Tuesday, July 22, 2014

సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర?

గమనిక: "సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర?" శీర్షికతో జూలై 23, 2014  సూర్య దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం మొదటి భాగం.

రాజధాని లేని రాషా్టన్రికి రంగుల కల
నిర్మాణానికి విరాళాలకోసం పిలుపు
సమస్యల కుంపటిపై వాగ్దానాల వర్షం
గుదిబండలైన ఎన్నికల హామీలు
కలిసిరాని ఆర్థిక పరిస్థితులు
అసమగ్రంగా ఆర్ధిక శ్వేతపత్రం
వెనుకబడిన ప్రాంతాలపై లేని దృష్టి
వమ్మవుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఆశలు
బడ్జెట్లలో కనిపించని ప్రత్యేక ప్యాకేజీలు


విశాలాంధ్రలో ప్రజారాజ్యం కల చెదిరిపోయింది. తెలుగు జాతి ఐక్యత విచ్ఛిన్నమైంది. రెండు రాషా్టల్రు ఏర్పడ్డాయి. విడిపోయి ఇరుగు పొరుగుగా కలిసిమెలిసి సహజీవనం చేస్తూ, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ప్రగతి సాధించవచ్చని కొందరు చేసిన హితబోధలు గాలి మాటలని తేలిపోయాయి. మకుటం లేని మహారాజులా, రాజథాని లేని రాషా్టన్రికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు సమస్యల కుంపటిపై కూర్చొని స్వర్ణాంధ్రప్రదేశ్‌ ను నిర్మిస్తానని వాగ్దానాల పరంపర కొనసాగిస్తున్నారు. తాను చేసిన అపరిమితమైన ఎన్నికల వాగ్దానాల అమలుపై కసరత్తులు చేస్తున్నారు. వెనకడుగు వేస్తే- ప్రజల ఛీత్కారానికి గురికావలసి వస్తుందన్న భయం వెంటాడుతున్నది. హామీలను అమలు చేద్దామంటే పదుల వేల కోట్ల రూపాయలు కావాలి. మాటలు ఘనంగా వినిపిస్తున్నారే కానీ ఆర్థిక వనరుల లేమితో ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ను రెండు ముక్కలు చేసి 1956 నవంబరు 1వ తేదీకి పూర్వం ఉన్న ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులనే (రమారమి) ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం పునర్వవస్థీకరణ చట్టం చేసింది. విభజనతో ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న ఆంధ్రప్రదేశ్‌ కు అన్ని విధాల అండగా నిలుస్తామని పార్లమెంటు వేదికగా కొన్ని నిర్దిష్ఠమైన వాగ్దానాలు చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అధికారాన్ని కోల్పోయారు. ఆయన పార్టీ ప్రతిపక్షస్థానానికి చేరుకుంది. రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారాన్ని అందించిన బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మక్షోభను అర్థం చేసుకొన్న నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాటి ఎన్నికల ప్రచారసభల్లో ఘనమైన వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం, టిడిపి భాగస్వామిగా ఉన్న యన్‌.డి.ఎ. కూటమి కేంద్రంలో అధికారం లోకి రావడం- కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఒడ్డున చేర్చడానికి దోహదపడే సానుకూలాంశాలుగా ప్రజలు భావిస్తున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ స్థితిగతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగాల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేస్తూ సమస్యల తీవ్రతను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని ఆర్థిక పరిస్థితులపై విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం అసమగ్రంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్న మూడు ప్రాంతాలమధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అన్ని వేళలా గమనంలో ఉంచుకోవాలి. ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 4,75,859 కోట్లు, తలసరి ఆదాయం రూ. 85,797 ఉన్నదని పేర్కొన్నారు. అలాగే పదమూడు జిల్లాల తలసరి ఆదాయాలను కూడా వెల్లడించి ఉంటే సముచితంగా ఉండేది.

అందుబాటులో ఉన్న ప్రణాళికా సంఘం గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత ధరల సూచిక ఆధారంగా జిల్లాల వారిగా తలసరి ఆదాయాలు ఇలా ఉన్నాయి- (1) విశాఖపట్నం రూ. 1,09,800 (2) కృష్ణా రూ. 89,398 (3) ప్రకాశం రూ. 81,516 (4) గుంటూరు రూ. 78,762 (5) నెల్లూరు రూ.78,537 (6) పశ్చిమ గోదావరి రూ. 78,345 (7) తూర్పు గోదావరి రూ. 75,977 (8) అనంతపురం రూ. 75,463 (9) కడప రూ. 66,015 (10) చిత్తూరు రూ. 64,816 (11) విజయనగరం రూ. 60,178 (12) కర్నూలు రూ. 57,311 (13) శ్రీకాకుళం రూ. 52,701. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఏకైక మహానగరం విశాఖపట్నం. తలసరి ఆదాయంలో ఆ జిల్లా రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచింది. తాజా ప్రతిపాదనలతో విశాఖ పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, విద్య, పర్యాటక రంగాలలో మరింతవేగంగా అభివృద్ధిచెందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాంధ్రకు విశాఖపట్నం ఆశా కిరణంగా కనిపిస్తున్నది. రాయలసీమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అలాంటి నగరం లేదు. కరవుసీమగా గణతికెక్కిన రాయలసీమ రాష్ట్ర విభజనతో అంధకారంలోకి జారుకుంది. ఈ ప్రాంతానికి వ్యవసాయమే జీవనాధారం. సాగుకే కాదు, మంచి నీటికీ ప్రజలు కటకట లాడుతున్నారు. వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందిన మధ్య- దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్నది. శ్వేతపత్రంలో ఈ అంశాల ప్రస్తావన లేకపోవడంతో లోపభూయిష్టంగా ఉన్నది. ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించే సందర్భంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక కేంద్రీకరణతో అంకితభావంతో కృషి చేయాలి.

ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతున్న అంశాలు:
రాష్ట్ర ఆదాయ- వ్యయాలను పరిశీలిస్తే నిరాశాజనకమైన పరిస్థితి గోచరిస్తున్నది. సొంత పన్నుల ద్వారా సమకూరే రాష్ట్ర ఆదాయం రూ. 32,164 కోట్లు, పన్నేతర ఆదాయంరూ. 8,836 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వాటా రూ. 29,001 కోట్లు, మొత్తం రాబడి రూ. 70,001 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన పది నెలల ప్రణాళికేతర వ్యయం రూ. 68,444 కోట్లు, ప్రణాళికా వ్యయం అంచనా రూ. 5,791 కోట్లు. రాష్ట్ర విభజనానంతరం జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన రుణ భారం రూ. 92,461 కోట్లు(ప్రభుత్వఖాతా మినహా). ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా సమీకరించుకోబోయే అప్పు పద్దు క్రింద ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో ప్రస్తావించిన మొత్తం రూ. 12,195 కోట్లు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కు మొదటి సంవత్సరం బడ్జెట్‌ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. లోటు రూ. 15,000 కోట్లు ఉంటుందని రాష్ట్ర గవర్నర్‌ అపాయింటెడ్‌ తేదీ కంటే ముందే నివేదిక పంపారు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ద్వారా రూ. 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ద్రవ్య బాధ్యత- బడ్జెట్‌ నియంత్రణా చట్టం- 2003 (ఎఫ్‌.ఆర్‌.బి.యం.) నిబంధనలను సడలించి అధికంగా రుణాలను సేకరించుకోవడానికి వీలుకల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినా బడ్జెట్‌లో కేవలం రూ. 1128 కోట్లు విదిలించి మోడీ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. రాషా్టన్రికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామని, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అమలు చేస్తామని చేసిన వాగ్దానాల ప్రస్తావన కూడా బడ్జెట్‌ ప్రసంగంలో లేదు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పెద్ద ఎత్తున అందుతాయని రాష్ట్ర ప్రజలు పెట్టుకొన్నఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. బడ్జెట్‌ కేటాయింపులను పునఃపరిశీలించి, చేసిన వాగ్దానాలకు అనుగుణంగా నిథుల కేటాయింపును పెంచకపోతే రాష్ట్రం అధోగతి పాలౌతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం మొదటి సహాయ చర్యగా కేంద్రం నుండి తీసుకొన్న రుణాలలో రాష్ట్ర వాటాగా వచ్చిన దాదాపు రూ.12,000 కోట్లను మాఫీ చేస్తే, ఆ మేరకు కాస్త ఊరట కలుగుతుంది. లేదా మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం అధ్వాన్నస్థితిలోకి నెట్టివేసిందని, గాడిలో పెట్టడానికి కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాన మంత్రి మోడీ విస్పష్టంగా ప్రకటించిన తరువాత, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుందో అన్న అనుమానాలు మొగ్గతొడిగాయి. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాషా్టన్న్రి ఏ విధంగా గట్టెక్కిస్తుందన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజానీకాన్ని వేధిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పుకోవాలో తేల్చుకోవడానికి జరుగుతున్న కసరత్తు ఎప్పటికి ఒక కొలిక్కివస్తుందో తెలియని పరిస్థితి. అన్ని హంగులతో కూడిన రాజథాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తుందని రాష్ట్ర విభజన సందర్భంలోనే చంద్రబాబు పేర్కొన్నారు. రాజథాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నది. మరొకవైపు గోరుచుట్టపై రోకటిపోటన్న నానుడిగా ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సుల నివేదిక ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం- ఉద్యోగులతో నూతన వేతన ఒప్పందం చేసుకొన్న మరుక్షణం నుండే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ, వ్యయాల అంచనాలో మిగులు రాబడి ఉన్న తెలంగాణతో సరిసమానంగా వేతన సవరణ ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు సహజంగానే పట్టుబడతారు. అప్పు చేసి పప్పు కూడు తిందామన్నా ద్రవ్య బాధ్యత- బడ్జెట్‌ నియంత్రణా చట్టం- 2003(ఎఫ్‌.ఆర్‌.బి.యం.) అనుమతించదు.
రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇమ్మని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆర్థికంగా ఎంతటి హీనస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉన్నదో ఈ చర్యద్వారా స్పష్టమవుతున్నది. ఈ పూర్వ రంగంలో ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలపై దృష్టిసారించి, ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని, రాష్ట్ర పునర్నిర్మాణానికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు ఉపకరించే ప్రణాళికల అమలుతో త్వరితగతిన ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించాలి. అస్థవ్యస్థంగా తయారై ఉన్న పాలనా యంత్రాంగాన్ని ముందు గాడిలో పెట్టాలి. అవినీతిని అరికట్టి పన్ను, పన్నేతర వనరుల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేరవలసిన రాబడిని 100% రాబట్టుకోవాలి.

ఉద్యోగులు అవినీతిరహిత పాలనలో భాగస్వాములై- కష్టనష్టాలో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం అమలు చేసే ప్రతి చర్యా జవాబుదారీతనంతో నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ఒక ముందడుగుగా ఉండాలి. దుబారా ఖర్చులకు స్వస్తి చెప్పాలి. ఆర్థిక క్రమశిక్షణ- మంత్రులు, ఉన్నతాధికారుల నుండి మొదలుకొని క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు పాటించడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలను అమలు చేయడానికి పూనుకొంటే చట్టసభల్లో ఉన్న బాధ్యత కలిగిన ప్రతిపక్షం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిచాలి. ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా, హేతుబద్ధమైన ఆలోచనలు చేయాలి. ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోయే ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధి పథకాలేవైనా వికేంద్రీకరణ దృష్టితో రూపొందించి, అమలు చేయడం మాత్రమే అన్ని ప్రాంతాలలో సమతుల్యమైన సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. లేనిపక్షంలో ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగిపోతాయి. పర్యవసానంగా మరొక విచ్ఛిన్నకర ఉద్యమానికి ఇప్పుడే బీజాలు నాటినట్లవుతుంది.
హైదరాబాదు మహానగరాన్ని తలదన్నే విధంగా రాష్ట్ర రాజధానీ నగర నిర్మాణాన్ని చేపడతాం, సింగపూర్‌ లాంటి నగరాన్ని నిర్మిస్తాం- లాంటి అతిశయోక్తితో కూడిన మాటలు ప్రజలను భ్రమల్లో తేలిపోయేలా చేయడానికే ఉపయోగ్పడతాయి తప్ప, వాస్తవాల ప్రాతిపదికపై ఆలోచనలను రేకెత్తించవు. మాటల కంటే ఆచరణ ముఖ్యం.

సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించి పేదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకాన్ని సామాజిక బాధ్యతగా ఆదుకొంటూ, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం ఎలా కల్పిస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఉపాథి కల్పనా సామర్ధా్యన్ని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడే కార్యాచరణ తక్షణావసరం. సంక్షేమ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక భద్రత, ఆహార భద్రత కల్పించడం కోసం అమలు చేస్తున్న సబ్సీడీపై బియ్యం- వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్సన్లు, అర్హులైన విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకారవేతనాల చెల్లింపు వగైరా సంక్షేమ పథకాల అమలు భారం మోయక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఆదుకొనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం, బలహీన వర్గాలకు చెందిన గృహ వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ రాయితీ తదితర ఆర్థిక భారాలు ఉండనే ఉన్నాయి. కరవు కోరల్లో చిక్కిశల్యమతున్నరాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా సాగునీటి, మంచినీటి అవసరాలు తీర్చే సదుద్దేశంతో కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మింస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర యొక్క సొంత ఆర్థిక వనరుల నుండే వెచ్చించాలి. నికర జలాల ఆధారంగా, కేంద్ర జలసంఘం అనుమతితో నిర్మిస్తున్న ప్రాజెక్టులు కాదు కాబట్టి వీటి నిర్మాణానికి ఆర్థిక సంస్థల నుండి అప్పు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి ఆమోదముద్ర వేయడం శుభ పరిణామం. ఆ మేరకు రాషా్టన్రికి ఆర్థిక వెసులుబాటు లభించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో నిథుల కేటాయింపు నామమాత్రంగా ఉండడతోర నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అన్నఅనుమానం రావడం సహజం. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాషా్టల్ర మధ్య తలెత్తే వివాదాల పరిష్కార నిమిత్తం నెలకొల్పుతున్న నిర్వాహణ బోర్డులకయ్యే ఖర్చులను ఉభయ రాషా్టల్రే భరించాలి. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనులకు రూ. 4,573 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం దాని వ్యయం రూ. 6,000 కోట్లకు పెరిగింది. మౌలిక సదుపాయాలలో విద్యుత్‌ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా రుణ భారాన్ని జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం, విద్యుత్తును మాత్రం గడచిన ఐదేళ్ళ వియోగం సగటును లెక్కించి ఆ ప్రాతిపదికన పంపిణీ చేసింది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ సమీప భవిష్యత్తులోనే విద్యుత్‌ కొరతను పెద్ద ఎత్తున ఎదుర్కోబోతున్నది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment