Monday, March 16, 2015

నిన్న నాకు ఎదురైన ప్రశ్న‌


ముప్పయ్ ఐదేళ్ళ‌ క్రితం విద్యార్థి ఉద్యమంలో నా సహ‌చరుడుగా పని చేసిన హరినాథ్ ఇటీవలే మరణించాడు. ఆయన సంస్మరణార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నా నివాస స్థలం నుండి దాదాపు 20 కి.మీ. దూరంలో ఉన్న బాలానగర్ కు వెళ్ళాను. అక్కడ కొ‍ంత‌ మంది పాత మిత్రులు, నాటి సహచరులు కలిశారు. మిత్రులతో పిచ్చాపాటిగా వివిధ అంశాలపై ముచ్చటించుకొని తిరుగు ముఖం పట్టాను. హరినాథ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎ‍.ఐ.యస్.ఎఫ్. అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన డి.సోమసుందర్( అధ్యక్షులు, ఆ.ప్ర. వర్కింగ్ జర్నలిస్టు యూనియన్), నేను కలిసే అక్కడికి వెళ్ళాం. మళ్ళీ కలిసే నా 'యాక్టివా స్కూటర్' పై తిరుగు ప్రయాణానికి ఉపక్రమించాం. "ఏంటండీ పార్టీ నాయకుడుగా ఉండి స్కూటర్ మీద వచ్చారు, కార్లో రాకుండా" అన్న‌ ఒక వింతైన ప్రశ్నను ఒక సోదరి నాకు సంధించారు. నైతిక విలువలతో రాజకీయ జీవితాన్ని గడిపి, శ్రామిక ప్రజానీకానికి నిస్వార్థంగా సేవలందించిన ఒక పార్టీ 'వెటరన్ లీడర్' కోడలు ఆమె. మీకు స్కూటర్ మీద తిరిగేంత స్తోమతెలా వచ్చిందండీ అని ఆమె అడిగి ఉంటే నాకు సమాధానం చెప్పుకోవడం సులభంగా ఉండేది. మా ఆవిడ డాక్టర‌మ్మ, ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఆమె సంపాదనతో నాకు స్కూటర్ కొనిపెట్టిందని తడుముకోకుండా సమాధానం చెప్పేసేవాడిని. నా గురించి తెలియక ఆమె ఆ ప్రశ్న వేయలేదని నాకు తెలుసు. పైపెచ్చు అక్కడే ఉన్న‌ ఆమె జీవిత భాగస్వామి జోక్యం చేసుకొని లక్ష్మీనారాయణ, సోమసుందర్ ల గురించి మన‌కు తెలుసు క‌దా! అన్నాడు. తెలిసే కదా! అడిగింది అన్న దామె. మరి ఆ లోతైన‌ ప్రశ్నకు నేను సమాధానం చెప్పి, సంతృప్తి కలిగించే సాహసం చేయగలనా! అందుకే దానిపై కాస్తా సరదాగా మాట్లాడుకొని అక్కడి నుండి నిష్క్రమించాం.

No comments:

Post a Comment