Wednesday, April 13, 2016

ప్రజల విశ్వాసాలు, మహిళల సాధికారత పట్ల‌ స్వరూపానందకు గౌరవం లేదా?

ప్రజల విశ్వాసాలను గాయ పరచడమే కాదు, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా 'ఒక పకీరును(షిరిడి సాయి బాబా) ఆరాధించడం మూర్ఖత్వమని, పర్యవసానంగానే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తున్నదని అక్కసు వెళ్ళగక్కడం, మహిళల సాధికారతను తిరస్కరించడమే కాదు, శని దేవుడ్ని ఆరాధిస్తే మానభంగాల సంఖ్య పెరుగుతుందని నీచాతినీచంగా స్వరూపానంద వ్యఖ్యానించడం పీఠాధిపతుల దిగజారుడుతనానికి అద్దం పడుతున్నది.
మతపరమైన మరియు స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను పెంచి పోషించడానికి స్వామీజీలు ఎంతటి నిబద్ధతతో కృషి చేస్తున్నారో బోధపడుతున్నది. శాంతియుత సహజీవనాన్ని గడపమని ప్రజలకు ప్రబోధించడానికి బదులు సమాజంలో అలజడులకు, అశాంతికి, హింసకు ఆజ్యం పోసే విధంగా రెచ్చగొట్టే రీతిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలను బాధ్యతారహితంగా చేయడాన్ని సభ్యసమాజం గర్హించాలి.
భారత దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, దాన్ని అమలు చేసే న్యాయ వ్యవస్థ ఉన్నదన్న స్పృహ పీఠాధిపతులకు, స్వామీజీలకు లేదా! అంటే ఉన్నదనే సమాధానమే వస్తుంది. కానీ, వాటికి అతీతులమన్న భావనతో పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు వ్యవహరిస్తున్నారనడానికి ఈ ఉదంతం ఒక ప్రబల నిదర్శనం. లౌకిక వ్యవస్థకు, ప్రజాస్వామ్య మరియు మానవ హక్కులకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే తీరులో నిత్యం వ్యాఖ్యలు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు?
హిందూ ధర్మ పరిరక్షకులం తామేనని తమకు తాము ప్రకటించుకొంటూ అన్ని రకాల అప్రాచ్యపు పనులు చేస్తున్న కొందరి పీఠాధిపతుల, స్వామీజీల, బాబాల భాగోతాలను, గుట్టు రట్టు చేస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక ఉదంతాలు విస్తృతంగానే వెలుగులోకి వచ్చాయి, వస్తున్నాయి.
ప్రఖ్యాతిగాంచిన కంచికామకోఠి పీఠాధిపతి ఆస్తి వివాదంలో ఇరుక్కొని, ఏకంగా హత్య కేసులో ముద్ధాయిగా జైలు పాలైన ఘటన గతంలో జరిగింది. యోగా బాబా రామ్ దేవ్ లాంటి వారి వెకిలి చేష్టల్ని చూస్తూనే ఉన్నాం. ఆధ్యాత్మిక కార్యకలాపాల ముసుగులో అమాయకత్వం, మూఢత్వం ఊబిలో కూరుకపోయిన మహిళలను ప్రలోబ పెట్టి లేదా బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవడం, విలాసవంతమైన జీవితం కోసం అర్రులు చాస్తూ దారి తప్పిన మహిళలను లోబరుచుకొని సభ్యసమాజం అసహ్యించుకొనే విధంగా అనైతికంగా శృంగార జీవితాన్ని గడుపుతున్న నిత్యానంద స్వామీజీ వంటి వారి నిజ జీవితాల, చీకటి బతుకుల భాగోతాలు వెల్లడౌతూనే ఉన్నాయి.
పీఠాధిపతుల, స్వామీజీల వ్యవస్థకే కళంకం తెస్తున్న, భ్రష్టు పట్టించిన ఉదంతాల జాబితా చాంతాడంత ఉన్నది. సరళీకృత విధానాలు, మార్కెట్ శక్తుల ప్రభావం ఈ వ్యవస్థపైన కూడా బాగానే ప్రసరించింది. దోపిడీ వ్యవస్థ ప్రయోజనాలను పరిరక్షించడమే ధేయంగా పుట్టి, పెరిగి, బలంగా వేళ్ళూనుకొన్న ఈ వ్యవస్థ నేటి సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తూనే ఉన్నది. ఆ వ్యవస్థ డొల్లతనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయినా ఉపేక్షిస్తూనే ఉన్నారు. ఆరాధిస్తూనే ఉన్నారు. వారి ఉపదేశాలు వినడానికి తండోప తండాలుగా వారి వెంట పరుగులు తీస్తూనే ఉన్నారు. చదువుకొన్న వారు, చదుకోనివారన్న తేడా కనపడడం లేదు. గ్రామీణ, పట్టణ, నగరవాసులు, నాగరికులు, అనాగరికులన్న తేడా కూడా కనిపించడం లేదు. కళ్ళకు మతం గంతలు కట్టుకొని ఛాందస భావాలు, మూడత్వంతో ప్రజలు తమ ప్రయాణాన్ని కొనసాగించినంత కాలం సమాజ ప్రగతి ఎండమావే!
బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ శక్తులు మరింత పెట్రేగిపోతుంటాయి. మత ప్రాతిపథికపైన సమాజాన్ని చీల్చి, ప్రజల మధ్య అగాధాన్ని, వైషమ్యాలను, ఘర్షణ వాతావరణాన్ని పెంచిపోయడానికి నిరంతరాయంగా పని చేస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాం. ఆ దుష్టశక్తులకు కళ్ళెం వేసే పరిస్థితులే కనపడడం లేదు.
ఇతర మతాలకు చెందిన వ్యవస్థలు కూడా ఇలాగే దొందూ దొందూ లాగే నడుస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం పెంపొందకుండా దోపిడీ వ్యవస్థకు రక్షణ కవచంగా, మనోభావాలతో మిళితమై ఉన్న ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను బలహీనపరచడం, ధ్వంసం చేయడం సాధ్యం కాదు.

No comments:

Post a Comment