Monday, January 12, 2015

అభివృద్ధి ముసుగులో రైతు గొంతు నొక్కిన 'ఆర్డినెన్స్'

                                   
నాలుకకు తేనె రాసుకొని తియ్యటి మాటలు మాట్లాడుతూ రైతాంగం యొక్క చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య హక్కును కాల‌రాయడానికి మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టం- 2013కు అత్య‍ంత కీలకమైన సవరణలు చేస్తూ అత్యవసర ఆదేశం(ఆర్డినెన్స్)ను డిసెంబరు 31, 2014న జారీ చేసింది. తద్వారా భూసేకరణ చట్టం యొక్క ఆయువు పట్టుపై గొడ్డలి పెట్టు వేసింది. దేశాభివృద్ధి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, భూముల ధరలు పెరగడానికి, భూములు కోల్పోయే రైతాంగం మెరుగైన నష్టపరిహారం పొందడానికే ఆర్డినెన్సును జారీ చేశామని నమ్మబలుకుతూ కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జైట్లీ ఒక సుదీర్ఘ వ్యాసం వ్రాసి భాజపా వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. అబద్దాలు చెప్పి న‌మ్మించడానికి కూడా ధైర్యమూ, వాదనా పటిమ ఉండాలి. నందిని పంది, పందిని నంది చేయగలిగిన  నైపుణ్యాన్ని అరుణ్ జెట్లీ ఆ వ్యాసంలో బాగా ప్రదర్శించారు.
బ్రిటీష్ కాలం నాటి, కాలం చెల్లిన‌, 1894 భూసేకరణ చట్టాన్ని వదిలించుకోవడానికి 120 సంవత్సరాలు పట్టింది. దాని స్థానంలో స్వాతంత్ర్యానంతరం 66 సంవత్సరాలకు భూసేకరణలో సముచిత నష్టపరిహారం హక్కు మరియు పారదర్శకత, పునర్నివాసం, పునరావాసం చట్టం – 2013 (భూసేకరణ చట్టం)కు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఆ నూతన చట్టం 2014 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. ఏడాది గడవలేదు.   క్షేత్ర స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం గద్దెదిగి, భాజపా నాయకత్వంలోని యన్.డి.ఎ. అధికారంలోకొచ్చింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా పాలనా పగ్గాలు చేబట్టారు. భూసేకరణ చట్టం - 2013 దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిందని అభివర్ణిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. రైతాంగం దశాబ్ధాల పాటు సాగించిన‌ అలుపెరగని పోరాటాలు, త్యాగాలతో సాధించుకొన్న చట్టాన్ని ఒక్క కలం పోటుతో మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. భూసేకరణ ప్రక్రియలో భూయజమానులైన‌ రైతాంగం యొక్క‌ ప్రాథమిక హక్కును నిరంకుశంగా లాగేసుకొంటూ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనార్థం చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతులకు లాభం చేకూర్చడానికే సవరణలు చేశామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకొంటున్నది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్న నానుడిని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జెట్లీ తన వ్యాసంలో భూసేకరణ చట్టం-2013కు సవరణ చేయాల్సిన అవసరమెందుకొచ్చింది, ఆ సవరణల ప్రభావం ఏలా ఉంటుంది అన్న ప్రశ్నల‌ను సంధించి, వాటికి సమాధానం చెబుతున్నట్లు వివరణ ఇస్తూ దేశం, రైతుల ప్రయోజనార్థమే ఆర్డినెన్సును తీసుకొచ్చామని నమ్మించడానికి శతవిధాల ప్రయత్నించారు. 
