Tuesday, September 26, 2017

అణ్వస్త్రరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలి!

1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో, హీరోషిమా, నాగసాకిలపై హైడ్రొజన్ బాంబులు వేసి మారణహోమానికి అమెరికా పాల్పడింది. ఆనాటి నుంచే ప్రపంచ ప్రజానీకం మనస్సుల్లో అమెరికా అంటే ఒక యుద్ధోన్మాద దేశం అన్న భావన పదిలంగా ఏర్పడింది. సోవియట్ యూనియన్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించి, రక్షణ రంగంలో పోటాపోటీగా అభివృద్ధి చెంది ఉన్నంత కాలం కాస్త వెనకడుగు వేసి చర్చలకు అంగీకరించింది. పర్యవసానంగా, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(స్టార్ట్)పై రెండు దేశాలు 1991లో సంతకాలు చేశాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తదనంతర పరిణామాల పూర్వరంగంలో 1994లో ఆ ఒప్పందం అమలులోకి వచ్చింది. అణ్వాయుధాల ఉత్ఫత్తిని కొనసాగించ కూడదని, నిల్వ ఉన్న అణ్వాయుధాలను క్రమేపీ తగ్గించుకొంటూ రావాలన్ననిర్ధేశిత లక్ష్యాల సాధనలో అడుగు ముందుకు పడలేదు.

గడచిన ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలను పరిశీలిస్తే అమెరికా దుశ్చర్యల వల్లనే యుద్ధాలు వచ్చాయి. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఆప్ఘనిస్తాన్ లో ఆంతరంగిక యుద్ధం, మరొకొన్ని దేశాల్లో జరిగిన యుద్ధాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొన్న లేదా పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్ర అమెరికాకే ఉన్నది. అలాగే ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా మరికొన్ని దేశాలను అమెరికా 'రోగ్ కంట్రీస్'గా ప్రకటించింది. ఎందుకు అమెరికా అలాంటి దౌత్యనీతిని ప్రదర్శిస్తూ వస్తున్నదో మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకోవాలి.

నేడు ప్రపంచంలో పదహైదు వేల అణ్వాయుధాలు ఉంటే వాటిలో అమెరికా దగ్గర ఏడు వేలు, రష్యా దగ్గర మరో ఏడు వేలు ఉన్నాయి. ఇంగ్లండు, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దేశాల వద్ద వెయ్యి ఉన్నాయి. ఏడు వేల అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకొన్నఅమెరికా వల్ల ప్రపంచానికి ముప్పులేదన్నట్లు వ్యవహరిస్తూ, పైపెచ్చు అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతున్నదని, పది అణ్వాయుధాలను సమకూర్చుకొన్న ఉత్తర కొరియా ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించిందన్న ప్రచారాన్ని అమెరికా చేస్తున్నది. ఒక్కటి మాత్రం నిజం. అణ్వాయుధాలు ఏడు వేలున్నా, పది ఉన్నా, వాటిలోఒక్క దాన్ని ప్రయోగించినా జరిగే విధ్వంసం అపారంగానే ఉంటుంది.

తనను 'రోగ్ కంట్రీ'గా ప్రకటించిన అమెరికా నుండి తనను తాను రక్షించుకోవాలంటే, మరొక ఇరాక్ గా, ఆఫ్ఘనిస్తాన్ గా, సిరియాగా కాకుండా ఉండాలంటే అణ్వాయుధాలను తయారు చేసుకోవడమొక్కటే మార్గమన్న దుస్థితికి ఉత్తర కొరియా నెట్టబడిందేమో! దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించడం, కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వతంగా సైనిక స్థావరాన్నిఏర్పాటు చేసుకోవడం లాంటి యుద్ధోన్మాద చర్యలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టాయనడంలో సందేహం లేదు.

అణ్వాయుధాలను నిర్వీర్యం చేయండి, కొత్తగా తయారు చేయవద్దని ప్రపంచ దేశాలన్నీకోరుకొంటున్నాయి. ఒక్క ఉత్తర కొరియాకే కాదు, అణ్వాయుధాలు కలిగి ఉన్న అన్ని దేశాలకు ఇది వర్తింప చేయాలి. అణ్వాయుధరహిత సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేద్దామన్న దృక్పథంతో ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చి నుండి చర్చల ప్రక్రియను ప్రారంభించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి దేశం అమెరికానే. అలాగే, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలు, దాని మిత్ర దేశాలు ఉన్నాయి. భారత్ సహా అణ్వస్త్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి.

సెప్టంబరు 20 నుండి సంతకాల సేకరణను మొదలు పెడితే ఇప్పటికే 53 దేశాలు ఆ తీర్మానంపై సంతకాలు చేశాయని, మూడు దేశాలు 'ర్యాటిపై' కూడా చేశాయని చెప్పబడుతున్నది. ప్రపంచాన్ని కాపాడు కోవాలంటే ఒక్క ఉత్తర కొరియాను కట్టడి చేస్తే సరిపోతుందా! భారత దేశం పోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు తమకే ఆ హక్కు ఉన్నది, ఇతర దేశాలకు ఉండకూడదనే ద్వంద నీతి ప్రదర్శించడం సమర్థనీయం కాదు. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన అణ్వాయుధాలన్నింటినీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం.
 
అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో ప్రకటించిన దేశాల జాబితా నుండి సుడాన్ ను తొలగించి ఉత్తర కొరియా, చాద్, వెనుజువెలా దేశాలను కొత్తగా చేర్చి డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల పూర్వరంగంలో ఈటీవి 'అమెరికా నిషేధాస్త్రం' అన్న శీర్షికతో ప్రతిధ్వని నిర్వహించింది. చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ డి.పాపారావు, జెన్ మనీ సంస్థ, జనరల్ మేనేజర్ శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చర్చలో నేను పై అభిప్రాయాలను స్థూలంగా ప్రస్తావించాను.

https://www.youtube.com/watch?v=BRq8f1TYam8&t=994s

No comments:

Post a Comment