Saturday, January 28, 2017

విశాఖ సిఐఐ సదస్సు వల్ల వనగూడే ఫలితాలేంటి!

ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని, సిఐఐ సదస్సు నిర్వహణను వేరు వేరుగా చూడాలి.

1. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బిజెపి రెండు భాగస్వాములే. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామని రాజ్యసభ వేదికగా వాగ్ధానం చేసింది. నేడు అధికారంలో ఉన్నబిజెపి ఆ వాగ్ధానాన్ని అమలు చేయకుండా మోసం చేసిందన్న బలమైన భావన ప్రజానీకంలో ఉన్నది. దాన్ని చూడ నిరాకరించడం గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, ప్రణాళిక మరియు ప్రణాళికేతర పద్దులను కలిపి వార్షిక బడ్జెటును రూపొందించడానికి నిర్ణయించడం, కేంద్ర ప్రయోజిక పథకాల సంఖ్యను కుదించడంతో పాటు నిథుల కేటాయింపుకు సంబంధించి 70:30 నిష్పత్తి స్థానంలో 60:40 చేసి భారాన్ని రాష్ట్రాల మీదికి నెట్టడం వగైరా చర్యలతో ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలను నిర్వీర్యం చేసింది. ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న అప్రజాస్వామికమైన, అడ్డగోలు వాదనను ప్రక్కన బెట్టి చట్టసభలో ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధి ప్రదర్శించాలి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాపితంగా 'హై అలర్ట్' ప్రకటించి ఉన్నందున మరియు సిఐఐ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో  ఆందోళనకు అనుమతించ లేక పోతున్నామన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, శాసనసభ ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం 'రన్ వే' పైనే అరెస్టు చేయడం దుర్మార్గం. ఇది దుస్సాంప్రదాయానికి దారి దీస్తుంది.

2. సిఐఐ సదస్సు నిర్వహణను సానుకూల దృక్పథంతో చూడాలి. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ఉపాథి అవకాశాలు లేవు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం హుద్ హుద్ తుఫాన్ దెబ్బతో విలవిల్లాడి పోయింది. తీవ్రమైన నష్టం వాటిల్లింది. విశాఖ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందేమోనని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారు. విశాఖపట్నానికి భౌగోళికంగా ఉన్న సానుకూలాంశాల వల్ల కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణం కావడం వల్ల కావచ్చు, రాజకీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన చర్యల వల్ల కావచ్చు ఏదో ఒక మేరకు సత్ఫలితాలు వస్తున్నాయన్న వాస్తవాన్ని తృణీకార భావంతో తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదు.

ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హైదరాబాదును విభజనతో కోల్పోయిన చేదు అనుభవంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది ప్రజల బలమైన ఆకాంక్ష. మొదటి సిఐఐ సదస్సులో జరిగిన భాగస్వామ్య ఒప్పందాలను పరిశీలించిన, తాజా సదస్సు ఒప్పందాలను పరిశీలించినా ఆ అంశం కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.

మొదటి సదస్సులో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పించే భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని, వాటిలో 40% వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో అంతా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో కనబడుతున్న దానికి పొంతన లేని మాట వాస్తవమే కావచ్చు. అయితే, కార్యరూపం దాల్చుతున్న యం.ఓ.యు.లు వివిధ దశల్లో ఉండవచ్చు, అవి పూర్తి స్థాయిలో అమలు కావడానికి, ఫలితాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కూడా! అయితే, మొదటి సదస్సు వల్ల కానీ, రెండవ సదస్సు వల్ల కానీ, పారిశ్రామిక రంగంలో ఒక విధమైన కదలిక, సానుకూలమైన వాతావరణం సృష్టించబడ్డాయనడంలో సందేహం లేదు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఏ చిన్న ప్రయత్నం చేసినా సానుకూల దృక్పథంతో పరిశీలించడం రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నపారిశ్రామిక విధానంలోని లోపభూయిష్టమైన అంశాలను నిర్మాణాత్మక దృష్టితో నిశితంగా పరిశీలించాలి, ఎత్తి చూపాలి, ఎండగట్టాలి, వాటికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.

పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ప్రభుత్వ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులను రెండు వేరు వేరు కోణాల్లో పరిశీలించాలి. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, మానవ వనరులకు సంబంధించిన సమాచారాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం భాగస్వామ్య సదస్సుల ద్వారా చేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా చేసుకొంటున్న భాగస్వామ్య ఒప్పందాలు అమలుకు నోచుకొని రాష్ట్రానికి మేలు జరిగితే మంచిదే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధానత్య లోపించినట్లు స్పష్టంగా కనబడుతున్నది. విశాఖపట్నం, అమరావతి, కోస్తా తీరంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ఒప్పందాలే అత్యధికంగా ఉన్నట్లు బహిరంగ పరచిన ఒప్పందాలఇవరాలను బట్టి అర్థమవుతున్నది. సముద్ర తీరంతో పాటు నీటి వనరులు, భౌగోళిక పరిస్థితుల మూలంగా ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కోస్తా ప్రాంతానికి అదనపు సానుకూలతలు ఉండవచ్చు. కానీ, మానవ వనరులు, భూములు, ఖనిజ సంపద, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు వగైరా మౌలిక సదుపాయాలు ఉన్న వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నీటి సదుపాయాన్ని కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పక తప్పదు.

రాష్త్ర విభజన చట్టంలో పొందుపరచిన కడప ఉక్కు పరిశ్రమ సంగతేంటి? బి.హెచ్.సి.యల్._యన్.టి.పి.సి. సంయుక్తంగా నిర్మాణాన్ని చేపట్టిన మన్నవరం పరిశ్రమను ఎందుకు అటకెక్కించారు? కర్నూలు సమీపంలో యుపిఏ ప్రభుత్వ కాలంలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏమయ్యింది? రేణిగుంట వ్యాగన్ రిపేర్ వర్క షాప్ దశాబ్ధాలు గడచి పోతున్నా విస్తరణకు ఎందుకు నోచుకోవడం లేదు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులతో నెలకొల్పబడాల్సిన పరిశ్రమలు. వాటిపైన ఏ మాత్రం ద్యాస పెట్టడం లేదు.

నిజమే, కోస్తా తీరం లేదా ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి జరిగినా రాష్ట్ర స్థూల ఉత్ఫత్తి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. దాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించవచ్చు. కానీ, వెనుకబడిన, కరవు పీడిత ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ది, ఉపాథి అవకాశాల కల్పన, ఆర్థికాభివృద్ధిలో ఆ ప్రాంతాల ప్రజలను భాగస్వాములను చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా! విభజన చట్టంలో పేర్కొన్న వాటినీ అమలు చేయడం లేదు. పెట్టుబడులపై 15%, యంత్రాల తరుగుదలపై 15% రాయితీలు ప్రకటించారు. వాటి వల్ల ఒక్క పరిశ్రమైనా వెనుకబడిన ప్రాంతాల్లో వచ్చిందా? సిఐఐ సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఈ వాస్తవాన్ని గుర్తించి రాయితీలను పెంచే అంశాన్ని మాట వరసకు కూడా ప్రస్తావించ లేదు. సోలార్ ప్లాట్లను నెలకొల్పుతున్నామనో లేదా చిన్న చితక పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తున్నామనో! నమ్మబలికే ప్రయత్నం చేయడం వృదా ప్రయాసగానే మిగిలి పోతుంది.

టీవి5లో జరిగిన చర్చలో నాతో పాటు సీనియర్ పాత్రికేయులు శ్రీ ప్రసాద్ రెడ్డి, స్వచ్ఛా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డా. వెంకట్రావు, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ దిలీప్ పాల్గొన్నారు

టి.లక్ష్మీనారాయణ

Part 1: https://www.youtube.com/watch?v=H_oWMIxFj1E

Part 2: https://www.youtube.com/watch?v=sNMKGpTx7FE

No comments:

Post a Comment