సవరణల వెనుక‌ వర్గ దృక్పథం: 1894 భూసేకరణ చట్టంలో నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి పొందుపరచిన నిబంధనలు అత్యంత‌ లోపభూయిష్టంగా ఉండేవి. నాటి బ్రిటీష్ పాలకులు వర్గ దృక్పథంతోనే వాటిని రూపొందించారు. దాన్ని సమూలంగా మార్చాలని రైతాంగానికి అండగా ప్రగతిశీల శక్తులు సాగించిన‌ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా భూసేకరణ చట్టం-2013 పురుడు పోసుకొన్నది. భూసేకరణ చట్టంలోని నాలుగవ షెడ్యూల్ 105 సెక్షన్ లో పొందుపరచిన‌ పలు రంగాలకు చెందిన‌ 16 చట్టాలను మినహాయిస్తూ ఏడాది తరువాత వాటిని కూడా చట్ట పరిథిలోకి తీసుకురావాలని షరతు విధించబడింది. ఆ గడువు 2014 డిసెంబరు 31 నాటికి ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధననే తడికగా ఉపయోగించుకొని రాష్ట్రపతి చేత‌ ఆర్డినెన్సుకు అమోద ముద్ర వేయించుకోవడం దుర్మార్గమైన చర్య. ఈ అత్యవసర ఆదేశం ద్వారా చట్టంలో మినహాయించబడిన 13 చట్టాల పరిథిలోకొచ్చే రంగాల అవసరాల కోసం భూసేకరణ చేస్తే రైతాంగం చట్టం ప్రకారం అధిక నష్టపరిహారాన్ని పొందే విధంగా మేలు చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే భూసేకరణ చట్టంలోని షరతును ఉల్లంఘించిన వారై ఉండేవారు. ఆ వాస్తవాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు.
ఆర్డినెన్స్ లోని మిగిలిన‌ సవరణలే అత్యంత కీలకమైనవి. 1)  ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమిని సేకరించాలంటే 70% మంది భూయజమానుల అంగీకారం అనివార్యమని భూసేకరణ చట్టం-2013లో పొందుపరచబడింది. 2) సేకరించిన భూముల్లో నెలకొల్పబోయే పరిశ్రమ పర్య‌వసానంగా సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ముందస్తుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడాలి. అత్యంత ప్రజాస్వామ్యయుతమైన ఈ రెండు నిబంధనల‌ను నిరంకుశంగా ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం తొలగించింది. అంటే రైతాంగం యొక్క గొంతు నొక్కేసి బలవంతంగా భూములను లాగేసుకోవడానికి, భూసేకరణ దుష్పలితాలను చూడనిరాకరించడానికే చట్ట సవరణ చేశారు. ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింప చేశాయని, సవరణకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించిన మీదట‌ ఆమోదం పొందడానికి వీలుపడలేదని, కాబట్టే ఆర్డినెన్స్ జారీ చేయవలసి వచ్చిందని చెప్పడం ద్వారా చట్ట సభల నిర్వహణలో మోడీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది.

దేశ రక్షణ మరియు రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలకు, పేదల గృహ సముదాయాల నిర్మాణానికి, టౌన్ షిప్స్ నిర్మాణo, పట్టణీకరణకు, పారిశ్రామికాభివృద్ధికి, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తదితర‌ అభివృద్ధి అవసరాలకు భూమిని సేకరించుకొనే సార్వభౌమాధికారం చారిత్రకంగా ప్రభుత్వానికి దఖలు పరచబడిందని దబాయిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలు మిన్నగా ఉంటాయని, 21వ శతాబ్దం అవసరాలకు అనుగుణంగా చట్టంలో మార్పులు అనివార్యమని హితభోద చేస్తున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తున్న నేటి పాలక వర్గం సంపన్న వర్గాలకు అనుకూలంగా వివిధ చట్టాల మౌలిక స్వభావాన్నే మార్చివేస్తూ పథకం ప్రకారం సవరణలు చేస్తున్నది."బిజినెస్ ప్రెండ్లీ" పాలనను కొనసాగిస్తామని బహిరంగంగా ప్రకటించుకొన్న మోడీ ప్రభుత్వం ఆ వర్గ స్వభావంతోనే కార్పోరేట్ సంస్థల ఆర్థిక‌ ప్రయోజనార్థమే భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు విషయాన్ని దాచిపెట్టి కల్లబొల్లి మాటలతో దేశ ప్రజానీకాన్ని బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు.

మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం:  రైతులకు నష్టపరిహార చెల్లింపు నిబంధనను ముట్టుకోకుండా రాష్ట్ర మరియు జాతీయ రహదారులు, విద్యుత్తు, నీటి పారుదల పథకాలు, జాతీయ రహదారుల వెంబడి నెలకొల్పబోయే పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతుల భూముల విలువ పెరగడానికి, ఉపాథి కల్పన, గ్రామీణాభివృద్ధికి ఈ సవరణలు దోహదపడతాయని ప్రలోబపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలలో లభ్యమతున్న ఉపాథి అవకాశాల కోసం వలస వస్తున్న ప్రజలు పట్టణీకరణ, టౌన్ షిప్స్ నిర్మాణం వల్ల‌ ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు.   ఉదా: డిల్లీ - ముంబాయ్ పారిశ్రామిక కారిడార్ నిర్మాణం వల్ల ఆ జాతీయ రహదారికి అటు ఇటు ఉన్న వేలాది గ్రామాలు ప్రయోజనం పొందుతాయని, వ్యవసాయ‌ భూముల విలువ పెరిగి రైతాంగానికి లబ్ధి చేకూరుతుందని, ఉపాథి అవకాశాలు కల్పించబడతాయని, సామాజిక మౌలిక సదుపాయాల పథకాలు, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి) పథకాల వల్ల దేశం మొత్తానికి మేలు జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఈ సవరణల ద్వారా అభివృద్ధిలో సమతుల్యత సాధించబడుతుందని చెప్పుకొచ్చారు. భూసేకరణ చట్టం -2013 ను రూపొందించడంలో యాభైకిపైగా తప్పులు చోటు చేసుకొన్నాయని వాటిలో కొన్నింటిని సరిదిద్దడానికే ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, భూసేకరణ ప్రక్రియలో భూమిని కోల్పోయే భూయజమానుల అభిప్రాయాలకు ఉన్న‌ చట్టబద్ధతను రద్దు చేసి రైతాంగం యొక్క‌ ప్రజాస్వామ్య గొంతుకను మాత్రం  నులిమేసింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పి.పి.పి.)ల ముసుగులో కార్పోరేట్ స‍ంస్థలకు భూములను అప్పగించడానికే భూసేకరణ చట్టానికి సవరణలు చేశారన్నది దాచాలన్నా దాగని సత్యం. ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు అత్యధికంగా గిరిజన ఆవాసాలే. ఈ సవరణల ద్వారా అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు లభించిన హక్కులను కాలరాస్తున్నారు.
భూసేకరణ చేసిన ప్రాంతాలలో నెలకొల్ప తలపెట్టిన పరిశ్రమల వల్ల ఆ ప్రాంతాల‌ ప్రజల జీవనోపాథికి, ఆహార భద్రతకు, పర్యావరణానికి, అలాగే అక్కడి సమాజంపై పడే ప్రభావాన్ని ముందస్తుగా అధ్యయనం చేసి రూపొంది‍చిన‌ నివేదికను పరిగణలోకి తీసుకొన్న మీదటనే భూసేకరణ ప్రక్రియలో ప్రభుత్వం అడుగు ముందుకేయాలని చట్టం చెబుతాఉంది. భూసేకరణ మూలంగా భూయాజమాన్య హక్కులు లేక పోయినా ఆ భూములనే నమ్ముకొని జీవనోపాథి పొందుతున్న వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఆయా గ్రామాల్లో ఇతర స్వయం పోషక‌ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం, ఉపాథి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన తదితర‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉన్నది. సాంఘిక అధ్యయనం చేయాలన్న నిబ‍ంధననే తొలగించడమంటే భూసేకరణ వల్ల ఉత్పన్నమ‌య్యే సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేయదలుచుకొన్నదని స్పష్టమవుతున్నది.
 చట్టంలోని విభాగం 10(ఎ)ని సవరించి ఐదు కొత్త రంగాలకు చెందిన పథకాలకు భూయజమానుల అంగీకారం, అలాగే సామాజిక ప్రభావంపై అధ్యయన నివేదిక అవసరం లేదని జారీ చేసిన‌ ఆర్డినెన్స్ ను నిశితంగా పరిశీలిస్తే మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా ప్రభుత్వం తొలగించడం గానీ నిర్వీర్య‍ం చేయడం గానీ చేసింది. సెక్షన్ 101 ని సవరించడ‍ం ద్వారా ఉపయోగించని భూమిని భూయజమానికి తిరిగి ఇచ్చివేయాలన్న నిబంధనకు చెల్లుచీటీ ఇచ్చేశారు. నిర్ధేశిత అవసరాల నిమిత్తం సంస్థలకు కేటాయించిన భూములను ఐదు సంవత్సరాల లోపు వినియోగించుకోని యడల ఆ భూమిని సంబంధిత భూయజమానికి తిరిగి ఇచ్చివేయాలని చట్టంలో ఉన్న నిబంధన అర్థరహితమైనదని తొలగించారు. స్మార్ట్ సిటీస్, టౌన్ షిప్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, వాణిజ్య సముదాయాలు, రక్షణ పథకాలు, కంటోన్మెంట్స్, ఓడ రేవులు, అణు విద్యుత్ కేంద్రాలు, జాతీయ రహదారులు, నీటి పారుదల ప్రాజెక్టులు, జలాశయాలు తదితర పథకాల‌ నిర్మాణానికి దీర్ఘకాలం పడుతుందని అందు వల్ల ఐదు సంవత్సరాల నిబంధన పెద్ద అవరోధంగా తయారయ్యిందని పేర్కొంటూ ఆయా పరిశ్రమలు లేదా ప్రాజెక్టుల నిర్మాణానికి పట్టే సమయం లేదా ఐదేళ్ళలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ సవరణ చేశారు.
దానితో పాటు భూమి కేటాయింపులో ఏదైనా ప్రభుత్వ శాఖ లేదా అధికారి అక్రమాలకు పాల్పడి ఉంటే న్యాయస్థానాలు కఠినంగా శిక్షంచే అధికారానికి సంబంధించిన‌ అంశాన్ని బలహీనపరిచారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపు అంశంపై న్యాయస్థానాల్లో వ్యాజ్యం నడుస్తూ 'స్టే' విధించిన సందర్భాలలో అoత్యమంగా భూయజమానులకు అనుకూలంగా తీర్పువస్తే నష్టపరిహారం చెల్లింపును లెక్కగట్టడానికి చట్టం రాకముందు నుంచీ వ్యాజ్యం జరుగుతున్న కేసులకు సంబందించి 'రిట్రాస్పెక్టివ్ క్లాజ్'ను అమలు చేయాలని చట్టంలో పేర్కొనబడింది. ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. జాప్యానికి సంస్థ బాధ్యతలేదని ఉద్ఘాటిస్తూ సెక్షన్ 24(2)ను సవరించి వ్యాజ్యం జరిగిన కాలాన్ని లెక్కలోకి తీసుకోబడదని ప్రకటించింది. ప్రయివేట్ కంపెనీ అన్న పదం స్థానంలో ప్రయివేట్ సంస్థ అన్న పదాన్ని చేర్చడం ద్వారా కంపెనీల చట్టం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకొన్న కంపెనీలకే భూసేకరణను పరిమితం చేయకుండా విస్తృత పరిచారు.   ప్రభుత్వం భూయజమానుల నుండి సేకరించిన భూములను ప్రయివేటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్ళు, తదితర ప్రయివేటు సంస్థలకు కేటాయించ కూడదని చట్టంలో ఉన్న నిబంధన‌ను కూడా తొలగించారు. సమతుల్య అభివృద్ధి జరగాలంటే ప్రయివేటు రంగానికి ప్రభుత్వం సేకరించిన‌ భూములను కేటాయించాల్సిందేనని ప్రభుత్వ‍ం ప్రకటించింది. బహుళ పంటలు పండే భూములను సేకరించ కూడదన్న షరతు గాలిలో కలిసి పోయింది.
భూసేకరణ(గనులు) చట్టం-1885, బొగ్గు క్షేత్రాల సేకరణ, అభివృద్ధి చట్టం -1957, విద్యుత్ చట్టం -2003, జాతీయ రహదారుల చట్ట‍ం -1956, భారత రైల్వేల చట్టం-1989,  మెట్రో రైల్స్ (నిర్మాణ పనులు) చట్టం-1978, ఇండియన్ ట్రామ్ వేస్ యాక్ట్-1886,  అణు ఇంధన పథకాల చట్టం-1962,  ది ఏన్సియెంట్ మానుమెంట్స్ అండ్ ఆర్కియాలిజికల్ సైట్స్ అండ్ రిమేన్స్ యాక్ట్ -1958, పెట్రోలియం అ‍డ్ మినరల్స్ పైప్ లైన్స్ యాక్ట్-1962, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చ‌ట్టం -1948, పునరావాస చట్ట‍ం, మొత్తం 13  చట్టాలను భూసేకరణ చట్ట‍ం పరిథిలోకి తీసుకొచ్చారు. ఇది రైతాంగానికి మేలు చేసే చర్యే. కానీ అదే సందర్భంలో అత్య‍ంత వివాదాస్పదమైన ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టాన్ని మాత్రం భూసేకరణ చట్టం పరిథిలోకి తీసుకరాక పోవడాన్ని కూడా గమనించాలి. 
భూసేకరణ చట్టంలోని నిబంధనల మూలంగా భూమిని సేకరించడం సాధ్యం కాకపోవడంతో  60% పి.పి.పి. పథకాలు అర్థంతరంగా ఆగిపోవడంతో 18 లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదని మొసలికన్నీరు కారుస్తున్నారు.  భూసేకరణ చట్టం - 2013 అమలులోకి వచ్చిన నాటి నుంచే ఆ చట్టాన్ని మార్చాలంటూ పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. కార్పోరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలను శరవేగంగా అమలు చేస్తున్న మోడీ, అందులో భాగంగానే భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ జారీ కాగానే నిర్మాణ రంగం, స్థిరాస్థి వ్యాపారంలో ఉన్న‌ కార్పోరేట్ సంస్థల షేర్ల విలువలు పెరిగిపోయాయి.

Tuesday, January 6, 2015

విధాన సమీక్ష లేకుండానే మళ్ళీ బొగ్గు క్షేత్రాల వేలమా?




బొగ్గు క్షేత్రాల ప్రయివేటీకరణకు మార్గాన్ని సుగమం చేస్తూ మోడీ సర్కార్ జారీ చేసిన అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్)ను ఉపసంహరించుకోవాలని రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు (ఎ.ఐ.టి.యు.సి.; సి.ఐ.టి.యు.; బి.యం.యస్.; ఐ.యన్.టి.యు.సి.; హెచ్.యం.యస్.) ఇచ్చిన ఐదు రోజుల దేశ వ్యాపిత సమ్మె పిలుపుకు స్పందించిన‌ బొగ్గు గని కార్మికులు నిన్నటి నుంచి ఉద్యమ బాట పట్టారు. బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని క్షేత్రాల్లో ఉత్పత్తి స్తంభించింది. సింగరేణి కాలరీస్ కార్మికుల్లో అత్యధికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై నేను వ్రాసిన వ్యాసం ఈ రోజు సూర్యా దినపత్రికలో ప్రచురించబడింది.





విధాన సమీక్ష లేకుండానే మళ్ళీ బొగ్గు క్షేత్రాల వేలమా?



పారమెంటు ఔన్నత్యాన్ని మ‌సకబారుస్తూ అత్యవసర ఆదేశాలు(ఆర్డినెన్సులు) ద్వారా తమ రాజకీయ అజెండాలోని అంశాలను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శరవేగంతో అడుగులు వేస్తున్నది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన భాజపా నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భగ్వత్ మొదలుకొని పలువురు సంఘ్ పరివార్ కూటమి నేత‌లు లౌకిక వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పలు వివాదాస్పద అంశాలను తెరపైకి తేవడం ద్వారా పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను విజయవంతంగా ప్రక్క దారి పట్టించారు. పర్యవసానంగా ఉభయ సభల్లోను దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, కీలకమైన అంశాలకు సంబంధించిన‌ వివిధ బిల్లులపై చర్చించే సదవకాశం లేకుండా చేయశారు. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండడంతో వివిధ బిల్లులకు సభ‌ ఆమోదం పొందడంలో ప్రభుత్వం విఫలమైనది.
రాజు తలచుకొంటే కొరడాదెబ్బలకు కొదవా అన్నట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో ఆర్డినెన్సుల ద్వారా భీమా రంగంలోకి 49% విదేశీ పెట్టుబడులను అనుమ‌తించడానికి, బొగ్గు క్షేత్రాలను వేలం వేయడానికి పూనుకొన్నది. భూసేకరణ చట్టం - 2013కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కూడా సిఫార్సు చేసింది. బొగ్గు క్షేత్రాల వేలానికి మార్గాన్ని సుగమం చేస్తూ తిరిగి ఆర్డినెన్స్ జారీ చేసింది. తొలి దశలో ఉత్పత్తిలో ఉన్న‌24 గనుల వేలానికి 'ఎలక్ట్రానిక్ బిడ్డింగ్' కోసం ప్రత్యేక పోర్టల్ ను కేంద్ర ఇంధన శాఖామాత్యులు పియూష్ గోయల్ డిసెంబరు 25న‌ ప్రారంభించారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న 42 క్షేత్రాల వేలం ప్రక్రియను 2015 మార్చి 23 నాటికి పూర్తి చేసి బొగ్గు క్షేత్రాల అభివృద్ధి మరియు ఉత్పత్తి ఒప్పందాలను కుదుర్చుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రెండవ దశలో బొగ్గు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో 32 గనులను వేలం వేసే ప్రక్రియ మొదలవుతుందని కూడా ప్రకటించింది.
భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా 'కోల్గేట్ కుంభకోణం' రికార్డుల్లోకెక్కింది. సరళీకృత ఆర్థిక విధానాల జపం చేస్తూ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తూ దేశ సంపదైన సహజ వనరుల‌ను కార్పోరెట్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెట్టే విధానాలను గడచిన రెండు ద‌శాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఆ విధానాల దుష్పలితమే బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణం. ఈ కుంభకోణం మూలంగా ప్రభుత్వ‌ ఖజానాకు చేరవలసిన‌ లక్షా డేబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాలు దారి మళ్ళిపోయాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికల ద్వారా కాగ్ బహిర్గతం చేసి సంచనలనం సృష్టించింది. నాటి దేశ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ చట్టబద్ధమైన కాగ్ సంస్థను తూలనాడుతూ అవి కాకిలెక్కలని, ఆ ఆరోపణ అర్థరహితమని కొట్టిపడేశారు. నాటి ప్రభుత్వం అనుసరించిన‌  వైఖరి వల్ల‌ అవినీతి కూపంలో కూరుకపోయిన దేశంగా ప్రపంచ దేశాల ముందు మన దేశం తలదించుకోవలసి వచ్చింది. భ్రష్టు పట్టిన ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యంగా బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ కుంభకోణాన్ని క్షేధించడంలో సుప్రీం కోర్టు క్రీయాశీలంగా వ్యవహరించి, నేరుగా రంగ ప్రవేశం చేసి, తన నియంత్రణలో సి.బి.ఐ. విచారణకు ఆదేశించి, ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతున్న‌ సి.బి.ఐ. డైరెక్టరుకు సహితం చివాట్లుపెడుతూ, కేసు విచారణను పరుగులు తీయించి, అత్యమంగా 1993 నుండి 2010 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవినీతి, అక్రమాలు జరిగాయని నిర్ధారించి 204 లైసెన్సులను రద్దు చేస్తూ సెప్టంబరు 24, 2014న‌ చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన‌ వాటిలో బొగ్గు ఉత్ఫత్తి చేస్తున్న 42 క్షేత్రాలు, ఉత్ఫత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న32 క్షేత్రాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్నిప్రయివేటు సంస్థలు ప్రభుత్వం నుండి గనుల‌ కేటాయింపు చేయించుకొని పని మొదలు పెట్టలేదు. వాటినీ కోర్టు రద్దు చేసింది.
మన్మోహన్ సరే మోడీ చేసిందేమిటి ?: డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఎ.) 2014 మే లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరపరాజయానికి గురై గద్దెదిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి(యన్.డి.ఎ.) అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేబట్టారు. నాడు ప్రధాన ప్రతిపక్షంగా బొగ్గు కుంభకోణంపై పదునైన విమర్శలు చేసిన భాజపా నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు విషయంలో పెద్దగా శ్రద్ధ‌ చూపెట్టిన దాఖలాలు లేవు. అధికారంలోకి రాగానే సహజ వనరులను కొలగొట్టిన, ఆర్థిక‌ కుంభకోణాలకు పాల్పడిన నేరస్తుల భరతం పడతామని దేశ ప్రజలకు వాగ్ధానం చేస్తూ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన అజెండాను భాజపా పక్కనబెట్టి అలాంటి అంశాలను న్యాయ స్థానాలకే వదిలిపెట్టి సోద్యం చూస్తున్నది. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగానే వర్గ స్వభావంతో వ్యవహరిస్తున్నది.
సుప్రీం కోర్టు తీర్పు తరువాత తాజాగా బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టి, టెండర్లను ఆహ్వానించింది. గనుల‌ కేంటాయింపుకు సంబంధించి నూతన‌ విధి విధానాలను ప్రకటించి, వాటిపై డిసెంబరు 22 వ తేదీ లోపు సంబంధిత సంస్థలు, వ్యక్తులు(స్టేక్ హోల్డర్స్) తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఆ విధి విధానాలను పరిశీలిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిని సంకించవలసి వస్తున్నది. 'కోల్ గేట్' కుంభకోణంలో భాగస్వాములైన సంస్థలను 'బ్లాక్ లిస్ట్'లో చేర్చి టెండర్ల ప్రక్రియలో పాల్గొనడానికి వీలులేకుండా నిషేధించక పోవడం అనుమానాలకు తావిస్తున్నది. న్యాయ స్థానాలు ఏ సంస్థకైనా మూడేళ్ళకు మించి శిక్ష విధించి ఉంటే ఆ సంస్థలు టెండర్లు దాఖలు చేయడానికి అనర్హులన్న ఒక నిబంధన పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేసినట్లు కనబడుతున్నది. ఇది దేశ‌ ప్రజానీకాన్ని వంచించడమే. సుప్రీం కోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. నేరానికి పాల్పడిన సంస్థలకు శిక్షలు కరారు కాలేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఈ కేసు విచారణలో అంతర్భాగంగా సుప్రీం కోర్టు వివిధ సందర్భాలలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదనిపిస్తోంది. అక్రమంగా బొగ్గును ఉత్పత్తి చేసినందుకు డిసెంబరు 31, 2014 లోపు జరిమానా చెల్లించాలని ఆయా సంస్థలకు సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ గడువును పెంచాలని జిందాల్ తో పాటు మరో రెండు సంస్థలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించడం కూడా జరిగింది.
ఈ పూర్వరంగంలో లోపభూయిష్టమైన విధానాలపై సమగ్రమైన సమీక్ష చేయకుండానే ఆర్డినెన్సు ద్వారా బొగ్గు ఉత్పత్తిని వాణిజ్యపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. బొగ్గు క్షేత్రాల జాతీయకరణ చట్టం -1973కు సవరణ చేస్తూ బొగ్గు క్షేత్రాల (ప్రత్యేక నిబం ధనలు) ఆర్డినెన్సు-2014ను జారీ చేసింది. దాని ప్రకారం బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేటు రంగ‌ సంస్థలు భాగస్వామ్యమవుతాయి. కాప్టివ్ మైన్స్ పేరిట సొంత పారిశ్రామిక అవసరాల కోసం గనుల కేటాయింపు చేసే లైసెన్సింగ్ విధానానికి భిన్నంగా సొంత వాడకంతో పాటు అమ్మకానికి కూడా అనుమతించడం జరిగింది. ఈ విధానం వల్ల దుష్పలితాలు సంబవిస్తాయి. బొగ్గు ధరలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన‌ కోల్ ఇండియా ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలోని ధరల కంటే 40% తక్కువ ధరకు బొగ్గును అమ్ముతున్నది.బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కోల్ ఇండియా చేసే ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువే. ధరల నియంత్రణా చట్టం రూపకల్పన చర్చల వరకే పరిమితమైనది. ప్రయివేటు సంస్థల రంగ ప్రవేశంతో ధరలు పెరగడంతో పాటు పెద్ద ఎత్తున‌ అవినీతి, అక్రమాలకు సరళీకృత ఆర్థిక విధానాలు వీలుకల్పించాయన్ననిప్పు లాంటి నిజం సుప్రీం కోర్టు తీర్పుతో బహిర్గతమయ్యింది.
 దేశ పురోగతికి ఇంధన వనరులు అత్యంత కీలకమైనవి. ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గు ముఖ్యభూమిక పోషిస్తున్నది. అధిక లాభాపేక్షతో కార్పోరేట్ సంస్థలు దేశ‌ సంపదైన బొగ్గును కొల్లగొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. బొగ్గు క్షేత్రాలు అత్యధికంగా అటవీ ప్రాంతాలు, గిరిజన ఆవాసాల్లోనే ఉన్నాయి. అటవీ సంపద తరిగి పోవడం, సామాజికంగా వెనుకబడ్ద గిరిజనుల ఉనికే ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నది. థర్మల్ విద్యుదుత్పాదన పర్యవసానంగా పర్యావరణ సమస్యలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ పూర్వరంగంలో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషణపై తారా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి, వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విధానాన్నిరూపొందించి, అమలు చేయాలన్న డిమాండ్ పర్యావరణ వేతలు, ప్రజలు కోరుతున్నారు. వీటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలే మొన్నగా భావిస్తున్న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
క్యాప్టివ్ మైనింగ్ విధానం మూలంగా వంద‌ శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినా గతంలో పెద్దగా పెట్టుబడులు రాలేదని తాజాగా బొగ్గు ఉత్పత్తిని వాణిజ్యపరం చేశారు. తద్వారా పెట్టుబడులతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశ పెట్టబడి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి దేశ అవసరాల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడకుండా వెసులుబాటు వస్తుందని నమ్మబలుకుతున్నారు. కానీ, కోల్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థలు దేశ అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును ఉత్పత్తి చేయలేక పోతున్నాయనే నెపం వేసి ప్రయివేటీకరణకు ప్రభుత్వం పూనుకొన్నది. న‌ల్లబంగారంగా భావించబడుతున్న‌ జాతి సంపదను కార్పోరేట్ శక్తులు అధిక లాభాపేక్షతో కొల్లగొట్టడానికి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడానికి పూనుకోవడం దొంగ చేతికి తాళాలిచ్చినట్లుగా ఉన్నది.