Sunday, October 26, 2014

శ్రీశైలం జల వినియోగం - విద్యుదుత్పత్తి వివాదం


విద్యుదుత్పత్తి కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించబడిందని, జలాశయంలో నీటి మట్టం 834 అడుగులకు పడిపోయే వరకు విద్యుదుత్పత్తిని కొనసాగించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శబధం చేశారు. రోజు రోజుకూ తీవ్రమవుతున్న‌విద్యుత్ సంక్షోభంతో తెలంగాణ ప్రజలు, పారిశ్రామిక రంగం, ప్రత్యేకించి రైతాంగం అసంతృప్తితో అట్టుడికి పోతున్నారు. పెల్లుబుకుతున్న అసంతృప్తిని ప్రత్యర్థులపైకి మళ్ళించే ప్రయత్నంలో భాగంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఊపిరులూదుతున్న బ్రహ్మాస్త్రం లాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిట్లదండకాన్నిమొదలుపెట్టి సంస్కారహీనమైన పదజాలాన్ని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రయోగించడం ద్వారా విమర్శలకు గురైనారు. వాదనలో పటుత్వం లేని వారే తిట్లదండకాన్ని లంకించుకొంటారని నానుడి. విడిపోయి ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుదాం! అని రాష్ట్ర విభజనకు ముందు చిలక పలుకులు పలికిన‌ కె.సి.ఆర్. రోజుకొక వివాదంతో వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నారు. తాజాగా శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.నెం.69, 107 లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఎడమ గట్టు కాలువ‌ జల విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తిని కొనసాగించడం వివాదానికి తెరలేపింది. ఈ వివాదం అనూహ్యమైనదేమీ కాదు. ఈ తరహా వివాదాలకు రాష్ట్ర విభజన ఆజ్యం పోసింది. తెలుగు జాతి మధ్య విద్వేషాలను ఆరనిచిచ్చులా కొనసాగించడంపైనే తమ‌ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని టి.ఆర్.యస్. అధినాయకత్వం భావిస్తున్నట్లుంది. పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు జఠిలంగా మారుతున్నాయి.
తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు క్రిష్ణా నదీ జలాలను తరలించే నీటి పారుదల వ్యవస్థకు శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. క్రిష్ణా జలాల పంపకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన‌ తీర్పును తిరగదోడే అవకాశం లేదు. అందుకే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నీటి లభ్యతను 65% ప్రామాణికంగా తీసుకొని అదనంగా లభిస్తాయని అంచనా వేసిన నీటిని, ఆపైన లభించే మిగులు జలాలను మాత్రమే అంచనా వేసి నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఆ తీర్పు వల్ల‌ మనకు తీవ్ర నష్టం వాటిల్ల నుండడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణానంతరం అత్యున్నత న్యాయస్థానం వెల్లడించే తీర్పు అందరికీ శిరోధార్యంగా ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా శ్రీశైలం జలాశయం వద్ద నీటి నిల్వ, నిర్వహణ, వినియోగంపై ప్రస్తుతం అమలులో ఉన్న‌ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించక పోతే నీటి యుద్ధాలు తప్పక‌ పోవచ్చు. రాష్ట్ర విభజన చట్టం నిర్ధేశించిన మేరకు కేంద్ర ప్రభుత్వం క్రిష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు ప్రభుత్వాలు నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ‍ం ఆ బోర్డు మాటను కూడా లెక్కచేయమన్నట్లు వ్యవహరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో! వేచి చూడాలి. విద్యుత్ సరఫరా విషయంలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చు తప్పులేదు. కానీ శ్రీశైలం జలాశయం నీటి వినియోగానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తానంటే సమర్థనీయం కాదు.
రాయలసీమ బలిపశువు: శ్రీశైలంపై మాకే హక్కున్నదనే పెద్ద మనుషులు ఆ జలాశయం నిర్మాణ‍ం వెనుక దాగి ఉన్న‌చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. నిత్యకరవులతో జీవన్మరణ పోరాటం చేస్తున్న‌ రాయలసీమ ప్రజానీకం బతుకులతో రాజకీయ వ్యవస్థ ఆటలాడుకొంటున్నది. వెనుకబడ్డ రాయలసీమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ సందర్భంలో 1937 సం.లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం 'శ్రీబాగ్ ఒడంబడిక‌' కాలగర్భంలో కలిసి పోయింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన‌ కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు ఆ ప్రాజెక్టు మూలంగా నష్టం జరుగుతుందని చెప్పి అడ్డుకొన్నారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి రాయల‌సీమకు న్యాయం చేస్తామని నమ్మబలికి ఆ ప్రాంతాన్ని కరవు కాటకాలకు నిలయంగా మార్చేశారు. సిద్ధేశ్వరం బదులు శ్రీశైలం జలాశయాన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుగా నిర్మించి తీరని ద్రోహం చేశారు.
ప్రజాందోళనకు తలవొగ్గి రాయలసీమకు జరిగిన అన్యాయాన్నికొంత మేరకైనా సరిదిద్దడానికి శ్రీశైలం జలాశయాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్పు చేశారు. శ్రీశైలం జలాశయం నిర్మాణానికి ముందు, తరువాత జరిగిన‌ చరిత్ర తెలయని లేదా గుర్తించ నిరాకరిస్తున్న వారు శ్రీశైలం జలాశయం నిర్మాణమే విద్యుదుత్పాదన కోసమేనని ఇంకా అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఆ వాదననే అంగీకరిస్తే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(యస్.యల్.బి.సి.), కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల‌ ద్వారా శ్రీశైలం జలాశయం నుండి సాగు నీటినెలా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తరలిస్తారు? రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలించే హక్కు లేదని వితండవాదం చేసే వారు విజ్ఞతతో ఆలోచించాలి. తాజా వివాదాన్ని విస్తృతం చేయకుండా బాధ్యతాయుతంగా, రాగద్వేషాలకు అతీతంగా, సంకుచిత‌ రాజకీయాలను పక్కకునెట్టి ఆలోచించాలి.
తెలుగు జాతి రెండు ముక్కలవుతుందని నాడు ఎవరూ ఊహించలేదు. కానీ ప్రాంతాల మధ్య విద్వేషాలకు, వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలనే సదుద్ధేశంతోనే 1996 జూన్ 15న‌ జి.ఓ.నెం.69ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అందులో శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమం నిర్ధేశించబడింది. 1) జలాశయంలో 875 అడుగుల నీటి మట్టం ఉన్నసమయంలో జూలై నుండి అక్టోబరు మాసాల మధ్య నెలకు 3.75 టి.యంం.సి. ల చొప్పున మద్రాసుకు 15 టి.యం.సి.ల‌ త్రాగునీటిని సరఫరా చేయాలి. కరవు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాలలో వరదలొచ్చినప్పుడు నీటిని విడుదల చేసి సర్దుబాటు చేయాలి. 2) హైదరాబాదుకు త్రాగు నీరు. 3) శ్రీశైలం జలాశయానికి కుడి వైపునున్న జల విద్యుత్ కేంద్రం నుండి విద్యుదుత్పత్తి. 4) కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల. 5) ప్రకాశం ఆనకట్ట క్రింద సాగునీటి అవసరాన్ని బట్టి నాగార్జున సాగర్ జలాశయం వద్ద జల విద్యుదుత్పాదనకు అనుమతి. 6) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) ఆయకట్టుకు సాగునీరు. 7) తెలుగు గంగకు సాగునీరు. 8) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (యస్.యల్.బి.సి.) ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలి.
శ్రీశైలం జలాశయం వద్ద నీటి విడుదలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను ఆ జి.ఓ.లో పొందుపరచారు. నాగార్జునసాగర్ జలాశయం వద్ద నీటి అవసరాన్ని బట్టి శ్రీశైలం జలాశయం నుండి నీటిని విడుదల చేయాలి. నాగార్జునసాగర్ జలాశయంలో సరిపడా నీరున్నప్పుడు శ్రీశైలం జలాశయం నుండి క్రిందికి నీటిని విడుదల చేయకూడదు. అలాగే 834 అడుగుల నీటి మట్టానికి క్రింద అనివార్యమైతే త్రాగు నీటికి తప్ప శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదలపై ఆ జి.ఓ.లో నిషేధం విధించబడింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటే దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లుగా భావించాలని పేర్కొన్నారు. 854 అడుగులకుపైన నీటి మట్టం ఉంటేగానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నయ్ నగరానికి 15 టి.యం.సి.ల త్రాగునీటిని, రాయలసీమలోని యస్.ఆర్.బి.సి.(19 టి.యం.సి.ల నికరజలాలు), కె.సి.కెనాల్(10 టి.యం.సి.ల నికరజలాలు), తెలుగు గంగ(29 టి.యం.సి.ల మిగులు జలాలు), గాలేరు_నగరి(38 టి.యం.సి.ల మిగులు జలాలు) ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేరు. అంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్నిపరిరక్షించాలి. ఆ కారణంగానే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో తీసుకొన్న ఏకగ్రీవ తీర్మానం మేరకు జి.ఓ.నెం.107ను 2004 సెప్టంబరు 28న జారీ చేసింది. ఈ వాస్తవాన్నిగుర్తుంచుకోవాలి.
