Wednesday, April 18, 2012

విద్య హక్కే, కానీ అంగడి సరకే!

సూర్యా దినపత్రిక , ఏప్రిల్ ౧౯ ,2012

- హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు
- సామాజిక న్యాయానిి మొదటి మెట్టు విద్యే
- విద్యా హక్కును 10+2 వరకూ విస్తరించాలి
- ప్రభుత్వ విద్యారంగాన్నీ పటిష్ఠ పరచాలి
- జీడీపీలో 6 శాతం కేటాయింపు అవసరం


bc-hostel-studentsవిద్యా హక్కు చట్టంపై, దాని అమలుపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం పొందనప్పటికీ ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న మైనారిటీయేతర పాఠశాలలలో వెనుకబడ్డ కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లను చట్టం ప్రకారం విధిగా కేటాయించాల్సిందే అన్న సుప్రీం కోర్టు తీర్పు పిల్లల హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు మాత్రమే. అయితే దీని అమలు విషయమే అనుమానాలు రేకెత్తిస్తోంది. పౌరులందరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని పొందడానికి ఉపకరించే శక్తివంతమైన సాధనం విద్య. విద్యను ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరచడానికే స్వాతంకత్య్రానంతరం అరవై ఏండ్లకు పైగా సమయం పట్టింది. ‘విద్య ప్రత్యేక సౌకర్యం కాదు, ప్రాథమిక హక్కు’ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు, మేథావులు, పలు సంస్థలు దశాబ్దాలుగా వివిధ రూపాలలో చేసిన అలుపెరగని ఉద్యమాల ఫలితం. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పాక్షికంగా ఆమోదించడం వల్ల ‘విద్యా హక్కు చట్టం- 2009’ ఆవిష్కృతమైంది. 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం 6-14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ స్పష్టం చేస్తున్నది. 1- 8వ తరగతి వరకు మాత్రమే చట్టాన్ని పరిమితం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ అంటే ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే ప్రైవేట్‌ విద్యాసంస్థలు పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించి మరీ చేర్చుకొంటున్నాయి. అలాంటి పాఠశాలల్లో పేద విద్యార్థులు నేరుగా 1వ తరగతిలో ప్రవేశించి నెగ్గుకురాగలరా? అలాగే రాజ్యాంగం మేరకు 18 సంవత్సరాల వయస్సు లోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి ఎదుగుదల, అభివృద్ధి పట్ల సామాజిక బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలంటే కనీసం 10+2 విద్య కల్పించే వరకైనా ఈ హక్కును విస్తరించాలి. పన్నెండు సంవత్సరాల పాటు విద్య పిల్లల హక్కుగా అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. ఆ పరిపూర్ణమైన దృష్టితో చట్టాన్ని రూపొందించ కుండా లోపభూయిష్టంగా తీసుకొచ్చారు. అమలు పట్ల కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. పర్యవసానంగా విద్య ఆచరణలో అందని ద్రాక్ష పండు లాగే అందరికీ అందుబాటులోకి రాలేదు.

నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు బలైన రంగాలలో విద్యా రంగం మొదటి. ఒకనాడు ప్రభుత్వంతో పాటు ట్రస్టులు, సొసైటీలు అన్నింటికన్నా విద్యా దానం మిన్న అని భావించి విద్యా సంస్థలను నెలకొల్పి సామాజిక సేవలో అనిర్వచనీయమైన తృప్తి పొందేవి. అయితే ఆ చరిత్ర తిరగబడింది. విద్య అంగడి సరుకుగా మారిపోయింది. భారత రాజ్యాంగలోని 19(1) (జి) అధికరణ ప్రకారం ఏ వ్యాపారమైనా చేసేందుకు, నిర్వహించేందుకు పౌరులకు హక్కు ఏర్పడింది. దానిని ఉపయోగించుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘విద్యా హక్కు చట్టం’ అమలుకు తూట్లు పొడవాలని అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది.

అసలు మౌలికమై సమస్య- ‘రాజ్యాంగం లోని 19(1) (ఎ) నిబంధన ప్రకారం విద్యారంగాన్ని కూడా వ్యాపారరంగంగా భావించవచ్చా’ అన్న మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉన్నది. పట్టణీకరణ పర్యవసానంగా జనాభాలో మూడో వంతుమంది పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు విద్యా వ్యాపారుల నిలయాలుగా ఆవిర్భవించాయి. అధిక లాభాలకోసం భారీ పెట్టుబడులతో విద్యా సంస్థలను నెలకొల్పి వ్యాపారం చేస్తూ, ప్రైవేటు యాజమాన్యాలు సంపాదన బాగా రుచి మరిగాయి. సేవా భావంతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న వారు అసలే లేరని కాదుగానీ, అత్యధికులకు మాత్రం అది వ్యాపారమే.

పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ, ఆ బాధ్యతనుంచి తప్పించుకొనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 80 శాతం ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవి మౌలిక వసతులు కరువై కునారిల్లి పోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 27 శాతం మంది మాత్రమే విద్యనార్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం. 84 శాతం మంది పిల్లలు వాటిలోనే విద్యనార్జిస్తున్నారు. నాణ్యమైన విద్యను పౌరులందరికీ అందించేందుకు 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ మిషన్‌ మొదలుకొని విద్యా రంగంపై నివేదికలు సమర్పించిన పలు కమిషన్లు సిఫారసు చేశాయి. యూపీఏ 1 ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చినా దానిని గాలికి వదిలేసింది.

ప్రస్తుతం దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతానికి అటు ఇటుగా నిథులను కేటాయిస్తున్నారు.
చట్టంలో పొందుపరచిన పరిమితమైన లక్ష్యాన్ని సాధించడానికి కూడా నిథుల లేమి ప్రధాన అవరోధంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఆదాయపు పన్ను , కార్పొరేషన్‌ పన్ను, సేవా పన్ను , ఎక్సజ్‌ అండ్‌ కస్టమ్స్‌ డ్యూటీస్‌ వగైరా అన్ని రకాల పన్నుల చెల్లింపులపై అదనంగా ప్రజల నుండి 2 శాతం ప్రాథమిక విద్యా సెస్‌ను ( + మరొక ఒక శాతం ఉన్నత విద్యా సెస్‌) వసూలు చేస్తున్నది. ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన 2004-05 నుండి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో లక్ష కోట్లకు పైగా ఆదాయం ఈ పద్దు క్రింద ప్రభుత్వ ఖజానాకు చేరిందని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెస్‌ ద్వారా ఆర్జిస్తున్న మొత్తానికి అదనంగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది 30-35 శాతానికి మించి ఉండడం లేదు.

విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి నిథుల కేటాయింపు పెంచాలని, 2011-12లో రూ. 35,659 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్‌ బోర్డియా కమిటీ సిఫార్సు చేసినా, కేటాయించింది రూ.21,000 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు భరించాల్సిన నిష్పత్తి సొమ్ము వెచ్చించక పోవడంతో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 2012-13 బడ్జెట్‌ లో రూ.25,555 కోట్లు కేటాయించారు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు కపిల్‌ సిబాల్‌ చేతులెత్తేశారు. ప్రైవేటు రంగం భుజం మోపాలని కోరారు. కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా ఈ పని చేయాలని, మిగిలిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏవైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని పాఠశాలలున్నాయో వాటికి బోధనా ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇక్కడ మన రాష్ట్ర అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.

వృత్తి విద్యా కోర్సులు అధ్యయనం చేస్తున్న బీసీ, ఓబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ పథకం అమలు తీరుతెన్నుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ పథకాన్ని నమ్ముకొని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఫీజులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం బోధనా రుసుం రూపంలోనే కాదు, వివిధ రకాల పద్దుల కింద అధిక ఫీజులు వసూలు చేసుకొంటున్నాయి. ఫీజులను నియంత్రించే యంత్రాంగమే లేదు. వాటిని ప్రభుత్వం చెల్లించదు. పేద విద్యార్థి తల్లిదండ్రులకు వాటిని చెల్లించే స్తోమత ఉండదు. అంటే, అలాంటి విద్యా సంస్థ గుమ్మం తొక్కే అర్హతే పేద పిల్లలకు లేదన్న మాట. సంపాదనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలు ప్రభుత్వ మొర ఆలకిస్తాయా అన్నది ప్రశ్న. మరొకవైపు రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చట్టం వర్తించదని తేల్చేశారు.

ప్రభుత్వాల ఒత్తిడికి తలవొగ్గి ప్రైవేటు రంగంలోని చిన్న, మధ్య తరహా పాఠశాలల యాజమాన్యాలు కొంత వరకు అమలు చేయవచ్చు. ఆ మేరకు ఆదాయంలో వచ్చే తరుగుదలను భర్తీ చేసుకోవడానికి మిగిలిన 75 శాతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లల నుండి వసూలు చేసే ఫీజులను పెంచే ప్రమాదం ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ పేద పిల్లలకు తమ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను కేటాయించి ఉచిత విద్యను అందించే గురుతరమైన సామాజిక బాధ్యతను విద్యా రంగంలో బలంగా వేళ్ళూనుకొన్న కార్పొరేట్‌ సంస్థలు, విస్తారంగా బ్రాంచీలను నెలకొల్పి రెండు చేతులా కోట్ల రూపాయల ధనార్జన చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాయనుకోవడం ఒక భ్రమ.

మన దేశంలో ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యా రంగం వరకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ కబంధ హస్తాల్లో ఇరికించుకోవడానికి మార్కెట్‌ ఆర్థిక విధానాలు చక్కగా చేయూత నిచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మౌలిక సదుపాయాలతో నిర్వహిస్తున్న ఉన్నత శ్రేణి పాఠశాలలని ప్రచార హోరుతో సంపన్న వర్గాలను ఆకర్షించి, ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న ఒక్కొక్క విద్యార్థినుండి నాలుగైదు లక్షల రూపాయలను వార్షిక ఫీజుగా గుంజుకొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల్ని డిల్లీ తదితర మెట్రో పాలిటన్‌ నగరాలలో నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి.

ఉన్నత విద్యా ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలు, క్రీడా సదుపాయాలు, పోషకాహారం, జాతీయ- అంతర్జాతీయ స్టడీ టూర్లు వగైరా మాయ మాటలు చెప్పి విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశం కల్పించి, ఉచిత విద్యను అందిస్తాయా? ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని తెరవెనుక సీట్లు అమ్ముకొని, నల్ల ధనాన్ని చేతులు మార్చుకొని, పేద పిల్లలకు ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించడంలో ఆరితేరారు. అదే తంతు ఈవాళ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల యాజమాన్య కోటా అడ్మిషన్స్‌లో జరుగుతున్నది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే బహిరంగ ప్రకటన విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించి, మార్కుల ప్రాతిపదికపై మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఆ ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. ఆ సీట్ల గురించి ఎవరైనా విచారిస్తే అయిపోయాయన్న సమాధానం వెంటనే వస్తుంది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యేకంగా నిథులను సమకూర్చుకోవచ్చని కపిల్‌ సిబాల్‌ సలహా కూడా ఇచ్చారు. ఈ పేరుతో రాబోయే రోజుల్లో వారికి మరికొన్ని రాయితీలు కల్పించి, ఆర్థిక ప్రయోజనం కల్పించే ఆలోచన ఉన్నట్లు బోధడుతున్నది .

ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు నిర్వహించిన వీధి బడుల్లో చదువుకొన్నవారమని పెద్దలు కొందరు గర్వకారణంగా చెబుతుంటారు. నిజమే, నాడు విద్యార్జనకు అవే కేంద్రాలు. కాలం మారింది. ప్రభుత్వాల విధానాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంత భావజాలం అందలమెక్కింది. ప్రతిదీ సరకుగా మారింది. విద్యకూ మినహాయింపు లేదు. వృత్తి విద్య, ఉన్నత విద్యే కాదు, ప్రాథమిక విద్య కూడా లాభార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల కబంద హస్తాల్లో చేరింది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కుప్పకూలి, మౌలిక సదుపాయాల లేమితో, నాసిరకం విద్యాబోధనకు నిలయాలుగా అపవాదును కూడగట్టుకొన్నాయి.

నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ఈ పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడ్డ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు లేవని కాదు. కేవలం కార్పొరేట్‌, ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లోనే నాణ్యతా ప్రమాణాలతో కూడుకొన్న విద్య లభిస్తుందన్నది పాక్షిక సత్యమే . కానీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతున్నది. ప్రభుత్వ లోపభూ యిష్ఠ విధానాలతో ఈ రంగం సహజ మరణం బాటలో ప్రయాణిస్తున్నది. విద్యా రంగంలో వివక్ష బలంగా వేళ్ళూనుకొన్నది. సంపన్నులు, మధ్య తరగతి, పేదలు వారివారి ఆర్థిక స్థితిగతులను బట్టి, అంటే కొనుగోలు శక్తి ఆధారంగా విద్యను పొందవచ్చు.

ఈ పరిస్థితి మారాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పటిష్ఠమైన కార్యచరణతో విద్యాహక్కుచట్టం అమలుకు అంకితభావంతో పూను కోవాలి. ప్రైవేటురంగంలోని పాఠశాలలపైనే ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశా లల వ్యవస్థను విస్తరించడం, జీడీపీలో 6 శాతం నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యాప్రమాణాలను మెరుగు పరచి నాణ్యమైన విద్యను 10+2 వరకు అందించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి.

Friday, April 13, 2012

ముడుపుల ముట్టడిలో రక్షణ!

సూర్యా దినపత్రిక, ఏప్రిల్ 10, 2012

ప్రధాన మంత్రికి పదాతిదళాల ప్రధానా ధికారి వి.కె.సింగ్‌ వ్రాసిన ఉత్తరం లీక్‌ కావడం, నాసిరకం సైనిక వాహనాల కొనుగోలుకు రు. 14 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు, ప్రస్తుతం సైన్యం వద్ద రెండు రోజులకు సరిపడేంత ఆయుధ సంపత్తి మాత్రమే ఉందని అందులో పేర్కొనడం లాంటి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు బిహ ర్గతమయిన పూర్వరంగంలోనే వెలు గు చూసిన ఈ వార్త సహజంగానే రాజకీయ వ్యవస్థలో వేడి పుట్టించింది. దేశ ప్రతిష్టను, సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బదీసే ఘటనలుగా వీటిని పరిగణించాలి. భద్రతాపరంగా దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు ఆరోగ్యకరంగా లేవు. కాశ్మీరు సమస్య రావణా సురుని కాష్ఠంలా రగులుతూనే ఉన్నది.

పాకిస్తాన్‌ శతృపూరిత వైఖరిలో మౌ లికమైన మార్పు గోచరించడం లేదు. పైపెచ్చు ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా ఆ దేశ సైన్యం శిఖండిలా అడ్డుపడుతున్నది. మనదేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. నిరంతరం సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సహజీ వనం గడపాల్సిన దుస్థితి నెల కొని ఉన్నది. ఐ.యస్‌.ఐ. తర్ఫీదు, ప్రోత్సాహం తో సీమాంతర ఉగ్రవాద శక్తులు మన దేశంపై కక్ష గట్టి, దొంగ దెబ్బలు కొడుతున్నాయి. మన రక్షణ వ్యవస్థల కన్నుగప్పి దేశంలో అక్రమంగా చొర బడి మారణహోమాలు సృష్టిస్తున్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి, ఆర్థి క నగరంగా పేరుగాంచిన ముంబాయి మహానగరంపై బాంబులతో దాడి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బాం బుపేలుళ్ళు, హైదరాబాదు మొదలుకొని దేశంలోని నలుమూలలా సంభవిం చిన బాంబు పేలుళ్ళ సంఘటనలు దేశ భద్రతకు గొడ్డలి పెట్టు లాంటివి. ప్రజ ల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి.

పోనీ మిగిలిన ఇరుగుపొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్‌, బాంగ్లా దేశ్‌, బర్మాలతో విశ్వసనీయమైన, నమ్మశక్యమైన దౌత్య సంబం ధాలున్నాయా అంటే అదీలేదు. అపనమ్మకాల మధ్యకాలం వెళ్ళబుచ్చు తున్నాము. ఈశాన్య ప్రాంతంలో చొరబాటుదారులు సమస్య పెద్ద తల నొప్పిగా మారింది. ఆంత రంగికంగా మతోన్మాద శక్తులు, అతివాద తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా నిలిచాయి. పర్యవసానంగా రక్షణ రంగా నికి మన వార్షిక బడ్జెట్స్‌లో సింహభాగం కేటాయిస్తున్నారు. 200506 ఆర్థిక సంవత్సరంలో రు.80,549 కోట్లు ఖర్చుచేస్తే 2012-13లో ఏకంగా రు.1,93,408 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక భాగం రక్షణ కొనుగోళ్ళకు వెచ్చిస్తున్నారు. ప్రణాళికేతర పద్దుక్రింద రు.1,13,829 కోట్లు. ప్రణా ళిేతర పెట్టుబడి వ్యయం పద్దు రు.79,579 కోట్లు ఉన్నది. అంటే ఆయుధసంపత్తి సేకరణ, ఆధునీకీకరణ, సైనికదళాల శిక్షణ వగైరా అవసరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది.

రక్షణ శాఖ జమా, ఖర్చులపై ఆడిట్‌ చేసే అధికారం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సంస్థకు లేకపోవడంతో అడ్డగోలు వ్యవహారా లకు అడ్డాగా తయారయ్యింది. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోనే ప్రక్రియ లో అంతర్భాగంగా చేసే కొనుగోళ్ళకు నిర్దిష్టమైన నియమనిబంధనలు పాటిం చకపోవడం, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం అవినీతి రాజ్యమే లడానికి అవకాశం కల్పించింది. రక్షణ శాఖకు భారీ నిథుల కేటాయింపులు ఉండడంతో ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారుచేసే బహుళజాతి సంస్థల డేగకన్ను మన రక్షణ రంగం పై దశాబ్దల క్రితమే పడింది. ఫలితంగా ఆయుధ సంపత్తి కొనుగోలు లావాదేవీ వ్యవహారాల్లో కత్రోచీ లాంటి దళారులు ప్రవేశించి, అవినీతిని ప్రోత్సహించి, రక్షణ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

బోఫర్స్‌ కుంభకోణం మొదలుకొని కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భౌతిక కాయాలను తరలించడానికి వినియో గించిన శవ పేటికల కొనుగోలు కుంభకోణం వరకు అవినీతి, అక్రమాల భాగోతాలు దేశ రక్షణ వ్యవస్థకే తలవంపులు తెచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన బోఫర్స్‌ శతఘు్నలు వగైరా ఆయుధ సంపత్తికి నేడు విడి భాగాలూ, మందు గుండు సామగ్రి లభించక పోవడంతో ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నామా? అన్న అనుమానాలు వస్తున్నాయి. దశాబ్దాల తదనంతరం కూడా మందు గుం డు సామగ్రిని, శవ పేటికలను కూడా తయారు చేసుకోలేనంత వెనుకబడి ఉన్నామా? స్వయంపోషకత్వాన్ని సాధించే వైపు ఎందుకు ప్రయాణం చేయ లేక పోతున్నాం ?

సైనిక దళాల ప్రధానాధికారి వి.కె.సింగ్‌ ఉత్తరంలో ప్రస్తావించినట్లు 600 నాసిరకం టెట్రా టెర్రాయిన్‌ సైనిక వాహనాలను (ట్రక్స్‌) 2010 సం.లో కొను గోలు చేయడానికి అనుమతిస్తే తనకు రు.14 కోట్లు లంచం ఇవ్వజూపిన విష యం వాస్తవమైతే అవినీతిచెదలు ఏ స్థాయిలో విస్తరించిందో స్పష్టమవుతున్న ది. ఉత్తరం ఎలా బహిర్గతమయ్యిందన్నది ఒక చిదంబర రహస్యమైతే, అసలు ఆ ఉత్తరంలోని అంశాలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయి. దానిపై ప్రధాన మంత్రిగానీ లేదా రక్షణశాఖా మంత్రిగానీ ఎందుకు తక్షణం స్పందించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో లేదో ! జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, అత్యంత ఉన్నతస్థానంలో ఉన్న తనకు లంచం ఇవ్వజూపిన దుష్టశక్తులపై ఎందుకు సైనిక దళాల ప్రధానాధికారి చర్యలు తీసుకోలేదో కూడా బహిర్గతం చేయాల్సి ఉంది.

ఏదైనా ఉపద్రవం జరిగి ఇప్పటికిప్పుడు యుద్ధమంటూ జరిగితే రెండు రోజులకు సరిపడ ఆయుధ సంపత్తి మాత్రమే ఉన్నదని సైనిక దళాల ప్రధానా ధికారి పేర్కొనడం వాస్తవమైతే తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఎందుచేత ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనేదే అసలు సమస్య. గడచిన కొన్ని దశాబ్దా లుగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సముపార్జించుకొన్న ఆయుధ సం పత్తి అంత నిరుపయోగంగా తయారయ్యిందా! దీనికి కారణం పాత సాం ేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలకు విడి భాగాలు లభించక పోవ డమేనా ? చైనా, పాకిస్తాన్‌ బూచి చూపెట్టి దారిద్య్రం, నిరుద్యోగం, పిల్లలు, గర్భిణీ మహిళల్లో పౌష్టికాహార లోపం లాంటి తీవ్రమైన సమస్యల పరిష్కా రానికి గానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలులాంటి రంగాలకు అవసరమైన నిధులను కేటాయించకుండా, వార్షిక బడ్జెట్స్‌లో రక్షణ శాఖకు పుష్కలంగా నిథులను కేటాయిస్తున్నా ఈ దుస్థితి నెలకొనడానికి దారి దీసిన కారణా లేంటో! నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

రక్షణ రంగంపై చైనా 16.1 శాతం మేరకు బడ్జెట్‌ నిథులను వ్యయం చేస్తుంటే మన ప్రభుత్వం 16.4 శాతం ఖర్చు చేస్తున్నది. స్థూల జాతీ యోత్ప త్తిలో చైనా 2.1 శాతం వ్యయం చేస్తుంటే మనం 2.7 శాతం వెచ్చిస్తున్నాం. కాకపోతే వారికీ, మనకు ఒక తేడా ఉన్నట్లు చెప్తున్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సంపాదించు కొని తదనంతర కాలంలో చైనా సొంతంగా ఆయుధాలను, విడి భాగాలను ఉత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని సాధించుకొంటున్నది. కానీ స్వదేశంలో ఉత్ప త్తి చేసుకోగలిన ఆయుధాలను, వాహనాలను, విడిభాగాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికే మన ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నది. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి తక్కువ ఆయుధ సంపత్తిని పొందుతున్న దేశాల సరసన ఉన్నామని కూడా వార్తలు చెబుతున్నాయి.

టాటా కంపెనీ దేశీయంగానే నాణ్యమైన సైనిక వాహనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా రక్షణ శాఖ ఆసక్తి కనబరచ లేదన్న సమాచారాన్ని ఆ సంస్థ ప్రతినిథులే వెల్లడించారు. దాన్నిబట్టి కిక్‌ బాక్స్‌ స్వీకరించడానికి విదేశీ గడ్డ అన్ని విధాలా అనువైనదని దళారులు, ఉన్న తాధికారులు, రాజకీయ నాయకత్వం భావిస్తున్నట్లుంది. కారణం పుచ్చుకొన్న అవినీతి సొమ్మును స్విస్‌ బ్యాంకుల్లో పదిలంగా దాచుకొనే సౌలభ్యం ఉంది కాబట్టే. మన దేశానికి చెందిన ఘరానా పెద్ద మనుషుల స్విస్‌ బ్యాంకు ఖాతా ల్లో ఈ తరహా అవినీతి, పన్ను ఎగవేత ద్వారా ఆర్జించిన సొమ్ము దాదా పు రు.74,00,000 కోట్లు ( రు.24,00,000 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రే ప్రకటించారు) పోగుపడ్డదని కోడై కూస్తున్నది. ఆ నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని, అవినీతిని కూకటి వేళ్ళతోపెకలించాలని పెద్ద ఎత్తున ఉద్యమా లు జరుగుతున్న నేపథ్యంలోనే మరొకసారి రక్షణరంగంలోని అవినీతి సమస్య గుప్పుమనడం కళంకం తెచ్చి పెట్టింది.

రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల లో భాగంగా రక్షణ రంగంలోకి కూడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) ముసుగులో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తు న్నది. ఈ లోపభూయిష్టమైన విధానాల మూలంగా దేశ భద్రతకు, రక్షణ రం తగం సమాచారానికే రక్షణ కొరవడే ప్రమాదం ముంచుకొస్తున్నది. సరిహద్దు దేశాలతో దౌత్యపరమైన మైత్రి సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా రక్షణరంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించుకోవడానికి, అవినీతిని అరికట్టి ప్రజా దనం దుర్వినియోగం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభు త్వం అమలు చేయాలి.
మన దేశంతో పాటు శ్రీలంక, బాంగ్లాదేశ్‌, నేపాల్‌, మాల్దీవ్స్‌ సరిహద్దుల్లో ప్రత్యేక సైనిక దళాలు తిష్టవేసిన నిప్పులాంటి నిజాన్ని అమె రికా పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ రోబెర్ట్‌ విల్లాడ్‌ యు.యస్‌.ఎ. కాం గ్రెషనల్‌ కమిటీకి ఈ ఏడాది మార్చిలో నివేదించిన విషయం వెల్లడయ్యింది. అయినా మన పాలకులు అది అవాస్తమని కొట్టిపారేస్తున్నారంటే అమెరికాతో కుదుర్చుకొన్న వ్యూహాత్మక ఒప్పందాల్లో ఇవన్నీ అంతర్భాగమేమోననిపి స్తుం ది. వాస్తవానికి విదేశాంగ విధానాలలో మన ప్రభుత్వ లొంగుబాటు వైఖరి పర్యవసానంగా దేశ రక్షణ వ్యవస్థ పెను సవాళ్ళును ఎదుర్కొంటున్నది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి మౌలికమైన అంశాలపైన ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.