Sunday, July 26, 2020

రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధనకు అంకితభావం – రాజకీయ సంకల్పం నేటి తక్షణావసరం


రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధనకు అంకితభావం –
రాజకీయ సంకల్పం నేటి తక్షణావసరం

‍-టి.లక్ష్మీనారాయణ‌

ఈ శీర్షికతో, నేను సిపిఐ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో, ఈ వ్యాసాన్ని 24 సం.ల క్రితం వ్రాశాను. భారత కమ్యూనిస్టు పార్టీ, కడప జిల్లా “స్వర్ణోత్సవాల ప్రత్యేక సంచిక -1996” లో ప్రచురించబడింది. నీటి పారుదల ప్రాజెక్టులు - వాటి స్థితిగతులు, ప్రత్యేకించి కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై నిర్మించాలని లేకపోతే మిగులు జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్నదని అందులో ప్రస్తావించాను. మిగులు జలాల ఆధారంగా రూపొందించబడిన ప్రాజెక్టులు కాబట్టి రాష్ట్రం సొంత వనరులతోనే నిర్మించుకోవలసి ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేక కార్పోరేషన్ ను నెలకొల్పి నిథులను సమీకరించుకోవాలన్న ఆలోచనను కూడా పంచుకొన్నాను. దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత నేడు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా "స్పెషల్ పర్పస్ వెహికల్"ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాయలసీమ నాలుగు జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు, ప్రకాశం జిల్లా తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నాను. ప్రాజెక్టుల సాధన కోసం కడప జిల్లాలో 1991-96 మధ్య కాలంలో విస్తృత స్థాయిలో జాతాలు, ధ‌ర్నాలు, పికెటింగ్స్, పలుసార్లు కలెక్టర్ కార్యాలయం దిగ్భందనం, ఇలా‌ వివిధ రూపాలలో ఉద్యమాలు నిర్వహించాం. లాఠీదెబ్బలు తిన్నాం. అరెస్టు అయ్యాం.

గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన పథకం శాశ్వత పరిష్కారమని నాడే ఆ వ్యాసం ద్వారా నా వాణి వినిపించాను. 24 ఏళ్ళు గడిచిపోయాయి. పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే కొనసాగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు గడువు ముగిసింది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రెండవ ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంతో ఆ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా పరిణమించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. రాష్ట్రం రెండుగా చీల్చబడింది. నదీ జలాల సమస్యలపై వివాదం జఠిలమయ్యింది.

ఇహ! ప్రాజెక్టుల నిర్మాణం చూద్ధామంటే, జుగుప్సాకరమైన పరిస్థితి. 19 టియంసిల నికర జలాల కేటాయింపు ఉన్న‌ శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న తెలుగు గంగ ప్రాజెక్టు పరిస్థితి అంతే. పోయిన ఏడాది 70 రోజులకుపైగా శ్రీశైలం జలాశయం పొంగి పొరలినా తెలుగు గంగలో భాగమైన బ్రహ్మంగారిమఠం రిజర్వాయరు సామర్థ్యంలో మూడవ వంతు నీటిని కూడా చేర్చలేకపోయారు. పంట కాలువల వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్థంగానే కొనసాగుతున్నది. హంద్రీ - నీవా మొదటి దశ నిర్మాణానికి సంబంధించి ప్రధాన కాలువ, రిజర్వాయర్లు, బ్రాంచి కాలువల నిర్మాణంలో పురోగతి ఉన్నా, పంట కాలువల వ్యవ‌స్థపై దృష్టిలేదు. రెండవ దశ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోట ప్రధాన జలాశయాన్ని, ముప్పయ్ వేల ఎకరాలకు నీటి సదుపాయాన్ని కల్పించే మొదటి దశ నిర్మాణంపైనే ప్రభుత్వం కేంద్రీకరించింది. రెండవ దశ నిర్మాణాన్ని దుర్మార్గంగా అటకెక్కించి కూర్చొన్నది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ఊరిస్తూనే ఉన్నారు. ఈ పూర్వరంగంలో నాడు నేను వ్రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో 'షేర్' చేస్తున్నాను.

