Wednesday, April 20, 2011

అవినీతిని అరికడితేనే అభివృద్ధి!

published in Sakshi Telugu daily on 2011 April 18

అవినీతిని అరికడితేనే అభివృద్ధి!
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నేతృత్వంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక పోరాటం జాతి దృష్టిని ఆకర్షించి అనూహ్యమైన మద్దతును సాధించడం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. అధికార పీఠంపై ఉన్న పెద్దలు ఆగమేఘాలపై కదిలి లోక్‌పాల్ బిల్లును రూపొందించడానికి పదిమందితో కూడిన అధికార, అనధికార సభ్యులతో కమిటీని నియమిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం మెడలు వంచగలిగామని ఉద్యమకారుల్లోనూ, దేశ నలుమూలలా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ప్రజాశక్తి ముందు పాలకులు బలాదూర్ అన్న భావన సర్వత్రా నెలకొన్నది. ఇది శుభపరిణామం. పోరాటాలతోనే ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం సామాన్య ప్రజానీకంలో కూడా కలిగింది. అవినీతిపై తొలి విజయం సాధించా మని, ‘‘జన్ లోక్‌పాల్’’ బిల్లును యూపీఏ-2 ప్రభుత్వం చచ్చినట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయిస్తుందని, అవినీతి అంతానికి రోజులు దగ్గర పడ్డా యని భ్రమించేవారు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. కానీ, ఇది బలంగా వేళ్లూనుకొని పాతుకుపోయి ఉన్న దీర్ఘకాలిక సమస్య. అయితే, విస్తృతస్థాయి చర్చకు, కార్యాచరణకు మాత్రం ఈ ఆందోళన అనుమానం లేకుండా తెరలేపింది. ప్రజల ఎజెండాగా దేశం ముందుకు వచ్చింది.
‘‘మాయల పకీరు ప్రాణం సప్తసముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొరల్రో దాగి ఉన్న చిలకలో ఉందన్న’’ చందంగా అవినీతి మూలాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి.

దోపిడీకి మూలం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ. చట్టబద్ధ దోపిడీని ‘అవినీతి’గా నామకరణం చేసి, దానికి వ్యతి రేకంగా పోరాడుతున్నాం. లోపభూయిష్టమైన వ్యవస్థలో మౌలిక మార్పుల కోసం ఉద్యమిస్తే అది యావత్తు మాన వాళిని దోపిడీ నుండి విముక్తి చేస్తుంది. అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయ వ్యవస్థను ప్రజలు చీదరించుకుం టున్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే చట్టాలు కావాలనే ప్రగాఢమైన వాంఛ వారిలో ఉన్నది. అందుకే మచ్చలేని గాంధేయవాది అన్నా నిజాయితీగా, అహింసా పద్ధతుల్లో పోరాటానికి నడుంకడితే అందరూ మద్దతు పలకడానికి ‘క్యూ’కట్టారు. వివిధ రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు, బుద్ధి జీవులు, సమాజం ఉన్నతంగా ఉండాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థి, యువ జనుల నుండి కార్పొరేట్ సంస్థల పెద్దలదాకా మద్దతు పలికారు.

కానీ... నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలలో పని చేస్తూ, సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్న వారిని భాగస్వాములను చేయకపోవడం ఈ ఉద్యమం బలహీనత. రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్య మాన్ని నిర్మించాలనడం సమంజసం. కానీ సమాజాన్ని నియంత్రించే రాజకీయాలనే దూరంగా పెట్టాలన్న ఆలోచన సత్ఫలితాలను ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను మాత్రమే రూపొందించగలదు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే ఆ బిల్లు పార్ల మెంట్ ఉభయ సభల్లో ఆమోదంపొంది చట్టంగా రూపొం ది ప్రజల చేతుల్లో ఆయుధంగా మారుతుంది.

అభివృద్ధికి ఆగర్భ శత్రువు

ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అవినీతి అతి పెద్ద అవ రోధం. అభివృద్ధి ముసుగులో అవినీతిని ప్రోత్సహిస్తు న్నది, వటవృక్షంలా పెంచి పోషిస్తున్నది, పాలకుల విధానాలే. నీతికి, నిజాయితీకి మారుపేరుగా పేరొందిన మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వాస్తవానికి అవినీతిని పెంచి పోషిస్తున్న నయా ఉదారవాద సరళీకృత ఆర్థిక విధానాల రూపశిల్పి. 2జీ స్పెక్ట్రం కుంభకోణం ద్వారా లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల జాతి సంపదను కొల్లగొడితే, సంకీర్ణ రాజకీయాల వల్ల రాజీపడి, నిస్సహాయుడిగా మిగిలిపోయానని నిస్సిగ్గుగా బహిరంగ ప్రకటన చేసిన దీక్షాదక్షుడు. అవినీతిని పెంచి పోషిస్తున్న అలాంటి ప్రభుత్వ పెద్దలు అన్నా దీక్షకు మాత్రం తక్షణం స్పందించారు. దీనికి ప్రధానంగా రెండు మూడు కార ణాలు కనిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికయిన పార్ల మెంటులో ప్రతిపక్షాల ఆందోళనను లెక్క చేయకుండా, బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా ముందుకు రావడానికి గల కారణం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలే. అన్నా దీక్షతో అవినీతి వ్యతిరేక పోరాటం మరింత విస్తరించి, బలపడితే రాజకీయంగా తీవ్ర నష్టం జరిగి, ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఘోరపరాజం చవిచూడాల్సి వస్తుందని భయపడ్డారు. ఉద్యమకారుల డిమాండ్లను సూత్రప్రాయంగా అంగీక రించడం ద్వారా ఉద్యమ ఉధృతికి అడ్డుకట్ట వేయ వచ్చు. అవినీతికి మేమూ వ్యతిరేకమే. ఇదిగో, లోక్ పాల్ బిల్లును తీసుకు రాబోతున్నామనే సంకేతాన్ని వెల్లడించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతానికి గండం గడిస్తే, తరువాత సంగతి చూద్దాం! అపరచాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది కాబట్టి ‘జన్ లోక్‌పాల్’ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించడం, దానిపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించి, ఆమోదించడం అంత సులభం కాదనే భరోసా ఉండవచ్చు. పార్లమెంటు పొందికపై వారికి పూర్తి అవగాహన ఉన్నది. అభివృద్ధికి నమూ నాగా పెరిగిపోతున్న కుబేరులు, అపర కుబేరులు, కార్పొరేట్ సంస్థల అక్రమ సంపాదనకు కాపలా కుక్కలుగా పనిచేస్తున్న వారు అక్కడున్నారు. ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించి పదవులను చెరబట్టిన ప్రజాకంటకులూ ఉన్నారు. అక్రమ సంపాదనాపరులు, అవినీతిపరులూ అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటులో అవినీతికి సమాధికట్టే ‘జన్ లోక్‌పాల్’ బిల్లుకు ఆమోదముద్ర పడటం అంతసులభం కాదని వారికి బాగా తెలుసు.

నాలుగు దశాబ్దాల కాలంలో ఎనిమిదిసార్లు లోక్‌పాల్ ముసాయిదా బిల్లులు సభలో ప్రవేశపెట్టినా ఒనగూడిం దేమీలేదన్న అనుభవం వారి ముందున్నది. పెపైచ్చు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్న రాజకీయపార్టీల మద్దతు అడక్కుండానే లభిస్తుందన్న ధీమా!

