Sunday, May 14, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదిక 2016 – 17: ముఖ్యమైన అంశాలు


  1. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం: 1,62,970 చదరపు కి.మీ. వైశాల్యం రీత్యా దేశంలో 8వ‌ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.         
  2. సముద్ర తీరం: 974 కి.మీ. తో దేశంలోని సముద్ర తీర రాష్ట్రాలలో రెండవ పెద్ద రాష్ట్రం. 
  3. అడవుల విస్తీర్ణం: 36,909.36 చ.కి.మీ. 
  4. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం10% జనాభాతో దేశంలో పదవ స్థానంలో ఉన్నది. జనాభా వృద్ధి రేటు 1961-71 దశాబ్ధంలో 18.88%, 1981-91లో 21.13%, 2001-11 దశకానికి గణనీయంగా 9.21%కి తగ్గింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 17.72% కంటే చాలా తక్కువ. 2011 జనాభా గణాంకాల మేరకు దేశంలో చ.కి.మీ.కు జన సాంద్రత సగటున‌ 382 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 304. స్త్రీ, పురుష నిష్పత్తి 2001లో 983 ఉంటే 2011 నాటికి 997కు పెరిగింది. జాతీయ స్థాయిలో 943 మాత్రమే. రాష్ట్రంలో పట్టణ జనాభా 24.13 శాతం నుంచి 29.47 శాతానికి (2001 నుంచి 2011లో) పెరిగింది. అయితే జాతీయసగటు 31.14 శాతంతో పోలిస్తే మాత్రం తక్కువే. అత్యధికంగా పట్టణ జనాభా విశాఖపట్నం జిల్లాలో 47.45 శాతం, కృష్ణా జిల్లాలో 40.81 శాతం ఉంది. 
  5. స్త్రీ, పురుష నిష్పత్తి: రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు. జాతీయస్థాయిలో ఈ సగటు 943 మాత్రమే. లింగ నిష్పత్తి రాష్ట్రంలో 2001లో వెయ్యి మంది పురుషులకు 943 ఉండగా 2011 నాటికి 997కు పెరిగింది. విజయనగరం జిల్లాలో వెయ్యి మంది పురుషులకు 1,019 మంది మహిళలు, శ్రీకాకుళం జిల్లాలో 1,015 మంది మహిళలు ఉన్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళల సంఖ్యే అధికం. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 977 మంది మహిళలున్నారు. 
  6. అక్షరాస్యత: 2001లో07% అక్షరాస్యత నమోదైతే 2011 నాటికి 67.35% కు పెరిగింది. కానీ, జాతీయ స్థాయి అక్షరాస్యత 72.98% కంటే వెనుకబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీల అక్షరాస్యత 2001లో 52.72% ఉంటే 2011 నాటికి 59.96% కి పెరిగింది. అక్షరాస్యత రేటు దళితుల్లో 64.47%, గిరిజనుల్లో 48.83% ఉంది. జిల్లాల వారీగా చూస్తే సగటు అక్షరాస్యతలో పశ్చిమగోదావరి జిల్లా 74.32% తో అగ్రస్థానంలో ఉంది. అత్యల్పంగా విజయనగరం జిల్లా 58.89%. 
  7. భూమి: మొత్తం భూ విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం08 (38.09%) లక్షల హెక్టార్లు, అడవుల విస్తీర్ణం 36.88 (22.63%) ల.హె., ప్రస్తుతం బీడుగా ఉన్న భూములు 14.10 (8.65%) ల.హె., వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న‌ భూమి 20.32 (12.47%) ల.హె., వ్యవసాయానికి పనికిరాని పడావు భూమి 13.47(8.27 %) ల.హె., శాశ్వత పచ్చిక బయళ్ళు, మైదానాలు 12.43(7.63%) ల.హె., పండ్ల తోటలు, చెట్లు, పొదలు ఉన్న భూమి 3.69(2.26%) ల.హె. 
  8. స్థూల రాష్ట్ర దేశీయ‌ ఉత్ఫత్తి: కేంద్ర గణాంకాల కార్యాలయం(సి.యస్.ఓ.) స్థిర ధరల బేస్ సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చడంతో పాటు విధానాన్ని కూడా మార్చింది. ప్రస్తుత ధరల్లో ప్రకారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.) 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదటి సవరించిన అంచనాల ప్రకారం రు.6,09,934 కోట్లు, ముందస్తు అంచనాల ప్రకారం 2016-17 లో రు.6,99,307 కోట్లు. స్థిర ధరల్లో (2011-12) 2015-16లో రు.4,90,134 ఉంటే ముందస్తు అంచనాల ప్రకారం 2016-17లో రు.5,47,021 కోట్లు. దీని ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 11.61% గా ఉన్నది. దేశీయ స్థూల ఉత్ఫత్తి(జిడిపి) 2016-17లో 7.1% మాత్రమే. వృద్ధి రేటును రంగాల వారిగా చూస్తే, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లో 14.03%, పారిశ్రామిక రంగంలో 10.05%, సేవా రంగంలో 10.16% గా ఉన్నది. తలసరి ఆదాయం(ఎన్.ఎస్.డి.పి.) ప్రస్తుత ధరల్లో 2015-16లో రు.1,08,163 ఉంటే 2016-17లో ముందస్తు అంచనా ప్రకారం రు.1,22,376 కు పెరిగి 13.14% వృద్ధిని నమోదు చేసింది. 
  9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం: 2015-16 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ద్వారా రాబడి రు.39,922 కోట్లు, సొంత పన్నేతర మార్గాలలో రాబడి రు.4,920 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక వనరులు రు.45,249 కోట్లు. సొంత పన్నేతర మార్గాలలో రాబడి ప్రధానంగా గనులు మరియు ఖనిజాలు(25%), అడవులు (20%), విద్య మరియు ఇతర ఆదాయ మార్గాలు(21%). కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక వనరులు సవరించిన అంచనాల ప్రకారం 2016-17లో రు.54,011 కోట్లు. వీటిలో ఆర్థిక సంఘం కేటాయించిన నిథులే అత్యధికం. 2015-16లో రు.30,078 కోట్లు, సవరించిన అంచనాల ప్రకారం 2016-17లో రు.33,630 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ వ్యయం 2015-16లో రు.1,10,510 కోట్లు. 2016-17లో సవరించిన అంచనాల మేరకు రు.1,26,871కోట్లు. రెవెన్యూ పద్దు క్రింద వ్యయం 2015-16లో రు.95,950 కోట్లు, మూలధనం వ్యయం పద్దు క్రింద ఖర్చు చేసింది రు.14,172. 2016-17లో సవరించిన అంచనాల ప్రకారం రు.1,12,306 కోట్లు. 
  10. రెవెన్యూ మరియు ద్రవ్య లోటు: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రు.7,302 కోట్ల రెవెన్యూ లోటు, రు.21,863 కోట్లు ద్రవ్య లోటు ఉన్నది. ఆర్థిక క్రమ శిక్షణ మరియు నిర్వహణ పర్యవసానంగా 2016-17 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు రు.4,598 కోట్లకు, ద్రవ్య లోటు రు.19,163 కోట్లకు తగ్గింది.                                                                                                                           * గమనిక: 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు కేవలం రు.416 కోట్లు, ద్రవ్య లోటు రు,23,054 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు యనమల రామకృష్ణ గారు శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
  11. అప్పులు మరియు వడ్డీల చెల్లింపు: 2015-16 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రాష్ట్ర రుణ భారం రు.1,73,854 కోట్లు. 2016-17 ఆఖరుకు సవరించిన అంచనాల ప్రకారం రు.1,92,984 కోట్లు. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా పంపిణీ చేయని రుణాల మొత్తం రు.33,478 కోట్లు కూడా కలిసి ఉన్నది. 2015-16లో రు.9,848 కోట్లు వడ్డీల పద్దు క్రింద చెల్లిస్తే, 2016-17లో సవరించిన అంచనాల మేరకు రు.12,208 కోట్లు చెల్లించడం జరిగింది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తిలో అప్పులు 2015-16లో 28.50% గా ఉంటే 2016-17లో సవరించిన అంచనాల ప్రకారం 27.60% కు తగ్గాయి. దీనికి జి.యస్.డి.పి. వృద్ధి కారణంగా చెప్పబడింది. రాష్ట్ర రుణ భారంలో కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకొన్నవి 5%, మార్కెట్ ద్వారా సమీకరించుకొన్నవి 59%, చిన్న పొదుపు పథకాల నుండి సేకరించుకొన్నవి 8%, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా 9%, ఇతర రుణాలు 19% గా ఉన్నాయి.                                                       * గమనిక: 2017-18 ఆర్థిక సంవత్సరం ఆఖరుకు రు.2,16,027 కోట్లకు రుణ భారం చేరుకొంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు యనమల రామకృష్ణ గారు శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
  12. ర్షపాతం: నైరుతీ రుతుపవనాల ద్వారా సగటు వర్షపాతం 556 మి.మీ. లభించాల్సి ఉండగా 2016-17లో 534 మి.మీ. నమోదయ్యింది. ఈశాన్య ఋతుపవనాల ద్వారా 296 మి.మీ. సగటు వర్షపాతానికి గాను కేవలం 85 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఏడాది మొత్తంగా చూస్తే దాదాపు 28% లోటు వర్షపాతం నమోదయ్యింది. 
  13. భూగర్భ జలాలు: భూగర్భ జలాల లభ్యతను అంచనా వేయడానికి రాష్ట్రం మొత్తాన్ని 748 వాటర్ షేడ్స్ గా విభజించారు. భూగర్భ జలాలపై ఆధారపడిన సాగు భూమి స్థూలంగా 16.43 లక్షల హెక్టార్లు. అందులో 15.09 లక్షల హెక్టార్లు బోరు బావులపై ఆధారపడిన సాగు భూమి. 2015-16లో నికరం సాగైన భూమి 11.93 లక్షల హెక్టార్లు. భూగర్భ జలాల మట్టాన్ని అంచనా వేయడానికి 1,254 ఫీజోమీటర్స్ పని చేస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో 0.22 మీటర్ల మేరకు భూగర్భ జలాల నీటి మట్టం పెరిగితే, రాయలసీమ ప్రాంతంలో 3.94 మీటర్ల మేరకు భూగర్భ జలాల నీటి మట్టం తగ్గి పోయింది. నీటి సంరక్షణ మరియు నిర్వహణ లక్ష్యంగా నీరు-చెట్టు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కరవు నివారణా పథకాల రూపకల్పనకు కృషి చేస్తున్నది.
  14. సాగు నీటి రంగం: కృష్ణా నదీ జలాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512.040 టియంసిలను వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛ కల్పిస్తూ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్(బచావత్ ట్రిబ్యునల్) తీర్పు ఇచ్చింది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా తెలుగు గంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గోదావరి నదీ జలాలకు సంబంధించి 308.703 టియంసిలు వినియోగించు కోబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2017-18 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పూనుకొన్నది. అవి: 1.పట్టిసీమ ఎత్తిపోతల పథకం, 2. తోటపల్లి ఆనకట్ట, 3.హంద్రీ-నీవా సుజల స్రవంతి, 4. గాలేరు-నగరి సుజల స్రవంతి – మొదటి దశ‌, 5.బి.ఆర్.ఆర్. వంశధార(రెండవ దశ-రెండవ విభాగం), 6. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, 7. గుండ్లకమ్మ జలాశయం. వీటిలో పట్టిసీమ, తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను, పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయ్యింది.                                                        చిన్ననీటి పారుదల రంగం: 40,817 చెరువుల క్రింద 25.60 క్షల ఎకరాల భూమి సాగవుతున్నది.
  15. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: 2015-16లో 41.36 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల ఉత్ఫత్తికి సాగు చేస్తే, 2016-17లో 41.34 ల.హె. లలో సాగు చేయబడింది. అయినా 2015-16లో 143.78 లక్షల టన్నుల ఉత్ఫత్తి జరిగితే, 2016-17లో 156.85 లక్షల టన్నుల ఉత్ఫత్తి జరిగింది. లోటు వర్షపాతం, సాగు భూమి విస్తీర్ణం తగ్గినా ఆహార ధాన్యాల ఉత్ఫత్తిలో 9.09% వృద్ధి ఉన్నది.
  16. భూమి కమతాలు: సగటు భూమి కమతాల విస్తీర్ణం 2005-06లో 1.13 హెక్టార్లు ఉంటే 2010-11 నాటికి 1.06 హెక్టార్లకు తగ్గింది. కమతాల సంఖ్య 72.16 లక్షల నుండి 76.21 లక్షలకు పెరిగింది.
  17. వ్యవసాయ రుణాలు: రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2015-16లో వ్యవసాయ రుణాలు రు.65,272 కోట్లకు గాను రు.75,448(116%) కోట్లు మంజూరు చేస్తే, 2016-17లో మంజూరు రు.83,003 కోట్లకు గాను 2016 సెప్టంబరు నాటికి రు.43,125.44 కోట్లు(51.96%) విడుదల చేశారు. 2015-16లో 5,00,275 కౌలు రైతులకు రుణ అర్హత కార్డులలను రెవెన్యూ శాఖ‌ జారీ చేసినా కేవలం 1,00,431 మందికి రు.243.41 కోట్లు విడుదల చేశారు. 2016-17లో 5,90,708 కార్డులు జారీ చేసి, వారిలో 71,940 మందికి రు.182.12 కోట్లు మంజూరు చేశారు.
  18. వాణిజ్యం మరియు ఎగుమతులు: 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం(ఏప్రిల్ నుండి సెప్టంబరు)లో ఎగుమతులు రు.29,629.65 కోట్లు. ఎగుమతుల్లో ప్రధానమైనవి, మందులు, సముద్ర ఉత్ఫత్తులు, వ్యవసాయోత్ఫత్తులు, వ్యవసాయాధార ఉత్ఫత్తులు, కుటీర పరిశ్రమలు మరియు చేతి వృత్తుల‌ ఉత్ఫత్తులు, ఖనిజాలు మరియు ఖనిజ ఉత్ఫత్తులు, సాప్ట్ వేర్ ఉత్ఫత్తులు ఉన్నాయి.
  19. విద్యుత్తు రంగం: 13,885.38 మెగా వాట్స్ విద్యుత్ ఉత్ఫాదనా సామర్థ్యం కలిగి ఉన్నది. తలసరి విద్యుత్తు వినియోగం 987 యూనిట్స్ గా ఉన్నది. 2014 జూన్ నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉంటే ఆ పరిస్థితిని అదిగమించి, విద్యుత్తు మిగులు రాష్ట్రంగా ముందడుగు వేసి, గృహ వినియోగదారులందరికీ 24 x 7 ప్రాతిపదికన‌ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతున్నది. 2016-17లో 50,000 వ్యవసాయ పంప్ సెట్లకు కొత్తగా కనెక్ష‌న్స్ మంజూరు చేయాలనే లక్ష్యం నిర్ధేశించుకొని, 2016 డిసెంబరు 31 నాటికి 46,295 కనెక్షన్స్ విడుదల చేయడం జరిగింది. 2016 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 16.28 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. విద్యుత్తు నిర్వహణా సామర్థ్యం మరియు సాంప్రదాయేతర ఇంధన పరిష్కారాలకు సంబంధించి ఐదు దఫాలు జాతీయ అవార్డులను రాష్ట్రం సాధించుకొన్నది.
  20. రహదారులు: 2016 మార్చి 31 నాటికి 47,002 కి.మీ. రహదార్ల వ్యవస్థ ఉన్నది. ఇందులో 15,406 కి.మీ. రాష్ట్ర రహదార్లు, 26,038 కి.మీ. పెద్ద తరహా జిల్లా రహదార్లు, 5,558 కి.మీ. గ్రామీణ రహదార్లు ఉన్నాయి. 5,293.43 కి.మీ. మేరకు 26 జాతీయ రహదార్లు రాష్ట్రంలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో సగటున 1,000 చ.కి.మీ. కు 30.45 కి.మీ. ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 32.82 కి.మీ. రహదార్లు ఉన్నాయి.
  21. రవాణా రంగం: 2016 డిసెంబరు 1 నాటికి రాష్ట్రంలో రవాణా శాఖ వద్ద‌ రిజిస్టరయిన వాహనాల సంఖ్య‌ 95.36 లక్షల.
  22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ రోడ్డు రవాణా సంస్థ: ఎ.పి.యస్.ఆర్.టి.సి. నాలుగు జోన్లు, 12 రీజియన్స్ గా విభజించబడి,127 డిపోలు, 11,962 బస్సులతో నిర్వహించబడుతున్నది. 2016 అక్టోబరు నాటికి 57,651 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క బస్సు , దినసరి సగటు ఉత్ఫాదకత 378 కి.మీ.గా ఉన్నది. టైర్లు మరియు ఇంధన వినియోగ సామర్థ్యం, ఉత్ఫాదకతకు సంబంధించి సంస్థ జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని సంపాదించుకొని, వాహనాల వినియోగ సామర్థ్యం, వనరుల వినియోగం, ప్రయాణికుల రవాణా, సమర్థవంతంగా ఇంధన వినియోగం, బస్సుల ‘బ్రేక్ డౌన్’ మరియు ప్రమాదాల నిష్పత్తి ప్రాతిపదికగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఎ.పి.యస్.ఆర్.టి.సి. ప్రథమ స్థానంలో నిలిచింది.
  23. విమానాశ్రయాలు: విజయవాడ, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల స్థాయి పెంపుదలకు, ఆధునీకీకరణకు రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ‌ విమానయాన స‍ంస్థతోఒప్పందాలు కుదుర్చుకొన్నది. విమానయాన రవాణా సదుపాయాలను విస్తరించడానికి, అనుసంధానం చేయడానికి, మెరుగు పరచడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు లలో ప్రాంతీయ విమానాశ్రయాలను నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
  24. ఓడ రేవులు: 974 కి.మీ. సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఓడ రేవు దేశంలోని పెద్ద ఓడ రేవుల్లో ఒకటి. భారత ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నది. మరో 14 నోటిపైడ్ ఓడ రేవులు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో నాలుగు కాప్టివ్ పోర్ట్స్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుర్గరాజమట్నం వద్ద మరొక ఓడ రేవుకు ప్రతిపాదన ఉన్నది. కాకినాడ సెజ్ ను చిన్న ఓడ రేవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాప్టివ్ పోర్ట్ ద్వారా సెజ్ కు సంబంధించిన సరుకు రవాణా కార్యకలాపాలన్నీ నిర్వహించబడతాయి.
  25. పర్యాటకం: రాష్ట్రం పలు పవిత్ర పుణ్య క్షేత్రాలకు, ఆకర్షణీయ మరియు ఆహ్లాదకరమైన‌ ప్రాంతాలకు, మ్యూజియమ్స్, బీచ్ లు, ఓడ రేవులు, నదులు, హిల్ స్టేషన్స్ తదితర పర్యాటక స్థలాలు, కేంద్రాలకు నెలవుగా ఉన్నది. 300 లకు పైగా పర్యాటక స్థలాలున్నాయి. పట్టిసీమ, పాపికొండల మధ్య గోదావరి నదిలో పడవ ప్రయాణం అత్యంత పాచుర్యం పొందినది. ప్రతి సంవత్సరం 75 లక్షలకుపైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటక రంగం అభివృద్ధికి కృషి జరుగుతున్నది.
  26. పాఠశాల విద్య: మొత్తం నమోదైన విద్యార్థుల సంఖ్య 68.47 లక్షలు. వారిలో I-V తరగతులలో 34.76, VI-VIII తరగతులలో 20.85, IX-X 12.87 తరగతుల విద్యార్థులు. 2016-17 విద్యా సంవత్సరంలో మధ్యలో మానేసిన వారి సంఖ్య I-V (ప్రాథమిక) 9.68%, I-VIII (మాధ్యమిక) 12.77%  , I-X (ఉన్నత పాఠశాల) 20.67%. 2015-16లో ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 94.53%. విద్యార్థులకు ఒక పూట‌ పోషకాహారాన్ని ఇవ్వడం, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు I-VIII  విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని 60:40 నిష్పత్తిలో నిథులను సమకూర్చి అమలు చేస్తున్నాయి. IX-X తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 100% నిథులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం క్రింద 2016-17లో 36.66 లక్షల మంది ప్రాథమిక స్థాయి విద్యార్థులు(యన్.సి.యల్.పి. పాఠశాలల విద్యార్థులతో కలిపి), 11.15 లక్షల మంది మాధ్యమిక, 7.24 లక్షల మంది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం వనగూడింది.                                             * కేంద్ర ప్రభుత్వం 163 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేయగా, ప్రస్తుతం 160 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో VIవ‌ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు విద్యాబోధన జరుగుతుంది. తరగతికి 80 మంది చొప్పున విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశం కల్పించబడుతుంది. విద్యా పరంగా వెనుకబడిన మండలాలలో నిర్వహించబడుతున్న ఈ తరహా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలలో 2016-17 విద్యా సంవత్సరంలో 70,540 మంది విద్యార్థులు విద్యనార్జించారు. 2015-16లో ఆదర్శ పాఠశాలల ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 96.84%. కడప జిల్లా రాయచోటి ఆదర్శ పాఠశాల 10/10 జిపిఎ సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత 74.91%. సర్వ శిక్షా అబియాన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబడుతున్న 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను నెలకొల్పడం జరిగింది.                                                                                   * ఇంటర్మీడియట్ విద్య: రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ బోర్డు నిర్వహణ క్రింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 447, వృత్తి విద్యా బోధనా జూనియర్ కళాశాలలు 8 ఉన్నాయి. ప్రయివేటు యాజమాన్యంలో 1,749 జూనియర్ కళాశాలలు ఉన్నాయి.                                                                                         ఉన్నత విద్య: రాష్ట్రంలో 146 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఓరియంటల్ కళాశాల. ప్రయివేట్ ఎయిడెడ్ కళాశాలలు 141. వాటిలో 15 ఓరియంటల్ కళాశాలలు. మొత్తం విద్యార్థుల సంఖ్య 2,06,705.     * సాంకేతిక‌ విద్య: రాష్ట్రంలో డిప్లొమా మరియు డిగ్రీ స్థాయి వృత్తి విద్యా సంస్థలు 1,360 ఉన్నాయి. వాటిలో 3,21,003 మంది విద్యార్థులకు ప్రవేశం అవకాశం ఉన్నది. 87,681 మంది విద్యార్థులకు ప్రవేశ అవకాశం ఉన్న‌313 పాలిటెక్నిక్స్, 1,080 మందికి ప్రవేశ అవకాశం ఉన్న 18 డి.పార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయి. పాలిటెక్నిక్స్ లో సాంకేతిక, పారిశ్రామిక‌ నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 41 కేంద్రాలను నెలకొల్పబడ్డాయి. విశాఖపట్నంలో ఐఐయం, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పరిథిలో ఐఐటి, ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్., ఐఐఐటి(శ్రీసిటీ), తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో ఐఐఐటి సంస్థలు 2015-16లో నెలకొల్పబడ్డాయి. 2016-17లో జాతీయ స్థాయి విద్యా సంస్థలైన గిరిజన విశ్వ విద్యాలయాన్ని విజయనగరం జిల్లాలోను, కేంద్ర విశ్వ విద్యాలయాన్ని అనంతపురం జిల్లాలో నెలకొల్పబోతున్నారు.
  27. కుటుంబ సంక్షేమం: రాష్ట్రంలో 7,659 ఉప కేంద్రాలు, 1,156 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 193 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 31 ప్రాంతీయ ఆసుపత్రులు, 8 జిల్లా ఆసుపత్రులు, 3 తల్లీ & పిల్లల ఆరోగ్య కేంద్రాలు, 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. ఇవి కాకుండా 73 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలు, 48 పోస్ట్ మార్టమ్ యూనిట్స్, 222 ఇ‍-ప్రాథమిక వైద్య కేంద్రాలు, 21 గిరిజన ఆసుపత్రులు రాష్ట్ర పరిథిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నిర్వహణలో 116 ఆసుపత్రులు, 26 బ్లడ్ బ్యాంక్స్, 38 రక్తం నిల్వ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. 1,563 మంది వైద్యులు, 2,022 మంది నర్సులు, 1,149 మంది పారా మెడికల్ సిబ్బంది, 386 మంది పరిపాలనా సిబ్బంది పని చేస్తున్నారు.
  28. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం: ఈ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల సంక్షేమం, అవసరాలు తీర్చడానికి పిల్లల కోసం 46, మహిళల కోసం 21 సంస్థలు నిర్వహించబడుతున్నాయి. అంగన్ వాడి కేంద్రాలలో దాదాపు 9.07 లక్షల మంది పిల్లలు ప్రీ స్కూల్ విద్యా శిక్షణ పొందుతున్నారు. 2,571 ఐసిడియస్ పథకాలు అమలులో ఉన్నాయి. 2016-17(సెప్తంబరు 2016 వరకు)లో పోషకాహార పథకం ద్వారా 31.87 లక్షల మంది ప్రయోజనం పొందారు.
  29. వికలాంగుల సంక్షేమం: తూర్పు గోదావరి, విజయనగరం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలలో వికలాంగుల పునరావాస కేంద్రాలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖపట్నంలో వికలాంగుల క్రీడల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ద్వారా నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది.
  30. వెనుకబడిన కులాల సంక్షేమం: రాష్ట్రంలో 897(692 బాయిస్ హాస్టల్స్, 205 విద్యార్థినులకు) ప్రభుత్వ బి.సి. వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో 2016-17లో 96,997 మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. 32 బి.సి.రెసిడెన్సియల్ పాఠశాలలు(17 అబ్బాయిలకు, 15 అమ్మాయిలకు) ఉన్నాయి. వీటిలో 2016-17లో 12,292 మందికి ప్రవేశం కల్పించబడింది. 2015-16లో ఎస్.ఎస్.సి. విద్యార్థుల రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 94.77% ఉంటే బి.సి.వసతి గృహాల్లోని విద్యార్థుల ఉత్తీర్ణత 96.75%. రాష్ట్రంలో 11,960 ప్రాథమిక సహకార సంస్థలను పది సమాఖ్యలలో నమోదు చేయడం జరిగింది.
  31. సాంఘిక సంక్షేమం: 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దళితుల జనాభా 17.08%. వీరిలో 79.98% మంది గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. పాఠశాలలో యస్.సి. పిల్లల నమోదు 82.29%. వీరిలో 39.64% మంది మధ్యలో మానేస్తున్నారు. 958 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. 2016-17లో వాటిలో 89,840 మంది విద్యార్థులు ప్రవేశం పొందడానికి అవకాశమున్నది. 566 ప్రత్యేక వసతి గృహాలు మరియు 27 ఇంటెగ్రేటెడ్ హాస్టల్ వెల్ ఫేర్ కాంప్లెక్సెస్ నిర్వహించబడుతున్నాయి.
  32. గిరిజన సంక్షేమం: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో గిరిజన వసతి గృహాలను దశల వారిగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రక్రయను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2016_17లో 80 వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చబడ్డాయి. వీటిలో మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న 5,242 మందికి ప్రయోజనం కలిగింది. ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఉత్తీర్ణత 90.87%.
  33. పేదరికం: పేదరిక నిష్పత్తి గ్రామీణ ప్రాంతంలో 10.96%, పట్టణ ప్రాంతాలలో 5.81%, రాష్ట్ర సగటు నిష్పత్తి 9.20%. జాతీయ సగటు నిష్పత్తి గ్రామీణ ప్రాంతాలలో 25.70%, పట్టణ ప్రాంతాలలో 13.70%, మొత్తంగా 21.92%.
  34. ప్రజా పంపిణీ వ్యవస్థ: 2016 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో 29,054 రేషన్ షాపులు ఉన్నాయి. సగటున ఒక్కొక్క రేషన్ షాపుకు 450 కార్డులు/కుటుంబాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ నిబంధనల మేరకు 2,000 జనాభాకు ఒక షాపు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో 1,725 జనాభాకు ఒక షాపు ఉన్నది.
  35. ఉపాథి- నిరుద్యోగం: 2011-12లో నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(యన్.యస్.యస్.ఓ), 68వ నివేదిక గణాంకాల ప్రకారం నిరుద్యోగుల నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో 12%, పట్టణ ప్రాంతాల్లో 43%గా ఉంటే జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 17%, పట్టణ ప్రాంతాల్లో 34%గా ఉన్నది.                 * ఉపాథి & శిక్షణ: సంఘటిత రంగంలో ఉన్న 9,244 పరిశ్రమల్లో 8.60 లక్షల మందికి ఉపాథి కల్పించబడింది. వీటిలో ప్రభుత్వ రంగంలో ఉన్న 6,470 సంస్థల్లో 6.04 లక్షల మందికి, ప్రయివేటు రంగంలోని 2,774 సంస్థల్లో 2.56 లక్షల మందికి ఉపాథి కల్పించబడింది.
  36. ఆధార్ కార్డులు: రాష్ట్రంలో 507.01 లక్షల ఆధార్ కార్డులు జారీ చేయబడ్డాయి.                                                                                                                                                               టి.లక్ష్మీనారాయణ‌                                                                                                      గమనిక: ఈ వ్యాసం ఆర్.సి.రెడ్డి పబ్లికేషన్స్ “వివేక్” మాసపత్రిక, 2017 మే సంచిక‌లో ప్రచురించబడింది.

No comments:

Post a Comment