Monday, July 27, 2015

మనది సంక్షేమ రాజ్యమేనా!



హ్యదయ విదారకమైన ఘటనపై హెచ్.యం.టీ.వి.లో జరిగిన చర్చలో నాతో పాటు టిడిపి శాసనమండలి సభ్యులు శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్, బిజెపి నాయకులు శ్రీ కుమార్, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ రాజయ్య‌ యాదవ్, కొత్త చెరువు గ్రామ సర్చంచ్ శ్రీ మాణిక్యం బాబు పాల్గొన్నారు. ఘటన వివరాల్లోకి వెళితే కరువుకు ఆట పట్టు, అత్యంత వెనుకబడిన అన‍ంతపురం జిల్లా కొత్త చెరువు గ్రామంలో ఒక నిరుపేద తన తల్లి మరణించిందనే భావనతో చాప‌ మీద పడుకోబెట్టి లాక్కొంటూ శ్మశానానికి తీసుకెళుతుంటే ఒక విలేకరి గమని‍ంచారు. ఏం జరిగిందని వివరాలు అడిగి తెలుసుకొనే సంద‌ర్భంలో ఆమె బ్రతికే ఉన్నట్లు గ్రహించి, వెంటనే వైద్యుడిని రప్పించి, పరీక్ష చేయించగా ఆ మాతృమూర్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.
ఆమె కుమారుడు అవివాహితుడు. ఆ వూరి స‌త్రంలోనే నివాసం. రాళ్ళను తనకున్న నైపుణ్యంతో రోళ్ళుగా తయారు చేసి అమ్ముకొని తద్వారా వచ్చిన‌ డబ్బుతో తాను పొట్టపోసుకొంటూ, తల్లిని పోషించుకొంటూ వస్తున్నాడు. తల్లి వృద్ధాప్యంలో అనారోగ్యంతో నరకయాతన పడుతున్నది. తన వయసు మీద పడుతున్నది. రాళ్ళను రోళ్ళుగా మలచగలిగిన సత్తువ నశించి పోయింది. ఇల్లు లేదు. రేషన్ కార్డు లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు. బ్రతుకే భారంగా తయారయ్యింది. ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజాప్రతినిథుల నిరాధరణ ఫలితంగా ఒక వృత్తి నైపుణ్యం ఉన్న అసంఘటిత కార్మికుడు అనాధగా జీవచ్ఛవంగా బ్రతుకీడుస్తున్నాడు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నసామాజిక భద్రతా చట్టాలు, సంక్షేమ పథకాలేవీ ఆ తల్లీ, తనయుల దరిదాపుల్లోకి చేరలేదు. ఆహార భద్రతా చట్టం, అంత్యోదయ అన్న యోజన పథకం, రూపాయికి కేజీ బియ్యం పథకం, జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం, పేదలందరికీ శాశ్వత గృహ నిర్మాణం వగైరా వగైరా ప్రభుత్వ పథకాలేవీ ఆ అభాగ్యుల దరి చేరలేదు. పైపెచ్చు ఆ గ్రామం ఒక రాష్ట్ర మంత్రివర్యుల నియోజకవర్గం పరిథిలో రోడ్డు ప్రక్కనే ఉన్న గ్రామమది.
ఇదే! ఈనాటి హెచ్.యం.టీ.వి. వార్తల విశ్లేషణలో చర్చనీయాంశం. భూతద్దంతో నిశితంగా పరిశీలిస్తే గానీ ఒక దిన పత్రికలో ప్రచురించబడిన ఆ వార్తా కనిపించని ఒక హృదయ విదారకమైన ఘటనపై స్పందించిన హెచ్.యం.టీ.వి. ఛీప్ ఎడిటర్ దాన్నే చర్చనీయాంశం చేశారు. ఒక విలేకరి ఆ మాతృమూర్తి ప్రాణాలను కాపాడడంతో పాటు సభ్యసమాజం దృష్టికి ఆ ఘటనను తెచ్చారు. వారిరువురు అభినందనీయులు. ఈ ఉదంతంపై జరిగిన‌ చర్చలో పాల్గొని నా గుండె చప్పుడును వినిపించాను. ఇతర మిత్రులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

Sunday, July 26, 2015

పుష్కరాలతో తెలుగు నేల పుణ్య భూమిగా మారిపోయిందా!

ప్రజల విశ్వాసాన్ని అరమరికలు లేకుండా నేను గౌరవిస్తాను. మతాన్ని అనుసరించడం, భక్తి ప్రపత్తులతో వ్యక్తిగత జీవితాలను క్రమశిక్షణాయుతంగా మలచుకోవడం, ఆయా సమాజాల్లో ఉన్నతంగా భావించబడే నైతిక విలువల ప్రాతిపథికపై వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని, పది మందికి ఆదర్సప్రాయంగా నిలవాలని పరితపించే మహోన్నత వ్యక్తులపై నాకు అపారమైన గౌరవం ఉన్నది.  కానీ, భారత‌ రాజ్యాంగం ప్రభోదిస్తున్న లౌకిక వ్యవస్థకు, శాస్త్రీయ భావజాలానికి తూట్లు పొడుస్తూ, మూఢత్వాన్ని పెంచి పోషిస్తూ  ప్రభుత్వాలే ఈ తరహా కార్యక్రమాలను బుజానికెత్తుకోవడం చూస్తే జుగుప్స కలుగుతుంది. ఈ పనికి పూనుకోవడంలో పాలకుల‌ తాత్విక ప్రయోజనాలు వారికున్నాయనడంలో నిస్సందేహం.
గొంతు లెండి పోతున్న కరువు సీమల్లో త్రాగు, సాగు నీరు పారించక పోయినా తెలుగు నాట భక్తి రసాన్ని మాత్రం ఏరులై పారించారు. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేవు కానీ, పాలకులు తలచుకొంటే పుష్కరాలకు డబ్బుల కొదవే లేదని రుజువు చేశారు. మానవ సేవే మాధవ సేవన్నారు పెద్దలు. అది మాత్రం గుర్తు లేదన్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు. గోదావరి పుష్కరాలకు విడ్కోలు పలుకుతూ, కృష్ణా పుష్కరాలకు తెరలేపారు. శభాష్! అటుపై పెన్నార్ పుష్కరాలొస్తాయేమో! కాకపోతే ఆ పెన్నార్ నది నీళ్ళులేక ఒట్టిపోయింది.
స్వాతంత్ర్యానంతరం దశాబ్ధాల పాటు సాగిన‌ నీతి మాలిన పాలన, పనులతో తెలుగు గడ్డపై అన్ని సామాజిక రంగాలు విషతుల్యంగా మారి  దుర్గంధం వెదజల్లబడుతున్నది. కులం, మతం, ప్రాంతీయ విద్వేషాలు, అవినీతి, అక్రమాలు, అక్రమార్జన, విచ్చల విడిగా దోపిడీతో పాపాల పుట్టగా తెలుగు నేల‌ కంపుకొడుతున్న నేపథ్యంలో గోదావరి పుష్కరాల సంబరాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. గోదావరిలో మునగండి, పాపాల మురికి వదిలించుకోండి, పుణ్యాన్ని మూట కట్టుకోండి, సుఖమయ జీవితానికి మరియు స్వర్గానికి మార్గాన్ని సుగమం చేసుకోండని ప్రచార హోరు సాగించాయి. పులకించి పోయిన తెలుగు ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆలశించిన‌ ఆశాభంగం అన్నట్లు గోదావరి వైపు పరుగులు తీశారు. తెలంగాణలో 6.4, ఆంధ్రప్రదేశ్ లో 4.89, మొత్తం 11.29 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారని ఘనంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించుకొన్నాయి. అంకెలు ప్రకటించుకోవడంలో కూడా అనారోగ్యకరమైన పోటీనే సుమా! పాపం తృప్తిగా గోదావరి స్నానం చేసి, పాప పరిహారం చేసుకొని వద్దామని వెళ్ళిన భక్తులు కొన్ని ఘాట్ల వద్ద‌ మురికి నీటిలో, బురదలో పొర్లాడి వెనుదిరగాల్సి వచ్చింది. మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆ నీటిలో ఉంటే చర్మ వ్యాధుల భారిన పడతారని అధికారికంగానే హెచ్చరికలు కూడా జారి చేశారు.
ప్రభుత్వాలు ప్రకటించిన‌ గణాంకాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే! రెండు రాష్ట్రాల జనాభా 8.5 కోట్లకు మించి లేదు. పాప భీతిలేని నాలాంటి లక్షలాది మందో! కోట్లాది మందో! గోదావరిలో మునగలేదు. తెలుగు ప్రజలే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల ఉంచి కూడా మునకేసి పోయారని పాలకులు సమర్థించుకొంటున్నారు. పోనీలేండి వారు ప్రకటించుకొన్న సంఖ్య గోల ప్రక్కనబెడదాం! దాని వల్ల వచ్చే నష్టం లేదు.
మన తెలుగు నేల గోదావరి పుష్కరాలతో ఒక్క దెబ్బతో పుణ్య భూమిగా మారిపోయింది. ఈనాటి నుండి దోపిడీలు, దొంగతనాలు, నీతి మాలిన పనుల నుండి తెలుగు జాతికి విముక్తి లభిస్తుందని ఆశిద్దాం! పాత ఖాతాలోని పాపాల మూటను గోదావరిలో ముంచేసి వచ్చాం కదా! ఇహ! స్వేచ్ఛగా మళ్ళీ కొత్త ఖాతా తెరవచ్చులే అని అవినీతిపరులు, ప్రజాకంఠకులు భావిస్తారేమో! తస్మాత్ జాగ్రత్త.