Monday, May 23, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేను వ్రాసిన వ్యాసాన్ని వివిధ వాట్స్ ఆఫ్ గ్రూపుల్లోను, ఫేస్ బుక్ లోను ఫోస్ట్ చేశాను. అలాగే ఇ-మెయిల్స్ ద్వారా మిత్రులకు పంపాను. చాలా మంది మిత్రులు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్స్ చేశారు. నా వ్యాసం పూర్వరంగంలో ప్రస్తావనకు వచ్చిన మూడు అంశాలపై స్పందించాలని పించింది.

1. పశ్చిం బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలు - కాంగ్రెస్ కలిసి  పోటీ చేయక పోయి ఉంటే బిజెపి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించేదన్న వాదనను సిపిఐ(యం) పశ్చిం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి హిందూ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో వినిపించారు.

ఏంట్రా! పడ్డావ్ అంటే అదొక లగువులే! అన్నాడంట ఒకడు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని తప్పులు చేయడమంటే ఇదేనేమో! చిన్న పిల్లలు ఏడుస్తుంటే పెద్ద వాళ్ళు అంటుంటారు, 'బూచోడొస్తున్నాడు, ఏడిస్తే పట్టుకెళ్ళతాడు'. సిపిఐ(యం), పశ్చిం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి వాదన కూడా ఆ కోవకు చెందినట్లుగా కనబడుతున్నది. బిజెపి బూచిని చూపెట్టి తప్పుడు ఎన్నికల పొత్తును ఎలాంటి జంకు లేకుండా సమర్థించుకోవడానికి ఆయన గారు ప్రయత్నించారు. అది సరియైన ఎన్నికల ఎత్తుగడే అయితే సిపిఐ(యం) జాతీయ నాయకత్వం ఎందుకని నిర్భీతిగా సమర్థించుకోవడం లేదన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. పైపెచ్చు రాష్ట్ర శాఖ మీద నెపాన్ని నెట్టి వేసే దోరణిలో ఆ పార్టీ నాయకులు 'కేంద్ర కమిటిలో సమీక్ష చేస్తామని' సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా!

పోనీ, సూర్జ్య కాంత మిశ్రా గారు ఒప్పుకొన్నట్లు వామపక్షాలు - కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవగాహన కుదుర్చుకొన్నాయి కదా! మరి, కలిసి ఎందుకు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించుకొని, ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అయ్యేలా వామపక్షాలు ప్రయత్నించ లేదు? లోపాయికారి ఒప్పందాలతో ఓట్లు బదిలీ అవుతాయా! కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ఒప్పందం చేసుకొన్నామని ప్రచారం చేసుకొని లబ్ధి పొందింది.

2011లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 30.08% ఓట్లను సాధించుకొన్న సిపిఐ(యం), 2014 లోక్ సభ ఎన్నికల నాటికి 22.96% కి పడి పోయి, నేడు 19.7% కి దిగజారి పోయింది. పతనానికి దారి తీసిన కారణాలను నిజాయితీగా పరిశోధించుకోవలసిన తరుణంలో బిజెపి బూచిని చూపెట్టో, బిజెపి - తృణమూల్ కాంగ్రెస్ కుమ్మక్కు అయినాయనో నమ్మపలకడం వల్ల వామపక్ష ఉద్యమానికి జరిగే ప్రయోజనమేమీ ఉండదేమో! కాంగ్రెసుతో అపవిత్ర పొత్తు కుదుర్చుకొని భంగపడడమే కాకుండా ఘోరంగా ఓడి పోయిన తరువాత కూడా నిజాయితీతో ఆత్మవిమర్శ చేసుకోవడానికి బదులు తప్పుడు నిర్ణయాలను సమర్థించుకోవడానికి పూనుకొంటే ప్రతిష్ట మరింత మసక బారుతుందేమో!

2. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలు సాధించిన ఫలితాల గణాంకాలను ప్రస్తావిస్తూ బిజెపి 696 స్థానాల్లో పోటీ చేసి 64(9.1%) స్థానాల్లో మాత్రమే గెలిచిందని, వామపక్షాలు 452 పోటీ చేసి 124(27.4%) గెలిచాయని, కాంగ్రెస్ 363 పోటీ చేసి 115(31.6%) విజయం సాధించిందని ఫోస్ట్ పెట్టారు.
ఫోస్ట్ లో పొరపాటుగా అన్నింటినీ కూటములుగా పేర్కొన్నారు. గణాంకాలను ప్రస్తావించేటప్పటికి సిపిఐ(యం), సిపిఐ, ఆర్.యస్.పి., పార్వర్డ్ బ్లాక్ నాలుగు పార్టీలతో కూడిన లెఫ్ట్ ప్రంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. బిజెపి, కాంగ్రెస్ లను పార్టీలుగానే పరిగణించి వాటికొచ్చిన స్థానాలను పేర్కొన్నారు. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి.

ఈ తరహా  పాక్షికమైన గణాంకాలతో పొందే ప్రయోజనమేమిటో నాకు బోధపడ లేదు. వామపక్ష శ్రేణులు, శ్రేయోభిలాషులలో వేళ్ళూనుకొన్న నిరాశ, నిస్పృహకు ఈ తరహా ప్రచారం ఏమన్నా నూతనోత్సాహాన్ని నింపుతుందా? పైపెచ్చు నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవలసిన సందర్భంలో ఆ ప్రక్రియ అవసరం లేదన్న తప్పుడు సంకేతాన్ని ప్రచారంలో పెట్టినట్లు అవుతుంది. ఆలోచించాలి.

2014 మొదలు నేటి వరకు 16 రాష్ట్రాలలో శాసనసభల ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 2,209 శాసన సభా స్థానాలున్నాయి. వాటిలో జాతీయ పార్టీలైన బిజెపికి 379, కాంగ్రెసుకు 296, సిపిఐ(యం)కు 88, సిపిఐకి 21 వచ్చాయి. బిజెపి 9 రాష్ట్రాలలోను, కాంగ్రెస్ 8 రాష్ట్రాలలోను, వామపక్షాలు 2 రాష్ట్రాలలోను అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీలు 12 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ&కాశ్మీర్ లో బిజెపి చిన్న భాగస్వామి పార్టిగా ఉంటే మహారాష్ట్ర, అస్సాంలలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది. వాస్తవాలను, వాస్తవాలుగా పరిగణలోకి తీసుకొని దేశ రాజకీయాలలో పార్టీల బలాబలాను అంచనా వేసుకోవాలి తప్ప, వంకరబుద్ధితో ఆలోచిస్తే జరిగే మేలేమిటి?

ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు గడచిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలను పరిశీలిస్తే బిజెపి - 282, కాంగ్రెస్ - 44, సిపిఐ(యం) - 9, సిపిఐ - 1, బి.యస్.పి. - 0, యన్.సి.పి. - 6, మొత్తం 543కు గాను జాతీయ పార్టీలు గెలుపొందిన స్థానాలు 342. ఓట్ల శాతాన్ని చూస్తే 60.70%. అంటే ప్రాంతీయ పార్టీల బలాన్ని తక్కువ అంచనా వేయలేం కదా! 2014 లోక్ సభ ఎన్నికల తదనంతర కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బలం తగ్గిపోతున్నది. పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కోలుకోవడం లేదు. ప్రస్తుతానికి పెద్ద రాష్ట్రాలలో ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉన్నది. మిగిలినవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. అక్కడ కూడా తన్నుకు చస్తూ, ఒడుదుడుకుల మధ్య నెట్టుకొస్తున్నారు.

బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, గోవా రాష్ట్రాలలో రాబోయే రెండు సంవత్సరాలలో శాసన సభలకు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితులు కనపడడం లేదని, తక్షణం దిద్దుబాటు చర్యల్లో భాగంగా నాయకత్వంలో ప్రక్షాళన జరగకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో నూతన శక్తులు ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని,   కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గారు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖాస్త్రం సందించినట్లు వార్తలొచ్చాయి.

వామపక్షాలు బలహీనపడ్డాయి. కేరళ, త్రిపుర  మినహా ఇస్తే మిగిలిన రాష్ట్రాలలో పరిస్థితులు ఆశాజనకంగా కనపడడం లేదన్నది వాస్తవం. ఇవన్నీ కూడా ఎన్నికలలో ఆయా పార్టీలు సాధిస్తున్న ఫలితాలను బట్టి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే. ఉద్యమాల ప్రాతిపదికన కాదు.

నేడు దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై మార్క్సిస్టు దృక్పథంతో సక్రమ పంథాను, రాజకీయ విధానాన్ని రూపొందించుకోవడం, స్థిరచిత్తంతో వాటి అమలుకు పూనుకోవడం వామపక్షాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.

3. ఒకనాడు సిపిఐ, నేడు సిపిఐ(యం) కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని వామపక్ష ఉద్యమానికి నష్టాన్ని కొని తెచ్చుకొన్నాయని, చేసిన తప్పులను సైద్ధాంతిక కోణంలో సమర్థించుకొనే ప్రయత్నాలను నిరంతరం చేస్తూనే ఉన్నారని పి.యస్.వి. చేసిన వ్యాఖ్యను తృణీకార భావంతో కొట్టి వేయలేం. కాంగ్రెసును ప్రధానమైన వర్గ శత్రువుగా ఎంచుకొని, భావజాల పోరాటాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళి, కడకు కమ్యూనిస్టు ఉద్యమ చీలికకు అది కూడా ఒక ప్రధానమైన కారణంగా చరిత్రలో చెప్పబడుతున్నది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైనే సిపిఐ(యం) నిర్మించబడిందని చెబుతుంటారు. నేటి పరిణామాలను చూస్తుంటే చరిత్ర తిరగబడినట్లనిపిస్తున్నది.

టి.లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment