామాల ప్రజలకు నష్ట పరిహారాన్ని పూర్తిగా చెల్లించి, పునరావాసం కల్పించాలి. ముంపుకు గురౌతున్న రహదారి, రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉన్నది. జలాశయంలో నీరు చేరినా నిర్ధేశిత ఆయకట్టుకు నీరందించడానికి అవకాశమే లేదు. మొదటి దశలో 30,000 ఎకరాలకు సాగు నీరివ్వాలన్నా నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. కాకపోతే వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తే కనీసం ఆ చుట్టు ప్రక్కల భూగర్భ జలాలన్నా పెరుగుతాయన్న ఆశ ప్రజల్లో ఉన్నది. రెండవ దశ నిర్మాణ పనులను ప్రభుత్వం అటకెక్కించి కూర్చొన్నది. చిత్రావతి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులు ‘ట్రయిల్ రన్’ కంటే ముందే పగిలి పోయాయన్న వార్తలొచ్చాయి.
- తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించబడిన వెలుగోడుకు కృష్ణా నీటిని సామర్థ్యానికి అనుగుణంగా తరలించారు. అంత వరకు అభినందనీయం. కానీ, 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం రిజర్వాయరుకు ఇప్పటికీ రెండు, మూడు టియంసిల నీటిని కూడా చేర్చలేదు. ఆ రిజర్వాయరు క్రింద పంట కాల్వల వ్యవస్థ నిర్మాణం కూడా నత్తలతో పోటీ పడుతున్నది. గతంలో రిజర్వాయరులోకి నీరు చేరిన సందర్భాలలో పోరుమామిళ్ళ, బద్వేల్, తదితర చెరువుల ద్వారా సాగుకు నీరిచ్చారు. ఇప్పుడూ అలా చేయవచ్చు. అయితే, రిజర్వాయరులో నీళ్ళే లేని పరిస్థితి.
- కె.సి. కెనాల్ క్రింద సాగవుతున్న 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర నదీ ప్రవాహం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది. కేవలం 1.2 టియంసిల నిల్వ సామర్థ్యమున్న సుంకేసుల ఆనకట్ట, 3 టియంసిల సామర్థ్యమున్న అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మాత్రమే ఉన్నాయి. తుంగభద్ర నుంచి కె.సి.కాలువకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టియంసిలను పిఎబిఆర్ కు కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కె.సి.కాలువకు శ్రీశైలం నుండి సర్దుబాటు చేస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు కృష్ణా జలాలను సరఫరా చేయాలి.
- ఈ పూర్వరంగంలో శ్రీశైలం జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతించిన నీటి వినియోగంలో రాయలసీమ నీటి అవసరాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి. తుంగభద్ర జలాశయం నీటి వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా న్యాయమైన వాటా సాధనకు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి.
టి.లక్ష్మీనారాయణ
Saturday, October 7, 2017
కమ్యూనిస్టు నీతే వి.కె. వ్యక్తిత్వానికి మణిహారం
వి.కె. అన్న రెండక్షరాలు
చెవుల్లో ధ్వనించగానే అనిర్వచనీయమైన గాఢానుబంధంతో కూడిన అనుభూతులు మెదడులో కదలాడుతాయి.
వాటన్నింటినీ క్రోడీకరించి, అక్షర బద్దం చేయడం సాధ్యం కాని పని. నా స్మృతి పథంలోని
కొన్నింటిని ప్రస్తావించే ప్రయత్నమే ఇది. కమ్యూనిస్టు నైతికత, నిబద్ధత, నమ్రత, నడతకు
నిలువుటద్దం మా వి.కె. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాయకుడన్న దర్పాన్ని ప్రదర్శించడం,
కార్యకర్తలు మరియు క్రింది స్థాయి నాయకత్వంపై పెత్తనం చేసే మనస్తత్వం, పార్టీని స్వప్రయోజనాలకు
వినియోగించుకోవాలన్న ఆలోచన ఆయన దరికి చేరలేదు. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచాలనే ఆసక్తి
కనబరచలేదు. తన ప్రసంగాల ద్వారా శ్రోతలను విసిగించనూ లేదు. కమ్యూనిస్టు శ్రేణులే ఆయన
కుటుంబం. అత్యంత వెనుకబడ్డ, నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంత ప్రజల గొంతు. శ్రామిక
ప్రజల నికార్సైన నేత. రాయలసీమ నాలుగు జిల్లాల కమ్యూనిస్టు శ్రేణుల అప్యాయతానురాగాలతో
పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కమ్యూనిస్టులు, మరీ ప్రత్యేకించి ఎ.ఐ.ఎస్.ఎఫ్. శ్రేణుల అభిమానాన్ని చూరగొన్న విలక్షణమైన వ్యక్తిత్వం ఆయనది.
కమ్యూనిస్టుగా సాదా సీదా జీవితాన్ని గడిపిన ధన్యజీవి. భావితరాలకు ఆదర్శప్రాయుడు.
కడప జిల్లా, చిట్వేలి ఉన్నత
పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.)లో
చేరి, కార్యకర్తగా ఎదిగాను. రాజంపేటలో ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకొని, 1975 జూన్ లో
తిరుపతి ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులో చేరాను. అమరజీవి కామ్రేడ్. వి.కె.
గారు భారత కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర బాధ్యులుగా చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాన్ని'గైడ్'
చేయడానికి తిరుపతికి వస్తుండే వారు. మృదు స్వభావి. కార్యకర్తలు, నాయకులు అన్నతారతమ్యం
లేకుండా అందరితో కలిసి పోయే వారు. విద్యార్థి రంగం నుండి నేను జిల్లా కమ్యూనిస్టు సమితి
సమావేశాలకు హాజరయ్యే వాడిని. ప్రపంచ పరిణామాలపై సోవియట్ యూనియన్ మరియు ఇతర సోషలిస్టు
దేశాల ప్రభావం గణనీయంగా ఉండే రోజులు. దేశ రాజకీయాలపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉండేది.
రాష్ట్ర పార్టీ బాధ్యులుగా సమావేశాలకు హాజరయ్యే నాయకులు మొదట అంతర్జాతీయ పరిణామాలతో
మొదలు పెట్టి, జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాలపై 'రిపోర్టు' ఇచ్చేవారు. రాజకీయ రిపోర్టు
విని, నూతన విశేషాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస సభ్యుల్లో ఉండేది. అంకిత భావంతో దశాబ్ధాలుగా
పార్టీలో పని చేస్తున్న పలువురు పెద్దలు జిల్లా సమితిలో సభ్యులుగా ఉండేవారు. వారిలో
దాదాపు అరడజను మంది వరకు ఏళ్ళ తరబడి గ్రామ సర్పంచ్ లుగా ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న
సీనియర్ కామ్రేడ్స్ కూడా ఉండే వారు. కామ్రేడ్స్ మధ్య ఉండాల్సిన ఆప్యాయతానురాగాలు వారి
మధ్య నిండుగా ఉండేవి. వారంతా అత్యంత ఆసక్తితో సమావేశాలకు హాజరయ్యే వారు.
జిల్లా కమ్యూనిస్టు సమితి
కార్యదర్శిగా అమరజీవి కా. గంధమనేని శివయ్య గారు బాధ్యతలు నిర్వహిస్తుండే వారు. ఆయన
సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉపోద్ఘాతం మొదలు పెట్టి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై
సుదీర్ఘంగా మాట్లాడే వారు. అధికార పార్టీలోని ఆంతరంగికుల ద్వారా డిల్లీ నుండి మద్రాసు
మీదుగా తన చెవికి నేరుగా చేరిన సమాచారం అంటూ చెప్పుకొచ్చే వారు. వి.కె.గారితో సహా అందరూ
ఆసక్తిగా వినేవాళ్ళు. ఇంతలో మధ్యాహ్న భోజనానికి సమయం సమీపించేది. ఏంటి శివయ్యా! భోజనం
'టైం' అయ్యిందే! వి.కె. గారు రాజకీయ రిపోర్టు ఎప్పుడిచ్చేది? అని కొందరు సీనియర్ కామ్రేడ్స్
గుర్తు చేసే వారు. హైదరాబాదు విశేషాలు తప్ప ఆయనకేం తెలుసప్పా! అని శివయ్య గారు 'జోక్'
చేసే వారు. శివయ్య గారు మాజీ శాసన సభ్యులు. పాలక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా
ప్రముఖ నాయకుల్లో కొందరు శివయ్య గారికి మంచి మిత్రులుండే వారు. వారి ద్వారా డిల్లీలో
జరిగే రాజకీయ పరిణామాలు(గాసిప్స్) ఆయన చెవికి చేరేవి. వాటిని గుదిగుచ్చి రాజకీయ నివేదికగా
వినిపించే వారు. శివయ్య చెప్పింది నిజమేనప్పా! ఆయనకున్నంత ఆంతరంగికమైన సమాచారం నాకు
లేదని వి.కె. గారు సరదాగా వ్యాఖ్యానించే వారు. దాంతో అందరూ భోజనాలకు లేచి వెళ్ళేవాళ్ళు.
భోజనానంతరం ఎవరి దారిన వాళ్ళు వూళ్ళకు వెళ్ళి పోయేవారు. పెద్ద వాళ్ళు, బస్సులు పట్టుకొని,
చీకటి పడక ముందే వాళ్ళ గ్రామాలకు చేరుకోవాలి కదా! ప్రతిసారి ఇలానే జరిగేది. అయినా కా.వి.కె.
గారు కానీ, సమితి సభ్యులు కానీ విసుగు చెందే వారు కాదు, సరదాగా 'కామెంట్' చేస్తూ సమావేశానికి
హాజరయ్యామన్న సంతృప్తితో వెళ్ళి పోయే వారు. నేను ఇంత దూరం నుంచి శ్రమపడి వచ్చానే, హాజరైన
సభ్యులందరూ ఉండగా రాజకీయ రిపోర్టు ఇవ్వలేక పోయానన్న కొద్ది పాటి చిరాకు కూడా వి.కె.గారి
ముఖకవళికల్లో నేను ఏనాడు గమనించ లేదు. అంతే! అలా జరిగి పోయేది.
నదీ జలాల సమస్యలపై అధ్యయనం
చేయాలన్నఆసక్తి నాకు కలగడానికి వి.కె.గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రాయలసీమ కరవు
నివారణకు కృష్ణా జలాల మళ్ళింపే శాశ్వత పరిష్కారమన్న నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన
ఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో కూడా పలు ఆందోళనా కార్యక్రమాలను
నిర్వహించాం. 1977 నవంబరు 20న "రాయలసీమ సమగ్రాభివృద్ధికి యువజన - విద్యార్థి
సదస్సు"ను తిరుపతిలో నిర్వహించాం. దానికి కా.నీలం రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా
హాజరైనారు. రాయలసీమకు కృష్ణా నదీ జలాలను మళ్ళించాలన్న ప్రధానమైన డిమాండుతో 1980 ఆగస్టు
25న హైదరాబాదులో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించాం.
1981 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్.
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడి హైదరాబాదుకు మకాం మార్చాను. పార్టీ రాష్ట్ర కార్యదర్శి
కా. గిరిప్రసాద్ గారిని కలవడానికి ఆయన గదిలోకి వెళ్ళాను. నన్ను చూడగానే రండి లక్ష్మీనారాయణ
గారు అని సంబోధించారు. ఆ మాట వినగానే వెంటనే వెనుదిరిగాను. ఏంటి వెళ్ళిపోతున్నారు,
రండి, కూర్చోండని పిలిచారు. గిరిప్రసాద్ గారి వైపు తిరిగి మీరు పెద్ద వారు, నన్ను బహువచనంతో
సంబోధించడం నాకు నచ్చలేదు, మా వి.కె. గారి లాగా ఏకవచనంతో పిలవండి అన్నాను. ఏరా, రా,
ఎలా ఉన్నావ్, ఎప్పుడొచ్చావ్, అన్న పలకరింపుల్లో ఉన్న ఆప్యాయత, అనురాగం, సాన్నిహిత్యం
యొక్క మాధుర్యాన్ని వి.కె. గారి నుండి ఆస్వాధించాను.
విద్యార్థి రంగానికి రాష్ట్ర పార్టీ బాధ్యులుగా కా.వి.కె.
గారు ఉండే వారు. ఆయన పార్టీ 'ఇన్ ఛార్జ్'గా ఉండడంతో నాకు కొండంత ధైర్యంగా ఉండేది. కార్యక్రమాల
రూపకల్పనలో సలహాలు ఇవ్వడం తప్ప, అవసరానికి మించి జోక్యం చేసుకొనే వారు కాదు. ఎ.ఐ.ఎస్.ఎఫ్.
రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ, ప్రోత్సాహం వి.కె. గారి నుండి లభించేది. విద్యార్థి
ఉద్యమ విస్తరణ, పటిష్టత, సైద్ధాంతిక శిక్షణ, నాణ్యమైన కార్యకర్తల తయారీ, పని విభజన,
బాధ్యతల అప్పగింత, నియంత్రణ, జవాబుదారీతనం, విద్యార్థుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి
కేంద్రీకరించి, సలహాలిస్తూ వెన్నంటి ఉండేవారు. ముఖ్యమైన జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో
నిర్వహించబడిన సమావేశాలు, వర్క్ షాప్స్, సదస్సులకు మాతో పాటు హాజరయ్యే వారు. ఉపన్యాసాలు
ఇవ్వడానికి కాదు సుమా! జిల్లాల పార్టీ నాయకత్వాల సహకారాన్ని విద్యార్థి ఉద్యమానికి
అందేలా చూడడానికి, పూర్తి కాలం లేదా పాక్షికంగా సమయాన్ని వెచ్చించి పని చేస్తున్న కార్యకర్తల
ఎంపిక, నియామకం, వారికి అవసరమైన ఆర్థిక సహకారంపై పార్టీ నాయకత్వాలతో చేసే సమాలోచనల్లో
క్రియాశీలంగా తోడ్పాటునందించడాని మా వెన్నంటి ఉండే వారు.
