Monday, May 22, 2017

డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ !

కంప్యూటర్ల వ్యవస్థను ప్రపంచ వ్యాపితంగా ఒక కుదుపు కుదిపేసి, తీవ్ర ఆందోళనకు గురి చేసిన 'వర్నా క్రైం వైరస్' లేదా 'హ్యాకింగ్' సమస్య తలెత్తిన నేపథ్యంలో 'డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ' అన్న అంశంపై దూరదర్శన్, విజయవాడ కేంద్రం చర్చను నిర్వహించింది. చర్చలో నాతో పాటు 'ఎథికల్ హాకర్' గా పని చేస్తున్న శ్రీ సాయిసతీశ్ పాల్గొన్నారు.
నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాం. విజ్ఞాన సమాజం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం. 'డిజిటల్' ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం చేయకుండా మనుగడ సాగించలేం. ఆ వైపున ప్రయాణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.
అవినీతిని, నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే లక్ష్యంతో పాత రు.500, 1000 పెద్ద నోట్లను రద్దు చేసినట్లు దేశ ప్రధాన మంత్రి మోడీ గారు ప్రకటించారు. నగదు లావాదేవీలను నిరుత్సాహపరుస్తూ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించారు. నిరక్షరాస్యులను చైతన్య పరచడానికి యువత నడుంకట్టాలని పిలుపిచ్చారు.
ప్రజలు కూడా పెద్ద నోట్ల రద్దు పూర్వరంగంలో బ్యాంకులు, ఏటియంలలో నగదు లభించక పోవడంతో అనివార్యంగా మొబైల్, ఇంటర్నెట్ లావాదేవీల వైపు మళ్ళారు. గడచిన ఏడాది నవంబరు, డిసెంబరు మాసాలలో ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అటుపై కొంత తగ్గిన మాట వాస్తవమే.
ఈ పూర్వరంగంలో తాజా హ్యాకింగ్ సమస్య పర్యవసానంగా డిజిటలైజేషన్ వ్యవస్థ పట్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొనడం సహజం. పోలీసు వ్యవస్థ మొదలుకొని వివిధ రంగాలను కలవర పాటుకు గురిచేసిన హ్యాకింగ్ ఇంటర్నెట్ వినియోగదారులైన సామాన్య ప్రజానీకాన్నీ ఆందోళనకు గురి చేసింది.
దేశ రక్షణ శాఖ, రిజర్వ్ బ్యాంకు, కార్పోరేట్ సంస్థలు,తదితర సంస్థలు సైబర్ క్రైం బారిన పడకుండా తమ కంప్యూటర్ల వ్యవస్థలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని కాపాడు కోవడానికి రక్షణ వ్యవస్థలను నెలకొల్పుకొన్నాయని, ఎథికల్ హాకర్స్ ను కూడా నియమించు కొన్నారన్న వార్తలు వచ్చాయి. ఇంజనీరింగ్ పట్టభద్రులు కాని వారు కూడా హ్యాకింగ్ నైపుణ్యాన్ని పొందిన వారు నేడు 'ఎథికల్ హ్యాకర్స్' గా సేవలందించడానికి సంస్థలను నెలకొల్పి, నిర్వహిస్తున్నారు. ఇదొక ఉపాథి కల్పనా రంగంగా ఎదుగుతున్నదని కూడా చెబుతున్నారు.
సైబర్ క్రైం ను కేవలం ఆర్థిక నేరాల కోణంలోనే చూడకూడదు. వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసి, సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థను మాత్రమే కాదు, అణు విద్యుత్తు కేంద్రాలు, దేశ రక్షణ, పోలీసు, నేరాల నమోదు, రవాణా, విద్యుత్తు, విద్యా, వైద్య వ్యవస్థలు, భూ యాజమాన్య హక్కుల రికార్డులు, రిజిస్ట్రేషన్స్, ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, ఇలా అన్నింటినీ డిజిటలైజేషన్ వ్యవస్థలోకి తీసుకెళ్ళడం జరిగింది, జరుగుతున్నది. ఆధార్ కార్డుల అనుసంధానంతో పౌరుల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం జరుగుతున్నది. కంపూటర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ, సమాజం యావత్తు సంక్షోభంలోకి నెట్టబడుతుంది.
ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన టెర్రరిస్టులు ఎలాంటి ఘాతుకానికైనా పాల్పడతారు. సైబర్ క్రైం కు ఆ దుష్టశక్తులు పాల్పడవని బరోసాగా అంతర్జాతీయ సమాజం ఉండ లేదు. తాజా 'వర్నా క్రైం' సైబర్ నేరానికి ఉత్తర కొరియా కేంద్రంగా జరిగిందన్న దానికి ఆధారాలను ఎవరు బయట పెట్టలేదు. ఆ దేశంపైన వేసిన ఒక అపవాదుగానే కనబడుతున్నది.
అణుయుద్ధం, స్టార్ వార్స్ వంటివి ప్రపంచ మానవాళిని ఇప్పటి వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో సైబర్ వార్స్ జరుగుతాయన్న ఊహాగానాలు చేస్తున్నారు. ఈ పెనుముప్పు నుండి మన సమాజాన్ని రక్షించుకోవడానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
'సైబర్ సెక్యూరిటీ' వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పు కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపులను పెంచి(కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ లో కేవలం రు.116 కోట్లు కేటాయించింది), యుద్ధ ప్రాతిపథికపై కార్యాచరణను అమలు చేయాలి.
