Monday, May 22, 2017

డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ !

కంప్యూటర్ల వ్యవస్థను ప్రపంచ వ్యాపితంగా ఒక కుదుపు కుదిపేసి, తీవ్ర ఆందోళనకు గురి చేసిన 'వర్నా క్రైం వైరస్' లేదా 'హ్యాకింగ్' సమస్య తలెత్తిన నేపథ్యంలో 'డిజిటలైజేషన్...సైబర్ సెక్యూరిటీ' అన్న అంశంపై దూరదర్శన్, విజయవాడ కేంద్రం చర్చను నిర్వహించింది. చర్చలో నాతో పాటు 'ఎథికల్ హాకర్' గా పని చేస్తున్న శ్రీ సాయిసతీశ్ పాల్గొన్నారు.
నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాం. విజ్ఞాన సమాజం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం. 'డిజిటల్' ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం చేయకుండా మనుగడ సాగించలేం. ఆ వైపున ప్రయాణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.
అవినీతిని, నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే లక్ష్యంతో పాత రు.500, 1000 పెద్ద నోట్లను రద్దు చేసినట్లు దేశ ప్రధాన మంత్రి మోడీ గారు ప్రకటించారు. నగదు లావాదేవీలను నిరుత్సాహపరుస్తూ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించారు. నిరక్షరాస్యులను చైతన్య పరచడానికి యువత నడుంకట్టాలని పిలుపిచ్చారు.
ప్రజలు కూడా పెద్ద నోట్ల రద్దు పూర్వరంగంలో బ్యాంకులు, ఏటియంలలో నగదు లభించక పోవడంతో అనివార్యంగా మొబైల్, ఇంటర్నెట్ లావాదేవీల వైపు మళ్ళారు. గడచిన ఏడాది నవంబరు, డిసెంబరు మాసాలలో ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అటుపై కొంత తగ్గిన మాట వాస్తవమే.
ఈ పూర్వరంగంలో తాజా హ్యాకింగ్ సమస్య పర్యవసానంగా డిజిటలైజేషన్ వ్యవస్థ పట్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొనడం సహజం. పోలీసు వ్యవస్థ మొదలుకొని వివిధ రంగాలను కలవర పాటుకు గురిచేసిన హ్యాకింగ్ ఇంటర్నెట్ వినియోగదారులైన సామాన్య ప్రజానీకాన్నీ ఆందోళనకు గురి చేసింది.
దేశ రక్షణ శాఖ, రిజర్వ్ బ్యాంకు, కార్పోరేట్ సంస్థలు,తదితర సంస్థలు సైబర్ క్రైం బారిన పడకుండా తమ కంప్యూటర్ల వ్యవస్థలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని కాపాడు కోవడానికి రక్షణ వ్యవస్థలను నెలకొల్పుకొన్నాయని, ఎథికల్ హాకర్స్ ను కూడా నియమించు కొన్నారన్న వార్తలు వచ్చాయి. ఇంజనీరింగ్ పట్టభద్రులు కాని వారు కూడా హ్యాకింగ్ నైపుణ్యాన్ని పొందిన వారు నేడు 'ఎథికల్ హ్యాకర్స్' గా సేవలందించడానికి సంస్థలను నెలకొల్పి, నిర్వహిస్తున్నారు. ఇదొక ఉపాథి కల్పనా రంగంగా ఎదుగుతున్నదని కూడా చెబుతున్నారు.
సైబర్ క్రైం ను కేవలం ఆర్థిక నేరాల కోణంలోనే చూడకూడదు. వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసి, సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థను మాత్రమే కాదు, అణు విద్యుత్తు కేంద్రాలు, దేశ రక్షణ, పోలీసు, నేరాల నమోదు, రవాణా, విద్యుత్తు, విద్యా, వైద్య వ్యవస్థలు, భూ యాజమాన్య హక్కుల రికార్డులు, రిజిస్ట్రేషన్స్, ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, ఇలా అన్నింటినీ డిజిటలైజేషన్ వ్యవస్థలోకి తీసుకెళ్ళడం జరిగింది, జరుగుతున్నది. ఆధార్ కార్డుల అనుసంధానంతో పౌరుల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం జరుగుతున్నది. కంపూటర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ, సమాజం యావత్తు సంక్షోభంలోకి నెట్టబడుతుంది.
ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన టెర్రరిస్టులు ఎలాంటి ఘాతుకానికైనా పాల్పడతారు. సైబర్ క్రైం కు ఆ దుష్టశక్తులు పాల్పడవని బరోసాగా అంతర్జాతీయ సమాజం ఉండ లేదు. తాజా 'వర్నా క్రైం' సైబర్ నేరానికి ఉత్తర కొరియా కేంద్రంగా జరిగిందన్న దానికి ఆధారాలను ఎవరు బయట పెట్టలేదు. ఆ దేశంపైన వేసిన ఒక అపవాదుగానే కనబడుతున్నది.
అణుయుద్ధం, స్టార్ వార్స్ వంటివి ప్రపంచ మానవాళిని ఇప్పటి వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో సైబర్ వార్స్ జరుగుతాయన్న ఊహాగానాలు చేస్తున్నారు. ఈ పెనుముప్పు నుండి మన సమాజాన్ని రక్షించుకోవడానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
'సైబర్ సెక్యూరిటీ' వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పు కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపులను పెంచి(కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ లో కేవలం రు.116 కోట్లు కేటాయించింది), యుద్ధ ప్రాతిపథికపై కార్యాచరణను అమలు చేయాలి.
సైబర్ క్రైంల నేరాలు పెరిగి పోతున్నాయి. 2015లో 50,000 జరిగాయని ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. 32,000 ఏటియం కార్డుల సమాచారం తస్కరించ బడిందని రిజర్వ్ బ్యాంకే అనుమానాలు వ్యక్తం చేస్తూ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందన్న వార్తలు కొన్ని నెలల క్రితం విన్నాం. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 కు పదును పెట్టి పకడ్బందిగా అమలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట చేయాలి. దొంగల బెడద నుండి ఇంటికి గట్టి తాళాలు వేసుకొన్నట్లే, సైబర్ నేరస్తుల బారిన పడకుండా పటిష్టమైన రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇవీ నేను చర్చలో స్థూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు. 

No comments:

Post a Comment