Sunday, January 9, 2011

కృష్ణా జలాలపై బ్రజేష్ కుమార్ త్రిబృనల్ తీర్పు

కరువు పీడిత ప్రాంత ప్రజలకు ఆశనిపాతం - బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు
T.Lakshminarayana
visalaandhra Telugu daily,Tue, 4 Jan 2011

కృష్ణానదీ జలాల వివాదంపై గడచిన 6 సంవత్సరాలుగా విచారణ జరిపిన జస్టిస్‌ బ్రజేష్‌ కుమార్‌ నేతృత్వంలోని కృష్ణానదీ జలాల వివాద పరిష్కారం ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను గొడ్డలిపెట్టుకు గురి చేసింది. నిత్య కరువు పీడిత ప్రాంతాల ప్రజల ఆశలు ఆడియాసల య్యాయి. రాష్ట్ర ప్రజలు ఏ భయాందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చారో, వాటికి వాస్తవ రూపం కల్పిస్తూ తీర్పును వెలువరించడం అత్యంత దురదృష్టకరం. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా తమకు అనుకూలమైన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు వినిపించి సంపూర్ణ విజయాన్ని సాధిం చాయి. మన రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, అపరిపక్వత, చేతగానితనం ట్రిబ్యునల్‌ తీర్పుతో బహిర్గత మయింది. పర్యవసానంగా మిగులు జలాలపై మనకున్న స్వేచ్ఛను శాశ్వతంగా కోల్పోయాం. అపార నష్టాన్ని కూడగట్టుకున్నాము. కృష్ణానది మిగులు జలాలను ఉపయోగించుకొనే పూర్తి స్వేచ్చ నదీ పరీవాహక ప్రాంతంలో చివరగా ఉన్న మన రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976 సం||లో దఖలు పరచింది.నదీ ప్రవాహంలో పై భాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటకకు మిగులు జలాల్లో ఏమాత్రం హక్కు లేదని స్నష్టంగా పేర్కొన్నది. కాని బచావత్‌ తీర్పు గడువు ముగియగానే ఆ రాష్ట్రాలు మిగులు జలాల్లో వాటా ఇవ్వాలని ఉడుం పట్టుబట్టి సాధించుకున్నాయి. మిగులు జలాలను కూడా పంపిణీ చేసే విధానం ఆశాస్త్రీయమైనది . ఏడాది చివరలో మొత్తం నీటి లభ్యతను బట్టి నికర జలాలు పోను మిగిలిన వాటిని మిగులు జలాలుగా పరిగణి స్తారు. కావున మిగులు జలాలను ముందు గానే అంచనాకట్టి పంపకాలు చేయడం అసంబద్దం. ఇది నిస్సంకోచంగా ఎగువ రాష్ట్రాలకు ప్రయోజన కరమైనది. దిగువ రాష్ట్రమైన మనకు తీవ్ర నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది.

ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్ల ఎత్తుకు పెంచడం ద్వారా అధిక నీటిని నిల్వ చేసుకొని వాడుకోవాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కర్నాటక పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి ట్రిబ్యునల్‌చేత ఆమోదముద్ర వేయించు కున్నది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప, నీటిని విడుదల చేయడం లేదు. పర్యావరసానంగా మనకు కేటాయించిన నికర జలాలను కూడా పొందడం దుర్లబమైపోయింది. గతంలో నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా క్రింద కరువు పరిస్ధితులు నెలకొన్న చేదు అనుభవం చవి చూశాము. ఇలాంటిస్ధితిలో తాజా తీర్పు వల్ల కర్నాటక రాష్ట్రానికి నీటి కేటాయింపు పెరిగిన దృష్ట్యా నిలవచేసుకునే అవకాశం కూడా కల్పించాలనే దృష్టితో ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లుకు పెంచుకోవడానికి బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అనుమతించటంతో భవిష్యత్తు దుష్పపరిణామాలు ఎలా వుంటాయో ఉహించడం కష్టసాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం మరియు మూడు రాష్ట్రాల ప్రతినిధులతో '' కృష్ణా నదీ జలాల పంపిణీ తీర్పు - అమలు బోర్డు''ను మూడు నెలల తర్వాత ఏర్పాటు చేయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్‌ కోరింది. ఇది అత్యంత అపస్యకమైనది అయినా, దీనికి చట్టబద్దమైన అధికారాలు లేకుండా ఏ మాత్రం ప్రయోజనం లేదు. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబందించిన చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత తీర్పు ద్వారా తుంగభద్ర బోర్డు రద్దు అయిపోయి మొత్తం కృష్ణానదీ పరివాహక ప్రాంతానికి ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది.

కరువు పీడితుల రోదన - అరణ్యరోదనే !

1976 సంవత్సరంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులో నికర జలాల కేటాయింపుకు సంబందించి తీవ్ర అన్యాయం జరిగిందని ఇటు తెలంగాణా, అటు రాయలసీమ ప్రాంత ప్రజానీకం బలంగా భావిస్తున్న పూర్వ రంగంలో ఇప్పుడు మిగులు జలాలు కూడా చేజారిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతాల నీటి అవసరాలు ఎలా తీరుతాయి? మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి? ప్రస్తుత తీర్పు యధాతదంగా అమలైతే నిత్య కరువు పీడిత, అత్యంత వెనకబడిన ప్రాంతాల నీటి సమస్య నిస్సందేహంగా మరింత జఠిలంగా తయారవు తుంది. కర్నాటక, మహా రాష్ట్రలు విసిరిన సవాలును దీటుగా త్రిప్పికొట్టి రాష్ట్ర ప్రయోజ నాలను పరిరక్షించు కోవడా నికి న్యాయబద్ధమైన, సమర్ధ వంతమైన వాదనలు వినిపించ డంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్నాటకలో కాంగ్రెస్‌ లేదా జనతా దళ్‌ (సెక్యులర్‌) లేదా బి.జె.పి., అలాగే మహారాష్ట్రలో శివసేన - బిజెపి కూటమి లేదా కాంగ్రెస్‌- యన్‌సిపి కూటమి ఎవరు అధికారంలో వున్నా నీటి సమస్యపై ఐక్యంగా నిలబడి సాధించుకున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీల సమిష్టి అవగాహనతో రాజకీయ సంకల్పంతో కృషి చేయకపోవడం మూలంగానే ఈ దుష్ఫలితం వచ్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో ఆఖరు భాగంలో ఉన్న మన రాష్ట్రం ఎదుర్కొంటున్న పకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, పర్యావరణ మార్పులు, భూగర్భ జలాల లభ్యత, వ్యవసాయమే జీననాధారంగా మనుగడ సాగిస్తున్న గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, రక్షిత త్రాగునీరు, తక్కువ వర్షాలు పడిన సంవత్సరాలలో నికర జలాలకే దిక్కులేని దుస్థితి, నదీ పరీవాహక ప్రాంతంలో ప్రస్తుత ఆయకట్టుకు పూర్తి రక్షణ, వరదలు ముంచుకొచ్చినప్పుడు జరిగే నష్టం, నదీ వరద ప్రవాహం రోజులు కూడా బాగా కుదించుకు పోయిన వాస్తవ పరిస్థితులను, దిగువ ప్రాంతాల కష్ట నష్టాలను సమర్థవంతంగా ట్రిబ్యునల్‌ ముందు వినిపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాజకీయ నాయకత్వం ఇతరేతర సమస్యలలో పీకలలోతు కూరుకుపోవడం, పరిణతితో అప్రమత్తంగా వ్యవహ రించకుండా సాగునీటి పారుదల నిపుణులు, న్యాయ సలహా దారు లకు మాత్రమే ఒదిలి పెట్టి, ప్రేక్షకపాత్ర వహించడం వల్ల రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది.

2000 మే 31 నాటితో బచావత్‌ ట్రిబ్యునల్‌ గడువు ముగియటంతో మూడు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రమైనాయి. 3 రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు 2004 ఏప్రిల్‌ 2న కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ బ్రజేష్‌ కుమార్‌ అధ్యక్షులుగా జస్టిస్‌ యస్‌.పి. శ్రీ వాత్సవ్‌, జస్టిస్‌ డి.కె. సేత్‌ సభ్యులుగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్‌ ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న భయాందోళనలను ప్రజలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి నదికి ఉత్తరాన ఉన్న తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలు, దక్షిణాన ఉన్న రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం జిల్లా ప్రజానీకం మనుగడ ఈ తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఎంతో ఆసక్తితో ఎదురుచూసారు. నిత్య కరువుతో, నిరాశ నిస్పృహ లలో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల ప్రజలకు '' జలయజ్ఞం'' ఆశలు చిగురింపచేసింది.నికర జలాల ఆధారంగా నిర్మిస్తున్న యస్‌.ఆర్‌.బి.సి., రాజీవ్‌ ఎత్తి పోతల పథకం (భీమా - 20 టి.యం.సి), మిగులు జలాలు/వరద నీరు ఆధారం గా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ ( 29 టి.యం.సి), గాలేరు - నగరి(38 టి.యం.సి), హంద్రీ - నీవా(40 టి.యం.సి), వెలుగొండ (43.5 టి.యం.సి), శ్రీశైలం ఎడమగట్టు కాలువ (యస్‌. యల్‌.బి.సి. సొరంగ మార్గం - 30 టి.యం.సి), మహత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (కల్వకుర్తి - 25 టి.యం.సి), జవహర్‌ ఎత్తిపోతల పథకం (నెట్టెంపాడు -20 టి.యం.సి), కోయల్‌సాగర్‌ ఎత్తి పోతల పథకం (5 టి.యం.సి) నిర్మాణం యుద్ధ ప్రాతిపదికపై చేపట్టబడ్డాయి. వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయబడ్డాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని, సాగునీరు, త్రాగునీటి కోసం కొండంత ఆశతో కరువు పీడిత ప్రజలు ఎదురుచూస్తున్నారు. జలయజ్ఞాన్ని రాజకీయ సంకల్పంతో చేపట్టిన డా|| వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి దుర్మరణంతో, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో! అన్న అనుమానాలు ప్రజలలో రేకెత్తాయి. వార్షిక బడ్జేట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేయక పోవడంతో నిర్మాణ పనులు మూలన పడ్డాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తరహాలో మిగులు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్చ మన రాష్ట్రానికి దక్కకపోతే నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ శాశ్వతంగా మూలనపడే ప్రమాదం ఉన్నదని ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. భయపడినంతా జరిగింది. వెనుకబడిన ఈ ప్రాంతాల ప్రజల సాగునీరు, త్రాగునీటి సమస్య మరింత జటిలమైంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చించిన వేల కోట్ల రూపాయల ప్రజాధనం బుగ్గిపాలైపోతాయి. జలయజ్ఞంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఎండమావిగా తయా రయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగురూకతతో వ్యవహరించకపోవడం దీనికి ప్రధానకారణం.

