Saturday, August 16, 2014

"ప్రజాసేవకూ దేవస్థానాలు" సూర్య దినపత్రిక, ఆగస్టు 16, 2014

సామాజిక కార్యాలకు టిటిడి ఆదాయం?
చంద్రబాబు సూచనపై విమర్శలేల?
ప్రతి అంశంలో రాజకీయ కోణమేనా?
మిగిలిన ఆలయాలకూ బాధ్యత
మానవ సేవే మాధవ సేవ కాదా?
విద్యావ్యాప్తిలో టిటిడి కృషి అమోఘం
క్రైస్తవ మిషనరీల సేవలు సర్వ విదితం


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ- దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు తిరుమ వెంకటేశ్వరుడేనని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొందరు వ్యక్తులు అసందర్భమైన విమర్శలు చేశారు. ప్రతి అంశాన్ని సంకుచిత రాజకీయ కోణం నుంచి చూడడం సమాజానికి మేలు చేకూర్చదు. దేవస్థానాల పవిత్రతను కాపాడుతూ, నిర్దేశిత ఆధ్యాత్మిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, తమ ఆదాయ వనరులు అనుమతించిన మేరకు సామాజికాభివృద్ధిలో దేవస్థానాలు భాగస్వాములైతే తప్పేమిటో విజ్ఞతతో ఆలోచించాలి.

విభజనానంతరం తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో దేవస్థానాలు కూడా తమ వంతు పాత్ర పోషించాలనే ప్రతిపాదన సముచితమైనది. ఆంధ్ర నాట ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యకలాపాలకు వెచ్చిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానమంత సంపన్నమైనవి కాకపోయినా శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గ, అన్నవరం, సింహాచలం తదితర దేవస్థానాలూ భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సంక్షేమంకోసం వ్యయంచేస్తే సామాజిక ప్రగతిలో పాలుపంచుకొన్నట్లవుతుంది. తరతరాలుగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న మానవ సేవే మాధవ సేవ అన్న లోకోక్తి ఉండనే ఉన్నది.

మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే రంగాలలో దేవస్థానాలు కేంద్రీకరించి కొన్ని సంస్థలను నెలకొల్పి, నిర్వహిస్తే భక్తులకు సంతృప్తి కలుగుతుంది, సమాజమూ హర్షిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 1850 దశకంలోనే మొట్టమొదట వెల్లూరులో, అటు తరువాత కొంత కాలానికి తిరుపతిలో హిందూ ఉన్నత పాఠశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి శ్రీకారం చుట్టింది. కాలక్రమేణ వాటి పేర్లు శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలుగా మారాయి. తిరుపతి కేంద్రంగా శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంలో టిటిడి ముఖ్యభూమిక పోషించింది. యస్‌.వి. ఆర్ట్స కళాశాల, యస్‌.జి.యస్‌. ఆర్ట్‌‌స కళాశాల, పద్మావతి మహిళా కళాశాల, యస్‌.వి. జూనియర్‌ కళాశాల, ఓరియంటల్‌ కళాశాల, సంగీత - నృత్య కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, అంగవికలులకు పాఠశా, తదితర విద్యాసంస్థలను నెలకొల్పి విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేస్తున్నది.

భారతీయ విద్యా భవన్‌ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు వెన్నుదన్నుగా నిలిచింది. వైద్య ఆరోగ్య రంగంలో శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల స్థాపనకు, స్విమ్స్‌ ఆసుపత్రి, బర్డ్‌‌స ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రలను నెలకొల్పి విశేష కృషి చేస్తున్నది. కాకపోతే ఈ సంస్థలన్నీ తిరుపతి కేంద్రంలోనే ఉన్నాయి. దేశరాజథాని డిల్లీ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్టర్రాజధానిగా విలసిల్లిన హైదరాబాద్‌లో ఒకటి రెండు విద్యా సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నది.
వైద్య రంగంపై దృష్టి: నిత్య కరవు కాటకాలతో వెనుకబడ్డ రాయలసీమ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా ఈ తరహా సామాజిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం విస్తరించి ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు.

ప్రత్యేకించి ప్రయివేటీకరణ పుణ్యమాఅని వైద్యవిద్య, వైద్యం సామాన్యులకు, మరీ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలవారికి అందని ద్రాక్షలా తయారయ్యాయి. వైద్య విద్యను అత్యంత లాభసాటి వ్యాపార సరుకుగా మార్చి యం.బి.బి.యస్‌. సీటును డెబ్బయ్‌ ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు, యం.డి., లేదా యస్‌.యస్‌. సీటును రెండు కోట్ల రూపాయల వరకు వేలం వేసి అమ్ముకొని పెద్ద ఎత్తున్‌ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పేరుకు ట్రస్టులు, సొసైటీలుగా నెలకొల్పినా 90 శాతం సంస్థలు వ్యక్తుల వ్యాపార సంస్థలుగానే నడుస్తున్నాయి. పర్యవసానంగా వైద్య విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం జరుగుతోంది. ఈ రంగంపై దేవస్థానాలు కేంద్రీకరించి వైద్య విద్యాసంస్థలను, ఆసుపత్రులను నెలకొల్పి నిర్వహిస్తే సమాజానికి అమూల్యమైన సేవలందించినట్లవుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలిన దేవస్థానాలు కూడా వాటికున్న ఆదాయ వనరుల పరిథికి లోబడి ఆథ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే, ఈ అంశంపై దృష్టి సారిస్తే సభ్యసమాజం హర్షిస్తుంది.విద్య, వైద్య రంగాలలో క్రైస్తవ మిషనరీలు అనేక దశాబ్దాలుగా అపారమైన సేవలందిస్తూ భారతీయ సమాజంలోకి చొచ్చుక పోవడంతోపాటు సామాన్య ప్రజల మన్ననలు చూరగొన్నాయి. అంతర్జాతీయ సమాజానికి ఈ తరహా అనుభవాలే ఉన్నాయి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ 1989 లో పోలెండ్‌ దేశ రాజధానీ నగరం వార్సా వెళ్ళిన సందర్భంలో ప్రఖ్యాతిగాంచిన చర్చిలను సందర్శించాను. పోలెండ్‌ స్వాతంత్య్రోద్యమంలో చర్చిలు పోషించిన పాత్రపై నిర్వాహకులు ఘనంగా కీర్తిస్తూ వివరించారు. మన పూర్వీకుల కాలంలో విద్యా వ్యాప్తి, వైద్య సేవలూ గురుకులాల నుంచే ప్రారంభమయ్యాయన్న సంగతి మనమెన్నటికీ మరచిపోకూడదు.

అన్ని దానాల కంటే అన్న దానం గొప్పదని నానుడి. అన్ని దానముల కంటే విద్యా దానం శ్రేష్టమైనదని నాగరిక సమాజంలో మరొక లోకోక్తి కూడా ప్రాచుర్యంలో ఉన్నది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఆయురారోగ్యాలను, సిరిసంపదలను సమకూర్చాలని, కష్టాల భారి నుండి విముక్తి చేయాలని భక్తులు ఆయా దేవస్థానాల కెళ్ళి మొక్కుకొంటారు. ఆ మొక్కుల్లో భాగంగానే కానుకలు ముట్టజెప్పుకొంటారు. అలా సమకూరిన ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణ కోసం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం, ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాల నిమిత్తం సద్వినియోగం చేస్తూనే మానవ వనరుల అభివృద్ధికి, స్థూలంగా సామాజికాభివృద్ధికి కొంతమొత్తాన్ని వెచ్చిస్తే భక్తుల మొక్కులను నిజజీవితంలో తీర్చడానికి కూడా దోహదపడతాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే 1800 కె.జి.ల బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దాచిపెట్టింది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మొత్తం బంగారం 4,335 కె.జి. లున్నదని వెల్లడించారు. దానిపై టిటిడి వడ్డీ కూడా పొందుతున్నది. నగదు నిల్వలపైనా రాబడి వస్తున్నది. తిరుచునాపల్లిలోని అనంత పద్మనాభస్వామి దేవస్థానం అపారమైన సంపదను నిరుపయోగంగా దాచిపెట్టిన ఘటన వెలుగు చూడడంతో ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. ఈ తరహా సంపదను, ఆదాయాన్ని ఉత్ఫాదక రంగాలలో వెచ్చిస్తే సమాజానికి మేలు జరుగుతుంది కదా! కర్ణాటక రాష్ట్రంలో పలు మఠాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి. కర్ణాటక దేవాలయాలు: సామాజిక, ఆర్థిక జనజీవనంలో వాటి పాత్ర- అన్నశీర్షికతో ఒక పుస్తకాన్నే ప్రచురించారు.

పుట్టపర్తిలో ఆధ్యాత్మిక చింతనకు నిలయంగా భాసిల్లిన సత్యసాయి నిలయం ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, విద్యా సంస్థలు స్థాపించి, సమర్థవంతంగా నిర్వహింస్తున్నారు. శ్రీకంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో కాంచీపురం కేంద్రంగా వేద పాఠశాల, శిల్ప పాఠశాల, శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ, శ్రీ శంకర ఆర్ట్‌‌స, సైన్స్‌ కళాశాల, శ్రీదండపాణి ఓరియెంటల్‌ ఉన్నత పాఠశాల తదితర సస్థలను నెలకొల్పారు.
చరిత్ర పుటలను తిరగేస్తే మధ్య యుగాల(కీ.శ.14-17 శతాబ్ధాల మధ్య) కాలంలో విజయనగర రాజుల పాలనా కాలంలో దక్షిణాది హిందూ దేవాలయాలు ఆర్థిక కేంద్రాలుగా ఉండేవి. ఉదా: తిరుమల, శ్రీకాళహస్తి, తంజావూరులోని శ్రీరంగం దేవాలయాలు ఆర్థిక కేంద్రాలుగా ఉండేవి. ప్రాంతీయ అభివృద్ధిలో పాలుపంచుకొనేవి. విజయనగర రాజులు వ్యవసాయాన్ని అత్యంత కీలకమైన రంగంగా పరిగణించారు.

చిన్ననీటిపారుదల సౌకర్యాలైన చెరువులు, కుంటలు, బావులు, నదులపై వ్యవసాయం ఆధారపడి ఉండేది. చెరువులు, బావులు, కాలువ త్రవ్వకానికి తిరుపతి దేవస్థానం నిథులను సమకూర్చేది. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడంద్వారా తిరుపతి దేవస్థానం గ్రామీణులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి అండగా నిలిచింది. బంజరు భూముల అభివృద్ధికి నిధులను సమకూర్చేది. భూముల అభివృద్ధి, నీటి సదుపాయం, సాగు కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ఆర్థిక కార్యక్రమంగా నిర్వహించేది. వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణులకు ఉపాధి కల్పించడం, ఆహార ధాన్యాల ఉత్ఫత్తిని ప్రోత్సహిచడం- తద్వారా దేవస్థానాల ఆదాయాన్ని పెంచుకొనే విధంగా కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించేదని చరిత్ర చెబుతున్నది. నాడు ఒక్కొక్క దేవాలయం ఒక ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా ఉండేది. దేవస్థానాలు భూ యజమాన్యాలుగా ఉండడం, రైతులకు భూములను అప్పగించి, సాగు చేయడానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించడం, వ్యవసాయ ఉత్ఫత్తులను సేకరించుకోవడం,

దేవస్థానాల్లో వందలాది మందికి ఉపాథి కల్పించి, వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు ఆథ్యాత్మిక కేంద్రాలుగా ఉండేవి. దాన్నిబట్టి హిందూ దేవాలయాలు ఆథ్యాత్మిక కార్యకలాపాలతో పాటు ఉత్ఫత్తి రంగాలలో నిధులు వెచ్చించి సామాజికాభివృద్ధిలో పాలుపంచుకొన్నాయని స్పష్టమవుతున్నది. తిరుచినాపల్లిలోని శ్రీరంగం దేవాలయం వంటి కొన్ని దేవస్థానాలు వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే వారికి రుణాలు ఇచ్చిన ఉదంతాలనుకూడా చరిత్రకారులు ప్రస్తావించారు.ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొన్నప్పుడు దేవస్థానాలు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చు చేయడం హిందూ దేవాలయాల పవిత్రతకు, భక్తుల తాత్త్విక చింతనకు, మనోభావాలకు, ఆలోచనలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదు. ఒకప్పుడు భక్తులు పంచాంగాల ఆధారంగా శుభప్రదమైన రోజులను ఎంపిక చేసుకొని దేవాలయాలకు వెళ్ళేవారు. కాలం మారింది. సెలవు దినాలలో పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిట లాడిపోతున్నాయి.

సౌలభ్యాన్ని బట్టి ప్రయాణాలను పెట్టుకోవడంతో పాటు దేవస్థానాలున్న ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాయి. దేవాలయాల్లో అత్యధికం అడవులు, కొండ ప్రాంతాలు, పెద్దపెద్ద గుట్టలున్న ప్రాంతాలలోనే ఉండడం మూలంగా అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలు మొదలుకొని పెద్దలవరకు ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. భక్తికి తోడు మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరగడంతో కొన్ని దేవస్థానాల ఆదాయం బాగా పెరిగింది. ఆ ఆదాయంలో కొంత భాగాన్ని సామాజికాభివృద్ధికి ఉపకరించే కార్యక్రమాలకు వినియోగించడం ఏ మాత్రం తప్పు కాదు.

రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానాల నిధులను రాష్ట్ర ఖజానాకు తరలించుకొనే ప్రయత్నం చేసినా లేదా దేవస్థానాల ట్రస్టులపై పెత్తనం చేసినా సమర్థనీయం కాదు. స్వతంత్ర ప్రతిపత్తితో దేవస్థానాల ట్రస్టుల ఆధ్వర్యంలోనే సామాజిక కార్యక్రమాలేవైనా నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవస్థానాల బోర్డులను పునర్వవస్థీకరించే హక్కు మాత్రమే ప్రజలద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానాల బోర్డులు తమ తమ పరిధులు దాటకుండా దేవస్థానాల ఆదాయంతో సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి.

4 comments: