Monday, April 4, 2011

‘నిండుసభ ’ సాక్షిగా ‘కృష్ణా’ర్పణం!

published on April 2 2011,in sakshi Telugu daily

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ పూర్వరంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమా వేశాలు ఫిబ్రవరి 17న ప్రారం భమై, ఒక ప్రహసనంగా కొన సాగి, మార్చి 29న నిరర్ధకంగా ముగిశాయి. నిర్వహించాలి కాబ ట్టి మొక్కుబడిగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను, సభ్యుల హాజరుతో నిమిత్తం లేకుండా, అత్యధిక కుర్చీలు ఖాళీగా ఉన్నా నిండు సభగా భావించి, నిర్వహించి ఊపిరి పీల్చుకొన్నారు ప్రభుత్వ పెద్దలు. వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర కోసమే అన్నట్లు సభా నిర్వహణ తంతు నడిచింది.

గవర్నర్ ప్రసంగంపైన గానీ, బడ్జెట్ ప్రతిపాదనలపైన గానీ, శాఖల వారి పద్దులపైన గానీ, రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలపైన గానీ సభలో చర్చించిన పాపాన పోలేదు. ధూషణ భూషణ లతో విధ్వంసాలు, భౌతిక దాడులకు, వాక్ స్వాతంత్య్రం పై, ప్రజాస్వామ్య హక్కులపై ఫాసిస్టు తరహా దాడులకు సమావేశాలు సాక్షీభూతంగా నిలిచాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభలో సభా ప్రాంగణంలో జరిగిన ఘటనలు రాష్ర్ట చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

సమస్య అందరిదీ, కానీ ఎవరికీ పట్టలేదు!
కృష్ణా నదీ జలాల సమస్య తెలుగు ప్రజలందరి జీవన్మరణ సమస్య. నదీ జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మొత్తం రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనే అంశంపై ఎవరికీ పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ఉప ప్రాంతీయ భావజాలంతో కొట్టుకుపోతున్న వారు ఈ సమస్యకు నేడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

కానీ, రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి ఉన్న రాజకీయ పార్టీల వైఖరి ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇది అందరి సమస్య. కానీ ఎవ్వరికీ పట్టలేదు. ట్రిబ్యునల్ తీర్పు మూలంగా సంభవించే దుష్పరిణామాలపై సభలో సమగ్రంగా చర్చిం చి, నష్ట నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సమష్టి గా రూపొందించుకోవడానికి జవాబుదారీ తనంతో ప్రభు త్వం వ్యవహరించకపోవడం అత్యంత బాధ్యతారహితం.

రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ మనుగడే ప్రస్తుతం మిణుకు మిణుకుమంటున్నది. అపవిత్ర కలయికలు, మ్యాచ్‌ఫిక్సింగ్స్ ద్వారా వీలైనంత కాలం మనుగడ సాగిం చాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఈ పూర్వ రంగంలో సభ సజావుగా జరగకపోవడం పాలక పార్టీకి ఊరట కలిగించింది. దినదినగండంగా రోజులు గడుపుతున్న అత్యంత బలహీన మైన కిరణ్‌కుమార్ సర్కారు ఆ విధంగా ఊపిరి పీల్చుకొంది.

న్యాయం కోసం రాజీలేని పోరాటం
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని కీలకాంశాలను పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతుంది.

నికర జలాల నిర్ధారణకు బచావత్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 75 శాతం నీటి లభ్యత ప్రామాణికాన్ని తిరస్కరించి 65 శాతాన్ని తీసుకోవడం.

సగటు వార్షిక నదీ ప్రవాహంలో నుంచి నికర జలాలను మినహాయించగా లభించే నీటిని మిగులు జలాలుగా నామకరణం చేసి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం.

ప్రకాశం బ్యారేజీ నుండి అనివార్యంగా కిందికి ప్రవహించి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని లెక్కలోకి తీసుకోవడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరిం చడమే కాదు. అదొక మిథ్యగా చులకన భావంతో కొట్టిపారేయడం.

‘‘క్యారీ ఓవర్’’ పద్దు కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవ డానికి ఆమోదముద్ర వేస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడి, దానికి కాలం చెల్లిపోయిందని, ప్రస్తుతం మన రాష్ట్రా నికి మిగులు జలాలలో వచ్చిన 145 టీఎంసీలతోపాటు 65 శాతం ప్రామాణికం ఆధారంగా అదనంగా రాష్ట్రా నికి కేటాయించిన 39 టీఎంసీల నికర జలాలలోని 5 టీఎంసీలను కలిపి మొత్తం 150 టీఎంసీలను ‘‘క్యారీ ఓవర్’’ ‘‘స్టోరేజి’’ పద్దు కింద కేటాయించడం పెద్ద దగా. మిగిలిన నీటిలో 9 టీఎంసీలను జూరాల ప్రియ దర్శినికి, 25 టీఎంసీలను తెలుగుగంగకు ట్రిబ్యునల్ షరతులతో కేటాయించింది.