ప్రామాణికం కొంప ముంచింది: నదీ జలాల సమస్య అత్యంత సున్నితమైనది, జఠిల మైనది. ప్రత్యేకించి కృష్ణానదీ జలాల సాధన మన రాష్ట్రానికి ప్రాణప్రదంగా పరిణమించింది. నాడు బచావత్‌ ట్రిబ్యునల్‌ 78 సంవత్సరాలలో కృష్ణానదీ ప్రవాహం గణాంకాలను పరిశీలించి 75 శాతం నీటి లభ్యతను విశ్వసనీయమైన ప్రామాణికంగా తీసుకొని నికర జలాలను 2060 టి.యం.సి.లు పునరుత్పత్తి ద్వారా 70 టి.యం.సిలు మొత్తం 2130 టి.యం.సిలుగా నిర్థారించింది. అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ మేరకు నికరంగా నీరు లభిస్తుందని అంచనా కట్టారు. ఆ మేరకు మహారాష్ట్రకు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టి.యం.సి.లు, కర్నాటకకు 734(700+34) టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టి.యం.సిలు కేటాయించారు. ఈ నికర జలాల కేటాయింపుపై గడువు ముగిశాక చేపట్టే పున:విచారణ సరదర్భంలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేదని కూడా నిర్ద్వందంగా ప్రకటించింది. ఇది మనకు రక్షణ కవచంగా ఉపయోగపడుతూ వస్తున్నది. ఏ సంవత్సరములోనైనా నికర జలాల పరిమాణానికి మించి ప్రవహించే నీటిని మిగులు జలాలుగా భావించి ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కల్పించారు. 1976 నుండి 2000 సంవత్సరం వరకు పాలన చేసిన పెద్దల బాధ్యతా రాహిత్యం, కరువు ప్రాంతాల అభివృద్ది, సమగ్ర జల విధానాన్ని రూపొందించి అమలు చేయక పోవడంలో నిర్లక్ష్యంతో కూడిన విధానాల దుష్ఫలితాలను అనుభవిస్తున్నాము.

బచావత్‌ ట్రిబ్యునల్‌ తిరస్కరించిన 50 శాతం విశ్వసనీయతపై ఆధారపడి రూపొందించిన స్కీమ్‌ - బి ని అమలు చేయాలన్న కర్నాటక, మహారాష్ట్రల వాదనలకు బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కొంత వరకు లొంగినట్లు కనబడుతున్నది. కాబట్టే నేడు 47 సంవత్సరాల నదీ నీటి ప్రవాహం అధారంగా 65 శాతం నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని నికర జలాలను 2293 టి.యం.సి.లుగా నిర్దా రించింది.అలాగే 55% నీటి లభ్యత ప్రామాణికంగా సంవత్సరానికి సగటున 2578 టి.యం.సిలు లభిస్తాయని నిర్థారించి ఇందులోనుంచి 65% ప్రామాణికంగా నిర్దారించిన 2293 టి.యం.సిల నికర జలాలను తీసివేసి, మిగిలిన 285 టి.యం.సి.లను మిగులు జలాలుగా నిర్థారించింది. 2293 టి.యం.సి.ల నికర జలాలలో బచావత్‌ ట్రిబ్యునల్‌ గతంలో 2130 టి.యం.సిలను 3 రాష్ట్రాలకు చేసిన కేటాయింపులను యదాతథంగా ఉంచి, మిగిలిన అంటే 163 (2293-2130) టి.యం.సిల నికర జలాలను, 285 టి.యం.సిల మిగులు జలాలు మొత్తం 448 టి.యం.సిలను పంపిణీ చేసింది.

కృష్ణానదీ ప్రవాహన్ని సజీవంగా ఉంచడం ద్వారా పర్యావరణ, వన్య జంతువుల పరిరక్షణ కోసం 16 టి.యం.సిలను ట్రిబ్యునల్‌ కేటాయించింది. 65 శాతం ఆధారంగా నిర్థారించిన అదనపు నికర జలాలు+మిగులు జలాలు+పర్యావరణ పరిరక్షణ అన్న 3 పద్దుల క్రింద 448 టి.యం.సిలను మూడు రాష్ట్రాలకు కేటాయించింది. మహారాష్ట్రకు 81(43+35+3) టి.యం.సిలు, కర్నాటకకు 177(65+105+7) టి.యం.సిలు, ఆంధ్రప్రదేశ్‌కు 190 (39+145+6) టి.యం.సిల చొప్పున మంజూరు చేసింది. స్దూలంగా వివిధ ఆధారిత ప్రాతిపదికలపై ప్రస్తుత తీర్పు మేరకు మొత్తం నీటి కేటాయింపులు (బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపు+ ప్రస్తుతం అదనపు కేటాయింపు) ఆంధ్రప్రదేశ్‌కు - 1001 (811+190) టి.యం.సిలు, కర్నాటకు 911(734+177)టి.యం.సిలు, మహారాష్ట్రకు 666(585+81) టి.యం.సిలుగా పెర్కొనటం జరిగింది. ఈ పరిణామం మన రాష్ట్రానికి శరాఘాతం.

అయా రాష్ట్రాల కేటాయింపులనుండి 5 టి.యం.సిల చొప్పున మద్రాసు నగరానికి త్రాగునీటి కోసం ఇవ్వడానికి గతంలో అంగీకరించారు. అమేరకు పిబ్రవరి 15-1976న నాటి ప్రధానమంత్రి ప్రకటన కూడా చేశారు. ఆ మేరకు నీటిని మద్రాసుకు విడుదలచేసే బాధ్యతను మన రాష్ట్రానికి అప్పగించారు. మనం త్రాగునీటిని సరఫరా చేస్తున్నాము. కానీ మహారాష్ట్ర, కర్నాటకలు ఇప్పటి వరకు వారి వాటా 10 టియంసిల నీరు విడుదల చేసిన పాపాన పోలేదు. ఆ నీటిని ఏ ఏ మాసాల్లో ఎంత విడుదల చేయాలో స్పష్టంగా జస్టీస్‌ బ్రజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో పొందు పరచడం సహేతుకమైన చర్య. దాని ప్రకారం జూలై-ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో 3.3. టియంసిల చొప్పున, జనవరి, పిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో 1.7 టియంసిల చొప్పున సమాన కంతుల్లో సరఫరా చేయాలి.

ఉబ్చితబ్బిబైన కర్ణాటక: ట్రిబ్యునల్‌ తీర్పు వెలవడగానే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బి.యస్‌. యడ్యూరప్ప మహదానందంతో హర్షం వ్యక్తం చేస్తూ డిసెంబరు 30ని చారిత్రాత్మక దినంగా, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా తీర్పును అభివర్ణించారు.

మిగులు జలాల్లో వాటా, ఆల్మట్టి డ్యాం ఎత్తు 524.256 మీటర్ల వరకు అనుమతించాలన్న డిమాండ్లను నూటికి నూరు శాతం సాధించుకొన్నారు. తద్వారా అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు క్రింద యుకెపి స్టేజి-3కి కేటాయించిన 130 టియంసిలతో కలిపి 303 టియంసిలను సగటు నీటి సంవత్సరంలోనూ( మిగులు జలాలతో కలిపి), 198 టియంసిలను 65% ప్రామాణికంగా నికర జలాలను వినియోగించుకోవచ్చు. ఫలితంగా ఐదారు లక్షల హెక్టార్లు అదనపు సాగుకు అవకాశం లభించింది. కె-8,తుంగభద్ర సబ్‌ బేసిన్‌లో అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర మరియు సింగట్లూర్‌ ప్రాజెక్టులకు కేటాయించిన 40 టియంసిలతో కలిపి 360 టియంసిలకు మించకుండా 65% ప్రామాణికంగా లేదా సగటు నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతి పొందింది. మొత్తంగా సగటు నీటి సంవత్సరంలో మిగులు జలాలతో కలిపి 904 టియంసిలు, 65% ప్రామాణిక ఆధారంగా 799 టియంసిల నికర జలాలను వాడుకోవడానికి హక్కు కల్పించారు. నీటి కేటాయింపును వివిధ ప్రామాణికాలపై ఆధారపడి చేయడంతో నీటి వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్‌ ఇలాంటి కొన్ని షరతులను విధించింది. వాటి అమలుకు 10 రోజుల వ్యవధితో కూడిన వర్కింగ్‌ టేబుల్స్‌ను, రూల్‌ కర్వ్‌ను రూపొందించి కృష్ణా నదీ జలాల నిర్ణయం అమలు బోర్డుకు విధిగా అంద జేయాలని ఆదేశించింది. షరతులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ, అవి అసంబద్ధమైనవని, తొలగించాలని ఇప్పటికే ఆ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు హెచ్‌. విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. ట్రిబ్యునల్‌ మీద వత్తిడి తీసుకొచ్చి షరతులు లేకుండా చేసుకోవాలని కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మన రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతుంది.

ఆనందించిన మహారాష్ట్ర:తీర్పు పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడంతో మహారాష్ట్రలో ముంపు ప్రాంతం పెరుగుతుందని మాత్రం కాస్త అసంతృప్తి వెల్లడించారు. భీమా సబ్‌ బేసిన్‌ (కె-5)లో సగటు నీటి సంవత్సరంలో 123 టియంసిలు, 65% ఆధారిత నీటి సంవత్సరంలో కుకడి కాంప్లెక్స్‌కు కేటాయించిన 3 టియంసిలతో కలిపి 98 టియంసిలను వినియోగించుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. కె-1 అప్పర్‌ కృష్ణా సబ్‌ బేసిన్‌లో కోయినా జల విద్యుత్‌ కేంద్రం వినియోగించుకొని పడమటి దిశలోని అరేబియా సముద్రంలోకి వదిలి వేయడానికి గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటికి తోడు మరో 25 టియంసిలు అదనపు కేటాయింపుతో మొత్తం 92.7 టియంసిలు మళ్ళించుకోవడానికి అనుమతించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా పరిణమించి కరువు, కాటకాలలో ప్రజలు తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో జల విద్యుత్‌ ఉత్పాదనకు వినియోగించిన మీదట వృథాగా 92.7 టియంసిల అమూల్యమైన నీటిని సముద్రంపాలు చేయడం ఏ మాత్రం ధర్మం కాదు. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్‌కు సరిపడా మన రాష్ట్రం నుండి విద్యుత్‌ సరఫరా చేసే ఒప్పందంపై ఆ నీటిని పొందవలసింది. కె-1 సబ్‌ బేసిన్‌కు మినహా కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి నీటిని బయటికి తరలించరాదని ట్రిబ్యునల్‌ నిషేధించింది. సగటు నీటి సంవత్సరంలో 663 టియంసి, 65% ఆధారిత నీటి సంవత్సరంలో 628 టియంసిలు వాడుకోవడానికి హక్కు కల్పించారు.

జలయజ్ఞానికి ముప్పు : మన రాష్ట్రం సగటు నీటి సంవత్సరంలో 1001 టియంసిలు వాడుకోవడానికి హక్కు కల్పించారు. అందులో బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులు పోను, ప్రస్తుతం అదనంగా కేటాయించిన 190 టియంసిలలో 9టియంసిలు జూరాల ప్రాజెక్టుకు, 25 టియంసిలు తెలుగుగంగ ప్రాజెక్టుకు, 6 టియంసిలు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సాధారణ నదీ ప్రవాహానికి, 150 టియంసిలను శ్రీశైలం మరియు నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లలో నిల్వచేసుకొని ఆపై సంవత్సరానికి వినియోగించుకొనే నిమిత్తం క్యారీ ఓవర్‌ స్టోరేజ్‌కు ట్రిబ్యునల్‌ కేటాయించింది. అలాగే 2578 టియంసిలకు పైబడి ఏ సంవత్సరంలోనైనా నీరు వస్తే ఆ నీటిని మళ్ళీ పునః విచారణ వరకు అంటే మే 31, 2050 నాటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌కు వాడుకొనే స్వేచ్ఛను ఉధారంగా కల్పించారు. అలాగే జూన్‌-జూలై మాసాలలో కర్ణాటక రాష్ట్రం 8 నుండి 10 టింయంసిల వరకు ఆల్మట్టి నుండి మన రాష్ట్రానికి నీటి విడుదల క్రమబద్దీకరణలో భాగంగా విడుదల చేయాలని ఆదేశించారు. బహుశా ఈ నీటి విడుదల ఖరీప్‌లో నార్లు పోసుకోవడానికి వీలుకల్పించే ఉద్దేశంతో కావచ్చు. ఈ తాజా తీర్పు పర్యవసానంగా యస్‌యల్‌బిసి, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలగొండ ప్రాజెక్టులకు మిగులు నీళ్ళు కూడా దక్కకుండా పోయాయి. మరి వీటి గతేంటి? శ్రీశైలం మరియు నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లలో క్యారీ ఓవర్‌ స్టోరేజ్‌ పద్దు క్రింద కేటాయించిన 150 టి.యం.సి.లను నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులకు కేటాయించి ఉండవలసింది. దీని కోసం ఇప్పటికైనా ట్రిబ్యునల్‌ను ఒప్పించి, సాధించాలి.

మన రాష్ట్రం అనివార్యంగా తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమీక్ష చేసి, న్యాయం చేయమని ట్రిబ్యునల్‌ను గట్టిగా కోరాలి. 100 సం||ల నదీ ప్రవాహాన్ని ప్రాతిపదికగా తీసుకొని, నికర జలాల నిర్థారణకు 75% ప్రామాణికంగా తీసుకొనేలా ఒప్పించాలి. మిగులు జలాల నిర్ధారణ, పంపిణీ అశాస్త్రీయమైనది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించకూడదు. ఆల్మట్టి రిజ్వాయరు ఎత్తును అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు 519.6 మీటర్లకే కుదించేలా పట్టుబట్టాలి లేదా నదీ పరీవాహక ప్రాంతంలో పై భాగంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని, అది ఆంధ్రప్రదేశ్‌ కు ఆత్మహత్యా సదృశ్యమేనని తేల్చి చెప్పాలి. కోయినా జలవిద్యుత్‌ కేంద్రానికి అదనపు నీటి తరలింపును ప్రతిఘటించాలి. ఈ ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యే గడ్డు పరిస్థితే దాపురిస్తే! అనివార్యమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి కృష్ణా పరివాహక ప్రాంతంలో నిరిస్తున్న అన్ని ప్రాజెక్టులకు, వాటి అవసరాల మేరకు నీటిని కేటాయించాలని డిమాండ్‌ చేసి, సాధించాలి. కె.సి. కెనాల్‌కు కేటాయించిన నీటి నుండి అనంతపురం జిల్లాలోని పి.ఎ.బి.ఆర్‌.కు కేటాయించిన 10 టి.యం.సి.ల నీటికి ప్రత్యామ్నాయంగా శ్రీశైలం రిజర్వాయరు నుండి గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నీటికి ట్రిబ్యునల్‌చేత ఆమోదం పొందాలి. తుంగభద్ర సమాంతర కాల్వ నిర్మాణంపై మరింత ఒత్తిడి పెంచాలి. వీటి సాధనకై ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలను, సాగునీటి రంగంలో నిష్ణాతులైన ఇంజనీరింగ్‌ నిపుణులను విశ్వాసంలోకి తీసుకొని చర్చించి, రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేయాలి.

Tuesday, January 4, 2011

కృష్ణా జలాలపై భ్రజేస్ కుమార్ త్రిబునల్ అవార్డు పై వ్యాసం

‘తీర్పు’ సాగురంగం బాగుకు కాదు, ఓగుకే!
మిగులు జలాలు ఇక మిథ్యేనా?
Sakshi telugu daily 4th jan. 2011

కృష్ణానదీ జలాల పంపిణీ వివాదంపై గడిచిన ఆరేళ్లుగా విచారణ జరిపిన జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వం లోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. నిత్య కరువు పీడిత ప్రాంతాల ప్రజల ఆశలు అడి యాసలయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఏ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వచ్చారో, వాటికి వాస్తవరూపం కల్పిస్తూ తీర్పును వెలువరిం చడం అత్యంత దురదృష్టకరం. కర్ణాటక-మహారాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూల మైన వాదనలను సమర్థంగా ట్రిబ్యునల్ ముందు వినిపించి సంపూర్ణ విజయాన్ని సాధించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత, అపరిపక్వత, చేతగానితనం ట్రిబ్యునల్ తీర్పుతో లోకానికి వెల్లడైంది. పర్యవసానంగా మిగులు జలాలపై మనకున్న హక్కును శాశ్వతంగా కోల్పోయాం. అపార నష్టాన్ని కొనితెచ్చుకుంటున్నాం.

కృష్ణానది మిగులు జలాలను ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛ నదీ పరీవాహక ప్రాంతంలో చివరగా ఉన్న మన రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 1976లో దఖలు పరచింది. నదీ ప్రవాహంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకకు మిగులు జలాల్లో ఏమాత్రం హక్కులేదని స్పష్టంగా పేర్కొన్నది. కానీ బచావత్ తీర్పు గడువు ముగియగానే ఆ రాష్ట్రాలు మిగులు జలాల్లో వాటా ఇవ్వాలని ఉడుం పట్టుబట్టి సాధించు కున్నాయి. మిగులు జలాలను కూడా పంపిణీ చేసే విధానం అశాస్ర్తీయమైనది. ఏడాది చివరలో మొత్తం నీటి లభ్యతను బట్టి నికర జలాలు పోను మిగిలిన వాటిని మిగులు జలాలుగా పరిగణిస్తారు. మిగులు జలాలను ముందుగానే అంచనాకట్టి పంపకాలు చేయడం అసంబద్ధం.


ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్ల ఎత్తుకు పెంచడం ద్వారా అధిక నీటిని నిల్వ చేసుకొని వాడుకోవాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కర్ణాటక ట్రిబ్యునల్ చేత ఆమోదముద్ర వేయించుకున్నది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం జరిగిన తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప నీటిని విడుదల చేయడం లేదు. ఫలితంగా మనకు కేటాయించిన నికర జలాలను పొందడం కూడా దుర్లభమైపోయింది. గతంలో నాగార్జునసాగర్, కృష్ణాడెల్టా కింద కరువు పరిస్థితులు నెలకొన్న చేదు అనుభవం చవి చూశాం. ఇలాంటి స్థితిలో తాజా తీర్పు వల్ల కర్ణాటక రాష్ట్రానికి నీటి కేటాయింపు పెరిగిన దృష్ట్యా నిలవచేసుకునే అవకాశం కూడా కల్పించాలనే దృష్టితో ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమ తించటంతో భవిష్యత్తు దుష్ఫరిణామాలు ఎలా ఉం టాయో ఊహించటం కష్టసాధ్యం కాదు.

‘కృష్ణానదీ జలాల పంపిణీ తీర్పు-అమలు బోర్డు’ను మూడు నెలల తర్వాత ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ కోరింది. ఇది అత్యంత ఆవశ్యకమైనది అయినా, దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేకుండా ప్రయోజనం లేదు. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబంధించిన చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత తీర్పు ద్వారా తుంగభ్ర బోర్డు రద్దయిపోయి మొత్తం కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది.

కరువు పీడితుల ఆవేదన అరణ్య రోదనే!

1976వ సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో నికర జలాల కేటాయింపునకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందని ఇటు తెలం గాణ, అటు రాయలసీమ ప్రాంత ప్రజానీకం బలంగా భావిస్తున్న పూర్వరంగంలో ఇప్పుడు మిగులు జలాలు కూడా చేజారిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతాల నీటి అవసరాలు ఎలా తీరుతాయి? మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి? ప్రస్తుత తీర్పు యథాతథంగా అమలైతే నిత్య కరువు పీడిత, వెనుకబడిన ప్రాంతాల నీటి సమస్య నిస్సందేహంగా మరింత జటిలంగా తయారవు తుంది. కర్ణాటక, మహారాష్టల్రు విసిరిన సవాలును దీటుగా త్రిప్పికొట్టి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించు కోవడానికి న్యాయబద్దమైన, సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ లేదా జనతాదళ్ (సెక్యులర్) లేదా బీజేపీ, అలాగే మహారాష్ట్ర శివసేన-బీజేపీ కూటమి లేదా కాంగ్రెస్- ఎన్‌సీపీ కూటమి ఎవరు అధికారంలో ఉన్నా నీటి సమస్యపై ఐక్యంగా నిలబడి సాధించుకున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీల సమష్టి అవగాహనతో రాజకీయ సంకల్పంతో కృషి చేయకపోవడం మూలంగానే ఈ దుష్ఫలితం వచ్చింది.

నదీ పరీవాహక ప్రాంతంలో ఆఖరు భాగంలో ఉన్న మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, పర్యావరణ మార్పులు, భూగర్భ జలాల కొరత, వ్యవసాయమే జీవనాధారంగా మనుగడ సాగిస్తున్న గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, రక్షిత తాగునీరు, తక్కువ వర్షాలు పడిన సంవత్సరాలలో నికర జలాలకే దిక్కులేని దుస్థితి. నదీ పరీవాహక ప్రాంతంలో ప్రస్తుత ఆయకట్టుకు పూర్తి రక్షణ, వరదలు ముంచు కొచ్చినప్పుడు జరిగే నష్టం, వరద ప్రవాహం రోజులు కూడా బాగా కుదించుకుపోయిన వాస్తవ పరిస్థితు లను, దిగువ ప్రాంతాల కష్టనష్టాలను సమర్థంగా ట్రిబ్యునల్ ముందు వినిపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.

జలయజ్ఞాన్ని రాజకీయ సంకల్పంతో చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణంతో, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయోనన్న అనుమా నాలు ప్రజల్లో రేకెత్తాయి. వార్షిక బడ్జెట్ కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు మూలనపడ్డాయి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు తరహాలో మిగులు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ మన రాష్ట్రానికి దక్కకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ శాశ్వతంగా మూలనపడే ప్రమాదం ఉంది.

ప్రామాణికం కొంప ముంచింది

నదీ జలాల సమస్య అత్యంత సున్నితమైనది. జటిలమైనది. నాడు బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాలలో కృష్ణా నదీ ప్రవాహం గణాంకాలను పరిశీలించి 75 శాతం నీటి లభ్యతను విశ్వసనీయమైన ప్రామాణికంగా తీసుకుని నికర జలాలను 2,060 టీఎంసీలు మరియు పునరుత్పత్తి ద్వారా 70 టీఎంసీలు తీసుకుని 2,130 టీఎంసీలుగా నిర్ధారిం చింది. అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ మేరకు నికరంగా నీరు లభిస్తుందని అంచనా కట్టారు. ఆ మేరకు మహారాష్టక్రు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734(700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811(800+11) టీఎంసీలు కేటాయిం చారు. ఈ నికర జలాల కేటాయింపుపై గడువు ముగిశాక చేపట్టే పునఃవిచారణ సందర్భంలో ఎలాంటి మార్పులూ చేయడానికి వీలులేదని కూడా నిర్ద్వంద్వం గా ప్రకటించింది. ఏ సంవత్సరంలోనైనా నికర జలాల పరిమాణానికి మించి ప్రవహించే నీటిని మిగులు జలాలుగా భావించి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కోవడానికి స్వేచ్ఛను కల్పించారు.