“స్వాతంత్య్రం సముపార్జించుకొని ఐదు దశాబ్ధాలు(నేటికి దాదాపు ఏడు దశాబ్ధాలు), విశాలాంధ్ర(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ఏర్పడి నాలుగు దశాబ్ధాలు(ఆనాటికి) గడుస్తున్నాయి. తెలుగు నాట జీవన పరిస్థితులను నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తే వివిధ రంగాలలో ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య అభివృద్ధిలో ఎంత అసమానత్వం, అంతరాలు ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు గోచరిస్తాయి. సమతుల్య అభివృద్ధి జరగక పోవడానికి ఎవరు బాధులు? ఎందుకిలా జరిగింది? పరిస్థితిని సరిదిద్ది తెలుగు జాతి సర్వతోముఖాభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ పథకాలేమిటి? రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాల మధ్య, అదే సందర్భంలో వివిధ జిల్లాల మధ్య నేడున్న సాంఘిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో కూడిన మార్గాన్వేషణ తక్షణావసరం. దృక్కోణం నుండి చేసిన ఆలోచనల్లో ఒక భాగమే వ్యాసంలోని అంశాలు.

పంట భూములన్నీ సస్యశ్యామలం కావాలంటే!: వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రం మనది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వ్యవసాయం వివిధ ప్రాంతాలలో వర్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నది. నిత్యం కరువు కాటకాల విషకౌగిలిలో చిక్కి త్రాగి నీటికి _సాగునీటికి ఆర్తనాదం చేసే ప్రజానీకం ఒకవైపు, తుఫానులు _వరదల బారినపడి ప్రాణ నష్టం, పంట నష్టంతో కృంగిపోతున్న ప్రాంతాల ప్రజానీకం మరొకవైపు జీవన పోరాటం చేస్తున్నారు. గుండె తరుక్కుపోయేలా చేస్తున్న హృదయ విదారక దృశ్యాలను ఇంకెంత కాలం వీక్షిస్తూ పోవాలి? వీటిని నివారించడానికి మార్గాలే లేవా? శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని పథకాలను రూపొందించి కాలబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై పూనుకోవాలి.

నదులకు పేరుగాంచిన రాష్ట్రం మనది. ఉధృతంగా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులున్నాయి. పెన్నా, తుంగభద్ర, వంశధార, మంజీరా, ప్రాణహిత, మూసి, నాగావళి, చెయ్యేరు, చిత్రావతి, స్వర్ణముఖి లాంటి 37 చిన్న, పెద్ద నదులు గలగలా పారే నేల మనది. వాగులు, వంకలకు కొదవ లేదు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో 7,565 శతకోటి ఘనపుటడుగుల(టి.యం.సి.) నీటి వనరులు లభమవుతున్నాయని సాంకేతిక నిపుణుల అంచనాలు తెలియజేస్తున్నాయి. నీటితో రాష్ట్రం యొక్క 277 లక్షల భూ విస్తీర్ణంలో సాగుకు వీలైన 165 లక్షల హెక్టార్ల భూమిలో దాదాపు 125 లక్షల హెక్టార్లను సాగు క్రిందికి తేవచ్చునని కూడా అంచనా వేశారు. కానీ కేవలం 50 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే నేటికి సాగునీటి క్రిందికి తేబడిందని చెప్పబడుతున్నది. లెక్కలు కాస్త అటూ ఇటూ ఉన్నా ఒకటి మాత్రం నిజం. ప్రకృతి ప్రసాదమైన సహజవనరుల్లో ప్రాణప్రదమైన జలవనరులు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. అదే సందర్భంలో సాగు నీటికి నోచుకోని లక్షలాది ఎకరాల సారవంతమైన భూములు నిరుపయోగంగా పడివున్నాయి.

నీటి వనరులను శాస్త్రీయంగా, సక్రమంగా వినియోగించుకొని భూమిని, రైతాంగం_వ్యవసాయ కార్మికుల శ్రమశక్తిని సమర్థవంతంగా వాడుకొంటే వ్యవసాయోత్ఫత్తులను అధికం చేయవచ్చు. కరువులు, వరదల బారి నుండి ప్రజానీకాన్ని శాశ్వతంగా విముక్తి చేయవచ్చు. రైతాంగం - వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాలను పెంచవచ్చు. తద్వారా నేటి గ్రామీణ జీవన విధాన రూపురేఖలే మారిపోతాయి. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయవచ్చు. అందుచేత రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే రీతిలో సమగ్ర నీటి పారుదల పథకాన్ని రూపొందించి, అమలు పరచాలి. అలాంటి పథకాల రూపకల్పన జరగలేదా? చాలా వరకు జరిగాయి. కానీ కొన్ని పైళ్ళకు పరిమితమై ఆచరణకు నోచుకోక దుమ్ముకొట్టుకు పోతున్నాయి. మరికొన్ని నత్తనడకన అమలు పరచబడుతున్నాయి. అలా అని స్వాతంత్య్రానంతరం నీటి పారుదల రంగంలో ఎలాంటి ప్రగతి సాధించలేదని కాదు. కాలంలో పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. వాటి సత్ఫలితాలను అనుభవిస్తున్నాము. అదే, సందర్భంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో నేటికీ వివక్షతకు గురౌతున్న రాయలసీమ, మహబూబ్ నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాల నీటి సమస్యలు వర్ణనాతీతమనే కఠోర సత్యాన్ని కూడా అందరూ గుర్తించారు. కానీ ఫలితమేమిటి?

ప్రకృతి నిరాదరణ - పాలకుల వంచన మధ్య బ్రతుకు పోరు: కరువు కాటకాల కరాళ నృత్యానికి ఆటపట్టుగా మారిందీ భూమి. పాలకుల పుణ్యమాని శాశ్వత నీటి పారుదల సౌకర్యాలు ఎండమావులుగా దర్శనమిస్తున్నాయి. కరువు సీమ కడగండ్లు తీర్చడానికి జీవనాధారమైన కృష్ణా నదీ జలాల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సవతి తల్లి ప్రేమ ప్రాంతాల ప్రజానీకానికి శాపంగా మారింది. మానవ మనుగడకు, నాగరికతకు ప్రాణాధారమైన జలవనరులు సంవత్సర సంవత్సరానికి అంతరించి పోతున్నాయి. వర్షంపై ఆధారపడి వ్యవసాయం చేసి బ్రతుకులీడ్చాలి. వర్షాల రాకపోకలలో స్థిరత్వం లేదు. సగటు వర్షపాతానికి కూడా ప్రాంతాలు ఎక్కువ సంవత్సరాలు నోచుకోవడం లేదు. ప్రతి మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరువు విలయతాండవం చేస్తూ గ్రామీణ ప్రజల వెన్ను విరుస్తున్నది. బావుల సేద్యం అంతరించి పదుల సంవత్సరాలు గడచిపోయాయి. అటుపై వచ్చిన బోర్లపై ఆధారపడిన సేద్యానికీ రోజులు చెల్లిపోతున్నాయి. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి 600 అడుగుల లోతైన సబ్ మెర్సబుల్ బోర్లు వేసుకోగలిగిన స్తోమత ఉన్నవారే గడ్డన వ్యవసాయానికి నేడు సాహసించగలరు. వారికీ అదృష్టం కలిసివస్తే గడ్డన పడతారు. లేదా దివాలా తీస్తారు. నికృష్ట పరిస్థితులు అనుభవిస్తూ వరుణదేవుని కరుణామయ చూపుకోసం ఆకాశం వైపు ఎదురు తెన్నులు చూస్తూ జీవచ్ఛవాల్లా రైతాంగం భారమైన బ్రతుకీడుస్తున్నారు. ప్రకృతి నిరాధరణకు, పాలకుల వంచనలకు విసిగివేసారి పోయిన ప్రాంత ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది.

 "మాటలు కోటలు దాటుతున్నాయి - కాలు గడప దాటడం లేదు": నానుడికి రాయల్సీమ ప్రాజెక్టుల నిర్మాణం అద్దం పడుతున్నాయి. తెలుగు గంగ, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, గాలేరు-నగరి, హంద్రీ -నీవా ప్రాజెక్టుల ద్వారా కృష్ణమ్మ తల్లి సీమను స్పృశించి పచ్చని పైర్లతో సమగ్రాభివృద్ధి వైపు పయనింప చేయబడుతుందని కొండంత ఆశతో ప్రజానీకం ధీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ నిర్మాణానికి కేంద్ర ప్రణాళికా సంఘం 1981 .లోనే ఆమోదించింది. 1985-86 ఆర్థిక సం.నాటికే పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణం నేటికీ నత్తనడకన సాగుతున్నది. టెండర్ల కుంభకోణాలు, గూండాయిజం, పెద్ద అవరోధంగా నిలిచాయి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం ఉన్న ఎస్.ఆర్.బి.సి. నిర్మాణ పరిస్థితే ఇంత అగమ్యగోచరంగా వుంటే ఇతర ప్రాజెక్టుల నిర్మాణం గురించి చెప్పబట్టదు.

రాయలసిమకు వరప్రసాదమని చెప్పబడిన తెలుగు గంగ ద్వారా కర్నూలు, కడప జిల్లాలలో 2.75 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంటే కేవలం 50 వేల ఎకరాలకులోపే సాగు నీరుఇచ్చి, మద్రాసుకు త్రాగునీటిని 1996 జనవరి 1 తేదీకి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షా అరవై ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న కడప జిల్లాలో 8 వేల ఎకరాలకు నీరిస్తారట. తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంగారిమఠం రిజర్వాయరు ద్వారా లక్షా యాభై వేల ఎకరాల భూమికి నీరెప్పుడిస్తారో, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన వారికి అంతు చిక్కడం లేదు. రు.637 కోట్ల ఖర్చు అంచనాతో 1983-84 ఆర్థిక సం.లో ప్రారంభించబడి 1990 సం.నికి పూర్తి కావలసిన ప్రాజెక్టు 1995 సం. గడచిపోతున్నా, రు.800 కోట్లు వ్యయం చేసినా ఇంకా రు.1200 కోట్లకుపైగా వెచ్చించాల్సిన స్థితిలో నిర్మాణం సాగుతున్నది.

అనంతపురం, దాని పరిసర ప్రాంతాలు సమీప భవిష్యత్తులో పాక్షిక ఎడారి ప్రాంతాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ముంచుకొస్తున్నదని శాస్త్రజ్ఞలు హెచ్చరిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల మెట్ట ప్రాంతాలకు, ప్రత్యేకించి 3,92,500 ఎకరాల ఆయకట్టు కలిగిన అనంతపురం జిల్లాకు హంద్రీ_నీవా ప్రాజెక్టు ప్రాణాధారం. ప్రస్తుత అంచనా ప్రకారంరు.1,970 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొత్తం 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించించగలదు. మరి దీనికి పునాదిరాయి ఎప్పుడు పడుతుందో వేచి చూడవలసిందే!

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గండికోట అంతర్భాగంగా గాలేరు-నగరి ప్రాజెక్టు, రాజకీయ చిక్కుముడులను ఛేదించుకొని నిర్మాణానికి సిద్ధంగా ఉన్నది. రు.1,877 కోట్లు వ్యయం అంచనా గల ప్రాజెక్టు నిర్మాణాన్ని గండికోట రిజర్వాయరుకు 1996 జనవరిలో శంకుస్థాపనతో చేయడంతో ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. గత ఆరేడు సం.లుగా హంద్రీ_నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ లో నిథులు కేటాయించడం, ఖర్చు చేయకపోవడం పరిపాటైంది. ఆర్థిక సం.లో కూడా రు.25 కోట్లు చొప్పున కేటాయించి, అంకెల గారడీ చేశారు. 1989 సం.లో రాష్ట్ర ప్రభుత్వంచే ప్రకటించిన రెండు పథకాల నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఇంకా ముహూర్తం దగ్గరపడలేదు. ఇహ! వాటి ద్వారా నీరెప్పుడు ప్రవహిస్తుందో!

