Wednesday, January 24, 2018

ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం పని విధానం ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలియజేస్తున్న ఒక స్వానుభవాన్ని మిత్రులతో పంచుకొంటున్నాను.

1. ఇరవై ఐదు రోజుల అనుభవంతో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. పౌరులు హక్కుగా అధికార యంత్రాంగం నుంచి పొంద వలసిన సేవలకు కూడా లంచం ఇచ్చుకొని అవినీతికి పాల్పడక పోతే, లేదా, దళారుల ద్వారా పైరవీలతో పనులు చక్క బెట్టుకొనే కళ లేక పోతే, లేదా, ధౌర్జన్యంతో అధికారులను లొంగగొట్టుకొనే కండ బలం లేక పోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టమన్న భావన సామాన్యుల్లో రోజు రోజుకూ బలపడుతున్నది.

2. ప్రభుత్వాలు, వాటి అధినేతలు జవాబుదారీతనంతో, సుపరిపాలన అందిస్తామని వల్లించే మాటలు దగాకోరు మాటలుగా ఆచరణలో మిగిలి పోతున్నాయి.

3. జరిగిన ఉదంతం: అత్యున్నత వృత్తి విద్యా సంస్థ(వైద్య కళాశాల), వైద్య విద్యా డైరెక్టర్ కార్యాలయం, వైద్య ఆరోగ్య- వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రిన్సిపుల్ సెక్రటరీ కార్యాలయం, ఇవన్నీ ఎంత గొప్పగా పని చేస్తున్నాయనడానికి ఈ ఘటన ప్రబల నిదర్శనం!

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్  ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒక డాక్టర్ ఇంగ్లండ్ కు వెళ్ళి తన అక్క కుమార్తె "డిగ్రీ కాన్వకేషన్" కు హాజరు కావడం కోసం " నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్.ఒ.సి.) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంటే 25 రోజులు గడచి పోయినా అనుమతి మంజూరు చేయడమో, తిరస్కరించడమో చేయక పోతే, ఈ ప్రభుత్వం పని చేస్తున్నట్టా, నిద్ర పోతున్నట్టా!

4. ఫైల్ క్లియర్ చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి బృందంలో దావోస్ పర్యటనకు వెళ్ళి, ఫైల్ ను పెండింగ్ లో పెట్టి కూర్చొన్నారు. ' ఇన్ ఛార్జ్' గా మరొక ఐ.ఎ.ఎస్. అధికారికి ' బాధ్యత బదలాయించి, వెళ్ళారు. కానీ, సాదాసీదా ' పైల్స్ ను క్లియర్' చేసే అధికారాన్ని కూడా ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వలేదు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. బాధ్యతారహిత్యం కాదా! దీన్ని జవాబుదారీతనంతో కూడిన పాలనంటారా!

5. ఆ దరఖాస్తు ప్రిన్సిపల్ ఆఫీసు నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసు చేరడానికి వారం రోజులు పడితే, డి.యం.ఇ. ఆఫీసులోని 'ఇన్ వర్డ్ సెక్షన్' నుండి దరఖాస్తును పరిశీలించే సెక్షన్ కు చేరడానికి నాలుగు రోజులు, ఆ కార్యాలయం నుండి విముక్తి పొంది సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు చేరిన ఫైల్ రోజులు గడచి పోతున్నా, ఆ ఫైల్ కు మోక్షం లభించ లేదు. వీసాకు దరఖాస్తు చేసుకొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్యుమెంట్స్ సమర్పించు కోవలసిన గడువు ముగిసి పోతున్నా, ఉన్నతాధికారి అలసత్వం పర్యవసానంగా "యన్.ఒ.సి." సమర్పించుకోలేని దుస్థితి నెలకొన్నది.

6. ఉన్నత విద్యా సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికే ఈ చేదు అనుభవం ఎదురైతే పేద, సామాన్య ప్రజలకు పౌర సేవలు ఏ విధంగా అందని ద్రాక్ష పండ్లులా తయారైనాయో ఊహించవచ్చు.

7. నిజాయితీగా, బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవమే ఈ ఘటన. తన శ్రమతో ఆర్జించుకొన్న సొమ్ములతో, తనకు హక్కుగా లభిస్తున్న సెలవు దినాలను వినియోగించుకొని, పక్షం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఈ అధికార యంత్రాంగం సృష్టిస్తున్న అవరోధాలు వర్ణనాతీతం. వారు మాత్రం ప్రజాధనంతో నిత్యం విదేశీ పర్యటనల్లో కాలం గడిపేస్తూనే ఉంటారు.

8. పౌరులకు హక్కుగా అందించ వలసిన సేవల పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టి, పని సంస్కృతి పెంపొందించి, ప్రక్షాళన చేయక పోతే ప్రజాస్వామ్యం మరింత దిగదుడుపుగా తయారౌతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించండి.

9. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలనే సదుద్ధేశంతో రెండు లేఖలు వ్రాసి "ఎపి సియం కాన్టాక్ట్" అన్న కైజాలా ఆప్ ద్వారా పంపాను. కానీ, స్పందన లేదు.

టి.లక్ష్మీనారాయణ
కమ్యూనిస్టు, రాజకీయ విశ్లేషకులు