Thursday, May 26, 2011

నేతలకు ఓటరు గుణపాఠం!




నేతలకు ఓటరు గుణపాఠం! మే 26, 2011 సాక్షి దినపత్రిక





వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలై, తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలనాటి దుష్టసంప్రదాయం మళ్లీ పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అవకాశవాద విధానాల పర్యవసానంగా తెలంగాణ సమస్య మరింత జటిలమైంది. పార్టీలో ఎవరు ఎవరికి విధేయులో తెలియని దుస్థితి నెలకొన్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ,కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. అపనమ్మకం, అనుమానాలు, అవిధేయత పాలక పార్టీని అంధకారంలోకి నెట్టాయి.

కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలి తాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి అనైతికంగా సాగించిన పోరులో, ప్రజలు విచక్షణతో కూడిన తీర్పును ప్రకటించడం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు, ఆ తీర్పుకు ఆత్మవంచనతో కూడిన మాటలను జోడించి ఓటర్లను కించపరిచే ప్రయత్నాలకు ఒడిగట్టడం విచారకరం. కడప జిల్లాలో రిగ్గింగులు, బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, దాడులు, ప్రతిదాడులు, హత్యలు వంటి అప్రజాస్వామిక ఘటనలు లేకుండా ఎన్నికలు జరుగుతాయా? అన్న కుతర్కాలకు దిగడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. ఓటమి పాలైన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు సంయమనం కోల్పోయి, ఉద్దేశపూర్వకంగానే ఫలితాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బగా పరిణమించిన ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయనడం అతిశయోక్తి కాదు.

ఏ ఎన్నికల్లోనైనా రాజకీయపార్టీలు గెలుపు కోసం చెమటోడ్చడం సహజం. కానీ కడప ఉప ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ గెలుపు కోసం కాక, ప్రధాన ప్రత్యర్థి ఆధిక్యతను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు గతంలో ఎన్నడూలేని స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్థబలాన్ని, అంగబలాన్ని పెద్దఎత్తున ప్రదర్శిం చారు. అయినా భంగపాటు తప్పలేదు. సానుభూతి పవనాలు బలంగా వీయడంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని నమ్మబలకడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నించడం దిగజారుడు రాజకీయాలనే గుర్తుచేస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవాలనే ఆరాటంలో నిమగ్నమైన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డినా, తమ అభ్యర్థి ధరావత్తు కోల్పోవడంతో ‘దినదిన గండం నూరేళ్ల ఆయష్షు’ అన్నట్లు గుంభనంగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మీసం మెలేసి, తొడచరిచి మురిసిపోయిన మెగాస్టార్‌కు ఓటర్లు తొడపాశం పెట్టడం కూడా విలక్షణ తీర్పులో భాగమే.

తీర్పుకు వక్రభాష్యాలు తగదు!

వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డు కడప. ఉప ఎన్నికల ప్రచార పర్వంలో వీచిన రాజకీయ వడగాడ్పులు వేసవి ఎండలను సైతం మరపించాయి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహార సరళిని గమనించిన వారికి, మనం ఏ తరహా ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సందే హం కలగ క మానదు. పోలీసుల దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలను ‘సీజ్’ చేశారంటే, ధన ప్రభావాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ డబ్బు ఎవరిదో బహిరంగపరచడంలో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి. ‘బైండోవర్’ కింద పది వేల మందిని అదుపులోకి తీసుకున్నారంటే అధికార దుర్వినియోగం ఏ మోతాదులో జరిగిందో బోధపడుతుంది. అయినా స్థూలంగా ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగడం పట్ల ప్రజాస్వామ్యవాదులు సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఇన్ని వత్తిళ్ల మధ్య ఓటర్లు మాత్రం నిబ్బరంగా వారివ్వదల్చుకొన్న తీర్పును ఇచ్చారు. దాన్ని హుందాగా గౌరవించాలి. కేవలం సానుభూతి వరవడిలో ప్రజలు కొట్టుకుపోయారని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేస్తే భవిష్యత్తులోనూ భంగపాటు తప్పదు.

ఉప ఎన్నికల ఫలితాల వెనుక దాగిన వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే సానుభూతి ఒక ప్రధానాంశమైనప్పటికీ, అందులో అంతర్లీనంగా ఇమిడి ఉన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకోక తప్పదు. వైఎస్ అకాలమరణంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలై, తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలనాటి దుష్టసంప్రదాయం మళ్లీ పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అవకాశవాద విధానాల పర్యవసానంగా తెలంగాణ సమస్య మరింత జటిలమైంది. పార్టీలో ఎవరు ఎవరికి విధేయులో తెలి యని దుస్థితి నెలకొన్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవి ర్భావంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ, కాంగ్రెస్ పార్టీ భవి ష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. అపనమ్మకం, అనుమానాలు, అవిధేయత పాలక పార్టీని అంధకారంలోకి నెట్టాయి. ఈ పూర్వరంగంలో ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా ముందుకొచ్చాయి. 2009 ఎన్నికల నాటికీ, నేటికీ పెనుమార్పులు సంభవించాయి. ‘మార్పు’ నినాదంతో ప్రజల ముందుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ చతికిలపడి, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ బోటు ఎక్కింది.

దేశంలో రెండు పార్టీల వ్యవస్థ వేళ్లూనుకోవాలనే కోరిక కొన్ని శక్తులకు బలంగా ఉన్నా, దానికి నూకలుచెల్లిపోయాయి. సంకీర్ణ రాజకీయాలు అవశ్యంగా మారాయి. కూటముల వ్యవస్థ రూపుదాల్చింది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో పార్టీల మధ్య సర్దుబాట్లు ఉన్నప్పటికీ స్థూలంగా ఏకపార్టీ పాలనా వ్యవస్థే కొనసాగుతున్నది. రెండు పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. నేటి పరిస్థితిని విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీల ఆధిపత్య రాజకీయాలకు మన రాష్ట్రంలో కూడా రోజులు దగ్గరపడ్డట్టు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరహా మార్పులవల్ల నష్టపోతామనుకునేవారు, వాటిని ఆదిలోనే అడ్డుకోవాలని యత్నించడం సహజం.

చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం మీదే దృష్టి సారించి చతికిలపడ్డాడు. ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని కాకుండా జగన్‌మోహన్‌రెడ్డినే ప్రధాన శత్రువుగా భావించడంతో, ఆ ఎత్తుగడలు వికటిస్తున్నాయి. కడప స్థానిక సంస్థల నుండి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థి రంగంలో లేకపోయినా ఓటింగ్‌లో పాల్గొన్న ఘటనలు దానికి నిదర్శనం. అలాంటి వ్యూహాత్మక తప్పిదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో టీడీపీకి కూడా పరాభవం తప్పలేదు. మంచికో చెడుకో మూడో పార్టీని ఆదరించాలని ఓటర్లు భావిస్తున్నారు. నాయకుల ఇష్టాఇష్టాలతో ప్రజలకు నిమిత్తం లేదు. వారికున్న చైతన్యం, అనుభవాల ఆధారంగా ప్రత్యామ్నాయాలను రూపొందించుకుంటారన్నది చరిత్ర.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదు. జలయజ్ఞానికి విఘ్నం కలిగింది. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బద్వేలు ప్రాంత వాసులకు తెలుగుగంగ, జమ్మలమడుగు ప్రాంతం వారికి గండికోట రిజర్వాయర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, కమలాపురం ప్రజలకు గాలేరు-నగరి, పులివెందుల ప్రజలకు ఎత్తిపోతల పథకాల పనులు ఆగిపోవడం జీవన్మరణ సమస్యగా మారింది. వైఎస్ అవినీతిని గురించి ఎంత దుష్ర్పచారానికి ఒడిగట్టినా జిల్లాలో జరిగిన అభివృద్ధిని కప్పిపుచ్చడం సాధ్యంకాదు. వేంపల్లె ప్రజానీకానికి ట్రిపుల్ ఐటీ, కడప వాసులకు ‘రిమ్స్’ దర్శనమిస్తూనే ఉంటాయి. వీటన్నింటి మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్ల తీర్పులో ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నది గుర్తించక తప్పదు.

విలువలకు పాతర

కడపకు ఘనమైన చరిత్ర ఉన్నది. నీతికి, నిజాయితీకి, నిస్వార్థ ప్రజాసేవకు ప్రతిరూపంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఎద్దుల ఈశ్వరరెడ్డిని నాలుగు దఫాలు లోక్‌సభకు ఎన్నుకొన్నారు. ఉమ్మ డి మద్రాసు రాష్ట్రంలో ఉండగా 1951లోనూ, 1962, 1967, 1971లో జరిగిన ఎన్నికల్లో ఈశ్వరరెడ్డిని గెలిపించడమే కాక, ‘ఓటు-నోటు’ నినాదంతో ఎన్నికల నిధులను సమకూర్చారు. నైతిక విలువలు మూర్తీభవించిన ప్రజానాయకుడికి బ్రహ్మరథం పట్టిన ప్రజలే 1977లో జరిగిన ఎన్నికల్లో దరావత్తు కోల్పోయేలా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల ఓబులరెడ్డి డబ్బు సంచులతో రంగప్రవేశం చేసి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. తనకు డిపాజిట్ కూడా రాలేదని ఆనాడు ఈశ్వరరెడ్డి ప్రజలను నిందించలేదు. పెపైచ్చు ప్రజలకు మరింత అంకిత భావంతో సేవ చేయడం ద్వారా దగ్గర కావాలని ఉద్భోదించారు. తద్భిన్నంగా నేడు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. డబ్బులకు అమ్ముడుపోయారని, సానుభూతి పవనాల్లో కొట్టుకుపోయారని ప్రజలను అవమానించడం మంచిదికాదు.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు!

తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం స్థానాలు 824 కాగా కాంగ్రెస్ 170, బీజేపీ కేవలం 5, వామపక్షాలు 141 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే 500 పైచిలుకు స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకొన్నా యి. ఈ ఎన్నికలు వామపక్షాలకు గొడ్డలిపెట్టుగా మారినా, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ఊరట కలిగించింది. విచ్ఛిన్నకర ఉద్యమాలతో విసిగిపోయిన అసోం ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షించి బోడో పీపుల్స్‌ఫ్రంట్‌తో ఎన్నికల అవగాహన కుదుర్చుకొన్న కాంగ్రెస్‌కు తిరిగి పట్టం కట్టినట్టు బోధపడుతుంది.

మమతా బెనర్జీ దయాదాక్షిణ్యాలతో పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ కొంతమేర సానుకూల ఫలితాలను పొందిం ది. ప్రభుత్వానికి, వామపక్షపాలక పార్టీకి మధ్య ఉండవలసిన విభజన రేఖ చెరిగిపోవడంతో జరిగిన అనర్థాలు, 34 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఎంతో కొంత గూడుకట్టుకొన్న ప్రజా వ్యతిరేకత, పారిశ్రామికాభివృద్ధికి భూసేకరణలో అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలతో పాటు మావోయిస్టులు, ఎస్‌యూసీఐ లాంటి పార్టీలతో చేతులు కలిపిన మమత అధికార పగ్గాలను చేపట్టింది. అక్కడ మమతతో సఖ్యత కొనసాగించడం కాంగ్రెస్‌కు పరీక్షే. 2-జీ స్పెక్ట్రం కుంభకోణం, కుటుంబ పాలనల మూలంగా డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా తమిళనాడులో నిండామునిగింది. ఈ ఫలితాలన్నింటినీ ఏ విధంగా విశ్లేషించినా, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడే కీలకం అన్నది సుస్పష్టం. ఇది రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామమే!
-టి.లక్ష్మీనారాయణ,సీపీఐ సీనియర్ నాయకులు

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010, విశాలాంధ్ర టి. టి.లక్ష్మీనారాయణ

మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్‌ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.

ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎ రైట్‌ నాట్‌ ఎ ప్రివిలేజ్‌ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.

నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్‌ 45(3) ను సవరించి నూతన క్లాజ్‌ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్‌ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.

నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం
‘సహస్రాబ్ది లక్ష్య సాధన’ ఎజెండా స్థితి-గతి
విశ్లేషణ...

అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు.

ఐక్యరాజ్య సమితిలో సామాజిక స్పృహ వికసిం చింది. ప్రపంచ దేశాధినేతలంతా ఒకే వేదికపై గుమి గూడారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కటిక దారిద్య్రాన్ని, ఆకలి బాధలను కనీసం సగానికన్నా తగ్గిస్తామని శపథం చేశారు. సార్వజనీన ప్రాథమిక విద్య, లింగ వివక్ష లేని సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల తగ్గింపు, తల్లుల ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ / ఎయిడ్స్ మలేరియా తదితర భయానక అంటువ్యాధులను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయంగా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రతినబూనారు.

