Monday, January 23, 2017

ఒక్క ప్రత్యేక తరగతి హోదా కోసమే కాదు ఉద్యమం చేయాల్సింది, విభజన చట్టంలో పొందుపరచిన అన్ని అంశాల అమలు కోసం ఉద్యమించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రణాళిక అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిగ్గదీయాలి. భారత్ టుడే 'న్యూస్ ట్రాక్' చర్చలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాల సారాంశం అది.

ఇరుగు పొరుగు ప్రాంతాల్లో జరిగే ఆందోళనల ప్రభావం ఎంతో కొంత మేరకు మనపై కూడా ఉంటుంది. జల్లికట్టు సమస్యపై తమిళనాడులో జరుగుతున్న ఆందోళన హేతుబద్ధతపై వేరుగా చర్చించుకోవాలి. ఆ క్రీడలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. జంతు ప్రేమికులేమో, జంతువులు హింసకు గురౌతున్నాయి కాబట్టి దాన్ని నిషేధించమంటున్నారు. సంస్కృతిలో భాగమంటూ ఆ రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా వీథుల్లోకి వచ్చారు. ఆ ఆందోళనను స్ఫూర్తిగా తీసుకోని ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించాలనడంలో ఔచిత్యం లేదు. ప్రత్యేక తరగతి హోదా అంశం యొక్క స్వభావం వేరు.

రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక తరగతి హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. దాని వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న చర్చను ప్రభుత్వంలోని పెద్దలు లేవదీయడం అసంబద్ధం. చట్ట సభల విశ్వసనీయతతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానీకాన్ని దగా చేయడమే కాదు, విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన పలు అంశాల అమలులోనూ బాధ్యతారహిత్యంగా, అలసత్వంతో వ్యవహరిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీని అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు.24,000 కోట్లతో ఒక పథకాన్ని రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న వార్తలు వచ్చాయి. కానీ, జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రు.350, అలా ఐదేళ్ళకు మొత్తం రు.1750 కోట్లు మాత్రమే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని, ఆ మేరకే నిథులిస్తున్నది. ఇది వెనుకబడిన జిల్లాల ప్రజానీకాన్ని అమమానించడం కాదా?

వెనుకబడ్డ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నారు. 'ఫీజిబిలిటీ' లేదంటూ దాన్ని అటకెక్కించారు. రైల్వే జోన్ అంశాన్ని నాన్చుతూనే ఉన్నారు. కొత్త‌ ఓడ‌ రేవు నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని పట్టించుకోలేదు. రెవెన్యూ లోటు భర్తీపై ఇంకా లెక్కలే తేలలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారో అంతు చిక్కని సమస్యగానే కొనసాగుతున్నది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కానీ, 2010 -11 అంచనా వ్యయాన్ని అంటే రు.16,000 కోట్లను మాత్రమే కొలబద్ధగా తీసుకొని, అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన వ్యయం, జల విద్యుత్ ప్లాంటును నెలకొల్పడానికయ్యే వ్యయాన్ని, విశాఖపట్నం త్రాగు నీటి పథకానికయ్యే వ్యయాన్ని మినహాయించి, దాదాపు రు.8,000 కోట్లు ఇవ్వడానికి ఆమోదించి, నాబార్డు నుండి రుణం తీసుకొని సర్దుబాటు చేస్తున్నారు. ఈ తరహా ఆర్థిక తోడ్పాటుతో ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 లేదా 19 నాటికి పూర్తి చేయగలరా?

విభజన చట్టంలో పొందుపరచిన అంశాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు, విడుదల చేసిన నిథుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేత పత్రాలు విడుదల చేయాలి.

టి.లక్ష్మీనారాయణ‌

Part 1: https://www.youtube.com/watch?v=WBV00IbLhnk
Part 2: https://www.youtube.com/watch?v=MnjXz2qqpqM

No comments:

Post a Comment