Saturday, December 25, 2010

కార్మికులకు అండ కార్మిక సంఘాలే

కార్మికులకు అండ కార్మిక సంఘాలే !
Sat, 19 Jun 2010, IST vv Share Buzz up!
టి. లక్ష్మీనారాయణ

సరళీకృత ఆర్ధిక విధానాల అమలుతో కార్మిక సంఘాలు ఉనికి కోల్పోతున్నాయని, కార్మికుల మన స్తత్వంలో మౌలికమైన మార్పులు సంభవించాయని, అసలు కార్మిక సంఘాల అవసరాన్ని కార్మికులు గుర్తించ డంలేదని, శ్రామిక జనాభాలో అత్యధికంగా ఉన్న అసంఘటిత కార్మికులను సంఘటిత పరిచే కర్తవ్యాన్ని కేంద్ర కార్మిక సంఘాలు విస్మరించిన ఫలితంగా అల్పసంఖ్యాకులైన సంఘటిత కార్మికులకు మాత్రమే వాటి కార్యకలాపాలు పరిమితమైపోయాయని, కార్మిక సంఘాల సభ్యత్వం కుచించుకుపోతున్నదని, కార్మికుల్లో పెటీబూర్జువా, బూర్జువా లక్షణాలు ప్రబలుతున్నాయని, కార్మికసంఘాలు వర్గపోరాటాలకు వ్యతిరేకంగా మసలు కొంటున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు. కార్మిక వర్గమే అంతరించిపోతున్నదనే సిద్ధాంతాన్ని పెట్టుబడి దారీ ఆర్ధిక వేత్తలు ఉద్దేశ్యపూర్వకంగానే కార్మికోద్యమాన్ని నిర్వీర్యం చేయాలనే ధ్యేయంతో జాతీయంగా, అంతర్జాతీయంగా విషప్రచారం చేస్తున్నారు. పెట్టుబడి దారీవర్గం పెద్దఎత్తున దూకుడుగా సాగిస్తున్న దాడితో నిరాశ, నిస్ప్రహల్లో పడిపోయిన కొంతమంది కార్మికవర్గ శ్రేయోభిలాషులు కూడా తెలిసిగానీ, తెలియక గానీ ఈ దుష్ప్రచారానికి కాస్త బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యా నాలు చేస్తున్నారు. మేడే సందర్భంగా ఒక దిన పత్రికలో గొట్టిపాటి సుజాత వ్రాసిన వ్యాసంలో ఈ తరహా అభిప్రాయాలు కొన్నింటిని వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల భవిష్యత్తు ప్రశ్నార్ధకమయ్యిందని పేర్కొనడం అసంబద్దం. కార్మికవర్గ హక్కుల కోసం, పెట్టుబడిదారి వర్గ దోపిడీకి వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో రాజీలేని సమరశీల పోరాటాలను సాగిస్తున్న ఘనమైన చరిత్ర వామపక్ష కార్మిక సంఘాలకున్నది. అలా అని విమర్శల్లో పూర్తిగా హేతుబద్దత లోపించిందని అనలేం. కార్మిక సంఘాల తీరుతెన్నులపై కొన్ని సద్విమర్శలు ఉన్నాయి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నిర్బంధకాండ. రెండోవైపు పెట్టు బడిదారీ వర్గం ఒక్కటై ఎక్కుపెట్టిన దాడి. పర్యవసానంగా యావత్తు కార్మిక వర్గం,దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు ఒడుదుడుకులను, పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఉద్యమాలే ఆలంబన : పారిశ్రామిక విప్లవంతోపాటు కార్మికోద్యమం ఆవిర్భవించింది. బానిస వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అవలక్షణాలను పునికిపుచ్చుకొని పురుడు పోసుకొన్న పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమ దోపిడీలో నూతన పుంతలు తొక్కింది. శ్రమ దోపిడీని అరికట్టడం, సృష్టించిన సంపదలో న్యాయబద్ధమైన వాటా కోసం, ఎనిమిది గంటల పని దినం కోసం, పని భద్రత, మెరు గైన వేతనాలు, సామాజిక న్యాయం, జీవన ప్రమాణాల పెరుగుదల, అంతిమంగా సోషలిస్టు సమాజ నిర్మాణమే లక్ష్యంగా కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ కార్మికోద్యమంలో అంతర్భాగంగా '' ఆలిం డియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎ.ఐ.టి.యు.సి.)'' 1920 అక్టోబరు 31న బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నికృష్టమైన వలస పాలన సాగుతున్న కాలంలో ఉద్భ వించింది. కార్మిక శక్తిని సంఘటితపరచి స్వాతంత్రో ద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది. కార్మికుల హక్కుల కోసం నాటి నుండి నేటి వరకూ వివిధ రూపా లలో అలుపెరగని ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్క్‌మన్స్‌ కాంపెన్‌సేషన్‌ చట్టం-1923 మొదలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టం-1926, పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ చట్టం - 1936, పారిశ్రామిక వివాదాల చట్టం - 1947, ఫ్యాక్టరీల చట్టం - 1948, కనీస వేతనాల చట్టం - 1948, ఇ.యస్‌.ఐ. చట్టం - 1948, ఇ.పి.ఎఫ్‌. చట్టం - 1952, మెటర్నిటీ బెనిఫిట్‌ చట్టం - 1961, బోనస్‌ చట్టం - 1965, కాంట్రాక్ట్‌ కార్మికుల (క్రమబద్ధీకరణ మరియు నిషేధం) చట్టం - 1970, గ్యాట్యుటీ చట్టం - 1972, సమానపనికి సమాన వేతన చట్టం - 1976 వగైరా అనేక కార్మిక చట్టాలను సాధించుకొన్న ఘనమైన చరిత్ర భారత కార్మికోద్యమానికి ఉన్నది. ఇవన్నీ పాలకుల దయాదాక్షిణ్యాలతో రాలేదు, సమరశీల పోరాటాలతో వచ్చాయి. కార్మిక వర్గం తన స్వప్రయోజనాల కోసం పోరాడుతూనే సామాజిక మార్పు కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యం ఉన్నది. ''మార్క్సిజం- లెనినిజం'' సైద్దాంతిక అధ్యయనం, ఆచరణ కార్మికవర్గానికి వంటబట్టాలి. కారల్‌ మార్క్స్‌ ''అదనపు విలువ సిద్ధాంతం'', ''పెట్టుబడి, శ్రమ, వేతనం'', ''వర్గాలు-వర్గపోరాటానికి'' సంబంధించిన చైతన్యాన్ని కార్మికవర్గం పొందాలి.

