Sunday, October 20, 2013

విద్వేషాగ్నుల్లో నదీజలాలు



ప్రచురణ: అక్టోబరు 18, 2013  ఆంధ్రజ్యోతి దినపత్రిక‌


రాష్ట్ర విభజనపై జరుగుతున్న చర్చల్లో అంతర్భాగంగా నీటి సమస్యపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తిరగదోడి, నీటి కేటాయింపులను ప్రాంతాల మధ్య పున: పంపిణీ చేయాలని కొందరు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. సాధారణ వర్ష పాతం మాత్రమే నమోదైన సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోనకుండా డా. యం.వి.రమణారెడ్డి లాంటి వారు ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపును సమర్థించే దోరణిలో  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇటీవల‌ వ్యాసం వ్రాశారు.  మరికొందరు నాలుకపై తేనె రాసుకొని తేనెలొలికిస్తూనే విద్వేషం వెళ్ళగక్కుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నీటి సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. ఆ కోవకు చెందిన‌ కొన్నింటిపై స్పందించి ఈ వ్యాసం వ్రాస్తున్నాను.
కేంద్ర జల సంఘం మాజీ సభ్యులు, ఆర్. విద్యాసాగర్ రావు గారు ఆంధ్ర జ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూ 'రాయలసీమకు న్యాయం చేయాలి' అన్న శీర్షికతో 2013 జూలై 22న ప్రచురించబడింది. అది ఆయన అభిమానులను గందరగోళానికి గురిచేసిందని వాపోతూ, "నా వైఖరి మారలేదు అన్న శీర్షికతో ఆగస్టు 24న ఒక వ్యాసం వ్రాశారు. అందులో కొన్ని చారిత్రక సత్యాలను, అర్థ సత్యాలను ఉటంకిస్తూ మొసలి కన్నీరు కారుస్తూనే, సమస్యకు 'మసిపూసి మారేడు కాయ' చేసే ప్రయత్నం చేస్తూ రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లాకు తీవ్ర‌ అన్యాయం చేసే ప్రయత్నం చేశారు.
 1) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్.ఆర్.బి.సి.) కి కేటాయించిన 19 టి.యం.సి.ల నికర జలాలను వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా కృష్ణా నదిలో లభించే 2130 (2060+70 పునరుత్పత్తి) నికరజలాలలో మన రాష్ట్రానికి 811(800+11 పునరుత్పత్తి) టి.యం.సి. లను కేటాయించింది. ఆ తీర్పు మేరకు తెలంగాణకు 266.86 టి.యం.సి.లు, కోస్తాకు 377.47 టి.యం.సి.లు, రాయలసీమకు 122.7 టి.యం.సి.లు దక్కాయి. " రాష్ట్ర ఫ్రభుత్వం కేటాయింపుల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఉదాహరణకు కె.సి. కాలువ కేటాయింపుల్లో 8 టీఎంసీలు తగ్గించి, 11 టీఎంసీల రిటర్న్ ఫ్లోస్ వాటా సీమకు బదలాయించి వెరసి 19 టీఎంసీల నీటిని చూపించి శ్రీశైలం కుడిగట్టు కాలువకు కేంద్రం అనుమతి సంపాదించడం జరిగింది. ఇప్పుడు సీమకు లభించిన నికరజలాల కేటాయింపు 144.70 టీఎంసీలు" అని విద్యాసాగర్ రావు గారు పేర్కొన్నారు. "పరీవాహక ప్రాంతం దృష్ట్యా చూస్తే కృష్ణా బేసిన్‌లో సీమ 18.39 శాతం, పరీవాహక క్షేత్రం దృష్ట్యా సీమకు స్వల్పంగా వాటా తగ్గింది" అని కూడా చెప్పారు. ఆ మాటంటూనే! ఆయన ఎంతటి విశాల హృదయులంటే! జల విద్యుత్తు ప్రాజెక్టయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు క్రింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టి.