Friday, February 25, 2011

విద్యా హక్కు చట్టం పై విశాలాంధ్రలో వ్యాసం

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010
టి. లకీëనారాయణ

మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్‌ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.

ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎ రైట్‌ నాట్‌ ఎ ప్రివిలేజ్‌ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.

నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్‌ 45(3) ను సవరించి నూతన క్లాజ్‌ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్‌ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.

నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.

T.Lakshminarayana

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై సాక్షి దినపత్రికలో వ్యాసం

సంక్షోభంలో సంక్షేమం!
విశ్లేషణ

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపందాలుస్తున్న కొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.


విశ్వసనీయతకు, జవాబుదారీ తనానికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాజకీయ అభద్రతాభా వానికి అద్దంపడుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్నకొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతు న్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలకు నిధులు విడుదలకాక ఆర్థిక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుకే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ధైర్యంతో రూ. 1,28,770 కోట్ల భారీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించిందో అర్థంకాదు. వాస్తవాల ఆధారంగా, నిజాయితీతో ఆదాయ వ్యయాలను, గత అనుభవాల ప్రాతిపదికగా శాస్ర్తీయ దృక్పథంతో అంచనా వేసి బడ్జెట్‌ను తయారు చేయలేద న్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థికశాఖా మాత్యులు కె.రోశయ్య రూ. 1,13,660 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందారు. దాన్ని రూ. 1,11,057 కోట్లుగా తరువాత సవరించారు. అందులో ఖర్చు చేసిన గణాంకాలు మరో ఏడాదికిగానీ బహిర్గతం కావు.

కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను వంచించడానికి బరితెగించిందని చెప్పక తప్పదు. కేటాయింపులు చేసినట్లు కాగితాలపై చూపి, ఆచరణలో ఎగనామం పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ రూపొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జలయజ్ఞానికి రూ. 15,021 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌లో దాన్ని రూ. 11 వేల కోట్లకు కుదించారు. ఇప్పటికి కేవలం రూ. 5,500 కోట్లు విడుదల చేశారు. మరో రూ. 3,800 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలున్నాయి. గత బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 10 వేల కోట్లు కూడా వ్యయం చేయలేదని స్పష్టమవుతున్నది. కానీ రానున్న ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రూ. 15,010 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించడం మంచిదే కానీ, ముగుస్తున్న సంవత్స రంలో రూ. 700 కోట్లు కేటాయించి రూ. 43 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు రూ. 700 కోట్లు కేటాయించి రూ. 34 కోట్లు విడుదల చేశారు. మళ్లీ రూ. 608 కోట్లు కేటాయించారు. గాలేరు-నగరికి రూ. 660 కోట్లు కేటాయించి రూ. 160 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు రూ. 540 కోట్లు కేటాయించారు. చిన్న నీటి పారుదలకు రూ. 1,680 కోట్లు కేటాయించి రూ. 503 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రూ. 2,092 కోట్లు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయిగానీ, చిత్తశుద్ధితో వ్యయం చేసే ఉద్దేశంతో కాదన్నది స్పష్టం.

సన్నగిల్లుతున్న విశ్వాసం
ప్రతి ఏడాది పండుగలు, జాతీయ సెలవు దినాలు వచ్చి పోతున్నట్లే వార్షిక బడ్జెట్‌ను కూడా సాదాసీదా వ్యవహారంగా పాలకులు తీసుకుంటున్నట్లు కనబడుతున్నది. రాజ్యాంగబద్దమైన కర్తవ్యాన్ని బాధ్య తగా నిర్వహించాలనే రాజకీయ సంకల్పంగానీ, చట్టసభ ఆమోదం తరువాత బడ్జెట్ కేటాయింపులకు అను గుణంగా నిధులు విడుదల చేసి, జవాబుదారీతనంతో వ్యవహరించాలనే బాధ్యతనుగానీ గుర్తించడం లేదు. పైరవీకారులు, దళారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్లు, అవినీతి, అధికార దుర్వినియోగం, పాలక పార్టీ రాజకీయ అవసరాల మీద ఆధారపడి నిధుల విడుదల, మళ్లింపులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఈ మార్చి 31తో ముగిసే బడ్జెట్‌లో రూ. 1,800 కోట్లు కేటాయించి, వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.