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి లభ్యతను నిర్ధారించే గణాంకాలకు కలిపి లెక్కించడం.

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపకరించే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణానికి ఆమోదం తెలపక పోగా కర్ణాటక వాదనను బలపరుస్తూ, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం బయటికి నీటిని తరలించుకుపో వాలనే దుర్బుద్ధి మన రాష్ట్రానికి ఉన్నట్లు ట్రిబ్యునల్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించింది. తుంగభద్ర రిజర్వాయరులో పూడిక మూలంగా నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీల నుండి 104.34 టీఎంసీలకు పడిపోయిందని నిపుణుల అంచనా. పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ 230 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయరు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వినియోగానికి కేటాయించినా, ప్రస్తుత 212 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి. కర్ణాటక మాత్రం పూర్తి స్థాయిలో నీటిని వాడుకొంటూ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. 186 కి.మీ. పొడవు గల తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సి) 105 కి.మీ. ఉమ్మడి కాలువగా కర్నాటక భూభాగంలోనే ప్రవహిస్తున్నది. ఈ కాలువ కింద కేటాయించిన 50 టీఎంసీలలో 32.5 టీఎంసీలు మన రాష్ట్రానికి రావాలి. కానీ ఏనాడు మన వాటా మేరకు నీరు అందింది లేదు.

కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా నిత్య కరువులతో కృంగికృషించిపోతున్న జిల్లాల నీటి అవసరాలను తృణీకార భావంతో లెక్కలోకే తీసుకో లేదు. వలసలకు మారు పేరుగా నిలిచి, అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలకు 9 టీఎంసీలు అదనంగా కేటాయించడం మినహాయిస్తే, మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు, నల్ల గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం) ప్రాజెక్టుకు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా ప్రయోజనం కలిగించే హంద్రీ-నీవా సృజల స్రవంతికి మిగులు జలాలను పంచుతున్న సందర్భంలోనైనా నీటి కేటాయింపులు చేయాలనే స్పృహ ట్రిబ్యునల్‌కు కొరవ డింది. కృష్ణా మిగులు జలాల తరలింపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ, కడప, చిత్తూరు జిల్లాల ప్రజల గొం తులు తడిపే గాలేరు-నగరి ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.

మానవీయ కోణంలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదీ పరీ వాహక ప్రాంతంలోనే ఉన్న నిత్య కరువు పీడిత, అత్యంత వెనుకబడిన జిల్లాల నీటి కడగండ్లను తీర్చడం ద్వారా సమన్యాయాన్ని అమలు చేయాలని ట్రిబ్యునల్ భావించ లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిలో 49 శాతం పరీ వాహక ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించడం జరిగింది కాబట్టి మరే ఇతర ప్రాజెక్టుకు నీటిని కేటాయించడం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది.


అదనపు నీటిని సాధించుకోవాలి
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి మన రాష్ట్ర పరిధిలో కొన్ని ‘‘సర్దుబాట్లు’’ ద్వారా కొన్ని ప్రాజెక్టులకు అఖిల పక్ష సమావేశాలలో చర్చించి నికర జలాలను కేటాయించడం జరిగింది. అవి
కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా 19 టీఎంసీలను ఆదా చేసి భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించారు.

కేసీ కెనాల్ ఆధునికీకరణ ద్వారా 8 టీఎంసీలు ఆదా చేసి పునరుత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి లభించిన 11 టీఎంసీలను కలిపి 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్‌ఆర్‌బీసీ)కు కేటాయించారు.

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీలను అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం రిజర్వాయర్ (పీఏబిఆర్)కు కేటాయించి, శ్రీశైలం రిజర్వాయరు నుంచి ఆ మేరకు కేసీ కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంతరంగిక సర్దుబాట్ల ద్వారా భీమా, ఎస్‌ఆర్‌బీసీ, పీఏబీఆర్ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలను అదనంగా సాధించుకోవడానికి కృషి చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా మన రాష్ట్రానికి సంక్రమించిన ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించుకొంటూ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను సాధించుకోవలసిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వంపై ఉన్నది. ఈ పూర్వ రంగంలో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ఈ జీవన్మరణ సమస్యపై చర్చించి, వ్యూహ రచన చేసుకోకపోవడం చట్ట సభలపై ప్రజలకున్న విశ్వాసాన్ని వమ్ము చేసింది.

No comments:

Post a Comment