ఈ మేరకు 2000 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 179 సభ్యదేశాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల ప్రజలను మానవాభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధిస్తామని గడువు విధించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగిడిన సందర్భంగా నిర్దేశించుకున్న ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’లో ప్రగతిని సమీక్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20-22 తేదీల్లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు నిర్వహించింది. ప్రతిజ్ఞ చేసి దశాబ్దం గడచిపోయింది. ఇహ! మిగిలింది ఐదు సంవత్సరాలు మాత్రమే. లక్ష్యాలను అసలు చేరుకోగలమా? అన్నది శేష ప్రశ్న.

ఈ ఆశావహదృక్పథాన్ని 2007-08 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునా దులనే కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నీరు గార్చింది. సంక్షోభ దుష్పరిణామాల పర్యవసానంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వివిధ రూపాలలో దాని ప్రభావం నేటికీ కొనసాగుతున్నది. మన దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆహార సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఆహార ద్రవ్యోల్బణం 17.9 శాతానికి ఎగబాకి ఆహార భద్రతకు పెనుసవాలు విసిరింది. రెండంకెల ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి ఒక అంకెకు దించుతామని ప్రభుత్వాధినేతలు బీరాలు పలికారు.

కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించి హనుమంతుని తోకలా పెరుగుతూ అది ప్రస్తుతం 15.9 శాతం చేరింది. దాన్ని అదుపు చేసే శక్తి లేక, పోయిన ఏడాది వర్షాలు సరిగా పడలేదని, కరువు కాటకాలు సంభవించాయని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మూలంగా పేదల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ననుసరించి ఆహార వస్తువుల ధరలు పెరిగాయని నమ్మబలుకుతూ ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకుంటున్నారు. అసలు కారణాల జోలికి పోవడం లేదు. ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడింది. మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలలో పౌష్టికాహార లోపాల సమస్య పెరుగు తున్నది. 47 శాతం మంది పిల్లలు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో స్ర్తీ శిశు సంక్షేమశాఖ బహిర్గతం చేసిన సమాచారం మేరకు 50.94 లక్షల మంది పిల్లల బరువు చూస్తే వారిలో 24 లక్షల మంది పోషకాహార లోపాలవల్ల తక్కువ బరువు కలిగివున్నారని తేలింది.

ఈ పూర్వరంగంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు. ఒక్క 2009 సంవత్సరంలోనే అదనంగా 5.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారని పేర్కొంది. ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’ తిరోగమన దిశలో సాగుతున్నదన డానికి ఇది ఒక ప్రబల నిదర్శనంగా ఉదహరించింది. ఈ నివేదికను 2005లో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా రూపొందించారు.

నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరగడంతో పేద ప్రజల కొనుగోలు శక్తి ఇప్పుడు ఇంకా క్షీణించింది. మరొక వైపున పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగి స్తున్న కొలమానాలపై కూడా భిన్నాభిప్రాయా లున్నాయి. ఒక అమెరికన్ డాలర్ అంటే రూ. 46ల దినసరి ఆదాయానికి కింద ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తున్నారు. తిండి, గుడ్డ, ఇల్లే కాదు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, మౌలిక వసతులు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని మానవహక్కులుగా నాగరిక సమాజం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990వ సంవత్సరంలో 37.5 మంది దారిద్య్రరేఖ కింద జీవిస్తున్నారని, ఈ సంఖ్యను 2015 నాటికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 18.75 శాతానికి తగ్గిస్తామని, తదనుగుణంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. 2009-10 ఆర్థిక సర్వేలో పొందుపరిచిన మేరకు 2004-05 ఆర్థిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం పట్టణ ప్రాంతాలలో 25.7 శాతం, మొత్తం దేశంలో సరాసరిన 27.5 శాతం దరిద్ర నారాయణలున్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది.

విశ్వసనీయత ఉన్న ఇతర సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 41.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 37.2 శాతం, సరాసరిన 39.5 శాతం ఉన్నారని కూడా ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కేవిధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దేశం కృషి చేస్తున్నదని విదేశాంగ శాఖామా త్యులు ఎస్.ఎం.కృష్ణ ఐక్యరాజ్యసమితి సదస్సులో సెలవిచ్చారు. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం నుండి బయటపడ్డామని, ఆర్థిక వృద్ధిరేటు ఆశించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నదని, జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 8.8గా నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల సూచిక మేరకు జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,64,178 కోట్లుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2009 డిసెంబర్ నాటికి 284 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ. 43,749కు పెరిగింది. ఎంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధిస్తే అంత ఎక్కువగా సామాజికాభివృద్ధికి నిధులు లభ్యమవుతాయని ప్రజలు కలలుగంటారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమపాళ్లలో పంపిణీ జరగాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు వారి వాటా వారికి చేరాలి. అప్పుడే దారిద్య్ర నిర్మూలనా లక్ష్యం నెరవేరుతుంది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొదటి సమస్య అయిన దారిద్య్ర నిర్మూలన నిరాశాజనకంగా ఉన్నది. రెండవది- సార్వజనీన ప్రాథమిక విద్య. చిన్నారులను 100 శాతం బడిలో చేర్పించాలి. బడిమానేసే పిల్లల సంఖ్యను పూర్తిగా నిరోధించాలి. 2007 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే 15 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు ఉన్న వయోజనులలో అక్షరాస్యత 66 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 61 శాతంగా ఉన్నది. నిష్ర్కమించేవారు దాదాపు 35 శాతం ఉన్నారు. కొన్ని పరిమితులున్నా విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడం నిస్సందేహంగా ముందడుగే. మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు, నిర్దేశిత పరిధిలో పాఠశాలలు వగైరా సంక్లిష్ట సమస్యలను పరిష్కారం లభిస్తేనే చట్టంవల్ల ప్రయోజనం చేకూరు తుంది. మూడవది- ఐదు సంవత్సరాలలోపు శిశు మరణాల నిష్పత్తిని వెయ్యి జననాలకు కనీసం 42కు తగ్గించడం. కానీ ఆడ శిశువుల్లో 55, మగశిశువుల్లో 52, సరాసరి 53 మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగవది- ప్రసూతి మరణాలను లక్ష జననాలకు 109కి తగ్గించడం. 2004-06 నాటికి ఇది 354కు మాత్రమే తగ్గింది.

ఐదవది లింగ సమానత్వం. మహిళా సాధికారత సాధనలో అడుగు ముందుకుపడటం లేదు. చట్ట సభల్లో మూడవవంతు రిజర్వేషన్ల కోసం మహిళా లోకం ఉద్యమాలు చేస్తున్నది. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు తప్ప, వ్యతిరేకించేవాళ్ల నిజస్వరూపాన్ని ఎండగట్టి, బిల్లుకు ఆమోదాన్ని పొందలేకపోతున్నారు.

ఆరవది హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రోగుల సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 2008 డిసెంబర్ నాటికి 3.34 కోట్ల మంది హెచ్‌ఐవీ పీడితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వీరిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు 21 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యాధివల్ల మరణించిన 20 లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది పిల్లలే. 2006 నాటికి మన దేశంలో 25 లక్షలకు పైగా ఉన్నారని జాతీయ ఎయిడ్స్ నిరోధక సంస్థ అంచనా వేసింది. అసంఘటిత కార్మికులు అత్యధికంగా ఈ వ్యాధికి బలైపోతున్నారు. మన రాష్ట్రంలో విషజ్వరాల బారినపడి మరణిస్తున్న గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవు తున్నది. ఏడవది- పర్యావరణ పరిరక్షణ అంశం. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయా రైంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 20.64 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సంపదను, సహజ వనరులను రక్షించుకుంటూ, కాలుష్యాన్ని అరికట్టే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలి, చేసి పచ్చదనాన్ని కాపాడుకోకపోతే ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుంది.

ఎనిమిది- నిధులకు సంబంధించిన అంశం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థూల జాతీయోత్ప త్తిలో 0.7 శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను ఆర్థిక సహాయంగా అందిస్తా మని చేసిన వాగ్దానాన్ని ఐదు దేశాలు మాత్రమే పాక్షికంగా అమలు చేశాయి. రుణ భారాలతో పీకల్లోతు కష్టాలలో ఉన్న దేశాలకు ఈ లక్ష్యాలను చేరుకోవడం అందుకే దుర్లభమవుతున్నది.

అభివృద్ధి, సామాజిక న్యాయం, శాంతియుత సహజీవనం, స్థిరమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధించాలన్నా, విద్య, ఆరోగ్యం, ఆవాసం వగైరా మానవహక్కులు అందరూ సంపూర్ణంగా అనుభవించాలన్నా ముందు షరతు దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల ప్రాతిపదికగానే ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయంగా కార్యాచరణకు మన దేశం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.