Wednesday, August 27, 2014

విద్యుత్ ఉద్యమం: ఆగస్టు 28, 2000న‌ ఛలో అసెంబ్లీ - బషీర్ బాగ్ లో పోలీసు కాల్పుల దృశ్యాలు

https://www.facebook.com/thunga.lakshminarayana/media_set?set=a.331003947066628.1073741826.100004710753957&type=1

వీరోచిత పోరాటానికి ప్రతిబింబం "బషీర్ బాగ్"





 స్వాతంత్య్రానంతర భారత దేశంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర నలుచెరుగుల నుండి సముద్ర కెరటాల్లా ఎగసిపడుతూ తరలివచ్చిన జన బాహుళ్యం 28 ఆగస్టు 2000 తేదీన సాగించిన‌ సమరశీల పోరాటానికి హైదరాబాదు మహానగరానికి నడిబొడ్డులో ఉన్న బషీర్ బాగ్ యుద్ధక్షేత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. నాటి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలన్న ప్రధానమైన డిమాండ్ తో పాటు విద్యుత్ రంగంలో తలపెట్టిన సంస్కరణలను ప్రతిఘటిస్తూ, విద్యుదుత్ఫాదన, సరఫరా మరియు పంపిణీ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఆర్థిక వ్యవస్థకు చోధక శక్తిగా పనిచేసే విద్యుత్తు రంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించవద్దని, నిత్యావసర వస్తువుగా ఉన్న విద్యుత్తును ఖరీదైన అంగడి సరుకుగా మార్చి సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకొంటూ జనం సాగించిన వీరోచిత మహోద్యమమది.
వామపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన "ఛలో అసెంబ్లీ" పోరాట‌ పిలుపుకు స్పందించి ఉరకలేసుకొంటూ వచ్చిన‌ యాభై వేల మందికిపైగా ఉద్యమకారులు పిడికిలి బిగించి, గళమెత్తి నినదిస్తూ, కందంతొక్కుతూ ఇందిరా పార్క్ నుండి బయలుదేరి లోయర్ టాంక్ బండ్, లిబర్టి, బషీర్ బాగ్ ప్లై ఓవర్ మీదుగా ప్రదర్శనగా శాసన సభ వైపుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఉద్యమకారులను నిలవరించడానికి పోలీసులు పలు అంచల భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేసుకొన్నారు. ముళ్ళ కంచెలు, వాటర్ క్యాన్స్ తో వాహనాలు, పైబర్ లాఠీలు చేతబూనిన పోలీసులు, అశ్విక దళాలు, స్టెన్ గన్ లతో సాయుధులైన స్పెషల్ పోలీసు దళాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇలా అంచెలoచలుగా బారులు తీరి ఉన్నాయి. వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించి ఛలో అసెంబ్లీ ఆందోళనను ఎలాగైనా భగ్నం చేయాలన్న పథకాన్ని రూపొందించుకొని ప్రభుత్వం సర్వసన్నద్ధమయ్యింది. ఉద్యమకారులు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర మలుపు తీసుకొని బషీర్ బాగ్ కూడలికి చేరుకోగానే పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. నాడు జరిగిన ఆ పోరాటనికి నేను ప్రత్యక్ష సాక్షిని.
ఛలో అసెంబ్లీ పిలుపులో భాగంగా ఉద్యమకారులుగా మేము ముళ్ళ కంచెలను దాటుకొని అసెంబ్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించాం. పైబర్ లాఠీలు, వాటర్ క్యాన్స్, అశ్విక దళాలు, బాష్పవాయువు తూటాలతో పోలీసు దళాలు ముప్పేటా దాడికి పూనుకొన్నాయి. నిరాయుధులైన ఉద్యమకారులకు, సాయుధులైన పోలీసు దళాలకు మధ్య హోరా హోరి పోరుసాగింది. వందలాది మంది తీవ్రంగా క్షతగాత్రులైనారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల నాయకులు మరియు కార్యకర్తలైన 22 మందిని మిగిలిన ఉద్యకారుల నుండి వేరు చేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఆ 22 మందిలో నేనొకడ్ని. దెబ్బలు తింటూనే చలించని పట్టుదలతో నడిరోడ్డుపైన బైటాయించాం. మా చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడి బలవంతంగా అక్కడే సిద్ధంగా ఉంచుకొన్న పోలీసు బస్సులోకి మమ్మల్ని తరలించారు. శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి  వెళుతున్న‌ ప్రదర్శనకారులపై పోలీసులు దమనకాండకు పూనుకోవడంతో ఆందోళనకారులు పెట్రేగిపోయారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోలీసు దళాలపై తిరగబడ్డారు. ఒక దశలో పోలీసులు పలాయనం చిత్తగించి, వ్యూహాత్మకంగా మమ్ములను నిర్భందించిన‌ పోలీసు ఎర్ర‌ బస్సు వెనకాల దాక్కొని ఎదురు దాడి చేయడానికి పూనుకొన్నారు. ఆందోళనకారులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోలిసు వాహనంలో మేమున్నామనే విషయం తెలియక దానిపై దాడికి దూసుకొస్తుంటే మా వద్ద ఉన్న కర్చీప్స్ ను చేతుల్లోకి తీసుకొని బయటికి ఊపుతూ నినాదాలు చేశాం. అది గమనించి వారు వెనక్కి తగ్గారు. మరొక వైపు మమ్ములను నిర్భందించిన ఎర్రబస్సుకు కొన్నిఅడుగుల దూరంలోనే ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఉన్నఒక పోలీసు జీపుకు ఎవరో నిప్పు పెట్టారు. ఈ దృశ్యాలు చూస్తుండగానే మేమున్న బస్సు వెనకాల నుంచి తుపాకీ తూటా పేలిన శబ్దం వచ్చింది. క్షణాల్లో మేము చూస్తుండగానే పెట్రోల్ బంక్ వైపున్న ఒక పోలీసు కానిస్టేబుల్ రక్తమోడుతూ కుప్పకూలిపోయాడు. సహచర పోలీసులు వెంటనే అతన్ని చేతుల మీద మోసుకెళ్ళి ఆసుపత్రికి తరలించారు. మరొక వైపు పోలీసు ఉన్నతాధికారుల అరుపులతో కూడిన ఆదేశాల జారీ, ఉద్యమకారులపైకి పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడం, పిట్టల్ని కాల్చినట్లు గురిచూసి కాల్చడం మొదలు పెట్టారు. ఇద్దరు యువకులు నేలకొరిగారు. విలవిల్లాడుతూ క్రింద పడిపోయిన ఆ ఇద్దరినీ సహచర ఉద్యమకారులు భుజాలపైకి ఎత్తుకొని ప్రక్కకు మోసుకెళ్ళారు. పోలీసు తుపాకి తూటాలకు బలై అమరులైన ఆ యువకిశోరాలే విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి. 
పోలీసు వ్యానులో నుండి ఈ హృదయ విదారకమైన దృశ్యాలను చూస్తూ నిస్సహాయకులుగా, ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిపోయి, తీవ్రమైన గుండె కోతకు గురైనాము. పోలీసు తూటాలు శరీరాల్లో దూసుకపోయి నేలకొరిగిన వారు, తీవ్ర గాయాల పాలైన వారు, తృటిలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకొన్న వారు, తీవ్రమైన‌ లాఠీ చార్జీలో తలలు పగిలిన వాళ్ళు, కాళ్ళు, చేతులు విరిగిన వారు హాహాకారాలు చేస్తూనే ఎర్రజెండాలను పైకెత్తి నినదిస్తూ పోరు భూమిలో వెనకడుగు వేయకుండా ధీరోదాత్తులుగా ధైర్యసాహసాలను ప్రదర్శించారు. చెల్లాచెదరైన కార్యకర్తలు తిరిగి సమీకృతులై గుంపులు గుంపులుగా, అలలు అలలుగా ప్రతిఘటనను కొనసాగించారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
ఉద్యమకారులపై హత్యా నేరం కేసు: పోలీసు కానిస్టేబుల్ ను పోలీసులే తుపాకితో లాల్చి దాన్ని సాకుగా చూపెట్టి ఉద్యమకారులపై కాల్పులు చేసి ఇద్దరు యువకులను పొట్టన పెట్టుకొన్నారు. పైపెచ్చు పోలీసుల చేతుల్లో నుంచి తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు చేశామని పోలీసు వ్యానులో నిర్భదింసచబడిన 22 మందిపై సెక్షన్ 147/148/183/332/307/435/ఆర్/డబ్లు/149/ఐపిసి మరియు సెక్షన్ 25 మరియు 27, ఐ.ఎ. య్యక్ట్, సెక్షన్ 3 మరియు 4 ఆఫ్ పిపిడి యాక్ట్ క్రింద‌ హత్యా ప్రయత్న‌ నేరం మోపి తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో భారత కమ్యూనిస్టు పార్టీ, జాతీయ సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి, సి.పి.ఐ. యం.యల్.(న్యూ డెమోక్రసీ) పార్టీ నాయకులు మరియు ఆనాడు శాసన సభ్యులుగా ఉన్నకామ్రేడ్ గుమ్మడి నరసయ్య లు మొదటి, రెండవ ముద్దయిలైతే నేను మూడవ ముద్దాయిని. అలాగే కామ్రేడ్స్ కొల్లి నాగేశ్వరరావు, మానం ఆంజనేయులు, పశ్యపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, యం.వి.ప్రసాద్, వి.సంథ్య, జి. ఝాన్సీ, నెక్కంటి సుబ్బారావు, యం.శోభన్ బాబు, దశరథ్, ఇ.టి నరసింహ, ఎం.భిక్షపతి, యం.గాలన్న, యం. సంజీవకుమార్, ఎన్.నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, కె.వి.రమణయ్య, కె. అజయ్ బాబు, మురళీచౌదరి ముద్దాయిలుగా చేర్చబడ్డారు. ఆ రోజు పోలీసు స్టేషన్ లో నిర్భందించి మరుసటి రోజు నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. మాకు సంఘీభావంగా తరలివచ్చిన‌ న్యాయవాదులతో కోర్టు ప్రాంగణమంతా నిండిపోయింది. ఆ సమయంలో సురవరం సుధాకరరెడ్డి గారిని వైద్య పరిక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో నేనే దాదాపు అరగంట పాటు జరిగిన ఘటనలను సోదాహరణంగా మేజిస్ట్రేట్ ముందు వివరించాను. 
నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను బెయిల్ రాదని భావించాం. దానికి తోడు నేను పోలీసులకు వ్యతిరేకంగా బలమైన వాదనను వినిపించిన కారణంగా బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా సొంత పూచీకత్తుపై మాకు బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వు జారీ చేశారు. అటుపై శాసన సభలో ఈ అక్రమ కేసుపై ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే సురవరం సుధాకరరెడ్డి, గుమ్మడి నరసయ్యలను మాత్రమే కేసు నుండి మినహాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ హామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సుదీర్ఘ కాలం నానబెట్టి తరువాత ఈ మధ్యనే ఆ కేసును ఉపసంహరించుకొంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వామపక్ష ఐక్యత - చేదు అనుభవం: విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో రాష్ట్ర వ్యాపితంగా మూడు నెలలకుపైగా సుదీర్ఘ పోరాటానంతనం ప్రభుత్వం మెడలు వంచడానికి "ఛలో అసెంబ్లీ" ఆందోళనా కార్యక్రమానికి తొమ్మిది వామపక్ష పార్టీలు పిలుపిచ్చాయి. ఇందిరా పార్క్ నుండి ప్రదర్శన ప్రారంభానికి ముందు జరిగిన‌ ఒక చిన్న ఘటన ఉద్యమ భాగస్వాముల మధ్య కాస్త అనైక్యతకు దారి తీయడ‍ం, పర్యవసానంగా రెండు ప్రదర్శనలుగా నిర్వహించబడడం దురదృష్టకరం. ప్రదర్శన ముందు భాగంలో ఒకే పార్టీకి చెందిన జెండాలు పట్టుకొని కార్యకర్తలు నిలబడి ఉండడంతో మిగిలిన పార్టీల కార్యకర్తలు కూడా కొంత మంది వారి జెండాలతో వెళ్ళి ముందు నిలబడ్డారు. అప్పటికే అగ్రభాగాన నిలబడి ఉన్నపార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేక మేము వేరుగా ప్రదర్శన నిర్వహిస్తామని వెనక్కివెళ్ళిపోయారు. తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు ప్రధాన బ్యానర్ పట్టుకొని ప్రదర్శనకు అగ్రభాగాన‌ నడుస్తారని, ఆ తరువాతే ప్రదర్శకులు పాల్గొంటారని నచ్చచెప్పడానికి మిగిలిన ఎనిమిది పార్టీల నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్ది పాటి తేడాతో రెండు ప్రదర్శనలూ ఒక దానివెంట మరొకటి నిర్వహించబడ్డాయి. మొదటి ప్రదర్శనలోని ఉద్యమ‌కారులు బషీర్ బాగ్ కూడలి చేరుకోగా, రెండవ ప్రదర్శనలో పాల్గొన్న వారు ప్రెస్ క్లబ్ దగ్గరలోని బాబు జగజ్జీవన్ రాం విగ్రహం వద్దకు చేరుకొన్నారు. అక్కడ జరిగిన తీవ్రమైన లాఠీ చార్జీలోనే రామక్రిష్ణ తీవ్రంగా గాయపడి అమరుడైనాడు. అనేక మంది క్షతగాత్రులైనారు. పీడిత ప్రజల పక్షాన నికార్సుగా నిలబడి త్యాగనిరతితో ఉద్యమ నిర్మాణానికి అంకితమైన వామపక్షాలు తాత్కాలిక ఆవేశాలకులోనైతే విశాల ఐక్యతకు ఏ విధంగా హాని జరుగుతుందో ఈ ఘటన తెలియజేసింది. 

Tuesday, August 26, 2014

మన ఎన్నికల వ్యవస్థ డొల్లతనం!





ఆగస్టు 26, 2014  సూర్య దినపత్రిక

మన ఎన్నికల వ్యవస్థ డొల్లతనం మరొకసారి చర్చనీయాంశమయ్యింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 31% పొందిన భారతీయ జనతా పార్టీ 282 స్థానాలలో విజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించింది. కాంగ్రెస్ పార్టీ 19.3% ఓట్లను పొందినా కేవలం 44 స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కూడా లభించలేదు. తద్వారా ప్రతిపక్ష నాయకుడి భాగస్వామ్యంతో రాజ్యాంగబద్ధమైన పదవులకు సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయవలసిన ప్రక్రియ‌ ప్రశ్నార్థకమవుతున్నది. అందువల్లనే లోక్ పాల్ ఎంపిక‌ అంశాన్నిసుప్రీం కోర్టు నిర్ధిష్టంగా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్నివివరణ కోరింది. నూతనంగా రూపొందించబడిన‌  జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకం మొదలు సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్(సి.వి.సి.), సమాచార హక్కు చట్టం అమలు కోసం ప్రధాన సమాచార‌ కమీషనర్ మరియు కమీషనర్లు, సి.బి.ఐ. డైరెక్టర్, లోక్ సభ సెక్రటరీ జనరల్ తదితర రాజ్యాంగ పదవులకు అర్హులను ఎంపిక చేసే కమిటీల్లో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడుగా ముఖ్యమైన భూమిక పోషించవలసి ఉన్నది. అధికారికంగా గుర్తించబడిన విపక్ష నాయకుడే లేని దుస్థితిలో రాజ్యాంగ పదవుల నియామక ప్రక్రియ కేవలం పాలక పార్టీ కనుసన్నల్లో తూతూ మంత్రంగా జరిగి పోయే ప్రమాదం ఉన్నది. ప్రతిపక్ష నాయకునికి స్పీకర్ అధికారిక గుర్తింపు ఇవ్వకపోయినా సభ్యుడుగా కాకుండా ఆహ్వానితుడుగా ఆయా కమిటీల్లో పాల్గొనవచ్చన్న‌ వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అది సమర్థనీయం కాదు. సభ్యుడికి ఉండే హక్కులు ఆహ్వానితుడికి ఉండవు, కేవలం  సలహాలు ఇచ్చే అవకాశమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన‌ ప్రతిపక్ష నాయకుడు కీలకమైన పాత్ర‌ పోషించాల్సి ఉండగా సాంకేతిక కారణాలు, లోపభూయిష్టమైన సాంప్రదాయాలు, దశాబ్దాల క్రితం రూపొందించుకొన్న‌ నిబంధనలను తడికెగా వాడుకొని ప్రతిపక్ష నాయకుడ్ని గుర్తించ నిరాకరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు వన్నె తెచ్చే నిర్ణయం కాదు.   
దేశంలోని పాలనా వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని, వాటిని ప్రక్షాళన చేసి పట్టాలెక్కించి, ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను పటిష్టవంతం చేసే గురుతర బాధ్యతను తలకెత్తుకొన్నానని పాలనా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజానీకానికి వాగ్దానం చేశారు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకున్ని ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించ నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తున్నటు తేలిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన సాంప్రదాయాన్ని, నియమ, నిబంధనలకు అనుగుణంగానే, న్యాయ సలహా కూడా తీసుకొన్న మీదట‌ నిర్ణయం తీసుకొన్నానని ప్రస్తుత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ విస్పష్టంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి మనోభావాలకు అనుగుణంగానే స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారనడంలో సందేహం లేదు. పతనావస్థలో ఉన్నప్రధాన‌ ప్రత్యర్థి అయిన‌ కాంగ్రెస్ పార్టీని దెబ్బ మీద దెబ్బకొట్టాలనే రాజనీతిని ప్రదర్శించారే కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లడానికి ఈ చర్య హాని చేస్తుందన్న విశాల దృక్పథం కనబరచకపోవడం మన రాజకీయ నాయకత్వం యొక్క హ్రస్వ‌దృష్టికి నిదర్శనం.
ప్రజా వ్యతిరేక పాలన సాగించిన‌ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన‌ శిక్ష విధించారు. అత్యంత అవమానకరమైన ఫలితాలతో ఆ పార్టీ కోలుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ పరిస్థితి పట్ల దేశంలో ఎవ్వరికీ సానుభూతి లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడికి లోక్ సభలో అధికారికంగా గుర్తింపు నివ్వడం, ఇవ్వకపోవడమన్నది అసలు సమస్య కాదు. కానీ దాని దుష్ప్రభావం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పని విధానంపై అనివార్యంగా పడుతుంది. ఈ సమస్యను మన ప్రజాస్వామ్యం యొక్క నాణ్యతకు సంబంధించిన అంశంగా పరిగణి‍స్తే సమాజానికి మేలు జరుగుతుంది.
స్వాతంత్ర్యానంతరం గడచిన 67 సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు సంబవించాయి. సమాజం ప్రగతి బాటలో ముందడుగు వేస్తున్నది. ప్రజాస్వామ్యంలో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాలు సముచిత పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అవినీతిరహిత, సుపరిపాలన సాగించడానికి విధాన నిర్ణయాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ఎంతైనా అవసరం. ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించడం, గౌరవించడం, సానుకూలంగా స్పందించడం ద్వారా పాలక పక్షం మెరుగైన పాలన సాగించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత‌ పటిష్టవంతం అవుతుంది. ఈ భావనతోనే రాజ్యాంగబద్ధమైన పదవులకు వ్యక్తుల ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడికి సభ్యత్వం కల్పించబడింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఆచరణ కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి తగినసాస్తి జరిగిందని కొందరు అల్పసంతోషాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాంటి భావనల వల్ల ప్రజాస్వామ్యం బలపడదు. రాజకీయ నాయకత్వం సంకుచిత ఆలోచనల బానిసత్వం నుండి విముక్తి చెంది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచన చేయాలి.
ఇంత బ్రతుకు బ్రతికి, ఇంటి వెనకాల పడి చచ్చినట్లు అన్న లోకోక్తిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారయ్యింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కోసం ప్రయత్నించి బంగపడింది. స్వాతంత్య్రానంతరం గడచిన 67 సంవత్సరాలలో దాదాపు 55 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారాన్నివెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంతటి హీనస్థితికి దిగజారిపోయిందో ఈ ఘటనే ప్రబల నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు మన‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ బ్రష్టు పట్టించింది. సత్ సాంప్రదాయాలను నెలకొల్పడానికి బదులు సంకుచిత దృక్పథంతో వ్యవహరించింది. ఫలితంగా నేడు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నా తమ నాయకుడికి చట్టబద్ధంగా ప్రతిపక్ష నాయకుడి హోదాను దక్కించుకోలేక పోయింది.  
పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సముచిత‌ పాత్ర పోషించినప్పుడు మాత్రమే ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి వీలౌతుంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. జాతి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. ప్రతిపక్షం అప్రమత్తంగా ఉంటూ పాలక పక్షం అనుసరించే విధానాలలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎండ గడుతూ, ప్రజానుకూల విధానాల నుండి ప్రభుత్వం గాడి తప్పుతున్నప్పుడు స్పందించి సద్విమర్శ చేస్తూ తన బాధ్యతను సమర్థవంతగా ప్రతిపక్షం నిర్వహించినప్పుడు, పాలక పక్షం జవాబుదారితనంతో ప్రతిపక్షం వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా పాలన సాగించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేసింది. ఆ తప్పుడు మార్గంలోనే మోడీ పయనిస్తూ విపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం చేయడం ద్వారా రాజకీయ లబ్ధిపొందుదామని భావిస్తే దేశానికి మంచిది కాదు.
ఇటీవల జరిగిన సాధారణ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య 543లో 10% స్థానాలు అంటే 55 కూడా దక్కక లేదన్నది వాస్తవమే. కానీ పోలైన ఓట్లలో 19.3% ఓట్లు ఆ పార్టీకి లభించాయన్న వాస్తవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. లోక్ సభ నిర్వహణకు అవసరమైన కోరమ్ సంఖ్య 55, ఆ సంఖ్య కంటే తక్కువ బలం ఉన్న పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించ కూడదన్న నియమాన్ని, సాంప్రదాయాన్నిగతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రాజనీతినే నేడు బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ. కూటమి లోక్ సభ స్పీకర్ ద్వారా అమలు చేయించడ‍ం దుస్సాంప్రదాయాన్ని కొనసాగించడమే అవుతుంది.
ఈ అంశాన్ని121(1) నిబంధన‌ క్రింద లోక్ సభ స్పీకర్ ఆదేశాల పరిథిలోకి తెచ్చారు. పార్లమెంటు సభ్యులకు చెల్లించ వలసిన వేతనాలు, భత్యాల చట్టం - 1977 లో ప్రతిపక్ష నాయకునికి చెల్లించాల్సిన జీత భత్యాల అంశాన్ని కూడా పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాను కేవలం జీత భత్యాల చెల్లింపు అంశంగా పరిగణించడమే తీవ్ర అభ్యంతరకరమైనది.
ప్రథమ లోక్ సభలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎ.కె.గోపాలన్ ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించబడ్డారు. అటుపై 1969 వరకు, ఆ తరువాత 1970 డిసెంబరు నుండి 1977 జూన్ మధ్య కాలంలోనూ, 1979 ఆగస్టు మొదలు 1989 డిసెంబరు వరకు అధికారికంగా గుర్తింపు ఉన్న ప్రతిపక్ష నాయకుడు లోక్ సభలో లేరు. కాంగ్రెస్ పార్టీ నైజానికి ఇది ప్రబల నిదర్శనం. ఆ కుటిల నీతినే కొనసాగించాలనడంలో ఔచిత్యం ఉన్నదా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ హితం దృష్ట్యా ఆలోచించాలి.
దేశంలో మొత్తం 83,41,01,479 ఓట్లు ఉంటే వాటిలో పోలైన ఓట్లు 55,38,01,801 (66.4%). భాజపాకు వచ్చిన ఓట్లు 17,16,57,549(31%). అంటే మొత్తం ఓట్లలో 20.58% మాత్రమే. ఈ ఓట్లతోనే లోక్ సభలోని మొత్తం 543 గాను 282 స్థానాలను సంపాదించుకొని, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసు పార్టీకి పోలైన ఓట్లలో 10,69,38,242 (19.3%)  వచ్చినా కేవలం 44 స్థానాల్లోనే విజయం సాధించింది. లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10% అంటే 55 స్థానాల బలం ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత లభించదు. అమలులో ఉన్న సాంప్రదాయం, నిబంధనల పరిథిలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదాను లోక్ సభ స్పీకర్ తిరస్కరించడాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ వైఖరినే ప్రదర్శించింది కాబట్టి స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీ కోల్పోయింది.  బి.యస్.పి. కి 2,29,46,182(4.1%) ఓట్లు వచ్చినా ఒక్క స్థానం కూడా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల విధానం ఎంతటి లోపభూయిష్టంగా ఉన్నదో ఈ గణాంకాలను బట్టి బోధపడుతుంది.
పార్టీలకు వచ్చిన ఓట్లకు, సీట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి దామాషా ఎన్నికల విధానాన్ని అమలు చేస్తే తప్ప ప్రజా ప్రాతినిథ్య సభ అయిన లోక్ సభలో పార్టీల వాస్తవిక బలాబలాలు, ప్రజాభిప్రాయం ప్రతిబింబించే అవకాశం లేదు. తాజా పరిణామాల పూర్వరంగంలోనైనా ఎన్నికల సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థవంతంగా తీర్చిదిద్దడం, పటిష్టవ‍త‍ం చేయడమన్నదే ధ్యేయంగా పెట్టుకోవాలి.



Monday, August 18, 2014

సర్వేనా! అఫిడవిట్ల సేకరణా!




సమగ్ర కుటుంబ‌ సర్వే అంటే శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలను సేకరించుకోవడం. దానిపై అభ్యంతరం ఎందుకుండాలని కొందరు అమాయకంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. నేను జి.హె.యం.సి. వెబ్ సైట్ లో పెట్టిన సర్వే నమూనా పత్రాలను పరిశీలించిన మీదట నాలో జనించిన ఆలోచనలను మిత్రులతో పంచుకొంటున్నాను.  రాజకీయాలకు, ప్రాంతీయ దురభిమానాలకు అతీతంగా, ప్రజాస్వామ్యయుతంగా, హేతుబద్ధంగా ఈ అంశాలపై దృష్టి సారించి, ఆలోచించి, ఒక నిర్ధారణకు రావాలని మనవి. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరుతో పౌరుల నుండి డిక్లరేషన్ పేరుతో అఫిడవిట్ లను తీసుకొంటున్నది. సర్వే ఐచ్ఛికమని హైకోర్టుకు తెలియజేసింది. భారత ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో పౌరుల నుండి సమాచారాన్ని సేకరించుకొంటుందే గానీ "అఫిడవిట్స్"ను కోరదు. భారత జననగణన‌ చట్టం మేరకు ఈ సర్వే నిర్వహించడ‍ం లేదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్టబద్ధంకాని సర్వేలో పౌరుల నుండి "నాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు" అని అఫిడవిట్స్ కోరడంలోని లోగుట్టేంటో ముందు బహిర్గతం చేయాలి. ప్రభుత్వమన్నాక పారదర్శకంగా, జవాబుదారితనంతో వ్యవహరించాలి. అందులోనూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం.
పౌరుల జనన ధృవీకరణ పత్రం నకలును సర్వేలో భాగంగా సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలోని ఆంతర్యమేమిటి? స్థానికులు, స్థానికేతరులు అన్న వర్గీకరణ చేసుకొని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న‌ సంక్షేమ పథకాల అమలులో తెలుగు ప్రజల మధ్య‌ వివక్షత ప్రదర్శించాలనే దుర్భుద్ధి ఉందనే అనుమానాలు బలంగా వేళ్ళూనుకొన్న పూర్వరంగంలో సర్వే నిర్వహించబడుతున్నది. గోరుచుట్టపై రోకటి పోటన్నట్లు రాష్ట్ర విభజనతో కుదేలై ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ హైదరాబాదీయులను లక్ష్యంగా చేసుకొని 1956 సంవత్సరాన్ని ప్రాతిపథికగా స్థానికతను నిర్ధారిస్తామని పదేపదే తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ఆ మాటలు భారత రాజ్యాంగం, చట్టం ముందు చెల్లుబాటు కావని కొంత మంది మాహా మేధావులు తేలికగా కొట్టిపారేయవచ్చు. కానీ, రాష్ట్ర విభజన తరువాత‌ అభద్రతకులోనౌతున్న పామరులు, అసంఘటిత కార్మికులు, పేద జనం, ఉద్యోగ వర్గాలనే లక్ష్యంగా చేసుకొని బలవంతపు వలసల వైపు ఆ తరగతి ప్రజలను నెట్టి, తద్వారా లబ్ధి పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయంగా టి.ఆర్.యస్. పార్టీ ఆలోచన చేస్తున్నట్లు కనబడుతున్నది. నిజంగా అలాంటి కుట్ర దాగివున్నదేమో! కాస్త విజ్ఞతతో అందరూ ఆలోచించాలి. పైపెచ్చు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ  ప్రసారమాధ్యమాలలో ఆధారాలతో సహా వార్తలు ప్రసారమవుతున్నాయి.
పౌరుల స్థిర/ చరాస్థుల వివరాలు, దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బందికి ఎందుకివ్వాలి? పౌరుల‌ ఆస్థులకు రక్షణ మాటేమిటి? లాండ్ మాఫియాలు పట్టా భూములను కూడా ఆక్రమించుకొని అవినీతి కూపంలో కూరుకపోయిన రిజిస్ట్రేషన్ అధికార యంత్రాంగం సహకారంతో ఏకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్స్ య‌దేచ్ఛగా చేసేస్తున్నారు. అదేంటంటే ఆస్తుల అసలు హక్కుదారుడెవరో విచారించే పని మాది కాదని తప్పించుకొనడానికి, రిజిస్ట్రేషన్ చట్టాన్ని తడికెగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూములు, భవనాలు, అపార్ట్ మెంట్స్ ఆక్రమణలకు గురై అసలు హక్కుదారులు లబోదిబో మంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో ఆస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే నిమిత్తం ఇంటింటికి పంపబడుతున్న ప్రభుత్వ సిబ్బంది లేదా కార్యకర్తలకు అప్పగించాలని ప్రభుత్వం కోరడం తీవ్ర అభ్యంతరకరమే కాదు, చట్ట విరుద్ధం, బాధ్యతారాహిత్యం, అత్యంత ప్రమాదకరం. పౌరులను ఇబ్బందుల పాలు చేసే ప్రమాదకర చర్య. స్థిరాస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బంది నాలుగు డబ్బులకు అమ్ముడుపోయి లాండ్ మాఫియాలకు, దందాలు చేసి అక్రమార్జనకు పాల్పడే రౌడీలు, గూండాలకు అందజేయరని, ఒకవేళ అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చట్టబద్ధమైన "అఫిడవిట్"ను పౌరులకు ఇస్తుందా?
పౌరులందరి నుండి పాన్ కార్డు నంబర్లను, బ్యాంకు/ పోస్టాఫీసు ఖాతాల నంబర్లు, ఏఏ బ్రాంచీలలో ఉన్నాయో! అలాగే ఆ వివరాలున్న పాస్ బుక్ లోని మొదటి పేజీ జిరాక్స్ కాపీలను ఎందుకివ్వాలి? నగదు బదిలీ పథకాన్ని అమలు చేసినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించే సందర్భంలో బ్యాంక్ అకౌంట్ నంబరు అడిగి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ పౌరులందరి వ్యక్తిగత ఖాతాల వివరాల సేకరణ ఎందుకోసం? ఖాతా నంబర్లను ఎవ్వరికీ తెలియజేయవద్దని బ్యాంకుల నుండి తరచూ ఖాతాదారులకు యస్.ఎం.యస్.లు వస్తుంటాయి. అంటే ఖాతాలోని డబ్బును ఎవరు తస్కరించకుండా ఖాతాదారుల రక్షణార్థం బ్యాంకులు ఈ తరహా సమాచారాన్ని చేరవేస్తున్నాయి.
సర్వేని జవాబుదారితనంతో, పారదర్శకంగా, అపార్థాలకు తావివ్వని రీతిలో ఏ ప్రభుత్వమైనా చేయవచ్చు. అందులో భాగంగా పౌరుల నుండి సొంత ఇల్లు ఉన్నదా? ఉంటే ఏ తరహా ఇల్లు? ఫోన్/మొబైల్ ఉన్నదా? గ్యాస్ కనెక్షన్ ఉన్నదా? రెండు చక్రాలు/మూడు చక్రాలు/నాలుగు చక్రాల వాహనాలున్నాయా? ఆస్తి పన్ను కడుతున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి‍పొందుతున్నారా? సాగు భూమి లేదా ఇంటి స్థలం ఉన్నదా? వగైరా సాధారణ‌ సమాచారాన్ని పౌరుల నుండి శాస్త్రీయ పద్ధతులలో సేకరించుకొని దారిద్ర్యారేఖకు దిగువనున్న జనాభా గణాంకాలను వర్గీకరించుకొని సంక్షేమ పథకాల అమలులో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ కార్యాచరణను రూపొంది‍చుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలా చేస్తే పౌరులు కూడా అభ్య‍తరం చెప్పరు. పైపెచ్చు అలాంటి ప్రక్రియలో భాగస్వాములు కావడ‍ం పౌరుల బాధ్యత కూడా.
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే హేతుబద్ధతపై తెలంగాణా సమాజం కూడా స్పందించాలి.