Tuesday, January 19, 2016

దుమ్మగూడెం ప్రాజెక్టును గోదావరి,కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్మిస్తే విస్తృత ప్రయోజనాలు వనుగూడుతాయి.

20 టియంసిల వినియోగ లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ సాగర్, ఇందిరసాగర్(దుమ్మగూడెం మొదటి దశ, రెండవ దశ) ఎత్తిపోతల పథకాలను సమీకృత ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి నిర్మించడం ద్వారా 50 టియంసిల నీటిని తరలించి ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సముచితమైనదే!

గోదావరిలో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. మరింత ఎక్కువగా గోదావరి నీటిని వినియోగించుకోవడం ద్వారా నీటి ఎద్దడితో బాధపడుతున్న దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల దప్పిక తీర్చే విధంగా విశాల దృష్టితో ఆలోచించడం అవసరం.

కృష్ణా నదీ జలాలపై తీవ్రమైన వత్తిడి ఉన్నది. బ్రజేష్ కుమార్ ట్రిబునల్ మిగులు జలాల లభ్యతను కూడా అంచనా వేసి పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. పర్యవసానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించుకొంటున్న ప్రాజెక్టులు నిరుపయోగంగా పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ట్రిబునల్ తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి అయ్యింది. కేసు విచారణలో ఉన్నది.

ఈ పూర్వరంగంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ పథకంలో అంతర్భాగంగా ప్రతిపాదిత దుమ్మగూడెం- నాగార్జునసాగర్ టేయిల్ పాండ్ పథకం  ముఖ్యమైనది. దీని ద్వారా 165 టియంసిల  గోదావరి నదీ జలాలను వినియోగించుకొనే అవకాశముంటుందని నిపుణుల అంచనా.  సాగర్ ఎడమ కాలువ క్రింది ఉన్న ఆయకట్టుకు అవసరమైన నీటి సరఫరా చేస్తూ కొంత నీటిని కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి తరలించి, సద్వినియోగం చేసుకోవాలన్నది లక్ష్యం. కారణాలేమైనా ఈ పథకాన్ని తెలంగాణా ప్రభుత్వం గతంలో వ్యతిరేకించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంపై హెచ్.యం.టీ.వి. నిర్వహించిన చర్చలో పాల్గొన్న నేను దుమ్మగూడెం పథకాన్ని ఖమ్మం జిల్లా వరకే పరిమతం చేయకుండా ప్రతిపాదిత దుమ్మగూడెం- సాగర్ టేయిల్ పాండ్ గా నిర్మిస్తే మరింత విస్తృత ప్రయోజనాలు సమకూరుతాయని, మహబూబ్ నగర్ జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న కల్వకుర్తి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకాలకు, నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న యస్.యల్.బి.సి.కి, నూతనంగా నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత విషయంలో వెసులుబాటు వస్తుంది కదా! అని చర్చలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావును కోరాను.

గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా తరలించి తెలంగాణ నీటి అవసరాలను  తీర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదిస్తే చర్చించడానికి సిద్ధమేనని సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చొరవ చేసి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడం ద్వారా దుమ్మగూడెం- సాగర్ టేయిల్ పాండ్ పథకాన్ని సాకల్యం చేస్తే ఇటు దక్షిణ తెలంగాణతో పాటు నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఊరట కలుగుతుంది.

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే తెలుగు నాట నీటి సమస్యకు కొంత మేరకైనా శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

హెచ్.యం.టీ.వి.లో జరిగిన చర్చకు సంబంధించిన యూట్యూబ్ లింక్:
 https://youtu.be/rR_ln5BatcA

No comments:

Post a Comment