Tuesday, March 13, 2012

రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్య వాట ఎంత?

సూర్య దినపత్రిక మార్చి 14,2012

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ 2012-13 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ఉద్యుక్తులవుతున్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు, బడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాల ఒత్తిళ్ళ మధ్య బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుందనడం జగమెరిగిన సత్యం. సంపన్నులకు రాయితీ లివ్వడంలో చూపే శ్రద్ధ దేశ సమగ్రాభివృద్ధికి, మానవనరుల అభివృద్ధికి ఉపకరించే విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం వగైరా పద్దులకు నిథుల కేటాయింపులపై కనబరచడం లేదు. విద్య మార్కెట్‌ సరకుగా మారిపోయాయి. దిగువ మధ్య తరగతి, పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా పోయింది. 2010 విద్యారంగాన్ని మరింత లాభసాటి వ్యాపారానికి అనువైన రంగంగా మార్చివేస్తున్నారు. విద్య ఒక ప్రత్యేక సౌకర్యంగా కాక ఒక ప్రాథమిక హక్కుగా అందరికీ అందించాల్సిన రాజ్యాంగ బద్దమైన, సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

కాని నిథుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నది. పాఠశాల గడప తొక్కిన విద్యార్థుల్లో 15 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావకాశాలను అందుకోగలుగుతున్నారు. విద్యపై భారత్‌- అమెరికాల మధ్య జరిగిన దౌత్యపర సమ్మేళనం అనంతర పరిణామాలను గమనిస్తే, విద్యా వ్యవస్థను మరింత భ్రష్ఠు పట్టించే వైపే కేంద్ర ప్రభుత్వం ప్రయాణిస్తున్నదన్న విషయం రూఢి అవుతున్నది. రానున్న దశాబ్ద కాలంలో దాదాపు వెయ్యి విదేశీ విశ్వవిద్యాలయాలను, యాబై వేలకు పైగా కళాశాలలను మన దేశంలో నెలకొల్పుకోవడానికి అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్రఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దుష్పరిణామం మన విద్యా రంగానికి అత్యంత ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది . ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ముసుగులో విద్యారంగాన్ని గంప గుత్తగా ప్రయివేటీకరించే దురాలోచనతో ప్రభుత్వం ప్రయాణాన్ని సాగిస్తున్నది.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఐ.సి.హెచ్‌.ఆర్‌., ఐ.సి.యస్‌.ఆర్‌. తదితర ప్రభుత్వ సంస్థల నిథులతో, మౌలిక సదుపాయాలతో, ఉచితంగా లేదా నామమాత్ర ధరలకు వందల ఎకరాల భూములను సమకూర్చిన విద్యా సంస్థలను ఈరంగంలో మాఫియాలుగా ఆవిర్భవించిన దుష్ట శక్తులకు పథకం ప్రకారం ధారాదత్తం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్లు కనబడుతున్నది.18 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ప్రాథమిక హక్కుగా నిర్బంధ- ఉచిత విద్యను ప్రభుత్వం విధిగా అందించాలి. శాస్త్ర, సాంకేతిక విద్య- నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. దాన్ని సాఫల్యం చేసే దృష్టితో వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండాలి.18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 1.46 కోట్ల మంది యువతీ యువకులు ప్రస్తుతం దేశ వ్యాపితంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విద్యనార్జిస్తున్నారు. మన దేశ అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాలకు కావలసిన విద్యాధిక నిపుణులను ఈ ఉన్నత విద్యా సంస్థల నుండే సముపార్జించుకోవాలి .

గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థల నాణ్యత క్షీణిస్తూవస్తున్నది. దీనికి నిథుల లేమి ఒక ముఖ్యమైన కారణం. పర్యవసానంగా ఈ కళాశాలల నుండి డిగ్రీ , పోస్టు గ్రాడ్యువేట్‌ పట్టభద్రులై వస్తున్న యువతలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమతున్నది. అలాగే కొత్తగా బి.ఇ./ బి.టెక్‌., యం.బి.ఎ. వగైరా పట్టబద్రులైన వారిని ఉద్యోగాల్లో నియమించుకొన్న సంస్థలు అధిక మొత్తంలో నిథులు వెచ్చించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తమకు కావలసిన రీతిలో తీర్చిదిద్దుకొంటున్నాయి. పట్టభద్రులవుతున్న యువతలో 20-25 శాతానికి మించి ఉపాథి లభించడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అదనంగా కోటి మందికి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించాలన్న లక్ష్యాన్ని వ్యూహ పత్రాల్లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకం జరగాలి. తదనుగుణంగా నిథుల కేటాయింపు పెంచాలి.

స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 6 శాతం నిథులను విద్యా రంగానికి కేటాయిస్తామని యు.పి.ఎ-2 ప్రభుత్వం చేసిన వాగ్దానం, వాగ్దానంగానే మిగిలిపోయింది. మొత్తం విద్యా రంగానికి 3 శాతానికి మించి నిథులు మంజూరు చేయడం లేదు. అందులో ఉన్నత విద్యపై 1.12 శాతం నిథులు వెచ్చిస్తున్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పైనాన్స్‌ బ్యాంకు (యన్‌.ఇ.ఎఫ్‌.బి.) ను నెలకొల్పి తక్కువ వడ్డీతో విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించినా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. అధిక వడ్డీ రేటు, కఠిన నిబంధనల కారణంగా అర్హులైన విద్యార్థులు రుణాలు పొందలేక పోతున్నారు. ప్రస్తుతం 1.5 శాతం మంది మాత్రమే రుణాలు తీసుకొని, ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పూర్వరంగంలో రానున్న బడ్జెట్లో కేటాయింపులపై ఆధారపడి ఉన్నత విద్యారంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు, కళాశాలల ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీత భత్యాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 32 విశ్వవిద్యాలయాలుంటే, వాటిలో 15 విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుండి సహాయం పొందే అర్హత లభించ లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే అవి ఆర్థికంగా ఆధారపడి మనుగడ సాగించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరాదరణతో అవఇభివృద్ధికి నోచుకోవడం లేదు. మరొకవైపు యు.జి.సి. సహాయం అందుకొంటున్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలూ నిథుల కొరతతో సంక్షోభంలో కొట్టుమిట్టాడ్డుతున్నాయి.ఇదే తరహాలో దేశవ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాల యాలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఆర్థిక వనరుల లేమితో కునారిల్లిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 44 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 285 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వంద దాకా స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఇవిగాక 107 ప్రయివేటు విశ్వ విద్యాలయాలున్నాయి. 16,000కు పైగా కళాశాలలున్నాయి. విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలోకి అడుగిడుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆ బాధ్యతను గుర్తెరిగి కేంద్ర బడ్జెట్లో నిథుల కేటాయింపు జరపాలి.

No comments:

Post a Comment