Thursday, June 25, 2015

ఎమర్జన్సీకి నాలుగు పదుల వయసు


బిజెపి అగ్రనేత శ్రీ యల్.కె.అద్వానీ య‌దాలాపంగా వ్యాఖ్యాని‍ంచారో! లేదా హృదయాంతరాళ నుండి ఆ మాటలు బయటికి తన్నుకొచ్చాయో! తెలియదు గానీ దేశ ప్రజలను, ఆ మాటకొస్తే అంతర్జాతీయ సమాజాన్ని మాత్రం ఉలికి పాటుకు గురిచేసి, కాస్త ఆలోచనలో పడేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమర్జన్సీ విధించబడదని చెప్పలేని పరిస్థితులు నేడు దేశంలో నెలకొని ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలను ఆషామాషిగా కొట్టిపారేయలే‍ం. ప్రజాస్వామ్య శక్తులు అత్య‍ంత‌ బలహీనంగా ఉన్నాయని, నియంతృత్వ శక్తులు పై చేయి సాధిస్తున్నాయని ఆద్వానీ గారు నేటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించడమే విశేషం. నలబై ఏళ్ళ నాటి చేదు అనుభవాలను నెమరు వేసుకొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సంఘ్ పరివార్ కూటమి తేలిక భావంతో కొట్టిపారేసింది. కాషాయదళం అధికారంలోకి వచ్చినా పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదన్నఅసంతృప్తితో ఆయన లోలోపల కుమిలిపోతున్నారేమో! అది కొంత వరకు వాస్తవం కావచ్చు. కానీ మరొక కోణంలో నుంచి ఆలోచిస్తే మోడీ ఏడాది పాలనను నిశితంగా గమనిస్తున్న రాజకీయ కురువృద్ధుడుగా మోడీ పరిపాలనా శైలి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, అధికార యంత్రాంగం పట్ల ఆయన ప్రదర్శిస్తున్న వైఖరి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదన్న భావన ఆద్వానీకి కలిగిందేమో! పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతాతానై అధికార కేంద్రీకరణతో పెత్త‍దారీ పోకడలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అందుకే ఒక హెచ్చరికగా ఆద్వానీ ఆ వ్యాఖ్యలు చేశారేమోననిపిస్తోది. ప్రణాళికా సంఘం రద్దు మొదలుకొని న్యాయ వ్యవస్థను తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని వ్యూహాత్మకంగా మోడీ వేస్తున్న అడుగులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కాషాయీకరణ చేసే ప్రక్రియ చాప క్రింద నీరులా జరిగిపోతున్నదన్న‌ ఆరోపణలు గుప్పు మంటున్నాయి.
స్వాతంత్య్రానంతరం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎంచుకొన్న భారత దేశంలో నియంతృత్వం పెచ్చరిల్లి, అత్యవసర పరిస్థితి(ఎమర్జన్సీ) విధించబడి 22 నెలల పాటు చీకటి పాలన సాగింది. 40 సంవ‌త్సరాల క్రితం, 1975 జూన్ 25న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలతో ఎమర్జన్సీని విధించి, ప్రజాస్వామ్య హక్కులు మ‌రియు మానవ హక్కులపై ఉక్కు పాదం మోపారు. స్వేచ్ఛను హరించారు. ప్రజా ఉద్యమాలపై కన్నెర్ర చేశారు. పోలీసు రాజ్యం చేదు అనుభవాలు నాటి తరం ప్రజల స్పృతి పథం నుండి తొలగిపోలేదు. ఆ అనుభవాలు లేని నేటి తరానికి అత్యవసర పరిస్థితి అంటే ఎంతటి దుర్మార్గమైన పాలనో ఊహించుకోవడమే కష్టం.
ఆ నిరంకుశ పాలనలో నాకు ఒక చిన్న‌ చేదు అనుభవం ఉన్నది. డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన ఒక న్యాయబద్ధమైన సమస్యపై కార్యాచరణకు పూనుకొంటే పోలీసులు నిష్కారణంగా అరెస్టు చేశారు. నెనప్పుడు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బి.కాం. ప్రథమ సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. నాడు డిగ్రీ విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలను రోజుకొకటి చొప్పున నిర్వహించేది. పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించాలని కోరుతూ మా యస్.వి.ఆర్ట్స్ కళాశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపై ఒక రోజు అర్థరాత్రి వాలరైటింగ్స్ వ్రాస్తుంటే రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు దళం నాతో పాటు ఉన్న మరో నలుగురిని అరెస్టు చేసింది. మమ్మల్ని ఏ చట్టం క్రింద అరెస్టు చేశారని అడిగిన పాపానికి నా మిత్రులిద్దర్ని పోలీసులు చితకబాదారు. తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, తూర్పు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ఖాళీ లేకపోవడంతో పశ్చిమ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ‌ నిర్భందించి, ఉదయం బేయిల్ పై విడుదల చేశారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో ఒకతను హెడ్ కానిస్టేబులు కుమారుడు కూడా ఉన్నాడు. కారణం చెప్పకుండా అప్రజాస్వామ్యంగా అరెస్టులు చేసి జైళ్ళలో నెలల తరబడి నిర్భందిచే వారు. ఎలాంటి విచారణలు జరిపే వారు కాదు.
సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన ఉద్యమాన్ని మితవాద అభివృద్ధి నిరోధక ఉద్యమంగా, ఫాసిస్టు ఉద్యమంగా అభివర్ణించి, ఆ ప్రతీఘాత ఉద్యమానికి వ్యతిరేకంగా 1975 డిసెంబరు మొదటి వారంలో ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక మహాసభను పాట్నాలో నిర్వహించారు. దానికి 50 దేశాల నుండి సౌహార్థ ప్రతినిథులు కూడా వచ్చి పాల్గొన్నారు. భారత దేశ‍ నలుమూలల నుండి దాదాపు ఆరు వేల మంది ప్రతినిథులు హాజరైనారు. నేను ఎ.ఐ.యస్.ఎఫ్. ప్రతినిథిగా తిరుపతి నుండి వెళ్ళి పాల్గొన్నాను. మహాసభ ముగింపులో జరిగిన బహిరంగ సభకు ఐదు లక్షల మందికిపైగా ప్రజానీకం పాల్గొన్నారని వేదికపై నుంచి నిర్వాహకులు ప్రకటించారు. నా జీవితంలో మొట్టమొదట పాల్గొన్న‌ భారీ బహిరంగ సభ అదే. గడ్డ గట్టే చలిలో తరలివచ్చిన ఆ ప్రజానీకానికి వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిథులు జేజేలు పలికారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా జనభాహుళ్యం కదం తోక్కిందని నా నాంటి వెర్రి వెంగళప్పలు కేరింతలు కొట్టాం. విషాదకరమైన అంశమేమంటే అత్యవసర పరిస్థితిని విధించడాన్ని బలపరచి, అటుపై దుష్టపాలనను కళ్ళారా చూసి నాలుక కరుచుకొని, బహిరంగంగా పక్షాత్తాపం వ్యక్తం చేసింది నా మాతృ సంస్థ. ఆ నియంతృత్వ పాలన చరిత్ర‌ భావితరాలకు తెలియాలి. భారత దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టవంతంగా రూపుదిద్దుకోవాలని బలంగా కోరుకొంటూ! నియంతృత్వ పోకడలు ఏ రూపంలో ఎక్కడ పొడచూపినా మొగ్గలోనే తుంచేసే చైతన్యం భారతీయ సమాజంలో పెంపొందాలని ఆకాంక్షిస్తున్నా! 

Monday, June 22, 2015

కరువుసీమ‌ నీటి సమస్య కేంద్రానికి పట్టదా!


పాలమూరు - రంగారెడ్డి, నక్కలగంాడి ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. శంఖుస్థాపనలు చేసి, కృష్ణా నీటి వినియోగ హక్కులపై అసంబద్ధమైన వ్యాఖ్యలు, అవాకులు చవాకులు మాట్లాడడంతో నీటి వివాదాల సమస్యపై మళ్ళొకసారి వాడి వేడి చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ‌ కాస్త‌ దృష్టిసారిoచి ఉభయ రాష్ట్రాల నీటి పారుదల రంగానికి చెందిన అధికారులను డిల్లీకి పిలిచి చర్చించింది. వర్షా కాలం మొదలయ్యింది. కానీ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాలలోకి నీటి ప్రవాహం లేదు. జలాశయాలలో కనీస‌ నీటి నిల్వలు కూడా లేని దుస్థితి నెలకొన్నది. ఖరీప్ సీజన్ సమీపిస్తున్నది. కృష్ణా నదికి ప్రస్తుతానికి నీటి ప్రవాహం లేకపోయినా ఈ ఏడాది నీటి వినియోగానికి సంబంధిoచి వివాదం తలెత్తకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం తలంచినట్లు, ఉభయ రాష్ట్రాల అధికారులతో రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశానంతరం వెల్లడించిన అంశాలను బట్టి స్పష్టమవుతున్నది.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31తో ముగిసినా అటుపై నియమించబడిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండడంతో అది అమలులోకి రాలేదు. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మరియు కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రాజెక్టులకు చేసిన నీటి కేటాయింపుల ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ 512 టియంసిలు, తెలంగాణ 299 టియంసిల కృష్ణా జలాలను వాడుకోవాలని ఆదేశించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జఠిలంగా మారుతున్న‌ కృష్ణా నీటి వినియోగ హక్కులకు సంబంధించిన వివాదం మూలాల్లోకెళ్ళి చర్చ చేపట్టి కొత్త ఒప్పందమమేమీ కుదర్చలేదనది సుస్ప‌ష్టం. ప్రస్తుతానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఈ ఏడాది నీటిని వాడుకోవాలని, ఆ మేరకు నీటి విడుదలను నియంత్రిoచడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అందులో ఉభయ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల ఇంజనీరింగ్ ఛీప్స్ ను, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని సభ్యులుగా నియమించారు. అంత వరకు స్థూలంగా బాగానే ఉన్నది.

కానీ, సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చింది అన్న నానుడిగా ఈ తాత్కాలిక యుద్ధ విరమణ (నీటిపై) వడంబడిక ద్వారా రాయలసీమకు అన్యాయం జరిగే ప్రమాదపు ఛాయలు కనబడుతున్నాయి.

1. అత్యంత కరువు పీడిత జిల్లాగా పరిగణించబడుతున్న అనంతపురం జిల్లా నీటి దాహాన్ని కొంత వరకైనా తీర్చాలన్న లక్ష్యంతో తుంగభద్ర జలాశయం నుండి కడప-కర్నూలు కాలువ(కె.సి.కెనాల్)కు బచావత్ ట్రిబునల్ కేటాయించిన 10 టియం్సిలను పెన్నా అహోబిలం రిజర్వాయర్(పిఎబిఆర్)కు మళ్ళిoచి, అంతే నీటిని శ్రీశైలంన జలాశయం నుoడి కె.సి.కెనాల్ కు సర్దుబాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా అమలులో ఉన్న ఆ సర్దుబాటుకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లే అనిపించడ‍ లేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పరిగణలోకి తీసుకోలేదో! ఏం జరిగిందో తెలియదు కానీ పిఎబిఆర్ నీటి సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లు అనిపిస్తున్నది. ఫలితంగా అనంతపురం జిల్లాకు తీవ్రంగా నష్టం వాటిల్లనున్నది. కారణం కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుoడి నీటిని విడుదల చేయక పోతే సహజంగానే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు తుంగభద్ర జలాశయం నుండి 10 టియంసిల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.

2. కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోమని చెబుతూనే ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రెండు సర్దుబాట్లకు మాత్రం ఆమోద ముద్ర వేసింది. కారణం, ఆ రెండు సర్దుబాట్లకు కేంద్ర జల వనరుల సంఘం గతంలోనే ఆమోదం తెలియజేసి‍ ఉండడం కావచ్చేమో! అందులో ఒకటి: కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 29 టియంసిలలో మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించబడుతున్న భీమా ఎత్తిపోతల పథకానికి 20 టియంసిలు, పులిచింతల జలాశయానికి 9 టియంసిల నికర జలాలను సర్దుబాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం చేత ఆమోద ముద్ర వేయించుకొన్నది.
రెండవది: బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు పునరుత్పత్తి జలాలలో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన 11 టియంసిలతో పాటు కె.సి.కెనాల్ ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 8 టియంసిలను కలిపి 19 టియంసిలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) కు శ్రీశైలం జలాశ‌యం నుండి కేటాయించి కేంద్ర జల సంఘం నుండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సర్దుబాట్లను పరిగణలోకి తీసుకొనడం సముచితమైన నిర్ణయం. ఆ మేరకు పాక్షికమైన తాత్కాలిక ఒప్పందాన్నిరెండు రాష్ట్రాల మధ్య ఈ ఏడాదికి కృష్ణా నది నికర‌ జలాల‌ వినియోగానికి సంబంధించిన కేటాయింపులను నిర్ధారించింది.

3. బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛను ఇచ్చింది. ఆ మేరకు మిగులు జలాల ఆధారంగా నిర్మించబడిన తెలుగు గంగకు 29 టియంసిల నీటి విడుదలకు సంబంధించిన ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం కుర్చిన ఒప్పంద పత్రంలో లేకపోవడం తీవ్ర అభ్యంతకరం, రాయలసీమకు తీవ్ర నష్టాన్ని కలిగించే చర్య.

4. శ్రీశైలం జలాశయం ఆవిరి పద్దు క్రింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 33 టియంసిలను మాత్రం మూడు భాగాలు చేసి రాయలసీమ వాటాగా 11 టియంసిలను చూపెట్టడం ఎంత వరకు సమంజసం? శ్రీశైలంస జల విద్యుదుత్పాదన వల్ల ప్రయోజనం పొందే వారెవరు, శ్రీశైలం జలాశయం నుండి నికర జలాల వినియోగంలో రాయలసీమ వాటా ఎంత అన్న అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా గుండు గుత్తగా పద్దులు రాసేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

5. చెన్నయ్ నగరానికి 15 టియంసిలు త్రాగు నీటి కోసం ఇవ్వడానికి మహారాష్ట్ర, కర్నాటకలతో పాటు ఉమ్మడి రాష్ట్రం ఒప్పందం చేసుకొన్నది. అందులో భాగంగా సరఫరా చేయాల్సిన‌ 5 టియంసిలను కూడా మూడు వాటాలు చేసి, ఆంధ్రప్రదేశ్ వాటా 3.63 టియంాసిలుగా పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదికను నిర్ధారించాలి కదా!

6. హైదరాబాదు త్రాగు నీటి అవసరాల కోసం నీటి కేటాయింపు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలమైన వైఖరి ప్రదర్శించడం సమర్థనియం.

ముగింపులో ఒక్క మాట. నీటి కేటాయింపుల విషయంలో బట్టి పోలు పంచాయితీ కేంద్ర ప్రభుత్వం చేస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వం తలూపితే భవిష్యత్తులో సమస్యలు ఉత్ఫన్నమవుతాయన్న స్పృహ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది. కరువు పీడిత రాయలసీమ నీటి సమస్య మరింత సంక్లిష్టంగా, జఠిలంగా, అపరిష్కృతంగా కొనసాగడానికి దోహదపడే చర్యలకు అవగాహనారాహిత్యంతో పూనుకొన్నా భవిష్యత్తులో సంభ‌వించే దుష్పరిణామాలకు నేటి పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నీటి వినియోగంలో తలెత్తిన సమస్యలకు, రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత తలెత్తుతున్న, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై సంపూర్ణ అవగాహనతో బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన తరుణమిదని గుర్తుoచుకోవాలి.
అలా అని పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో హేతుబద్ధంకాని, అసంబద్ధమైన నీటి వివాదాలకు దిగి తెలుగు జాతి మధ్య అగాంధం పెంచమని కాదని కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణలోని అత్యంత కరువు పీడిత మరియు వెనుకబడ్డ జిల్లాలైన‌ మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డిలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ‌ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లా నీటి అవసరాలు తీర్చడానికి శాశ్వత పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేయాలి. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల‌ అనుసంధానమే తెలుగు ప్రజల ముందున్న‌ ఏకైక పరిష్కార‍ మార్గంగా స్పష్టంగా గోచరిస్తున్నది. పోలవరంతో పాటు దుమ్మగూడెం-నాగార్జునసాగర్ లింక్ పథకం కూడా అమలులోకి వచ్చినప్పుడు మాత్రమే వెనుకబడ్ద ప్రాంతాల నీటి సమస్య కొంత వరకైనా తీరుతుంది.        

Saturday, June 20, 2015

ఈటీవి ప్రతిధ్వని, 'ఉగ్రవాద హెచ్చరికలు' అన్న అంశంపై నిర్వహించిన‌ చర్చలో నాతో పాటు శ్రీయుతులు యం.పద్మనాభరెడ్డి, సి.నరసింహారావు, కన్నెగంటి రమేష్ బాబు లు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=paRiYL4MGX8

లలిత్ మోడీ..సుస్మాస్వరాజ్..వసుందర రాజే: వివాదం

ఐపియల్ కుంభకోణం ద్వారా రు.1,700 కోట్ల అవినీతికి పాల్పడిన కేసులో ప్రధాన‌ నింధితుడైన‌ లలిత్ మోడీ విచారణ నుండి తప్పించుకొని పారిపోయి లండన్ లో తలదాచుకొంటున్నాడు. ఆయనను భారత దేశానికి రప్పించి త్వరితగతిన విచారణను పూర్తి చేసి నింధితులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. గత ప్రభుత్వం లలిత్ మోడీ పాస్ పోర్టును రద్దు చేసింది. డిల్లీ హై కోర్టు 2014 ఆగస్టులో పాస్ పోర్టు రద్దు ఉత్తర్వును చెల్లదని తీర్పు చెప్పింది. దానిపై పది మాసాలు గడచిపోతున్నా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫీల్ చేయలేదు. లలిత్ మోడీ లండన్ నుండి పోర్చుగల్ వెళడానికి వీసా ఇవ్వాలని బ్రిటీష్ ప్రభుత్వానికి మన‌ విదేశాంగ మంత్రి శ్రీమతి సుస్మాస్వరాజ్ సిఫార్సు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుందరా రాజే బ్రిటీష్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమే కాకుండా తాను సిఫార్సు చేసిన విషయం ఏ మాత్రం బయటికి పొక్కరాదని, భారత ప్రభుత్వానికి తెలియ కుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్థిక కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఒక నింధితునికి తోడ్పడిన కేంద్ర మంత్రి, రాజస్తాన్ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి అండగా నిలవడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొస్తామని, అవినీతిరహితమైన నీతివంతమైన సుపరిపాలనను అందిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు దీనిపై స్పందించక పోవడాన్ని బట్టి మౌనం అర్థాంగీకారమని భావించాల్సి వస్తున్నది. ఈ అంశంపై మ‌హా టీవి నిర్వహించిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు డా. యన్. తులసిరెడ్డి, బిజెపి నాయకురాలు మ‌రియు మాజీ రాష్ట్ర మంత్రి శ్రీమతి పుష్పలీల గారు పాల్గొన్నారు. ఆ చర్చకు సంబంధించిన రెండు యూట్యూబ్ లి‍ంక్స్. 
https://www.youtube.com/watch?v=SIdKNs_oT-o
https://www.youtube.com/watch?v=ErCCim_TBnY

Friday, June 5, 2015

జూన్ 4 రాత్రి సాక్షి టీవిలో 'రేవంత రెడ్డి ఉదంతం: పరిణామాలు' పై జ‌రిగిన చర్చకు సంబంధించిన వీడియో లింక్. చర్చలో నాతో పాటు టి.ఆర్.యస్. శాసన మండలి సభ్యులు శ్రీ కర్నె ప్రభాకర్, టిడిపి తెలుగు యువత నేత శ్రీ రాజారామ్ యాదవ్, వై.యస్.ఆర్.సి.పి నాయకులు శ్రీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

http://www.sakshi.com/video/daily-programmes/the-fourth-estate-chandrababu-master-mind-in-cash-for-vote-scam-31505

జూన్ 5 ఉ.6టీవిలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ పని తీరు, రేవంత్ రెడ్డి ఉదంతంపై జరిగిన చర్చ యూ ట్యూబ్ వీడియో లింక్. చర్చలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు డా.యన్.తులసిరెడ్డి, టిడిపి నాయకురాలు శ్రీమతి సీతా రత్న, టీ.ఆర్.యస్. నాయకులు శ్రీ మందా జగన్నాథం పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=ND2KEeWKsUc

Tuesday, June 2, 2015

ఏడాది బిడ్డ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది!



సంపన్న కుటుంబంలో పుట్టింది. దుష్ట శక్తులన్నీ ఏకమై పేగు బంధాన్ని తెంచేసి, పైశాసికానందాన్ని పొందాయి. అనాధగా మిగిలింది. చుట్టూ అంధకారం అలముకొన్నది. భవిష్యత్తు మీద బెంగ. దిక్కుతోచని స్థితి. ఎవరిని నమ్మాలో! ఎవరిని నమ్మకూడదో! అంతు పట్టడం లేదు. మరొక వైపు నీకేమమ్మా! 960 కి.మీ. సముద్ర తీరం, వంశధార, గోదారమ్మ, కృష్ణమ్మ, పెన్నార్ తల్లి, విశాలమైన మాగాణి భూములు, లక్షలాది ఎకరాల‌ మెట్ట‌ భూములు, అపారమైన ఖనిజ సంపద, అటవీ సంపద, ప్రఖ్యాతిగాంచిన దేవస్థానాలకు వారసురాలువని ఊదరగొడుతూ వాటిని కబళించే పనిలో దుష్ట శక్తులు చుట్టూ మూగాయి. పీక్కు తినడానికి వూర కుక్కలు, గద్దలు, రాబంధులా చుట్టు ముట్టాయి. రహదారి కూడలిలో కూలబడి ఉన్న పసికందుకు ఎటు వైపు అడుగు వేయాలో పాలుపోని దుస్థితి. ఇదీ స్థూలంగా నవ్యాంధ్రప్రదేశ్ నేటి మానసిక స్థితి.

దుష్ట రాజకీయ, దోపిడీ శక్తుల విషవలయంలో చిక్కి విలవిల్లాడుతున్న ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రకృతి కూడా కక్ష గట్టింది. పద మూడు జిల్లాలలో ఐదు జిల్లాలు నిత్య కరువు పీడిత జిల్లాలైతే, మిగిలిన జిల్లాలు తుఫాను బాధిత జిల్లాలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుతనంతో కృంగి పోతున్నాయి. జనాభాలో 60% మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విభజన తరువాత వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. విశాఖపట్నాన్ని మినహాయిస్తే చెప్పుకోతగ్గ భారీ పరిశ్రమలు రాష్ట్రంలో మరే జిల్లాలో లేవు. విద్యాధిక యువతకు ఉపాథి కల్పించే ఆధునిక పారిశ్రామికాభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది.  హైదరాబాదు అభివృద్ధిలో భాగస్వాములై పెట్టుబడులు పెట్టిన‌ పెట్టుబడిదారులకు రాష్ట్రం విడిపోయినంత మాత్రాన జరిగిన నష్టం కానీ, వారి దోపిడికి ద్వారాలు మూసుకు పోవడంగానీ ఏమీ జరగలేదు. కానీ, హైదరాబాదు నా రాజధాని అనుకొని చమటోడ్చిన శ్రమ జీవులకు, వారి పిల్లలకు నీటిలోని చేపను బయటికి విసిరేసినట్ల‌య్యింది. 

నాణ్యత, నైపుణ్యాన్ని అందించ గలిగిన ఉన్నత విద్యా సంస్థలు లేవు. పుష్కలంగా మానవ వనరులు ఉన్నా వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్ది, ఉత్ఫత్తి ప్రక్రియలో ఉపయోగించుకొనే మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మృగ్యం. అసంఘటిత కార్మికులుగా దేశంలోని వివిధ పట్టణాలు, నగరాలకు మరియు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి బానిస బతుకు బతుకుతున్నారు. కనీసం మానవ వనరులను అభివృద్ధి చేస్తే స్వరాష్ట్రంలో కాకపోతే కడుపు చేతబట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి హుందాగా జీవించడానికైనా అవకాశం ఉంటుంది. తద్వారానైనా ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాతృ గడ్డ అభివృద్ధిలో ఉడతా భక్తిగా భాగస్వాములు కావడానికి అవకాశం లభిస్తుంది.

రాజకీయమంటే సమాజాభివృద్ధికి పాటుపడడం. అంతే కానీ, సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టడం కాదు. స్వార్థం, సంకుచిత భావజాలం నేడు పైచేయి సాధించి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. కలసి సహజీవనం చేస్తూ, తమ శ్రమను మరియు జాతి సంపదను దోపిడీ చేస్తున్న దుష్ట శ‌క్తులకు ఎదురొడ్డి నిలిచి సమరశంఖారావాన్ని పూరించాల్సిన‌  ప్రజలను విడగొట్టి, విధ్వేషాలు రెచ్చగొట్టి, రావణ కాష్టంలా మనోభావాల చితిని రగిల్చి, ఆ చితి ఆరిపోకుండా ఆజ్యం పోస్తూ తమ పబ్బం గడుపుకొంటున్న దోపిడీ శక్తులు, వారి రాజకీయ‌ దళారులకు సంతోషంగానే ఉన్నది. తెలుగు జాతి ముక్కలై ఏడాది గడచింది. రాష్ట్రం కావాలని దెబ్బలాడిన తెలంగాణా ప్రజల జీవన పరిస్థితుల్లో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇసుమంతైనా మెరుగుదల భూతద్దంి వేసి వెతికినా కానరావడం లేదు. దోపిడీ శక్తుల దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలని పరితపించి విఫలమైన ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకాన్ని మాత్రం సమస్యల సుడిగుండంలోకి నెట్టివేశారు.

జాతీయ దృక్పథం కొరవడింది. తెలుగు జాతిని విభజించడంలో జాతీయ రాజకీయ పక్షాలే ప్రధాన భూమిక పోషించాయి. వాటిలో ఎవరి తాత్విక చింతనలు, ప్రయోజనాలు వారికున్నాయి. కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలనే భావజాలం కొందరిదైతే, అధికార దాహం కొందరిది, గాలి వాటం రాజకీయాలతో లబ్ధి పొందాలని ఉబలాట పడ్డవారు మరికొందరు, ఏతావాతా అందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయి చేయి కలిపి తెలుగు జాతిని విడగొట్టారు. ఇవాళ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించాలంటే ఆ పాపం మూట గట్టుకొన్న‌ జాతీయ పార్టీలే ప్రధాన బాధ్యత వహించాలి. మరీ ముఖ్యంగా నాడు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అలాగే నాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించి నేడు అధికారంలో ఉన్న బిజెపి బాధ్యత వహించి, అన్ని విధాలా తోడ్పాటును అందించాలి. కానీ ఏడాది అనుభవాన్ని బట్టి దగాకోరు విధానాలనే ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా  ఆదాయ వనరులు, మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదాను కల్పించి, ఆర్థికాభివృద్ధికి అన్ని విధాల చేయూతనిస్తామని ఇచ్చిన వాగ్ధానాల అమలులో కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది.

ప్రత్యేక హోదాపై గందరగోళాన్ని సృష్టించి, కొనసాగిస్తున్నది. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారే గానీ ఆ వైపుగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ లోటు 2014 -15 ఆర్థిక సం.లో రు.14,400 కోట్లుగా కాగ్ తేల్చిన తరువాత కూడా ఆ మేరకు నిథులను మంజూరు చేయకుండా కేవలం రు.2,300 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం, బడ్జెట్లో రు.100 కోట్లు కేటాయించి, నిరసన ధ్వనులు వినిపించగానే రు. 2,000 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం మినహా ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా ఉన్న న్యాయపరమైన చిక్కులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టిన సూచనలు కనపడడం లేదు. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసు నుండి బయటపడేసి, ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలనే రాజకీయ సంకల్పం కొరవడింది. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపధికపై నూతన‌ రాజధాని నిర్మాణానికి నిథుల విడుదలపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత, తమది అరాకొర నిథులను సమకూర్చడం వరకే అన్న రీతిలో మోడీ ప్రభుత్వం వ్యవహారిస్తున్నది. వెనుకబడ్డ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నా, ప్రస్తుతం దాని ఊసే ఎత్తడం లేదు. మొత్తంగా చూస్తే ఏడాది గడచిపోయినా పునర్విభజన చట్టంలో పేర్కొన్న, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన వాగ్ధానాల అమలులో అడుగులు ముందుకు పడడం లేదు.

పర్యవసానంగా ప్రజలలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. మనోవేదనతో కృంగిపోతున్నారు. తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చంపి, పిల్లలను అనాధలను చేసిన హంతకులే వీథికెక్కి అనాధలైన పిల్లలకు న్యాయం చేయండంటూ గావు కేకలు పెట్టిన చందంగా ప్రజల చేతుల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీలు పునరుజ్జీవనం పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఉనికి కోసo పడ‌రానిపాట్లు పడుతున్నాయి.

కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి కేవలం రాజకీయ ప్రయోజనాలే కొలబద్ధగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నది. జాతీయ రాజకీయ పార్టీల్లో జాతీయ దృక్పథంగానీ, దేశ విశాల‌ ప్రయోజనాలు గానీ పెద్దగా కనిపించని దుస్థితి నెలకొన్నది. ప్రాంతీయ పార్టీల స్వభావం సహజంగానే సంకుచితంగా ఉంటుంది. ఇలాంటి సంక్షోభాల నుండి ప్రజలను బయట పడేసే శక్తి సామర్థ్యాలు వాటికి చాలా పరిమితంగా ఉంటాయి. పైపెచ్చు ఓటు బ్యాంకు రాజకీయాలతో పాలక పార్టీలు ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతున్నది. రాష్ట్ర విభజనతో వారసత్వంగా జనాభా ప్రాతిపదికపై లక్షా పది వేల కోట్ల అప్పుల భారం నెత్తిన పడింది. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించే శక్తి కూడా లేదు. కొత్తగా అప్పులు చేసే వేటలో ప్రభుత్వం ఉన్నది. ఉద్యోగులకు నెల వారి వేతనాల చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్నది. ఆదాయ వనరుల లేమితో బాధపడుతున్నది. నిథులు, నీళ్ళు, ఉపాథి, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు లేక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో సరిసమానంగా ఎదగడానికి అవరోధాలెన్నో అడ్డుగోడలుగా నిలిచాయి. పునర్విభజన చట్టంలో పొందుపరచబడ్డ అంశాలు, రాజ్యసభ వేదికగా ఇచ్చిన హామీల‌ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందడం లేదు. అయినా బాధ్యతగా ఆర్థిక క్రమశిక్షణతో వ్యవస్థను గాడిలో పెట్టవలసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ చర్యలు ఆర్థిక సంక్షోభాన్నితీవ్రతరం చేసి, దీర్ఘకాలికంగా ప్రజలకు హాని కల్గిస్తాయనే స్పృహ ప్రభుత్వ పెద్దల్లో లోపించిందనిపిస్తోంది.

చివరలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక్క‌ మాట. న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకోవడమే కాదు, తెలుగు ప్రజల గోడు వినిపించకుండా చెవులు కూడా మూసేసుకొంది. ప్రజలను రక్షించే వ్యవస్థ మరొకటి లేదు. ఇహ! చేసేదేముంది, అనుభవించడం తప్ప.  న్యాయం చేయక పోయినా అన్యాయం చేస్తే గుర్తుంచుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు హక్కుతో రాజకీయ పార్టీలకు తగిన శిక్ష విధించే చైతన్యo మాత్రం ప్రజలకు పుష్కలంగా ఉన్నదన్న విషయం గుర్తుంచుకోవాలి.