Saturday, October 17, 2015

యన్.జె.ఏ.సి. చట్టం -2014 చెల్లదని సుప్రం కోర్టు సంచలన తీర్పు: లోతైన, సమగ్ర చర్చ అవశ్యం

జాతీయ న్యాయ నియామకాల కమీషన్ (యన్.జె.ఏ.సి.) చట్టం -2014 చెల్లుబాటు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదే! కానీ, సమీక్షకు, విమర్శకు అతీతమైనది మాత్రం కాదు. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం, హేతుబద్ధమైన చర్చకు సుప్రీం కోర్టు తీర్పు తెర లేపింది.
న్యాయ వ్యవస్థపై, ప్రత్యేకించి సుప్రీం కోర్టు మరియు హైకోర్టులపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేది. ఇప్పుడది బీటలు వారుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ప్రబల నిదర్శనమే నేటి తీర్పుపై వెల్లువెత్తుతున్న నిరసన గళం. ఈ విమర్శలు సమర్థనీయమా! కాదా! అన్న విషయాన్ని కాసేపు ప్రక్కనబెట్టి ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యంతమెరుగైనది, లోప రహితమైనది కాదు. మన రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉన్నది. ఆ రాజ్యాంగం పరిథిలోనే చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార యంత్రాంగం, సమాచార వ్యవస్థతో పాటు మిగిలిన వ్యవస్థలన్నీ పని చేస్తున్నాయన్న విషయాన్ని అన్ని వేళలా గమనంలో ఉంచుకోవాలి. రెండున్నర దశాబ్దాలుగా అమలు చేయబడుతున్న సరళీకృత ఆర్థిక విధానాల దుష్పరిణామాలపై న్యాయ వ్యవస్థ స్పందించిన ఒక్క ఘటన కూడా కనబడదు. పైపెచ్చు ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక విధానాలపై న్యాయ స్థానాలు జ్యోక్యం చేసుకోకూడదన్న భావన బలంగా వేళ్ళూనుకొని ఉన్నది. అంటే ఆర్థిక దోపిడీని న్యాయ వ్యవస్థ ప్రశ్నించదు, అడ్డుకట్ట వేయదు. మన రాజ్యాంగానికి ఉన్న వర్గ స్వభావన్నే న్యాయ వ్యవస్థ పుణికిపుచ్చుకొన్నది. కారణం, ఆ రాజ్యాంగానికి రక్షణ కవచమే ఈ న్యాయ వ్యవస్థ. ఈ విషయంలో చట్ట సభలకు, కార్యనిర్వహణా వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు నడుమ మౌలికమైన వైరుధ్యం ఏ మాత్రం లేదు.
కాకపోతే, అప్పుడప్పుడు చట్ట సభలకు, న్యాయ వ్యవస్థకు మధ్య పొర పొచ్చాలు పొడచూపుతూ ఉంటాయి. అవి తాత్కాలికమే. ఆధిపత్య పోరులో అంతర్భాగం మాత్రమే. నేటి సుప్రీం కోర్టు తీర్పును సూక్ష్మంగా పరిశీలించినా బోధపడే అంశం అదే. కొలీజియం వ్యవస్థ ద్వారా ఇంత వరకు జరిగిన న్యాయమూర్తుల నియామకాలు రాజకీయ నాయకత్వం జోక్యం లేకుండానే జరిగాయని ఎవరైనా భావిస్తే అది భ్రమ మాత్రమే.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువు పట్టు ఎన్నికల వ్యవస్థ. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఒక ప్రహసనంగా మార్చేశాయి. డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతీయ భావాలే నిర్ణయాత్మకమైన శక్తులుగా ఆవిర్భవించాయి. రాజకీయ అవినీతి రాజ్యమేలుతున్నది. పాలక పార్టీలు రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థలను బలహీనపరచి, నిర్వీర్యం చేస్తూ, వాటిని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, కనుసన్నల్లో పని చేసే సంస్థలుగా మార్చి వేస్తున్నాయి. సి.బి.ఐ. డైరెక్టర్, సి.వి.సి. చీఫ్ కమీషనర్, కడకు సుప్రీం కోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో కూడా ఆయా ప్రభుత్వాలు ప్రదర్శించిన సంకుచిత, స్వార్థపూరిత, అనారోగ్యకరమైన పద్ధతులను సమాజం గమనిస్తూనే ఉన్నది. ఈ భ్రష్టు రాజకీయ శక్తులే న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించాయనడం నిస్సందేహం. ఈ తరహా అప్రజాస్మామిక చర్యలు పతాక స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
గడచిన రెండు దశాబ్దాల అనుభవాలను పరిశీలిస్తే, 'తమను తామే ఎంపిక చేసుకొని నియమించుకొనే' "కొలిజియం" విధానం విఫలమై, తీవ్ర విమర్శలకు గురైన మాట ముమ్మాటికీ నిజం. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పని చేసిన అనేక మంది అవినీతిపరులుగా ముద్ర వేయించుకొని, సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడ్డారు. అవినీతి బురద అంటని వ్యవస్థ ఒక్క న్యాయ వ్యవస్థే అన్న భావనను ప్రజల మనస్సుల నుండి తొలగించేశారు. వీరిని నియమించింది కొలీజియం సిఫార్సులతోనే కదా? వారి నియామకంలో రాజకీయ జోక్యం లేదని ఎవరైనా చెప్పగలరా? అందు చేత ప్రక్షాళనకు న్యాయ వ్యవస్థ అతీతమైనది ఏ మాత్రమే కాదు. సమాజం బాగు పడాలంటే అది అనివార్యంగా జరగాలి.
సుప్రీం కోర్టు కొట్టి చేసిన చట్టం మెరుగైనదా! అంటే అలా లేదని, లోపభూయిష్టంగా ఉన్నదని రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును బట్టి బోధపడుతున్నది. యన్.జె.ఏ.సి.లో ఆరుగురు సభ్యులను నియమిస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ ప్రతినిథులుగా ఉంటారు. మరో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను సభ్యులుగా ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు భాగస్వామ్యంతో ఏర్పడే కమిటీ ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేయబడే సభ్యులకు ఎలాంటి అర్హతలుండాలో చట్టంలో పొందుపరచలేదు. ప్రస్తుత గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. అంటే రాజకీయ పునరావాస నియామకాలను ప్రభుత్వం చేస్తుందన్న మాట. పైపెచ్చు ఆ ఇద్దరు సభ్యులకు 'వీటో' హక్కు చట్టంలో కల్పించారు. అంటే న్యాయ వ్యవస్థకు ప్రాతినిథ్యం వహించే ముగ్గురు సభ్యుల అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే వీటో హక్కును వినియోగించుకొని అడ్డుకొట్టవచ్చు. ఆ ఇద్దరు సభ్యులకు కొండంత అండగా ఉండడానికి, గైడ్ చేయడానికి కేంద్ర న్యాయ శాఖామాత్యులు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆరో సభ్యుడుగా కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతారు. దీన్ని బట్టీ అర్థమయ్యేది, యన్.జె.ఏ.సి. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుంది. దీన్ని పసి గట్టే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం జోక్యం ఉంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి హరించబడుతుందని, రాజకీయ నాయకత్వం సిఫార్సుతో నియమించబడే న్యాయమూర్తులు కాస్తా రుణం తీర్చుకొనే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారని, రాజకీయ పక్షపాతంతో తీర్పులు వెలువరించే ప్రమాదం మెండుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని నలుగురు న్యాయమూర్తులు వ్యక్తం చేసిన కీలకమైన వ్యాఖ్యలను తృణీకార భావంతో తిరస్కరించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవడానికి ఉపకరించదు. న్యాయమూర్తుల నియామకంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క వాణికి స్థానముండాలన్న జస్టిస్. చలమేశ్వర్ గారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవలసిందే. రాజ్యాంగం నిర్ధేశించిన లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద లక్ష్యాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్న చట్టాలను పరిరక్షిస్తూ, స్వాతంత్ర ఫలాలను అందరికీ హక్కుగా అందేలా సామాజిక స్పృహతో న్యాయ వ్యవస్థ పని చేయాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష. ఈ కోణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మేధావులు, న్యాయకోవిదులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన తరుణమిది.

No comments:

Post a Comment