చీలిక ప్రభావం :

దేశంలో భావ జాల సంఘర్షణ కార్మికోద్యమంలో చీలికకు దారితీసింది. ఆర్ధిక పోరాటాలకే కార్మిక సంఘాలు పరిమితం కావాలని, రాజకీయ సిద్ధాంత కార్యకలాపాలకు దూరంగా ఉండాలనే వాదనలతో చీలిపోయి కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. వామపక్ష భావజాలానికి అంకితమైన కార్మిక వర్గం కూడా దుర దృష్టవశాత్తు చీలిపోయి వివిధ సంఘాలు ఏర్పడ్డాయి. మౌలికంగా దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాల్సిన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన కార్మికవర్గం చీలికలు పేలికలుగా విభజింపబడటం పెట్టుబడిదారీ వర్గానికి మహాదానందం కల్గించే పరిణామం. నేడు దేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయపార్టీలు దాదాపు అందరూ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొని, రాజకీయ లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మిక ప్రయోజనాల కంటే సంకుచిత రాజకీయ ప్రయోజనాలే మిన్నగా ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీలే కాదు వ్యక్తులు సహితం స్వప్రయోజ నాల కోసం తమకున్న ఛరిస్మాతో, వాగాడంబర నినాదాలతో రెచ్చగొడుతూ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఇందుకు ముంబయికి చెందిన దత్తా సామంత్‌ ఒక ప్రబల నిదర్శనం. ఆ స్థాయిలో కాక పోయినా వ్యక్తుల చుట్టూ పరిభ్రమించే కార్మిక సంఘాలు మన రాష్ట్రంలో కూడా దర్శనమిస్తాయి. కులం, మతం ప్రాతిపదికన సంఘాలు పుట్టుకొస్తున్నాయి. మధ్యతరగతి ఉద్యోగులు స్వతంత్య్ర సంఘాలను ఏర్పాటుచేసు కున్నారు. పర్యవసానంగా కార్మిక వర్గంలో వర్గసంకర రాజకీయాలు, మితవాద భావజాలం బలంగా వేళ్ళూను కొనడానికి అవకాశం కలిగింది. ''పెట్టుబడి'' దాష్టీకాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ఆయుధంగా పనిచేయాల్సిన సమిష్ఠి ఉద్యమ బలాన్ని కార్మికులు ప్రదర్శించ లేక పోతున్నారు. ఈ బలహీనత దోపిడీదారులకు వరంగా పరిణమించింది. కార్మిక వర్గంపై ముప్పేటదాడికి పూను కొన్నారు. సరళీకృత ఆర్ధిక విధానాలతో ప్రభుత్వాలు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు బహిరంగ వత్తాసు ఇచ్చాయి. బహుళజాతి సంస్ధలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్యమండలి వత్తిడికి లొంగి కార్మిక చట్టాలను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించి పూనుకొన్నది.

రాజ్యాంగ పరిధిలో బడుగు బలహీన వర్గాలకు అండగానిలిచి, సామాజిక, ఆర్ధిక, రాజకీయ హక్కులను పరిరక్ష్షించాల్సిన న్యాయవ్యవస్ధ సహితం సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ భావజాల ప్రభావానికి గురై కార్మిక వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నది. కార్మికుల ఆఖరిపోరాట ఆయుధమైన సమ్మెహక్కు అనైతికమని, చట్టవ్యతిరేకమని, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకమని సంచాలనాత్మక తీర్పులను వెలవడించడం మొదలు పెట్టాయి. ప్రభుత్వాల అండ, న్యాయస్థానాల కార్మిక వ్యతిరేక తీర్పులను ఆసరాగా చేసుకొని స్వదేశీ, విదేశీ కార్పోరేట్‌ సంస్థలు, చిన్న పెద్ద పెట్టుబడిదారులు లాభాల శాతాన్ని పెంచుకోవడానికి మరింత రెచ్చిపోయి తీవ్ర దోపిడీకి, నిర్బంధకాండకు పూనుకొన్నాయి. ''హైర్‌ అండ్‌ ఫైర్‌'' విధానాన్ని అమలుచేస్తున్నారు. పని భద్రతలేదు. ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి వేతనాల్లో కోత విధిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులను, ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని పెంచేస్తున్నారు. కొత్తగా ఉద్యోగ కల్పనలేదు. వృద్ధాప్య ఫించను లాంటి సామాజిక భద్రతా సదుపాయాల అమలు లేదు, '' కంచే చేను మేసినట్లు'' రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహా విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో, కార్పోరేషన్లలో కాంట్రాక్టు కార్మికులు, క్యాజువల్‌ కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల నియామకం ద్వారా శాశ్వత స్వభావం కలిగిన పనులను చేయించుకొంటున్నారు. పర్యవసానంగా కార్మి కులు, ఉద్యోగులు అభద్రతా భావంలో కొట్టుమిట్టాడు తున్నారు. కార్మిక చట్టాల అమలు కోసం, మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, హక్కుల సాధనకోసం ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనా లంటేనే భయపడే భయానక పరిస్థితులు కల్పించారు. దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న అసంఘటిత కార్మికులను సంఘటితపరచి, సంఘాలు పెట్టి, యాజ మాన్యాలతో బేరసారాలాడే ఉమ్మడి శక్తిని కూడగట్టు కోవడానికి కార్మిక సంఘాలు చేస్తున్న కృషిని మొగ్గలోనే తుంచేస్తున్నారు. సంఘం పెట్టుకోవాలనే ఆలోచన ప్రారంభ దశలో ఉండగానే పని నుండి తొలగించి, మెడబట్టి గెంటేస్తున్నారు. ప్రభుత్వం, కార్మికశాఖ, న్యాయస్థానాలు ఎవర్ని ఆశ్రయించినా ఫలితాలు శూన్యం. అసంఘటిత కార్మిక వర్గానికే కాదు, సంఘటిత కార్మిక వర్గం ఇలాంటి చేదు అనుభవాలనే చవి చూస్తున్నది. ఫలితంగా కార్మికుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొనడం సహజం. సంఘటిత రంగంలోని కార్మి కులు, ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు, సమ్మె లాంటి పోరాటాలలో భాగస్వాములు కావాలంటే వెనకడుగువేస్తున్న మాట నిజం. ఒకరోజు సమ్మెకు మూడు నుండి వారం రోజుల వేతనాన్ని ప్రభుత్వ సంస్థల్లో కోత పెడుతున్నారు. ప్రయివేటు సంస్థల్లో ఏకంగా ఉపాధి నుండి తొలగిస్తున్నారు. ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడు తున్నా ఫలితాలను రాబట్టలేని అననుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరొక వైపున అవినీతిపరులు, దళారులు కార్మికోద్యమంలో ప్రవేశించారు. యాజ మాన్యాలే తమ తొత్తు సంఘాలను ఏర్పాటుచేసి వ్యవహారాలను నడిపిస్తున్నాయి. స్వార్ధం, వ్యాపార నీతి, కండబలం, పైరవీలు, లంచాలిచ్చి పనులు చేయించు కోవడం లాంటి పెడధోరణులు, అన్యవర్గధోరణులు ప్రబలుతున్నాయి. యాజమాన్యం, స్వార్ధపరులైన కార్మిక నేతల అపవిత్ర కూటములు పరిశ్రమల్లో, సంస్థల్లో ఏర్పడుతున్నాయి. ఇలాంటి దుష్టశక్తుల వల్ల కార్మికవర్గానికి తీరని నష్టం సంభవిస్తున్నది. కార్మిక పక్షపాతంతో నిస్వార్ధంగా కార్మికవర్గ శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగాలకైనా వెరవకుండా సైద్ధాంతిక కట్టుబాటుతో పని చేస్తున్న సంఘాలు ఈ సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఉద్యమబాటలో అగ్రభాగాన నడక సాగిస్తూనే ఉన్నాయి. యావత్తు కార్మిక వర్గాన్నీ సంఘటిత పరచడంలో ఆటు పోట్లను ఎదు ర్కొంటున్నాయి. అవరోధాలను అధిగమించడానికి, నిర్మాణ బలహీనతల నుండి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఉనికిపై కొంతమంది దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చకు తెరలేపారు. ''పెట్టుబడి''కి దాసోహం పలికి ఉద్దేశ్యపూర్వకంగానే కార్మికోద్యమాన్ని దెబ్బతీయాలని పథకం ప్రకారం విషప్రచారం చేస్తున్నవారు కొందరైతే, అవగాహనారాహిత్యంతో కార్మికోద్యమం ఎదుర్కొంటున్న పెను సవాళ్ళ తీవ్రతను అర్ధం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నవారు కొందరు ఉన్నారు. దోపిడీకి అవకాశం ఉన్నంత కాలం దానికి వ్యతిరేకంగా ఉద్యమించే కార్మికోద్యమం అనివార్యంగా ఉండి తీరుతుంది. కార్మిక సంఘాల ఆవశ్యకత, మనుగడ కార్మికుల చైతన్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల మూలంగా ఉపాధికల్పన లేని అభివృద్ధి జరుగుతున్నది. డా|| అర్జున్‌ సేన్‌ గుప్తా నివేదిక ప్రకారం కేవలం 2% ఉపాధికల్పన, అది కూడా కేవలం అసంఘటిత రంగంలోనే ఉన్నదని వెల్లడయ్యింది. ఈ రంగంలో ఉపాధికి, వేతనాలకు, సామాజిక భద్రతకు ఏమాత్రం రక్షణ లేదని, పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 45 కోట్ల శ్రామిక జనాభాలో 93% కార్మికులు అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. 7% గా ఉన్న సంఘటిత కార్మికుల్లో అత్యధికులు కేంద్ర కార్మిక సంఘాలలోనో లేదా పారిశ్రామిక, ఆయా సంస్థల కార్మిక సమాఖ్యలలోనో సభ్యులుగా చేరి సంఘటితంగా ఉన్నారు. కానీ అసంఘటితరంగ కార్మికుల్లో అత్యధికులు నిర్మాయుతంకాకుండా కార్మిక సంఘాల వెలుపల చెల్లా చెదురుగా విస్తరించి ఉన్నారు. అందుకే ఎ.ఐ.టి.యు.సి. '' ఆర్గనైజ్‌ అనార్గనైజ్డ్‌ '' (అసంఫటితులను సంఘటిత పరచండి) అన్న నినాదంతో పట్టుదలతో కృషి చేస్తున్నది. దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటి సభ్యత్వం కలిపినా మొత్తం కార్మికుల్లో 15% కి మించిలేదు. అలాగే సంఘాల సభ్యత్వంలో యాభై శాతానికి పైగా అసంఘ టిత కార్మికులే. కానీ మొత్తం అసంఘటిత కార్మికుల సంఖ్యతో పోల్చితే కేవలం 5%మంది సంఘాల్లో వున్నారు. ఈ వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకొని, నిజంగా సంఘాల అండ కావలసిన అసంఘటిత కార్మికులను కూడగట్టి, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పాటుపడాల్సిన ప్రాథమిక బాధ్యత కార్మిక సంఘాలపై ఉన్నది. నేడు కార్మిక సంఘాలకున్న నిర్మాణ పరిమి తులను, సామర్ధ్యాన్ని, అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