ప్రకాశం జిల్లా ప్రాంతాలకు ప్రధానంగా ఉద్ధేశించబడిన వెలుగొండ ప్రాజెక్టుకు దాదాపు రు1,000 కోట్ల అంచనా వ్యయంతో నివేదిక తయారైంది. ప్రాజెక్టు ద్వారా కడప, నెల్లూరు జిల్లాల ఆయకట్టుతో కలిపి మొత్తం 4,38,000 ఎకరాలు సాగూన్నది. మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే భీమా ఎత్తి పోతల పథకం రు.747 కోట్ల వ్యయం అంచనాతో నిర్మాణానికై ఎదురు చూస్తున్నది. రు.1,200 కోట్ల తాజా అంచనాతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం నల్లగొండ జిల్లా మెట్ట ప్రాంత ప్రజల కడగండ్లు తీర్చడానికి రూపొందించబడింది. మరి వీటికి మోక్షమెప్పుడు కలుగుతుందో!

ప్రాజెక్టులన్నీ కృష్ణా నదీ మిగులు జలాల ఆధారంగా రూపొందించబడినవే. కృష్ణా నదీ జలాల వివాదంపై తీర్పు ఇచ్చిన బచావత్ అవార్డు పున:పరిశీలనకు వచ్చే కీ..2000 సం.నాటికి, పూర్తిగా కాకపోయినా కనీసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని 75% మన్నా పూర్తి చేసుకొంటే నిత్యం కరువు బారిన పడుతున్న ప్రాంతాలను శాశ్వతంగా విముక్తి  చేయడానికి దోహదపడుతుంది. లేదా, శాశ్వతంగా కరువు వాతపడతాయి.

మిగులు జలాలను వాడుకొనే హక్కును బచావత్ అవార్డు మనకు సంక్రమింపచేసి దశాబ్ధాలు గడిచిపోయాయి. వేలాది టియంసిల నీళ్ళు ప్రతి యేడాది సముద్రం పాలవుతున్నాయి. వాటికి అడ్డుకట్టవేసి, దారి మళ్ళించి పంట పొలాలను సస్యశ్యామలం చేయవలసిన పాలకులు క్షమించరాని జాప్యంతో పుణ్యకాలం కాస్త గడిపేశారు. ఇప్పుడు మిగిలింది నాలుగు సం.లు మాత్రమే. ఇంకా నోరూరించే ప్రకటనలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. కర్నాటక రాష్ట్రం ఒంటికాలిపై మనతో తగాదాకు వస్తూ, మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వివాదాల్లోకి నెట్టి మరొకవైపు ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచి శీఘ్రగతిన నిర్మాణానికి పూనుకున్నది.

కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న మేజర్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులను పెంచడమే గాక అవసరమైన నిథుల సేకరణకు స్వతంత్ర ప్రతిపత్తి గల "కృష్ణా భాగ్యజల నిగమ్" అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పి ముందుకెళుతున్నది. మహారాష్ట్ర సైతం "కృష్ణా బేసిన్ కార్ఫోరేషన్"ను ఏర్పాటు చేసి ప్రాజెక్టుల సత్వర పూర్తికి నిథుల సేకరణలో నిమగ్నమై ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రకటన దశలోనే ఉన్నది. "మాటలు కోటలు దాటుతున్నాయి. కాలు గడప దాటడం లేదు" అన్న నానుడిగా తయారయింది. స్థితి ఇలాగే కొనసాగితే భావి తరాలు క్షమించవు.

అడ్డుకాళ్ళుపెట్టే దుష్టశక్తులు అడ్డుతొలగాలి: ప్రాజెక్టులను సత్వరం నిర్మించాలనే విశాల దృక్పథం, పట్టుదల, అంకితభావం, పాలకులకు, అధికార యంత్రాంగానికి ఉండాలి. అది కూడా కొరవడింది. నీళ్ళెక్కడున్నాయ్! నిథులెక్కడున్నాయ్! అనే వాదనలు వెలికితీసి మోకాలడ్డుపెట్టే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం వివాదాలను రెచ్చగొట్టే స్వార్థపర రాజకీయ శక్తులున్నాయి. వాటి మూలంగా ఇప్పటికే తీరని నష్టం జరిగింది. ఈహ! మాత్రం కాలహరణ జరగడానికి వీలులేదు.

తెల్లవాళ్ళ హయాంలో నిర్మించబడిన తుంగభద్ర రిజర్వాయరు క్రింద కాలువల నిర్మాణం నాటికీ పూర్తి కాలేదు. 1955 సం.లో ప్రారంభించబడ్డ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు మొత్తానికి నీరందించే స్థితికి ఇంకా కాలువల నిర్మాణ పనులు చేరుకోలేదు. 1964 సం.లో చేపట్టబడిన శ్రీరాం సాగర్ పని అంతే. నిత్యం పెరుగుతున్న ధరలు, అవినీతి, కాంట్రాక్టర్లు సిండికేట్స్ గా ఏర్పడి అధిక లాభాల నిష్పత్తితో టెండర్లు వేయడం, కాంట్రాక్టర్లు _ ఇంజనీర్లు_ నీతి తప్పిన రాజకీయ నాయకుల మధ్య స్థిరపడి పోయిన "పర్స్ంటేజీ" అక్రమార్జన ఒప్పందాల మూలంగా, ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల అంచనాలు తారుమారై తడిసి మోపెడవుతున్నాయి. ఖజానా కొల్లగొట్టబడి ప్రభుత్వాలు దివాలా తీస్తున్నాయి. ఫలితంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే నిథులను కేటాయించలేని దుస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. విషమ పరిస్థితి, కరువు ప్రాంతాలలో ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు శాపమైకూర్చున్నది.

నీరు_నిథులు పుష్కలం_ కావలసింది రాజకీయ సంకల్పం: వర్షా కాలంలో సముద్రం పాలౌతున్న వేలాది టియంసిల కృష్ణ నీటిని వాడుకొనే హక్కు నేటికీ మనకున్నది. కృష్ణా -పెన్నా నదులలో నీటి కొరత కొన్ని సందర్భాలలో ఏర్పడినా, లోటును పూడ్చి రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలను సస్యశ్యామలం చేయగల గోదావరి నది ఉన్నది. ఏడాదికి దాదాపు 3,000 టియంసిల నీరు సముద్రం పాలవుతున్నదని నిపుణుల అంచనా. వేల కోట్ల రూపాయల వ్యవసాయోత్ఫత్తులను సృష్టించడానికి బదులు గోదావరి నీరు వరదలుగా ప్రవహించి వందల కోట్లు రూపాయల పంటలను బుగ్గిపాలు చేస్తున్నది. పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణం, మరియు కృష్ణా -గోదావరి నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ సమతుల్య ప్రగతికి పెద్ద మలుపు అవుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ కలయిక యావత్తు తెలుగుజాతి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడి, సమైక్యత పదిలం చేయబడుతుంది.

అలాగే, కరువు ప్రాంతాల ప్రజల దాహాన్ని తీర్చి, వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు స్నేహహస్తాన్ని అందించే చైతన్యంతో డెల్టా ప్రాంతంలోని రైతాంగం రెండవ పంటకు భూగర్భ జల సందప మీద ఆధారపడడం, పంట మార్పిడి, సక్రమ నీటి వినియోగం ద్వారా వృధాను అరికట్టడం లాంటి చర్యలను పూనుకొంటే కరువు నాట కనీసం ఒక పంటకు "గ్యారెంటీ" కల్పించవచ్చు. అందుచేత నీరులేదనే ప్రసక్తే లేదు.

ఇక నిథులంటామా కృష్ణా నది మిగులు జలాలపై ఆధారపడి నిర్మించ తలపెట్టబడిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేయదనే విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన పనిలేదు. నడుస్తున్న చరిత్ర దానికి నిదర్శనం. కేంద్ర జల సంఘం అనుమతిలేని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం లభించదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయమూ లభించదు.

కావున గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మార్గాన్నే మన ప్రభుత్వమూ ఆర్థిక వనరుల సేకరణకు తక్షణం కార్ఫోరేషన్ ఏర్పాటు చేసి పూనుకోవాలి. వార్షిక బడ్జెట్ లో నిధుల కేటాయింపును పెంచడం, విధిగా ఖర్చు పెట్టడం జరగాలి. రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎన్.ఆర్..లు, బ్యాంకులు, తదితర సంస్థల నుండి బాండ్స్ రూపంలోను, టి.టి.డి. మరియు స్వచ్ఛంద సంస్థల నుండి విరాళాల రూపంలో నిథులను సేకరించాలి. వాణిజ్య వర్గాలు ఎంత పన్ను చెల్లిస్తున్నారో వాణిజ్య పన్నుతో పాటు అంతే మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి వారిని అప్పుగా ఇమ్మనికోరాలి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం లబ్ధి పొందుతున్న రైతాంగం నుండి కూడా కొంత మొత్తాన్ని వసూలు చేయడానికి పూనుకోవాలి. ఇలాంటి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొని చిత్తశుద్ధితో కృషి చేస్తే నిథుల కొరత అన్న సమస్యను అధిగమించడం కష్టమేమీ కాదు.

అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఒకే గాటన కట్టలేం: కరువుకు నిలయమైన ప్రాంతాలలో నిర్మిస్తున్న, నిర్మించతలపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ప్రాంతాలకు చెందిన గాలేరు_నగరి, హంద్రీ_నీవా, వెలుగొండ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, భీమా మరియు అసంపూర్తిగా ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాలను బట్టి తెలుస్తున్నది. రాష్ట్రం మొత్తంగా నిర్మాణంలో ఉన్న మరియు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రాజెక్టుల పూర్తికి రు.20,000 కోట్లు కావలసి ఉంటుందని పాలకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యతను నిర్ణయించుకోవాలి. బచావత్ అవార్డు పున:పరిశీలన గడువు దగ్గర పడుతున్న కారణంగా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన వీటిని యుద్ధప్రాతిపధికపై నిర్మించడానికి వెంటనే పూనుకోవాలి. లేదా "ఆలస్యం అమృతం విషం" అన్న నానుడిలా మారుతుంది.

ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వమన్నామంటే అర్థం ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, శ్రీరాంసాగర్ లకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన 30% నిథులను సక్రమంగా అందించాలి. వంశధార మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి, రెండవ దశ చేపట్టాలి. కె.సి.కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, కృష్ణా డెల్టా కాలువల  ఆధునీకీకరణకు జపాన్ లాంటి దేశాలు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలి. కేంద్రం అనుమతి లభించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. అలాగే మీడియం ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్ధాలు గడుస్తున్నా "ఎక్కడవేసిన గొంగళి అక్కడే" అన్న సామెతగా ఉంది. వాటికి నిథుల కేటాయింపు పెంచి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి.

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో పై కార్యాచరణ పథకాలను అమలు చేయడం ద్వారా నీటి లభ్యత - వినియోగం, వ్యవసాయోగ్యమైన భూమి _పంటల ఉత్ఫత్తి, గ్రామీణ శ్రమజీవుల శక్తిసామర్థ్యాల వినియోగం తదితరాల మధ్య సమన్వయాన్ని వృద్ధిచేసి వ్యవసాయ రంగాన్ని మరింత ప్రగతి మార్గం పట్టించాలి. దృకథంతో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాపితంగాను, జిల్లా స్థాయిలోను నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ, వివిధ వర్గాల ప్రజానీకాన్ని కూడగట్టి పాలకులపై ఒత్తిడి తెస్తున్నది. నిర్మాణంలో ఉన్న, నిర్మాణాన్ని చేపట్టవలసిన ప్రాజెక్టుల సత్వర సాధనకు మరింత ఉధృత పోరాటాలు అనివార్యమని ప్రజలు గుర్తించాలి’.