Sunday, July 10, 2016

'ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం: రాజకీయ శూన్యత', 'బందర్ పోర్టు: భూ సమీకరణ - సేకరణ‌'

'ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం: రాజకీయ శూన్యత', 'బందర్ పోర్టు: భూ సమీకరణ - సేకరణ‌' అన్న అంశాలపై టీవి5లో చర్చ నిర్వహించారు. ఆ చర్చలో స్థూలంగా నేను వ్యక్తం చేసిన అంశాలు:

1. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. నీతివంతమైన, సుపరిపాలన కావాలన్నఆకాంక్ష రోజు రోజుకు ప్రజల్లో బలపడుతున్నది. రాజకీయ రంగంలో అస్పష్టత, గందరగోళ పరిస్థితులు ఉన్నట్లు గోచరిస్తున్నా, రాజకీయ శూన్యత ఉన్నట్లుగా ప్రస్తుతానికి భావించలేం.
2. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ప్రజల ఛీత్కారానికి గురయ్యింది. తిరిగి కోలుకొనే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు.
3. గడచిన శాసనసభ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా ఉన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నైతికంగా బలహీనమైన స్థితిలో ఉండడంతో పాలక పార్టీ అనుసరిస్తున్నఅప్రజాస్వామిక, అవినీతి చర్యలను సమర్థవంతంగా నిలవరించే రీతిలో ప్రజలను సమీకరించడంలో వైఫల్యం చెందుతున్నది. పైపెచ్చు 19 మంది శాసనసభ్యులు పార్టీని వీడి, పాలక పార్టీలో చేరి పోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సహజంగానే ఒక రకమైన నైరాశ్యం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీకి బలం, బలహీనత ఆ పార్టీ అధినాయకుడే.
4. వామపక్షాలు కొన్ని సమస్యలపై ఆందోళనలు చేస్తున్నాపెద్దగా ప్రజల మద్ధతు పొంద లేక పోతున్నాయి. తమకు తాముగా ప్రత్యామ్నాయంగా ఎదగ గలిగిన శక్తి సామర్థ్యాలు వాటికి లేవు.
5. ఈ పూర్వరంగంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, బిజెపి అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి తాజాగా దిశా నిర్ధేశం చేసినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్నఅనిశ్చిత రాజకీయ వాతావరణాన్నిఅనుకూలంగా మలచుకొని, బలపడాలని బిజెపి వ్యూహం రచించుకొన్నట్లు ఆ వార్తల్లోని సారాంశం. బిజెపి నాయకత్వం కంటున్న పగటి కలలకు, ఆంధ్రప్రదేశ్ లో భౌతిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడం నిస్సందేహం. విభజనకు సహకరించడమే కాకుండా విభజన‌ చట్టంలోని అంశాలను అమలు చేయడంలోను, ప్రత్యేక తరగతి హోదా కల్పించడంలోను బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, దగాకోరుగా వ్యవహరిస్తున్న బిజెపి పట్ల ప్రజల్లో ఏహ్య‌భావం, తీవ్ర వ్యతిరేకత‌ నెలకొని ఉన్నది. ఈ పరిస్తితుల్లో ఆ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకోవడమే విడ్డూరంగా కనబడుతున్నది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం మాట అటుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహ‌ జ్వాలల్లో బిజెపి ఉనికే ప్రమాదంలో పడిందని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొన్నవారికి స్పష్టంగా బోధపడుతున్నది.

బందరు ఓడ రేవు:

1. ఈ ఓడ రేవు నిర్మాణం కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న‌ మాట వాస్తవం. దాని కోసం ప్రజలు వివిధ రూపాలలో ఆందోళనలు కూడా చేశారు. కానీ, భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధంగా వ్యవహరించక పోతే ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. ఓడ రేవు నిర్మాణానికి ఎంత భూమి అవసరమో! వాస్తవిక దృష్టితో నిర్ణయం తీసుకోవాలేగానీ, లక్ష ఎకరాలకుపైగా అవసరం ఉంటుందని, ఆ మేరకు భూ సమీకరణ చేయడానికి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకొన్నామని ప్రసార మాధ్యమాలకు తెలియజేసి, నాలుక కరుచుకొని, కాదు కాదు ఇర‌య్ వేల ఎకరాల వరకే భూమిని సమీకరిస్తామని మళ్ళీ ప్రకటించడంతో ప్రభుత్వ విశ్వసనీయత ఈ విషయంలో దెబ్బతిన్నది.
2. అభివృద్ధి పేరిట ఎక్కడ రైతుల నుండి భూమి సేకరించినా, ఆ అభివృద్ధిలో మొదటి లబ్ధిదారుడుగా భూమి కోల్పోయిన‌ రైతు ఉండాలి.
3. ఉపాథి కోల్పోయిన‌ వ్యవసాయ కార్మికులకు, చేతి వృత్తుల వారికి, స్వయం ఉపాథిపై అధారపడిన తరగతుల ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించే రీతిలో పునరావాస పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వంపై ఉన్నది.
3. భూ సేకరణ చేసే సందర్భంలో ఆహార భద్రతా సమస్య, పర్యావరణ పరిరక్షణ వగైరా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది.
4. రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరించిన భూ సమీకరణ(పూలింగ్) విధానం తరహాలోనే బందరు ఓడ రేవు నిర్మాణానికి కూడా భూ సమీకరణ విధానాన్ని అవలంబిస్తామనడం అసంబద్ధంగా ఉన్నది. నూతన రాజధాని ప్రాంతంలోభూముల విలువ పెరిగింది. తద్వారా భూములిచ్చిన రైతులకు ప్రయోజనం జరుగుతుందన్న నమ్మకంతో వారున్నారు. ఓడ రేవు నిర్మాణ ప్రాంతంలో మక్కీకి మక్కీగా అదే రీతిలో భూములిచ్చిన రైతులకు ప్రయోజనం వనకూడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అంశాన్ని గమనించాలి.

ఈ చర్చలో నాతో పాటు సీనియర్ జర్నలిస్టులు శ్రీ ప్రసాద్ రెడ్డి, శ్రీ తెలకపల్లి రవి, ఆంధ్రా మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చర్చకు సంబంధించిన యూట్యూబ్ లి‍ంక్:
 Part 1: https://www.youtube.com/watch?v=BTcBNEhjYiQ
Part 2: https://www.youtube.com/watch?v=720RquQJvoI

No comments:

Post a Comment