Thursday, July 17, 2014

సమ దృష్టే రాయలసీమకు రక్ష‌


[విజ్ఞప్తి: "సమ దృష్టే రాయలసీమకు రక్ష" అన్న శీర్షికతో జూన్ 16, 2014 వ తేదీన నా వ్యాసం సాక్షి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురించబడింది. దాన్ని మరింత కుదించి హైదరాబాదు ఎడిషన్ లో ప్రచురించారు. ఈ అంశంపై ఆసక్తి ఉన్న మిత్రుల సౌకర్యార్థం నేను వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా నా బ్లాగ్ లో పెడుతున్నాను. చదివి మీ స్పందన తెలియజేయగలరని ఆశిస్తున్నాను.]

సుదీర్ఘ‌ పోరాటాలు, అపారమైన‌ త్యాగాల తదనంతరం సముపార్జించుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుటిల రాజకీయాలకు బలైపోయింది. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి, కలహాల కుంపటి రగిల్చారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్ట సుఖాలలో కలిసి మెలిసి జీవిస్తూ హైదరాబాదు రాజథానీ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుకొన్న తదనంతరం అభివృద్ధి ఫలాలను అనుభవించే అర్హత మీకులేదని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల తలరాతను మార్చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కర్నూలు పట్టణాన్ని రాజథానిగా ఎంపిక చేసుకొన్న మీదటనే 1953 అక్టోబరు 1వ తేదీన ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్బిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసి హైదరాబాదు మహానగరాన్ని అప్పజెప్పి, మిగిలిన‌ పదమూడు జిల్లాలతో కూడిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్నిపునర్యవస్థీకరించారు. ఒకనాటి ఆంధ్ర రాష్ట్రమే స్థూలంగా నేటి ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని నాటి యు.పి.ఎ. ప్రభుత్వ నిరంకుశత్వం మూలంగా రాష్ట్ర‌ ప్రజలు త్రిశంక స్వర్గంలోకి నెట్టివేయబడ్డారు. రాజథాని ఎక్కడో! నిర్దారించకుండానే వీథుల పాలుచేశారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ అన్నఅంశంపై అనిశ్చితి కొనసాగుతుండడంతో ప్రజలు జుట్లు పట్టుకొని తన్నుకొనే పరిస్థితులను కల్పించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకపోగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే అభాసుపాలుచేసి, నిరంకుశంగా రాష్ట్రాన్ని చేల్చివేశారు. రాష్ట్ర రాజథాని  అంశంపై కూడా అదే తరహా డ్రామాను రక్తికట్టించే దోరణిలోనే తతంగం నడుస్తున్నదనిపిస్తున్నది.
పరిణతే ప్రథమ సోపానం కావాలి: అడ్డగోలు విభజనకు సంపూర్ణ సహాయ సహకారాలను అందించిన బిజెపి నేడు కేంద్రంలో గద్దెనెక్కింది. రాజథాని ఎంపికలో మేం జోక్యం చేసుకోమని, రాష్ట్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని చిలక పలుకులు పలుకుతున్నది. మరొకవైపు కేంద్రమే శివరామక్రిష్ణ కమిటీని నియమించి అభిప్రాయ సేకరణ, అనువైన కేంద్రం కోసం అధ్యయనం చేయిస్తున్నది. ఆగస్టు ఆఖరు నాటికి నివేదికను సమర్పిస్తామని ఆ కమిటీ సభ్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, 'పవర్ కారిడార్స్'లో చక్కర్లు కొట్టే దళారులు అనధికారిక వార్తలను ప్రచారంలో పెడుతూ గుంటూరు, కృష్ణా జిల్లాలలో భూముల ధరలు ఆకాశం వైపు పరుగులు తీసేలా అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారు.
రాష్ట్ర రాజథాని ఎంపికలో ముఖ్యంగా రాజకీయ నాయకత్వం పరిణతితో వ్యవహరించాలి. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని, చేదు అనుభవాలు పునరావృతం కానిరీతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య మరియు దక్షిణ కోస్తాంధ్ర‌ ప్రాంతాల ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఏకభిప్రాయ సాధన ద్వారా శ్రేష్టమైన నిర్ణయాన్నితీసుకోవాలి. భవిష్యత్ తరాల జీవితాలతో ముడిపడి ఉన్న జఠిలమైన ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర‌ ప్రభుత్వాలు అత్యంత బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిన‌ కాంగ్రెస్ అనుసరించిన అప్రజాస్వామికమైన, నియంతృత్వ పోకడలను బిజెపి నాయకత్వంలోని యన్.డి.ఎ. కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాజధాని అంశంపై ఏకపక్షంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. 
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన‌ 1953 నాటికి, నేటికీ రాజకీయ రంగంలో పెనుమార్పులు సంబవించాయి. తెలుగు జాతిని ముక్కలు చేసిన పాపానికి కా౦గ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోయింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా, తెలుగునాట బలమైన శక్తిగా ఉండిన కమ్యూనిస్టులు నేడు ప్రభావశీలురుగా లేరు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెసుకు, కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యమే లేని దుస్థితి నెలకొన్నది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యంలోకి వచ్చాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల‌ ప్రజలందరి జీవితాలని ప్రభావితం చేసే రాజధాని నిర్మాణానికి అనువైన‌ స్థలం ఎంపిక విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీల, సంస్థల, వివిధ ప్రాంతాల, వర్గాల‌ ప్రజల మధ్య‌ ఏకాభిప్రాయ సాధనకు అధికారంలో ఉన్నవారు అంకితభావంతో కృషి చేయాలి. రాజకీయ విజ్ఞతతో ఈ సమస్యపై బహుముఖ కోణాలలో పరిశీలన చేసిన మీదటనే నిర్ణయం తీసుకోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఊహాగానాలకు, పుకార్లకు ఆస్కారం ఇస్తే దుష్పరిణామాలకు ఆజ్యం పోసినట్లవుతుంది. అనధికారిక‍ వార్తలను ప్రచారంలో పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేయడం శ్రేయస్కరం కాదు. భూమి లావాదేవిలు జూదంగా పరిణమించి, కృత్రిమంగా ధరలను పెంచి, అంత్యమంగా అత్యధికులు దివాలాతీసే పరిస్థితులు కల్పించబడుతున్నాయి. పేద రైతులను భూముల నుండి దూరం చేసే పరిస్థితులు, నిరుపేదలకు గుడిసేసుకోవడానికి కూడా స్థలం దొరకని దుస్థితి, మధ్యతరగతి ప్రజానీకం అందుకోలేనంత ఎత్తులో ధరలు ఉన్న ప్రాంతంలో రాజథాని నిర్మాణం జరిగితే సామాన్యుల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనలవికాదు. గుంటూరు_ విజయవాడల మధ్య రాజథాని ఉంటుందన్న వార్తలు బయటికి పొక్కడంతో హైదరాబాదులో స్థిరాస్థి మరియు భవన నిర్మాణ రంగంలోవ్యాపారస్తులుగా స్థిరపడిన కోస్తాంధ్ర కొందరు భూములు కొనడానికని ప్రయత్నించి ధరలు చూసి పారిపోయివచ్చారు. ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం దుర్లభమనే ఆలోచనలోపడ్డారు. వాణిజ్య, పారిశ్రామిక, విద్యా సంస్థలు, గృహ సముదాయాలు వగైరా అవసరాల వినియోగార్థం సస్యశ్యామలమైన‌ పంట పొలాలు వాణిజ్య భూములుగా రూపాంతరం చెంది ఫ్లాట్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. తద్వారా ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదమూ లేకపోలేదు. రాష్ట్ర‌ విభజన మూలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి బలవంతంగా నెట్టివేయబడిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజానీకాన్నిమరిన్నికష్టనష్టాల ఊబిలోకి నెట్టినట్లవుతుంది. రాజధాని ఎంపిక, నిర్మాణం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన విషయాలలోనైనా స్వార్థపూరితమైన రాజకీయాలకు, ప్రాంతీయతత్వానికి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించాలి లేదా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం గుర్తుంచుకోవాలి. 
ప్రజాస్వామ్య ప్రక్రియకు దర్పణం: దక్షిణ భారత దేశానికే మకుటాయమానంగా అభివృద్ధి చెందిన‌ మద్రాసు నగరాన్ని వదులుకోవడం నష్టదాయకమైనా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి సాధించుకొన్నారు కాబట్టి పెద్దగా బాధపడలేదు. మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఉద్యమ కాలంలో కొందరు కోరినా అది ఫలించలేదు. నాటి ప్రధాని నెహ్రూ 1953 మార్చి 25న ఒక ప్రకటన చేస్తూ, 1953 అక్టోబరు 1న నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడుతుందని, ఉమ్మడి రాజధానిగా మద్రాసును కొనసాగించే ప్రసక్తే లేదనీ, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ రాజధానిని ఎర్పాటు చేయాలన్న అంశాన్నిఆంధ్ర శాసన సభ్యులే నిర్ణయించుకోవాలని విస్పష్టమైన ప్రకటన‌ చేశారు. అలాగే రాష్ట్ర ఏర్పాటులో తలెత్తే సమస్యలను కూలంకషంగా పరిశీలించేందుకు న్యాయమూర్తి కె.ఎన్. వాంఛూను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజధాని ఎంపిక విషయంలో నాడున్ననాలుగు ప్రధానమైన‌ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కరవైయ్యింది. కాంగ్రెస్ పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ తాత్కాలికంగా మద్రాసునే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరినా నెహ్రూ నిర్ద్వంధంగా తిరస్కరించడంతో  'రాజధాని ఎక్కడ' అన్నసమస్య జఠిలంగా పరిణమించింది. ఆంధ్ర ప్రాంతంలో ఉండాలని, విజయవాడ దానికి అనువైన పట్టణమని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. కృషికార్ లోక్ పార్టీ తిరుపతి పట్టణం అనుకూలంగా ఉంటుందని సూచించింది. అప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలనే నిర్ధారణకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని ఆంధ్ర శాసన సభ్యులు 1953 జూన్ 5న ప్రత్యేకంగా సమావేశమై, అయిదు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించిన మీదట‌ రాజధాని ఎక్కడన్న వియషయంలో వెనుకబడిన‌ రాయలసీమవాసుల అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వాలన్న నిశ్చయానికి వచ్చారు. పర్యవసానంగా కర్నూలు పట్టణాన్ని తాత్కాలిక రాజధానిగా ఉండాలన్న‌తీర్మానం ఆమోదించబడింది. అలాగే హైకోర్టును గుంటూరులో నెలకొల్పాలడానికి అంగీకారం కుదిరింది.
ఈ తతంగం వెనకాల సంకుచిత‌ రాజకీయాలు లేవని భావిస్తే పప్పులో కాలేసినట్లే. కొస్తా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా ఉండడం, ప్రత్యేకించి విజయవాడ‌ కమ్యూనిస్టులకు ఉద్యమ కేంద్రం కావడంతో రాష్ట్ర రాజధానిని అక్కడ‌ నెలకొల్పడానికి నాడు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో  తెలుగు నాట ఉన్న‌140 స్థానాలకుగాను 41 స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ గెలుపొందింది. వాటిలో నాల్గింట మూడొంతులు (31) నాలుగు డెల్టా జిల్లాలలైన‌ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలోని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో గెలిచి ద్వితీయ స్థానంలో నిలిచింది. మధ్య కోస్తాంధ్రలో కేవలం 11 స్థానాలనే సాధించుకొన్నది. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన‌ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ(కె.యం.పి.పి.)ని స్థాపించి 20 స్థానాల్లో గెలుపొందారు. యన్.జి.రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీ 15 స్థానాల్లో గెలిచింది. సోషలిస్టులు ఆరు స్థానాల్లో గెలిచారు. నెల్లూరుతో కూడిన రాయలసీమ జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో గెలిచి పట్టు నిలబెట్టుకొన్నది. ఈ గణాంకాలను బట్టి పరిశీలిస్తే కోస్తాంధ్రలో కమ్యూనిస్టులు, రాయలసీమలో కాంగ్రెస్ బలంగా ఉన్న సంగతి స్పష్టమవుతుంది. ఆ రాజకీయ‌ కారణంగానే విజయవాడను రాజధానిగా నాడు కాంగ్రెస్ అంగీకరించలేదన్నది చారిత్రక సత్యం. పైపెచ్చు విజయవాడను రాజథానిగా ప్రతిపాదించినందులకు కమ్యూనిస్టులపై దుష్ప్రచారానికి కూడా పాల్పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ వాతావరణం కొనసాగింది. వామపక్ష విద్యార్థి సంఘం అయిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎ.ఐ.యస్.ఎఫ్.) రాష్ట్ర మహాసభను కర్నూలు పట్టణంలో నిర్వహిస్తే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కోస్తాంధ్ర నుండి మహాసభలో పాల్గొనడానికి రైలులో ప్రయాణిస్తున్న‌ప్రతినిథులపై నంద్యాలలో రాళ్ళతో దాడి చేశారు. యావత్తు తెలుగు జాతిని ఒకే గొడుగు క్రిందికి తీసుకొచ్చి విశాలాంధ్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ‌ ప్రాంతాలలోని ప్రజానీకంలో అప్పటికే ప్రబలమైన ఆకాంక్ష వెల్లడవుతున్న‌నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కేవలం తొలిమెట్టేనని, హైదరాబాదు రాజథానిగా తెలుగు జాతి మొత్తాని ఒకే రాష్ట్రం అవతరించబోతున్నదని భావించడం వల్ల తాత్కాలిక రాజధానిగా కర్నూలుకు ఆనాడు స్థూలంగా ఆమోదం లభించిందన్న వాస్తవాన్నికూడా గుర్తుంచుకోవాలి.
రాజధాని ఎంపికకు సంబంధించి నాడు ఏ సమస్యలైతే తీవ్ర‌చర్చనీయాంశాలైనాయో! రమారమి అవే సమస్యలు పునరావృతమైనాయి. అప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభావితం చేసిన ఆ అంశాలు నేడు అంతకంటే తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన‌ భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడడానికి రాయలసీమవాసులు ముందు తటపటాయించడమే కాదు వ్యతిరేకించారు. దానికి కారణం లేకపోలేదు.  కోస్తాంధ్ర జిల్లాలలో పాశ్చాత్య విద్య అప్పటికే వ్యాపించడం, ధనిక రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఆవిర్భవించడం, సాంఘిక సంస్కరణాభిలాష పెరగటం వలన సామాజికాభివృద్ధిలో, ప్రజాజీవనంలో కోస్తాంధ్ర ప్రాంతం వారు రాయలసీమ వారికంటే బాగా ముందడుగులో ఉండేవారు. పర్యవసానంగా వారిలో రాజకీయ చైతన్య స్థాయి కూడా ఎక్కువగా ఉండేది. అయినా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులు అత్యధికంగా ప్రభుత్వ‌ ఉద్యోగాలను కైవసం చేసుకొనేవారు. ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య నామమాత్రంగా ఉండేది. ప్రత్యేక ఆంధ్ర‌ రాష్ట్ర డిమాండు తొలిదశలో మొగ్గతొడగడానికి అదొక ప్రధాన కారణమని చెప్పవచ్చు. రాయలసీమ ప్రజలు మరీ వెనుకబడి ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోను, ఉద్యోగస్తులలో కోస్తాంధ్రుల ఆధిపత్యం నెలకొంటుందన్న భావనలు సీమవాసుల్లో తలెత్తడంతో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న లక్ష్యం సాకారం కావలంటే రాయలసీమ ప్రాంత ప్రజల భాగస్వామ్యం అనివార్యమని కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. రాయలసీమవాసుల మనోగతాన్ని పసిగట్టి, చర్చలు సాగించి 1936లో "శ్రీబాగ్ ఒడంబడిక"గా పేరొందిన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాయలసీమ ప్రజలకు భవిష్యత్తుపై బరోసా ఇచ్చి వారు ఉద్యమంలో అంతర్భాగం అయ్యేలా ఒప్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మద్రాసులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొని 58 రోజుల తదనంతరం 1952 డిసెంబరు 15న అమరులైనారు. దాంతో రాష్ట్ర‌ సాధన కోసం తెలుగు జాతి ఒక్కటై ఉగ్రరూపందాల్చి ఉద్యమించి, లక్ష్యాన్ని సాధించుకొన్నది.
కానీ, క్షామ పీడిత‌ రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలు, విద్య, ఉపాథి తదితర రంగాలలో అభివృద్ధికి ఉద్ధేశించబడిన‌ శ్రీబాగ్ ఒడంబడిక బట్టదాఖలా చేయబడింది. తుంగభద్ర, కృష్ణా నదీ జలాల వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రమేర్పడింది. అటుపై 1956 నవంబరు 1న‌ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ రాయలసీమ ప్రజల దాహార్తి తీరలేదు. కరవుల్లో పుట్టి, కరవుల్లో జీవచ్చవాల్లా బ్రతుకులు వెళ్ళదీసి, కరవుల్లో చచ్చిపోతున్నారు. కృష్ణా జలాల వివాద పరిష్కారానికై న్యాయమూర్తి బచావత్ నేతృత్వంలో నియమించబడిన ప్రథమ‌ ట్రిబ్యునల్ రాయలసీమ ఆర్థనాదాన్ని వినిపించుకోలేదు. న్యాయమూర్తి బ్రజేష్ కుమార్ నాయకత్వంలోనియమించబడిన రెండవ ట్రిబ్యునల్ ఏ మాత్రం కరుణ చూపించలేదు. కడకు మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న హంద్రీ _నీవా, గాలేరు_నగరి, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. తెలుగు గంగకు 25 టి.యం.సి.ల మిగులు జలాలను కేటాయించినా పై రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆలోచనా తీరుతెన్నులు చూస్తుంటే ఆ నీళ్ళైనా క్రిందికి పారుతాయా! అన్న అనుమానాలు వస్తున్నాయి. కర్నూలు నుండి రాజధాని తరలిపోయింది. కృష్ణా, తుంగభద్ర‌ నదీ జలాల వినియోగంలో ప్రాధాన్యత ఇస్తామన్న వాగ్దానం గాలిలో కలిసిపోయింది. తుంగభద్ర జలాశయం చేజారిపోయింది. తెలుగు జాతి ఐక్యత కోసం అపార‌త్యాగాలు చేసిన‌ రాయలసీమ దగా చేయబడింది. తాజాగా సంకుచిత‌ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ విభజన చేయబడింది. తెలుగు ప్రజల ఆశాసౌధవంగా నిర్మించుకొన్న, బాగా అభివృద్ధి చెంది ఉపాథి, విద్య, వైద్య సదుపాయాలకు, ఆర్థికవనరులకు కల్పతరువుగా ఆవిర్భవించిన‌ హైదరాబాదు మహానగరాన్ని కోల్పోయామన్న మనోవేదనే మిగిలింది. భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
సీమ కడగండ్లు కనబడదా?: నిరంతర క్షామ పీడిత, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను పొందుపరచలేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను నెలకొల్పే విషయంలోకానీ, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించినా అదే భావన కలుగుతున్నది. సముద్రతీరం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, జాతీయ రహదారి, నీటి వనరులు, విద్యుదుత్పాదన వగైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే కారణాలను చూపెట్టి అభివృద్ధి ప్రణాళికలపై చర్చంతా పాశ్చిక దృష్టితో సాగుతున్నది. విశాఖ-నెల్లూరు మధ్య ఉన్న‌ప్రాంతంపైనే కేంద్రీకరించబడింది. రాజథానిని ఎక్కడ నెలకొల్పుకోవాలన్న చర్చను కూడా ఈ అంశాలే పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. వికేంద్రీకరణ జపం చేస్తూనే ఆచరణలో కేంద్రీకృత అభివృద్ధి మంత్రాన్ని ఆలాపిస్తున్నారు. విధాన నిర్ణేతల ఆలోచనలన్నీఅభివృద్ధి చెందిన ప్రాంతాలపైనే కేంద్రీకరించబడి ఉన్నాయనిపిస్తున్నది. గత‌ అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణామాలను ఊహించుకొంటున్నరాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం ఏ మాత్రం జరగడం లేదనిపిస్తున్నది. అందుకే మన బతుకేదో మనం బతికేద్దాం! అన్న భావనలు వ్యక్తం చేసే వారి సంఖ్య రాయలసీమలో పెరుగుతున్నది. 1956 నవంబరు 1న‌ హైదరాబాదు రాజధాని నగరంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో అందివచ్చిన‌ సానుకూలాంశాలను సద్వినియోగం చేసుకొని బాగా అభివృద్ధి చెందిన 55 ఏళ్ల తర్వాత నిర్ధాక్షిణ్యంగా వెళ్ళగొట్టినట్లే, కోస్తాంధ్రలో రాజధాని అభివృద్ధి చెందిన తరువాత రాయలసీమ వాళ్ళను అక్కడి నుండి వెళ్ళగొట్టరనే గ్యారెంటీ ఏమైనా ఉన్నదా! అన్న సంకోచం ఆ ప్రాంత ప్రజానీకం మెదళ్ళను తొలిచేస్తున్నది. తెలుగు జాతి ఐక్యతాంశం కంటే స్వార్థం పైచేయి సాధించిన నేపథ్యంలో ఈ భావనలు కలగడం సహజం. 'మా ప్రాంత అభివృద్ధి ఫలాలను తామే అనుభవించాలనే' దుర్బుద్ధికి అంతం ఉండదు కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్ర బిందువుగా జరుగుతున్న అభివృద్ధి కనీసం కొంత వూరట కల్పించవచ్చునేమో! కానీ రాయలసీమ ప్రజలకు అలాంటి ఆశాకిరణమే కనిపించడం లేదు. తెలుగు జాతి సమైక్యత కోసం వెనకాముందు ఆలోచించకుండా అపార‌ త్యాగాలు చేసిన రాయలసీమ నేడు దిక్కుతోచని స్థితిలో పడిందన్నది ముమ్మాటికీ నిజం.
నైసర్గిక స్వరూపం: ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చారిత్రకంగా, రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగు ప్రాంతాలుగా వర్గీకరించబడి ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగాను, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు మధ్య కోస్తా లేదా డెల్టా జిల్లాలుగాను, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు దక్షిణ కోస్తాగాను, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమగా పరిగణించబడుతున్నాయి. ఈ ప్రాంతాల అభివృద్ధిలో పెద్ద ఎత్తున వ్యత్యాసాలున్నాయి. శీతోష్ణస్థితి - వర్షపాతం విషయంలోనూ తేడాలున్నాయి. కోస్తాంధ్రలో సగటు వర్షపాతం 995.7 మి.మీ. ఉంటే రాయలసీమలో 670.4 మి.మీ. మాత్రమే. పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార డెల్టా ప్రాంతాలు విస్తరించి ఉన్న కోస్తాంధ్ర ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది. సారవంతమైన భూములతో, పచ్చని పంట పొలాలతో అలరారుచున్నది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకు, వర్షపాతానికి దగ్గర చుట్టరికం ఉన్నది. అందు వల్ల కోస్తాంధ్ర ఒక విధంగా ప్రయోజనం పొందుతున్నది, మరొక విధంగా తరచూ తుఫానుల బారినపడుతూ తీవ్రంగా నష్టపోతున్నది. వేసవి కాలంలో గుంటూరు జిల్లా రెంటచింతలలో రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. హైదరాబాదు, బెంగుళూరు నగరాల అభివృద్ధికి అత్యంత‌ సానుకూలమైన అంశం వాతావరణమే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంబవించిన దృష్ట్యా దూరం, కాలం తగ్గిపోయింది. పాలనా వ్యవహారాల్లో ఇంటర్నెట్ పాత్ర గణనీయంగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పాలన సాగించే దశలో ఉన్నాము. రాజథాని, హైకోర్టు, నూతనంగా నెలకొల్పదలచిన‌ ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు, భారీ మధ్యతరహా పరిశ్రమలు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొనే ముందు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి.

అభివృద్ధి ప్రణాళికేది?: రాయలసీమ, ఉత్తరాంధ్ర‌ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిథులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. చెన్నయ్ నుండి కలకత్తా మధ్యలో ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రాయలసీమకు మూడు వైపులా అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కర్నూలుకు సమీపంలో హైదరాబాదు, అనంతపురంకు సమీపంలో బెంగుళూరు, తిరుపతి, కడపకు సమీపంలో చెన్నయ్ ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రమంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్ధానం చేసింది. విస్తారమైన భూ సంపద, ఖనిజ మరియు అటవీ సంపదున్నది. నీరే సమస్య. నికర జలాలను కేటాయించి, రాయితీలు ఇస్తే  పారిశ్రామికాభివృద్ధికి అనువైన పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా నదీ మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లభించే 45 టి.యం.సి.ల నికర జలాలను కేటాయించి నీటి సమస్యను పరిష్కరించాలి. కృష్ణా నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ, వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఉన్నత విద్యా సంస్థల్లో కొన్నింటిని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలతో కూడిన సమగ్ర‌ అభివృద్ధి ప్రణాళికను సత్వరం ప్రకటించి, అమలు చేయాలి. రాజథాని సమస్యను మాత్రమే వేరుచేసి అత్యాధునిక హంగులతో గుంటూరు_ విజయవాడ లేదా విజయవాడ_ ఏలూరు మధ్య లేదా మరెక్కడైనా మహానగరాన్ని నిర్మిస్తామని కబుర్లు చెబితే వెనుకబాటుతనంలో కునారిల్లిపోతున్న రాయలసీమకు ఒరిగేదేమీలేదు. "సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం" ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్ లో సుపరిపాలనను ప్రజలు కోరుకొంటున్నారు.        

2 comments:

  1. Nice article and exhaustive discussion on the issue and the need for decentralization of the capital and development

    ReplyDelete