Thursday, May 24, 2012

పేదలపై ఆర్థిక సంస్కరణవాదుల దాడి


Published in Visalaandhra Daily on 19th May 2012            
                                     
సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో పేదరికాన్ని తగ్గించడమన్నది ప్రధాన వ్యూహమని డా: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు.పి.ఎ. 2 ప్రభుత్వం పదేపదే వల్లెవేస్తుంటుంది . ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం 2011_12 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 6.9% వృద్ధి రేటు నమోదు చేసుకొని ముందు వరుసలో పయనిస్తున్నదని , కానీ 11వ పంచవర్ష ప్రణాళికా (2007_12) కాలంలో 9% లక్ష్యంగా పెట్టుకొన్నా సగటున 8.2 శాతాన్ని సాధించామని, 12వ పంచవర్ష ప్రణాళికా(2012_17) కాలంలోనైనా 9% చేరుకోవాలంటే సంస్కరణల అమలులో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ధ్వందంగా ప్రకటించింది . సంపద వృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తుకు బరోసా లభిస్తుందని ఆశిస్తాం . ఆ జాతి సంపద‌లో పేదలకు వాటా దక్కకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు . జి.డి.పి. పెరుగుదలకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి , ప్రజల కొనుగోలు శక్తి మరియు జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో వేగంగా అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం , విద్య , వైద్యం వగైరా మానవ హక్కులను అనిభవించే భౌతిక పరిస్థితులు కల్పించబడాలి . అప్పుడే అభివృద్ధి అన్న పదానికి అర్థం , పరమార్థం ఉంటుంది . అలా కాకుండా నయవంచనతో కూడిన ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ , సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలన్న రాజ్యాంగ స్ఫూర్థికి తూట్లుపొడ‌డం అభివృద్ధి అని ఎలా అనిపించుకొంటుంది?

నేడు వివిధ తరగతుల ప్రజానీకానికి ఇస్తున్న సబ్సీడీలను పథకం ప్రకారం తొలగించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలనే మాయ మాటలతో జి.డి.పి.లో సబ్సీడీల శాతాన్ని 2012_13 ఆర్థిక సంవత్సరంలో 2% నికి , అటుపై 1.75% నికి , అలా క్రమేఫీ కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై  ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సీడీల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని పథకం ప్రకారం పావులు కదుపుతున్నది . ప్రప్రథమ చర్యగా దారిద్ర రేఖ నిర్ధారణకు అసంబద్ధమైన , అశాస్త్రీయమైన ప్రాతిపదికలను వర్తింపజేస్తూ పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపెట్టే దుర్మార్గానికి పాల్పడింది . అందులో అంతర్భాగంగా కేంద్ర ప్రణాళికా సంఘం రూపొందించిన నివేదిక నవ్వుల పాలైయ్యింది . పట్టణ ప్రాంతాలలో రు.32/‍.. , గ్రామీణ ప్రాంతాలలో రు.26/.. లు రోజువారి ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే దారిద్ర రేఖ ( బి.పి.యల్.) క్రింద జీవిస్తున్న వారుగా పరిగణించబడతారని ఆ నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు . ఆ గణాంకాలు చూసి సభ్య సమాజం ముక్కున వేలేసుకొన్నది .ఇంత కంటే దారుణమైన , కౄరమైన "జోక్" మరొకటి ఉంటుందా ? అన్న సందేహం పామరులకు సహితం కలిగింది . దారిద్య రేఖ క్రింద జీవిస్తున్న జనాభాను తగ్గించి చూపడం ద్వారా సబ్సీడీల భారాన్ని తగ్గించుకోవాలనే కక్కుర్తి ఆలోచన తప్ప మరొకటి కాదు ." ఆమ్ ఆద్మీ" పేరు చెప్పుకొని అధికార పీఠమెక్కి , పేదల బ్రతుకులను చిద్రం చేసే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు . ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కనీసం నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం , పతనమైపోతున్న ప్రజల కొనుగోలు శక్తిని , జీవన ప్రమాణాలను, నిరుద్యోగాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం ప్రజా ప్రభుత్వానికి తగునా ? మరొక వైపున "మూలిగే నక్క మీద‌ తాటిపండు పడ్డట్లు" ప్రజలపై పెనుభారాలు మోపుతూనే ఉన్నారు .

సబ్సీడీల వ్యవస్థకు మంగళం పాడి , పేదల మెడలకు ఉరితాళ్ళు బిగించాలని నిశ్చయించుకొన్నది . ఈ పథకంలో అంతర్భాగంగా నందన్ నీలేకర్ నేతృత్వంలోని " టాస్క్ పోర్స్ " చేసిన సిఫార్సును ఆమోదించి "తేనె బూసిన కత్తెలాంటి"  నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది . సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై ఇస్తున్న రాయితీలు దుర్వినియోగం , అవినీతిపరుల పాలు కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్న ముసుగేసుకొన్నది . ఆధార్ కార్డు ఆధారితంగా అర్హులను నిర్ధారించి , ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకొన్న కొన్ని ప్రాంతాలు , రంగాలలో అమలుకు శ్రీకారం చుట్టింది . మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో  వంట గ్యాస్ ను మార్కెట్ ధరకు అంటే 14.5 కే.జి.ల సిలెండర్ ను రు.750 లకు పైగా విక్రయించి , సబ్సీడీ మొత్తాన్నినేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేసే " పైలెట్ ప్రాజెక్టు "ను మైసూర్ లో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు . ఇదే తరహాలో కిరోసిన్ పథకాన్ని రాజస్తాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో అమలుకు పూనుకొన్నారు . ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా రేషన్ కార్డులను కుదించే ప్రయోగశాలగా మొదట జార్కండ్ రాష్టాన్ని ఎంపిక చేసుకొన్నారు . ఇలా మూడు పైలెట్ ప్రాజెక్టులతో మొదలు పెట్టి దేశ వ్యాపితంగా వీటిని విస్తరించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని కార్యాచరణకు దిగింది . దీన్నిబట్టి "ఆమ్ ఆద్మీ" సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో! తేటతెల్లమయ్యింది . మన రాష్ట్రంలో "స్మాట్ కార్డ్ " రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చౌక డిపోల్లో జరుగుతున్న అవకతవకల ప్రక్షాళన చేసే పేరిట‌ రంగారెడ్డి జిల్లా , చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోను ఒక పైలెట్ ప్రాజెక్టు అమలుకు సర్వే  చేశారు . కరీంనగర్ , తూర్పు గోదావరి జిల్లాలలో కూడా చేయబోతున్నారు . అత్యమంగా రాష్ట్రం మొత్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకొన్నది . ఆ డాలు ఎవరికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టారో! భవిష్యత్తులో తేలుతుంది . రాజకీయ లబ్ధి కోసం పొడుగు చేతుల పందేరం చేసి అనర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వం తరువాత దశలో బోగస్ కార్డుల ఏరివేత పేరిట పేదల వద్ద ఉన్న రేషన్ కార్డులకు ఎసరు పెట్టటానికి బరితెగించిన ఉదంతాల అనుభవాలున్నాయి .

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న కార్యాచరణలో అంతర్భాగంగానే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న అభాగ్యుల గణాంకాల తయారీలో అంకెల గారడీకి పూనుకొన్నదని చెప్పక తప్పదు . బి.పి.యల్. పై సురేష్ టెండూల్కర్ కమిటీ రూపొందించిన నివేదికకు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోద ముద్రవేసి మార్చి14, 2012న బహిరంగ ప్రకటన విడుదల చేసింది . దాని ప్రకారం 2009_10 సం. లో గ్రామీణ ప్రాంతంలో నెలకు రు. 672 . 80పై. ( రోజుకు రు.22 . 42 పై.), పట్టణ ప్రాంతాలలో రు.859 . 60పై. (రోజుకు రు.28 . 65పై.) లోపు సంపాదన ఉన్న వారు మాత్రమే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న ప్రజానీకంగా గుర్తించబడతారు . మరొక ప్రకటనలో 2010_11లో గ్రామసీమల్లో  రు.26 , పట్టణ ప్రాంతాలలో రు.32 లకు లోపు సంపాదన ఉన్నవారు బి.పి.యల్. క్రింద ఉన్నట్లుగా పరిగణించబడతారని ముక్తాయింపు పలుకులు పలికారు . ఈ తరహా ఆదాయంతో ప్రస్తుత ధరల్లో ఏ కుటుంబమైనా అసలు మనుగడ సాగించ‌గలదా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న . తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఒక్కడుగు వెనక్కి వేసి మరొక‌ నిపుణుల కమిటీతో సమీక్షిస్తామని వాగ్దానం చేసి ప్రజాగ్రహాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసింది .

సామాజిక భద్రతను కొంత మేరకైనా కల్పించే సదుద్దేశంతో ప్రవేశ పెట్టబడిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత‌ ప్రభుత్వం ఎసరు పెట్టడానికే కృత్రిమంగా పేదల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది .1993_1994 నుండి 2004_05 ఆర్థిక సంవత్సరాల‌ మధ్య కాలంలో ఏడాదికి 0.74% పేదరికం తగ్గుతూ వస్తే 2004_05 నుండి 2009_10 మధ్య యు.పి.ఎ. పాలనా కాల‍ంలో ఏడాదికి 1.5% చొప్పున తగ్గిందని పేర్కొన్నారు . 2005 మార్చి 1 జనాభా లెక్కల ప్రాతిపదికన 2004 లో 37.2% ఉంటే 2010 మార్చి 1 నాటి జనాభా ఆధారంగా 29.8% కి దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న జనాభా సంఖ్య తగ్గిందని వెల్లడించారు . దీన్ని పరిగణలోకి తీసుకొన్నా దేశంలో దాదాపు 36 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు .  సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలు సాధించిన సత్ఫలితం ఇదేనా? పేదరిక నిర్ధారణకు రోజు వారి వేతనాన్ని కాకుండా నెలసరి సంపాదనను ప్రాతిపదికగా తీసుకొన్నామని చెప్పారు . ఈ గణన చేయడానికి  వినియోగించిన కొలబద్ద , అనుసరించిన అసంబద్ధమైన వైఖరి వల్ల పేదరికం నిర్వచనంపైనే సహజంగా అనుమానాలు రేకెత్తించాయి . ఈ అశాస్త్రీయమైన గణాంకాలనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దృష్టికి కూడా ప్రణాళికా సంఘం తీసుకెళ్ళింది .  పేదరికాన్ని లెక్క గట్టడానికి శాస్త్రీయమైన కొలబద్దలను , ప్రామాణికాలను వినియోగించలేదు .పేదల ఆదాయ వ్యయాలను అంచనా వేసే యంత్రాంగమే లేని పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది .గడచిన ముప్పయ్ ఏడ్లుగా అనుసరిస్తున్న లోపభూయిష్టమైన పద్ధతులే కొనసాగుతున్నాయి.

పేదరిక నిర్ధారణ శాస్రీయ పద్ధతుల్లో నిర్వహించబడడం లేదన్న సద్విమర్శలున్నాయి . తాజా నివేదికలను బట్టి దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది అవసరానికి తక్కువగా ఆహారాన్ని తీసుకొంటున్నారు . ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నపూర్వరంగంలో ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం .  1993_94 లో గ్రామీణ ప్రాంతంలోని ఒక వ్యక్తి 2,153 క్యాల‌రీల ఆహారాన్ని తీసుకొంటే 2009_10 లో 2,020 క్యాలరీలకు , పట్టణ ప్రాంతాలలో 2,071 నుండి 1,946 క్యాలరీలకు పడిపోయిందని నేషనల్ శాంపుల్ సర్వేఆర్గనైజేషన్ (యన్.యస్.యస్.ఒ.) తన 66 వ అధ్యయన నివేదికలో పేర్కొంది . ప్రోటీన్ ఆహారమైన మాంసం , కోడి గుడ్లు , చేపలు మరియు పాల వినియోగం గ్రామసీమల్లో 60.2 నుండి 55 గ్రాములకు , పట్టణాలలో 57.2 నుండి 53.5 గ్రాములకు పడిపోయిందని చెప్పింది .గ్రామీణులు 2,400 , పట్టణవాసులు 2,100 క్యాలరీల మేరకు దినసరి ఆహారం తీసుకోలేక పోతున్నారన్న వాస్తవాన్ని టెండూల్కర్ కమిటీ కూడా విభేదించలేదు . 18 నుండి 29 సం.ల మధ్య వయస్సులో ఉన్న సాధారణ పురుషులకు 2,320 క్యాలరీలు అవసరమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ చెబుతున్నది .

కఠిక దారిద్య్రం పర్యవసానంగా ఆకలి బాధలు అనుభవించే వారి సంఖ్య పెరుగుతున్నది . పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో  పలు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు పలుకుతున్నా పిల్లలు , మహిళల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది . శిశు మరణాల సంఖ్యను తగ్గించలేని దుస్థితి కొనసాగుతున్నది . అదుపు చేయలేని ద్రవ్యోల్భణం, ఒకానొక దశలో ఇరవై శాతానికి మించిన‌ ఆహార ద్రవ్యోల్భణం , నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు , పతనమవుతున్న రూపాయి విలువ , ప్రజల కొనుగోలు శక్తి , క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం , బలంగా వేళ్ళూనుకొని ఉన్న బాల కార్మిక వ్యవస్థ , విద్య , వైద్యం , నివాసం వగైరా కనీస మానవ హక్కుల అమలు స్థితిగతులను గానీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు . పేదరిక నిర్మూలనా పథకాలపైన , సబ్సీడీల రూపంలొ చేస్తున్న ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా కుదించుకోవాలన్నదే దీని వెనకాల దాగి ఉన్నఅసలు సిసలైన‌ చిదంబర రహస్యమని స్పష్టమవుతున్నది  . కానీ పైకి మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం , విద్యా హక్కు చట్టం , రాబోయే ఆహార భద్రతా చట్టం బి.పి.యల్. ప్రాతిపదికపైన అమలు చేయడం లేదని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా మోసపూరిత ప్రకటనలు చేశారు . కానీ ఆచరణలో తద్భిన్నంగా పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నారు . ప్రజా సంక్షేమాని కంటే ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో శర‌వేగంతో అడుగులు ముందుకు వేయాలన్న కృతనిశ్చయంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణవాదుల బృందం ఉన్నట్లు దీన్ని బట్టి రూడీ అవుతున్నది . 12వ‌ పంచవర్ష ప్రణాళికలో మొదటి ఏడాది అయిన‌ 2012_13 సం. వార్షిక బడ్జట్టే దీనికి ప్రబల నిదర్శనం.

 దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే అధికారంలో కొనసాగే అవకాశాలు మృగ్యమైపోయాయన్న నిర్ధారణకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుంది . అందుకే కాబోలు, ఆ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం ప్రజలపై కక్ష గట్టి , ముప్పేటా దాడికి పూనుకొన్నది . అయాచితంగా లభించిన ప్రధాన మంత్రి పదవిలో డా: మన్మోహన్ సింగ్ రికార్డు స్థాయిలో కొనసాగారు . మూడోసారి గద్దెనెక్కే ముచ్చట లేదని తేలిపోయింది . అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆర్థిక వేత్తగా ఆయన్ను ఆ నోటా ఈ నోటా కొందరు ప్రశంసిస్తూ ఉంటారు . నయా ఉదారవాద ఆర్థిక విధానాల జపం చేస్తున్న ఆయన బృందంలోని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా: మాంటెక్ సింగ్ అహ్లువాలియా , ప్రధానికి ప్రధాన ఆర్థిక సలహాదారు డా: యన్. రంగరాజన్ , రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డా: సుబ్బారావు , ఆర్థిక శాఖామాత్యులు ప్రణాబ్ ముఖర్జీ పోటీలు పడుతూ ఆర్థిక సంస్కరణల అమలులో వేగాన్ని పెంచ‌వలసిన ఆవశ్యకతను నొక్కివక్కాణిస్తున్నారు . వీరందరూ పేదసాదల బాగోగుల కంటే సంస్కరణల ముసుగులో విదేశీ , స్వదేశీ పెట్టుబడిదారులకు అత్యంత నమ్మిన బంట్లుగా సేవలందించడంలో తన్మయత్నం చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు . ప్రస్తుతానికి తన ప్రభుత్వాన్ని , ప్రధాన మంత్రి పదవిని కాపాడుకొంటూ తన మానసిక పుత్రికైన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల అమలును సంపూర్ణంగా సాకారం చేసుకోవాలని మన్మోహన్ సింగ్ పట్టుదలగా పని చేస్తున్నారు . భాగస్వామ్య పార్టీల అధినేతలు , ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఎన్ని అవమానాలు చేసినా దిగమింగుతూ , మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నా తలవొగ్గి , గుంబనంగా పైకి కనపడుతూ , అంతా సజావుగా జరిగిపోతున్నట్లు ప్రవర్తిస్తున్నారు . దోపిడీ శక్తుల పక్షాన నికార్సుగా నిలబడ్డ మన్మోహన్ సింగ్ ప్రఖ్యాత బూర్జువా ఆర్థిక వేత్తగా చరిత్రకెక్కవచ్చేమో! గానీ , రాజకీయ నాయకత్వ లక్షణాలు లేని , పేదసాదల సంక్షేమం పట్ల శ్రద్ద ఏ మాత్రం లేని దేశ ప్రధాన మంత్రిగా నడుస్తున్న చరిత్ర నూటికి నూటాయాబై శాతం తేల్చేసింది .





No comments:

Post a Comment