విద్యుదుత్పాదనపై వివాదం: జల విద్యుదుత్పాదనకు సంబంధించి కూడా జి.ఓ.నెం.69లో విస్పష్టమైన నిబంధనలను పేర్కొన్నారు. జలాశయంలో 885 అడుగులకు నీటి మట్టం చేరుకొన్నప్పుడు కుడి వైపునున్న జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తికి నీటిని వదలాలి. నదీ ప్రవాహాన్ని బట్టి ఎడమ వైపునున్న‌"పంప్ స్టోరేజ్ సిస్టం" ద్వారా విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయాలి. "పంప్ స్టోరేజ్ సిస్టం" ద్వారా జూలై - అక్టోబరు మాసాల మధ్య కాలంలో మాత్రమే విద్యుదుత్పత్తికి అనుమతించబడింది. ఈ విధానంలో విద్యుత్తుకు ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో జలాశయం నుండి నీటిని వినియోగించుకొని విద్యుదుత్పత్తి చేసుకొని, విద్యుత్తుకు తక్కువ డిమాండ్ ఉన్న సమయంలో(రాత్రిపూట) తిరిగి నీటిని జలాశయంలోకి పంప్ చేయాలి. నాగార్జున సాగర్ జలాశయం వద్ద విద్యుదుత్పాదన యాదృచ్చికమైన చర్య మాత్రమే. ప్రకాశం బ్యారేజి వద్ద నీటి అవసారాలకు అనుగుణంగా మాత్రమే నాగార్జున‌ సాగర్ నుండి నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేసుకోవాలి. అలాగే సాగర్ జలాశయం పూర్తిగా నిండిన తరువాత కూడా నదీ ప్రవాహం ఉంటే ఉత్పత్తి చేసుకోవచ్చు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం తరువాత కొంత వెసులుబాటు వచ్చింది. సాగర్ వద్ద విద్యుదుత్పాదనకు వినియోగించుకొన్న నీటిని పులిచింతల జలాశయంలో నిల్వ చేసుకొనె సౌలభ్యం సమకూరింది. జలాశయం  నీటి నిల్వ సామర్థ్యం 43.7 టి.యం.సి.లు.  ప్రస్తుత‍ 20 టి.యం.సి.లకు పైగా నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నాముంపు ప్రాంతాల ప్రజానీకానికి పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు వంటి సమస్యలు అపరిష్కృతంగా కొనసాగుతున్న కారణంగా 10 టి.యం.సి.లకు మించి నిల్వ చేయడానికి వీలుకాని పరిస్థితి ఉన్నది. ఆ మేరకు ఇప్పుడు నీరు నిల్వ ఉన్నది. ప్రకాశం బ్యారేజిలోనూ నిల్వ సామర్థ్యం(3.7 టి.యం.సి.) మేరకు నీరున్నది. పర్యవసానంగా సాగర్ వద్ద విద్యుదుత్పానకు వినియోగించే నీరు వృథాగా సముద్రం పాలౌతున్నది.
తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభం నుండి ఉపశ‌మనం పొందడానికి ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించాలే గానీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లఘించి శ్రీశైలం జలాశయం వద్ద విద్యుదుత్పాదనను కొనసాగించడం వివాదాలకు ఆజ్యం పోయడమే అవుతుంది. ఈ సమస్య ఇక్కడతో ఆగదు. విద్యుత్ సమస్య ఉన్నది కాబట్టి శ్రీశైలం వద్ద జలవిద్యుదుత్పత్తిని కొనసాగించి తీరుతామని బీకరాలు పలుకుతూ శ్రీశైలంపై తెలంగాణ‌ వారికే హక్కున్నట్లు మాట్లాడుతున్నారు. ఈ వైఖరి ప్రమాదకరమైనది.
జి.ఓ.నెం.69 విడుదలైన నాటికి కల్వకుర్తి, హంద్రీ -నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో లేవు, కాబట్టి వాటి ప్రస్తావన ఆ జి.ఓ.లో లేదు. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి  805 అడుగుల‌ యం.డి.డి.యల్. మరియు యస్.యల్.బి.సి.కి 824 అడుగుల నీటి మట్టం నుండే నీటిని తరలించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. అంటే జి.ఓ. నెం.69, 107 లను ఖాతరు చేయకుండా నీటిని తోడేస్తే దుష్పరిణామాలెలా ఉంటాయో! ఊహించడం అసాధ్యం. క్రిష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, తక్షణం జోక్యం చేసుకొని శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి. లేకపోతే విపత్కర పరిణామాలకు ఆస్కారం ఇచ్చిన వారవుతారు. సాధారణ వర్ష పాతం మాత్రమే నమోదైన సంవత్సరాలలో చెన్నయ్ నగరానికి త్రాగు నీరు, కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు, యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్ కు నికరజలాలు గానీ, తెలుగు గంగకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన‌ 25 టి.యం.సి.లు అందుతాయా! అన్నసందేహాలు ఆ ప్రాంత ప్రజల్లో రేకెత్తుతున్నాయి. అలాగే మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న‌ హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు శాశ్వతంగా మూలనపడతాయని భయాందోళనలు వ్యక్తఅవుతున్నాయి.
రైతుల కరెంటు బాధలు తీర్చేందుకే శ్రీశైలం జలాశయం వద్ద విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పడం ద్వారా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తరువాత కూడా తెలుగు ప్రజల‌ మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణం. తెలంగాణ రైతాంగానికి విద్యుత్తును సరఫరా చేయాలి, పంటలను కాపాడాలి, రైతుల ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేయాలి. దీని కోసం రెండు ప్రభుత్వాల మధ్య‌ సమన్వయం, సహకారం అనివార్యం. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా తోడ్పడాలి. వివాదాలు, విద్వేషాలు, తిట్లు సమస్యలకు పరిష్కారం చూపకపోగా జఠిలం చేస్తాయి. అధికారంలో ఉన్న వారు విజ్ఞత ప్రదర్శించాలి.

Wednesday, October 15, 2014

రుణమాఫీ చుట్టూ రాజకీయం! ప్రచురణ: అక్టోబరు 15, 2014 సూర్య దినపత్రిక‌

 తెలుగు నాట ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. రాష్ట్ర‌ విభజనానంతరం అభివృద్ధిలో తెలంగాణ ఉరకలు పరుగులు తీస్తుందని ఉద్యమకారులు అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టారు. అప్పులను జనాభా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ కు 58%, తెలంగాణాకు 42% చొప్పున‌ పంచి, విద్యుత్తును మాత్రం వినియోగం ప్రాతిపదికన  ఆంధ్రప్రదేశ్ కు 48%, తెలంగాణాకు 52% చొప్పున‌ పంచారు. అయినా విద్యుత్తు సమస్యతో తెలంగాణా విలవిల్లాడి పోతున్నది. రాష్ట్ర రెవెన్యూ ఆదాయం కూడా 42%కు పడిపోతుందనే అనుమానాన్ని 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో తెలంగాణా ప్రభుత్వం వ్యక్తం చేసింది. పదమూడు జిల్లాలతో కూడిన‌ నేటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక‌ దుస్థితి వర్ణనాతీతం. రాష్ట్ర విభజనను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకం కోరుకోలేదు. వారిపై నిరంకుశంగా రుద్దబడింది. విభజనతో కుంగిపోయిన ప్రజానీకం మనోధైర్యాన్ని కూడగట్టుకొని ప్రతికూల పరిస్థితులను సవాలుగా స్వీకరించి అభివృద్ధి చెందాలనే పట్టుదలతో ఉన్నట్లు కనబడుతున్నది. ఈ సానుకూలాంశమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కాస్తా బరోసా ఇస్తున్నది. కానీ, రాష్ట్ర విభజనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములైన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న దివాలాకోరు  విధానాలు ఆ రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా తయారవుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని తీవ్రసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న‌ఈ రంగాన్ని కాపాడుకొని ఆహారభద్రతను పరిరక్షించుకోవడమెలా! అన్నదే జాతి ముందున్న అతిపెద్ద సవాలు.
రుణమాఫీ - హేతుబద్ధత: జాతీయ స్థూల ఉత్ఫత్తి(జి.డి.పి.)లో 13.7%(2012-13) వాటానే ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయo, దాని అనుబంధ రంగాలు జీవనాడి. ఉపాథి కల్పనలో వీటి వాటా 60% పైగానే ఉన్నది. నూట ఇరవై కోట్ల దేశ జనాభాకు అవసరమైన వ్యవసాయ‌ ఉత్ఫత్తులను చేస్తూ రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకపోయి విలవిల్లాడి పోతున్నారు. వరుసగా సంబవిస్తున్న‌ ప్రకృతి వైపరీత్యాలు కోలుకోని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఇన్ పుట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ ఉత్ఫత్తులకు లాభసాటి ధరల మాట అటుంచి పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి చేతికిరాని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. మార్కెట్ మాయాజాలంలో రైతాంగం తీవ్ర దోపిడీకి గురౌతున్నది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వాలు కాగితాలకే పరిమితం చేశాయి. పర్యవసానంగా అన్నదాతలు దివాలా తీసి దేశ వ్యాపితంగా లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకొన్నారు. సేద్యం అటకెక్కింది. ఆహార భద్రత ప్రమాదంలో పడుతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. వినియోగదారులు నిలువు దోపిడీకి గురౌతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగాన్నిరుణ విముక్తుల్ని చేయడమన్నది దేశ విస్తృత‌ ప్రయోజనాలు, ఆహార భద్రతతో ముడిపడిన అంశంగా అందరూ పరిగణించాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకాన్ని ఈ కోణంలో ఆలోచించాలి.
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మరొక‌ రంగం చేనేత. చేనేత కార్మికుల‌ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అసంఘటిత రంగ‍ంలోని చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకొని, ప్రత్యామ్నాయ ఉపాథి అవకాశాలను కల్పించాల్సిన‌ బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ అంశం చుట్టూ నేడు తెలుగు నాట రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు ఈ సమస్యను అడ్డంపెట్టుకొని సంకుచిత రాజకీయ ప్రయోజనాలు పొందాలని నిర్లజ్జగా ప్రయత్నిస్తున్నాయి. ఏ రుణమాఫీ పథకాన్నైనా ఉపాథి, ఉత్పత్తితో అనుసంధానం చేసి అమలు చేస్తే సత్ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు వనగూడుతాయి. మరీ ప్రత్యేకించి అడ్డగోలు విభజనతో ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసే ప్రతి రూపాయి అత్యంత విలువైనది. అనుత్పాదక రంగాలకు, అన‌ర్హులకు లబ్ధి చేకూర్చే వ్యయాన్ని బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదు. ఆర్థిక విధానాల అమలులో రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలే గీటు రాయిగా పరిగణించబడాలి.
ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న‌ సమస్యలపైన జాతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సముచితంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆశించడం దురాశే అవుతుంది. రుణాల మాఫీ అంశాన్నే తీసుకొందాం. తెలుగు నాట రుణాలను మాఫీ చేయాలంటున్న జాతీయ రాజకీయ పార్టీలు దేశ వ్యాపితంగా కూడా మాఫీ చేయాలని మాట వరసకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. పైపెచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉంటూ ఒక జాతీయ విధానమంటూ లేకుండా తెలుగు ప్రజలను నిరంకుశత్వంతో విభజించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రజల‌ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఆ పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీపై మాట్లాడుతుంటే అసహ్యమేస్తున్నది. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైఖరిని కాస్తా అర్థం చేసుకోవచ్చు. కారణం రుణమాఫీ అమలు అసాధ్యమని భావించి ఎన్నికల్లో వాగ్ధానం చేయలేదని ఆ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది. ఓటమికి ఇతర కారణాలున్నా రుణమాఫీ వాగ్ధానం చేయక పోవడం మూలంగా నష్టపోయామన్న‌ భావనకు ఆ పార్టీ శ్రేణులు వచ్చాయి. దాంతో ఎన్నికల వాగ్ధానానికి కట్టుబడి తూఛా తప్పకుండా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా పాలక పార్టీని ఎండగట్టాలనే ప్రయత్నం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో శాసనసభలో ఏకైక‌ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్టమైన‌ సమస్యలపై కూడా దృష్టి సారిస్తే కష్టాల్లో ఉన్న‌ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయక పోతే పాలక పార్టీలైన‌ తెలుగు దేశం, భాజపాలను నిలదీసే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉన్నది. అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన‌ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నైతిక హక్కును కోల్పోయింది. విభజనను సమర్థించిన భాజపా నేతృత్వంలోని యన్.డి.ఎ. ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలుపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో వారూ భాగస్వాములే. మరి కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత వారికి లేదా?
అందరూ అర్హులేనా?: ప్రజల సొమ్మును ఖర్చు చేసే ప్రభుత్వ‌ పథకాల అమలుపై అన్ని రాజకీయ పార్టీలు హేతుబద్ధంగా ఆలోచించాల్సిన బాధ్యతను విస్మరించకూడదు. విభజనను బలపరిచిన, వ్యతిరేకించినట్లు నటించిన పార్టీల నాయకత్వాలుగానీ నేడు విజ్ఞతతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, సమగ్రాభివృద్ధికి దోహదపడే విధానాలు, పథకాల అమలు కోసం ప్రభుత్వంపై వత్తిడి చేస్తే సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళవుతారు. ఆ కోణంలో రుణమాఫీ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించాలి. అర్హులైన రైతులందరినీ రుణ విముక్తులను చేయాల్సిందే. అర్హులంటే ఎవరు? అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలిద్దాం! రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలోనే ఉంటుందని శాసనసభలో తీర్మానం చేశారు. దాంతో ఒక్కసారిగా భూముల స్వభావం మారిపోయింది. సాగు భూమి వాణిజ్య భూమిగా రూపాంతరం చెందుతున్నది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో రాజధాని ప్రాంత పరిథిలోకి వస్తాయన్న మండలాలలోని భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ సమస్య‌ కూడా రోజు రోజుకూ జఠిలమవుతున్నది. ఎకరా భూమి కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఆ భూ యజమానులకు కూడా రుణమాఫీ ప్రయోజనాన్ని అందించడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? కొందరు భూ యజమానులు భూములను కౌలుకిచ్చి యజమాన్య హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తనఖాపెట్టి పంట రుణాలు తీసుకొని, ఆ డబ్బును వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలలో పెట్టుబడిగా మార్చుకొన్న వారూ లేక పోలేదు. మ‌రికొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు బ్యాంకు అధికారుల‌ చేతులు తడిపి ఒకే భూమిపై రెండు మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్న ఘరానా పెద్ద మనుషులూ  లేకపోలేదు. ఇలాంటి వారందరికీ రైతు రుణమాఫీ క్రింద ప్రజాధనాన్ని వెచ్చించాలని కోరడం సమర్థనీయమా? చంద్రబాబునాయుడు అందరికీ రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఈవాళ కాస్తా మాట మార్చి ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర వరకే రుణమాఫీ అని, రిజర్వు బ్యాంకు మరియు రుణాలిచ్చిన‌ వాణిజ్య బ్యాంకులు రుణమాఫీ పథకానికి సహకరించడం లేదు కాబట్టి రుణమాఫీ కాదు, దశల వారిగా రుణ విముక్తులను చేస్తానని పిల్లిమొగ్గలు వేస్తున్న మాటా వాస్తవమే. రైతు సాధికార సంస్థను నెలకొల్పి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తానని సరికొత్త పల్లవి అందుకొన్నారు. కానీ, ఎన్నికల వాగ్ధానం చేశారు కాబట్టి చచ్చినట్లు అందరికీ అమలు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి మేలు జరుగుతుందా! కీడు జరుగుతుందా! అన్న అంశాన్ని హేతుబద్ధంగా ఆలోచించాలి.
టిడిపి చేసిన ఎన్నికల  వాగ్ధానం మేరకు రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాన్నిఅమలు చేయాలంటే లక్ష‌ కోట్ల రూపాయలకు పైగా కావాలసి ఉంటుందని ఒక దశలో అంచనా వేశారు. రుణాలిచ్చిన బ్యాంకులు దివాలా తీస్తామని సహాయ నిరాకరణకు పూనుకొన్నాయి. రుణాలిచ్చిన బ్యాంకులన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. కార్పోరేట్ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు లక్షలాది కోట్ల రూపాయల రాయితీలిస్తున్న‌ కేంద్ర ప్రభుత్వం అన్నదాతల రుణమాఫీ అంశం వచ్చే సరికి మౌనమే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన‌ విధాన ప్రకటన ప్రకారం ఒక్కోక్క రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయలన్నా రు.45,000 కోట్లు కావాలంటున్నారు. నిజమైన లబ్ధిదారుల సంఖ్య తేలితే తప్ప రుణమాఫీ పథకం భారమెంతో తేలదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూద్దామా అధ్వాన్నంగా ఉన్నది. 2014-15 సం. వార్షిక బడ్జెటులో కేవలం ఐదు వేల కోట్లను రైతు రుణమాఫీకి  కేటాయించారు. నిల్వ ఉన్న‌ఎర్రచందనం దుంగలను వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ఈ పథకానికి వెచ్చిస్తామని చెప్పి చతికిల పడ్డారు. ఇప్పుడేమో 20% నిథులను మంజూరు చేసి రైతు సాధికార సంస్థ ద్వారా మొదటి దశలోను, మిగిలిన మొత్తాన్ని నాలుగు సంవత్సరాలలో విడతల వారిగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా ఈ పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చి  రైతాంగాన్ని నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వంగానీ, రాజకీయ పార్టీలుగానీ నిజాయితీగా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్నది.  విభజన చట్టం మేరకు జనాభా ప్రాతిపదికన రు.92,000 కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్రంపై పడింది. దానికి తోడు 2014-15 వార్షిక బడ్జెట్ లో ప్రస్తావించిన ప్రకారం రు.15,505 కోట్లను బహిరంగ మార్కెట్ నుండి రుణాలను సేకరించబోతున్నారు. అంటే మొత్తంగా రు.1,10,634 కోట్లకుపైగా రాష్ట్రానికి రుణ భారం ఉన్నట్లు బడ్జెట్ పత్రాలలో తేల్చారు. ఇది చాలదన్నట్లు ప్రణాళికేతర వ్యయాన్ని మరింత పెంచే వైపు వాగ్ధానాలు చేస్తూ పోతున్నారు. మరొకవైపు సొంత వనరుల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయం రు.37,398 కోట్లు మాత్రమేనని బడ్జెట్ లో అంచనా వేశారు. ఈ పూర్వరంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడం, ఆశలు రేకెత్తించి నిరాశపరచడం సమంజసం కాదు. రుణమాఫీ పథకానికి అర్హులైన‌  లబ్ధిదారుల ఎంపికే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పట్ల అంకిత భావంతో వ్యవహరిస్తాయని ఆశిద్ధాం!                                                                                                                                                                                   

                                                                                                                                   

Tuesday, October 7, 2014

సిద్ధాంతమా, స్వప్రయోజనమా!




ప్రచురణ: సూర్యా దినపత్రిక, అక్టోబరు 7,2014

దేశ రాజకీయాలు స్వప్రయోజనాల చుట్టే పరిభ్రమిస్తున్నాయి. సంకీర్ణ రాజకీయాలలో సిద్ధాంతాలు, రాజకీయ విధానాల ప్రాతిపతికపై రాజకీయ కూటములు ఏర్పడడానికి బదులు ఆయా పార్టీల అవసరార్థం ఏర్పడుతున్నాయి. కూటమిలోని రెండు పార్టీలు సమఉజ్జీవులుగా ఉంటే ఆ కూటమిపై ఎవరిది పెత్తనం అన్న అంశం వివాదాస్పదమై అంత్యమంగా విచ్ఛిన్నమైపోతున్నది.  మహారాష్ట్ర శాసనసభకు ఈనెల 15న జరుగనున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై శివసేన - భారతీయ జనతా పార్టీల మధ్య పొడచూపిన విభేదాలు అంతిమంగా వారి మధ్య ఇరవై అయిదు(1989 - 2014) సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహ బంధాన్ని తెంచేశాయి. రెండు పార్టీల భావజాలం హిందుత్వమే. ఆ కారణంగానే వాటి మధ్య‌ సుదీర్ఘ కాలం పాటు మిత్రత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. కానీ, తాజా పరిణామాన్ని పరిశీలిస్తే భావజాలాని కంటే ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలన్న అంశమే పై చేయి సాధించింది. మహారాష్ట్ర శాసనసభలో ఉన్న‌ 288 స్థానాలకుగాను 151 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కూటమిపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని శివసేన పట్టువిడుపులులేని వైఖరిని ప్రదర్శించింది. శివసేన ఆధిపత్యానికి గండికొట్టాలని ప్రయత్నించిన భాజపా విఫలం చెంది స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చారిష్మా మహారాష్ట్రలో అధికారాన్ని సంపాదించి పెడుతుందన్న కొండంత ఆశతో శివసేనకు భాజపా 'గుడ్ బై' చెప్పేసింది. అధికారం కోసం జరుగుతున్న పోరులో హిందుత్వ బంధం తృణప్రాయంగా తెగిపోయింది.
ఈ రాజకీయ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని అంశాలను గమనించవచ్చు. నేడు దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. హిందుత్వ భావజాలం పునాదులపై భాజపా_శివసేన పార్టీలు కూటమిగా ఏర్పడి రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగి ఇప్పుడు చిన్నాభిన్నమయ్యింది. తద్వారా రాజకీయ కూటముల‌ ఉనికిపై చర్చకు తెర లేపినట్లయ్యింది. దీనికి కొంత నేపథ్యం కూడా ఉన్నది. రాష్ట్రాలలోనే కాదు కేంద్రంలో కూడా రెండు దశాబ్దాలకుపైగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. 2014 మే మాసంలో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సాధారణ మెజారిటీ రాక పోవచ్చని, మిత్రులపై ఆధారపడే పరిస్థితి అనివార్య‌oగా నెలకొంటుందన్న చాలా మంది అంచనాలు తారుమారైనాయి. భాజపా అనూహ్యమైన ఫలితాలను సాధించి నరేంద్ర మోడీ నేతృత్వంలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆధిక్యతను సాధించుకొన్నది. అయినప్పటికీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్రపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్నే మోడీ ఏర్పాటు చేశారు. కానీ, మిత్రపక్షాల మాట అంత చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొని ఉన్నది. తన కనుసైగలతో ప్రధాన మంత్రి మోడీ కేంద్ర ప్రభుత్వాన్నినడిపిస్తున్నారు. అలాగే  అత్యంత‌ శక్తిమంతుడుగా భాజపా శ్రేణుల చేత మోడీ కీర్తించబడుతున్నారు. సొంత పార్టీలో తిరుగులేని నాయకుడుగా ఆవిర్భవించి, అంతా తానై పార్టీ యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాను పార్టీ అధ్యక్షుడుగా నియమింపజేసుకొన్నారు.
దృక్పథంలో మార్పు: సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి, కేంద్రంలో అధికారంలోకి వచ్చినా భాజపాకు ఉన్న బలం, బలహీనతలు పట్ల‌ ఆ పార్టీ నాయకత్వానికి, ప్రత్యేకించి దాని మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.)కు స్పష్టంగా తెలుసు. అందుకే నరేంద్ర మోడీ చారిష్మా ఆవిరై పోక ముందే పార్టీని దేశ నలుమూలలకు నిర్మాణాన్ని విస్తరించుకొని రాజకీయ లబ్ధి పొందాలని భాజపా నాయకత్వం ఉవ్విళ్ళూరుతున్నది. ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణమే. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. కాకపోతే హిందుత్వ భావజాలానికే కట్టుబడిన‌ శివసేనను సహితం బలహీనపరచడం ద్వారా మహారాష్ట్రలో తాము ఆధిపత్యంలోకి రావాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేసి అమలు చేయడమే ఆశ్చర్యకరమైనది. కాబట్టే దీన్ని ఒక‌ సాధారణమైన రాజకీయ పరిణామంగా పరిగణించలేము. భాజపా అనుసరిస్తున్న వైఖరి పర్యవసానంగా భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలు సంబవిస్తాయో! వేచి చూడాలి.
భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్.డి.ఎ.)లో శివసేన రెండవ పెద్ద పార్టీ. ఆ పార్టీకి లోక్ సభలో 18 మంది సభ్యులు, రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. భాజపాకు లోక్ సభలో సాధారణ మెజారిటీ ఉన్నది. ఆ పార్టీ మరొక పార్టీపై ఆధారపడి లేదు. కానీ, నాలుగు మాసాలు కూడా గడవక ముందే ఎన్.డి.ఎ.లో భాగస్వామ్య‌ పార్టీలుగా ఉన్న భాజపా, శివసేనలు మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న‌ తమ ఏకైక కేంద్ర మంత్రి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రకటించిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కాస్తా వెనక్కి తగ్గి మోడీతో సంప్రదించాకే తుది నిర్ణయం తీసుకొంటామని సెలవిచ్చారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంబంధిత మంత్రి ప్రకటించారు. దీన్ని బట్టి శివసేన అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నట్లు కనబడుతున్నది. మంత్రితో రాజీనామా చేయించి మోడీ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు కొనసాగిస్తారన్న ఊహాగానాల వార్తలు ప్రసారమాధ్యమాలలో వచ్చాయి. శివసేన నిర్ణయం ఎలా ఉన్నా ఎన్.డి.ఎ. మిత్రపక్షాల మధ్య వచ్చిన ఈ చీలిక ప్రభావం ఏదో ఒక మేరకు ఉంటుంది. రాజ్యసభలో మైనారిటీలో ఉన్నప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు.
 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో భాజపా ఆలోచనా విధానంలో కొట్టొచ్చినట్లు మార్పు కనపడుతున్నది. భాజపా ఉనికి లేని లేదా బలహీనంగా ఉన్న లేదా మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలకు 'జూనియర్ పార్ట్నర్' గా ఉన్న రాష్ట్రాలలో విస్తరించడానికి, బలోపేతం కావడానికి ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్న ధ్యేయంతో పావులు కదుపుతున్నది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలై కుదేలై ఉన్న‌ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు మరియు అధికారంలో ఉన్న‌ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఎదగాలనే కోరికతో పాటు మిత్రపక్షాల‌ ఓటు బ్యాంకు పునాదుల్లోకి కూడా చొచ్చుకొని పోయి సొంత బలాన్ని పెంచుకొనే పనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మహారాష్ట్ర ఎన్నికల ఎత్తుగడలను బట్టి స్పష్టమవుతున్నది. లోక్ సభ ఎన్నికల్లో విజయడంకా మ్రోగించిన‌ప్పటికీ అధికారంలో ఉన్న‌ గుజరాత్, రాజస్తాన్, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన‌ ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని కొన్ని శాసనసభా స్థానాలకు సెప్టంబరులో ఉపఎన్నికలు జరిగితే భాజపా ఘోరపరాజయాన్ని చవిచూసింది. అయినా మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో తమదే విజయమన్న అహంభావంతో భాజపా మిత్రపక్షాల పట్ల‌ వ్యవహరిస్తున్నది.
మహారాష్ట్రకు సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలలో భాజపా ప్రభుత్వాలే ఉన్నాయి. శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే లేనిలోటును ఉద్ధవ్ థాకరే భర్తీ చేయలేక పోతున్నాడు. పైపెచ్చు రాజ్ థాకరే మహరాష్ట్ర నవనిర్మాణ సమితి(యం.యన్.యస్.) పేరుతో  వేరుకుంపటి పెట్టుకొని శివసేనకు కంటిలో నలుచులా తయారయ్యాడు. బలమైన సమర్థ నాయకత్వ లేమితో బాధపడుతున్న శివసేనను కట్టడిచేసి, తాను బలపడాలని భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. మరొక వైపు నిన్నటి వరకు ఇటు మహారాష్ట్రలోను, అటు కేంద్రంలోనూ ఐక్య ప్రగతిశీల కూటమి(యు.పి.ఎ.)లో భాగస్వాములుగా ఉంటూ పదిహేనేళ్ళ పాటు పాలనాధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(యన్.సి.పి.)లు విడిపోయి జుట్లు పట్టుకొని తిట్టుకొంటున్నాయి. ఆదర్శ్ అపార్ట్ మెంట్స్ నిర్మాణం తదితర‌ అవినీతి కుంభకోణాలు, అసమర్థ పాలనతో అప్రతిష్టపాలైన కాంగ్రెస్ - యన్.సి.పి కూటమి ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న‌ ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకొని మహారాష్ట్రలో కూడా తమ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న బలమైన‌ ఆకాంక్షతో భాజపా నాయకత్వం ఉన్నట్లు కనబడుతున్నది. భాజపా అంతరంగాన్ని అర్థం చేసుకొన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఉభయుల విశాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందేమోనన్న సంశయం ఉన్నా సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు ప్రదర్శించ లేదు. దీన్ని సాకుగా చూపెట్టి భాజపా నాయకత్వం ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొని మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నది. భవిష్యత్తులో కూడా ఇదే వైఖరిని మిగిలిన మిత్రపక్షాలైన అకాలీదళ్, తెలుగు దేశం అధికారంలో ఉన్నపంజాబ్, ఆంధ్రప్రదేశ్ లలో భాజపా అనుసరించే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, బలపడి, పలు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు వ్యక్తులు, కుటుంబాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆయా ప్రాంతీయ‌ పార్టీల అధినేతలు మరణిస్తేనో లేదా అవినీతి కేసుల్లో ఇరుక్కొని లేదా ప్రజావ్యతిరేక పాలన సాగించి అప్రతిష్ట పాలైతే ఆ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ప్రక్రియను గమనిస్తూనే ఉన్నాం. బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్.జె.డి., ఉత్తరప్రదేశ్ లో మాయావతి నేతృత్వంలోని బి.యస్.పి., తమిళనాట డి.యం.కె., తాజాగా జయలలిత అరెస్టుతో ఎ.ఐ.ఎ.డి.యం.కె. ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను ఉదహరించుకోవచ్చు.
చిన్న రాష్ట్రాల సిద్ధాంతంతో రాష్ట్రాలను ముక్క చెక్కలు చేయడం ద్వారా బలంగా ఉన్న‌ ప్రాంతీయ పార్టీలను, రాజకీయ శక్తులను బలహీనపరిచి, వాటి మాటకు డిల్లీలో విలువ లేకుండా చేయడం ద్వారా దేశంపై పెత్తనాన్ని కొనసాగించాలని, రెండు పార్టీల వ్యవస్థను నెలకొల్పాలని భాజపా, కాంగ్రెస్ తలపోస్తున్నాయి. గడచిన పదేళ్ళుగా దుష్టపాలన సాగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఛీత్కారానికి గురై కోలుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇదే అదనుగా ఉత్తర భారత దేశానికే పరిమితమై ఉన్న భాజపా దేశ వ్యాపితంగా విస్తరించాలని, బలాన్ని పెంచుకొని ప్రాంతీయ పార్టీల స్థానంలో తాము ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి పథకాలు రచించుకొని పనిచేస్తున్నది.
పార్లమెంటుకు 2019లో జరిగే ఎన్నికల తదనంతరం దక్షిణాది రాష్ట్రాలలో సాధించుకొనే స్థానాలపై ఆధారపడే కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకొంటామన్న‌ ధీమాను కొందరు భాజపా నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే వారి వ్యూహమేంటో బోధపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటూనే రాబోయే ఎన్నికల నాటికి మేమే ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని బాహాటంగానే ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సమైక్య‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల ఛీత్కారానికి కాంగ్రెస్ గురయ్యింది. వై.యస్. ఆర్. కాంగ్రెస్ అధినేత అవినీతి ఆరోపణ కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా తామే ప్రత్యామ్నాయ‍ రాజకీయ శక్తిగా ఎదుగుతామని భాజపా చెప్పుకొంటున్నది. తెలంగాణలోనూ అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయమంటున్నారు. తమిళనాడు పరిణామాలను అనుకూలంగా మలచుకోవడం ద్వారా కర్నాటకకే పరిమితమైన భాజపా దక్షిణాదిలో విస్తరించాలని కలలు కంటున్నది. ఒక రాజకీయ పార్టీగా బలపడాలని భాజపా కోరుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ప్రజలను విభజించే మత రాజకీయాలతో కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, ప్రజాభ్యుదయం కోసం పరితపిస్తూ, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ప్రజల మన్ననలు పొంది ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చెందవచ్చు. అలాంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం పుష్కలంగా కల్పించింది.