ఇక్కడొక ఘటనను ప్రస్తావించడం
సముచితంగా ఉంటుందను కొంటున్నాను. పదవ తరగతి పరీక్షా ఫలితాల జాప్యాన్ని, కంపూటర్ల అవకతవకలను
నిరసిస్తూ సచివాలయం ముందు పికెటింగ్ చేయాలని ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర సమితిలో చర్చించిన
మీదట నిర్ణయించాo. 1984 జూన్ 22న ఎవరికి వారు విడివిడిగా వెళ్ళి సచివాలయంకు ఎదురుగా
ఉన్న బ్రిటీష్ లైబ్రరీలోను, ప్రక్కనున్న టీ హోటల్, వాటి పరిసరాలకు చేరుకొని, ఒక్కసారిగా
'మెయిన్ గేట్' ముందుకు దూసుకు పోయి పికెటింగ్ చేయాలని వ్యూహాన్ని రచించుకొని, ఆ మేరకు
అమలు చేశాం. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమితి సభ్యులందరూ పాల్గొన్నారు. పోలీసుల కన్నుకప్పి
సచివాలయం ముందు పికెటింగ్ చేయడంతో కంగుతిన్న పోలీసులు కసికొద్దీ లాఠీలకు పని చెప్పారు.
కొంత మందికి తలలపై గాయాలై, రక్తంతో తడిసి పోయారు. లాఠీ చార్జీలో నాతో పాటు పలువురు
తీవ్రంగా గాయపడ్డారు. అందర్నీ అరెస్టు చేసి అసెంబ్లీకి ఎదురుగా ఉన్న పోలీస్ కంట్రోల్
రూమ్ కు తరలించి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, లోపల పెట్టారు. విశాలాంధ్ర విలేకరి
కా.నర్సింగ్ ఈ సమాచారాన్నిరాష్ట్ర పార్టీ కార్యదర్శి కా.గిరిప్రసాద్ గారికి చేరవేసి,
మీరు జోక్యం చేసుకొంటే గానీ పోలీసులు విడుదల చేయరని చెప్పారట. ఆయన మొదట కాస్త అసహనం
వ్యక్తం చేసినా అటుపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఫలితంగా మేము విడుదలై, మగ్ధూం భవన్
కు ఆ రోజు రాత్రి పొద్దుపోయాక చేరుకొన్నాం.
మరుసటి రోజు ఉదయాన్నే గిరిప్రసాద్
గారు నన్ను పిలిచి, ఎందుకు అలా చేశారని అడిగారు. రాష్ట్ర సమితి చేసిన సమిష్టి నిర్ణయం
మేరకే పికెటింగ్ చేశామని చెప్పా. కా.వై.బాబురావు(ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు)ను కూడా
అడిగి తెలుసుకోమని, ఆయన్ను కూడా పిలిచా. కా. వి.కె. గారి సమక్షంలోనే చర్చించి తీసుకొన్న
నిర్ణయమని చెప్పా. వి.కె. గారి మద్ధతు కూడా ఉందన్న మాట. ఈ తరహా ఆందోళనల వల్ల జరిగే
ప్రయోజనమేంటి? అని అడిగితే, జరిగిన లాఠీ చార్జీపై రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు
స్పందించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొంటారని చెప్పా. అలాగే, రాష్ట్ర వ్యాపితంగా తీవ్ర
స్థాయిలో సమ్మె జరిగింది. పదుల వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వి.కె. గారు
మాకు మద్ధతుగా నిలిచారు. ఆందోళన వల్ల వచ్చిన సత్ఫలితాలను గమనించాక గిరిప్రసాద్ గారు
అభినందించారు. అలాంటి పరీక్షా సమయాల్లోనే నాయకులు నికార్సుగా కార్యకర్తలకు వెన్నుదన్నుగా
నిలవాలి, ప్రోత్సహించాలి. వి.కె. గారు ఆచరణలో అలాగే చేసే వారు. ఇది ఒక నిర్ధిష్టమైన
ఉదాహరణ మాత్రమే.
రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా
కార్యక్రమాలను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పాఠశాలలను ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో
నిర్వహించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాం. ఒకసారి అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్
రిజర్వాయర్(పిఎబిఆర్) వద్ద రాయలసీమ ప్రాంతీయ శిక్షణా శిబిరాన్ని నిర్వహించాం. ఒక పూట
పొట్టేలు మాంసం వడ్డించారు. మాంసం కూరలో నూనె, ఎర్రటి కారం బాగా దట్టించి వేసి చేశారు.
చిత్తూరు జిల్లా నుండి వచ్చిన విద్యార్థి కార్యకర్తలకు ఆ మాంసం తింటుంటే నాలుకలు మండి
పోయాయి. కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి. దాంతో మాంసం ముక్కలను
గ్లాసుల్లోని నీళ్ళతో కడుక్కొని తిన్నారు. ఆ దృశ్యాన్ని గమనించి, ఆ మాత్రం కారం తినలేని
మీరేం రాయలసీమోళ్ళురా! పౌరుషం ఎలా వస్తుందని వి.కె. గారు వ్యాఖ్యానిస్తే, వాళ్ళు ముసిముసి
నవ్వులతో పంటి బిగువున ఆ కూరను తిన్నారు.
సమావేశాల్లో చర్చల సందర్భంగాను,
పిచ్చాపాటిగా మాట్లాడే సందర్భాలలోను కార్యకర్తలను ఏరా! అప్పెంతుంది? అని అడిగే వారు.
అప్పు లేదంటే, ఎంత అప్పు ఉంటే అంత బాగా కార్యక్రమాలు చేస్తున్నట్లు లెక్కని సరదాగా
వ్యాఖ్యానించే వారు. ఒకసారి నా విద్యార్థి ఉద్యమ సహచరుని పెళ్ళికి ఇద్దరం వరంగల్ వెళ్ళాం.
ఆశీర్వదించడానికి ఆయనతో పాటు వేదికెక్కుతుంటే, రేయ్! నీకు పెళ్ళి కాలేదు, ఆశీర్వదించే
అర్హత నీకు లేదన్నారు. అలా సరదాగా జోకులు వేస్తూ మాలో ఒకరుగా కలిసి పోయే వారు.
1985 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్.
జాతీయ మహాసభను గుంటూరులో నిర్వహించాం. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతను స్వీకరించాలన్న
ప్రతిపాదనను పార్టీ నాయకత్వం నా దృష్టికి తీసుకొచ్చింది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.
ఆ విషయాన్ని వి.కె. గారికి ఫోన్ ద్వారా తెలియజేశాను. జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమానికి
నాయకత్వం వహించే సామర్థ్యం లేదని, తెలుగులో తప్ప ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో మాట్లాడడం
రాదని, నన్ను రక్షించండని మొరపెట్టు కొన్నాను. అంతా విని, ఆయన ఒక్కటే మాట అన్నారు.
అది పార్టీ నిర్ణయం. నీవు పార్టీలో ఉండదలుచుకొంటే అంగీకరించక తప్పదు. ఒకసారి గిరి గారితో
కూడా మాట్లాడు అన్న సలహా ఇచ్చారు. అటుపై గిరి గారితో మాట్లాడాను. కేంద్ర పార్టీ నిర్ణయాన్నిమార్పించ
లేనని కరాకండిగా చెప్పేశారు. దాంతో విధిలేక అంగీకరించి, డిల్లీకి వెళ్ళాను. జాతీయ పార్టీ
నుండి విద్యార్థి రంగ బాధ్యులుగా కా.ఎ.బి.బర్ధన్, పార్టీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్
బాధ్యులుగా కా. నీలం రాజశేఖరరెడ్డి గారు ఉండే వారు. వారిరువురి సహాయ సహకారాలు, రాష్ట్రంలో
వి.కె. గారి తోడాటుతో నెట్టుకొచ్చేశాను. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో నాకు వెన్నుదన్నుగా
కా.వి.కె. గారు నిలిచారు.
విద్యార్థి ఉద్యమం నుంచి
సెలవు పుచ్చుకొన్నాక కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచు కోవాలన్నతలంపుతో
1991లో కడపకు చేరుకొన్నాను. రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద దిక్కుగా వి.కె.
గారు కడప జిల్లా సమావేశాల్లో పాల్గొనే వారు. చిత్తూరు జిల్లాకు భిన్నమైన వాతావరణంలో
కడప జిల్లా సమావేశాలు జరిగేవి. రాష్ట్ర బాధ్యులుగా హాజరైన కా.వి.కె. గారి రాజకీయ రిపోర్టును
సమావేశం ప్రారంభంలోనే చాలా శ్రద్ధగా వినేవారు. రాజకీయ నివేదిక ఇవ్వడంతో
నా పని అయిపోయిందనుకోకుండా సభ్యులు వ్యక్తం చేసే అభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా ఆలకించి,
స్పందించే గుణం ఆయనది.
ఎ.ఐ.ఎస్.ఎఫ్. మరియు కమ్యూనిస్టు
ఉద్యమాల ద్వారా వి.కె.గారితోను, ఆయన కుటుంబ సభ్యులతోను ఏర్పడిన అనుబంధం అమూల్యమైనది.
వి.కె. గారి సతీమణి శ్రీమతి పార్వతమ్మ పలకరింపు, ఆతిథ్యంలో తల్లి వాత్సల్యం తొణికిసలాడుతుంది.
ఆయన సోదరి అమరజీవి పార్వతమ్మ గారు మహిళా ఉద్యమ నేతగా రాణించారు. ఆయన ఆయన సోదరుల కుమారులు
వి.కె.వెంకట్రామిరెడ్డి గారు తాడిపత్రి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో క్రియాశీల
పాత్ర పోషించడమే కాకుండా విద్యార్థి దశలో కా.కొల్లి నాగేశ్వరరావు సహచరుడుగా ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో
పని చేశారు. స్వగ్రామానికే పరిమితమై పని చేసినా విశ్వనాథరెడ్డి గారి కృషిని విస్మరించలేం.
వి.కె.రంగారెడ్డి గారు ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యమ నిర్మాణంలో నాకు సహచరుడు. 1978 డిసెంబరులో
నాటి జనతా ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బంద్ నిర్వహిస్తే,
అందులో బి.టి.కళాశాల విద్యార్థులు పాల్గొనక పోవడంపై ఆగ్రహించిన స్థానిక శాసనసభ్యుడు
విద్యార్థులపై కాల్పులు చేసిన ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి, చెయ్యి కోల్పోయాడు.
ఆ కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ఉధృతమైన పోరాటాన్ని నిర్వహించాం. ఆ ఉద్యమానికి
నాయకత్వం వహించిన కార్యాచరణ కమిటీకి నేను కన్వీనర్ గా వ్యవహరించాను. వి.కె.రంగారెడ్డి
గారు మదనపల్లి సబ్ జైల్ లో 15 రోజులు నిర్భందించబడ్డారు. నేను రెండు రోజులు ఆ జైల్
లో నిర్భందించబడ్డాను. నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన
కాలంలో వెంకట్రామిరెడ్డి గారి కుమార్తె రాధమ్మ, కుమారుడు ప్రదీప్ ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో క్రియాశీలంగా
పని చేశారు. అలా కా.వి.కె.గారి కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై పని చేసింది.
వి.కె.గారి కుటుంబానికి చెందిన మూడు తరాల సభ్యులతో ఉద్యమ రీత్యా, వ్యక్తిగతంగా నాకు
ఏర్పడిన అనుబంధం కమ్యూనిస్టు ఉద్యమం నాకిచ్చిన ఒక అపురూపమైన కానుక. అమరజీవి కా.వి.కె.
గారు నేడు భౌతికంగా లేక పోయినా నాలాంటి వారికి నేటికీ మార్గదర్శే.
టి.లక్ష్మీనారాయణ
Tuesday, September 26, 2017
అణ్వస్త్రరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలి!
1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో, హీరోషిమా, నాగసాకిలపై హైడ్రొజన్ బాంబులు వేసి మారణహోమానికి అమెరికా పాల్పడింది. ఆనాటి నుంచే ప్రపంచ ప్రజానీకం మనస్సుల్లో అమెరికా అంటే ఒక యుద్ధోన్మాద దేశం అన్న భావన పదిలంగా ఏర్పడింది. సోవియట్ యూనియన్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించి, రక్షణ రంగంలో పోటాపోటీగా అభివృద్ధి చెంది ఉన్నంత కాలం కాస్త వెనకడుగు వేసి చర్చలకు అంగీకరించింది. పర్యవసానంగా, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(స్టార్ట్)పై రెండు దేశాలు 1991లో సంతకాలు చేశాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తదనంతర పరిణామాల పూర్వరంగంలో 1994లో ఆ ఒప్పందం అమలులోకి వచ్చింది. అణ్వాయుధాల ఉత్ఫత్తిని కొనసాగించ కూడదని, నిల్వ ఉన్న అణ్వాయుధాలను క్రమేపీ తగ్గించుకొంటూ రావాలన్ననిర్ధేశిత లక్ష్యాల సాధనలో అడుగు ముందుకు పడలేదు.
గడచిన ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలను పరిశీలిస్తే అమెరికా దుశ్చర్యల వల్లనే యుద్ధాలు వచ్చాయి. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఆప్ఘనిస్తాన్ లో ఆంతరంగిక యుద్ధం, మరొకొన్ని దేశాల్లో జరిగిన యుద్ధాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొన్న లేదా పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్ర అమెరికాకే ఉన్నది. అలాగే ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా మరికొన్ని దేశాలను అమెరికా 'రోగ్ కంట్రీస్'గా ప్రకటించింది. ఎందుకు అమెరికా అలాంటి దౌత్యనీతిని ప్రదర్శిస్తూ వస్తున్నదో మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకోవాలి.
నేడు ప్రపంచంలో పదహైదు వేల అణ్వాయుధాలు ఉంటే వాటిలో అమెరికా దగ్గర ఏడు వేలు, రష్యా దగ్గర మరో ఏడు వేలు ఉన్నాయి. ఇంగ్లండు, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దేశాల వద్ద వెయ్యి ఉన్నాయి. ఏడు వేల అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్నఅమెరికా వల్ల ప్రపంచానికి ముప్పులేదన్నట్లు వ్యవహరిస్తూ, పైపెచ్చు అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతున్నదని, పది అణ్వాయుధాలను సమకూర్చుకొన్న ఉత్తర కొరియా ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించిందన్న ప్రచారాన్ని అమెరికా చేస్తున్నది. ఒక్కటి మాత్రం నిజం. అణ్వాయుధాలు ఏడు వేలున్నా, పది ఉన్నా, వాటిలోఒక్క దాన్ని ప్రయోగించినా జరిగే విధ్వంసం అపారంగానే ఉంటుంది.
తనను 'రోగ్ కంట్రీ'గా ప్రకటించిన అమెరికా నుండి తనను తాను రక్షించుకోవాలంటే, మరొక ఇరాక్ గా, ఆఫ్ఘనిస్తాన్ గా, సిరియాగా కాకుండా ఉండాలంటే అణ్వాయుధాలను తయారు చేసుకోవడమొక్కటే మార్గమన్న దుస్థితికి ఉత్తర కొరియా నెట్టబడిందేమో! దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించడం, కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వతంగా సైనిక స్థావరాన్నిఏర్పాటు చేసుకోవడం లాంటి యుద్ధోన్మాద చర్యలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టాయనడంలో సందేహం లేదు.
అణ్వాయుధాలను నిర్వీర్యం చేయండి, కొత్తగా తయారు చేయవద్దని ప్రపంచ దేశాలన్నీకోరుకొంటున్నాయి. ఒక్క ఉత్తర కొరియాకే కాదు, అణ్వాయుధాలు కలిగి ఉన్న అన్ని దేశాలకు ఇది వర్తింప చేయాలి. అణ్వాయుధరహిత సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేద్దామన్న దృక్పథంతో ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చి నుండి చర్చల ప్రక్రియను ప్రారంభించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి దేశం అమెరికానే. అలాగే, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలు, దాని మిత్ర దేశాలు ఉన్నాయి. భారత్ సహా అణ్వస్త్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి.
సెప్టంబరు 20 నుండి సంతకాల సేకరణను మొదలు పెడితే ఇప్పటికే 53 దేశాలు ఆ తీర్మానంపై సంతకాలు చేశాయని, మూడు దేశాలు 'ర్యాటిపై' కూడా చేశాయని చెప్పబడుతున్నది. ప్రపంచాన్ని కాపాడు కోవాలంటే ఒక్క ఉత్తర కొరియాను కట్టడి చేస్తే సరిపోతుందా! భారత దేశం పోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు తమకే ఆ హక్కు ఉన్నది, ఇతర దేశాలకు ఉండకూడదనే ద్వంద నీతి ప్రదర్శించడం సమర్థనీయం కాదు. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన అణ్వాయుధాలన్నింటినీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం.
అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో ప్రకటించిన దేశాల జాబితా నుండి సుడాన్ ను తొలగించి ఉత్తర కొరియా, చాద్, వెనుజువెలా దేశాలను కొత్తగా చేర్చి డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల పూర్వరంగంలో ఈటీవి 'అమెరికా నిషేధాస్త్రం' అన్న శీర్షికతో ప్రతిధ్వని నిర్వహించింది. చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ డి.పాపారావు, జెన్ మనీ సంస్థ, జనరల్ మేనేజర్ శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చర్చలో నేను పై అభిప్రాయాలను స్థూలంగా ప్రస్తావించాను.
https://www.youtube.com/watch?v=BRq8f1TYam8&t=994s
1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో, హీరోషిమా, నాగసాకిలపై హైడ్రొజన్ బాంబులు వేసి మారణహోమానికి అమెరికా పాల్పడింది. ఆనాటి నుంచే ప్రపంచ ప్రజానీకం మనస్సుల్లో అమెరికా అంటే ఒక యుద్ధోన్మాద దేశం అన్న భావన పదిలంగా ఏర్పడింది. సోవియట్ యూనియన్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించి, రక్షణ రంగంలో పోటాపోటీగా అభివృద్ధి చెంది ఉన్నంత కాలం కాస్త వెనకడుగు వేసి చర్చలకు అంగీకరించింది. పర్యవసానంగా, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(స్టార్ట్)పై రెండు దేశాలు 1991లో సంతకాలు చేశాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తదనంతర పరిణామాల పూర్వరంగంలో 1994లో ఆ ఒప్పందం అమలులోకి వచ్చింది. అణ్వాయుధాల ఉత్ఫత్తిని కొనసాగించ కూడదని, నిల్వ ఉన్న అణ్వాయుధాలను క్రమేపీ తగ్గించుకొంటూ రావాలన్ననిర్ధేశిత లక్ష్యాల సాధనలో అడుగు ముందుకు పడలేదు.