యం.సి.లను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టి.యం.సి.లను రాయలసీమ పద్దుకు జమ చేశారు. మరొక వైపున‌ 19 టి.యం.సి.ల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం ఆమోదంతో నిర్మించబడుతున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) కు 11 టి.యం.సి.లను మాత్రమే శ్రీశైలం జలాశయం నుండి తీసుకోవడానికి మాత్రమే  వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికరజలాలను 122.70+11+11= 144.70 టి.యం.సి.లుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టి.యం.సి. ల నీరెక్కడి నుంచి యస్.ఆర్.బి.సి.కి సరఫరా కావాలో! ఆ సాగు నీటి రంగ నిపుణుడు ప్రస్తావించ లేదు. కానీ తన ఇంటర్యూలో మాత్రం "రాయలసీమ కేటాయింపులలో ప్రధానంగా తుంగభద్ర నుంచి వచ్చే వాటా కాకుండా ట్రిబ్యునల్ తదనంతరం 'పోతిరెడ్డిపాడు' నుంచి కేంద్రం నుంచి అనుమతి పొందిన మరో 19 టీఎంసీలు శ్రీశైలం కుడి గట్టు కాలువకు కూడా దక్కుతాయి. అదనంగా మరో 15 టీఎంసీలు చెన్నైకి తాగునీటి కోసం కేటాయించడం జరిగింది. అంటే ఈ 34 టీఎంసీలు తప్ప మరో చుక్క కూడా నికర జలాల రూపంలో పోతిరెడ్డిపాడు ద్వారా విడుదలయ్యే అవకాశం లేదని" కరాకండిగా చెప్పిన ఆయన ఆ మాటను కూడా మార్చేసి యస్.ఆర్.బి.సి.కి శ్రీశైలం నుండి 11 టి.యం.సి. లకే అర్హతని వ్రాశారు.  శ్రీశైలం జలాశయం నిర్మాణంతో కె.సి.కెనాల్ ఆయకట్టులో కొంత భాగం ముంపుకు గురయ్యిందన్న‌ విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
 2) విద్యాసాగర్ రావు గారి నైజం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి, తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టి.యం.సి. నికర జలాలను పెన్నాఅహోబిలం రిజర్వాయరు( పి.ఎ.బి.ఆర్.) కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశైలం జలాశయం నుండి కె.సి.కెనాల్ కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పై నీటి సర్దుబాటు చేసింది. విద్యాసాగర్ రావు గారి మాటే చెల్లుబాటై గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు రద్దయితే ఈ 10 టి.యం.సి. నీరు శ్రీశైలం జలాశయం నుండి కె.సి.కెనాల్ కు సరఫరా కాదు. తత్ఫలితంగా తుంగభద్ర జలాశయం నుండి పెన్నా అహోబిలం రిజర్వాయరుకు  చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది. మరి ఎడారి ఛాయలు పొడ చూపుతున్న‌, రాష్టంలోనే అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లా భవిష్యత్తు ఎలా ఉంటుందో? ఆ సాగు నీటి నిపుణుడే సెలవిస్తే బాగుంటుంది.
3) కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 20 టి.యం.సి.ల నికర జలాల‌ను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ఎత్తి పోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయడం ద్వారా కేంద్ర జల సంఘం అనుమతి పొందింది. కానీ కృష్ణా డెల్టా ఆధునీకీకరణ మాత్రం జరగలేదు. ఈ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
4) కేంద్రం మీద వత్తిడి తెచ్చి మహానది, గోదావరి నదుల అనుసంధానం ప్రక్రియ ద్వారా కొన్ని మిగులు జలాలను తరలించవచడం ఒక్కటే మిగిలి ఉన్న ఏకైక పరిష్కారమని సెలవిచ్చారు. మంచిదే. మరి, దాని కంటే సులువైన‌ గోదావరి కృష్ణా - పెన్నా నదుల అనుసంధానికి ఎందుకు మోకాలడ్డుతున్నారు? ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాకారం చేసుకోవచ్చు కదా? దానికి దోహదపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తూ, నదుల అనుసంధానాన్ని గూర్చి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదా? పులిచింతల రిజర్వాయరు నిర్మాణాన్ని ప్రతిఘటించారు. దుమ్మగూడెం - నాగార్జునసాగర్ టెల్ పాండ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి మహబూబ్ నగర్, నల్లగొండ, రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలోని కరవు పీడితి ప్రాంతాల నీటి కష్టాలను తీర్చడానికి కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న‌ నెట్టంపాడు(20 టి.యం.సి.), కల్వకుర్తి(25), యస్.యల్.బి.సి.(30), తెలుగు గంగ (29), హంద్రీ - నీవా (40), గాలేరు - నగరి (38), వెలుగొండ (43.5) ప్రాజెక్టులకు కావలసిన మొత్తం 225.5 టి.యం.సి.ల నీటి అవసరాలను తీర్చడమెలాగో కూడా సూచించాలి కదా!
5) కరవుకు ఆటపట్టుగా మారిన‌ వెనుకబడ్డ రాయలసీమ నీటి సమస్యపై మొసలి కన్నీరు కార్చిన‌ విద్యాసాగర్ రావు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల విస్తరించడం ద్వారా కృష్ణా నదినే రాయలసీమ ప్రాంతానికి మళ్ళించుకు పోతున్నారన్నంత ఆగిత్తంగా మాట్లాడారు. సీమ వాసులు నీటి దొంగలని మాట్లాడుతున్నారు. గడచిన నెల రోజులుగా శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలుగా నీటితో తొణికిసలాడుతున్నాయి. మరొకవైపున అమూల్యమైన నీరు భారీగా ప్రకాశం ఆనకట్ట నుండి పొగిపొర్లుతూ సముద్రంలో కలిసి పోతున్నది. కానీ తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించిన వెలుగోడు(17టి.యం.సి.) మరియు బ్రహ్మంగారిమఠం(17టి.యం.సి.) రిజర్వాయర్లలో నీటిని నింపుకోలేక పోయాము. పెన్నా నదిపై నిర్మించిన గండికోట‌, సోమశిల, మద్రాసుకు  మరియు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి త్రాగు నీటిని, శ్రీకాళహస్తి ప్రాంతంలో సాగు నీరు అందించడానికి   వీలుగా నిర్మించిన కండలేరు జలాశయానికి నీటిని తరలించుకోలేక పోయాము.
6) రాయలసీమ ప్రజలు నీటి కోసం దేహీ అని శరణు జొస్తే కోస్తా, తెలంగాణా ప్రాంత ప్రజలు దయదలిచి కొన్ని నీళ్ళు ఇవ్వవచ్చు అంటూనే,  తెలంగాణా ప్రాంతం వాళ్ళు నీళ్ళిచ్చే అవకాశం ఏ మాత్రం లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ ద్వారా నీటిని ఆదా చేసి, అలాగే కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిలో కొంత భాగాన్ని కోస్తా ప్రాంతం వారు కనికరించి ఇస్తే ఇవ్వవచ్చని హేళనగా వ్యాఖ్యానించారు. లేదా దుబాయ్ లాగా బ్రతకొచ్చని ఎద్దేవా చేశారు. ఈ తరహా మాటలు నీటి సమస్య పరిష్కారానికి దోహదపడతాయా! లేదా! మరింత జఠిలం చేయడానికి ఉపకరిస్తాయో! విజ్ఞులు ఆలోచించాలి.
7) నదీ పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తరువాతే, ఇంకా నీళ్ళు (నికర/మిగులు) మిగిలి ఉంటేనే మిగతా అవసరాలు తీర్చాల్సి ఉంటుందని మాట్లాడుతున్నారు. అది జాతీయంగా, అంతర్జాతీయంగా అమలులో ఉన్న‌ న్యాయ సూత్రమే. దాన్ని ఉల్లంఘించాలని ఎవరూ కోరడం లేదు. కానీ కొందరు ప్రాంతీయ కోణంలో మాత్రమే నీటి సమస్యను చూస్తూ పాక్షిక దృష్టితో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండే యస్.యల్.బి.సి., కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టుల అవసరాలకు ముందుగా కేటాయింపులు జరగాల్సి ఉంటుందని, పరివాహక ప్రాంతం బయట ఉన్న వెలిగొండ, హంద్రీ - నీవా, గాలేరు - నగరి లకు ఆ తరువాతే కేటాయింపులు చేయాల్సి ఉంటుందని వాదిస్తున్నారు.  యస్.యల్.బి.సి., కల్వకుర్తి, నెట్టంపాడులకు మాత్రమే పోలవరం నిర్మాణం ద్వారా లభించే 45 టి.యం.సి.లను కేటాయించాలని డిమాండ్ చేయడం  సమంజసమని అనిపించుకొంటుందా?  ఆ మాట కొస్తే ఈ ప్రాజెక్టులు కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతం క్రిందికి రావు కదా! దానికి వారిచ్చే సమాధానమేంటి? 
8) నదీ పరివాహక ప్రాంతంలో పైనున్న‌ ప్రాంతాలు నీటిని వాడుకొన్న తరువాతే దిగువ ప్రాంతాలకు నీరందుతుందని విద్యాసాగర్ రావు గారు మరికొందరు అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇది ఏ న్యాయ సూత్రాలకు అనుగుణమైనది. పైపెచ్చు ఈ వాదన చాలా ప్రమాదకరమైనది. ఈ వాదనే చెల్లుబాటైతే, ఇహ దిగువనున్న‌ ప్రాంతాలు ఎడారి కాక ఏమవుతాయి? నిజమే, కృష్ణా నదీ జలాల పంపకం పరివాహక ప్రాంతాల ప్రాతిపదికన జరగక పోవడంతో ఇటు తెలంగాణాకు ఎక్కువ నష్టం, అటు రాయలసీమకు కొంత నష్ట‍ం జరిగిందన్న భావన ఉన్న మాట వాస్తవం. కానీ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మార్చే అవకాశమే లేదు కదా! మరి, ఆ తీర్పును సక్రమంగా అమలు చేయడానికి వీలుగా లోతైన అధ్యయనం తరువాత శ్రీశైలం జలాశయం వద్ద నీటి వినియోగానికి సంబంధించి నిర్ధిష్టమైన విధి, విధానాలతో 1996 జూన్ 15న‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. యం.యస్. నెం.69లో పొందుపరచిన ప్రాధాన్యతా క్రమంలో నీటిని అందజేయడానికి ఆటంకాలు కల్పించకూడదు కదా?  ఒకవేళ‌ ఉల్లంఘిస్తే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
కృష్ణా నది కర్నాటక నుండి జూరాల మీదుగా శ్రీశైలం, అటుపై నాగార్జునసాగర్ జలాశయానికి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి పై భాగంలో నికరజలాల ఆధారంగా నిర్మించబడిన జూరాల ప్రియదర్శి, నిర్మాణంలో ఉన్న భీమా ఎత్తిపోతల పథకానికి నీటిని ముందుగా వాడుకొనే హక్కు ఉన్నది. ఆ తరువాత విధిగా జి.ఓ.నెం.69 లో పొందుపరచిన‌ ప్రాధాన్యతా క్రమం: 1) మద్రాసుకు త్రాగునీరు (15 టి.యం.సి.). 2) హైదరాబాదుకు త్రాగునీరి. 3) ప్రకాశం ఆనకట్ట క్రింద‌ కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు. 4) నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు.5) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.)  ఆయకట్టుకు సాగునీరు. 6) తెలుగు గంగకు సాగునీరు. 7) శైశైలం ఎడమ గట్టు కాలువ (యస్.యల్.బి.సి.) ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలి. ఆ జి.ఓ. విడుదలైన నాటికి నెట్టంపాడు, కల్వకుర్తి, హంద్రీ -నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో లేవు, కాబట్టి వాటి ప్రస్తావన జి.ఓ.లో  చేయలేదు. అలాగే 834 అడుగుల నీటి మట్టానికి క్రింద అనివార్యమైతే త్రాగు నీటికి తప్ప శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదలపై ఆ జి.ఓ.లో నిషేధం విధించబడింది. కానీ, మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి  805 అడుగుల‌ యం.డి.డి.యల్. మరియు యస్.యల్.బి.సి.కి 824 అడుగుల నీటి మట్టం నుండే నీటిని తరలించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. అంటే జి.ఓ. నెం.69 ని ఖాతరు చేయకుండా నీటిని తోడేస్తామని చెబుతున్నారని అర్థమం చేసుకోవాలా? అపోహలకు తావిచ్చే రీతిలో కొందరు మాట్లాడడం విపత్కర పరిణామాలకు దారి తీస్తున్నది.  సాధారణ వర్ష పాతం మాత్రమే నమోదైన సంవత్సరాలలో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు, యస్.ఆర్.బి.సి.కి నికరజలాలు గానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలుగు గంగకు కేటాయించిన 25 టి.యం.సి.లు సక్రమంగా అందుతాయా! అన్నసందేహాలు ఆయా ప్రాంతాల ప్రజల్లో మొలకెత్తాయి. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న‌ హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులు శాశ్వతంగా మూలనపడతాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సర్వామోదంతో అమలులో ఉన్న  జి.ఓ.నెం.69 కి తూట్లుపొడిచి, నీటిని తరలించడం చట్ట విరుద్దం కాదా? అంటే! జి.ఓ.నెం. 69 ని రద్దు చేస్తామని చెప్పకనే చెబుతున్నారని భావించాలా? అదే జరిగితే నీటి యుద్ధాలు రాక మానుతాయా? ఇది తెలుగు ప్రజల మధ్య‌ వాంఛనీయమా?
9) రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా ట్రిబ్యునల్ కేటాయించిన 133.7 టి.య‍ం.సి.లకు మించి రాయలసీమకు తరలించడానికి వీల్లేదని హూంకరిస్తున్నారు. అలాగే 11 టి.యం.సి.లకు మించి ఒక్క నీటి బొట్టును కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తీసుకెళ్ళడానికి అర్హత లేదని విద్యాసాగర్ రావు గారు పదేపదే మాట్లాడడంతో రాయలసీమవాసుల్లో భయాందోళనలు పెల్లుబుకుతున్నాయి. ఆ మాట కొస్తే! ఆ 11 టి.య‍ం.సి. లకు కూడా భవిష్యత్తులో అభ్యంతరం పెట్టరనే గారంటీ లేదు. కారణం, ఆ నీటి కేటాయింపు బచావత్ ట్రిబ్యునల్ చేసింది కాదు. ట్రిబ్యునల్ తదనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భీమా ప్రాజెక్టుకు లాగే యస్.ఆర్.బి.సి.కి కూడా సర్దుబాటు ద్వారా చేసిన కేటాయింపే.
శ్రీశైలం జలాశయం గుండెకాయ‌ లాంటిది. అక్కడి నుండే యస్.ఆర్.బి.సి. కి 19 టి.యం.సి.లు, కె.సి.కెనాలుకు 10 టి.యం.సి.లు, మద్రాసుకు 15 టి.యం.సి.లు, మొత్తం 44 టి.యం.సి.ల నికరజలాలు + 65% ప్రామాణికంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్  తెలుగు గంగకు ప్రతిపాదించిన 25 టి.యం.సి.లు, వెరసి 69 టి.యం.సి.లు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్ళే హక్కు ఆ ప్రాంత ప్రజలకున్నది. అలాగే తెలుగు గంగకు మరో ఐదు టి.యం.సి.ల మిగులు జలాలు మరియు మిగులు జలాల ఆధారాంగా నిర్మిస్తున్న హంద్రీ - నీవా (40), గాలేరు - నగరి (38) వెరసి మొత్తం 152 టి.యం.సి.లు వరదలొచ్చినప్పుడు నీటిని తరలించడానికి,  సౌలభ్యంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీరెక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెం.69 ప్రకారం మద్రాసు నగరానికి ప్రథమ ప్రాధాన్యత క్రింద నీటిని విడుదల చేయాలి. అంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్నిపరిరక్షించినప్పుడు మాత్రమే అది సాధ్యం. కృష్ణా నదిలో నీటి ప్రవాహం 30 రోజులకు మించడం లేదని నిపుణులు తాజాగా అంచనా వేశారు. ఆ మాసం రోజుల్లోనే కేటాయించిన నికరజలాలను, సముద్రం పాలయ్యే వరద నీటిని తరలించడానికి వీలవుతుంది. ఈ వాస్తవాలను తిరగదోడుతూ యస్.ఆర్.బి.సి.కి 11 + మద్రాసుకు 15 = 26 టి.య‍.సి.ల తరలింపుకే పోతిరెడ్డిపాడు వద్ద అనుమతి ఉందని మాట్లాడ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలో విజ్ఞులైన ప్రజలే ఆలోచించాలి.
10) రాయలసీమ ప్రాంతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం కాదని కొందరు అవగాహనారాహిత్యంతో మూర్ఖంగా వాదిస్తుంటారు. అలాంటి ప్రబుద్దులు కొందరు రాజకీయ నాయకులుగా కూడా చలామణి అవుతున్నారు. కృష్ణా నదికి తుంగభద్ర నది ఉపనద‌న్న కనీస పరిజ్ఞానం,  కర్నూలు, అనంతపురం జిల్లాలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయన్న తెలివి కొందరిలో కొరవడింది. రాయలసీమ వాసులు తమకు అడుగడుగునా అన్యాయాలే జరిగినా, తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాల కోసం అపారమైన‌ త్యాగాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం సందర్భంలో 1937 సం.లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం  'శ్రీబాగ్ ఒడంబడిక‌' కాలగర్భంలో కలిసి పోయింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యత నిస్తామని అందులో లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన‌ కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా సీమవాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తామని చెప్పి కరవు కాటకాలకు నిలయంగా మార్చేశారు. సిద్ధేశ్వరం బదులు శ్రీశైలం జలాశయాన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుగా నిర్మించి తీరని ద్రోహం చేశారు. తదనంతర కాలంలో ప్రజలు పోరాట ఫలితంగా దాన్ని సాగు నీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషా ప్రయుక్త‌ రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న బళ్ళారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. ఈ చరిత్ర తెలియని అజ్ఞానులూ ఉన్నారు. త్యాగాల చరిత్రను కనీసం గౌరవించాలనే సంస్కారం కూడా కొందరిలో లోపించింది. పైపెచ్చు రాయలసీమ ప్రజలను నీటి దొంగలుగా చిత్రీకరించే ఉన్మాదం కొందరిలో ప్రకోపించింది. కనీసం సాగు నీటి రంగ నిపుణులైనా సంకుచిత  భావాలకు బానిసలు కాకుండా నిత్యం కరవు బారిన పడుతున్న‌ ప్రాంతాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సూచించాలే గానీ, ప్రాంతీయ దురభిమానంతో మాట్లాడడం సముచితం కాదు.



                                                                                  టి.లక్ష్మీనారాయణ‌  

                                                                              డైరెక్టర్, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం