Saturday, July 26, 2014

విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తే మంచిదే!

 27 జూలై, 2014: సాక్షి టివీ లో నేను పాల్గొన్న చర్చకు సంబంధించిన వీడియో.

http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-telangana-government-decisions-on-education-system-18096?vod-related

ఇంతకీ రాజధాని ఎక్కడ..?

ఈ రోజు ఉదయం 'సాక్షి టివీ' లో నేను పాల్గొన్న చర్చకు సంబంధించిన వీడియోను చూడమని విజ్ఞప్తి. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన 'రాజథాని' అంశంపై హేతుబద్ధంగా మీరూ స్పందించండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య మరియు దక్షిణ కోస్తా ప్రాంతాల ప్రజల మధ్య ఏకాభిప్రాయ సాధన ద్వారా రాజథాని ఎంపిక జరగాలని, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యనైనా పదిలమైన ఐక్యతకు పునాదులు వేయాలని ఆకాంక్షిస్తున్నా.


http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-andhra-pradesh-cpaital-18097?vod-related

Thursday, July 24, 2014

సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర 2 వికేంద్రీకరణే శరణ్యం!

విజ్ఞప్తి: "సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర 2 వికేంద్రీకరణే శరణ్యం!" అన్న శీర్షికతో జూలై 25, 2014, సూర్య దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం. (జూలై 23, బుధవారం సంచిక తరువాయి భాగం)



ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్‌
విద్యుత్‌తోటే పారిశ్రామికాభివృద్ధి
మరో గుదిబండ- ఆర్‌టిసి అప్పులు
ఆజ్యం పోస్తున్న ప్రాంతీయ అసమానతలు
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


నేడు ఉన్న విద్యుత్‌ అవసరాలకు తోడు నీటి పారుదల రంగంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్‌ కావాలి. పారిశ్రా మికంగా వెనుకబడ్ద ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటే ముందుగా అందుబాటులోకి రావల సింది విద్యుత్తే. కాబట్టి విద్యుదుత్పత్తికి అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుదుత్ఫాదన సంస్థ(జన్కో) కు సమకూర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నది. ఇప్పటికే విద్యుత్‌ సంస్థలు రుణ భారంతో సతమ తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్ర రవాణా సంస్థ (ఎ.పి. యస్‌.ఆర్‌.టి.సి.) రూ. 5,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతను చేపట్టాలన్న డిమాండ్‌ ఉండనే ఉన్నది. ఈ కోవలోనే మరికొన్ని ఆర్థిక భారాలను నూతన రాష్ట్రం విధిలేని పరిస్థితుల్లో మోయక తప్పని పరిస్థితి ఉన్నది.
ఓట్లేసి అధికార పీఠాన్ని అప్పగించిన ప్రజలకు- ఎన్నికల హామీలన్నిటినీ తు.చ. తప్పకుండా అమలు చేయాలని అడిగే హక్కు ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టుకొంటూ, ఆర్థికంగా చితికిపోయి ఉన్నసామాన్య ప్రజానీకంపై భారాలు మోపకుండా, ఆదాయాన్ని పెంచుకొంటూ చేసిన వాగ్దానాలను అమలు చేయడం ద్వారా విశ్వాసాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్నది. అదే సందర్భంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని పదే పదే చెబుతున్న మాటలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు తనకు తానుగా తలకెత్తు కొన్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో తానే పెద్ద కూలీనని కూడా ప్రకటించుకొన్నారు.
అడుగు ముందుకు ఎలా?: అవశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అండగా ఉంటానని ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గట్టి వాగ్దానం చేశారు. హైదరాబాదు నగరం సాప్‌‌ట వేర్‌ రంగంలో ప్రగతి సాధించిందని, ఆంధ్ర నాట హార్‌‌డ వేర్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, విశాలమైన సముద్ర తీరాన్ని, రాష్ట్రంలో లభిస్తున్న ఖనిజాల ఆధారంగా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని నిర్దిష్ఠమైన హామీలు కూడా ఇచ్చారు. నేటి వరకు అభివృద్ధికి కేంద్ర స్థానంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాథికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాథి కల్పనతో కూడిన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి మాత్రమే వారి భవిష్యత్తుకు భరోసా కల్పించగలదు. నేడు దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఉపాథి రహిత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ తరహా విధానాల వల్ల కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి జీవనోపాథి లభించదు. జీవన ప్రమాణాలూ పెరగవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగక పోగా మరింత పతనమవుతుంది. మార్కెట్లో సరుకులు అమ్ముడు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన వనరు అయిన అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరగదు. మానవ వనరుల అభివృద్ధి, సక్రమ వినియోగంపైనే రాషా్టభ్రివృద్ధి కూడా ఆధారపడి ఉన్నది.
కృష్ణా- గోదావరి బేసిన్‌లో అపారమైన సహజవాయువు నిల్వలున్నాయని గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్నాయని, 970 కి.మీ. విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా విద్యుత్‌ ఉత్పాదనలో మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చునని కలలు కనేవారూ లేకపోలేదు. గత ప్రభుత్వాలు అలాంటి అనాలోచిత విధానాల అమలుకు పూనుకొని సుమారు 35,000 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేసి, సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. వాటి వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, సారవంతమైన వ్యవసాయ భూములు నిరుపయోగం కావడం, రైతు కూలీల జీవనోపాథి గొడ్డలిపెట్టుకు గురికావడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సౌర విద్యుదుత్పాదనపై దృష్టిసారించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కో కు ఆర్థిక పరిపుష్ఠి కల్పించడం ద్వారా ప్రోత్సహించాలి.

ఆశ్రీత పెట్టుబడిదారీ దృక్పథంతో ఆర్థిక, పారిశ్రామిక విధానాలను రూపొందించుకొని అమలు చేస్తే ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య మరింత అంతరాలు పెరిగిపోతాయి. విశాఖ- చెన్నయ్‌- కోస్తా కారిడార్‌ పేరిటో, పెట్రో కారిడార్‌ పేరిటో అపసవ్యమైన విధానాలను రూపొందించుకొని అమలుకు పూనుకొంటే ప్రజల నుండి ప్రతిఘటనను చవిచూడవలసి వస్తుంది. అందుచేత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో, అత్యంత నైపుణ్యంతో వ్యవహరించాలి. దూరదృష్టితో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలువేసే శాస్త్రీయమైన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణకు పూనుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉన్నది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల భావజాలానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ, అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తే కొత్త కొత్త సమస్యలకు ఆజ్యం పోసినట్లవుతుంది. అందుకే గత చరిత్రను గమనంలో ఉంచుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటి ప్రభుత్వరంగ సంస్థలనుండి పెట్టుబడుల ఉపసంహరణద్వారా నిధులను సేకరించుకొని వార్షిక బడ్జెట్‌ లోటును భర్తీ చేసుకొనే ప్రైవేటీకరణ ఆర్థిక నీతినే మోడీ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది. కార్పొరేట్‌ రంగానికి ప్రాధాన్యతఇస్తే తప్పేమిటని కేంద్ర విత్తమంత్రి అరుణ్‌ జెట్లీ బహిరంగంగా వ్యాఖ్యానించారంరటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు ఎలా ఉండబోతాయో సుస్పష్టమే. నేటి వరకూ ప్రభుత్వాలు వల్లెవేస్తూ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పిపిపి) అభివృద్ధి నమూనా స్థానంలో- ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యం (పిపిపిపి) ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి నమూనా మంత్రంగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి అవుతుందో వేచిచూడాలి. కేవలం కొన్ని రాయితీలు కల్పించి, నామ మాత్రపు నిథులు మంజూరు చేస్తే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథులనుండి ప్రత్యేక కేటాయింపులు చేసి పారిశ్రామికంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో భారీపరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు రాకపోతే ప్రయోజనం ఉండదు.
రాయలసీమ ప్రాంతం- గ్రామ కక్షలకు, హత్యా రాజకీయాలకు నెలవుగా ఉన్నదనే నెపంతో ప్రైవేటు పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పడానికి వెనకాడుతున్నారన్న అపవాదు ఉన్నది. దాని కంటే తీవ్రమైన సమస్య నీటి సమస్య. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా కృష్ణా, తుంగభద్ర నికర జలాలను కేటాయించాలి. భారీ పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన భూమి ఒక్క రాయలసీమలోనే ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఆలోచనే కొరవడింది. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి చొరవ ప్రదర్శించి, ప్రైవేటు పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తేగానీ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడవు. ఆ ప్రాంత వెనుకబాటుతనానికి నివృత్తి ఉండదు. అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్రాధాన్యతా క్రమాన్ని నిర్దేశించుకోనిఎడల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశించిన ప్రగతిని సాధించడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇచ్చే అరకొర పన్నుల రాయితీలు- పారిశ్రామిక వేత్తలు సొంతం చేసుకొని ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే దోహదపడతాయి. నవ్యాంధ్ర ప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత జాగరూకతతో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజల భాగస్వామ్యం తో కృషి చేస్తుందని ఆకాంక్షిద్దాం!

Tuesday, July 22, 2014

సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర?

గమనిక: "సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర?" శీర్షికతో జూలై 23, 2014  సూర్య దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం మొదటి భాగం.

రాజధాని లేని రాషా్టన్రికి రంగుల కల
నిర్మాణానికి విరాళాలకోసం పిలుపు
సమస్యల కుంపటిపై వాగ్దానాల వర్షం
గుదిబండలైన ఎన్నికల హామీలు
కలిసిరాని ఆర్థిక పరిస్థితులు
అసమగ్రంగా ఆర్ధిక శ్వేతపత్రం
వెనుకబడిన ప్రాంతాలపై లేని దృష్టి
వమ్మవుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఆశలు
బడ్జెట్లలో కనిపించని ప్రత్యేక ప్యాకేజీలు


విశాలాంధ్రలో ప్రజారాజ్యం కల చెదిరిపోయింది. తెలుగు జాతి ఐక్యత విచ్ఛిన్నమైంది. రెండు రాషా్టల్రు ఏర్పడ్డాయి. విడిపోయి ఇరుగు పొరుగుగా కలిసిమెలిసి సహజీవనం చేస్తూ, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ప్రగతి సాధించవచ్చని కొందరు చేసిన హితబోధలు గాలి మాటలని తేలిపోయాయి. మకుటం లేని మహారాజులా, రాజథాని లేని రాషా్టన్రికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు సమస్యల కుంపటిపై కూర్చొని స్వర్ణాంధ్రప్రదేశ్‌ ను నిర్మిస్తానని వాగ్దానాల పరంపర కొనసాగిస్తున్నారు. తాను చేసిన అపరిమితమైన ఎన్నికల వాగ్దానాల అమలుపై కసరత్తులు చేస్తున్నారు. వెనకడుగు వేస్తే- ప్రజల ఛీత్కారానికి గురికావలసి వస్తుందన్న భయం వెంటాడుతున్నది. హామీలను అమలు చేద్దామంటే పదుల వేల కోట్ల రూపాయలు కావాలి. మాటలు ఘనంగా వినిపిస్తున్నారే కానీ ఆర్థిక వనరుల లేమితో ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ను రెండు ముక్కలు చేసి 1956 నవంబరు 1వ తేదీకి పూర్వం ఉన్న ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులనే (రమారమి) ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం పునర్వవస్థీకరణ చట్టం చేసింది. విభజనతో ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న ఆంధ్రప్రదేశ్‌ కు అన్ని విధాల అండగా నిలుస్తామని పార్లమెంటు వేదికగా కొన్ని నిర్దిష్ఠమైన వాగ్దానాలు చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అధికారాన్ని కోల్పోయారు. ఆయన పార్టీ ప్రతిపక్షస్థానానికి చేరుకుంది. రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించిన బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మక్షోభను అర్థం చేసుకొన్న నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాటి ఎన్నికల ప్రచారసభల్లో ఘనమైన వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం, టిడిపి భాగస్వామిగా ఉన్న యన్‌.డి.ఎ. కూటమి కేంద్రంలో అధికారం లోకి రావడం- కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఒడ్డున చేర్చడానికి దోహదపడే సానుకూలాంశాలుగా ప్రజలు భావిస్తున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ స్థితిగతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగాల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేస్తూ సమస్యల తీవ్రతను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని ఆర్థిక పరిస్థితులపై విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం అసమగ్రంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్న మూడు ప్రాంతాలమధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అన్ని వేళలా గమనంలో ఉంచుకోవాలి. ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 4,75,859 కోట్లు, తలసరి ఆదాయం రూ. 85,797 ఉన్నదని పేర్కొన్నారు. అలాగే పదమూడు జిల్లాల తలసరి ఆదాయాలను కూడా వెల్లడించి ఉంటే సముచితంగా ఉండేది.

అందుబాటులో ఉన్న ప్రణాళికా సంఘం గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా జిల్లాల వారిగా తలసరి ఆదాయాలు ఇలా ఉన్నాయి- (1) విశాఖపట్నం రూ. 1,09,800 (2) కృష్ణా రూ. 89,398 (3) ప్రకాశం రూ. 81,516 (4) గుంటూరు రూ. 78,762 (5) నెల్లూరు రూ.78,537 (6) పశ్చిమ గోదావరి రూ. 78,345 (7) తూర్పు గోదావరి రూ. 75,977 (8) అనంతపురం రూ. 75,463 (9) కడప రూ. 66,015 (10) చిత్తూరు రూ. 64,816 (11) విజయనగరం రూ. 60,178 (12) కర్నూలు రూ. 57,311 (13) శ్రీకాకుళం రూ. 52,701. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఏకైక మహానగరం విశాఖపట్నం. తలసరి ఆదాయంలో ఆ జిల్లా రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచింది. తాజా ప్రతిపాదనలతో విశాఖ పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, విద్య, పర్యాటక రంగాలలో మరింతవేగంగా అభివృద్ధిచెందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాంధ్రకు విశాఖపట్నం ఆశా కిరణంగా కనిపిస్తున్నది. రాయలసీమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అలాంటి నగరం లేదు. కరవుసీమగా గణతికెక్కిన రాయలసీమ రాష్ట్ర విభజనతో అంధకారంలోకి జారుకుంది. ఈ ప్రాంతానికి వ్యవసాయమే జీవనాధారం. సాగుకే కాదు, మంచి నీటికీ ప్రజలు కటకట లాడుతున్నారు. వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందిన మధ్య- దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్నది. శ్వేతపత్రంలో ఈ అంశాల ప్రస్తావన లేకపోవడంతో లోపభూయిష్టంగా ఉన్నది. ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించే సందర్భంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక కేంద్రీకరణతో అంకితభావంతో కృషి చేయాలి.

ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతున్న అంశాలు:
రాష్ట్ర ఆదాయ- వ్యయాలను పరిశీలిస్తే నిరాశాజనకమైన పరిస్థితి గోచరిస్తున్నది. సొంత పన్నుల ద్వారా సమకూరే రాష్ట్ర ఆదాయం రూ. 32,164 కోట్లు, పన్నేతర ఆదాయంరూ. 8,836 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వాటా రూ. 29,001 కోట్లు, మొత్తం రాబడి రూ. 70,001 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన పది నెలల ప్రణాళికేతర వ్యయం రూ. 68,444 కోట్లు, ప్రణాళికా వ్యయం అంచనా రూ. 5,791 కోట్లు. రాష్ట్ర విభజనానంతరం జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన రుణ భారం రూ. 92,461 కోట్లు(ప్రభుత్వఖాతా మినహా). ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా సమీకరించుకోబోయే అప్పు పద్దు క్రింద ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో ప్రస్తావించిన మొత్తం రూ. 12,195 కోట్లు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కు మొదటి సంవత్సరం బడ్జెట్‌ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. లోటు రూ. 15,000 కోట్లు ఉంటుందని రాష్ట్ర గవర్నర్‌ అపాయింటెడ్‌ తేదీ కంటే ముందే నివేదిక పంపారు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ద్వారా రూ. 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ద్రవ్య బాధ్యత- బడ్జెట్‌ నియంత్రణా చట్టం- 2003 (ఎఫ్‌.ఆర్‌.బి.యం.) నిబంధనలను సడలించి అధికంగా రుణాలను సేకరించుకోవడానికి వీలుకల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినా బడ్జెట్‌లో కేవలం రూ. 1128 కోట్లు విదిలించి మోడీ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. రాషా్టన్రికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామని, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అమలు చేస్తామని చేసిన వాగ్దానాల ప్రస్తావన కూడా బడ్జెట్‌ ప్రసంగంలో లేదు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పెద్ద ఎత్తున అందుతాయని రాష్ట్ర ప్రజలు పెట్టుకొన్నఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. బడ్జెట్‌ కేటాయింపులను పునఃపరిశీలించి, చేసిన వాగ్దానాలకు అనుగుణంగా నిథుల కేటాయింపును పెంచకపోతే రాష్ట్రం అధోగతి పాలౌతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం మొదటి సహాయ చర్యగా కేంద్రం నుండి తీసుకొన్న రుణాలలో రాష్ట్ర వాటాగా వచ్చిన దాదాపు రూ.12,000 కోట్లను మాఫీ చేస్తే, ఆ మేరకు కాస్త ఊరట కలుగుతుంది. లేదా మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం అధ్వాన్నస్థితిలోకి నెట్టివేసిందని, గాడిలో పెట్టడానికి కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాన మంత్రి మోడీ విస్పష్టంగా ప్రకటించిన తరువాత, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుందో అన్న అనుమానాలు మొగ్గతొడిగాయి. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాషా్టన్న్రి ఏ విధంగా గట్టెక్కిస్తుందన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజానీకాన్ని వేధిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పుకోవాలో తేల్చుకోవడానికి జరుగుతున్న కసరత్తు ఎప్పటికి ఒక కొలిక్కివస్తుందో తెలియని పరిస్థితి. అన్ని హంగులతో కూడిన రాజథాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తుందని రాష్ట్ర విభజన సందర్భంలోనే చంద్రబాబు పేర్కొన్నారు. రాజథాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. మరొకవైపు గోరుచుట్టపై రోకటిపోటన్న నానుడిగా ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సుల నివేదిక ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం- ఉద్యోగులతో నూతన వేతన ఒప్పందం చేసుకొన్న మరుక్షణం నుండే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ, వ్యయాల అంచనాలో మిగులు రాబడి ఉన్న తెలంగాణతో సరిసమానంగా వేతన సవరణ ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు సహజంగానే పట్టుబడతారు. అప్పు చేసి పప్పు కూడు తిందామన్నా ద్రవ్య బాధ్యత- బడ్జెట్‌ నియంత్రణా చట్టం- 2003(ఎఫ్‌.ఆర్‌.బి.యం.) అనుమతించదు.
రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇమ్మని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆర్థికంగా ఎంతటి హీనస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉన్నదో ఈ చర్యద్వారా స్పష్టమవుతున్నది. ఈ పూర్వ రంగంలో ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలపై దృష్టిసారించి, ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని, రాష్ట్ర పునర్నిర్మాణానికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు ఉపకరించే ప్రణాళికల అమలుతో త్వరితగతిన ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించాలి. అస్థవ్యస్థంగా తయారై ఉన్న పాలనా యంత్రాంగాన్ని ముందు గాడిలో పెట్టాలి. అవినీతిని అరికట్టి పన్ను, పన్నేతర వనరుల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేరవలసిన రాబడిని 100% రాబట్టుకోవాలి.

ఉద్యోగులు అవినీతిరహిత పాలనలో భాగస్వాములై- కష్టనష్టాలో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం అమలు చేసే ప్రతి చర్యా జవాబుదారీతనంతో నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ఒక ముందడుగుగా ఉండాలి. దుబారా ఖర్చులకు స్వస్తి చెప్పాలి. ఆర్థిక క్రమశిక్షణ- మంత్రులు, ఉన్నతాధికారుల నుండి మొదలుకొని క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు పాటించడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలను అమలు చేయడానికి పూనుకొంటే చట్టసభల్లో ఉన్న బాధ్యత కలిగిన ప్రతిపక్షం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిచాలి. ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా, హేతుబద్ధమైన ఆలోచనలు చేయాలి. ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధి పథకాలేవైనా వికేంద్రీకరణ దృష్టితో రూపొందించి, అమలు చేయడం మాత్రమే అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. లేనిపక్షంలో ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగిపోతాయి. పర్యవసానంగా మరొక విచ్ఛిన్నకర ఉద్యమానికి ఇప్పుడే బీజాలు నాటినట్లవుతుంది.
హైదరాబాదు మహానగరాన్ని తలదన్నే విధంగా రాష్ట్ర రాజధానీ నగర నిర్మాణాన్ని చేపడతాం, సింగపూర్‌ లాంటి నగరాన్ని నిర్మిస్తాం- లాంటి అతిశయోక్తితో కూడిన మాటలు ప్రజలను భ్రమల్లో తేలిపోయేలా చేయడానికే ఉపయోగ్పడతాయి తప్ప, వాస్తవాల ప్రాతిపదికపై ఆలోచనలను రేకెత్తించవు. మాటల కంటే ఆచరణ ముఖ్యం.

సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించి పేదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకాన్ని సామాజిక బాధ్యతగా ఆదుకొంటూ, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం ఎలా కల్పిస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఉపాథి కల్పనా సామర్ధా్యన్ని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం. సంక్షేమ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక భద్రత, ఆహార భద్రత కల్పించడం కోసం అమలు చేస్తున్న సబ్సీడీపై బియ్యం- వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్సన్లు, అర్హులైన విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకారవేతనాల చెల్లింపు వగైరా సంక్షేమ పథకాల అమలు భారం మోయక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఆదుకొనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం, బలహీన వర్గాలకు చెందిన గృహ వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ రాయితీ తదితర ఆర్థిక భారాలు ఉండనే ఉన్నాయి. కరవు కోరల్లో చిక్కిశల్యమతున్నరాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా సాగునీటి, మంచినీటి అవసరాలు తీర్చే సదుద్దేశంతో కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మింస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర యొక్క సొంత ఆర్థిక వనరుల నుండే వెచ్చించాలి. నికర జలాల ఆధారంగా, కేంద్ర జలసంఘం అనుమతితో నిర్మిస్తున్న ప్రాజెక్టులు కాదు కాబట్టి వీటి నిర్మాణానికి ఆర్థిక సంస్థల నుండి అప్పు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి ఆమోదముద్ర వేయడం శుభ పరిణామం. ఆ మేరకు రాషా్టన్రికి ఆర్థిక వెసులుబాటు లభించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో నిథుల కేటాయింపు నామమాత్రంగా ఉండడతోర నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అన్నఅనుమానం రావడం సహజం. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాషా్టల్ర మధ్య తలెత్తే వివాదాల పరిష్కార నిమిత్తం నెలకొల్పుతున్న నిర్వాహణ బోర్డులకయ్యే ఖర్చులను ఉభయ రాషా్టల్రే భరించాలి. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులకు రూ. 4,573 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం దాని వ్యయం రూ. 6,000 కోట్లకు పెరిగింది. మౌలిక సదుపాయాలలో విద్యుత్‌ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా రుణ భారాన్ని జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం, విద్యుత్తును మాత్రం గడచిన ఐదేళ్ళ వియోగం సగటును లెక్కించి ఆ ప్రాతిపదికన పంపిణీ చేసింది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ సమీప భవిష్యత్తులోనే విద్యుత్‌ కొరతను పెద్ద ఎత్తున ఎదుర్కోబోతున్నది.

(ఇంకా ఉంది)

Thursday, July 17, 2014

సమ దృష్టే రాయలసీమకు రక్ష‌


[విజ్ఞప్తి: "సమ దృష్టే రాయలసీమకు రక్ష" అన్న శీర్షికతో జూన్ 16, 2014 వ తేదీన నా వ్యాసం సాక్షి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురించబడింది. దాన్ని మరింత కుదించి హైదరాబాదు ఎడిషన్ లో ప్రచురించారు. ఈ అంశంపై ఆసక్తి ఉన్న మిత్రుల సౌకర్యార్థం నేను వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా నా బ్లాగ్ లో పెడుతున్నాను. చదివి మీ స్పందన తెలియజేయగలరని ఆశిస్తున్నాను.]

సుదీర్ఘ‌ పోరాటాలు, అపారమైన‌ త్యాగాల తదనంతరం సముపార్జించుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుటిల రాజకీయాలకు బలైపోయింది. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి, కలహాల కుంపటి రగిల్చారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్ట సుఖాలలో కలిసి మెలిసి జీవిస్తూ హైదరాబాదు రాజథానీ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుకొన్న తదనంతరం అభివృద్ధి ఫలాలను అనుభవించే అర్హత మీకులేదని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల తలరాతను మార్చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కర్నూలు పట్టణాన్ని రాజథానిగా ఎంపిక చేసుకొన్న మీదటనే 1953 అక్టోబరు 1వ తేదీన ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్బిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసి హైదరాబాదు మహానగరాన్ని అప్పజెప్పి, మిగిలిన‌ పదమూడు జిల్లాలతో కూడిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్నిపునర్యవస్థీకరించారు. ఒకనాటి ఆంధ్ర రాష్ట్రమే స్థూలంగా నేటి ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని నాటి యు.పి.ఎ. ప్రభుత్వ నిరంకుశత్వం మూలంగా రాష్ట్ర‌ ప్రజలు త్రిశంక స్వర్గంలోకి నెట్టివేయబడ్డారు. రాజథాని ఎక్కడో! నిర్దారించకుండానే వీథుల పాలుచేశారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ అన్నఅంశంపై అనిశ్చితి కొనసాగుతుండడంతో ప్రజలు జుట్లు పట్టుకొని తన్నుకొనే పరిస్థితులను కల్పించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకపోగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే అభాసుపాలుచేసి, నిరంకుశంగా రాష్ట్రాన్ని చేల్చివేశారు. రాష్ట్ర రాజథాని  అంశంపై కూడా అదే తరహా డ్రామాను రక్తికట్టించే దోరణిలోనే తతంగం నడుస్తున్నదనిపిస్తున్నది.
పరిణతే ప్రథమ సోపానం కావాలి: అడ్డగోలు విభజనకు సంపూర్ణ సహాయ సహకారాలను అందించిన బిజెపి నేడు కేంద్రంలో గద్దెనెక్కింది. రాజథాని ఎంపికలో మేం జోక్యం చేసుకోమని, రాష్ట్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని చిలక పలుకులు పలుకుతున్నది. మరొకవైపు కేంద్రమే శివరామక్రిష్ణ కమిటీని నియమించి అభిప్రాయ సేకరణ, అనువైన కేంద్రం కోసం అధ్యయనం చేయిస్తున్నది. ఆగస్టు ఆఖరు నాటికి నివేదికను సమర్పిస్తామని ఆ కమిటీ సభ్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, 'పవర్ కారిడార్స్'లో చక్కర్లు కొట్టే దళారులు అనధికారిక వార్తలను ప్రచారంలో పెడుతూ గుంటూరు, కృష్ణా జిల్లాలలో భూముల ధరలు ఆకాశం వైపు పరుగులు తీసేలా అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారు.
రాష్ట్ర రాజథాని ఎంపికలో ముఖ్యంగా రాజకీయ నాయకత్వం పరిణతితో వ్యవహరించాలి. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని, చేదు అనుభవాలు పునరావృతం కానిరీతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య మరియు దక్షిణ కోస్తాంధ్ర‌ ప్రాంతాల ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఏకభిప్రాయ సాధన ద్వారా శ్రేష్టమైన నిర్ణయాన్నితీసుకోవాలి. భవిష్యత్ తరాల జీవితాలతో ముడిపడి ఉన్న జఠిలమైన ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర‌ ప్రభుత్వాలు అత్యంత బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిన‌ కాంగ్రెస్ అనుసరించిన అప్రజాస్వామికమైన, నియంతృత్వ పోకడలను బిజెపి నాయకత్వంలోని యన్.డి.ఎ. కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాజధాని అంశంపై ఏకపక్షంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. 
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన‌ 1953 నాటికి, నేటికీ రాజకీయ రంగంలో పెనుమార్పులు సంబవించాయి. తెలుగు జాతిని ముక్కలు చేసిన పాపానికి కా౦గ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోయింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా, తెలుగునాట బలమైన శక్తిగా ఉండిన కమ్యూనిస్టులు నేడు ప్రభావశీలురుగా లేరు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెసుకు, కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యమే లేని దుస్థితి నెలకొన్నది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యంలోకి వచ్చాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల‌ ప్రజలందరి జీవితాలని ప్రభావితం చేసే రాజధాని నిర్మాణానికి అనువైన‌ స్థలం ఎంపిక విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీల, సంస్థల, వివిధ ప్రాంతాల, వర్గాల‌ ప్రజల మధ్య‌ ఏకాభిప్రాయ సాధనకు అధికారంలో ఉన్నవారు అంకితభావంతో కృషి చేయాలి. రాజకీయ విజ్ఞతతో ఈ సమస్యపై బహుముఖ కోణాలలో పరిశీలన చేసిన మీదటనే నిర్ణయం తీసుకోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఊహాగానాలకు, పుకార్లకు ఆస్కారం ఇస్తే దుష్పరిణామాలకు ఆజ్యం పోసినట్లవుతుంది. అనధికారిక‍ వార్తలను ప్రచారంలో పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేయడం శ్రేయస్కరం కాదు. భూమి లావాదేవిలు జూదంగా పరిణమించి, కృత్రిమంగా ధరలను పెంచి, అంత్యమంగా అత్యధికులు దివాలాతీసే పరిస్థితులు కల్పించబడుతున్నాయి. పేద రైతులను భూముల నుండి దూరం చేసే పరిస్థితులు, నిరుపేదలకు గుడిసేసుకోవడానికి కూడా స్థలం దొరకని దుస్థితి, మధ్యతరగతి ప్రజానీకం అందుకోలేనంత ఎత్తులో ధరలు ఉన్న ప్రాంతంలో రాజథాని నిర్మాణం జరిగితే సామాన్యుల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనలవికాదు. గుంటూరు_ విజయవాడల మధ్య రాజథాని ఉంటుందన్న వార్తలు బయటికి పొక్కడంతో హైదరాబాదులో స్థిరాస్థి మరియు భవన నిర్మాణ రంగంలోవ్యాపారస్తులుగా స్థిరపడిన కోస్తాంధ్ర కొందరు భూములు కొనడానికని ప్రయత్నించి ధరలు చూసి పారిపోయివచ్చారు. ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం దుర్లభమనే ఆలోచనలోపడ్డారు. వాణిజ్య, పారిశ్రామిక, విద్యా సంస్థలు, గృహ సముదాయాలు వగైరా అవసరాల వినియోగార్థం సస్యశ్యామలమైన‌ పంట పొలాలు వాణిజ్య భూములుగా రూపాంతరం చెంది ఫ్లాట్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. తద్వారా ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదమూ లేకపోలేదు. రాష్ట్ర‌ విభజన మూలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి బలవంతంగా నెట్టివేయబడిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజానీకాన్నిమరిన్నికష్టనష్టాల ఊబిలోకి నెట్టినట్లవుతుంది. రాజధాని ఎంపిక, నిర్మాణం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన విషయాలలోనైనా స్వార్థపూరితమైన రాజకీయాలకు, ప్రాంతీయతత్వానికి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించాలి లేదా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం గుర్తుంచుకోవాలి. 
ప్రజాస్వామ్య ప్రక్రియకు దర్పణం: దక్షిణ భారత దేశానికే మకుటాయమానంగా అభివృద్ధి చెందిన‌ మద్రాసు నగరాన్ని వదులుకోవడం నష్టదాయకమైనా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి సాధించుకొన్నారు కాబట్టి పెద్దగా బాధపడలేదు. మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఉద్యమ కాలంలో కొందరు కోరినా అది ఫలించలేదు. నాటి ప్రధాని నెహ్రూ 1953 మార్చి 25న ఒక ప్రకటన చేస్తూ, 1953 అక్టోబరు 1న నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడుతుందని, ఉమ్మడి రాజధానిగా మద్రాసును కొనసాగించే ప్రసక్తే లేదనీ, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ రాజధానిని ఎర్పాటు చేయాలన్న అంశాన్నిఆంధ్ర శాసన సభ్యులే నిర్ణయించుకోవాలని విస్పష్టమైన ప్రకటన‌ చేశారు. అలాగే రాష్ట్ర ఏర్పాటులో తలెత్తే సమస్యలను కూలంకషంగా పరిశీలించేందుకు న్యాయమూర్తి కె.ఎన్. వాంఛూను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజధాని ఎంపిక విషయంలో నాడున్ననాలుగు ప్రధానమైన‌ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కరవైయ్యింది. కాంగ్రెస్ పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ తాత్కాలికంగా మద్రాసునే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరినా నెహ్రూ నిర్ద్వంధంగా తిరస్కరించడంతో  'రాజధాని ఎక్కడ' అన్నసమస్య జఠిలంగా పరిణమించింది. ఆంధ్ర ప్రాంతంలో ఉండాలని, విజయవాడ దానికి అనువైన పట్టణమని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. కృషికార్ లోక్ పార్టీ తిరుపతి పట్టణం అనుకూలంగా ఉంటుందని సూచించింది. అప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలనే నిర్ధారణకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని ఆంధ్ర శాసన సభ్యులు 1953 జూన్ 5న ప్రత్యేకంగా సమావేశమై, అయిదు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించిన మీదట‌ రాజధాని ఎక్కడన్న వియషయంలో వెనుకబడిన‌ రాయలసీమవాసుల అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వాలన్న నిశ్చయానికి వచ్చారు. పర్యవసానంగా కర్నూలు పట్టణాన్ని తాత్కాలిక రాజధానిగా ఉండాలన్న‌తీర్మానం ఆమోదించబడింది. అలాగే హైకోర్టును గుంటూరులో నెలకొల్పాలడానికి అంగీకారం కుదిరింది.
ఈ తతంగం వెనకాల సంకుచిత‌ రాజకీయాలు లేవని భావిస్తే పప్పులో కాలేసినట్లే. కొస్తా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా ఉండడం, ప్రత్యేకించి విజయవాడ‌ కమ్యూనిస్టులకు ఉద్యమ కేంద్రం కావడంతో రాష్ట్ర రాజధానిని అక్కడ‌ నెలకొల్పడానికి నాడు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో  తెలుగు నాట ఉన్న‌140 స్థానాలకుగాను 41 స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ గెలుపొందింది. వాటిలో నాల్గింట మూడొంతులు (31) నాలుగు డెల్టా జిల్లాలలైన‌ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలోని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో గెలిచి ద్వితీయ స్థానంలో నిలిచింది. మధ్య కోస్తాంధ్రలో కేవలం 11 స్థానాలనే సాధించుకొన్నది. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన‌ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ(కె.యం.పి.పి.)ని స్థాపించి 20 స్థానాల్లో గెలుపొందారు. యన్.జి.రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీ 15 స్థానాల్లో గెలిచింది. సోషలిస్టులు ఆరు స్థానాల్లో గెలిచారు. నెల్లూరుతో కూడిన రాయలసీమ జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో గెలిచి పట్టు నిలబెట్టుకొన్నది. ఈ గణాంకాలను బట్టి పరిశీలిస్తే కోస్తాంధ్రలో కమ్యూనిస్టులు, రాయలసీమలో కాంగ్రెస్ బలంగా ఉన్న సంగతి స్పష్టమవుతుంది. ఆ రాజకీయ‌ కారణంగానే విజయవాడను రాజధానిగా నాడు కాంగ్రెస్ అంగీకరించలేదన్నది చారిత్రక సత్యం. పైపెచ్చు విజయవాడను రాజథానిగా ప్రతిపాదించినందులకు కమ్యూనిస్టులపై దుష్ప్రచారానికి కూడా పాల్పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ వాతావరణం కొనసాగింది. వామపక్ష విద్యార్థి సంఘం అయిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎ.ఐ.యస్.ఎఫ్.) రాష్ట్ర మహాసభను కర్నూలు పట్టణంలో నిర్వహిస్తే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కోస్తాంధ్ర నుండి మహాసభలో పాల్గొనడానికి రైలులో ప్రయాణిస్తున్న‌ప్రతినిథులపై నంద్యాలలో రాళ్ళతో దాడి చేశారు. యావత్తు తెలుగు జాతిని ఒకే గొడుగు క్రిందికి తీసుకొచ్చి విశాలాంధ్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ‌ ప్రాంతాలలోని ప్రజానీకంలో అప్పటికే ప్రబలమైన ఆకాంక్ష వెల్లడవుతున్న‌నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కేవలం తొలిమెట్టేనని, హైదరాబాదు రాజథానిగా తెలుగు జాతి మొత్తాని ఒకే రాష్ట్రం అవతరించబోతున్నదని భావించడం వల్ల తాత్కాలిక రాజధానిగా కర్నూలుకు ఆనాడు స్థూలంగా ఆమోదం లభించిందన్న వాస్తవాన్నికూడా గుర్తుంచుకోవాలి.
రాజధాని ఎంపికకు సంబంధించి నాడు ఏ సమస్యలైతే తీవ్ర‌చర్చనీయాంశాలైనాయో! రమారమి అవే సమస్యలు పునరావృతమైనాయి. అప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభావితం చేసిన ఆ అంశాలు నేడు అంతకంటే తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన‌ భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడడానికి రాయలసీమవాసులు ముందు తటపటాయించడమే కాదు వ్యతిరేకించారు. దానికి కారణం లేకపోలేదు.  కోస్తాంధ్ర జిల్లాలలో పాశ్చాత్య విద్య అప్పటికే వ్యాపించడం, ధనిక రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఆవిర్భవించడం, సాంఘిక సంస్కరణాభిలాష పెరగటం వలన సామాజికాభివృద్ధిలో, ప్రజాజీవనంలో కోస్తాంధ్ర ప్రాంతం వారు రాయలసీమ వారికంటే బాగా ముందడుగులో ఉండేవారు. పర్యవసానంగా వారిలో రాజకీయ చైతన్య స్థాయి కూడా ఎక్కువగా ఉండేది. అయినా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులు అత్యధికంగా ప్రభుత్వ‌ ఉద్యోగాలను కైవసం చేసుకొనేవారు. ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య నామమాత్రంగా ఉండేది. ప్రత్యేక ఆంధ్ర‌ రాష్ట్ర డిమాండు తొలిదశలో మొగ్గతొడగడానికి అదొక ప్రధాన కారణమని చెప్పవచ్చు. రాయలసీమ ప్రజలు మరీ వెనుకబడి ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోను, ఉద్యోగస్తులలో కోస్తాంధ్రుల ఆధిపత్యం నెలకొంటుందన్న భావనలు సీమవాసుల్లో తలెత్తడంతో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న లక్ష్యం సాకారం కావలంటే రాయలసీమ ప్రాంత ప్రజల భాగస్వామ్యం అనివార్యమని కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. రాయలసీమవాసుల మనోగతాన్ని పసిగట్టి, చర్చలు సాగించి 1936లో "శ్రీబాగ్ ఒడంబడిక"గా పేరొందిన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాయలసీమ ప్రజలకు భవిష్యత్తుపై బరోసా ఇచ్చి వారు ఉద్యమంలో అంతర్భాగం అయ్యేలా ఒప్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మద్రాసులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొని 58 రోజుల తదనంతరం 1952 డిసెంబరు 15న అమరులైనారు. దాంతో రాష్ట్ర‌ సాధన కోసం తెలుగు జాతి ఒక్కటై ఉగ్రరూపందాల్చి ఉద్యమించి, లక్ష్యాన్ని సాధించుకొన్నది.
కానీ, క్షామ పీడిత‌ రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలు, విద్య, ఉపాథి తదితర రంగాలలో అభివృద్ధికి ఉద్ధేశించబడిన‌ శ్రీబాగ్ ఒడంబడిక బట్టదాఖలా చేయబడింది. తుంగభద్ర, కృష్ణా నదీ జలాల వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రమేర్పడింది. అటుపై 1956 నవంబరు 1న‌ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ రాయలసీమ ప్రజల దాహార్తి తీరలేదు. కరవుల్లో పుట్టి, కరవుల్లో జీవచ్చవాల్లా బ్రతుకులు వెళ్ళదీసి, కరవుల్లో చచ్చిపోతున్నారు. కృష్ణా జలాల వివాద పరిష్కారానికై న్యాయమూర్తి బచావత్ నేతృత్వంలో నియమించబడిన ప్రథమ‌ ట్రిబ్యునల్ రాయలసీమ ఆర్థనాదాన్ని వినిపించుకోలేదు. న్యాయమూర్తి బ్రజేష్ కుమార్ నాయకత్వంలోనియమించబడిన రెండవ ట్రిబ్యునల్ ఏ మాత్రం కరుణ చూపించలేదు. కడకు మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న హంద్రీ _నీవా, గాలేరు_నగరి, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. తెలుగు గంగకు 25 టి.యం.సి.ల మిగులు జలాలను కేటాయించినా పై రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆలోచనా తీరుతెన్నులు చూస్తుంటే ఆ నీళ్ళైనా క్రిందికి పారుతాయా! అన్న అనుమానాలు వస్తున్నాయి. కర్నూలు నుండి రాజధాని తరలిపోయింది. కృష్ణా, తుంగభద్ర‌ నదీ జలాల వినియోగంలో ప్రాధాన్యత ఇస్తామన్న వాగ్దానం గాలిలో కలిసిపోయింది. తుంగభద్ర జలాశయం చేజారిపోయింది. తెలుగు జాతి ఐక్యత కోసం అపార‌త్యాగాలు చేసిన‌ రాయలసీమ దగా చేయబడింది. తాజాగా సంకుచిత‌ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ విభజన చేయబడింది. తెలుగు ప్రజల ఆశాసౌధవంగా నిర్మించుకొన్న, బాగా అభివృద్ధి చెంది ఉపాథి, విద్య, వైద్య సదుపాయాలకు, ఆర్థికవనరులకు కల్పతరువుగా ఆవిర్భవించిన‌ హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయామన్న మనోవేదనే మిగిలింది. భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
సీమ కడగండ్లు కనబడదా?: నిరంతర క్షామ పీడిత, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను పొందుపరచలేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను నెలకొల్పే విషయంలోకానీ, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించినా అదే భావన కలుగుతున్నది. సముద్రతీరం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, జాతీయ రహదారి, నీటి వనరులు, విద్యుదుత్పాదన వగైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే కారణాలను చూపెట్టి అభివృద్ధి ప్రణాళికలపై చర్చంతా పాశ్చిక దృష్టితో సాగుతున్నది. విశాఖ-నెల్లూరు మధ్య ఉన్న‌ప్రాంతంపైనే కేంద్రీకరించబడింది. రాజథానిని ఎక్కడ నెలకొల్పుకోవాలన్న చర్చను కూడా ఈ అంశాలే పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. వికేంద్రీకరణ జపం చేస్తూనే ఆచరణలో కేంద్రీకృత అభివృద్ధి మంత్రాన్ని ఆలాపిస్తున్నారు. విధాన నిర్ణేతల ఆలోచనలన్నీఅభివృద్ధి చెందిన ప్రాంతాలపైనే కేంద్రీకరించబడి ఉన్నాయనిపిస్తున్నది. గత‌ అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణామాలను ఊహించుకొంటున్నరాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం ఏ మాత్రం జరగడం లేదనిపిస్తున్నది. అందుకే మన బతుకేదో మనం బతికేద్దాం! అన్న భావనలు వ్యక్తం చేసే వారి సంఖ్య రాయలసీమలో పెరుగుతున్నది. 1956 నవంబరు 1న‌ హైదరాబాదు రాజధాని నగరంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో అందివచ్చిన‌ సానుకూలాంశాలను సద్వినియోగం చేసుకొని బాగా అభివృద్ధి చెందిన 55 ఏళ్ల తర్వాత నిర్ధాక్షిణ్యంగా వెళ్ళగొట్టినట్లే, కోస్తాంధ్రలో రాజధాని అభివృద్ధి చెందిన తరువాత రాయలసీమ వాళ్ళను అక్కడి నుండి వెళ్ళగొట్టరనే గ్యారెంటీ ఏమైనా ఉన్నదా! అన్న సంకోచం ఆ ప్రాంత ప్రజానీకం మెదళ్ళను తొలిచేస్తున్నది. తెలుగు జాతి ఐక్యతాంశం కంటే స్వార్థం పైచేయి సాధించిన నేపథ్యంలో ఈ భావనలు కలగడం సహజం. 'మా ప్రాంత అభివృద్ధి ఫలాలను తామే అనుభవించాలనే' దుర్బుద్ధికి అంతం ఉండదు కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్ర బిందువుగా జరుగుతున్న అభివృద్ధి కనీసం కొంత వూరట కల్పించవచ్చునేమో! కానీ రాయలసీమ ప్రజలకు అలాంటి ఆశాకిరణమే కనిపించడం లేదు. తెలుగు జాతి సమైక్యత కోసం వెనకాముందు ఆలోచించకుండా అపార‌ త్యాగాలు చేసిన రాయలసీమ నేడు దిక్కుతోచని స్థితిలో పడిందన్నది ముమ్మాటికీ నిజం.
నైసర్గిక స్వరూపం: ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చారిత్రకంగా, రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగు ప్రాంతాలుగా వర్గీకరించబడి ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగాను, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు మధ్య కోస్తా లేదా డెల్టా జిల్లాలుగాను, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు దక్షిణ కోస్తాగాను, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమగా పరిగణించబడుతున్నాయి. ఈ ప్రాంతాల అభివృద్ధిలో పెద్ద ఎత్తున వ్యత్యాసాలున్నాయి. శీతోష్ణస్థితి - వర్షపాతం విషయంలోనూ తేడాలున్నాయి. కోస్తాంధ్రలో సగటు వర్షపాతం 995.7 మి.మీ. ఉంటే రాయలసీమలో 670.4 మి.మీ. మాత్రమే. పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార డెల్టా ప్రాంతాలు విస్తరించి ఉన్న కోస్తాంధ్ర ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది. సారవంతమైన భూములతో, పచ్చని పంట పొలాలతో అలరారుచున్నది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకు, వర్షపాతానికి దగ్గర చుట్టరికం ఉన్నది. అందు వల్ల కోస్తాంధ్ర ఒక విధంగా ప్రయోజనం పొందుతున్నది, మరొక విధంగా తరచూ తుఫానుల బారినపడుతూ తీవ్రంగా నష్టపోతున్నది. వేసవి కాలంలో గుంటూరు జిల్లా రెంటచింతలలో రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. హైదరాబాదు, బెంగుళూరు నగరాల అభివృద్ధికి అత్యంత‌ సానుకూలమైన అంశం వాతావరణమే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంబవించిన దృష్ట్యా దూరం, కాలం తగ్గిపోయింది. పాలనా వ్యవహారాల్లో ఇంటర్నెట్ పాత్ర గణనీయంగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పాలన సాగించే దశలో ఉన్నాము. రాజథాని, హైకోర్టు, నూతనంగా నెలకొల్పదలచిన‌ ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు, భారీ మధ్యతరహా పరిశ్రమలు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొనే ముందు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి.

అభివృద్ధి ప్రణాళికేది?: రాయలసీమ, ఉత్తరాంధ్ర‌ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిథులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. చెన్నయ్ నుండి కలకత్తా మధ్యలో ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రాయలసీమకు మూడు వైపులా అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కర్నూలుకు సమీపంలో హైదరాబాదు, అనంతపురంకు సమీపంలో బెంగుళూరు, తిరుపతి, కడపకు సమీపంలో చెన్నయ్ ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రమంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసింది. విస్తారమైన భూ సంపద, ఖనిజ మరియు అటవీ సంపదున్నది. నీరే సమస్య. నికర జలాలను కేటాయించి, రాయితీలు ఇస్తే  పారిశ్రామికాభివృద్ధికి అనువైన పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా నదీ మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లభించే 45 టి.యం.సి.ల నికర జలాలను కేటాయించి నీటి సమస్యను పరిష్కరించాలి. కృష్ణా నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ, వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఉన్నత విద్యా సంస్థల్లో కొన్నింటిని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలతో కూడిన సమగ్ర‌ అభివృద్ధి ప్రణాళికను సత్వరం ప్రకటించి, అమలు చేయాలి. రాజథాని సమస్యను మాత్రమే వేరుచేసి అత్యాధునిక హంగులతో గుంటూరు_ విజయవాడ లేదా విజయవాడ_ ఏలూరు మధ్య లేదా మరెక్కడైనా మహానగరాన్ని నిర్మిస్తామని కబుర్లు చెబితే వెనుకబాటుతనంలో కునారిల్లిపోతున్న రాయలసీమకు ఒరిగేదేమీలేదు. "సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం" ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్ లో సుపరిపాలనను ప్రజలు కోరుకొంటున్నారు.