గడచిన ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలను పరిశీలిస్తే అమెరికా దుశ్చర్యల వల్లనే యుద్ధాలు వచ్చాయి. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఆప్ఘనిస్తాన్ లో ఆంతరంగిక యుద్ధం, మరొకొన్ని దేశాల్లో జరిగిన యుద్ధాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొన్న లేదా పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్ర అమెరికాకే ఉన్నది. అలాగే ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా మరికొన్ని దేశాలను అమెరికా 'రోగ్ కంట్రీస్'గా ప్రకటించింది. ఎందుకు అమెరికా అలాంటి దౌత్యనీతిని ప్రదర్శిస్తూ వస్తున్నదో మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకోవాలి.
నేడు ప్రపంచంలో పదహైదు వేల అణ్వాయుధాలు ఉంటే వాటిలో అమెరికా దగ్గర ఏడు వేలు, రష్యా దగ్గర మరో ఏడు వేలు ఉన్నాయి. ఇంగ్లండు, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దేశాల వద్ద వెయ్యి ఉన్నాయి. ఏడు వేల అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్నఅమెరికా వల్ల ప్రపంచానికి ముప్పులేదన్నట్లు వ్యవహరిస్తూ, పైపెచ్చు అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతున్నదని, పది అణ్వాయుధాలను సమకూర్చుకొన్న ఉత్తర కొరియా ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించిందన్న ప్రచారాన్ని అమెరికా చేస్తున్నది. ఒక్కటి మాత్రం నిజం. అణ్వాయుధాలు ఏడు వేలున్నా, పది ఉన్నా, వాటిలోఒక్క దాన్ని ప్రయోగించినా జరిగే విధ్వంసం అపారంగానే ఉంటుంది.
తనను 'రోగ్ కంట్రీ'గా ప్రకటించిన అమెరికా నుండి తనను తాను రక్షించుకోవాలంటే, మరొక ఇరాక్ గా, ఆఫ్ఘనిస్తాన్ గా, సిరియాగా కాకుండా ఉండాలంటే అణ్వాయుధాలను తయారు చేసుకోవడమొక్కటే మార్గమన్న దుస్థితికి ఉత్తర కొరియా నెట్టబడిందేమో! దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించడం, కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వతంగా సైనిక స్థావరాన్నిఏర్పాటు చేసుకోవడం లాంటి యుద్ధోన్మాద చర్యలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టాయనడంలో సందేహం లేదు.
అణ్వాయుధాలను నిర్వీర్యం చేయండి, కొత్తగా తయారు చేయవద్దని ప్రపంచ దేశాలన్నీకోరుకొంటున్నాయి. ఒక్క ఉత్తర కొరియాకే కాదు, అణ్వాయుధాలు కలిగి ఉన్న అన్ని దేశాలకు ఇది వర్తింప చేయాలి. అణ్వాయుధరహిత సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేద్దామన్న దృక్పథంతో ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చి నుండి చర్చల ప్రక్రియను ప్రారంభించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి దేశం అమెరికానే. అలాగే, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలు, దాని మిత్ర దేశాలు ఉన్నాయి. భారత్ సహా అణ్వస్త్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి.
సెప్టంబరు 20 నుండి సంతకాల సేకరణను మొదలు పెడితే ఇప్పటికే 53 దేశాలు ఆ తీర్మానంపై సంతకాలు చేశాయని, మూడు దేశాలు 'ర్యాటిపై' కూడా చేశాయని చెప్పబడుతున్నది. ప్రపంచాన్ని కాపాడు కోవాలంటే ఒక్క ఉత్తర కొరియాను కట్టడి చేస్తే సరిపోతుందా! భారత దేశం పోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు తమకే ఆ హక్కు ఉన్నది, ఇతర దేశాలకు ఉండకూడదనే ద్వంద నీతి ప్రదర్శించడం సమర్థనీయం కాదు. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన అణ్వాయుధాలన్నింటినీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం.
అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో ప్రకటించిన దేశాల జాబితా నుండి సుడాన్ ను తొలగించి ఉత్తర కొరియా, చాద్, వెనుజువెలా దేశాలను కొత్తగా చేర్చి డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల పూర్వరంగంలో ఈటీవి 'అమెరికా నిషేధాస్త్రం' అన్న శీర్షికతో ప్రతిధ్వని నిర్వహించింది. చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ డి.పాపారావు, జెన్ మనీ సంస్థ, జనరల్ మేనేజర్ శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చర్చలో నేను పై అభిప్రాయాలను స్థూలంగా ప్రస్తావించాను.
https://www.youtube.com/watch?v=BRq8f1TYam8&t=994s
Subscribe to:
Posts (Atom)