Sunday, September 21, 2014

APWJF చర్చా వేదిక; అంశం: ఆంధ్రప్రదేశ్ విభజన‍‍‍-ప్రభావం; నా పత్రం.


విజ్ఞప్తి: ఆంధ్రప్రదేశ్ విభజన-ప్రభావం అన్న అంశంపై నూతన రాజధానిగా ప్రకటించబడిన‌ విజయవాడలో సెప్టంబరు 20, 2014 వ తేదీన‌ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు పెడరేషన్ చర్చా వేదికను నిర్వహించింది. ఆచార్యులు యన్.అంజయ్య సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ చర్చా కార్యక్రమానికి నాగార్జునా విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాతో పాటు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథులు, నాగార్జునా విశ్వవిద్యాలయం ఆచార్యులు, జిల్లా సమాచార శాఖ‌ విశ్రాంత అధికారి ఒకరు  చర్చలో పాల్గొన్నారు. ఎ.పి.డబ్లు.జె.ఎఫ్. నాయకత్వంతో పాటు మరికొందరు విలేఖరులు, తదితరులు హాజరయ్యారు. నేను మాట్లాడడంతో పాటు కొన్ని అంశాలపై వ్రాత పూర్వకంగా తయారు చేసుకొని పోయిన‌ పత్రాన్నినిర్వాహకులకు అందజేశాను. దాన్ని నా బ్లాగ్, ఫేస్ బుక్, _మెయిల్స్ ద్వారా మిత్రులతో పంచుకొంటున్నాను. కాస్త పెద్దదిగా అనిపించినా ఆసక్తి ఉన్న వారు చదివి, స్పందించి మీ విలువైన అభిప్రాయాలను తెలయ‌జేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ విభజన -  ప్రభావం

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల పాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అనుసరించిన పద్ధతులు ప్రజాస్వామ్య పునాదులనే బలహీనపరిచాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం అపవిత్ర కలయికతో ఎంతటి నిరంకుశమైన చట్టానికైనా పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ప్రపంచమంతటికీ తెలిసిపోయింది. అత్యధిక ప్రాంతీయ పార్టీలు వ్యక్తం చేసిన‌ అభిప్రాయాలకు వీసమంత విలువ ఇవ్వలేదు. దేశ వ్యాపితంగా వెల్లువెత్తుతున్న‌ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్సును పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రాల విభజనకు ఒక జాతీయ విధానమంటూ లేక పోయింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను మాత్రం నిర్ధాక్షిణ్యంగా, నిరంకుశంగా రెండుగా చీల్చేశారు. ఈ పరిణామం భారత దేశ సమాఖ్య వ్యవస్థకే ప్రమాదకరం.
సుదీర్ఘ పోరాటాలు, అపారమైన‌ త్యాగాలతో తెలుగు జాతి సాధించుకొన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ స్వార్థ‌ రాజకీయాలకు బలైపోయింది. తెలుగు జాతి ఒకే పరిపాలనా వ్యవస్థలో ఉంటూ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశం చేజారిపోయింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న‌ నినాదం కలగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, విషభీజాలు నాటబడ్డాయి. రెండు రాష్ట్రాల‌ మధ్య జఠిలమైన సమస్యలున్నాయి. పర్యవసానంగా ఎడముఖం, పెడముఖంగా కొత్త జీవితం మొదలయ్యింది.
పదమూడు జిల్లాలతో కూడిన‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థకున్న సహజ లక్షణాలకు అనుగుణంగానే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1960-80 దశాబ్దాల మధ్య‌ కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.యల్., బి.హెచ్.ఇ.యల్., ఐ.డి.పి.యల్., హెచ్.యం.టి., మిధాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం, బి.హెచ్.పి.వి., యన్.టి.పి.సి. లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది. ఈ భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా ప్రధానంగా హైదరాబాదు, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలుగా పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు ఏ ఒక్క ప్రభుత్వమూ కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగానే, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధంతా కేంద్రీకరించబడింది. సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉపాధికల్పనావ‌కాశాలు మెండుగా కల్పించబడ్డాయి. ఈ అభివృద్ధి ఫలాల నుంచి ఉమ్మడి రాష్ట్ర ఖజనాకు అత్యధికంగా ఆదాయం ఒనగూడుతూ వచ్చింది. ఆ అభివృద్ధిలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల శ్రమ, పెట్టుబడులు ముఖ్యమైన భూమిక పోషించాయి. విభజనతో ఆ అభివృద్ధి చెందిన ఆర్థిక వనరుల నుండి, మౌలిక సదుపాయాల నుండి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను వేరు చేసి, లక్షా పది వేల కోట్ల‌ అప్పుల భారంతో, పారిశ్రామిక ఉపాథి అవకాశాలు లేని, రాజధాని నగరం కూడా లేని అనాధలుగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలను వీధిన పడేశారు.
1990 నుండి ఆర్థిక స‍ంస్కరణల యుగం నడుస్తున్నది. ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడడం కాదు గదా! ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడుల‌ ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. పారిశ్రామికంగా వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రత్యేకించి కరవుకాటకాలతో మగ్గిపోతున్న రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్రను సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేయించాలంటే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణల విధానాల అమలును వేగవ‍తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పోకడలు చూస్తే ప్రభుత్వ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు తక్కువే. విభజన చట్టంలో రేఖా మాత్రంగా ప్రస్తావించిన అంశాలను పరిశీలించినా, తాజా కేంద్ర వార్షిక‌ బడ్జెట్ ను గమనించినా నిరాశాజనకంగానే ఉన్నది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ మేరకు ఆర్థిక సహాయం అందిస్తారో ప్రధాన మంత్రి నోటి నుండి స్పష్టమైన వాగ్ధానం కూడా వినపడలేదు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ భారమంతా ప్రయివేటు పెట్టుబడులపై మోపే ఆలోచనలే చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ దోరణి వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఏ మాత్రం దోహదపడదు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగిందన్న అభిప్రాయాలను ఇటీవల కొందరు ప్రముఖులు వ్యక్త‍ చేశారు. విభజన వల్ల  జరిగిన వినాశనాన్ని కళ్ళుండీ చూడలేని కబోదులా వారు అనిపిస్తోంది. విభజన వల్ల గుండె కోతకు గురైన ప్రజానీకంలో కసి, పట్టుదల పెరిగింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసుకోవాలన్న తపన ప్రజల్లో కనబడుతున్నది. వారి కలను సాకారం చేయగల రాజకీయ నాయకత్వం కావాలన్న కోరిక విభజనానంతర‍ం జరిగిన ఎన్నికల్లో ప్రస్ఫుటంగా వెల్లడయ్యింది. ఇదొక్కటే ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధికి నేడు అందివచ్చిన‌ సానుకూలాంశం.
తెలంగాణా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ప్రధానంగా హైదరాబాదుపై ఆధారపడి ఉన్నది. అందుకే హైదరాబాదుకున్న‌ 'బ్రాండ్ ఇమేజ్'ను నిలబెట్టుకోవడమన్నది తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న‌ అతిపెద్ద సవాలు. అప్పులను జనాభా ప్రాతిపదికపై పంచి, విద్యుత్తును మాత్రం వినియోగం ప్రాతిపదికపై 52% కేటాయించినా విద్యుత్ కొరతతో విలవిల్లాడి పోయింది. కాకపోతే, విభజన వల్ల‌ కొంత మందికి రాజ్యాధికారం దక్కింది. తెలంగాణ సమాజానికి జరిగిన మేలేంటో నిర్ధిష్టంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలున్నారనిపిస్తుంది. స్థూలంగా రాష్ట్ర విభజనతో తెలుగు నాట ప్రజాస్వామ్యం బలహీనపడింది. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక ప్రజానీకానికి, వెనుకబడిన మరియు కరవు పీడిత ప్రాంతాలకు తీరని అన్యాయం జరిగింది.
రాజకీయ రంగం: విభజన తరువాత‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో పెనుమార్పులు సంబవించాయి. గతంలో 16 సం.ల పాటు అధికారంలో ఉండిన కాంగ్రెసేతర‌  ప్రాంతీయ పార్టీ అయిన‌ తెలుగు దేశంకు, ప్రత్యేకించి పాలనానుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ప్రజలు అధికారాన్ని అప్పగించారు. మరొక ప్రాంతీయ పార్టీ అయిన వై.యస్.ఆర్.కాంగ్రెసును ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. టిడిపితో పొత్తు పెట్టుకొని భాజపా నాలుగు స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల తీరుతెన్నులను చూశాం. విభజన పర్యవసానంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటపడాలి, ప్రజలెదుర్కొంటున్న‌ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సన కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలను ఎలా రాబట్టుకోవాలి, అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలేంటి, నదీ జలాల సమస్య తదితర అంశాలపై చట్ట‌ సభలో చర్చించడానికి బదులు ఏ విధంగా సమయాన్ని వృధా చేశారో చూశాం. ఈ రీతిలోనే ఐదేళ్ళ కాలం శాసనసభా పనితీరు ఉంటే రాష్ట్ర ప్రగతికి చట్టసభ ఎలాంటి దిశానిర్ధేశం చేస్తుందో! ఊహించవచ్చు.
ఆంధ్ర రాష్ట్రం, అటుపై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక గడచిన 61 సం.లలో 44 స‍ం.ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేటి శాసన సభలో ప్రాతినిథ్యానికే నోచుకోలేదు. తెలంగాణ సమస్యను తమ అంబుల పొదలో భద్రపరుచుకొని సంకుచిత‌ రాజకీయ లబ్ధి కోసం అవసరం వచ్చినప్పుడల్లా వాడుకొంటూ వచ్చిన ఆ పార్టీ అంత్యమంగా తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి ఫలితం అనుభవించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని హీనస్థితిని ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఛీత్కారానికి గురై శాసనసభలో ఉనికి కోల్పోవడమే కాదు తమ అభ్యర్థులు అవమానకరమైన రీతిలో దరావత్తులు కోల్పోయారు.
తెలుగు జాతి ఐక్యత కోసం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో ఆంధ్ర రాష్ట్ర సాధన, అటుపై ఆంధ్రప్రదేశ్ సాధన, 1969 మరియు 1972 విచ్ఛిన్నకర ఉద్యమాలను దీటుగా ఎదుర్కొని సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడంలో క్రియాశీలమైన పాత్ర పోషించిన కమ్యూనిస్టుల ప్రాతినిథ్యం నేటి శాసన సభలో లేకుండా పోయింది. ఒకనాడు పాలక పార్టీ అయిన‌ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులుగా వెలుగొందిన కమ్యూనిస్టులు సోదిలోనే లేకుండా పోవడం శ్రామిక ప్రజానీకానికి తీవ్రహాని కలిగించే దుష్పరిణామం. తెలుగు జాతి ఐక్యతను పరిరక్షించడంలో నిబద్ధతతో, స్థిరమైన‌ విధానాన్ని అనుసరిం‍చక పోవడంతో ఆ పార్టీలు ప్రజల నిరాధరణకు గురైనాయి.
రాష్ట్ర‌ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ పార్టీల వ్యవస్థ బాగా బలహీనపడిందనిపిస్తుంది. ఆ మేరకు ప్రజాస్వామ్యం కూడా బలహీనపడిందనే భావించాలి. రాజధాని ఎక్కడన్న జఠిలమైన‌ సమస్యను తేల్చకుండా పార్లమెంటు ముందుకొచ్చిన‌ విభజన చట్టానికి మద్ధతు పలికిన పార్టీలు రాజధాని ఎక్కడన్న అంశంపై అభిప్రాయం చెప్పే నైతిక హక్కునే కోల్పోయాయి. దీన్ని ఆసరాగా చేసుకొని రాజధాని ఎంపిక ప్రక్రియలో శాసనసభలో ప్రాతినిథ్యం లేని పార్టీలను సంప్రదించాల్సిన అవసరమేలేదన్న దోరణిని పాలక పక్షం ప్రదర్శించింది. ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేయడానికి దోహదపడవు.
నదీ జలాల సమస్య: ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక‌ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటంలో అంతర్భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల‌  కాంగ్రెస్ నాయకులు 1937లో చేసుకొన్న చారిత్రాత్మకమైన "శ్రీబాగ్ ఒడంబడిక" బుట్టదాఖలా చేయబడింది. కృష్ణా, తుంగభద్ర నదీజలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొని మొండి చేయి చూపెట్టారు. పర్యవసానంగా దశాబ్దాల పాటు వెనుకబాటుతనానికి ఆ ప్రాంతం గురయ్యింది. ఇప్పుడు విభజన వల్ల‌ రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్నభారీ నీటిపారుదల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ఆ ప్రాంతానికి కేటాయించిన‌ నికర జలాలను కూడా తెలంగాణ వారు వివాదాస్పదం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి నీటి సమస్య జీవన్మరణ సమస్య గా పరిణమి‍చింది. 1. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ కు 19 టియంసిల నికరజలాలను కేటాయించి, కేంద్ర జల సంఘం ఆమోదముద్రతో 1981 సం.లో నిర్మాణాన్ని మొదలుపెట్టినా ఇంకా పూర్తికాలేదు. ఆ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి 11 టియంసిల కేటాయింపే ఉన్నదని తెలంగాణ వారు వివాదాన్నిలేవదీస్తున్నారు. 2. అత్యంత కరవు పీడిత జిల్లా అయిన అనంతపురం జిల్లాలో నిర్మించబడిన పి.ఎ.బి.ఆర్.కు తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టి.యంల.సి.లను సర్దుబాటు చేసి ఆ మేరకు ప్రత్యామ్నాయంగా కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి నీటిని కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.జారీ చేసింది. దాన్నితెలంగాణ వారు వివాదాస్పదం చేస్తున్నారు.
యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్ కు చేసిన కేటాయింపులను వివాదాస్పదం చేస్తే కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టి.యంల.సి.లను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ప్రాజెక్టుకు కేటాయించిన అంశాన్ని అనివార్యంగా వివాదాస్పదం చేయవలసి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపుల సర్దుబాట్లను గౌరవిస్తే ఉభయులకు మేలు.
3. ముఖ్యమంత్రిగా యన్.టి.రామారావుగారు 1983 ఏప్రిల్ 27న తెలుగు గంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే గాలేరు‍-నగరి సృజల స్రవంతి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు 1989లో శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర విభజన మూలంగా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న‌ తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు లభించని దుస్థితి నెలకొన్నది.
క్రిష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు భిన్నంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి నదీ పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక‌ రాష్ట్రాలకు కూడా కేటాయింపులు చేసింది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన హాని చేసింది. విభజనతో తెలంగాణ రాష్ట్రం కూడా పై రాష్ట్రాల జాబితాలో చేరడంతో దిగువనున్నఆంధ్రప్రదేశ్ నీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మిగులు జలాలలో చుక్క నీరు క్రిందికి ప్రవహించని పరిస్థితులు నెలకొంటున్నాయి. జూరాలా జలాశయం కేంద్రంగా ఇప్పటికే మిగులు జలాల ఆధారంగా నెట్టంపాడు(22 టియంసి) నిర్మాణంలో ఉన్నది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 160 టియంసి ల మిగులు జలాల తరలింపుకు వీలుగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, జూరాల-పాకాల అనుసంధాన‌ పథకాన్ని చేపట్టడానికి సంకల్పించింది. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగిందని, వివిధ పథకాలకు 379 టియంసిలను అదన‍ంగా కేటాయించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కృష్ణా నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన, నిర్మించబడుతున్న ప్రాజెక్టులన్నింటికీ శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి కాలువ, యస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్(10 టియంసి)లకు నికర జలాలు, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ -నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు మిగులు జలాలు శ్రీశైలం జలాశయం నుండే విడుదల చేయాలి. ఈ జలాశయం నుండి కూడా అధిక నీటిని తరలించుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న‌ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం జలాశయంలో 805 అడుగులు మరియు యస్.యల్.బి.సి. ప్రాజెక్టుకు 824 అడుగుల యం.డి.డి.యల్. నుండి నీటిని తీసుకెళ్ళడానికి వీలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల నీటి మట్టం ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మిగులు జలాల్లో చుక్క నీరి క్రిందికి ప్రవహించకుండా చేసేలా ఉంది. అందుకే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు నీటి సరఫరాకు అవరోధం కలగకుండా ఉండాలంటే ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జి.ఓ.నెం.69ని సవరించి శ్రీశైలం జలాశయం వద్ద‌ 854 అడుగుల నీటి మట్టాన్ని పరిరక్షించాలని రాయలసీమ ప్రాంత ప్రజలు డిమాండు చేస్తున్నారు.
అలాగే, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు 150.5 టి.యం.సి.లు అవసరం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా నిర్మించబడుతున్న‌ పోలవరం నుండి కృష్ణా డెల్టాకు మళ్ళించే 80 టి.యం.సి. లలో మన‌ రాష్ట్రానికి దక్కే 45 టి.యం.సి.లకు తోడు పులిచింతల జలాశయం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 40 టి.యం.సి.లు, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ, పంట మార్పిడి మరియు నీటి వినియోగంలో పొదుపు చర్యల‌ ద్వారా మొత్తం 150 టి.యం.సి.లను ఆదా చేసి ఈ ప్రాజెక్టులకు నికరజలాలను కేటాయించాలి. రాయలసీమ ప్రాంతం మనుగడ సాగిస్తూ అభివృద్ధి మార్గంలో అడుగు ముందుకు వేయాలంటే ప్రాణాధారమైన కృష్ణా నదీ జలాలను సత్వరం మళ్ళించడం ద్వారా గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపెడితే అపారమైన భూసంపదను, ఖనిజ సంపదను, మానవ వనరులను ఉపయోగించుకొని వ్యవసాయకంగా, పారిశ్రామికంగా శ‌రవేగంతో అభివృద్ధి చెందడానికి రాయలసీమ ప్రాంతంలో పుష్కలంగా అవకాశాలున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పోలవరం నుండి ఆంధ్రప్రదేశ్ కు లభించే 45 టియంసి లను తమకే ఇవ్వాలన్న డిమాండును ముందుకు తెస్తున్నది. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్ళున్నాయి. దుమ్మగూడెం-నాగార్జున సాగర్ టేల్ పాండ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే దాదాపు 160 టియంసిలను గోదావరి నుండి తరలించవచ్చు. తద్వారా ఉభయ రాష్ట్రాలకు నీటి అవసరాలు తీరుతాయి. ఆ వైపు చర్చలు జరపాలి.
అభివృద్ధి నమూనా: ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకొంటూ, ప్రణాళికా వ్యయాన్ని పెంచుకొంటూ పోతేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. ఇటీవలి చర్యలు చూస్తే ప్రణాళికేతర వ్యయాన్నే పెంచుకొంటూ పోతున్నారు. వీటి ద్వారా స్థిరాస్థులు పెరగవు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగదు, ఆదాయ వనరులు పెరగవు, అప్పులు మాత్రమే పెరుగుతాయి. పారిశ్రామికంగా వెనుకబడ్ద ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెడితేనే ప్రారిశ్రామికాభివృద్ధి సమతుల్యంగా సాగుతుంది. ప్రభుత్వం అమలు చేయ‌బోయే ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధి పథకాలేవైనా వికేంద్రీకరణ దృష్టితో రూపొందించి, అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని ప్రాంతాల  సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టినట్లవుతుంది. లేనిపక్షంలో ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి నుంచే ప్రత్యేక‌ తెలంగాణ వాదన వినిపించినట్లే నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుండే ప్రత్యేక రాయలసీమ వాదనను కొందరు వినిపిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము నిర్లక్ష్యానికి గురౌతున్నామనే భావన‌ వెనుకబడిన ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న నేపథ్యంలో భవిష్యత్ పథకాల అమలులో జాగ్రత్త వహించకపోతే మరొక విచ్ఛిన్నకర ఆందోళనకు భీజాలు నాటినట్లవుతుంది.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య సామాజికాభివృద్ధిలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి. రాయలసీమ అత్యంత వెనుకబడి, వరుస కరవులతో అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. రాష్ట్ర తలసరి ఆదాయం రు. 74,525. రాయలసీమ ప్రాంతలోని మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు రాష్ట్ర తలసరి ఆదాయం కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం జిల్లాల వారిగా తలసరి ఆదాయాలు: 1) విశాఖపట్నం రు. 1,09,800 , 2) క్రిష్ణా రు. 89,398,3) ప్రకాశం రు.81,516,   4) గుంటూరు రు.78,762, 5) నెల్లూరు రు.78,537, 6) పశ్చిమ గోదావరి రు. 78,345, 7)  తూర్పు గోదావరి రు.75,977, 8) అనంతపురం రు.75,463 9) కడప రు.66,015 10)  చిత్తూరు రు.64,816 11) విజయనగరం రు.60,178 12) కర్నూలు రు. 57,311 13) శ్రీకాకుళం రు.52,701. ప్రస్తుతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఏకైక మహానగరం విశాఖపట్నం. ఆ జిల్లా తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే ప్ర‌థమ స్థానంలో ఉన్నది. మధ్య కోస్తాంధ్ర వ్యవసాయాభివృద్ధిలో ముందంజలో ఉన్నది. వ్యవసాయాధార పరిశ్రమలున్నాయి. ఓడ రేవులు, కృష్ణా-గోదావరి లోయలో లభించే సహజవాయువు నిక్షేపాలు, పరిశ్రమల పర్యవసానంగా తలసరి ఆదాయం ఎక్కువ. ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించే సందర్భంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, వెనుకబడ్ద ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్థిక ప్రగతికి చోధక శక్తిగా ఉపకరించే విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నచొరవ బాగుంది. రాయలసీమ ప్రాంతంలో సౌర విద్యుదుత్పాదనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనే వైపు నిర్ధిష్టమైన చర్యలు చేపట్టింది.
జిల్లాకొక ఓడరేవు నిర్మిస్తే "వయబులిటీ" ఉన్నదో లేదో ఆలోచించాలి. విశాఖ, కాకినాడ, క్రిష్ణపట్నంలలో నాలుగు పెద్ద ఓడరేవులున్నాయి. మచిలీపట్నంతో పాటు ఇంకా ఒకటి రెండు ప్రతిపాదనల్లో ఉన్నాయి. వీటన్నింటికీ సరిపడ వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయా! అన్నది అనుమానమే. ప్రతి జిల్లాలో విమానాశ్రయాలు అవసరమా? అభివృద్ధి పథకాలను అమలు చేసేటప్పుడు ప్రాధాన్యతలు అవసరం. విశాఖ-కాకినాడ పెట్రో కారిడార్, విశాఖ-చెన్నయ్, బెంగుళూరు-చెన్నయ్, హైదరాబాదు-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు చెప్పుకోవడానికి ఇవన్నీ బాగున్నాయి. వీటికి పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తాయి, ప్రభుత్వాల పాత్ర ఏమిటి? భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహారభద్రత, ప్రజల జీవనోపాథి వగైరా అనేక సమస్యలున్నాయన్న విష‌యాన్ని మరిచిపోకూడదు. దేశంలో అమలు చేయబడుతున్న‌ఆశ్రిత పెట్టుబడిదారి విధానాల పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం. సహజ వనరులను ఏ విధంగా లూటీ చేస్తున్నారో, సామాన్య ప్రజలను వీధిన పడేస్తున్నారో గమనిస్తునే ఉన్నాం.
ఉపాథి కల్పన: ఉద్యోగులకు జీతభత్యాలే చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, సంక్షేమ పథకాలకు నిథులను కేటాయించి పేదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకాన్ని సామాజిక బాధ్యతగా ఆదుకొంటూ, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి రైతు రుణ మాఫీ లాంటి పథకాలకు నిథులను సమీకరించుకొంటూ, అత్యధికులకు ఉపాథి కల్పిస్తున్న‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించాల్సిన గురుతరబాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. హైదరాబాదును కోల్పోవడంతో యువత ఉపాథి అవకాశాలను కోల్పోయింది. నూతన రాష్ట్రంలో యువతకు ఉపాథి కల్పన అతిపెద్ద సవాలుగా ఉన్నది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, ఉత్పత్తి, సేవా రంగాలలో, వ్యవసాయ రంగంలో ఉపాథి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పథకాలను అమలు చేయాలి. ఈ రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే సత్ఫలితాలుంటాయి. నాణ్యమైన వృత్తి విద్యను అందుబాటులోకి తెచ్చి నిపుణులను తయారు చేయడం ద్వారా దేశంలో, ప్రపంచ  మార్కెటులో మన యువత ఉపాథి అవకాశాలను అందిపుచ్చుకొనే వీలుంటుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక‌ ఉపాథి కల్పనా సామ‌ర్థ్యాన్ని పెంచడానికి, అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన, సమగ్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. రాష్ట్ర విభజన చట్టంలో నిర్ధిష్టమైన అభివృద్ధి ప్రణాళికను ప్రకటించకుండా తేలికపాటి మాటలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి, ఆర్థికంగా తోడ్పాటును అందిస్తామని చెప్పడంతోనే సరిపుచ్చుకొన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసుకు ప్రజలు ఉద్వాసన పలికారు, విభజనకు సహకరించిన భాజపా నేడు అధికారంలో ఉన్నది, విభజనతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది. మాటల్లో కాదు, చేతల్లో చూపెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి) విధానంలో పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తామని చెప్పడం కాదు, ప్రభుత్వమే పెట్టుబడులు భారీగా పెడుతూ, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే దేశంలోని అభివృద్ధి చెందిన‌ రాష్ట్రాలతో సరిసమానంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది.
రాజధాని నిర్మాణం: హైదరాబాదు మహానగరాన్ని తలదన్నే విధంగా రాష్ట్ర రాజధానీ నగరాన్ని నిర్మిస్తామని గొప్పలకు పోవలసిన అవసరం ఉందా! ఇ_క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఇ_గవర్నెన్స్ ద్వారా పారదర్శకతే కాదు, స్థలం, కాలాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఆ వైపు దృష్టి సారించకుండా ప్రపంచంలోని సుందరమైన నగరాలన్నింటీ అధ్యయనం చేసి వాటి కంటే సుందరమైన మహానగరాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అలాంటి నగరం నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలంటున్నారు. డిల్లీ పెద్దలు ఆర్థిక సహాయంపై నోరు మెదపడం లేదు. పట్టణాభివృద్ధి శాఖామాత్యులు స్మార్ట్ సిటీల నిర్మాణ కోటాలో నుండి ఒక స్మార్ట్ సిటిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని సెలవిచ్చారు. అలా అంటూనే అంతా కేంద్ర ప్రభుత్వం చేయదు. ప్రజలు అధిక పన్నులు చెల్లించడానికి సిద్ధపడాలని హితబోధ‌ కూడా చేశారు. మరొక వైపు విరళాలిమ్మని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అందువల్ల భూమి మీద నిలబడి రాష్ట్రానికి అంత‌ ఆర్థిక స్తోమత ఉన్నదో, లేదో విజ్ఞతతో ఆలోచించి, కార్యాచరణకు పూనుకోవాలి. అసలు అలాంటి మహానగర నిర్మాణం అవసరం ఉన్నదా? పర్యవసానాలెలా ఉంటాయి అన్న అంశాలపై లోతుగా ఆలోచించాలి. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిథినంతటినీ రాజధానీ పరిథిగా పరిగణిస్తామంటున్నారు. కేంద్ర మంత్రివర్యులొకరు గుంటూరు నుండి ఏలూరు వరకు విస్తరిస్తామని ఇటీవలే సెలవిచ్చారు. ఇబ్రహీంపట్నం-గన్నవరం-తెనాలి-గుంటూరులను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామంటున్నారు. గుంటూరు-విజ‌యవాడ-ఏలూరు-మచిలీపట్నం-తెనాలి పట్టణాలను అనుసంధానం చేస్తూ అవుటర్ రింగ్ రోడ్డును నిర్మించాలనే దురాశాపరులు లేకపోలేదు. ఈ ఆలోచనలే ఆచరణలోకి వస్తే సంబవించే దుష్పరిణామాలపై హేతుబద్ధంగా ఆలోచించే వారు కరవైనట్లుంది.  
టి.లక్ష్మీనారాయణ‌

Tuesday, September 16, 2014

1948 సెప్టంబర్ 17 : ఉజ్వల ఉద్యమ‌ చరిత్ర

ప్రచురణ: సెప్టంబరు 17, 2014  సూర్యా దినపత్రిక‌

"నిజాం నిరంకుశ పాలన నుంచి, భూస్వాముల అమానుష పీడన నుంచి, విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలుగు జాతి సమైక్యత కోసం గుండె నెత్తురులు తర్పణ చేసిన నాలుగు వేల మా తెలంగాణా వీరులకు అంకితంఅన్న ఈ మాటలు 'వీర తెలంగాణా నా అనుభవాలు - జ్ఞాపకాలు' శీర్షికతో అమరజీవి రావి నారాయణరెడ్డి గారు తెలంగాణా సాయుధ పోరాటం రజతోత్సవాల సందర్భంగా రచించిన పుస్తకాన్ని అంకితం చేస్తూ అక్షరబద్దం చేయబడినవి.  మహోజ్వలమైన  తెలంగాణా రైతాంగ‌ సాయుధ పోరాటం భారత స్వాతంత్య్ర ఉద్యమ‌ చరిత్రలో ఒక‌ సువర్ణాధ్యాయంగా లిఖించబడింది. ఈ వీరోచిత పోరాటం తరాలు మారినా చైతన్య స్ఫూర్తిని నింపుతూనే ఉన్నది. నైజాం నిరంకుశ పాలనకు సమాధికట్టి ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సముపార్జించి పెట్టిన మహోద్యమం. స్వదేశీ సంస్థానాలలోకెల్లా నైజాం సంస్థానమే అతిపెద్దది. బ్రిటీషు పాలకులకు నమ్మిన బంటుగా ఉన్న నైజాం  నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనం కాకుండా దేశ స్వాతంత్య్రం పరిపూర్ణతను సంతరించుకోజాలదు. నాటి ఆ వీరోచిత పోరాటం ద్వారా ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న నైజాం నిరంకుశ పాలనలోని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలను విముక్తి చేసి భారత దేశంలో విలీనం చేసి ఉండక పోతే నేడు దేశ ముఖచిత్రం ఎలా ఉండేదో ఊహించడం కష్టం. దేశ విభజన పర్యవసానాలను చవి చూస్తూనే ఉన్నాం. స్వతంత్ర దేశంగా మనుగడ సాగించాలన్న నైజాం కల నెరవేరి ఉంటే మన దేశ‌ సార్వభౌమత్వం, ఐక్యత ప్రశ్నార్థకమయ్యేవి. ఈ సమరశీల‌ పోరాటం ద్వారా తమను తాము విముక్తి చేసుకోవడమే కాదు దేశాన్ని ఆ పెనుముప్పు నుండి రక్షించిన ఘనకీర్తి కూడా వీర తెలంగాణా సాయుధ‌ పోరాట యోధులకే దక్కుతుంది.
స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని వదిలి వెళ్ళుతూ మౌంట్ బాటన్ పథకాన్ని అమలుపరిచారు. దాని ప్రకార‍ం ఏ స్వదేశీ సంస్థానమైనా స్వతంత్ర్యంగా మనుగడ సాగించడానికి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. బ్రిటీష్ వలస పాలకులకు నమ్మిన బంటుగా ఉన్న నిజాం నవాబు లాంటి వారు తమ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయకుండా స్వతంత్రంగా మనుగడ సాగిస్తే తమ దోపిడీ విధానాలను మరొక రూపంలో కొనసాగించవచ్చని కుట్రపూరితంగా వలసవాదులు వ్యవహరించారు. దేశంలోని 550 పైచిలుకు సంస్థానాలలో హైదరాబాదు, జమ్మూ‍ కాశ్మీర్ లాంటి రెండు మూడు సంస్థానాలు మినహాయించి అన్నీ స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో విలీనమైనాయి. దేశంలోనే అతిపెద్ద సంస్థానమైన హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి నిజాం నవాబు నిరాకరించి, తాను స్వతంత్రుడనని, హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా 1947 ఆగస్టు 7న ప్రకటించుకొన్నాడు. దాంతో సంస్థాన ప్రజలంతా తిరగబడ్డారు. కాంగ్రెస్ సత్యాగ్రహ ఆందోళనతో మొదలై మొత్తం ప్రజల ప్రతిఘటనోద్యమ‍ంగా పరిణతి చెంది కడకు సాయుధ పోరాటంగా ఉగ్రరూపందాల్చింది. రైతాంగం, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు, విద్యార్థులు, వకీళ్ళు అందరూ ఉద్యమ బాట పట్టారు. పల్లెపల్లే పోరాట కేంద్రాలుగా రూపుదాల్చాయి. నైజాం జెండాను పీకిపారేసి జాతీయ పతాకాన్ని గ్రామ గ్రామానా ప్రతిష్టించారు. హైదరాబాద్ లోని రైల్వే వర్క్ షాప్, జౌళి పరిశ్రమ, డ్రైనేజి, నాందేడ్ జౌళి కార్మికులు సమ్మె చేశారు. రైల్వే వర్క్ షాప్, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యాలయాలపైన మరియు ఇతర కేంద్రాలలో భారత ప్రభుత్వ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
దేశంలో బ్రిటిష్ వలస పాలన, హైదరాబాదు సంస్థానంలో నైజాం ప్యూడల్ రాచరిక వ్యవస్థ ఉండేది. దేశమంతటా స్వాతంత్య్రంస్వేచ్ఛ కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిపడుతున్న రోజులవి. కానీ నైజాం సంస్థానంలో అణిగిమణిగి జీవించే బానిస వ్యవస్థ కొనసాగుతున్న కాలమది.   ప్రప్రథమంగా 1938లో కామ్రేడ్స్ అసోషియేషన్ పేరిట కమ్యూనిస్టు గ్రూపు ఏర్పడింది. కామ్రేడ్స్ అసోషియేషన్ లోని కార్యకర్తలు అత్యధిక కాలం అజ్ఞాతంలో ఉంటూనే కార్యకలాపాలు నిర్వహించేవారు. వారి కార్యకలాపాలపై నిషేధం, నిర్బంధకాండ కొనసాగేది. నిజాం ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి, శిక్షలు విధించేది. "ప్రజల ఆకాంక్షలకు, స్వాతంత్య్ర ఉద్యమానికి 'వందేమాతరం' దేశంలోని ప్రజాతంత్ర శక్తులకు స్ఫూర్తి గీతం. నైజాం సంస్థానంలో వందేమాతరం ఉద్యమం ప్రగతిశీల ప్రజాతంత్ర భావాలు గల విద్యార్థులను ఎంతగానో ప్రభావితుల్ని చేసింది. రాజకీయ ఉద్యమాల పట్ల‌ ఆసక్తిని పెంపొందించింది. మతం, భాషా విషయాల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షత, అమలులో ఉన్న నిర్బంధాలు, ప్రజాస్వామ్య హక్కులు లేక పోవడం అన్ని వర్గాల వారిని ఉద్యమబాటకు పురికొల్పాయి.  దేశ వ్యాపితంగా ఉవ్వెత్తున సాగుతున్న స్వాతంత్య్రోద్యమం పూర్వరంగంలో హైదరాబాదు స్టేట్ లో 1945 - 46 లలో రైతాంగ మరియు కార్మికవర్గ పోరాటాలు పెల్లుబికాయి.  గ్రామీణ ప్రాంతంలో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వామ్య‌ రాచరిక కుటుంబాలు సాగిస్తున్న నికృష్టమైన దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. కడవెండిలో 1946 జూలై 4 న దేశ్ ముఖ్ ల గూండాలు దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడంతో ఆ పోరాటం ఉవ్వెత్తున ప్రజ్వరిల్లింది. తెలంగాణ పల్లెల్లో నిర్బందకాండ పెరిగింది. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఎ.హెచ్.టి.యు.సి. ని కూడా ప్రభుత్వం నిషేధించి, నాయకులపై అరెస్టు వారంట్లను జారీ చేసింది.
 నైజాం  వెన్నుదన్నుగా నిలవగా - ఖాసింరజ్వీ నాయకత్వంలోని రజాకార్లు సాయుధులై గ్రామాలపై విరుచుకుపడి ప్రజాఉద్యమాన్ని అణగదొక్కడానికి పూనుకొన్నాడు. వారికి పోలీసులు, మిలిటరీ కూడా అండగా నిలబడింది. ప్రజాఉద్యమంపై దమనకాండ తీవ్రమయ్యింది. పరిస్థితుల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పును గమనించిన ఉద్యమ నాయకత్వం  రాజకీయ విముక్తి నినాదంతో పోరాటాన్ని ఉధృత‍ం  చేసింది. హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో అంతర్భాగం చేయాలని డిమాండ్ చేస్తూ 1947 సెప్టంబరు 11న సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ మరియు ఆల్ హైదరాబాద్ ట్రెడ్ యూనియన్ కాంగ్రెస్ లు పిలుపిచ్చాయి. నైజాం నిరంకుశ పాలన అంతం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపిస్తూ విడుదల చేసిన ప్రకటనపై సంతకాలు చేసిన ముగ్గురు ప్రముఖుల్లో ఎ.హెచ్.టి.యు.సి. వ్యవస్థాపక అధ్యక్షులు మఖ్దూం మొహియిద్దీన్ ఒకరు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు  భారాత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ ప్రతినిథులుగా సంతకాలు పెట్టారు. పోరాటంలో పురుషులతో పాటు మహిళలు అమోఘమైన, వీరోచితమైన పాత్ర పోషించారు. అపారమైన త్యాగాలు చేశారు. పౌర‌ హక్కులు, సాంస్కృతిక స్వాతంత్ర్యం కోసం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా వివిధ రూపాలలో ఉద్యమించారు. గ్రంథాలయోద్యమం, వందేమాతరం ఉద్యమం, సాంస్కృతికోద్యమాలు నిర్వహించబడ్డాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, ఆల్ హైదరాబాదు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ తదితర సంస్థలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ప్రధానమైన భూమికను పోషించాయి.
ఆంధ్ర ప్రజలు, ప్రత్యేకించి కమ్యూనిస్టు శ్రేణులు, కష్టజీవులు అండగా నిలవడమే కాదు అనేక మంది ప్రత్యక్షంగా సాయుధ పోరాటంలో పాల్గొని ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజాపోరాటం తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించి మహోధృతంగా ఉగ్రరూపందాల్చడంతో నైజాం పాలన పూర్తిగా స్థంభించిన నేపథ్యంలో యథాతథపు స్థితిని కొనసాగించే ఒడంబడికను కాంగ్రెస్ నాయకత్వ‍ం నైజాం నవాబుతో కుదుర్చుకొన్నది. దాని ప్రకారం నిజాం తన జనరల్స్ ను ఇతర దేశాల్లో తన‌ ప్రతినిథులుగా నియమించుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం తమ ప్రతినిథులను హైదరాబాదులో నియమించుకోవచ్చు. ఈ రాజీ ఒప్పంద‍ం మేరకే సర్దార్ పటేల్ శిష్యుడైన కె.యం.మున్షీ హైదరాబాదులో భారత ఏజెంట్ జనరల్ గా నియమించబడ్డాడు. కార్మిక నాయకుడుగా ఉన్న ఫతేహుల్లా ఖాన్ కార్మికులకు ద్రోహం చేసి, ఫిరాయించి రజాకార్ల పంచన చేరి, హైదరాబాదు నైజాం ప్రభుత్వ ప్రతినిథిగా కరాచిలో నియమితుడైనాడు. అంటే నైజాం నవాబుకు పాక్షికంగానైనా స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం ప్రసాదించింది. ఈ ఒడంబడికలో ప్రజోద్యమానికి సంబంధించిన ప్రస్తావనే లేకపోవడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది.
పోలీసు చర్య: ఉప్పెనలా ఎగసిపడుతూ విస్తరిస్తున్న ఉద్యమంతో కమ్యూనిస్టుల ప్రాబల్యం దినదినాభివృద్ధి చెందుతుండడంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం యథాతథపు ఒడంబడిక గడువు ముగియక ముందే యూనియన్ సైన్యాలను 1948 సెప్టంబరు 13న హైదరాబాదు సంస్థాన‍ం మీదకు పంపి పోలీసు చర్యకు పూనుకొన్నది. నిజాం ప్రభుత్వ పాలనకు అంతం పలికి హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడం, భూస్వామ్య శక్తుల ఆగడాలకు కొంత వరకు అడ్డుకట్ట వేయడం, కమ్యూనిస్టు పార్టీని అణగదొక్కడం, సాధ్యమైతే నిర్మూలించడమనే లక్ష్యంతోనే - నాటి హోం శాఖామాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పథకం ప్రకారం పోలీస్ చర్యకు పూనుకొన్నారు. నైజాం పాలనకు సమాధి కట్టబడిందని ప్రజలు పోలీసు చర్యకు మద్దతు పలికారు. ప్రజల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పును కమ్యూనిస్టులు గుర్తించ నిరాకరించారు. యూనియన్ సైన్యం ప్రదర్శించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకత, సాగించిన‌ దమనకాండతో ప్రతీకారెచ్చతో రగిలిపోయిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగించి నిర్మాణ‌ రీత్యా తీవ్రంగా నష్టపోయారు.     
కానీ, తరతరాల నుండి పీల్చి పిప్పిజేస్తున్న మధ్య యుగాల నాటి నికృష్టమైన దోపిడీ విధానానికి, నైజాం నిరంకుశ పాలనకు సమాధికట్టే మహదాశయంతో తెలంగాణ ప్రజలు సాగించిన అజరామరమైన పోరాటంగా "తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం" ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తెలుగు, కన్నడ‌, మరాఠీ ప్రజల‌ మాతృ భాషలను అణచి వేసి, ఉర్దూ భాషను నిర్భంధంగా రుద్దడం జరిగింది. భూమి సమస్య కేంద్ర బిందువుగా సాగిన ఈ వీరోచిత పోరాటం ద్వారా  భూస్వాముల‌ కబంధ హస్తాల నుండి పది లక్షల‌ ఎకరాలను స్వాధీనం చేసుకొని దున్నేవానికే భూమి నినాదాన్నిసాకారం చేసి భారత‌ రైతాంగానికి తెలంగాణ రైతు, కూలీలు మార్గదర్శకులైనారు. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆకాంక్షతో పాటు సమాన‌ హక్కుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న‌ చైతన్యానికి బీజాలు పడ్డాయి. నాలుగు వేల మందికిపైగా వీరయోధులు బలయ్యారు. వేలాది మంది జైళ్ళలో కౄరమైన నిర్బంధాలకు, చిత్రహింసలకు గురైనారు. పోలీసు కాల్పులు, లాఠీదెబ్బలు, గృహదహనాలు, మానభంగాలు మొదలైన అమానుషమైన నిర్బందకాండకు సామాన్య ప్రజలు ఎదురొడ్డి ధీరోదాత్తులుగా చరిత్ర పుటలకెక్కారు.
ఈ చరిత్రాత్మకమైన పోరాటానికి నాయకత్వం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల హృదయాలలో చెరగని స్థానాన్ని సముపార్జించుకొన్నది. పర్యవసానంగా 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 44 స్థానాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ప్ర‍ంట్ (పిడిఎఫ్) పేరు మీద పోటీ చేసిన కమ్యూనిస్టులను 36 స్థానాల్లో గెలిపించి బ్రహ్మరథం పట్టారు. కన్నడ, మరాఠీ ప్రాంతాలలో కమ్యూనిస్టుల ప్రాబల్యం లేకపోవడం మూలంగా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించి హైదరాబాదు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కనాకష్టం మీద ఏర్పాటు చేయగలిగింది. ఈ పోరాటం వల్ల ప్రజల్లో విప్లవ చైతన్యం పెల్లుబికింది. భూస్వాములు, పెట్టుబడిదారులు తమ నికృష్టమైన‌, నగ్నమైన‌ దోపిడీకి నూకలు చెల్లాయని గ్రహించి దోపిడీ రూపాల్లో కొన్ని మార్పులు చేసుకొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం ద్వారా దోపిడిని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దళిత బడుగు బలహీన వర్గాలు, శ్రామిక వర్గాల జీవన పరిస్థితుల్లో ఆశించిన ప్రగతి సాకారం కాలేదు.
ఆరున్నర దశాబ్దాలు గడచిపోయాయి. తెలంగాణ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వచ్చిన పరిణామాలపై సమగ్రమైన అధ్యయనం జరగాలి. దేశ‌ స్వాతంత్య్రం, నైజాం నిరంకుశ పాలన అంతం పర్యవసానంగా ప్రజల జీవితాల్లో సంబవించిన మార్పు, మౌలిక సమస్యల పరిష్కారంలో సాధించిన ప్రగతిని నాడు తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ వారసులు వర్గ దృక్పథంతో పరిశీలించి, నాటి సమరశీల ఉద్యమ లక్ష్యాలను పరిపూర్తి చేయడానికి పునరంకితం కావడం ద్వారా మాత్రమే అమరజీవులకు నిజమైన నివాళి అర్పించిన వారవుతారు.

                                                                                                                       Email: lntunga@yahoo.com