నీతికి పట్టం కట్టాలి

అవినీతిని గూర్చి మాట్లాడే వాళ్లు, దాని పునాదులు ఎక్కడున్నాయో కూడా ఆలోచించాలి. రాజకీయ అవినీతి అత్యంత ప్రధానమైనది. మొత్తం వ్యవస్థను అది భ్రష్టు పట్టిస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థనే అపహాస్యం చేసి క్రియాశూన్యం చేస్తున్నది. చట్టబద్ధ పాలనకు చరమగీతం పాడుతూ అవినీతి, అక్రమాలు, అక్రమ సంపాదన, అధికార దాహం అందలం ఎక్కి కూర్చున్నాయి. ‘‘గొంగళ్లో కూర్చోని అన్నం తింటూ వెంట్రుకలు రాకూడదని’’ భావిస్తే ఫలితం ఉండదు. అందుకే ఈ లోపభూయిష్టమైన వ్యవస్థపైన కన్నెర్ర జేయాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి. అధికార దుర్వి నియోగానికి ఎదురొడ్డి నిలవాలి. ప్రజానుకూల చట్టాల కోసం ఉద్యమించాలి, సాధించాలి. కేవలం చట్టాల సాధనతోనే ఫలితాలు ప్రజల ముంగిటకు రావు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టాలు, కార్మికుల హక్కులను పరిరక్షించడానికి ఉన్న కార్మిక చట్టాలు, భూసంస్కరణల చట్టం లాంటి అనేక చట్టా లున్నా అమలులో చట్టుబండలుగా మారిపోయాయి. అధికార పీఠాన్ని అధిరోహించిన వారికి రాజకీయ సంకల్పం, అంకితభావం లేని పక్షంలో ఆశించిన ఫలి తాలు చేకూరవు. చట్టాలు ప్రజల చేతుల్లో నిజమైన ఆయుధాలుగా మారాలి. లేనిపక్షంలో నిరుపయోగంగా మూలన పడిపోతాయి. 1988 సంవత్సరంలో చేయబడిన అవినీతి నిరోధక చట్టానికి ఇదే గతి పట్టింది. కడకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గోడలకూ అవినీతి చెదలు పట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఏసీబీ లాంటి సంస్థలూ పాలక పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కాగ్ నివేదికలకు విలువ లేకుండా పోయింది.

వీటన్నింటి పర్యవసానంగానే అవినీతికి సంబంధించిన కేసుల నమోదు, విచారణ, శిక్షణలు విధించడం, అమలు చేసే సర్వహక్కులను జన్ లోక్‌పాల్ చట్టానికి దఖలు పరచాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. చట్ట పరిధిలోకి ప్రధాన మంత్రి మొదలుకొని మంత్రులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులం దరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకొన్నది. అలాగే ఇదే తరహాలో అన్ని రాష్ట్రాలలో లోకాయుక్త చట్టాలను తీసుకొచ్చి అమలు చేయాలి. వీటన్నింటిపైన దేశ వ్యాపితంగా అర్థవంతమైన, సమగ్ర చర్చ జరిపి, అవినీతి నిరోధానికి దోహదపడే కఠిన తరమైన చట్టాన్ని త్వరితగతిన తీసుకురావడానికి ప్రజా ఉద్యమం కొనసాగాలి.

అలాగే లోక్‌పాల్ చట్టమొక్కటే సర్వరోగ నివారిణి కాజాలదు. దేశంలో రాజకీయ ప్రక్షాళన జరగాలి. ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. కొందరు అవగాహనా రాహిత్యంతోనే కావచ్చు అన్నా హజారేను నేటి తరం గాంధీగా పోల్చారు. ఆయన దాన్ని నమ్రతతో తోసి పుచ్చారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అన్నా హజారే ‘‘నేను ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదని’’ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. డబ్బు, మద్యం రాజ్యమేలు తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారమే పార్లమెంటుకు రూ.40 లక్షలు, శాసనసభకు రూ.16 లక్షలు ఖర్చు చేయవచ్చు. వాస్తవానికి కోట్లలో ఖర్చు చేసి, ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల ప్రక్రియను అభాసుపాలు చేశారు. దీనంతటికీ కారణం అవినీతి సొమ్ము, నల్లధనం, అక్రమ సంపాదన. ప్రజా స్వామ్యం మనుగడకు భంగం వాటిల్లకూడదంటే డబ్బు ప్రభావాన్ని అరికట్టాలి. దామాషా ఎన్నికల విధానం మంచిదనే ఆలోచనలూ ఉన్నాయి. ఎన్నికల సంస్కరణల పైనా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు అధికార వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా ఎదగాలి. అవినీతికి నిలయాలుగా మారిన వివిధ రంగాలలో సమూలమైన మార్పుల కోసం శక్తిమంతమైన, నిరంతర ప్రజా పోరు తప్పనిసరి.

Monday, April 4, 2011

‘నిండుసభ ’ సాక్షిగా ‘కృష్ణా’ర్పణం!

published on April 2 2011,in sakshi Telugu daily

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ పూర్వరంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమా వేశాలు ఫిబ్రవరి 17న ప్రారం భమై, ఒక ప్రహసనంగా కొన సాగి, మార్చి 29న నిరర్ధకంగా ముగిశాయి. నిర్వహించాలి కాబ ట్టి మొక్కుబడిగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను, సభ్యుల హాజరుతో నిమిత్తం లేకుండా, అత్యధిక కుర్చీలు ఖాళీగా ఉన్నా నిండు సభగా భావించి, నిర్వహించి ఊపిరి పీల్చుకొన్నారు ప్రభుత్వ పెద్దలు. వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర కోసమే అన్నట్లు సభా నిర్వహణ తంతు నడిచింది.

గవర్నర్ ప్రసంగంపైన గానీ, బడ్జెట్ ప్రతిపాదనలపైన గానీ, శాఖల వారి పద్దులపైన గానీ, రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలపైన గానీ సభలో చర్చించిన పాపాన పోలేదు. ధూషణ భూషణ లతో విధ్వంసాలు, భౌతిక దాడులకు, వాక్ స్వాతంత్య్రం పై, ప్రజాస్వామ్య హక్కులపై ఫాసిస్టు తరహా దాడులకు సమావేశాలు సాక్షీభూతంగా నిలిచాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభలో సభా ప్రాంగణంలో జరిగిన ఘటనలు రాష్ర్ట చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

సమస్య అందరిదీ, కానీ ఎవరికీ పట్టలేదు!
కృష్ణా నదీ జలాల సమస్య తెలుగు ప్రజలందరి జీవన్మరణ సమస్య. నదీ జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మొత్తం రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనే అంశంపై ఎవరికీ పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ఉప ప్రాంతీయ భావజాలంతో కొట్టుకుపోతున్న వారు ఈ సమస్యకు నేడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

కానీ, రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి ఉన్న రాజకీయ పార్టీల వైఖరి ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇది అందరి సమస్య. కానీ ఎవ్వరికీ పట్టలేదు. ట్రిబ్యునల్ తీర్పు మూలంగా సంభవించే దుష్పరిణామాలపై సభలో సమగ్రంగా చర్చిం చి, నష్ట నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సమష్టి గా రూపొందించుకోవడానికి జవాబుదారీ తనంతో ప్రభు త్వం వ్యవహరించకపోవడం అత్యంత బాధ్యతారహితం.

రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ మనుగడే ప్రస్తుతం మిణుకు మిణుకుమంటున్నది. అపవిత్ర కలయికలు, మ్యాచ్‌ఫిక్సింగ్స్ ద్వారా వీలైనంత కాలం మనుగడ సాగిం చాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఈ పూర్వ రంగంలో సభ సజావుగా జరగకపోవడం పాలక పార్టీకి ఊరట కలిగించింది. దినదినగండంగా రోజులు గడుపుతున్న అత్యంత బలహీన మైన కిరణ్‌కుమార్ సర్కారు ఆ విధంగా ఊపిరి పీల్చుకొంది.

న్యాయం కోసం రాజీలేని పోరాటం
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని కీలకాంశాలను పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతుంది.

నికర జలాల నిర్ధారణకు బచావత్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 75 శాతం నీటి లభ్యత ప్రామాణికాన్ని తిరస్కరించి 65 శాతాన్ని తీసుకోవడం.

సగటు వార్షిక నదీ ప్రవాహంలో నుంచి నికర జలాలను మినహాయించగా లభించే నీటిని మిగులు జలాలుగా నామకరణం చేసి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం.

ప్రకాశం బ్యారేజీ నుండి అనివార్యంగా కిందికి ప్రవహించి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని లెక్కలోకి తీసుకోవడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరిం చడమే కాదు. అదొక మిథ్యగా చులకన భావంతో కొట్టిపారేయడం.

‘‘క్యారీ ఓవర్’’ పద్దు కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవ డానికి ఆమోదముద్ర వేస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడి, దానికి కాలం చెల్లిపోయిందని, ప్రస్తుతం మన రాష్ట్రా నికి మిగులు జలాలలో వచ్చిన 145 టీఎంసీలతోపాటు 65 శాతం ప్రామాణికం ఆధారంగా అదనంగా రాష్ట్రా నికి కేటాయించిన 39 టీఎంసీల నికర జలాలలోని 5 టీఎంసీలను కలిపి మొత్తం 150 టీఎంసీలను ‘‘క్యారీ ఓవర్’’ ‘‘స్టోరేజి’’ పద్దు కింద కేటాయించడం పెద్ద దగా. మిగిలిన నీటిలో 9 టీఎంసీలను జూరాల ప్రియ దర్శినికి, 25 టీఎంసీలను తెలుగుగంగకు ట్రిబ్యునల్ షరతులతో కేటాయించింది.

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి లభ్యతను నిర్ధారించే గణాంకాలకు కలిపి లెక్కించడం.

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపకరించే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణానికి ఆమోదం తెలపక పోగా కర్ణాటక వాదనను బలపరుస్తూ, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం బయటికి నీటిని తరలించుకుపో వాలనే దుర్బుద్ధి మన రాష్ట్రానికి ఉన్నట్లు ట్రిబ్యునల్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించింది. తుంగభద్ర రిజర్వాయరులో పూడిక మూలంగా నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీల నుండి 104.34 టీఎంసీలకు పడిపోయిందని నిపుణుల అంచనా. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ 230 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయరు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వినియోగానికి కేటాయించినా, ప్రస్తుత 212 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి. కర్ణాటక మాత్రం పూర్తి స్థాయిలో నీటిని వాడుకొంటూ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. 186 కి.మీ. పొడవు గల తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి) 105 కి.మీ. ఉమ్మడి కాలువగా కర్నాటక భూభాగంలోనే ప్రవహిస్తున్నది. ఈ కాలువ కింద కేటాయించిన 50 టీఎంసీలలో 32.5 టీఎంసీలు మన రాష్ట్రానికి రావాలి. కానీ ఏనాడు మన వాటా మేరకు నీరు అందింది లేదు.

కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా నిత్య కరువులతో కృంగికృషించిపోతున్న జిల్లాల నీటి అవసరాలను తృణీకార భావంతో లెక్కలోకే తీసుకో లేదు. వలసలకు మారు పేరుగా నిలిచి, అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలకు 9 టీఎంసీలు అదనంగా కేటాయించడం మినహాయిస్తే, మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు, నల్ల గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం) ప్రాజెక్టుకు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా ప్రయోజనం కలిగించే హంద్రీ-నీవా సృజల స్రవంతికి మిగులు జలాలను పంచుతున్న సందర్భంలోనైనా నీటి కేటాయింపులు చేయాలనే స్పృహ ట్రిబ్యునల్‌కు కొరవ డింది. కృష్ణా మిగులు జలాల తరలింపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ, కడప, చిత్తూరు జిల్లాల ప్రజల గొం తులు తడిపే గాలేరు-నగరి ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.

మానవీయ కోణంలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదీ పరీ వాహక ప్రాంతంలోనే ఉన్న నిత్య కరువు పీడిత, అత్యంత వెనుకబడిన జిల్లాల నీటి కడగండ్లను తీర్చడం ద్వారా సమన్యాయాన్ని అమలు చేయాలని ట్రిబ్యునల్ భావించ లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిలో 49 శాతం పరీ వాహక ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించడం జరిగింది కాబట్టి మరే ఇతర ప్రాజెక్టుకు నీటిని కేటాయించడం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది.


అదనపు నీటిని సాధించుకోవాలి
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి మన రాష్ట్ర పరిధిలో కొన్ని ‘‘సర్దుబాట్లు’’ ద్వారా కొన్ని ప్రాజెక్టులకు అఖిల పక్ష సమావేశాలలో చర్చించి నికర జలాలను కేటాయించడం జరిగింది. అవి
కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా 19 టీఎంసీలను ఆదా చేసి భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించారు.

కేసీ కెనాల్ ఆధునికీకరణ ద్వారా 8 టీఎంసీలు ఆదా చేసి పునరుత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి లభించిన 11 టీఎంసీలను కలిపి 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్‌ఆర్‌బీసీ)కు కేటాయించారు.

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీలను అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం రిజర్వాయర్ (పీఏబిఆర్)కు కేటాయించి, శ్రీశైలం రిజర్వాయరు నుంచి ఆ మేరకు కేసీ కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంతరంగిక సర్దుబాట్ల ద్వారా భీమా, ఎస్‌ఆర్‌బీసీ, పీఏబీఆర్ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలను అదనంగా సాధించుకోవడానికి కృషి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వంపై ఉన్నది. ఈ పూర్వ రంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.