Thursday, May 26, 2011

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం

విద్యాహక్కు చట్టం - 2009 'అమలు'కు రాజకీయ దృఢసంకల్పం ఆవశ్యకం
Tue, 29 Jun 2010, విశాలాంధ్ర టి. టి.లక్ష్మీనారాయణ

మానవ వికాసానికి, సమాజాభివృద్దికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం. మనిషికి చైత న్యంతోపాటు సత్‌ప్రవర్తన, సంస్కారం, నైతిక విలు వలు, నీతి నియమాలను ఉపదేశించడం ద్వారా సమగ్ర మానవుడిగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నదని మేథావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలెందరో నొక్కి వక్కాణించారు. విద్యా హక్కు మానవ హక్కుల్లో ప్రథమ శ్రేణిది. విద్యావ్యవస్థకు సంబందించి ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉన్నది. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్ధిక ప్రగతికి అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపొందించి, అమలు చేయబడుతుంది. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించగల శక్తి ఆ వ్యవస్థకు ఉండదు. పర్యవసానంగా విద్యా వ్యవస్థ లక్ష్యం, సారాంశం, యంత్రాంగం అన్నింటినీ ఆయా చారిత్రక దశల్లో ఉన్న సామాజిక ఆర్ధిక చట్రమే నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సామాజిక, ఆర్థికాభివృద్ధికి రూపురేఖలు దిద్దడం, ప్రభావితం చేయడం, మార్పు వైపున సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య క్రియాశీల పాత్ర పోషిస్తుంది. విద్యాభివృద్ధి అన్ని రంగాలతోపాటు ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మెరుగైన ఉత్పత్తి సాధనాల అన్వేషణ ద్వారా జాతి సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలాలు మనలాంటి వ్యవస్థలో అందరికీ అందకపోవచ్చు. కారణం ఉత్పత్తి అయిన సంపద పంపిణీ ఆ నిర్థిష్ట కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వర్గ స్వభావాన్ని బట్టి ఉంటుంది. సంపద పెరిగేకొద్దీ విద్యాభివృద్ధికి అవకాశాలు మెరుగు పడతాయి. విజ్ఞానాన్వేషణ పెరుగుతుంది. అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుంది. పర్యవ సానంగా బుద్దిజీవులు, శ్రమజీవుల నైపుణ్యం, సామర్ధ్యం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. తరతారాలుగా సముపార్జించుకొన్న విజ్ఞానంతో పాటు, అనుభవాలను జోడించి, నాణ్యమైన పరి శోధనలను కొనసాగించి నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విద్య పునాదిరాయి పాత్ర పోషి స్తుంది. సమాజంలోని లోపాలను, సమస్యలను పసిగట్ట గల సంపూర్ణ మానవుని తీర్చిదిద్దగల శక్తి ఒక్క విద్యకే ఉన్నది. కులం, మతం, జాతి, ప్రాంతం, లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషుల్లోని విజ్ఞాన వంతులు వ్యక్తులుగా, సమూహంగా, సమష్ఠిగా సామాజిక మార్పుకు, మానవీయ సమాజ నిర్మా ణానికి కావాలసిన చైతన్యాన్ని విద్య అందిస్తుంది. సమాజానికి, విద్యకు మధ్య ఉన్న అనుబంధం విడ దీయరానిదని గతి తర్కం ద్వారా బోధపడుతుంది. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత వర్ణనాతీతం. కానీ విద్య అందరికీ అందుబాటులో నేటివరకు లేదు. మన భారత సమాజంలో మానవుల మధ్య అంతరాలు, వివక్ష కొనసాగుతున్నది. అత్యధిక ప్రజానీకం విద్యకు నోచుకోకుండా ఈ సమాజం వెలివేసింది. నేడున్న దురదృష్టకర పరిస్థితిని గమనిస్తే అన్ని వస్తువుల్లాగే విద్యకూడా పూర్తి స్థాయిలో వినియోగవస్తువుగా బహిరంగ మార్కెట్‌లో నిస్సిగ్గుగా అమ్మబడుతున్నది. ఒకనాడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు, సమాజసేవలో అంతర్భాగంగా స్వచ్చంద సేవాసంస్థలు, వ్యక్తులు విద్యా సంస్థలను నెలకొల్పి, విద్యా వ్యాప్తికి అంకిత భావంతో పాటు పడ్డారు. మార్కెట్‌ ఆర్ధిక నీతి రాజ్యమేలుతున్న ఈనాడు లాభనష్టాల కొలబద్దతో విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా బేరీజు వేసుకొనే హీనస్థితికి దిగజారాం.

ఈ పూర్వరంగంలో విద్యార్థిలోకం, సామాజిక వర్గాలు సాగించిన దశాబ్దాల పోరాటానికి పాక్షిక విజయం లభించింది. రాజ్యాంగ బద్దంగా విద్యను ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం సామా జిక ప్రగతిలో నిస్సందేహంగా ఒక ముందడుగు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత గానీ ఈ హక్కు భావిభారత పౌరులైన బాల బాలికలకు దక్కలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 మొదలు పది సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. దశాబ్దం కాదు ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ఆదేశిక సూత్రాలకు ఆచరణ కరువైయింది. ఆ లక్ష్య సాధనలో ఘోరవైఫల్యం చెందాం. బడి గడప తొక్కని వారు, బడిలో అడుగుపెట్టి మధ్యలో మానేసిన పిల్లలు నిరక్షరాస్యులుగా, బాలకార్మికులుగా నికృష్ఠ మైన జీవితాలతో మగ్గి పోతున్నారు. అలా రెండు తరాలు గడచిపోయాయి. సామాజికంగా, ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నాగరిక ప్రపంచంలో దూసుకుపోతున్నా మని, ప్రపంచదేశాలతో పోటీపడుతున్నామని, ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని దేశాధినేతలు చంకలు చరుచుకొంటున్నారు. కాని ''అందరికి విద్య'' మాత్రం ''అందని ద్రాక్షపండు'' లాగే మిగిలిపోయింది. మానవ హక్కులు, ప్రజా స్వామ్య హక్కులు బడుగు బలహీన వర్గాలు, వారి పిల్లలలో అత్యధికులకు అందుబాటులోలేని స్థితి. పర్యవసానంగా ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ''ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎ రైట్‌ నాట్‌ ఎ ప్రివిలేజ్‌ '' (విద్య ప్రత్యేక సౌకర్యం కాదు హక్కు), విద్యా హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని దేశవ్యాపితంగా సమరశీల ఉద్యమాలెన్నో నిర్వహించబడ్డాయి. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల వత్తిడి పెరిగింది. ఈ పూర్వరంగంలో భారత ప్రభుత్వం సార్వత్రిక మరియు ఉచిత విద్యను ప్రాథ మిక హక్కుగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరచి 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి తీసుకురావడం హర్షణీయం. ''ఇల్లు అలకగానే పండుగ అయి పోలేదు'' అన్న సామెతగా చట్టం తీసుకురాగానే పిల్లలందరికీ విద్య అందదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్త్రీ పురుషులకు సమానమైన ఆస్తి హక్కు చట్టం, వరకట్న నిషేధ చట్టం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ మరియు నిషేధ చట్టం, బాలకార్మికుల నిషేధ చట్టం లాంటి సామాజిక ప్రగతికి దోహదపడే పలు అత్యంత ప్రాధాన్యత గల చట్టాలు చట్టుబండలుగా మారిపోయిన దుస్థితి గమనిస్తూనే ఉన్నాం. వీటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. విద్యా హక్కు చట్టం-2009ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాలక వర్గాలకు దృఢమైన రాజకీయ సంకల్పం, దీక్షాదక్షతలు, నిబద్దత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 2002 సవంత్సరంలో రాజ్యాంగానికి 86 వ సవరణ చేసి విద్యా హక్కును అమలులోకి తెస్తున్నామని చెప్పి అందులో పిల్లల తల్లిదండ్రులను, సంరక్షకులను బాధ్యులుగా చేసే నిబంధన చేర్చారు. తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.

నాటి నుంచి నేటి వరకు ఏడేళ్ళపాటు సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 21 ఎ మూడవభాగం, ఆర్టికల్‌ 45(3) ను సవరించి నూతన క్లాజ్‌ (కె) ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలకు సంబందించిన ఆర్టికల్‌ క్రింద జతచేయడంద్వారా ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి రాజముద్రతో అమలులోకి వచ్చింది. పలు ప్రసవవేదనలతో రూపొందిన ఈ విద్యా హక్కు చట్టం అమలు నిస్సందేహంగా పెనుసవాలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు, మొత్తం సమాజం ఈ సవాలును స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోవలసిన చారిత్రిక అవసరం ఎంతైనా ఉన్నది.

నిధుల సమస్య: చట్టాన్ని పార్లమెంటు ఆమో దించింది. కాని నిధుల కేటాయింపు అంశంపై నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దానికి అవసరమైన నిధులను వారే సమకూర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దుస్థితిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలైతే అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి, వార్షిక బడ్జెట్ల కేటాయింపులకే భారీగా కోతలు పెడుతూ విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధిక భారం మోపితే అసలుకే మోసం జరుగుతుంది. కేవలం 10% నిధులను వెచ్చించి కేంద్రప్రభుత్వం నుండి 90% ఆర్ధిక సహాయాన్ని పొందడానికి వీలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటి పథకాల అమలులో కూడా అస మర్థంగా వ్యవహరిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం అందకుండా చేస్తున్నారు. ఈ చేదు అనుభవాలను పరిగణలోనికి తీసుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించ లేవనడం ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వమే నిధుల కేటాయింపు బాధ్యతను తీసుకోవాలని బహిరంగంగానే కోరారు. కేంద్ర ప్రభుత్వం 55:45 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 నిష్పత్తిలో నిధుల సహాయం చేస్తామని ప్రకటించింది.

No comments:

Post a Comment