ఇప్పుడు రూ. 2,300 కోట్లు కేటాయించారు. రెండు రూపాయలకు కేజీ బియ్యం పథకానికి రూ. 3 వేల కోట్ల నుండి రూ. 2,500 కోట్లకు కుదించారు. ఒకవైపున రేషన్‌కార్డుల సంఖ్య పెరుగుతున్నది, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన నెలకు 30 కేజీల హామీ ఉండనే ఉన్నది. కానీ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కోతపెట్టారు. బోధనా ఫీజులకు, స్కాలర్‌షిప్‌లకు రూ. 1,742 కోట్ల కేటాయింపుల్లో నిధులను విడుదల చేయలేదు. దాదాపు రూ. 3,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసి, బకాయిల చెల్లింపుపై నిర్దిష్ట గడువు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న పూర్వరంగంలో కూడా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల కోసం గతంలో లాగే రూ. 1,932 కోట్లు కేటాయించి, పెరుగుతున్న అవసరాలను గుర్తించ నిరాకరించింది. మహిళా సాధికారతపై గొప్పలు చెప్పే ప్రభుత్వం స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ నిమిత్తం ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి రూ. 400 కోట్లు కేటాయించారు.

పావలా వడ్డీ రుణాలు ప్రభుత్వం నుండి లభించకనే పేద మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు చేసి, తీర్చలేక పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న నేపధ్యాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లిపోతున్న గ్రామీణ పేదల కోసం చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కోసం చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని రూ. 300 నుండి రూ. 600 కోట్లకు పెంచారు. కానీ, ఇది ఏ మూలకు సరిపోతుంది? ఇందులోని అవినీతిని పక్కనపెడితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజులకు మరో 25 రోజుల పనిని అదనంగా రాష్ట్రంలో కల్పిస్తామని రచ్చబండలో హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలంటే నిధులు ఎలా సరిపోతాయి. అలాగే ఈ తరహా పథకాన్ని పట్టణ ప్రాంత పేదలకు కూడా అమలు చేస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. వైఎస్ అభయహస్తం పెన్షన్ పథకం పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తుకు కేటాయింపులు పెంచలేదు.

ఉపాధి కల్పనా రంగాలకు మొండిచెయ్యి
వ్యవసాయ రంగమే నేటికీ గ్రామీణ జనాభాలో అత్యధికులకు జీవనాధారం. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ రంగానికి ప్రణాళికా పద్దు కింద కేవలం రూ.2,814 కోట్లు కేటాయించారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పారిశ్రామిక రంగానికి ప్రణాళిక వ్యయంలో రూ. 775 కోట్లు కేటాయించారు. యువత భవిష్యత్తుపై కబుర్లు చెప్పే ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంపొందించ కుండా రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందిస్తారు? పోనీ సేవా రంగం అభివృద్ధికి, విస్తరణకు దోహదపడే విధంగా ఆ రంగానికి నిధులను కేటాయించారంటే అదీ లేదు.

కీలకమైన విద్యుత్ రంగా నికి నామమాత్రంగా రూ. 625 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా హామీ నెరవేరదు. ఇంతటి కీలక రంగంలో దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేట్ రంగంపై ఆధారపడే విధానాన్ని అమలుచేస్తే పర్యవసా నాలు తీవ్రంగా ఉంటాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక భద్రత, ఉపాధికల్పన, వస్తూత్పత్తి రంగాలపై కేంద్రీకరణ లోపించింది. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను వెచ్చించే దృష్టితో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి పేరిట రూ. 400 కోట్లు కేటాయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటంగానే భావించాలి.

మోయలేని రుణభారం
రాష్ట్ర ప్రజలపై రుణభారం ఏటేటా పెరిగిపోతోంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,651 కోట్లు ఉన్న అప్పులు, 2010-11లో సవరించిన బడ్జెట్ గణాంకాల మేరకు రూ. 1,23,227 కోట్లకు చేరుకుంటుంది. 2011-12 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం రుణభారం రూ. 1,41,151 కోట్లకు పెరగబోతున్నది. దీనికి అదనంగా రూ. 40 వేల కోట్లకు పైగా స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్ చేసిన అప్పుల భారం ఉండనే ఉంది. అంటే మొత్తం రూ. 1,80,000 కోట్లకు పైగా ప్రజల నెత్తిన ఉన్నది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ. 17,602 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడిం చారు. ఆ మేరకు అప్పులు చేయనున్నారని చెప్పకనే చెప్పారు. బడ్జెట్ స్థితిగతులపై పొందుపరచిన గణాంకా లలో ఆదాయం పద్దుకింద రూ. 1,00,995 కోట్లుగా, రుణాల సేకరణ ద్వారా రూ. 26,475 కోట్లుగా పేర్కొన్నారు.

ప్రజలపై భారం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 46,999 కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే ఏడాది 20 శాతం అదనంగా 56,438 కోట్లు రాబట్టుకోవాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు. ఒక వైపు అప్పుల భారాన్ని పెంచుతూ, మరో వైపు ప్రజలపై భారాలు మోపై ప్రజావ్యతిరేక బడ్జెట్ ఇది.

టి.లక్ష్మీనారాయణ
సీపీఐ నాయకులు

Wednesday, February 9, 2011

పోలవరానికి జాతీయ హోదా కల్పించాలి- సాక్షి లో వ్యాసం

జాతీయహోదా తప్పనిసరి!
రాష్ట్రంలో సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి, తాగునీటి కొరతను నివారించి, పారిశ్రామికాభివృద్ధిని సాధించడానికి పోల వరం ప్రాజెక్టు నిర్మాణం అవశ్యంగా మారింది. సముద్రం పాలవుతున్న దాదాపు 3 వేల టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవడానికి అనువుగా పోలవరాన్ని డిజైన్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుంచే పోలవరం ప్రతిపాదనలు రూపొందాయన్నది గమనార్హం. ఏడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాజెక్టును సాకారం చేసుకోవడానికి ప్రజలు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ‘జలయజ్ఞం’లో భాగంగా పోలవరం నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం మండలం, రామయ్యపేట గ్రామం వద్ద ‘ఇందిరాసాగర్ ప్రాజెక్టు’ పేర నిర్మిస్తున్న పోలవరం బహుళప్రయోజనకారి. 150 అడుగుల ఎత్తులో ‘ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం’ను 194.6 టీఎంసీల సామర ్థ్యంతో నిర్మించి, 301.38 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ఉద్దేశించిన మహత్తర ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల 58 వేల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,49,872 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 62 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే, విశాఖ మహానగరంతో సహా 48 మండలాల్లో 540 గ్రామాలకు రక్షిత మంచి నీటి సదుపాయం కల్పించవచ్చు. సామాజికాభివృద్ధికి విద్యుత్తు ఇరుసు వంటిది. విద్యుత్ కొరత రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. తెలంగాణ మెట్ట ప్రాంతాలకు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం వగైరా ఎత్తిపోతల పథకాలకు పెద్ద ఎత్తున విద్యుత్తు కావాలి. ఈ నేపథ్యంలో 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదనకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి, విశాఖ-కాకినాడ మధ్య నెలకొల్పే పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 23.44 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యమవుతుంది. కృష్ణాడెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించే సదుద్దేశంతో, గోదావరి నదీజలాల వివాదాల పరిష్కారానికి నియమించిన బచావత్ ట్రిబ్యునల్ మూడు దశాబ్దాల క్రితమే పోలవరం నిర్మాణం ద్వారా 80 టీఎంసీల నీటి తరలింపునకు ఆమోదం తెలిపింది.

ఈ పూర్వరంగంలో గోదావరి, కృష్ణానదీ జలాల అనుసంధానం తక్షణావసరం. పోలవరం ప్రాజెక్టును సత్వరం నిర్మించి, కృష్టాడెల్టా ఆయకట్టుకు నీరందించడం ద్వారా, ఆమేరకు ఆదా అయ్యే కృష్టా నీటిని కరువు పీడిత ప్రాంతాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కొంతైనా నీటిని కేటాయించవచ్చు. 80 టీఎంసీలలో 35 టీఎంసీల నీటిని కర్ణాటక, మహారాష్టల్రకు ఇవ్వాలని గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందంలో పేర్కొన్న అంశాన్ని రద్దు చేయాలని మన రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేయాలి. ఎందుకంటే, పోలవరాన్ని మన నిధులతో నిర్మించుకుంటున్నాం. పెపైచ్చు కృష్ణా జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్టల్రకు వారు ఆశించిన దానికంటే అధికంగా వాటాను పొందారు. దీనితో దిగువన ఉన్న మన రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.

మెరుగైన పునరావాసం కల్పించాలి
పోలవరం నిర్మాణంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యాలు ఇమిడి ఉన్నాయన్నది తెలిసిందే. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన దీని నిర్మాణానికి, రూ. 9,072 కోట్లు ఖర్చవుతుందని 2003-04 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసింది. ‘వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు’ అన్న చందంగా, ఈ ప్రాజెక్టును పలు రకాల జటిల సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో నిర్వాసితుల సమస్య అత్యంత ప్రధానమైనది. మన రాష్ట్రంలో 94,375 ఎకరాలతో 299 గ్రామాల్లోని 1,05,200 మంది నిర్వాసితులవుతారని అంచనా. ముంపునకు గురయ్యే ప్రాంతాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలోను, మరికొంత తూర్పుగోదావరి జిల్లాలోను ఉంది. వీరిలో 45 శాతం మంది గిరిజనులే.

వీరి సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల సహా వృత్తులు, ఉపాధి, భూమి, నివాస స్థలాలు, గిరిజనుల పరిరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలతో సహా సర్వం కోల్పోతామన్న ఆవేదన వారిలో నెలకొన్నది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నష్టపోతున్న గిరిజన, గిరిజనేతర నిర్వాసితులకు న్యాయబద్ధమైన, మెరుగైన పునరావాస ప్యాకేజిని ప్రకటించి, ముందుగానే నిధులు కేటాయించడం సముచితం. పునరావాస కార్యక్రమాలకు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతాయన్నది అంచనా. ఇప్పటికే నష్ట పరిహారం కింద రూ. 350 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రజానీకంలో భయాందోళనలు రెచ్చగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు విష ప్రచారానికి పూనుకున్నాయి. ఇందిరాసాగర్ రిజర్వాయర్ ఏ కారణాలతోనైనా బద్దలైతే ఉపద్రవం సంభవిస్తుందనీ రాజమం డ్రి, కోవూరు సహా చుట్టు పక్కల ప్రాంతాలు జలసమాధి అవుతాయనీ ప్రచారం చేయడం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నేరపూరితమైన చర్యగా పరిగణించాలి.

జాతీయ హోదా కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలి. త్వరితగతిన నిర్మాణానికి ఉపక్రమించాలి. కాలం గడిచే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుందన్నది గమనంలో ఉంచుకోవాలి. ఆరేళ్ల క్రితం రూ. 9,072 కోట్లుగా ఉన్న అంచనా,ప్రస్తుతం రూ. 16 వేల కోట్లకు పెరగడం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను గమనిస్తుంటే, 2014 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 25,713 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటికి 21 వేల ఎకరాలు మాత్రమే సేకరించినట్టు తెలుస్తోంది. కుడి, ఎడమల ప్రధాన కాల్వల నిర్మాణంపై 2010 జూలై నాటికి రూ. 3,229 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రూ. 1,035 కోట్లు కేటాయించినప్పటికీ, వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నది ప్రధాన విమర్శ.

గతంలో చేసిన నిర్ణయం మేరకు 36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో అనుమతించి, మళ్లీ 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పెంచాలని కేంద్ర జలసంఘం చేసిన సిఫార్సు మూలంగా డిజైన్‌ను మార్చాల్సి రావడంతో రిజర్వాయర్, స్పిల్‌వే నిర్మాణ పనులు ఇంకా చేపట్టలేదు. దాంతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆహార భద్రత కోసం చట్టాన్ని తెస్తామని వాగ్దానాలు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానికి ఉపకరించే పోలవరం బహుళార్థకసాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఇకనైనా అంకిత భావంతో ముందడుగు వేయాలి. వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేయడానికి మార్గాన్ని సుగమం చేయాలి. అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన గోదావరి- కృష్ణా డెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించాలి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పోలవరం నిర్మాణమే శాశ్వత పరిష్కారం అన్నది గుర్తించాలి.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర నాయకులు