Sunday, July 26, 2015

పుష్కరాలతో తెలుగు నేల పుణ్య భూమిగా మారిపోయిందా!

ప్రజల విశ్వాసాన్ని అరమరికలు లేకుండా నేను గౌరవిస్తాను. మతాన్ని అనుసరించడం, భక్తి ప్రపత్తులతో వ్యక్తిగత జీవితాలను క్రమశిక్షణాయుతంగా మలచుకోవడం, ఆయా సమాజాల్లో ఉన్నతంగా భావించబడే నైతిక విలువల ప్రాతిపథికపై వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని, పది మందికి ఆదర్సప్రాయంగా నిలవాలని పరితపించే మహోన్నత వ్యక్తులపై నాకు అపారమైన గౌరవం ఉన్నది.  కానీ, భారత‌ రాజ్యాంగం ప్రభోదిస్తున్న లౌకిక వ్యవస్థకు, శాస్త్రీయ భావజాలానికి తూట్లు పొడుస్తూ, మూఢత్వాన్ని పెంచి పోషిస్తూ  ప్రభుత్వాలే ఈ తరహా కార్యక్రమాలను బుజానికెత్తుకోవడం చూస్తే జుగుప్స కలుగుతుంది. ఈ పనికి పూనుకోవడంలో పాలకుల‌ తాత్విక ప్రయోజనాలు వారికున్నాయనడంలో నిస్సందేహం.
గొంతు లెండి పోతున్న కరువు సీమల్లో త్రాగు, సాగు నీరు పారించక పోయినా తెలుగు నాట భక్తి రసాన్ని మాత్రం ఏరులై పారించారు. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేవు కానీ, పాలకులు తలచుకొంటే పుష్కరాలకు డబ్బుల కొదవే లేదని రుజువు చేశారు. మానవ సేవే మాధవ సేవన్నారు పెద్దలు. అది మాత్రం గుర్తు లేదన్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు. గోదావరి పుష్కరాలకు విడ్కోలు పలుకుతూ, కృష్ణా పుష్కరాలకు తెరలేపారు. శభాష్! అటుపై పెన్నార్ పుష్కరాలొస్తాయేమో! కాకపోతే ఆ పెన్నార్ నది నీళ్ళులేక ఒట్టిపోయింది.
స్వాతంత్ర్యానంతరం దశాబ్ధాల పాటు సాగిన‌ నీతి మాలిన పాలన, పనులతో తెలుగు గడ్డపై అన్ని సామాజిక రంగాలు విషతుల్యంగా మారి  దుర్గంధం వెదజల్లబడుతున్నది. కులం, మతం, ప్రాంతీయ విద్వేషాలు, అవినీతి, అక్రమాలు, అక్రమార్జన, విచ్చల విడిగా దోపిడీతో పాపాల పుట్టగా తెలుగు నేల‌ కంపుకొడుతున్న నేపథ్యంలో గోదావరి పుష్కరాల సంబరాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. గోదావరిలో మునగండి, పాపాల మురికి వదిలించుకోండి, పుణ్యాన్ని మూట కట్టుకోండి, సుఖమయ జీవితానికి మరియు స్వర్గానికి మార్గాన్ని సుగమం చేసుకోండని ప్రచార హోరు సాగించాయి. పులకించి పోయిన తెలుగు ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆలశించిన‌ ఆశాభంగం అన్నట్లు గోదావరి వైపు పరుగులు తీశారు. తెలంగాణలో 6.4, ఆంధ్రప్రదేశ్ లో 4.89, మొత్తం 11.29 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారని ఘనంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించుకొన్నాయి. అంకెలు ప్రకటించుకోవడంలో కూడా అనారోగ్యకరమైన పోటీనే సుమా! పాపం తృప్తిగా గోదావరి స్నానం చేసి, పాప పరిహారం చేసుకొని వద్దామని వెళ్ళిన భక్తులు కొన్ని ఘాట్ల వద్ద‌ మురికి నీటిలో, బురదలో పొర్లాడి వెనుదిరగాల్సి వచ్చింది. మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆ నీటిలో ఉంటే చర్మ వ్యాధుల భారిన పడతారని అధికారికంగానే హెచ్చరికలు కూడా జారి చేశారు.
ప్రభుత్వాలు ప్రకటించిన‌ గణాంకాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే! రెండు రాష్ట్రాల జనాభా 8.5 కోట్లకు మించి లేదు. పాప భీతిలేని నాలాంటి లక్షలాది మందో! కోట్లాది మందో! గోదావరిలో మునగలేదు. తెలుగు ప్రజలే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల ఉంచి కూడా మునకేసి పోయారని పాలకులు సమర్థించుకొంటున్నారు. పోనీలేండి వారు ప్రకటించుకొన్న సంఖ్య గోల ప్రక్కనబెడదాం! దాని వల్ల వచ్చే నష్టం లేదు.
మన తెలుగు నేల గోదావరి పుష్కరాలతో ఒక్క దెబ్బతో పుణ్య భూమిగా మారిపోయింది. ఈనాటి నుండి దోపిడీలు, దొంగతనాలు, నీతి మాలిన పనుల నుండి తెలుగు జాతికి విముక్తి లభిస్తుందని ఆశిద్దాం! పాత ఖాతాలోని పాపాల మూటను గోదావరిలో ముంచేసి వచ్చాం కదా! ఇహ! స్వేచ్ఛగా మళ్ళీ కొత్త ఖాతా తెరవచ్చులే అని అవినీతిపరులు, ప్రజాకంఠకులు భావిస్తారేమో! తస్మాత్ జాగ్రత్త.

No comments:

Post a Comment