Thursday, April 24, 2014

"ప్రజాస్వామ్యం బలపడుతోందా? "

ఏప్రిల్ 25, 2014  సూర్యా దినపత్రిక

 ఎంపీల వర్గ పొందికలో మార్పులు
ప్రజలకు దూరమవుతున్న పార్లమెంట్‌
సంక్షోభంలో పార్టీలు- కార్యకర్తల సంబంధాలు
ఎన్నికల్లో ధనం, కులం ప్రభావం
కార్యకర్తలకు శూన్య హస్తాలు
కార్పొరేట్లకు, ధనికులకు దాసోహాలు
అనూహ్య స్థాయిలో ఫిరాయింపులు
అన్ని పార్టీల్లో అన్ని పార్టీల ఫిరాయింపుదార్లు
పాలక వ్యవస్థలో నేరస్థులు, అవినీతిపరులు


భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్నది. లోక్‌ సభగా పిలిచే ప్రజల సభ (హౌస్‌ ఆఫ్‌ పీపుల్‌)కు ప్రజా ప్రాతినిథ్య చట్టం- 1951 ప్రకారం ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మొదటి లోక్‌సభకు 1951లో ఎన్నికలు జరిగాయి. నేడు 16వ లోక్‌ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాటికి నేటికి పరిస్థితుల్లో, లోక్‌సభ సభ్యుల వర్గ పొందికలో గుణాత్మకమైన మార్పులు సంభవించాయి. పర్యవసానంగా పార్లమెంటుకు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధం క్రమేపీ బలహీనపడుతున్నదనే అభిప్రాయాలు నెలకొంటున్నాయి. మన ప్రజాస్వామ్య మెరుగైన పని విధానం బహుళ పార్టీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నది. రాజకీయ పార్టీల నిర్మాణంలో కార్యకర్తలే పునాది రాళ్ళు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే రాజకీయ పార్టీల నాయకత్వాలకు, కార్యకర్తలకు మధ్య ఉండవలసిన సంబంధాలు సంక్షోభంలో పడ్డట్లు కనబడుతున్నది. నిత్యం ప్రజా సంబంధాలతో, మంచికి- చెడుకు అందుబాటులోఉన్న కార్యకర్తలను- ఎన్నికలొచ్చేనాటికి రాజకీయపార్టీల అధినాయకత్వం విస్మరించి, ధనం, కులం వగైరా అంశాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొంటోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేశామంటూ బి ఫారం లిచ్చి అభ్యర్థులుగా రంగంలోకి దించుతున్నాయి. అధికారం కోసం పోటీ పడుతున్న ప్రధాన రాజకీయపార్టీలు సీట్లను కార్పొరేట్‌ రంగానికి కట్టబెడుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులు టిక్కెట్లను తన్నుకు పోతున్నారు.

నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొని మంత్రులుగా, ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉంటూ ప్రజల కడగండ్లను పట్టించుకోనివారు రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించి వైకాపా, తెదేపా, తెరాస, భాజపా కండువాలు వేసుకొని అభ్యర్థులుగా దర్శనమిస్తుంటే, ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. ప్రజావ్యతిరేకపాలన సాగించడమే కాకుండా తెలుగు ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కాంగ్రెస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కంకణబద్ధులై ఉన్న ఓటర్లకు ఆ పార్టీనేతలే ప్రత్యర్థిపార్టీల అభ్యర్థులుగా దర్శనమిస్తుంటే జుగుప్సకలుగుతున్నది. ఆయా పార్టీల్లోని ఆశావహులకు గుండెకోత మిగిలింది. రాజకీయ రంగాన్ని మంచి లాభసాటి వ్యాపార రంగంగా భావిస్తున్న స్వార్థపర శక్తులు, నేరస్థులు, దోపిడీదారులు ప్రజా ప్రతినిథులుగా ఎన్నికై చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. దేశ ప్రయోజనాలు, విస్తృత ప్రజాప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని శాసనాలను రూపొందించి, అమలు చేయవలసిన చట్టసభల మౌలిక లక్షణమే గొడ్డలివేటుకు గురవుతున్నది. పార్లమెంటు విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్పుకొంటాం. ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని సంబరపడి పోతున్నాం. ఇవి పాక్షిక సత్యాలు మాత్రమే. పార్లమెంటును ఆధునిక దేవాలయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. కాక పోతే ఆ ఆధునిక దేవాలయంలోకి అడుగుపెట్టే అర్హత పేదవాడికి, సామాన్యుడికి లేకుండా పోయింది.

లోక్‌సభ అభ్యర్థి ఎన్నికలవ్యయం గరిష్ఠంగా రూ.70 లక్షల వరకు ఉండవచ్చని ఎన్నికల సంఘమే నిర్ణయించింది. కుబేరులు నల్లధనంతో ఎన్నికల్లో పోటీ చేస్తూ నిర్దేశించిన ఎన్నికల వ్యయానికిమించి వందలరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నా, అరికట్టగలిగిన స్థితిలో ఎన్నికల సంఘం లేదు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకొంటుంటే తద్భిన్నంగా వ్యవహారం నడుస్తున్నది. ఇక, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు ఆస్కారమెక్కడుంటుంది? జాతి సంపద కొందరికే సొంతమై, ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా అత్యధికులు దారిద్య్రంలో మగ్గిపోతూఉంటే, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు వంటి మౌలికసమస్యలు, విషవలయంగా తయారైన ధరల పెరుగుదల సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తుంటే మనది పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడంలో అర్థముందా? ఈ పూర్వరంగంలో రాజకీయ రంగంలో చోటు చేసుకొంటున్న దుష్పరిణామాలు ప్రజాస్వామ్యవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అవినీతిని తుదముట్టించే వజ్రాయుధంగా జన్‌ లోక్‌ పాల్‌ చట్టాన్ని తీసుకురావాలని పెద్ద ఎత్తున దేశ వ్యాపిత ఆందోళన జరిగినప్పుడు, అన్నాహజారే పార్లమెంటును తక్కువచేసి మాట్లాడారని, ఆదేశిస్తున్నట్లు అహంకారంతో వ్యవహరించారని పలువురు పార్లమెటేరియన్లు సద్విమర్శలు చేశారు.

కానీ 120 కోట్లమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాసనాలను రూపొందించి, అమలు చేయవలసిన పార్లమెంటు జాతి సంపదను కొల్లగొడుతున్న బడా కార్పొరేట్‌ సంస్థల అధిపతుల కనుసన్నల్లో పనిచేసే దుస్థితిలోపడి మన ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. లోక్‌ సభలో ఉన్న మొత్తం 543 స్థానాలకు గాను 2009 ఎన్నికల్లో 315 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారంటే సభ్యుల వర్గ పొందికలో వచ్చిన మార్పును గమనించాలి. ఒక వైపు సంపన్నవర్గాల ప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది, మరొక వైపు శ్రామిక వరాల ప్రాతినిథ్యం కుచించుకు పోతున్నది. కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం, ప్రయోజనాలకోసం పాటుపడే ప్రతినిథులు చట్టసభల్లో అడుగుపెట్టలేక పోతున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. చట్ట సభలు- మిలియనీర్లు, బిలియనీర్లతో నిండిపోతుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో ఇట్టే పసిగట్టవచ్చు.ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొని అక్రమార్జనకు పాల్పడ్డ ధనాడ్యవర్గాలు డబ్బు సంచులతో ఎన్నికల సమరంలోకి దూకాయి. బడా కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యేక ట్రస్టులు నెలకొల్పి వాటిద్వారా విరాళాలను రాజకీయపార్టీలకు ఇచ్చి ఆదాయపు పన్ను మినహాయింపు పొందతున్నాయి. తమకు అనుకూలమైన ఆర్థిక, పారిశ్రామిక విధానాలను అమలు చేసే రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విరాళాలుగా ఇచ్చి వాటిని అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

కార్పొరేట్‌ దిగ్గజాలు మొదలుకొని చోటా మోటా కాంట్రాక్టర్ల వరకు రాజకీయ రంగంపై కన్నేశారంటే ప్రజలకు సేవ చేయడానికి కాదని, అక్రమ సంపాదనను కాపాడుకొంటూ మరింత సంపదను పెంచుకోవడానికే అన్నది సుస్పష్టం. వీరు విమానాలు, హెలికాప్టర్లు, విలాసవంతమైన కార్లు, ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రచార ఆర్భాటాలకు, టివిల్లో, దినపత్రికల్లో అడ్వరై్టజ్‌ మెంట్‌‌స, పెయిడ్‌ న్యూస్‌ నిమిత్తం విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు. తమకు మద్దతుపలికే రాజకీయ దళారులకు పెద్ద మొత్తాలను ముట్టజెబుతున్నారు. అంతిమంగా డిమాండ్‌ను బట్టి ఓటుకు విలువ కట్టి సంతలో సరుకు కొన్నట్లు ఓటర్లను ధన బలంతో ప్రలోబపెట్టి కొనేస్తున్నారు. ఎక్కడ చూసినా డబ్బు మాటే వినిపిస్తున్నది. కోట్లు వెచ్చించే శక్తి లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం వృథా ప్రయాసేననే భావన సర్వత్రా వ్యాపించింది. దీన్ని బట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉందో బోధపడుతుంది.అవినీతి చెదలను తుదముట్టించడానికి శక్తిమంతమైన లోక్‌పాల్‌ చట్టాన్ని రూపొందించాలని దేశవ్యాపిత ప్రజాందోళన జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన బలమైన చట్టం కాక పోయినా లోక్‌పాల్‌ చట్టం వచ్చింది. అవినీతికి మూలం రాజకీయ అవినీతి. రాజకీయాలను వ్యాపారమయం చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నవారి కార్యకలాపాలను నిరోధించకుండా ఈ పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని సైతం పరిరక్షించుకోవడం అసాధ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. ఐదేళ్ళకొకసారి ఎన్నికలను నిర్వహించుకోవడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి కొలమానం కాదు. స్వాతంత్య్ర ఫలాలు జన బాహుళ్యానికి అందాలి.

స్థూల జాతీయోత్ఫత్తి (జిడిపి) పెరుగుదలపై పాలకులు, ఆర్థికవేత్తలు గంభీరోపన్యాసాలు చేస్తుంటారు. జాతిసంపద వృద్ధిలో భాగస్వాములైన శ్రామిక ప్రజానీకానికి దక్కుతున్న వాటాఎంత? మానవాభివృద్ధి సూచికల ప్రకారం వారి జీవన ప్రమాణాలు ఏస్థాయిలో ఉన్నాయి? వారి కొనుగోలు శక్తి, ఆహార, ఆరోగ్య, పని భద్రతలు, నివాసం, వారి పిల్లల చదువు సంధ్యలు, ఉపాథి అవకాశాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నవే ప్రజాస్వామ్య వ్యవస్థ నాణ్యతను నిర్ధారిస్తాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పొడుగు చేతుల పందారంగా మారిపోయాయి. అవినీతిని అందలం ఎక్కించాయి. క్విడ్‌ ప్రోకో (నీకు అది, నాకు ఇది) అన్న ఒప్పందాలతో జాతిసంపదను కొల్లగొట్టుతున్నారు. విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్‌ సంస్థలు, గుత్త పెట్టుబడిదారులు, పారిశ్రామికా దిపతులు, కాంట్రాక్టర్లు, టోకు వ్యాపారులు, దళారులు ఒక వర్గంగా అధికారంలో ఉన్న రాజకీయ నేతలతో, ఉన్నతశ్రేణి అధికారులతో కూడబలుక్కొని దేశాన్ని దోచేస్తున్నారు. ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థగా పిలుస్తున్న ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం బలిపశువుగా మారిపోయింది. నూటికి తొంబై మంది ప్రజానీకం సమస్యల కుంపటిలోకి ఉన్నారు. ఎన్నికల జాతరలలో మాత్రం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అరచేతిలో స్వర్గం చూపెడుతూ, మతిపోయే వాగ్దానాలతో మభ్యపెడుతున్నారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.

జంటగా మతం- పెట్టుబడి:
రాజకీయ అధికారం కోసం భాజపా 1980వ దశకంలో రాముణ్ణి ఆశ్రయించింది. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించడం ద్వారా లబ్ధి పొందింది. ఏడేళ్ళు అధికారాన్ని వెలగబెట్టి, దేశం వెలిగిపోతున్నదనే భ్రమల్లో జనాన్ని ముంచాలని ప్రయత్నించి తనే నిండామునిగిపోయింది. ఇప్పుడు మతానికి, కార్పొరేట్‌ పెట్టుబడికి విడదీయలేని బంధాన్ని నెలకొల్పి తద్వారా రాజ్యాధికారానికి ఎగబాకాలని కాషాయ దళం ఉబలాట పడుతున్నది. కార్పొరేట్‌ పెట్టుబడి లక్ష్యం అత్యధిక లాభార్జనే.

కాషాయ దళం లక్ష్యం- రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని హిందుత్వ భావజాలానికి కార్యరూపం ఇవ్వడం.
మన దేశంలో హిందూ మతంలో అంతర్భాగమైన కుల వ్యవస్థ సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీకి బలమైన పునాదులు వేసింది. ఈ ఎన్నికల్లో మతం, కార్పొరేట్‌ పెట్టుబడి కలిసి ఉమ్మడి లక్ష్యమైన రాజకీయఅధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏక పార్టీ పాలనకు నూకలు చెల్లిపోయాయి కాబట్టి భాజపా ప్రధానిఅభ్యరి నరేంద్ర మోడీని డిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కార్పొరేట్‌ దిగ్గాజాలు నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తున్నది. భాజపా అభ్యర్థుల ఎంపికలో ఆర్‌యస్‌యస్‌ పాత్ర విస్పష్టంగానే వెల్లడవుతున్నది. ప్రధానిఅభ్యర్థి ఎవరో, పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు పోటీచేయాలో నిర్ణయించేది ఆ అదృశ్యశక్తే. ఇంత కాలం మన్మోహన్‌ ప్రభుత్వాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో నడిపినది సోనియా గాంధీనే అన్నది లోకవిదితం. ఆమెను కూడా వెనక ఉండి నడిపినది నయా ఉదారవాద ఆర్థిక విధానాల లబ్ధిదారులైన జాతీయ, అంతర్జాతీయ ముఠా అన్నది కూడా అంతే నిజం. అలాగే రేపు మోడీ వెనకాల ఉండి రిమోట్‌ కంట్రోల్‌ చేసేది ఆర్‌యస్‌యస్‌, బడా కార్పొరేట్‌ దిగ్గజాలతోకూడిన ముఠానే అన్నవిషయాన్ని కూడా దేశ ప్రజలు గమనంలో ఉంచుకోవాలి.

దేశ ఆర్థిక వ్యవస్థ పట్టు సాధించుకొన్న కార్పొరేట్‌ సంపన్నవర్గం రాజకీయ రంగాన్ని శాసించే స్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో పెట్టాలి అన్న అంశంపై బడా కార్పొరేట్‌ సంస్థల అధినేతలు మునుపెన్నడూ చూపనంత కేంద్రీకరణను నేటి ఎన్నికలపై చూపుతున్నారు. 2004, 2009 ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు మౌలికమైన తేడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. ఈ ఎన్నికలు, ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాలకు- నిజమైన సంక్షేమ రాజ్యాన్ని కోరుకొంటున్న జన బాహుళ్యానికి మధ్య జరుగుతున్నాయని భావించాలి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొన్న అక్రమ సంపాదనాపరులనే ప్రధాన రాజకీయపార్టీలు తమ అభ్యర్థులుగా రంగంలోకి దించాయి. మిలియనీర్లు, బిలియనీర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడ్డారు. విస్తుపోయే సంఘటనలు తెలుగు నాట ఆవి „ష్కృతమైనాయి.ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు రాజ్యాధికారంలో వివిధ వర్గాల బలా బలాల పొందికలో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టానికి నిర్వచనమే మారిపోయింది. అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాలు బలపడుతున్నాయి. ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కొన్ని ఉప ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచిపోషించడమే పనిగా పెట్టుకొన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ, బహుళజాతి సంస్థలు, దేశీయ బడా కార్పొరేట్‌ సంస్థల దళారులు ప్రభుత్వంలో విధాననిర్ణయాలు చేసే స్థానాలను ఆక్రమిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఎవరుంటే బాగుంటుందో అన్న అంశపై అప్పుడే బహిరంగంగానే చర్చించకు తెరలేపారు. నేటి ఎన్నికల తీరుతెన్నులను పరిశీలిస్తుంటే భారత ప్రజా స్వామ్యవ్యవస్థ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అనిపిస్తున్నది.

No comments:

Post a Comment