Thursday, January 21, 2016

హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనలు, రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల విస్తృతి విశాలమైనదిగాను, లోతైనవిగాను కనబడుతున్నది. భిన్న భావజాలాల మధ్య సంఘర్షణ ఉన్నది. దాని పర్యవసానంగా నిరసన, ఆందోళనలు, సోషల్ మీడియాలో దూషణలు, వాటి కినసాగింపుగా భౌతిక దాడులు, ఐదుగురు విద్యార్థులపై సస్పెషన్ వేటు, రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటనలపై సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని, విశ్లేషించుకోకుండా పాక్షిక దృష్టితో కొన్ని నిర్ధారణలకు వచ్చి వ్యాఖ్యానాలు చేయడం తొందరపాటు అవుతుందేమో! వాస్తవిక దృష్టి, సామాజిక స్పృహ, వర్గ దృక్పథంతో స్పందించాల్సిన తరుణం ఇది. వాస్తవాలను, వాస్తవాలుగా మాట్లాడుకోనే వాతావరణాన్ని ముందు కల్పించుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో వామపక్ష విద్యార్థి సంఘాలు పాలుపంచుకొన్నట్లు లేదనిపిస్తున్నది. ఆసా భావజాలం వామపక్ష విద్యార్థి సంఘాల భావజాలానికి మధ్య కూడా విభజన రేఖ ఉన్నదని గమనించాలి. ఆసా వామపక్షాల పట్ల మిత్ర భావంతో మెలుగుతున్న సంస్థ కూడా కాదన్న అంశాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.

ముంబాయి బాంబు ప్రేలుళ్ళకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటును అందించిన యాకూబ్ మెమోన్ కు ఉరిశిక్ష విధించడం సమంజసం కాదన్న వాదనతో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన, ప్రతిగా ఎ.బి.వి.పి. నాయకుడు రెచ్చగొట్టే విధంగా 'గూండాలని' ఎ.యస్.ఎ.నాయకులను దూషించడం. పర్యవసానంగా భౌతిక దాడి, కేసులు, ఎ.బి.వి.పి. నాయకులకు వత్తాసు పలుకుతూ దత్తాత్రేయ గారు కేంద్ర మానవ వనరులను శాఖా మంత్రికి ఉత్తరాలు వ్రాయడం, స్మృతి ఇరానీ గారు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాయడం ద్వారా వత్తిడి తీసుకొచ్చి ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయించడం. కేంద్ర మంత్రులు గానీ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని చెప్పబడుతున్న యూనివర్సిటీ వీ.సి. గానీ నిష్పాక్షికంగా వ్యవహరించక పోవడం తీవ్ర గర్హనీయం. ఆసా సంస్థ నాయకులను గూండాలుగా దూషించిన ఎ.బి.వి.పి.నాయకుడ్ని కూడా సస్పెండ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు.

పైపెచ్చు ఆసా కార్యకర్తలను జాతి ద్రోహులుగా ముద్ర వేయడం, శిక్షించడం,  సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం యూనివర్సిటీ యాజమాన్యం యొక్క బాధ్యతారాహిత్యానికి ప్రబల నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తమదేనన్న అహంభావంతో ఎ.బి.వి.పి.కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించడానికి అవకాశం కల్పించారనడంలో ఏలాంటి సందేహం లేదు.

 ఆధునిక సమాజంలో 'ఉరి శిక్ష' యొక్క హేతుబద్ధతను ప్రశ్నించడంతో మొదలైన ఘర్షణ, హిందుత్వ భావజాలం, కాషాయికరణ, అంబేద్కర్ భావజాలం, కుల వివక్షత తదితర అంశాలపై రెండు ప్రత్యర్థి విద్యార్థి సంస్థల మధ్య ఆరని చిచ్చులా మారిందనిపిస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేఛ్ఛ పరిథికి లోబడి ఆరోగ్యకరమైన చర్చ, నిరసన, ఆందోళన, ఉద్యమాలు నిర్వహించుకో గలిగితే సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. కారణాలేమైనా, అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో బాగా కొరవడినట్లు జరిగిన పరిణామాలను బట్టీ బోధపడుతున్నది.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కు గురై పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఒకడైన రీసర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమైన దుర్ఘటన. స్వభావరీత్యా రోహిత్ ఒక ఉత్తమ విద్యార్థి అని, అధ్యాపకుల పట్ల గౌరవ భావంతో సఖ్యతగా మెలిగే వాడని, జనరల్ క్యాటగరీలోనే సీటు సంపాదించుకొన్న నైపుణ్యం ఉన్న విద్యార్థి అని విన్నాను. అలాంటి విజ్ఞానవంతుడైన ఒక యువ రీసర్చ్ స్కాలర్ ను సమాజం కోల్పోవడం దురదృష్టకరం. రోహిత్ ఆత్మహత్య సభ్య సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యంపై  విమర్శలు వెల్లువెత్తాయి.ఈ పరిణామం సహజ సిద్ధమైనది. దాన్ని సమాజం కూడా అర్థం చేసుకోగలదు. ఈ తరహా ఆందోళనల నుండి సంకుచిత రాజకీయ లబ్ధి పొందాలనే వారు 'ఓవర్ యాక్షన్' చేస్తూ అసలు సమస్యను, వాస్తవాలను ప్రక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తారన్నది చరిత్ర నేర్పిన గుణపాఠం. అందుకే హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన, జరుగుతున్న ఘటనలపై కాస్త జాగ్రత్తగా ఆలోచించి, వాస్తవిక దృష్టితో సామాజిక న్యాయం కోసం, రెండు తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థకే ఆదర్శప్రాయంగా ఉండ వలసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో నిజంగా కుల వివక్షత వేళ్ళూనుకొని ఉంటే వాటిని పెకలించడానికి వామపక్ష, లౌకిక శక్తులు నడుం కట్టాల్సిందే. భావ ప్రకటనా స్వేఛ్ఛకు, ప్రజాస్వామ్య హక్కుల కోసం, సామాజిక మార్పు కోసం విద్యార్థులను చైతన్యపరచి, సంఘటితపరచి, ఉద్యమాలు నిర్వహించడానికి పూనుకోవాల్సిందే. ఆ కర్తవ్యం ఏల్ల వేళలా నిబద్ధత,సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష ఉద్యమంపై ఉన్నది. అదే సందర్భంలో కేవలం రాజకీయ కోణంతో, మనోభావాలు, ఉద్రేకాలపై ఆధారపడకుండా క్షేత్ర స్థాయి వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే వర్గ శతృవుకు ఆయుధం సమకూర్చినట్లవుతుంది. నాలుక కర్చుకోవలసిన పరిస్థితీ దాపురిస్తుంది.

Tuesday, January 19, 2016

దుమ్మగూడెం ప్రాజెక్టును గోదావరి,కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్మిస్తే విస్తృత ప్రయోజనాలు వనుగూడుతాయి.

20 టియంసిల వినియోగ లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ సాగర్, ఇందిరసాగర్(దుమ్మగూడెం మొదటి దశ, రెండవ దశ) ఎత్తిపోతల పథకాలను సమీకృత ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి నిర్మించడం ద్వారా 50 టియంసిల నీటిని తరలించి ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సముచితమైనదే!

గోదావరిలో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. మరింత ఎక్కువగా గోదావరి నీటిని వినియోగించుకోవడం ద్వారా నీటి ఎద్దడితో బాధపడుతున్న దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల దప్పిక తీర్చే విధంగా విశాల దృష్టితో ఆలోచించడం అవసరం.

కృష్ణా నదీ జలాలపై తీవ్రమైన వత్తిడి ఉన్నది. బ్రజేష్ కుమార్ ట్రిబునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. పర్యవసానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించుకొంటున్న ప్రాజెక్టులు నిరుపయోగంగా పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ట్రిబునల్ తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి అయ్యింది. కేసు విచారణలో ఉన్నది.

ఈ పూర్వరంగంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ పథకంలో అంతర్భాగంగా ప్రతిపాదిత దుమ్మగూడెం- నాగార్జునసాగర్ టేయిల్ పాండ్ పథకం  ముఖ్యమైనది. దీని ద్వారా 165 టియంసిల  గోదావరి నదీ జలాలను వినియోగించుకొనే అవకాశముంటుందని నిపుణుల అంచనా.  సాగర్ ఎడమ కాలువ క్రింది ఉన్న ఆయకట్టుకు అవసరమైన నీటి సరఫరా చేస్తూ కొంత నీటిని కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి తరలించి, సద్వినియోగం చేసుకోవాలన్నది లక్ష్యం. కారణాలేమైనా ఈ పథకాన్ని తెలంగాణా ప్రభుత్వం గతంలో వ్యతిరేకించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంపై హెచ్.యం.టీ.వి. నిర్వహించిన చర్చలో పాల్గొన్న నేను దుమ్మగూడెం పథకాన్ని ఖమ్మం జిల్లా వరకే పరిమతం చేయకుండా ప్రతిపాదిత దుమ్మగూడెం- సాగర్ టేయిల్ పాండ్ గా నిర్మిస్తే మరింత విస్తృత ప్రయోజనాలు సమకూరుతాయని, మహబూబ్ నగర్ జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న కల్వకుర్తి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకాలకు, నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి.కి, నూతనంగా నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత విషయంలో వెసులుబాటు వస్తుంది కదా! అని చర్చలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావును కోరాను.

గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా తరలించి తెలంగాణ నీటి అవసరాలను  తీర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదిస్తే చర్చించడానికి సిద్ధమేనని సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చొరవ చేసి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడం ద్వారా దుమ్మగూడెం- సాగర్ టేయిల్ పాండ్ పథకాన్ని సాకల్యం చేస్తే ఇటు దక్షిణ తెలంగాణతో పాటు నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఊరట కలుగుతుంది.

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే తెలుగు నాట నీటి సమస్యకు కొంత మేరకైనా శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

హెచ్.యం.టీ.వి.లో జరిగిన చర్చకు సంబంధించిన యూట్యూబ్ లింక్:
 https://youtu.be/rR_ln5BatcA

Monday, January 18, 2016

క్యూడ్ ఆయిల్ ధరలు తగ్గినా! ఆ నిష్పత్తిలో పెట్రోల్, డీజిల్ ధరలెందుకు తగ్గడం లేదు

సరళీకృత ఆర్థిక విధానాల అమలులో భాగంగా చమురు ఉత్ఫత్తులను మార్కెట్ శక్తులకు అప్పజెప్పారు. మొదట పెట్రోల్, తరువాత డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించారు. అంతర్జాతీయ మార్కెట్ లో  క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తదనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం నమ్మబలికింది. నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయిన తరువాత 2014 జూన్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్లు, క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ నేటికి 30 డాలర్లలకు పడిపోయింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. కారణం, కేంద్ర ప్రభుత్వ మాట తప్పింది. సెంట్రల్ ఎక్సజ్ డ్యూటీని 8 సార్లు పెంచింది. పర్యవసానంగా వినియోగదారుల జోబులు కోట్టుడుతున్నది. సెంట్రల్ ఎక్సజ్ డ్యూటీని పెంచకపోతే లీటరు పెట్రోల్ పై రు.10.77 పై.డీజిల్ పై రు.11.97 పై.తగ్గేది. ఎక్సజ్ డ్యూటిని పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ పై 2014-15 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రు.38,578 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యిందని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నుండి నాలుగు సార్లు పెంచారు. తాజాగా ఈ నెల 15న మళ్ళీ పెంచారు. తద్వారా అదనంగా మరో రు.13,700 కోట్లు ప్రభుత్వ ఖజానాకు పోగేసుకోబోతున్నారని అంచనా. ఇలా వినియోగదారులకు లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకొంటుంటే, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో పిండుకొంటున్నాయి. పెట్రోల్ పై 35.2%, డీజిల్ పై 27% అమ్మకపు పన్ను భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. డీజల్ ధర తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్భణానికి కళ్ళెం వేస్తామని ప్రగల్బాలు పలికిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయి.