Tuesday, December 17, 2013

కరవు పీడితుల‌పై పిడుగు - ట్రిబ్యునల్‌ తీర్పు





కృష్ణా నది మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగించుకొనే స్వేచ్ఛను హరించి వేసి, నిత్య కరవు పీడిత ప్రాంత‌ ప్రజల ఆశలను ఆవిరి చేసిన‌ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు యావత్తు తెలుగు జాతికి అశనిపాతం లాంటిది. తీర్పును ఆమూలాగ్రం పరిశీలిస్తే తెలుగు జాతి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. నికృష్టమైన‌ బ్రిటీష్ వలస పాలన రోజుల్లో సర్ ఆర్థర్ కాటన్ కృషి ఫలితంగా కృష్ణా నదిపై 1852-56 మధ్య‌ కాలంలో విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా కాలువలు మరియు గుంటూరు కాలువ‌కు, కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర పై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టను కట్టి కర్నూలు కడప కాలువకు,  స్వాతంత్య్రం సముపార్జించుకొన్న‌ తొలినాళ్ళలోనే ఆధునిక దేవాలయంగా అభివర్ణించబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవ దశకు 1956లోను ప్రాణప్రతిష్ట‌ చేసుకోక‌పోయి ఉంటే నీటిపారుదల రంగంలో నేడు తెలుగు జాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల పున: పంపిణీ అంశంపై 1960 సెప్టంబరులో జరిగిన  అంతర్రాష్ట్ర మహాసభ సుధీర్ఘంగా చర్చించిన మీదట 1951 కి ముందు నిర్మించబడి నీటిని వినియోగించుకొంటున్న మరియు 1960 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో చట్టబద్దంగా నిర్మాణంలో ఉన్న‌ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి రక్షణ కల్పించాలని ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. నాటి ఆ నిర్ణయమే నేటికీ రక్షణ కవచంగా నిలిచి కృష్ణా నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా లభిస్తున్న 2060 టి.యం.సి.లలో మన రాష్ట్ర వాటాగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టి.యం.సి.లు పరిరక్షించబడ్డాయి.  
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్న‌ నానుడి బాగా ప్రాచుర్యంలో ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు జాతికి శరాఘాతంగా పరిణమించడానికి మూల కారణం మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఘోరవైఫల్యమే. కాంగ్రెస్ పార్టీ , దాని నేతృత్వంలోని యు.పి.ఎ. -II ప్రభుత్వం విభజన రాజకీయాలతో వికృతమైన‌ రాచక్రీడ ఆడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది. సందట్లో సడేమియా అన్నట్లు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలు అందొచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని కృష్ణా జలాల పున: పంపకంలో తాము కోరుకొన్న రీతిలో తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ద‍ం చేసుకొనే ప్రయత్నంలో సఫలమయ్యాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విభజన రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తూ కాలం వెళ్ళబుచ్చి "చేతులు కాలిన తరువాత‌ ఆకులు పట్టుకొన్నట్లు" ట్రిబ్యునల్ తీర్పుపై  గుండెలు బాదుకొంటున్నాయి. గడచిన అర్థదశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయింది. గాడితప్పిన‌ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచి, రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక‌ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీలు సంకుచిత రాజకీయాల ఊబిలో కూరుకపోయాయి. పర్యవసానంగా ప్రజల భవిష్యత్తు గాలిలో దీపంగా కొట్టుమిట్టాడుతున్నది. దుష్పరిణామాలు కమ్ముకొస్తున్నాయి. ఆ కోవలోనిదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్నాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమ ప్రాంతంలోను, తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ మరియు నల్లగొండ జిల్లాలలోనూ, కోస్తా ప్రాంతంలోని ప్రకాశం జిల్లాలో నిర్మించబడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతారాలను లేవదీస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు 2000 మే 31న‌ ట్రిబ్యునల్ గడువు ముగియగానే ఈ సమస్యపై వివాదాన్ని రేపి, ఉడుంపట్టు పట్టి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించి విజయం సాధించాయి. నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న రాష్టం అనివార్యంగా ఎదుర్కొనే కష్ట నష్టాలను పరిగణలోకి తీసుకొన్న బచావత్ ట్రిబ్యునల్  మిగులు జలాల వినియోగానికి సంబంధించి న్యాయబద్దంగా కల్పించిన‌ స్వేచ్ఛను  కాపాడుకోవడంలో మనం చతికిలపడ్డాం. సంక్లిష్టమైన‌, జఠిలమైన అంతర్రాష్ట్ర నదీజలాల సమస్యను కేవలం న్యాయవాదుల సామర్థ్యానికే వదిపెట్టడం వల్ల కొంప మునిగింది. జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది.
నీటి లభ్యతను నిర్ధారించడానికి ట్రిబ్యునల్  ఎంచుకొన్న‌ ప్రామాణికం అసంబద్దమైనది, అశాస్త్రీయమైనది. కర్నాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటాయించడానికే అన్నట్లుగా కొలమానాలను అమలు చేసినట్లు స్పష్టమవుతున్నది. మూడు రాష్ట్రాలలో నిర్మించబడిన జలాశయాలలో స్థూలంగా 1919 టి.యం.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, 1518 టి.యం.సి.ల (మహారాష్ట్ర+కర్నాటక+ ఆంధ్రప్రదేశ్ : 483.24+479.35+555.84=1518.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని , గరిష్టంగా 2313 టి.యం.సి. (మహారాష్ట్రలో 551.65 టి.యం.సి.లు, కర్నాటకలో 695.97 టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్ లో 1065.44 టి.యం.సి.) నీటిని వినియోగించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసి, తదనుగుణంగా 65% విశ్వసనీయత ఆధారంగా 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్ధారించి, పందారం చేసింది. 1518.43 టి.యం.సి.లలో శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాలలో 'క్యారీ ఓవర్' నిల్వకు అనుమతించిన 150 టి.యం.సి.లను మినహాయిస్తే 1368.43 టి.యం.సి. సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ _  వినియోగ‌ నిష్పత్తి 1:1.40 గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. ఇంకా నిర్మాణం పూర్తి కాని పులిచింతల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు తుంగభద్ర జలాశయాల్లో పూడిక‌ వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశ‍ం ఆనకట్ట వద్ద నుండి అనివార్యంగా సముద్రం పాలౌతున్న నీటినీ లెక్కలోకి తీసుకోలేదు.
హేతుబద్దం కాని కొలమానాలు - పంపకాలు: బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుండి 1971-72 వరకు అందుబాటులో ఉన్న78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణలోకి తీసుకొని 75% ప్రామాణికంగా 2060 టి.యం.సి. నికర జలాలు, 70 టి.యం.సి.ల పునరుత్పత్తి నీళ్ళు లభిస్తాయని నిర్ధారించి, ఆ మేరకు మహారాష్ట్రకు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టి.యం.సి.లు, కర్నాటకకు 734(700+34) టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టి.యం.సి.లు కేటాయించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 112 సం.ల నదీ ప్రవాహ గణాంకాలున్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 సంవత్సరాల నదీ  ప్రవాహ గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని 65% విశ్వసనీయత ఆధారంగా నికరజలాలు 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్దారించింది. అలాగే  75% విశ్వసనీయతపై 2173 టి.యం.సి.లు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికరజలాలు 2060+ 70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టి.యం.సి.లకు ఇవి సరిసమానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే! బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికరజలాల కేటాయింపును యదాథదంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293-2130) టి.యం.సి.లను మూడు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారిగా కేటాయించింది.
నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యుదుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం విస్పష్టంగా పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా అభ్యంతారాలను బేఖాతరు చేసి ముంబాయ్ మరియు దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్తు ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టి.యం.సి.లతో పాటు మరో 25 టి.యం.సి.లను, సాగు నీటి ప్రాజెక్టులకు 18 టి.యం.సి. వెరశి మొత్తం 43 టి.యం.సి.లను మహారాష్ట్రకు కేటాయించింది. కర్నాటకకు 65 టి.యం.సి.లను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది.
అక్కడితో ఆగ కుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టి.యం.సి.లుగా నిర్ధారించి, 65% విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టి.యం.సి.లు పోను 285 టి.యం.సి. లు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టి.యం.సి., కర్నాటకకు 105 టి.య‍ం.సి.లను ప్రాజెక్టుల వారిగా కేటాయించడం ద్వారా కేంద్ర జల సంఘం నుండి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పైపెచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది.  ఇది చాలా ప్రమాదకరమైనది. మొత్తంగా మహారాష్ట్రకు  666 (585+43+35+3) టి.యం.సిలు, కర్నాటకకు 911(734+65+105+7) టి.యం.సి.ల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ! మన రాష్ట్రానికి నీళ్ళొచ్చే అవకాశాలు మృగ్యం.
ఆల్మట్టి ఎత్తు పెంపు - మన నెత్తిన కుంపటి: కర్నాటకకు అప్పర్ కృష్ణా ప్రాంతంలో 130 టి.యం.సి. మేరకు కేటాయింపులు పెంచి, వాటిని నిల్వ చేసుకొనే అవకాశం కూడా కల్పించాలని పేర్కొంటూ ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న173 టి.యం.సి. నుండి 303 టి.యం.సి. లకు పెంచుతూ ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసింది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప, నీటిని విడుదల చేయలేదు. 2060 టి.యం.సి.ల నికరజలాలలో మహారాష్ట్రలోని 8,940 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంత‍ం నుండి 962.5(46.72%) టి.యం.సి.,  కర్నాటకలోని 6,113 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 760.9(36.94%) టి.యం.సి., ఆంధ్రప్రదేశ్లోని 1,929 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 336.6(16.34%) టి.యం.సి.లు లభిస్తున్నాయి. అంటే మన రాష్ట్రానికి కేటాయించిన 800 టి.యం.సి. లలో 336.6 టి.యం.సి.లను మినహాయించి మిగిలిన 463.4 టి.యం.సి. లు + మద్రాసుకు త్రాగు నీటి కోసం 10 టి.యం.సి.(మహారాష్ట్ర, కర్నాటక వాటా) + కనీస నదీ ప్రవాహం వెరసి దాదాపు 500 టి.యం.సి.ల నీరు ప్రతి ఏడాది కర్నాటక నుండి మన రాష్ట్రానికి అనివార్యంగా ప్రవహించాలి. కానీ, కర్నాటక రాష్ట్రం నుండి 2002-03 మరియు 2003-04 లో మన రాష్ట్రానికి ఒక్క టి.యం.సి. నీరు కూడా రాలేదు,  2000-01లో 317, 2001-02లో 140, 2004-05 లో 252 టి.యం.సి.లు మాత్రమే వచ్చాయి. మనకు కేటాయించిన నికర జలాలను కూడా పొందలేక పోయాం. నాడు నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా క్రింద కరువు పరిస్ధితులు నెలకొన్న చేదు అనుభవం ఉన్నది. ఇలాంటి స్ధితిలో తాజా తీర్పు వల్ల‌ భవిష్యత్తులో మరింత‌ దుష్పపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.   .                                                                              
వివక్షతకు బలి: మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. రాష్ట్రానికి 65% విశ్వసనీయత పద్దు క్రింద 43 టి.యం.సి. లను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టి.యం.సి.లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచని రాజోలి బండ మళ్ళింపు పథకం కుడి కాలువకు 4 టి.యం.సి.లను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశమేమంటే! 65% విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టి.యం.సి.లను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నపథకాలకు కేటాయించకుండా శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు క్రింద జమ చేసింది.  బచావత్ ట్రిబ్యునల్ 150 టి.యం.సి.ల మిగులు జలాలను క్యారీ ఓవర్  నిమిత్తం నిల్వ చేసుకోవడానికి  అనుమతించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టి.యం.సి.లను మంజూరు చేసి, అందులో 120 టి.యం.సి. లను, వాటికి తోడు 65% విశ్వసనీత ఉన్న30 టి.యం.సి.లను వెరసి 150 టి.యం.సి.లను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో! రావో! తెలియని మిగులు జలాల నుండి 25 టి.యం.సి.లను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది వెనుకబడ్డ రాయలసీమ‌కు దగా చేయడం కాక మరేమౌతుంది? బచావత్ ట్రిబ్యునల్ 811 టి.య‍ం.సి. ల నికరజలాలకు తోడు కృష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూన్, జూలై మాసాల్లోనే నీటిని అందించే నిమిత్తం 150 టి.యం.సి. లను మిగులు జలాల నుండి క్యారీ ఓవర్ పద్దు క్రింద మంజూరు చేస్తే! బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంకెల గారడీతో దగా చేసింది. పేరుకు 1005 టి.యం.సి.లను కేటాయించినట్లు పెర్కొన్నా, వాస్తవానికి 44 టి.యం.సి.లనే అదనంగా కేటాయించింది. అందులో నాలుగు టి.య‍ం.సి.లపై కర్నాటక వివాదాన్ని కొనసాగిస్తున్నది. నియంత్రణ మండలి ఉన్నా పై రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించుకొని నీటిని వినియోగించుకోవడం మొదలైన తరువాత ఇహ 75% లేదా 65% విశ్వసనీయతపై కేటాయించిన‌ నికరజలాలు లేదా మిగులు జలాలన్న విసక్షణ ఉండే అవకాశమే లేదు.
గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ట్రకు 99%, కర్నాటకకు 97% సఫలీకృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 68% ఉన్నదని మొరపెట్టుకొన్నా ట్రిబ్యునల్ చెవికెక్కించుకోక పోగా, 75% విశ్వసనీయత ఆధారంగా కేటాయించిన నీటి వినియోగానికి దరిదాపుల్లో సఫలీకృత నిష్పత్తి ఉన్నదని పేర్కొంటు తృణీకారభావంతో మన రాష్ట్ర వాదనను తిరస్కరించింది.
కరవు ప్రాంతాల మధ్య‌ వివక్షతెందుకు? కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీటర్లు, కర్నాటకలో 52,375 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ లో 45,493 చ.కి.మీ. మేరకు కరవు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డి.పి.ఎ.పి. గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65% విశ్వసనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టి.యం.సి.లు. మరియు మిగులు జలాలు 285 టి.యం.సి.లు, మొత్తం 448 టి.యం.సి.ల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. ఏ మాత్రం కనికరం చూపెట్టలేదు. నదీ పరివాహక ప్రాంత‍ం పరిథిలోకి రాని రాష్ట్రాలకు నీటిని తరలించడంపై పరిమితులు విధించిన ట్రిబ్యునల్, పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను ఒక యూనిట్ గా భావించి నీటిని తరలించడాన్ని చట్టబద్ధమైన చర్యగానే విస్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆచరణలో నీటి కేటాయింపుకు వచ్చేసరికి పరివాహక ప్రాంతంలోని కరవు పీడిత ప్రాంతాలన్న పేరుతో మహారాష్ట్ర , కర్నాటకలకు పొడుగు చేతుల పందారం చేసింది.  పరివాహక ప్రాంతంలోనే ఉన్న మన రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల పట్ల వివక్షత ప్రదర్శించింది.
నదీ ప్రవాహన్ని సజీవంగా ఉంచడం ద్వారా పర్యావరణ, వన్య జంతువుల పరిరక్షణ, సిల్ట్ ను సముద్రం వరకు తీసుకెళ్ళడం కోసం 65% విశ్వసనీయత ఉన్న‌16 టి.యం.సిలను మాత్రమే ట్రిబ్యునల్‌ కేటాయించింది. దీని వల్ల కూడా మన రాష్ట్రానికి తీవ్ర హాని జరుగుతుంది. నదికి ఎగువ భాగంలో ఉన్న‌ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాల్లో ఓండ్రు మట్టి, ఇసుక, ఉప్పు పోగుబడకుండా దిగువనున్న మన రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక పెరిగిపోతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యం భాగా పడిపోయి దాదాపు వంద టి.యం.సి.ల మేరకు నష్టపోతున్నామని నిపుణులు అంచనా. నదీ ప్రవాహానికి ప్రస్తుతం చేసిన 16 టి.యం.సి.లు నామమాత్రమే. వాటిని రెండుమూడింతలు పెంచాల్సిన అవసరముంది. తీర్పును అధికారికంగా ప్రకటించి, కేంద్రం మరియు మూడు రాష్ట్రాల ప్రతినిధులతో '''కృష్ణా నదీ జలాల తీర్పు - అమలు మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ సిఫార్సు చేసింది. ‍తుంగభద్ర బోర్డు రద్దయిపోయి మొత్తం కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబందించిన చేదు అనుభవాలు మనకున్నాయి. ఈ తీర్పే చట్టబద్దమయితే మన రాష్ట్రానికి జరిగే నష్టం వర్ణనాతీతం.                                                                                                        
పిల్లికి చెలగాటం_ఎలుకకు ప్రాణ సంకటం: మరొక వైపున‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన‌ ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జల‌ మండలిని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నేతృత్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. నదీ జలాలు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. అంటే విభజనంటూ జరిగితే నదీ జలాలపై కేంద్ర‍ం పెత్తనం చేస్తుందన్నమాట. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాల అధికారాలను కబ్జా చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. తద్వారా తెలుగు నాట వివిధ ప్రాంతాల‌ మధ్య నెలకొన్నజఠిలమైన‌ నీటి సమస్యపై కోతి మద్దిస్తం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆయుష్సును పెంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మ‌ధ్య కృష్ణా నదీ జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛను కాలరాచి,  రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు -నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి. పథకాల  నిర్మాణాన్ని గుర్తించనిరాకరించి, నీటి కేటాయింపుల్లో మొడి చేయి చూపెట్టి, వాటి భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తెచ్చి కేటాయిస్తుంది? ఎవరిన్ని దగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటక మాడుతున్నది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% విశ్వసనీయతను ప్రామాణికంగా ఎంచుకొని నికరజలాలను నిర్ధారించి, మిగులు జలాలతో సహా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడమే కాకుండా ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల మధ్య తంపులు పెట్టి, నీటి యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నది.

No comments:

Post a Comment