సైబర్ క్రైంల నేరాలు పెరిగి పోతున్నాయి. 2015లో 50,000 జరిగాయని ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. 32,000 ఏటియం కార్డుల సమాచారం తస్కరించ బడిందని రిజర్వ్ బ్యాంకే అనుమానాలు వ్యక్తం చేస్తూ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందన్న వార్తలు కొన్ని నెలల క్రితం విన్నాం. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 కు పదును పెట్టి పకడ్బందిగా అమలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట చేయాలి. దొంగల బెడద నుండి ఇంటికి గట్టి తాళాలు వేసుకొన్నట్లే, సైబర్ నేరస్తుల బారిన పడకుండా పటిష్టమైన రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇవీ నేను చర్చలో స్థూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు. 

Monday, May 15, 2017

ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు: సమర్థనీయమా!


1. నినాదం బాగుంది. భారత రాజ్యాంగం స్ఫూర్తికి లోబడి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, బహుళ పార్టీల వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థలను పటిష్టవంతం చేసుకోవడానికి ఆలోచనదోహదపడుతుందో! లేదో! లోతైన అధ్యయనం చేయాలి.  సమగ్ర ఎన్నికల సంస్కరణల వైపు ప్రయాణం చేయాలి. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయిందని, డబ్బు ప్రభావం పెరిగి పోయిందని, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయలేక పోతున్నాయని, ఎన్నికల నిబంధనలు అవరోధంగా నిలుస్తున్నాయని వగైరా వగైరా వాదనలతో 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' అన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఒక్కసారిగా ఎన్నికలతంతు పూర్తి అయిపోతే, ఇహ! స్థిరమైన పాలనతో, అభివృద్ధిపైనే ప్రభుత్వాలు దృష్టి లగ్నం చేసి, జాతి సంపదను ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చేస్తాయని, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న భ్రమలు కల్పించే దోరణిలో చర్చకు తెర లేపారు.
2. సమస్య అత్యంత సంక్లిష్టమైనది. మంచి చెడులపై లోతైన చర్చ జరగాలి. స్వాతంత్ర్యానంతరం మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన 1952 మొదలు 1967లో జరిగిన నాలుగవ లోక్ సభ ఎన్నికల వరకు రాష్ట్రాల శాసనసభలతో కలిపే ఒకేసారి జరిగాయి. అటుపై వేరుపడి పోవడానికి దారి తీసిన పరిణామాలేంటో నిశితంగా పరిశీలించాలి.
3. మొట్ట మొదటిసారి ఇందిరా గాంధీ లోక్ సభను రద్దు చేసి గడువు ప్రకారం 1972లో జరగాల్సిన ఎన్నికలను 1971లోనే నిర్వహించేలా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. మొత్తం 16 లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏడు దఫాలు ముందస్తుగానే ఎన్నికలు జరిగాయి. పదమూడు రోజులకే కేంద్ర ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు జరిగిన చరిత్ర కూడా ఉన్నది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది, కానీ, కేంద్ర ప్రభుత్వం పడిపోతే సౌలభ్యం లేదు. విధిగా ఎన్నికలకు వెళ్ళాల్సిందే.
4. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను 125 సార్లుకుపైగా ప్రయోగించింది. సమాఖ్య వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురి చేస్తూ, రాష్టాలలో రాష్ట్రపతి పాలనను విధించింది. ప్రప్రథమంగా 1957లో కేరళలో ప్రజల చేత ఎన్నుకోబడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం 1959లో రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి మొదలైన ఆర్టికల్ 356 దుర్వినియోగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. మధ్య కాలంలోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తారాకాండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొన్న ఉదంతాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
5. తాజాగా ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని ప్రక్కకు నెట్టేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఫిరాయింపులను కూడా ప్రోత్సహించి ఏరీతిలో అధికార పగ్గాలు చెరబట్టిందో అందరికీ విధితమే. కంచే చేను మేసినట్లు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నంపై గెలుపొందిన శాసనసభ్యుడ్ని అక్కున చేర్చుకొని, అతనికి మంత్రి పదవి కట్టబెట్టి, మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
6. దేశంలో చిన్న రాష్ట్రాల సంఖ్య పెరిగి పోతున్నది. చిన్న రాష్ట్రాల భావజాలానికి బిజెపి అనుకూలం. చిన్న రాష్ట్రాలలో తరచూ రాజకీయ అస్థిరత నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ చక్కటి ఉదాహరణ. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. అక్కడ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అత్యధికులు వివిధ పల్టీలు కొట్టి అంత్యమంగా బిజెపిలో చేరి, ప్రభుత్వ రంగును ఊసరి వెల్లి లాగా రూపాంతరం చెందించారు. చిన్న రాష్ట్రాలలో అవకాశాలు అంది వచ్చినప్పుడల్లా కేంద్రంలోని పాలక జాతీయ పార్టీ తరహా అనైతిక చర్యలకే పాల్పడుతుందని చరిత్ర నేర్పుతున్న పాఠం.
7. జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రజల్లో నెలకొన్న ప్రాంతీయ ఆకాంక్షల ప్రాతిపదికగా ప్రాంతీయపార్టీలు ఆవిర్భవించి, చాలా రాష్ట్రాలలో బలంగా వేళ్ళూనుకొని ఉన్నాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలతోను, వారసులు లేక పోవడం మూలంగాను కొన్ని పార్టీలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా, ఇంకా పలు రాష్ట్రాలలో పలు ప్రాంతీయ పార్టీలు పటిష్టంగానే ఉన్నాయి.
8. జాతీయ పార్టీల్లో ఒకనాడు కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యo చెలాయించింది. నేడు దాని పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. కాంగ్రెస్ దుష్టపాలన పుణ్యమాయని బిజెపి అధికారంలోకి వచ్చింది. దీని తాత్విక చింతన కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్నదే. ఒకనాడు ఎన్.టి.ఆర్. కేంద్రం మిథ్య, రాష్ట్రాలే వాస్తవం అని వ్యాఖ్యానించారు. మాటల్లో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూనే కేంద్రమే వాస్తవం, రాష్ట్రాలు మిథ్య అన్న భావజాలంతో నరేంద్ర మోడీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అదే ఆయన పార్టీ భావజాలమన్నదీ సుస్పష్టం. దాంట్లో దాపరికం లేదు. అది మంచిదా! కాదా! అన్నది దేశప్రజలు ఆలోచించు కోవాలి అంతే.
9. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండే రోజులకు కాలం చెల్లి పోయింది. పైపెచ్చు, కొన్ని దశాబ్ధాలుగా కేంద్రం, రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిన‌  ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి జ్వాలలను సానుకూలంగా మలచుకొని ఏకపార్టీ పాలనకు సరిపడ బలాన్ని 2014 ఎన్నికల్లో మోడీ సమకూర్చు కొన్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. ఏక పార్టీ పాలనకు కాలం చెల్లిపోయిందనే భావం బలపడుతున్న కాలంలో కాస్త మార్పు కనిపించినా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పలేం.
10. సంకీర్ణ ప్రభుత్వాల స్థిరత్వం భాగస్వామ్య పార్టీలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పొరపొచ్చాలు పొడచూపినా ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు అనివార్యంగా వెళ్ళ వలసిందే. అప్పుడు అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? ఒక వేళ అలా చేశారనుకోండి, చర్య ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందా! ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా రద్దు చేస్తారు?
11. కొంత మంది అమెరికాతో పోలుస్తున్నారు. దేశంలో ఉన్నది అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ, మన రాజ్యాంగ నిర్ణేతలు మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ శ్రేష్టమైనదని నిర్ధారించారు. అమెరికా వ్యవస్థలో ఉన్న బలహీనతలేంటో డోనాల్డ్  ట్రంప్ అధ్యక్షుడైన తరువాత యావత్తు ప్రపంచానికి మరొకసారి తెలియజేస్తున్నారు.
12. ఐదేళ్ళ వరకు ఇహ! ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు అన్న భావం పాలక పార్టీల్లో బలపడి, నియంతృత్వ పోకడలతో, పెత్తందారీతనంతో వ్యవహరించవనే 'గ్యారెంటీ' ఏముoది! అధికారంలోకి వచ్చాక పాలక పార్టీ అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దెదించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఒక వేళ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధిస్తే, లేదా, వార్షిక బడ్జెటుకు కోత తీర్మానాలు పెట్టి నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలక పార్టీలో చీలికొచ్చి ప్రభుత్వం మెజారిటీ మద్ధతు కోల్పోయి కూలి పోవచ్చు. కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయినా అప్పుడు ప్రత్యామ్నాయమేంటి? రాష్ట్రపతి పాలన విధించి, కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుందా? అలా చేస్తే, రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ లక్ష్యాలకు వ్యతిరేకం కాదా?
13. మన దేశం సువిశాలమైనది. 125 కోట్ల జనాభాతో వైవిధ్యబరితమైనది. వివిధ మతాలు, జాతులు, కులాలు, తెగలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం. అందరి ఆకాంక్షలు ప్రతిబింబించినప్పుడే మన పార్లమెంటరీ వ్యవస్థ, బహుళ పార్టీ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుంది, పటిష్టవంతం అవుతుంది.
14. డబ్బు ప్రభావం, ఆర్థిక నేరస్తుల ప్రవేశం, నేరమయ రాజకీయాలు, వ్యాపారమయమైన రాజకీయ వ్యవస్థ పర్యవసానంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. ఎన్నికల వ్యవస్థను సమగ్ర ఎన్నికల సంస్కరణలతో సత్వరం ప్రక్షాళన చేయాలి. దీనికి సంబంధించి పలు కమిటీలు, కమీషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. వాటికి దుమ్ముదులిపి, వాటిలో ఆమోదయోగ్యమైన అంశాలను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. దామాషా ఎన్నికల విధానం లాంటి ప్రతిపాదనలపై ఎందుకు ఆలోచించడం లేదు. ఎందుకో మరి మోడీ ప్రభుత్వానికి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై ఆసక్తి ఉన్నట్లు కనబడడం లేదు.
15. మనది సమాఖ్య వ్యవస్థ. మన రాజ్యాంగంలోని 7వ‌ షెడ్యూలులోని ఒకటవ పట్టికలో పొందు పరచిన  97 అంశాలను కేంద్రం అధికార పరిథిలోను, రెండవ పట్టికలో పొందు పరచిన 61 అంశాలను రాష్ట్రాల అధికార పరిథిలోను, మిగిలిన 52 అంశాలను ఉమ్మడి జాబితాలోను పొందు పరిచారు. ఎన్నికల సంస్కరణలపై చేసే ఆలోచనలు సమాఖ్య వ్యవస్థను పటిష్టపరిచే దృక్పథంతోనే సాగాలి.
స్థానిక సంస్థలకు అధికారాలను, బాధ్యతలను, ఆర్థిక వనరులను బదలాయిస్తూ రాజ్యాంగానికి 73,74 సవరణలు చేయబడ్డాయి. కానీ, అవి పాక్షికంగానే అమలుకు నోచుకొన్నాయి. రాజ్యాంగ సవరణల మేరకు తక్షణం స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి కూడా క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి.

టి.లక్ష్మీనారాయణ




Sunday, May 14, 2017

తెలంగాణ‌ రాష్ట్ర సామాజిక, ఆర్థిక దృశ్యం –20 17: ప్రధానమైన‌ అంశాలు

తెలంగాణ వైశాల్యం: 1,62,970 చదరపు కి.మీ. వైశాల్యం రీత్యా దేశంలో 8వ పెద్ద రాష్ట్రం. 
అడవుల విస్తీర్ణం: 36,909.36 చ.కి.మీ.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674. పురుషులు 1,76,11,633, స్త్రీలు 1,73,92,041, పిల్లలు 38,99,166. దళితులు 54,08,800(15.45%), గిరిజనులు 31,77,940(9.08%)
*గ్రామీణులు 2,13,95,009
*పట్టణ జనాభా 1,36,08,665(38.88%). జాతీయ స్థాయి పట్టణ జనాభా సగటు 31.15%
*జనాభా వృద్ధి రేటు 13.58%, జాతీయ స్థాయిలో 17.69%
*జనసాంద్రత  312, జాతీయ స్థాయిలో 382
*స్త్రీ, పురుష నిష్పత్తి 988:1000, జాతీయ స్థాయిలో 943:1000
కుటుంబాల సంఖ్య: 83,03,612
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.): స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి వృద్ధి రేటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యం, స్థితి గతులపై స్థూలమైన అవగాహన కల్పిస్తుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం(సి.యస్.ఓ.) స్థిర ధరల ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చడంతో పాటు స్థూల దేశీయోత్పత్తి(జి.డి,పి.) గణన విధానాన్ని కూడా మార్చింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ అధికారిక గణాంకాల మేరకు ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రు.5.76 లక్షల కోట్లు, 2016-17 లో ముందస్తు అంచనాల ప్రకారం రు.6.54 లక్షల కోట్లు. వృద్ధి రేటు 13.7%. స్థిర ధరల్లో (2011-12) 2015-16లో రు.4,64,389 కోట్లు ఉంటే  2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.5,11,286 కోట్లు. దీని ప్రకారం వృద్ధి రేటు 10.1%.
దేశీయ స్థూల ఉత్ఫత్తి(జిడిపి)లో తెలంగాణ వాటా 2015-16లో 4.21% అయితే 2016-17లో 4.28%కు పెరిగింది. దేశీయ స్థూల ఉత్ఫత్తి 2015-16లో స్థిర ధరల ప్రకారం రు.1,13,57,529 కోట్లుగా ఉంటే 2016-17లో రు.1,21,65,481కోట్లకు పెరిగింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 2015-16లో 7.9% ఉంటే 2016-17లో 7.1% కు పడి పోయింది.
స్థూల జిల్లాల దేశీయ ఉత్ఫత్తి(జిడిడిపి): 2015-16లో హైదరాబాదు జిల్లా రు.1,36,388 కోట్లు. రంగారెడ్డి జిల్లా రు.82,359 కోట్లు. మేడ్చల్-మల్కాజ్ గిరి రు.47,604 కోట్లు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి, ఈ నాలుగు జిల్లాల జిడిడిపి మొత్తం తెలంగాణ రాష్ట్ర జి.యస్.డి.పి.లో 52%గా ఉన్నది. దీన్ని బట్టి రాష్ట్ర రాజధాని చుట్టే ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయన్న విషయం స్పష్టమవుతున్నది.
ఆర్థిక వనరుల వర్గీకరణ: ఆర్థిక వ్యవస్థను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించుకొని విశ్లేషించుకోవడం జరుగుతున్నది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను ప్రాథమిక రంగంగాను, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగాను, సేవా రంగాన్ని తృతీయ రంగంగాను పరిగణిస్తున్నారు. రంగాల వారిగా జి.యస్.డి.పి.లో వాటాను పరిశీలిస్తే ప్రాథమిక రంగం 18%, ద్వితీయ రంగం 19%, తృతీయ రంగం దాదాపు 63%. స్థూల రాష్ట్ర అదనపు విలువ(జి.ఎస్.వి.ఎ.) వృద్ధి రేటును పరిశీలిస్తే, ప్రస్తుత ధరల ప్రకారం 2016-17లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లో 17.2%, పారిశ్రామిక రంగంలో 9.8%, సేవా రంగంలో 14.6% గా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇదే కాలానికి సంబంధించి జాతీయ స్థాయిలో ముందస్తు అంచనాల మేరకు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో 9%, 8.7%, 11.9%గా ఉన్నది.
తలసరి ఆదాయం(పి.సి.పి.): ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి సాధారణంగా తలసరి ఆదాయాన్ని మెరుగైన కొలబద్ధగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి. ప్రస్తుత ధరల్లో 2015-16లో రు.1,40,683 ఉంటే 2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.1,58,360 కు పెరిగి 12.6% వృద్ధిని తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. జాతీయ స్థాయిలో రు.94,178 నుండి రు.1,03,818 లకు పెరిగి, వృద్ధి రేటు 10.2%గా నమోదయ్యింది. తలసరి ఆదాయంలో కూడా హైదరాబాదు రు.2,99,997, రంగారెడ్డి రు. 2,88,408, సంగారెడ్డి రు. 1,69,481, మేడ్చల్-మల్కాజ్ గిరి రు.1,62,327. 18 జిల్లాల్లో తలసరి ఆదాయం రు.1,00,000 లోపు ఉంటే 14 జిల్లాలలో జాతీయ తలసరి ఆదాయం కంటే తక్కువగా రు.94,178 ఉన్నది.
*నా వ్యాఖ్య: జనాభా సంఖ్యతో స్థూల దేశీయోత్ఫత్తి(జి.డి.పి.)ని విభజించి, తలసరి ఆదాయాన్ని లెక్కించే విధానం అమలులో ఉన్నది. ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి, తలసరి ఆదాయాన్ని ప్రామాణికమైన కొలబద్ధగా పరిగణించడం అశాస్త్రీయమైనది.  మానవాభివృద్ధి నివేదికను ప్రామాణికంగా తీసుకొని, ప్రజల ఆర్థికాభివృద్ధిని, జీవన ప్రమాణాలను హేతుబద్ధంగా అంచనా వేస్తే శాస్త్రీయంగా ఉంటుంది. జి.డి.పి. పెరిగితే, ఉపాథి కల్పనావకాశాలు పెరుగుతాయన్న భావనకు కాలం చెల్లిపోయింది. గడచిన కొన్ని సంవత్సరాల అనుభవాలను విశ్లేషించుకొంటే జిడిపి పెరుగుదలకు, ఉపాథి కల్పనకు పొంతన లేదని స్పష్టమవుతున్నది.
ఉపాథి కల్పన: కార్మిక శాఖ ప్రచురించిన ఉపాథి - నిరుద్యోగ అధ్యయన నివేదిక(2015-16) ప్రకారం తెలంగాణలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలోనే అత్యధిక మంది కార్మికులు శ్రమిస్తున్నారు, అటుపై సేవా మరియు పారిశ్రామిక రంగాలలోఉపాథి పొందుతున్నారు.
*జి.యస్.డి.పి.లో వ్యవసాయ రంగం వాటా 2015-16లో 14.7% మాత్రమే అయినా 54% మంది ఉపాథి పొందుతున్నారు. 2013-14 గణాంకాలతో పోల్చి చూస్తే 2015-16 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉపాథి పొందుతున్న వారి సంఖ్య‌ 1.8% తగ్గింది. ఆ మేరకు పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో ఉపాథి కల్పన పెరిగింది. 
*జి.యస్.డి.పి.లో 62% వాటా ఉన్న సేవా రంగంలో మొత్తంగా చూస్తే 28%, పట్టణ ప్రాంతాల వరకే పరిగణలోకి తీసుకొంటే 64% మందికి ఉపాథి కల్పిస్తూ అగ్రభాగాన నిలిచింది. 
కార్మిక జనాభా నిష్పత్తి: 15 సం.లకు పైబడిన వయస్సు ఉన్న కార్మిక శక్తి భాగస్వామ్య నిష్పత్తిని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 63%, పట్టణ ప్రాంతాల్లో 49.1%, రాష్ట్రం మొత్తంగా 58.1%గా ఉన్నది.
నిరుద్యోగ నిష్పత్తి: గ్రామీణ ప్రాంతాల్లో 1.2%, పట్టణ ప్రాంతాల్లో 6.1%, రాష్ట్రం మొత్తంగా 2.7%గా 2015-16లో నమోదయ్యింది. జాతీయ స్థాయిలో 3.7% ఉన్నది.
ద్రవ్యోల్భణం: వినిమయ వస్తువుల ధరల సూచిక(పారిశ్రామిక కార్మికులు) గణాంకాలను పరిశీలిస్తే 2011-12 నుండి 2016-17 మధ్య కాలంలో క్రమేపీ తగ్గుముఖం పట్టింది. 2013-14లో 10.2% ఉన్న ద్రవ్యోల్భణం 2.23% తగ్గింది. జాతీయ స్థాయికి అనుగుణంగానే ఈ తగ్గుదల ఉన్నది.
దృక్పథం: సూక్ష్మ ఆర్థిక మూల సూత్రాల ఆధారంగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు, పన్ను వసూళ్ళు, ద్రవ్యోల్భణం మరియు ఉపాథి కల్పన అంశాలలో గతం కంటే శక్తివంతంగా ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుండి జి.యస్.డి.పి. పెరుగుదల వైపు నడక ఉన్నది. 2016-17 ఆర్థిక సం.లో రెండంకెల వృద్ధి రేటుతో రాష్ట్ర సొంత పన్ను వనరుల ద్వారా సమకూరే ఆదాయం అధికమవుతుంది. గడచిన రెండేళ్ళుగా మిగులు రెవెన్యూ రాబడి ఉన్నకొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ఉన్నది.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ: రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించడం జరిగింది. 1. హైదరాబాద్, 2. అదిలాబాద్, 3. భద్రాద్రి-కొత్తగూడెం, 4. జగిత్యాల్, 5. జనగాం, 6. జయశంకర్, 7. జోగులాంబ_గద్వాల్, 8. కామారెడ్డి, 9. కరీంనగర్, 10. ఖమ్మం, 11. కుమురం భీం, 12. మహబూబాబాద్, 13. మహబూబ్ నగర్, 14. మంచిర్యాల్, 15. మెదక్, 16. మేడ్చల్, 17. నాగర్ కర్నూల్, 18. నల్లగొండ, 19. నిర్మల్, 20. నిజామాబాద్, 21. పెద్దపల్లి, 22. రాజన్న సిరిసిల్ల, 23. రంగారెడ్డి, 24. సంగారెడ్డి, 25. సిద్దిపేట్, 26. సూర్యాపేట, 27. వికారాబాద్, 28. వనపర్తి, 29. వరంగల్ (రూరల్), 30. వరంగల్ (అర్బన్), 31. యాదాద్రి భువనగిరి.
* స్థానిక సంస్థలు: మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య 8,695. మండలాల సంఖ్య 584కు పెరిగింది.
భూమి: మొత్తం భూ విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం 2015-16లో 37.3%, అడవుల విస్తీర్ణం 22.7%, ప్రస్తుతం బీడుగా ఉన్న భూములు 5.4%, వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూమి దాదాపు 8%, వ్యవసాయానికి పనికిరాని భూమి 1.6%, శాశ్వత పచ్చిక బయళ్ళు, మైదానాలు 2.7%, పండ్ల తోటలు, చెట్లు, పొదలు ఉన్న భూమి 1%,  ప్రస్తుతం సాగులో లేని భూమి 14%, సాగులో లేని ఇతర భూములు 7.3%.

భూమి కమతాలు: సగటు భూమి కమతాల విస్తీర్ణం 2005-06లో 1.30 హెక్టార్లు ఉంటే 2010-11 నాటికి 1.12 హెక్టార్లకు తగ్గింది.
వర్షపాతం: సగటు వర్షపాతం 713.5 మి.మీ. లభించాల్సి ఉండగా 2016-17లో 912 మి.మీ. నమోదయ్యింది. 2015-16లో 611.2 మి.మీ. నైరుతీ రుతు పవనాల ద్వారా 28% అధికంగా వర్షపాతం నమోదయ్యింది.
సాగుదల: 2014-15 గణాంకాలను పరిశీలిస్తే బావుల మీద ఆధారపడిన సాగు దాదాపు 84%గా ఉంటే కాలువల ద్వారా 10%, చెరువుల క్రింద 4%గా ఉన్నది.
వ్యవసాయ రుణాలు: రాష్ట్ర ప్రభుత్వ రుణ ప్రణాళిక ప్రకారం 2016-17లో రు.90,776 కోట్లు. అందులో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.29,101 కోట్లు. 2015-16లో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.27,800 కోట్లకు గాను రు.23,400 కోట్లు మంజూరు చేశారు.
విద్యుత్తు రంగం: 2016 డిసెంబరు 31 నాటికి 5235.26  మెగా వాట్స్ విద్యుత్ ఉత్ఫాదనా సామర్థ్యం కలిగి ఉన్నది. ఇందులో థర్మల్ విద్యుత్తు 2882.5 మె.వా., జల విద్యుత్తు 2351.7 మె.వా., సోలార్ 1 మె.వా. ప్రస్తుతం 5,880 మె.వా. ఉత్పాదక సామర్థ్యంతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
*తలసరి విద్యుత్తు వినియోగం 2015-16లో 1439 యూనిట్స్ గా ఉన్నది. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం 2014-15లో 1,010 యూనిట్స్.
ప్రధానమైన ఆరోగ్య గణాంకాలు: ప్రసూతి మరణాల రేటు - MMR(లక్ష సజీవ జననాలకు)‍ 92 ఉంటే జాతీయ స్థాయిలో 167. శిశు మరణాల రేటు- IMR(1000 సజీవ జననాలకు) 28 ఉంటే జాతీయ స్థాయిలో 41. పురుషుల, స్త్రీల‌ నిష్పత్తి 1000:980 ఉంటే జాతీయ స్థాయిలో 1000:940. జననాల రేటు 18 ఉంటే జాతీయ స్థాయిలో 21.  మరణాల రేటు జాతీయ స్థాయితో సరిసమానంగా 6.7 ఉన్నది.
ప్రజారోగ్యం మౌలిక సదుపాయాలు: ఉప కేంద్రాలు 4797, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 876, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 107, ప్రాంతీయ ఆసుపత్రులు 31, జిల్లా ఆసుపత్రులు 7, డాక్టర్, రోగుల నిష్పత్తి 1:1700
అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఏడు సంవత్సరాల వయసుకు పైబడ్డ జనాభా 3,11,04,508. పురుషులు 1,55,93,698, మహిళలు 1,55,10,810. వీరిలో అక్షరాస్యులు 2,06,96,778(66.5%). జాతీయ సగటు 72.9% కంటే తక్కువగా ఉన్నది. తెలంగాణలోని పట్టణాలలో 81% ఉంటే, గ్రామాలలో 57%గా ఉన్నది. పురుషుల్లో 75%, మహిళల్లో 57.9%గా ఉన్నది. షెడ్యూల్డ్ కులాలలో 58.9%, గిరిజనుల్లో 49.5% గా ఉన్నది.
*వయస్సు పరంగా వర్గీకరణ: 7 నుండి 24 సం.ల మధ్య వయస్సు ఉన్న వారిలో 88.56%. ఇది జాతీయ స్థాయి 86.98% కంటే ఎక్కువ. 18-24 సం.ల మధ్య వయస్సు ఉన్న పురుషుల్లో 90%, మహిళల్లో 79.5% అక్షరాస్యత ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న 89.3%, 79.1% కంటే ఎక్కువ. జాతీయ స్థాయిలో 24 సం.ల దాటిన వయస్సు వాళ్ళ అక్షరాస్యత తెలంగాణ‌ కంటే ఎక్కువగా ఉంటే యువతలో 9% అధికంగా తెలంగాణలో ఉన్నది.
*హైదరాబాదు 83.25%తో జిల్లా అగ్రస్థానంలో ఉంటే, 49.87% తో జోగులాంభ - గద్వాల్ జిల్లా చివరి స్థానంలో ఉన్నది. మొత్తం 31 జిల్లాలలో 26 జిల్లాలు రాష్ట్ర సగటు అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్నాయి. హైదరాబాదు 83.25%, మేడ్చల్ 82.49%, వరంగల్ అర్బన్ 76.17%, రంగారెడ్డి 71.95%, కరీంనగర్ 69.16% తో రాష్ట్ర సగటు కంటే పై స్థాయిలో ఉన్నాయి.
*2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యుల్లో 48.6% మంది మాధ్యమిక పాఠశాల విద్యకు లోపు, 17.9% విశ్వవిద్యాలయ విద్యకు లోపు, 1.6% సాంకేతిక డిప్లొమా విద్య, 0.3% సాంకేతికేతర డిప్లొమా విద్య, 21.9% డిగ్రీ మరియు ఆ పై విద్యార్హత, 0.9% వర్గీకరణ చేయని విద్య, 8.8% విద్యార్హతలు లేని అక్షరాస్యులు.
విద్యా రంగం: ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు 41,337 ఉన్నాయి. వాటిలో 70% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలు. 28% ప్రయివేటు పాఠశాలలు. కేంద్రీయ పాఠశాలలు 1%. ప్రభుత్వ ఆర్థిక సహాయంలేని(అన్ ఎయిడెడ్) పాఠశాలలు 2% ఉన్నాయి. హైదరాబాదులోనే 6,048 పాఠశాలలు ఉన్నాయి. జోగులాంభ -గద్వాల్ జిల్లాలో మాత్రమే 716 ఉన్నాయి.
మొత్తం పాఠశాలల సంఖ్యలో 70% గా ఉన్న ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల్లో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 55% మంది, 30% గా ఉన్న ప్రయివేటు పాఠశాలల్లో 45% మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి హేతుబద్ధంగా లేదని స్పష్టమవుతున్నది.
*విద్యార్థుల నమోదు: 2016-17 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు 60.63 లక్షల మంది. ఇందులో 52% పిల్లలు ప్రయివేటు పాఠశాలల్లోను, 45% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకొన్నారు. అన్ ఎయిడెడ్ పాఠశాలలో 2%, కేంద్రీయ పాఠశాలలో 1% గా ఉన్నది. ప్రీ - ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు 17,08,975, IX-X తరగతులు 10,48,814,  XI-XII తరగతులు 32,670, మొత్తం 60,33,196.
*6-10 మధ్య వయస్సు పిల్లల్లో 102.48%, 11-13 వయస్సు వారిలో 90.34%, 14-15 వయస్సు వారిలో 80.2% నమోదయ్యారు.
*చదువును అర్థాంతరంగా మానేస్తున్న పిల్లలు: I – V తరగతుల మధ్య‌ బడి మానేసే పిల్లల సంఖ్య‌ 2014-15లో 37.56% గా ఉంటే 2016-17 నాటికి 34.70% కు తగ్గింది. ప్రీ _ ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు 17,08,975 IX-X తరగతులు 10,48,814,  XI-XII తరగతులు 32,670, మొత్తం 60,33,196.
I – V అబ్బాయిలు 16.30%, అమ్మాయిలు15.70%, మొత్తం 16%, VI-VIII తరగతులు అబ్బాయిలు 30.61%, అమ్మాయిలు 29.24%, మొత్తం 29.95%,  IX-X తరగతులు అబ్బాయిలు 35.50%, అమ్మాయిలు 33.84%, మొత్తం 34.7%.
ఇంటర్ మీడియేట్ విద్య: రాష్ట్రంలో ఇంటర్ మీడియేట్ మరియు హైయర్ సెకండరీ విద్యా సంస్థులు 2,537 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 404, ప్రయివేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 41, ప్రయివేటు జూనియర్ కళాశాలలు 2,092 ఉన్నాయి. రెండు సంవత్సరాల విద్యార్థుల సంఖ్య 6.9 లక్షల మంది ఉన్నారు.
ఉన్నత విద్య: 4.26 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించ గల సామర్థ్యంతో 1,196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 130 ప్రభుత్వ కళాశాలలు, 69 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 84,068, ఎయిడెడ్ కళాశాలలు 59,338 మందికి ప్రవేశం కల్పించబడింది.
విద్యార్థి వసతి గృహాలు: షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన కులాలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు నిర్విఘ్నంగా విద్యార్జనను కొనసాగించడానికి వీలుగా ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు ఎస్.సి.లకు 734, ఎస్.టి. లకు 170, బి.సి.లకు 454, మొత్త‍ం 1,358 వసతి గృహాలను నిర్వహిస్తున్నది. వీటిలో 2016-17 సం.లో 1,34,161 విద్యార్థులకు ప్రవేశం కల్పించబడింది. వారిలో ఎస్.సి. 59,928, ఎస్.టి. 30,882, బి.సి. 43,351 విద్యార్థులు ఉన్నారు.
కళాశాల విద్యార్థులకు సంబంధించి 153 గిరిజన, 169 ఎస్.సి., 246 బి.సి., మొత్తం 559 వసతి గృహాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో 18377 ఎస్.టి., 19077 ఎస్.సి., 24517 బి.సి. విద్యార్థులు 2016-17లో ప్రవేశం కలిగి ఉన్నారు. Vవ‌ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ వరకు 'రెసిడెన్షియల్' విద్యా సంస్థలను ఎస్.సి.ల కోసం 267, ఎస్.టి.ల కోసం 145 నిర్వహిస్తున్నారు. వీటిలో 34,176 మంది విద్యార్థులున్నారు. 2016 మార్చిలో జరిగిన ఎస్.ఎస్.సి. పరీక్షల్లో 81%, ఇంటర్ మీడియేటులో 86% ఉత్తీర్ణులైనారు. బి.సి. విద్యార్థులకు 37 'రెసిడెన్షియల్' విద్యా సంస్థలను నెలకొల్పి, 11,720 మందికి ప్రవేశం కల్పించబడింది.
కార్మిక శక్తి: మొత్తం కార్మికులు 1,63,41,942, వ్యవసాయదారులు 31,51,389, మెయిన్ కార్మికులు 1,37,19,879, వ్యవసాయ కార్మికులు 59,15,151, మార్జినల్ వర్కర్స్ 26,22,063, కుటీర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు 7,76,529, నాన్ వర్కర్స్ 1,86,61,732, ఇతర కార్మికులు 64,98,873.
గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు:
*వ్యక్తిగత మరుగు దొడ్లు 16,63,839                                                                                         *రక్షిత త్రాగు నీటి వనరులు 1,85,147
*విద్యుత్తు(ఇంటి కనెక్షన్స్) 95,04,305
*వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్స్ 20,80,706
*ప్రాథమిక పాఠశాలలు 21,948
*మాధ్యమిక పాఠశాలలు 7,189
*ఉన్నత పాఠశాలలు 11,333
*కళాశాలలు 4,655
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683
*ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు: 4,797
*అంగన్ వాడి కేంద్రాలు: 35,700
*స్వయం సహాయ బృందాలు: 4,26,705
*సమాచార వ్యవస్థ: ఫోస్టాపీసులు 5,835. టెలిఫోన్ కనెక్షన్స్ 5,10,070
*రహదారులు: కంకర్రాళ్ళతో వేసిన‌ రోడ్డులు 16,343 కి.మీ., మట్టి రోడ్డులు18,235 కి.మీ.
*రవాణా సదుపాయాలు: ఆర్.టి.సి. బస్సులు 10,482
*బ్యాంకింగ్ వ్యవస్థ: బ్యాంకు బ్రాంచీలు 5,332
సామాజిక భద్రత పింఛను పథకం(ఆసరా): వృద్ధులకు 13,23,764, వికలాంగులకు 4,55,835, వితంతువులకు 13,32,919, చేనేత కార్మికులకు 34,138, గీత కార్మికులకు 57,434, బీడి కార్మికులకు 3,47,581 ప్రభుత్వం ఇస్తున్నది.
ప్రజా పంపిణీ వ్యవస్థ: చౌక దుకాణాలు 17,159, రేషన్ కార్డులు 79,72,968, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 5,55,823, అన్నపూర్ణ కార్డులు 5,040 ఉన్నాయి.


టి.లక్ష్మీనారాయణ‌