సంఘటిత రంగంలో సమస్యలు లేవనుకొంటే పొరపాటే. సామాజిక మార్పుకు చోదక శక్తిగా ఉండి కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన సంఘటిత కార్మికవర్గంలో రాజకీయ, సైద్ధాంతిక అవగాహన బాగా కొరవడింది. అవకాశవాదం, క్యారియరిజం పెరుగుతున్నది. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని చూస్తే సాధారణ ఎన్నికలను తలపించేలా జరుగుతున్నాయి. కార్మికవర్గ సంస్కృతి దెబ్బతింటున్నది. మధ్యతరగతి ఊగిసలాట మనస్థత్వం పెరుగుతున్నది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి, కార్మిక చట్టాల అమలు, హక్కుల సాధనకు మాత్రమే కార్మికసంఘాలను వేదికలుగా పరిగణించే భావన చోటుచేసుకొన్నది. సభ్యత్వం, చందా చెల్లించడం పనులు చేయించుకోవడం అన్న అలోచనను వామ పక్షేతర కార్మిక సంఘాలు ప్రేరేపిస్తున్నాయి. మారుతున్న ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభావంతో మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్న కార్మికులూ మారుతున్నారు. కార్మికవర్గ పోరాట పదును తగ్గకుండా చైతన్యాన్ని నేటితరం కార్మికులకు అందించాల్సిన గురుతర బాధ్యత వామపక్ష కార్మిక సంఘాలపై ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థలో రెండు వర్గాలు, రెండు రకాల వర్గ ప్రయోజనాలు, రెండు దృక్పధాలు పర్యవసానంగా నిరంతర సంఘర్షణ ఉంటుందన్న వాస్తవాన్ని తెలియ జెప్పి వర్గ పోరాటాల వైపు సంఘటిత, అసంఘటిత కార్మికులందరినీ నడిపించాల్సి ఉంది.

Share Buzz up! Share Email Print
«మునపటి ఆర్టికల్

పోలవరం ప్రాజెక్టు పై నాన్చుడు ధోరణి అపోహలకు హేతువు

డు ధోరణి అపోహలకు హేతువు
Tue, 11 May 2010, IST vv Share Buzz up!
టి. లకీëనారాయణ

బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా విస్తృత ప్రయోజనాలు ఇమిడి ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనడం సహజం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని, కేవలం జల విద్యుదుత్పాదన అంశంపై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నుండి మాత్రమే అభిప్రాయం రావలసి ఉన్నదని చెబుతూవస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి, 90% కేంద్ర ప్రభుత్వ నిధుల సహాయంతో నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయబోతున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటనలు చేశారు. కేంద్ర జలవనరుల శాఖా మాత్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించే రీతిలో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రకు ఫైల్‌ సిద్దమ య్యిందన్న వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ సంకల్పంతో, అవరోధాలను అధిగమిస్తూ నిర్మాణ పనులు చేబట్టి దాదాపు పదిహేను వందల కోట్ల రూపా యలు ఖర్చు పెట్టారు. ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరబోతున్నదని, సుదీర్ఘ పోరాటాల ఫలితం కళ్ళముందు ప్రత్యక్షం కాబోతున్నదన్న ఆశలు ప్రజల్లో బలపడ్డాయి. ఈ పూర్వరంగంలో కీ.శే. డా|| వై.యస్‌. రాజశేఖర రెడ్డి దుర్మరణం అశనిపాతంలా తగిలింది. ప్రాణప్రదమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సజావుగా సాగుతుందా ! అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. నిధుల మంజూరులో జాప్యం పర్యవసానంగా నిర్మాణ పనులు మందగించాయి. వార్షిక బడ్జెట్‌లో ఘనంగా నిధులను కేటాయించినా, రాష్ట్ర ఖజానాలో నిధుల లేమి కారణంగా సత్వర ప్రయోజనాలు వనగూడ్చే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి.

జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని, నిధుల సమస్య లేదని, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి పునరుద్ఘాటిస్తున్నా, ఆచరణ తద్భిన్నంగా ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని అటకెక్కిస్తున్నారనే భావన రోజు రోజుకూ బలపడుతున్నది. ఇదే అదనుగా కొంత మంది నాయకులు పోలవరం ప్రాజెక్టును వివాదాస్పదం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి.) కూడా డిజైన్లను ఆమోదించి, అన్ని అనుమతులు వచ్చాక ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తలు గుప్పుమన్నాయి. మళ్ళీ మొదటికొచ్చిందనే గందరగోళాన్ని ప్రజల్లో సృష్టించారు. అలాంటి ఆలోచన లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చినా ప్రజల్లో నమ్మకం కుదరలేదు. రాష్ట్ర ంలో నెలకొన్న సున్నితమైన, సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దగ్గర కొందరు శల్య సారథ్యం చేస్తున్నారనే అపోహలు నెలకొన్నాయి. పోలవరం, ప్రాణిహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని ఒకేసారి జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని వాదించేవారూ ఉన్నారు. ఏ ప్రాజెక్టునూ మరొక ప్రాజెక్టుకు పోటీ పెట్టి మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. దేని ప్రాధాన్యత దానిదే. ప్రజా ప్రయోజనాలే గీటు రాయిగా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మించాలని కోరడంలో తప్పు లేదు. ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వివాదం నడుస్తుంటే జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించడం ద్వారా అడ్డుకాలు పెట్టడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం, రాజమండ్రి, కొవ్వూరు పట్టణాలు పూర్తిగా జలమయం అవుతాయని భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విపరిణామాల మూలంగా ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను పారద్రోలడానికి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆందోళనాపదం పట్టడం సహజమే. ఈ పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. బహుళ ప్రయోజనకారి అయిన పోలవరం ప్రాజెక్టుపై నాన్చుడు ధోరణి ఈ ప్రాజెక్టును రాజకీయ చిక్కుముడుల్లోకి నెట్టడానికి దోహదపడుతుంది. అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రాణహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేసి జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం శుభపరిణామం. నీటికి రాజకీయ రంగు పులమకూడదు. ప్రాజెక్టులను సత్వరం నిర్మించుకోవడం ద్వారా వృధాగా సముద్రం పాలౌతున్న అత్యంత విలువైన నీటిని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాభివృద్ధికే కాదు, సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చు. ప్రాజెక్టులలో నిల్వ జేసిన నీరు రాజకీయ అనుబంధాలకు అతీతంగా ప్రజలందరి త్రాగు, సాగునీటి అవసరాలను తీర్చుతుంది. దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్లో ఆహార భద్రత ప్రధానమైనది. ధాన్యాగారంగా పిలువబడే కృష్టా, గోదావరి డెల్టాలో తరచు సాగునీటి సరఫరాలో ఒడిదుడుకులొచ్చి భారీ నష్టం సంభవిస్తున్నది. గోదావరి డెల్టా ఆయకట్టు సాగుకు అవసరమైన నీటిని నిల్వ చేసి, సకాలంలో సరఫరా చేయడానికి వీలుగా రక్షణ కల్పించే రిజర్వాయరు లేదు. కేవలం నదీ ప్రవాహం, ఆనకట్టలమీద ఆధారపడి సాగు చేయబడుతున్నది. నదీ ప్రవాహం నిరంతరాయంగా ఉండడం లేదు. 30 రోజులకు మించి వరదనీరు ప్రవహించడం లేదు. వరదలప్పుడు ఉధృతంగా ప్రవహించడం, తరువాత కాలంలో నది ఎండిపోవడం లాంటి దుస్థితి నెలకొనడంతో నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. మొత్తం ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి, వేసిన పంటలను కూడా రక్షించలేని గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గడచిన ఏడాది అనుభవం దీన్ని ధృవపరుస్తున్నది. కాబట్టి వరదలు వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకొని సాగు, త్రాగు నీటి అవసరాలకు వినియోగించు కోవాలంటే అనివార్యంగా భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణానికి యుద్ద ప్రాతిపదికపై పూనుకోవాలి. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు.

పోలవరం వల్ల కేవలం అభివృద్ధి చెందిన ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకే ప్రయోజనం అన్న దుష్ప్రచారం జరుగుతున్నది. సంకుచిత ఆలోచనలతో ఈ ప్రాజెక్టు ద్వారా ఒనగూడే బహుళ ప్రయోజనాలను చూడ నిరాకరించడం భావ్యంకాదు. నిజమే ఆ నాలుగు జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాల సాగునీటి సదుపాయం, లక్షలాది మందికి త్రాగునీరు, గోదావరి ఆయకట్టు స్థిరీకరణ కల్పించబడుతుంది. అలాగే బచావత్‌ ట్రిబ్యునల్‌ పోలవరం నుండి 80 టి.యం.సి.లను కృష్ణా డెల్టా ఆయకట్టుకు అందించి, తద్వారా ఆదా అయ్యే కృష్ణానది నికర జలాలను కరువు పీడిత ప్రాంతాల నీటి అవసరాలను తీర్చుకోవడానికి వీలుగా సిఫారసు చేసింది. 80 టి.యం.సి.లలో కర్నాటక, మహారాష్ట్రలకు 35 టి.యం.సి. లను కేటాయించి, మిగిలిన 45 టి.యం.సి.లను మన రాష్ట్రానికి కేటాయించింది. కృష్ణా జలాల వివాదంపై బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు గడువు ముగియడంతో ప్రస్తుతం బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ పూర్తి చేసి, తీర్పు వెలువడించడానికి సిద్ధమవుతున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించి 80 టి.యం.సి.లలో కర్నాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వలేమని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్ళి సాధించాలి. ఆల్మట్టి రిజర్యాయరు నిర్మాణం, అనేక అక్రమ ఆనకట్టలు, చిన్నచిన్న రిజర్వాయర్ల నిర్మాణం పర్యవసానంగా మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. పర్యావరణ మార్పుల వల్ల వర్షాల రాకపోకలు అంచానాలకు అందడం లేదు. సాగునీరు అటుంచి, త్రాగునీటికే కటకటలాడే దుస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వనరుల సమస్యను వివరించడం ద్వారా ట్రిబ్యునల్‌ ఆమోదం పొందగలిగితే, కృష్ణా మిగులు జలాల ఆధారంగా తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెట్టంపాడు (20 టి.యం.సి.), కల్వకుర్తి (25 టి.యం.సి.), కోయల్‌ సాగర్‌ (5 టి.యం.సి.లు), నల్గొండ జిల్లాలో శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువ (ఎస్‌.ఎల్‌.బి.సి., 30 టి.యం.సి.లు), రాయలసీమ ప్రాంతంలో తెలుగు గంగ (29 టి.యం.సి.లు), గాలేరు-నగరి (38 టి.యం.సి.లు), హంద్రీ-నీవా (40 టి.యం.సి.లు), ప్రకాశం జిల్లాలో వెలుగొండ (43.5 టి.యం.సి.లు) మొత్తం 230 టి.యం.సి.ల నీరు నిర్మించబడుతున్న ప్రాజెక్టులకు అవసరం. వీలయితే 80 లేదా 45 టి.యం.సి.ల నీటిని వాడుకునే మహత్తర అవకాశం లభిస్తుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి వీలు పడుతుంది.

రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటు న్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణా ప్రాంత నీటి అవసరాలు తీర్చడానికి పలు భారీ ఎత్తి పోతల పథకాలను అటు గోదావరి, ఇటు కృష్ణా నదులపై నిర్మించుకుంటున్నాము. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి విద్యుత్‌ చాలా అవసరం. పోలవరం వద్ద 960 మెగా వాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఒనగూడుతుంది. జాతి సంపద అయిన విశాఖ ఉక్కు కార్మాగారానికి, మహా నగరంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరానికి నీటి అవసరాలు తీర్చడానికి దోహద పడుతుంది. గోదావరి నదీ జలాల వివాదంపై తీర్పిచ్చిన బచావత్‌ ట్రిబ్యునల్‌ మన రాష్ట్రానికి 1480 టి.యం.సి.ల నీటిని కేటాయించగా, 800 టి.యం.సి.ల నీటిని మాత్రమే ఇప్పటి వరకు వినియోగించుకో గలుగుతున్నాము. మిగిలిన దాదాపు 700 టి.యం.సి.ల నికర జలాలు మరియు వరద నీరు సాగర గర్భంలో చేరుతున్నాయి. గోదావరి నదిపై చిట్ట చివరన నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏడాది వృథాగా సముద్ర గర్భంలో కలుస్తున్న వేలాది టి.యం.సి.ల నీటిని కొంత మేరకైనా జాతి ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చును. బహుళ ప్రయోజనాలు సమ్మిళితమై ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్ని రకాల జాతీయ ప్రాజెక్టు హోదాకు అర్హమైనది. కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ జాప్యం చేయకుండా వెంటనే ఆమోదించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇది జాతి ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే ప్రజానీకంలో, ప్రాంతాలలో ఉన్న తీవ్ర ఆవేదన, ఆందోళనను పరిగణలోనికి తీసుకొని సంతృప్తికరమైన పునరావాస పథకాన్ని ముందుగానే పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ప్రత్యేకించి అత్యంత వెనుకబడ్డ గిరిజనులు అత్యధికంగా నష్ట పోతున్న విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మరింత మెరుగైన ప్యాకేజీని అమలు చేయాలి.

సహస్రాభి లక్ష్యాల సాధన

హోం > వివరాలు
సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం
‘సహస్రాబ్ది లక్ష్య సాధన’ ఎజెండా స్థితి-గతి
విశ్లేషణ...

అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు.

ఐక్యరాజ్య సమితిలో సామాజిక స్పృహ వికసిం చింది. ప్రపంచ దేశాధినేతలంతా ఒకే వేదికపై గుమి గూడారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కటిక దారిద్య్రాన్ని, ఆకలి బాధలను కనీసం సగానికన్నా తగ్గిస్తామని శపథం చేశారు. సార్వజనీన ప్రాథమిక విద్య, లింగ వివక్ష లేని సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల తగ్గింపు, తల్లుల ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ / ఎయిడ్స్ మలేరియా తదితర భయానక అంటువ్యాధులను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయంగా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రతినబూనారు.

ఈ మేరకు 2000 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 179 సభ్యదేశాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల ప్రజలను మానవాభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధిస్తామని గడువు విధించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగిడిన సందర్భంగా నిర్దేశించుకున్న ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’లో ప్రగతిని సమీక్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20-22 తేదీల్లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు నిర్వహించింది. ప్రతిజ్ఞ చేసి దశాబ్దం గడచిపోయింది. ఇహ! మిగిలింది ఐదు సంవత్సరాలు మాత్రమే. లక్ష్యాలను అసలు చేరుకోగలమా? అన్నది శేష ప్రశ్న.

ఈ ఆశావహదృక్పథాన్ని 2007-08 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునా దులనే కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నీరు గార్చింది. సంక్షోభ దుష్పరిణామాల పర్యవసానంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వివిధ రూపాలలో దాని ప్రభావం నేటికీ కొనసాగుతున్నది. మన దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆహార సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఆహార ద్రవ్యోల్బణం 17.9 శాతానికి ఎగబాకి ఆహార భద్రతకు పెనుసవాలు విసిరింది. రెండంకెల ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి ఒక అంకెకు దించుతామని ప్రభుత్వాధినేతలు బీరాలు పలికారు.

కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించి హనుమంతుని తోకలా పెరుగుతూ అది ప్రస్తుతం 15.9 శాతం చేరింది. దాన్ని అదుపు చేసే శక్తి లేక, పోయిన ఏడాది వర్షాలు సరిగా పడలేదని, కరువు కాటకాలు సంభవించాయని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మూలంగా పేదల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ననుసరించి ఆహార వస్తువుల ధరలు పెరిగాయని నమ్మబలుకుతూ ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకుంటున్నారు. అసలు కారణాల జోలికి పోవడం లేదు. ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడింది. మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలలో పౌష్టికాహార లోపాల సమస్య పెరుగు తున్నది. 47 శాతం మంది పిల్లలు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో స్ర్తీ శిశు సంక్షేమశాఖ బహిర్గతం చేసిన సమాచారం మేరకు 50.94 లక్షల మంది పిల్లల బరువు చూస్తే వారిలో 24 లక్షల మంది పోషకాహార లోపాలవల్ల తక్కువ బరువు కలిగివున్నారని తేలింది.

ఈ పూర్వరంగంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు. ఒక్క 2009 సంవత్సరంలోనే అదనంగా 5.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారని పేర్కొంది. ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’ తిరోగమన దిశలో సాగుతున్నదన డానికి ఇది ఒక ప్రబల నిదర్శనంగా ఉదహరించింది. ఈ నివేదికను 2005లో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా రూపొందించారు.

నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరగడంతో పేద ప్రజల కొనుగోలు శక్తి ఇప్పుడు ఇంకా క్షీణించింది. మరొక వైపున పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగి స్తున్న కొలమానాలపై కూడా భిన్నాభిప్రాయా లున్నాయి. ఒక అమెరికన్ డాలర్ అంటే రూ. 46ల దినసరి ఆదాయానికి కింద ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తున్నారు. తిండి, గుడ్డ, ఇల్లే కాదు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, మౌలిక వసతులు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని మానవహక్కులుగా నాగరిక సమాజం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990వ సంవత్సరంలో 37.5 మంది దారిద్య్రరేఖ కింద జీవిస్తున్నారని, ఈ సంఖ్యను 2015 నాటికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 18.75 శాతానికి తగ్గిస్తామని, తదనుగుణంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. 2009-10 ఆర్థిక సర్వేలో పొందుపరిచిన మేరకు 2004-05 ఆర్థిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం పట్టణ ప్రాంతాలలో 25.7 శాతం, మొత్తం దేశంలో సరాసరిన 27.5 శాతం దరిద్ర నారాయణలున్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది.

విశ్వసనీయత ఉన్న ఇతర సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 41.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 37.2 శాతం, సరాసరిన 39.5 శాతం ఉన్నారని కూడా ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కేవిధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దేశం కృషి చేస్తున్నదని విదేశాంగ శాఖామా త్యులు ఎస్.ఎం.కృష్ణ ఐక్యరాజ్యసమితి సదస్సులో సెలవిచ్చారు. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం నుండి బయటపడ్డామని, ఆర్థిక వృద్ధిరేటు ఆశించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నదని, జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 8.8గా నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల సూచిక మేరకు జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,64,178 కోట్లుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2009 డిసెంబర్ నాటికి 284 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ. 43,749కు పెరిగింది. ఎంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధిస్తే అంత ఎక్కువగా సామాజికాభివృద్ధికి నిధులు లభ్యమవుతాయని ప్రజలు కలలుగంటారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమపాళ్లలో పంపిణీ జరగాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు వారి వాటా వారికి చేరాలి. అప్పుడే దారిద్య్ర నిర్మూలనా లక్ష్యం నెరవేరుతుంది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొదటి సమస్య అయిన దారిద్య్ర నిర్మూలన నిరాశాజనకంగా ఉన్నది. రెండవది- సార్వజనీన ప్రాథమిక విద్య. చిన్నారులను 100 శాతం బడిలో చేర్పించాలి. బడిమానేసే పిల్లల సంఖ్యను పూర్తిగా నిరోధించాలి. 2007 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే 15 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు ఉన్న వయోజనులలో అక్షరాస్యత 66 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 61 శాతంగా ఉన్నది. నిష్ర్కమించేవారు దాదాపు 35 శాతం ఉన్నారు. కొన్ని పరిమితులున్నా విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడం నిస్సందేహంగా ముందడుగే. మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు, నిర్దేశిత పరిధిలో పాఠశాలలు వగైరా సంక్లిష్ట సమస్యలను పరిష్కారం లభిస్తేనే చట్టంవల్ల ప్రయోజనం చేకూరు తుంది. మూడవది- ఐదు సంవత్సరాలలోపు శిశు మరణాల నిష్పత్తిని వెయ్యి జననాలకు కనీసం 42కు తగ్గించడం. కానీ ఆడ శిశువుల్లో 55, మగశిశువుల్లో 52, సరాసరి 53 మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగవది- ప్రసూతి మరణాలను లక్ష జననాలకు 109కి తగ్గించడం. 2004-06 నాటికి ఇది 354కు మాత్రమే తగ్గింది.

ఐదవది లింగ సమానత్వం. మహిళా సాధికారత సాధనలో అడుగు ముందుకుపడటం లేదు. చట్ట సభల్లో మూడవవంతు రిజర్వేషన్ల కోసం మహిళా లోకం ఉద్యమాలు చేస్తున్నది. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు తప్ప, వ్యతిరేకించేవాళ్ల నిజస్వరూపాన్ని ఎండగట్టి, బిల్లుకు ఆమోదాన్ని పొందలేకపోతున్నారు.

ఆరవది హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రోగుల సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 2008 డిసెంబర్ నాటికి 3.34 కోట్ల మంది హెచ్‌ఐవీ పీడితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వీరిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు 21 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యాధివల్ల మరణించిన 20 లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది పిల్లలే. 2006 నాటికి మన దేశంలో 25 లక్షలకు పైగా ఉన్నారని జాతీయ ఎయిడ్స్ నిరోధక సంస్థ అంచనా వేసింది. అసంఘటిత కార్మికులు అత్యధికంగా ఈ వ్యాధికి బలైపోతున్నారు. మన రాష్ట్రంలో విషజ్వరాల బారినపడి మరణిస్తున్న గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవు తున్నది. ఏడవది- పర్యావరణ పరిరక్షణ అంశం. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయా రైంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 20.64 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సంపదను, సహజ వనరులను రక్షించుకుంటూ, కాలుష్యాన్ని అరికట్టే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలి, చేసి పచ్చదనాన్ని కాపాడుకోకపోతే ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుంది.

ఎనిమిది- నిధులకు సంబంధించిన అంశం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థూల జాతీయోత్ప త్తిలో 0.7 శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను ఆర్థిక సహాయంగా అందిస్తా మని చేసిన వాగ్దానాన్ని ఐదు దేశాలు మాత్రమే పాక్షికంగా అమలు చేశాయి. రుణ భారాలతో పీకల్లోతు కష్టాలలో ఉన్న దేశాలకు ఈ లక్ష్యాలను చేరుకోవడం అందుకే దుర్లభమవుతున్నది.

అభివృద్ధి, సామాజిక న్యాయం, శాంతియుత సహజీవనం, స్థిరమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధించాలన్నా, విద్య, ఆరోగ్యం, ఆవాసం వగైరా మానవహక్కులు అందరూ సంపూర్ణంగా అనుభవించాలన్నా ముందు షరతు దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల ప్రాతిపదికగానే ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయంగా కార్యాచరణకు మన దేశం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

టి.లక్ష్మీనారాయణ
ఎఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు

అవినీతి పై వ్యాసం

హోం > వివరాలు
అందలం ఎక్కుతున్న అవినీతి మహమ్మారి
దేశ భవితవ్యానికి ఎసరు
గత కుంభకోణాల చరిత్ర రికార్డును బద్దలు కొడుతూ 2010 సంవత్సరంలో పలు భారీ కుంభకోణాలు వెలుగు చూశాయి. వాటిలో ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ. 1,76,000 కోట్లకు గండి కొట్టిన భారీ కుంభకోణం అతిపెద్దది.

‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పార్లమెంటు నిండు సభలో ప్రకటించడంతో దేశాధి నేతలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజులు గడవక ముందే జాతి మొత్తం తలదించుకునే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు కుంభకోణం వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలను అచేతనం చేస్తే దిక్కుతోచక అధికార కూటమి నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు. అవినీతి చట్ట ప్రకారం నేరం.


కానీ, అవినీతే నేడు రాజ్యమేలుతు న్నది. అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతూ వ్యవస్థీకృత మయింది. అవినీతి, నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను సవాలు చేస్తూ, సమాంతరంగా, విషవృక్షంలా ఎదుగుతూ, అభివృద్ధికి అవరోధంగా పరిణమిం చాయి. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2003 సంవత్సరం సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం 133 దేశాల్లో మన దేశం అవినీతిలో 87వ స్థానాన్ని ఆక్రమించి అత్యంత అవినీతి దేశంగా నమోదయింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూఎన్‌డీపీ) వెల్లడించిన మానవ వనరుల అభివృద్ధి సూచిక-2010 గణాంకాల ప్రకారం 169 దేశాల్లో మన స్థానం 119. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం. కానీ, విచ్చలవిడి అవినీతి కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతున్నది.

అవినీతి అంతానికి ఏకైక పరిష్కారమార్గమంటూ ఏదీ లేదని, వివిధ స్థాయిల్లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిం చాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ సీబీఐ, ఏసీబీ అధికారులకు ఆ మధ్య ఒక సమావేశంలో హితబోధ చేశారు. కానీ, ఒక కుంభకోణాన్ని మరో కుంభ కోణం తలదన్నుతూ ప్రజా ధనాన్ని కొల్లగొడుతుంటే చేవ చచ్చి, గుడ్లప్పగించి చూస్తున్నారు. అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అవినీతి అంతానికి న్యాయవ్యవస్థ ఇతర సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దురదృష్ట మేమంటే ఆ అత్యున్నత న్యాయస్థానం వైపు కూడా వేలెత్తి చూపించే దుస్థితి దాపురించింది.

అభివృద్ధి పేరిట అమలవుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల అవినీతి, నల్ల ధనం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీ ఆర్) సంస్థ 2000 సంవత్సరంలో ప్రచురించిన అధ్యయన నివేదిక ప్రకారం నల్లధనం స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 18 నుంచి 21 శాతం వరకు ఉన్నది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని దేశ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం శాతం ఏటేటా పెరిగిపోతున్నది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఎకనామిక్స్ డిపార్టుమెంటులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా॥అరుణ్‌కుమార్ ‘భారతదేశంలో నల్లధనం’ అన్న తన పుస్తకంలో నల్లధనం దాదాపు 40 శాతానికి పెరిగిం దని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ.61,64,000 కోట్లు. అంటే అందులో నల్లధనం మొత్తం దాదాపు రూ.25 కోట్లు అన్నమాట. నల్లధనానికి అధిపతులుగా ఉన్న కార్పొ రేట్ సంస్థలు, పౌరులు నిజాయితీగా చట్టానికి బద్దులై తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని ఆదాయంగా ప్రకటిస్తే ఆదాయ పన్ను చట్ట ప్రకారం 30 శాతం పన్ను చెల్లిస్తే, ప్రభుత్వ ఖజానాకు రూ.7 లక్షల 50 వేల కోట్లు జమ అవుతుంది.

అవినీతిని నిర్ధిష్టంగా అంచనా వేయడానికి కొల బద్దలు లేవు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ అధ్యయన నివేదిక 2010 గత నెలలో విడుదలైంది. దాని ప్రకారం అక్రమ లావాదేవీల ద్వారా ప్రతిరోజు సరాసరిన 240 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. 1948-2008 సంవత్సరాల మధ్య దేశం నుంచి 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపో యింది. మరో 17,800 కోట్ల డాలర్ల సొమ్ము దేశంలోనే నల్లధనంగా చలామణిలోకి వచ్చింది. అందులో గడచిన దశాబ్ద కాలంలోనే 5.75 లక్షల కోట్ల రూపా యలను కోల్పోయినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ అంచనాల కంటే అధికంగానే నల్ల ధనం పోగు పడ్డదని కూడా వ్యాఖ్యానించింది.

1988 సంవత్సరంలో అవినీతి నివారణ చట్టం అమలులోకి వచ్చింది. యూపీఏ-1 ప్రభుత్వ కాలంలో సమాచార హక్కు చట్టం వచ్చింది. అవినీతిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ) 2003 అక్టోబర్ 13న కన్వెన్షన్ 58/4 (తీర్మానం) చేసి, సభ్య దేశాలన్నింటినీ అమలు చేయాలని కోరింది. అలాగే ప్రతి ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని యూఎన్‌ఓ పాటిస్తున్నది.
గత కుంభకోణాల చరిత్ర రికార్డును బద్దలు కొడుతూ 2010 సంవత్సరంలో పలు భారీ కుంభ కోణాలు వెలుగు చూశాయి. వాటిలో ‘2జీ స్పెక్ట్రం’ కేటాయింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ.1,76,000 కోట్లకు గండికొట్టిన భారీ కుంభకోణం అతిపెద్దది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి, ఐపీఎల్ క్రికెట్ కుంభకోణం, దేశ రక్షణ కోసం యుద్ధంలో ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుం బాల వితంతువుల కోసం నిర్మిస్తున్న ‘ఆదర్శ్ సొసైటీ’ అపార్ట్‌మెంట్స్‌ను రాజకీయ నాయకులకు, సైన్యాధికా రులకు, ఉన్నతాధికారులకు కేటాయించడం, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మ కమైన ఆర్థిక సంస్థలలో రుణాల మంజూరులో భారీ లంచాలకు పాల్పడటం, కర్ణాటక ముఖ్యమంత్రి ప్రభు త్వ భూములను సమీప బంధువులకు దారాదత్తం చేయడం వంటి అవినీతి కుంభకోణాలు ఇటీవల దేశాన్ని కుదిపేశాయి.

జాతి యావత్తు తల దించు కునేలా చేశాయి. కుంభకోణాలకు బాధ్యులైన కేంద్ర మంత్రులు ఎ.రాజా, శశిథరూర్, పార్లమెంటు సభ్యు లు సురేష్ కల్మాడీ, కేవలం పదవులు కోల్పోతున్నారు. అక్రమ సంపాదన వారి సొంతమవుతున్నది. ప్రజాధ నాన్ని, ఆస్తులను తిరిగి రాబట్టుకోవాలి కదా? అలాంటి చర్యలు చేపట్టడానికి చట్టాలే కరువ య్యాయి. 1986 సంవత్సరంలో బోఫోర్స్ ఆయుధాల కొనుగోలులో కుంభకోణం మొదలుకొని, ఫ్రాన్స్ నుండి 1990 సంవత్సరంలో ఎయిర్‌బస్ ఎ-320 కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన రూ.2,500 కోట్లు కిక్‌బ్యాక్ కుంభకోణం, 1993 సంవత్సరంలో రూ.3,000 కోట్ల హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కాం, గోల్డ్ స్టార్ స్టీల్ అండ్ అల్లాయ్స్ వివాదం, 1992 సంవత్సరంలో ప్రధాన మంత్రి పదవిని కాపాడుకో వడానికి కోటి రూపాయల లంచంతో పి.వి.నరసింహా రావు సూట్‌కేస్ ఇచ్చారనే కేసు, జేఎంఎం అవినీతి కేసు, హవాలా స్కామ్, యూరియా స్కామ్ వగైరా కుంభకోణాల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్విని యోగానికి పాల్పడ్డ వారికి ఎవరికీ శిక్షలు పడలేదన్న సంగతి తెలిసిందే.

అధికార యంత్రాంగంలో అవినీతి అంతర్భాగమై పోయింది. రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ (ఎసీబీ) అంచనా మేరకు 10శాతం మంది ప్రభుత్వోద్యోగులు మాత్రమే అవినీతికి దూరంగా నిజాయితీతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. 10 నుంచి 15శాతం మంది పూర్తిగా ఊబిలో కూరుకుపోయి సంస్కరించడానికి కూడా అనర్హులుగా ఉన్నారు. 70శాతం మందిని సంస్కరించడానికి అర్హులుగా గుర్తించారు. ఏ అవినీతి ఉన్నతాధికారిని లేదా ఉద్యోగిని పట్టుకున్నా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయట పడుతున్నాయి. అయినా, అవినీతి అధికారులకు ఏమాత్రం భయం లేకుండా పోతున్నది. కారణం ఏసీబీ నమోదు చేసిన కేసులను మర్నాటికే ఉపసంహరించుకోగలుగుతు న్నారు. పెపైచ్చు ప్రమోషన్లు పొందుతున్నారు. 2003 సంవత్సరం నుంచి ఏడాదికి సరాసరిన 500 నుండి 700 వరకు కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా. అవినీతి అధికారులందరిపై కేసులు నమోదు చేయడం కూడా అసాధ్యం.

ఏసీబీ ఎన్ని కేసులు పెట్టింది? ఎన్ని కేసులను ఉపసంహరించింది? ఉపసంహరణకు కార ణాలేంటి? ఎంత మందిని శిక్షించారు? అన్న వివరా లను బహిరంగ పరిచి పారదర్శకతను ప్రదర్శించగ లిగితే ఆ సంస్థ విశ్వసనీయత పెరుగుతుంది.

సీబీఐ, ఏసీబీ, రాష్ట్ర, కేంద్ర విజిలెన్స్ కమిషన్స్, లోకాయుక్త లాంటి సంస్థలు అవినీతిని బహిర్గతం చేసి అరికట్టాల్సిందిపోయి ‘కాగితపు పులులు’గా మారిపో యాయి. బహుళ జాతి సంస్థలు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను, ధనాన్ని దోపిడీ చేస్తుంటే నివారించే శక్తి ప్రభుత్వాలకు లేకపోయింది.

అక్రమ సంపాదనను, నల్లధనాన్ని కాపాడుకోవ డానికి స్విస్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక నేరస్తులు, పన్ను ఎగవేతదారులు, అవినీతిపరులు పోగు చేసుకున్న దొంగ డబ్బును భద్రంగా కాపాడే నేరపూరిత బ్యాంకింగ్ వ్యవస్థను స్విట్జర్లాండ్ దేశం పటిష్టంగా నిర్వహిస్తున్నది. ఖాతాదారుల రహస్యా లను ఎట్టి పరిస్థితుల్లోను బహిరంగపరచకుండా అక్రమార్జనపరులకు రక్షణ కవచంగా స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ప్రపంచ నలుమూ లల నుంచి నల్లధనాన్ని దాచుకోవడానికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, డిపాజిట్ చేస్తున్నారు. స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించిన సమా చారం మేరకు దాదాపు 75 లక్షల కోట్ల రూపాయల మేర భారతీయుల డిపాజిట్స్ అక్కడి బ్యాంకుల్లో ఉన్నాయి.


సుమారు 250 లక్షల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను మన దేశస్తులు స్విస్ బ్యాంకుల్లోనే కాక ఇతర దేశాల ఆర్థిక సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసుకొన్నట్లు మరో అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నది డాలర్. ఆ విదేశీమారక ద్రవ్యపు నిల్వలను కొల్లగొట్టి విదేశాలకు తరలించడం వలన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. మరొక వైపున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధుల కొరతతో అప్పుల వేటలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, సంపన్న దేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టి, విషమ షరతులకు తలొగ్గి దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల డబ్బును స్వదేశానికి తీసుకురాగలిగితే జాతి ఆర్థికావసరాలు తీరడమే కాకుండా ప్రపంచ దేశాలలోని సంపన్న దేశాల సరసన మన దేశం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది అంతసులభమైన పనికాదు. రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం, జాతి యావత్తూ అంకిత భావంతో కృషి చేయాలి. అంతర్జాతీయ వేది కలైన ఐక్యరాజ్య సమితి, ఇతర వేదికలపై అంతర్జా తీయంగా రాజకీయ ఒత్తిడి పెద్ద ఎత్తున తీసుకొస్తే తప్ప ఈ లక్ష్యం నెరవేరదు. అలాగే మన దేశం నుంచి ఏటా లక్ష మంది వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తు న్నారు. వారిలో దాదాపు 25 వేల మంది సంవత్స రంలో పలు దఫాలు ఆ దేశానికి వెళ్ళి వస్తున్నట్లు సమాచారం. అలాంటి వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించి ఆర్థిక నేరాల నిఘా సంస్థలు పని చేస్తే స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారిని పసిగట్టవచ్చునని నిపుణుల అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజా యితీతో, రాజకీయ సంకల్పంతో, దేశ ప్రయోజనా లను పరిరక్షించడానికి కంకణబద్ధులైతే స్విస్ బ్యాం కుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకు రావడం అసాధ్యం కాదు.

ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడానికి రాజకీ యాలకతీతంగా ప్రజానీకం, ప్రత్యేకంగా యువతరం విస్తృతమైన ఉద్యమాన్ని అవినీతికి వ్యతిరేకంగా నిర్మిం చాల్సిన తక్షణావసరం ఎంతైనా ఉన్నది.
టి. లక్ష్మీనారాయణ
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐటీయూసీ
(నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం)
More Headlines