Thursday, May 26, 2011

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం

సాకారం కాని ‘ప్రపంచ’ స్వప్నం
‘సహస్రాబ్ది లక్ష్య సాధన’ ఎజెండా స్థితి-గతి
విశ్లేషణ...

అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు.

ఐక్యరాజ్య సమితిలో సామాజిక స్పృహ వికసిం చింది. ప్రపంచ దేశాధినేతలంతా ఒకే వేదికపై గుమి గూడారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కటిక దారిద్య్రాన్ని, ఆకలి బాధలను కనీసం సగానికన్నా తగ్గిస్తామని శపథం చేశారు. సార్వజనీన ప్రాథమిక విద్య, లింగ వివక్ష లేని సమానత్వం, మహిళా సాధికారత, శిశుమరణాల తగ్గింపు, తల్లుల ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ / ఎయిడ్స్ మలేరియా తదితర భయానక అంటువ్యాధులను నిరోధించడం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయంగా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రతినబూనారు.

ఈ మేరకు 2000 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 179 సభ్యదేశాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల ప్రజలను మానవాభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధిస్తామని గడువు విధించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగిడిన సందర్భంగా నిర్దేశించుకున్న ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’లో ప్రగతిని సమీక్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20-22 తేదీల్లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు నిర్వహించింది. ప్రతిజ్ఞ చేసి దశాబ్దం గడచిపోయింది. ఇహ! మిగిలింది ఐదు సంవత్సరాలు మాత్రమే. లక్ష్యాలను అసలు చేరుకోగలమా? అన్నది శేష ప్రశ్న.

ఈ ఆశావహదృక్పథాన్ని 2007-08 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పునా దులనే కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నీరు గార్చింది. సంక్షోభ దుష్పరిణామాల పర్యవసానంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వివిధ రూపాలలో దాని ప్రభావం నేటికీ కొనసాగుతున్నది. మన దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆహార సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఆహార ద్రవ్యోల్బణం 17.9 శాతానికి ఎగబాకి ఆహార భద్రతకు పెనుసవాలు విసిరింది. రెండంకెల ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి ఒక అంకెకు దించుతామని ప్రభుత్వాధినేతలు బీరాలు పలికారు.

కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించి హనుమంతుని తోకలా పెరుగుతూ అది ప్రస్తుతం 15.9 శాతం చేరింది. దాన్ని అదుపు చేసే శక్తి లేక, పోయిన ఏడాది వర్షాలు సరిగా పడలేదని, కరువు కాటకాలు సంభవించాయని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మూలంగా పేదల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ననుసరించి ఆహార వస్తువుల ధరలు పెరిగాయని నమ్మబలుకుతూ ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకుంటున్నారు. అసలు కారణాల జోలికి పోవడం లేదు. ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడింది. మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలలో పౌష్టికాహార లోపాల సమస్య పెరుగు తున్నది. 47 శాతం మంది పిల్లలు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో స్ర్తీ శిశు సంక్షేమశాఖ బహిర్గతం చేసిన సమాచారం మేరకు 50.94 లక్షల మంది పిల్లల బరువు చూస్తే వారిలో 24 లక్షల మంది పోషకాహార లోపాలవల్ల తక్కువ బరువు కలిగివున్నారని తేలింది.

ఈ పూర్వరంగంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో (భారతదేశంతో సహా) పేదరికానికి సంబంధించి గణాంకాలతో కూడిన తాజా అంచనాల నివేదికను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అది తీవ్ర ఆందోళన కలిగించడమే కాదు, మన దేశాధినేతలు అనుసరిస్తున్న విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సహస్రాబ్ది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి నాడు ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలను తారుమారు చేస్తూ దారిద్య్రంలో మగ్గిపోతున్న ప్రజల సంఖ్య అధికంగా ఉన్నదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఈ నివేదిక ఒక చెంపపెట్టు. ఒక్క 2009 సంవత్సరంలోనే అదనంగా 5.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారని పేర్కొంది. ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన’ తిరోగమన దిశలో సాగుతున్నదన డానికి ఇది ఒక ప్రబల నిదర్శనంగా ఉదహరించింది. ఈ నివేదికను 2005లో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా రూపొందించారు.

నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరగడంతో పేద ప్రజల కొనుగోలు శక్తి ఇప్పుడు ఇంకా క్షీణించింది. మరొక వైపున పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగి స్తున్న కొలమానాలపై కూడా భిన్నాభిప్రాయా లున్నాయి. ఒక అమెరికన్ డాలర్ అంటే రూ. 46ల దినసరి ఆదాయానికి కింద ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తున్నారు. తిండి, గుడ్డ, ఇల్లే కాదు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు, మౌలిక వసతులు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని మానవహక్కులుగా నాగరిక సమాజం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990వ సంవత్సరంలో 37.5 మంది దారిద్య్రరేఖ కింద జీవిస్తున్నారని, ఈ సంఖ్యను 2015 నాటికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 18.75 శాతానికి తగ్గిస్తామని, తదనుగుణంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. 2009-10 ఆర్థిక సర్వేలో పొందుపరిచిన మేరకు 2004-05 ఆర్థిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లో 28.3 శాతం పట్టణ ప్రాంతాలలో 25.7 శాతం, మొత్తం దేశంలో సరాసరిన 27.5 శాతం దరిద్ర నారాయణలున్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది.

విశ్వసనీయత ఉన్న ఇతర సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 41.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 37.2 శాతం, సరాసరిన 39.5 శాతం ఉన్నారని కూడా ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కేవిధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దేశం కృషి చేస్తున్నదని విదేశాంగ శాఖామా త్యులు ఎస్.ఎం.కృష్ణ ఐక్యరాజ్యసమితి సదస్సులో సెలవిచ్చారు. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం నుండి బయటపడ్డామని, ఆర్థిక వృద్ధిరేటు ఆశించిన దానికన్నా వేగంగా పెరుగుతున్నదని, జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 8.8గా నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల సూచిక మేరకు జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,64,178 కోట్లుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2009 డిసెంబర్ నాటికి 284 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ. 43,749కు పెరిగింది. ఎంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధిస్తే అంత ఎక్కువగా సామాజికాభివృద్ధికి నిధులు లభ్యమవుతాయని ప్రజలు కలలుగంటారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమపాళ్లలో పంపిణీ జరగాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు వారి వాటా వారికి చేరాలి. అప్పుడే దారిద్య్ర నిర్మూలనా లక్ష్యం నెరవేరుతుంది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొదటి సమస్య అయిన దారిద్య్ర నిర్మూలన నిరాశాజనకంగా ఉన్నది. రెండవది- సార్వజనీన ప్రాథమిక విద్య. చిన్నారులను 100 శాతం బడిలో చేర్పించాలి. బడిమానేసే పిల్లల సంఖ్యను పూర్తిగా నిరోధించాలి. 2007 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే 15 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు ఉన్న వయోజనులలో అక్షరాస్యత 66 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 61 శాతంగా ఉన్నది. నిష్ర్కమించేవారు దాదాపు 35 శాతం ఉన్నారు. కొన్ని పరిమితులున్నా విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడం నిస్సందేహంగా ముందడుగే. మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు, నిర్దేశిత పరిధిలో పాఠశాలలు వగైరా సంక్లిష్ట సమస్యలను పరిష్కారం లభిస్తేనే చట్టంవల్ల ప్రయోజనం చేకూరు తుంది. మూడవది- ఐదు సంవత్సరాలలోపు శిశు మరణాల నిష్పత్తిని వెయ్యి జననాలకు కనీసం 42కు తగ్గించడం. కానీ ఆడ శిశువుల్లో 55, మగశిశువుల్లో 52, సరాసరి 53 మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగవది- ప్రసూతి మరణాలను లక్ష జననాలకు 109కి తగ్గించడం. 2004-06 నాటికి ఇది 354కు మాత్రమే తగ్గింది.

ఐదవది లింగ సమానత్వం. మహిళా సాధికారత సాధనలో అడుగు ముందుకుపడటం లేదు. చట్ట సభల్లో మూడవవంతు రిజర్వేషన్ల కోసం మహిళా లోకం ఉద్యమాలు చేస్తున్నది. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు తప్ప, వ్యతిరేకించేవాళ్ల నిజస్వరూపాన్ని ఎండగట్టి, బిల్లుకు ఆమోదాన్ని పొందలేకపోతున్నారు.

ఆరవది హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రోగుల సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 2008 డిసెంబర్ నాటికి 3.34 కోట్ల మంది హెచ్‌ఐవీ పీడితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వీరిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు 21 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యాధివల్ల మరణించిన 20 లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది పిల్లలే. 2006 నాటికి మన దేశంలో 25 లక్షలకు పైగా ఉన్నారని జాతీయ ఎయిడ్స్ నిరోధక సంస్థ అంచనా వేసింది. అసంఘటిత కార్మికులు అత్యధికంగా ఈ వ్యాధికి బలైపోతున్నారు. మన రాష్ట్రంలో విషజ్వరాల బారినపడి మరణిస్తున్న గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవు తున్నది. ఏడవది- పర్యావరణ పరిరక్షణ అంశం. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయా రైంది. మొత్తం భూమి విస్తీర్ణంలో 20.64 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సంపదను, సహజ వనరులను రక్షించుకుంటూ, కాలుష్యాన్ని అరికట్టే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలి, చేసి పచ్చదనాన్ని కాపాడుకోకపోతే ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుంది.

ఎనిమిది- నిధులకు సంబంధించిన అంశం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థూల జాతీయోత్ప త్తిలో 0.7 శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను ఆర్థిక సహాయంగా అందిస్తా మని చేసిన వాగ్దానాన్ని ఐదు దేశాలు మాత్రమే పాక్షికంగా అమలు చేశాయి. రుణ భారాలతో పీకల్లోతు కష్టాలలో ఉన్న దేశాలకు ఈ లక్ష్యాలను చేరుకోవడం అందుకే దుర్లభమవుతున్నది.

అభివృద్ధి, సామాజిక న్యాయం, శాంతియుత సహజీవనం, స్థిరమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధించాలన్నా, విద్య, ఆరోగ్యం, ఆవాసం వగైరా మానవహక్కులు అందరూ సంపూర్ణంగా అనుభవించాలన్నా ముందు షరతు దారిద్య్రాన్ని నిర్మూలించాలి. ప్రజల నాణ్యమైన జీవన ప్రమాణాల ప్రాతిపదికగానే ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయంగా కార్యాచరణకు మన దేశం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

No comments:

Post a Comment