Thursday, July 28, 2011

రాయలసీమ భవిష్యత్తు?

ఆంధ్ర జ్యోతి దినపత్రిక july 27,2011



- టి. లక్ష్మీనారాయణ

ఒకనాడు పాలెగాళ్ళ రాజ్యంలో మగ్గిపోయిన రాయలసీమ మళ్ళీ ఆ దుస్థితికి నెట్టబడుతుందా అన్న ఆందోళనతో ప్రజాతంత్రవాదులు, సామాన్య ప్రజలు మనోవేదనకు గురౌతున్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బి.జె.పి. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెబుతుంటే, అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మేం వ్యతిరేకం కాదని పునరుద్ఘాటిస్తున్నది. చిన్న రాష్ట్రాలయితే విప్లవాల ద్వారా అధికారంలోకి రావడం సులభమని కొందరు, డాక్టర్ అంబేద్కర్‌ను అడ్డంపెట్టుకొని మరికొందరు సమర్ధిస్తున్నారు.

అవకాశవాదం, సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నవారూ, ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న వారూ కూడా చిన్న రాష్ట్రాలను బలపరుస్తున్నారు. నేడు దేశంలో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం పరిపూర్ణమైనది కాదు. దోపిడీ వ్యవస్థను పరిరక్షించే బాధ్యతను తలకెత్తుకున్న రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్నది. ఈ వ్యవస్థకు సహజంగానే అనేక పరిమితులున్నాయి. అయినప్పటికీ, మానవ హక్కులు, ప్రజాతంత్ర హక్కుల సాధన, వెనుకబాటుతనం నుంచి కొంతైనా విముక్తి కావడానికి, ప్రజా ఉద్యమాల ద్వారా సమగ్రాభివృద్ధి వైపు ప్రయాణించడానికి ఈ వ్యవస్థలో అవకాశం ఉందని అత్యధిక ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్ర విభజనపై చర్చోపచర్చలు, ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అభివృద్ధి, వెనుకబాటుతనం అంశాలపైన వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. గడచిన ఐదు దశాబ్దాలలో రాష్ట్రం అంచలంచలుగా అభివృద్ధి చెంది, దేశంలో నాలుగో (జి.డి.పి.లో) స్థానానికి ఎగబాకిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ వెనుకబడి పోయిందనే వాదాన్ని కొందరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చారిత్రకంగా పరిశీలిస్తే అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రాయలసీమ అత్యంత వెనుకబడి ఉన్నది. గడచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేసుకొంటూ వచ్చి ఈ దశకు చేరుకొన్నది.

పెట్టుబడిదారీ వ్యవస్థకున్న సహజ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి గమనం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1965-75 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.యల్., బి.హెచ్.ఇ.యల్., ఐ.డి.పి.యల్., హెచ్.యం.టి., మిధాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో బి.హెచ్.పి.వి., జెన్‌కో లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది.

ఈ భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా హైదరాబాద్, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలుగా పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. మిగిలిన ప్రాంతాలలోని మరే నగరం గానీ, పట్టణం గానీ గడచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో లబ్దిపొందలేదు. పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు ఏ ఒక్క ప్రభుత్వమూ కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగానే, హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా అభివృద్ధంతా కేంద్రీకరించబడిందన్న అంశం వివాదరహితం. ఆ మేరకు సంఘటిత, అసఘటిత రంగాలలో ఉపాధి అవకాశాలు కూడా ఉన్నంతలో ఇక్కడే లభిస్తున్నాయి. ఈ అభివృద్ధి ఫలాల నుంచి రాష్ట్ర ఖజనాకు అత్యధికంగా ఆదాయం ఒనగూడుతున్నది. ఇది కాదనలేని సత్యం. ఎవరి రాజకీయావసరాలు వారికి ఉండవచ్చు. కానీ, వాస్తవాలను వక్రీకరించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

భౌతికంగా కంటి ముందున్న అభివృద్ధి కూడా కనబడకపోవడం దృష్టిలోపమో! లేదా చూడనిరాకరిస్తున్నారా! లేదా అడ్డగోలుగా వాదించాలని వాదిస్తున్నారో! అర్థం కావడం లేదు. వెనుకబాటుతనాన్నే ప్రాతిపదికగా తీసుకొంటే ప్రప్రథమంగా 'ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని' ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. వెనుకబాటుతనంతో పాటు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా సమర్థించే వారు లేకపోలేదు. కానీ అది ఏ మాత్రం వాంఛనీయం కాదు. అదే జరిగితే ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం మనుగడే ప్రశ్నార్థకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాగునీటికి, తాగునీటికి శాశ్వత కరువు తప్పదు. తాగడానికే నీళ్ళు లేనిచోట పారిశ్రామికాభివృద్ధి కలలోని మా ట. ఇది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.

భవిష్యత్ పరిణామాలను అనుభవాల ఆధారంగా ఊహించు కొంటున్న వారు, మన బతుకేదో మనం బతికేద్దాం! అన్న నిరాశావాదంతో మాట్లాడే వారూ లేకపోలేదు. కారణం, భాషా ప్రాతిపదికపై తెలుగు జాతి మొత్తం ఒకే పాలనా గొడుగు కిందికి రావాలనే ప్రగాఢమైన వాంఛ మేరకు తొలి అడుగుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి 'ఆంధ్ర రాష్ట్రం' ఏర్పడింది. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధానిని నెలకొల్పారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ రాజధాని నగరమై, తద్వారా ఒనగూడిన సానుకూలాంశాలను సద్వినియోగం చేసుకొని, బాగా అభివృద్ధి చెందిన 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళగొడితే, మళ్ళీ సీమాంధ్రకు రాజధానిగా ఏ కోస్తా నగరానికో తరలి వెళ్ళి అక్కడ అభివృద్ధి చెందాక మరికొంత కాలానికి వాళ్ళు తన్ని వెళ్ళగొట్టరనే దానికి రాయలసీమవాసులకు గ్యారెంటీ ఏమిటి! 'మా ప్రాంత అభివృద్ధి ఫలాలను తామే అనుభవించాలనే' దుర్బుద్ధికి అంతం ఉండదు కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్ర బిందువుగా జరుగుతున్న అభివృద్ధి కనీసం కొంత వూరట కల్పించవచ్చునేమో! కానీ రాయలసీమ ప్రజలకు అలాంటి ఆశాకిరణమే కనిపించడం లేదు. పెద్ద మనుషులు చేసుకొన్న 'శ్రీబాగ్' ఒడంబడిక'లో పొందుపరచిన మేరకు కృష్ణా నదీ జలాల పంపిణీలో ప్రథమ వాటా కల్పిస్తామన్న మాట బుట్టదాఖలు చేయబడింది. బళ్ళారితో పాటు తుంగభద్ర నీటిని కోల్పోయారు. ఉన్న రాష్ట్ర రాజధానినీ వదులుకొన్నారు.

తెలుగు జాతి సమైక్యత కోసం వెనకాముందు ఆలోచించకుండా అన్ని త్యాగాలు చేసిన రాయలసీమ నేడు దిక్కుతోచని స్థితిలో పడింది. మహా నగరంగా ఎదిగిన హైదరాబాదు, తెలుగు జాతికి గర్వకారణమైన రాష్ట్ర రాజధాని. మన రాజధాని నగరం అనే భావనతో రాష్ట్ర నలమూలల నుంచి, కుగ్రామాల నుంచి కూడా చదువుకున్న వారు, నిరక్షరాస్యులు ఉపాధి కోసం, ఉన్నత విద్యావకాశాల కోసం వచ్చారు. అభివృద్ధి ఇక్కడే! అవకాశాలు ఇక్కడే! అయినప్పుడు ఈ పరిణామం సహజం.

ప్రపంచీకరణలో భాగంగా సరిహద్దులు లేని మార్కెట్ కోసం మార్కెట్ శక్తులు పరుగులు తీసినట్లే, ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో మనుగడ సాగిద్దామని యువత, శ్రామికులు పరుగు పందెంలో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తమ శక్తి యుక్తులను వినియోగిస్తున్న వారిని బతకడానికి వలస వచ్చిన వారని ద్వితీయ శ్రేణిపౌరులుగా చూస్తూ, నోటికొచ్చినట్లు దుర్భాషలాడడం లాంటి కుసంస్కారుల ప్రవర్తనలతో మనోవేదన చెందుతున్నారు. వాక్ స్వాతంత్య్రానికి, ప్రజాతంత్ర హక్కులకు, మానవ హక్కులకు, పౌరుల హుందాతనానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు.

ఈ అన్ని అంశాలపై రాజకీయ వ్యవస్థ నిజాయితీతో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయాన్ని అందించడానికి బాధ్యతతో ఆలోచించాలా? లేదా? దేశవ్యాప్తంగా అనివార్యంగా ప్రభావం కల్పించే ఒక సంక్లిష్టమైన, జఠిలమైన, అత్యంత సున్నితమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు అన్ని ప్రాంతాలకు వర్తించేలా జాతీయ విధానాన్ని రూపొందించుకోవడం జాతీయ రాజకీయ పార్టీలకు విధ్యుక్త ధర్మం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధానాన్ని అనుసరించడం తగునా? ఇలాంటి ప్రశ్నలకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఆ నిజాయితీ రాజకీయ నాయకత్వంలో కొరవడింది కాబట్టే రాజకీయాల పట్ల ప్రజానీకంలో విశ్వసనీయత ప్రశ్నార్థకమయింది. దేశ విస్తృత ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే గీటురాయిగా విధానాలను రూపొందించి అమలు చేయాలని ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు కదా? ప్రత్యేక తెలంగాణ సమస్యపై వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరులు భవిష్యత్తులో చాలా హానికరమైన పరిణామాలకు దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపప్రాంతీయ పార్టీలు తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సంబంధించిన ఒకానొక సమస్యపై కేంద్రీకరించి దాన్ని సాధించుకోవడానికి అవసరమైన వ్యూహ, ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటూ మనుగడ సాగిస్తాయి ఆ సమస్యకు ముగింపు లభించగానే ఈ తరహా పార్టీలు అంతర్దానం అయినా ఆశ్చర్యం లేదు.

విభిన్న జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలతో 'భిన్నత్వంలో ఏకత్వం'గా జీవిస్తున్నాము. అనేక అంశాలతో పాటు జాతీయ పార్టీల వైఫల్యం కారణంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. సమకాలీన రాజకీయాలలో వాటి పాత్రను విస్మరించలేం. విస్తృత ప్రయోజనాల పట్ల ప్రాంతీయ పార్టీలు కూడా తమకున్న బాధ్యతను విస్మరించజాలవు. కానీ జాతీయ పార్టీలు విశాల దృక్పథంతో, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా విధానాలను రూపొందించుకొని, అమలు చేయకపోతే దేశం మొత్తానికి హాని జరుగుతుంది.

Monday, July 11, 2011

జనానికి ‘చమురు’ కంపెనీలకు కాసులు!

sakshi 12th july 2011

చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. ప్రజలతో వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.

పెట్రోల్ ధరలపై నియంత్రణను తొలగించిన విధంగానే డీజిల్ ధరలపై కూడా నియంత్రణను ఎత్తివేసి స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వంపై తాజాగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నది. దీనికి ప్రభుత్వం తలొగ్గితే, ధరల పెరుగుదలతో ఇప్పటికే బతుకు పోరు చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజానీకానికి జీవనం పెను భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులను గమనిస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనిపిస్తున్నది.
[Image]
చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. లేదా నమ్మబలుకుతున్నది. ఇందులో ఉన్న వాస్తవమెంత? అన్నదే అసలు సమస్య. నెల క్రితం పెట్రోల్, ఇప్పుడు డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచడం నిజంగా ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చడానికా? లేదా అధిక లాభాలను ఆర్జించిపెట్టటానికా? అన్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చమురు కంపెనీల ఆదాయ, వ్యయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు పెట్రోలియం రంగం నుండి సమకూరుతున్న ఆదాయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో నివేదికను రూపొందించి ప్రజల ముందుంచాలి. అప్పుడు అంకెల గారడీ, కనికట్టు మాయాజాలంతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారో లేదో బహిర్గతమవుతుంది.

దేశ ముడి చమురు అవసరాలలో 84 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచక తప్పడం లేదని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కి 110 డాలర్లు అంటే రూ.4,950. బ్యారెల్ అంటే దాదాపు 160 లీటర్లు. దాని ప్రకారం లీటరుకు (4,950/160 30.94) దాదాపు రూ.31లు పడుతుంది. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ అమ్ముతున్న ధర రూ.71ల పైన ఉన్నది. దీన్ని బట్టి రూ.40లు (56 శాతంపైగా) అదనంగా వినియోగదారుడిపై భారం మోపుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగాన్ని అత్యంత ప్రధానమైన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, చమురు అభివృద్ధి పన్ను, రహదారుల పన్ను, విద్య పన్ను, చమురు కంపెనీలు ఆర్జించిన లాభాలపై ఆదాయపు పన్ను, అలాగే రాయల్టీ ద్వారా 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.71,767 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను (వ్యాట్) విధించి ఖజానాలను నింపుకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తుల ధరలను పెంచినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి మహదానందం కలుగుతుంది. కారణం, పెట్రోల్‌పై దేశంలోకెల్లా అత్యధికంగా మన రాష్ట్రంలో 33 శాతం, అలాగే డీజిల్‌పై 22.5 శాతం, కిరోసిన్‌పై 4 శాతం, వంటగ్యాస్‌పై 4 శాతం అమ్మకం పన్నును విధించడం ద్వారా చెవులు పిండి ఖజానాను నింపుకొంటున్నారు.

దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి నామమాత్రంగా కొంత మొత్తాన్ని సబ్సిడీగా నగదు బదిలీ పథకం ద్వారా అందించి, పెట్రోల్ లాగా వంట గ్యాస్ పైన ఉన్న నియంత్రణను కూడా తొలగించి రూ.750లకు పెంచాలనే దురాలో చనలో ఉన్నది కేంద్రం. తద్వారా చమురు రంగంలో సబ్సిడీల విధానానికి చరమగీతం పాడాలని భావిస్తున్నది. అలాగే, చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించి, వేతనాలపై పెడుతున్న ఖర్చును తగ్గించుకొంటున్నారు. 2009, ఏప్రిల్ 1 నాటికి 1,38,973 మంది ఉంటే 2010, ఏప్రిల్ 1 నాటికి 1,29,988కి తగ్గించడం ద్వారా ఉన్న కార్మికులపై పని భారం పెంచారు.

కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్జించిన సొమ్మెంతో వెల్లడించలేదు. ఉదాహరణకు 2006-07 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.23,320 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఈ రంగం నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం రూ.6,51,000 కోట్లు అని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే 2009-10లో రూ.71,767 కోట్లు వివిధ పన్నుల ద్వారా ఆర్జించి, కేవలం రూ.14,954 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. దీన్ని బట్టి ఇస్తున్న సబ్సిడీల మొత్తంతో, ప్రభుత్వాలు ఆర్జిస్తున్న మొత్తమెంతో తేటతేల్లమవుతున్నది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎలాంటి పన్నులను విధించకుండా లీటర్ పెట్రోల్‌ను కేవలం రూ.28లకే ప్రైవేట్ విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రజలతో లాభార్జనతో కూడిన వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’.

ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించి, 5 శాతం కస్టమ్స్ డ్యూటీని తొలగించడంతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.26,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.60 పైసల చొప్పున ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.2లకు తగ్గించడంతో రూ.23,000 కోట్లు, మొత్తం రూ.49,000 కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసినప్పటికీ ఇంకా రూ.1,22,000 కోట్లు చమురు కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చింది.

ఇది పచ్చి అబద్ధం. ఇవి నష్టాలు కావు. చమురు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా కట్టుకొన్న ఆదాయంలో తరుగుదల (అండర్ రికవరీ) మాత్రమే. ఈ తరహా అండర్ రివకరీ మొత్తం 2009-10లో రూ.34,391 కోట్లుగా కిరోసిన్, వంటగ్యాస్ పద్దు కింద ఉన్నాయని మాత్రమే అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2006-07 నుండి 2009-10 మధ్య నాలుగు సంవత్సరాల కాలంలో చమురు కంపెనీలు రూ.1,26,000 కోట్ల లాభాలను ఆర్జించాయని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ మాజీ మంత్రివర్యులు మురళీ దేవరా స్వయంగా ఒకానొక సందర్భంలో ప్రకటించారు. 2009-10లో ఆదాయపు పన్ను చెల్లింపు తరువాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రూ.37,319 కోట్లు నికరలాభాలను ఆర్జించాయని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖ నివేదిక ద్వారా వెల్లడవుతున్నది. ఇవి ప్రబల నిదర్శనాలు.

‘నందిని పందిని, పందిని నందిని చేసినట్లు’ అన్న సామెతగా కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ మ్రాతం గతంలో పోగుబడ్డ రూ.1,80,000 కోట్లకు తోడు 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే రూ.78,000 కోట్ల మేర చమురు కంపెనీలు నష్టపోయాయన్న దగాకోరు ప్రకటన చేశారు.

మన దేశ వినియోగావసరాలలో 25 నుండి 30 శాతం వరకు కృష్ణా - గోదావరి బేసిన్, ముంబై, అసోం, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలలో చమురు ఉత్పత్తి జరుగుతున్నది. దానికి కూడా అంతర్జాతీయ చమురు ధరలకు సమానంగా ధరలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఒకవైపున దేశీయంగా చమురు అవసరాలు పెరుగుతూ, తీవ్ర ఒత్తిడి ఉన్న పూర్వరంగం లోనే మన దేశం నుంచి రూ.1,44,037 కోట్ల విలువ చేసే 50,974 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ చమురు కంపెనీలకు లెసైన్సులు మంజూరు చేసి, అధిక లాభాలు గడించుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.

నేడు సహజవాయువు అందరూ కోరుకొనే సహజసిద్ధమైన ప్రాధాన్యతా ఇంధనంగా అవతరించింది. సహజవాయువు ఇంధన భద్రతను కూడా పెంచు తుంది. ఇది చౌక ధరకు లభించే ప్రత్యామ్నాయ ఇంధనం. కాలుష్యరహితం. నేడు దేశ ఇంధనావసరాలలో 10 శాతం మాత్రమే సహజవాయువు తీర్చగలుగు తున్నది. దాదాపు 25 శాతం ఉన్న ప్రపంచ సరాసరి వినియోగానికి మన దేశం చాలా దూరంలో ఉన్నది. మన దేశంలోనూ పుష్కలంగా సహజవాయువు నిక్షేపాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బహిర్గతం చేసిన నివేదిక నుంచి గుణపాఠాలు నేర్చుకొని, రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెట్టే విధానాలకు స్వస్తి చెప్పి, సహజవాయువు నిక్షేపాలను ప్రణాళికాబద్దంగా వెలికితీసి, ప్రజా ప్రయోజ నాలే గీటురాయిగా, సక్రమంగా వినియోగించుకొనే రాజకీయ సంకల్పాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తే దేశ ఇంధన అవసరాలు గణనీయంగా తీరుతాయన డంలో ఎలాంటి సందేహం లేదు.

మన రాష్ట్రంలో దాదాపు ఒక కోటి ఇరవై ఏడున్నర లక్షల ఎల్‌పీజీ వినియోగదారులున్నారు. ఎల్‌పీజీకి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎల్‌పీజీ స్థానంలో పీఎన్‌జీ (పైప్ నేచురల్ గ్యాస్)ని వీలైనంత ఎక్కువగా వినియోగంలోకి తీసుకురాగలిగితే, చౌకగా వంట గ్యాస్‌ను వినియోగదారులకు అందించడమే కాకుండా ప్రభుత్వంపై సబ్సిడీల భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకొని, ఘరానా దోపిడీకి, అన్ని రకాల పెత్తనానికి బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదానికి కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు. 2009-10 సంవత్సరంలో 15.93 కోట్ల టన్నుల ముడి చమురు, 1.47 కోట్ల చమురు ఉత్పత్తుల దిగుమతుల కోసం రూ.4,18,475 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాం. దాంట్లో కొంతైనా ఆదా చేసుకోవచ్చును. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా చమురు రంగంలో ఒక మేర స్వయం పోషకత్వాన్ని సాధించే అవకాశమూ ఉంది.
ఇలాంటి చర్యలపైన దృష్టి సారించడానికి బదులు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలను, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్దేశించుకొన్న వ్యూహంలో భాగంగానే చమురు కంపెనీలను మంచి లాభాలు గడిస్తున్న సంస్థలుగా చూపెట్టి అంగడిలో అమ్మకానికి పెడుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్‌లే ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తున్నాయి.

సరళీకృత ఆర్థిక విధానాలే ఈ దుష్పరిణామాలకు మూలం. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.