బచావత్ ట్రిబ్యునల్ తిరస్కరించిన 50 శాతం విశ్వసనీయతపై ఆధారపడి రూపొందిన స్కీమ్-బిని అమలు చేయాలన్న కర్ణాటక, మహారాష్టల్ర వాదనలకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొంతవరకు లొంగినట్లు కనపడుతున్నది. కాబట్టే నేడు 47 సంవత్సరాల నీటి ప్రవాహం ఆధారంగా 65 శాతం నీటి లభ్యతను ప్రామాణికంగా సంవత్సరానికి సగటున 2,578 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి ఇందులో నుంచి 65 శాతం ప్రామాణికంగా నిర్ధారించిన 2,293 టీఎంసీల నికర జలాలను తీసివేసి, మిగిలిన 285 టీఎంసీలను మిగులు జలాలుగా నిర్ధారించింది. 2,293 టీఎంసీల నికర జలాలలో బచావత్ ట్రిబ్యునల్ గతంలో 2,130 టీంఎసీలను 3 రాష్ట్రాలకు చేసిన కేటాయింపులను యథాతథంగా ఉంచి, మిగిలిన 163 టీఎంసీల నికర జలాలను, 285 టీఎంసీల మిగులు జలాలు మొత్తం 448 టీంఎసీలను పంపిణీ చేసింది. స్థూలంగా వివిధ ఆధారిత ప్రాతిపదికలపై ప్రస్తుత తీర్పు మేరకు (బచావత్ ట్రిబ్యునల్ కేటాయిం పు, ప్రస్తుత అదనపు కేటాయింపులను కలిపితే) ఆంధ్రప్రదేశ్‌కు 1001(811+190) టీఎం సీలు, కర్ణాట కకు 911 (734 +177) టీఎంసీలు, మహారాష్టక్రు 666(585+81) టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ పరిణామం మన రాష్ట్రానికి చావుదెబ్బ.

జలయజ్ఞానికి ముప్పు

మన రాష్ట్రం సగటు నీటి సంవత్సరంలో 1001 టీఎంసీలు వాడుకోవడానికి హక్కు కల్పించారు. అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు పోను, ప్రస్తుతం అదనంగా కేటాయించిన 190 టీఎంసీలలో 9 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు, 25 టీంఎసీలు తెలుగుగంగ ప్రాజెక్టుకు, 6 టీఎంసీలు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సాధారణ నదీ ప్రవాహానికి, 150 టీంఎసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లలో నిల్వ చేసుకుని ఆపై సంవత్సరానికి వినియో గించుకునే నిమిత్తం క్యారీ ఓవర్ స్టోరేజ్‌కు ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే, 2,578 టీఎంసీలకు పైబడి ఏ సంవత్సరంలోనైనా నీరు వస్తే ఆ నీటిని మళ్లీ పునఃవిచారణ వరకు అంటే 2050, మే 31 నాటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు వాడుకునే స్వేచ్ఛను కల్పించారు. అలాగే జూన్-జూలై మాసాలలో కర్ణాటక రాష్ట్రం 8 నుండి 10 టీఎంసీల దాకా ఆల్మట్టి నుండి మన రాష్ట్రానికి (నీటి విడుదల క్రమబద్ధీకరణలో భాగంగా) విడుదల చేయాలని ఆదేశించారు.

బహుశా ఈ నీటి విడుదల ఖరీఫ్‌లో నార్లు పోసుకోవడానికి వీలు కల్పించే ఉద్దేశంతో కావచ్చు. ఈ తాజా తీర్పు పర్యవసానంగా ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు మిగులు నీళ్లు కూడా దక్కకుండా పోతాయి. మరి వీటి గతేంటి? శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో క్వారీ ఓవర్ స్టోరేజ్ పద్దు కింద కేటాయించిన 150 టీఎంసీలను నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులకు కేటాయించి ఉండవలసింది. దీని కోసం ఇప్పటికైనా ట్రిబ్యునల్‌ను ఒప్పించి, సాధించాలి.

మన రాష్ట్రం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమీక్ష చేసి, న్యాయం చేయమని ట్రిబ్యునల్‌ను గట్టిగా కోరాలి. వందేళ్ల నదీ ప్రవాహాన్ని, 75 శాతం నీటి లభ్యతను నికర జలాల నిర్ధారణకు ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకునేలా ఒప్పించాలి. మిగులు జలాల నిర్ధారణ, పంపిణీ అశాస్ర్తీయమైనది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. మన రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నింటికీ వాటి అవసరాల మేరకు నీటిని సాధించాలి. కేసీ కెనాల్‌కు కేటాయించిన నీటి నుంచి అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్‌కు కేటాయించిన 10 టీఎంసీల నీటికి ప్రత్యామ్నాయంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నీటికి ట్రిబ్యునల్ ఆమోదం పొందాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణంపై మరింత ఒత్తిడి పెం చాలి. అన్ని డిమాండ్ల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, సాగునీటిలో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను విశ్వాసంలోకి తీసుకుని అంకిత భావంతో కృషి చేయాలి.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు