Wednesday, December 14, 2011

మయన్మార్‌పై అమెరికా చూపు!

published in Surya Telugu daily on December 13,2011

- సూకీ ్రపజాస్వామ్య పోరాటానికి గుర్తింపేనా?
- వ్యూహాత్మక ప్రయోజనాల అమలుకా?
- చైనాకు చికాకులు సృష్టించడానికా
- ఆర్థిక సహకారానికీ మయన్మార్‌కు హామీలు
- ఒడిదుడుకులలో భారత్‌- మయన్మార్‌ బంధం

హిల్లరీ క్లింటన్‌ , ఆంగ్‌ సాన్‌ సూకీ మహదా నందంతో ఆలింగనం చేసుకొన్న దృశ్యం ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. ఈ మహిళలిద్దరూ ఒ కరు అమెరికా విదేశాంగ వ్యవహారాల అధినేత, మరొకరు మయన్మార్‌ (బర్మా)లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటానికి ప్రతీ కగా నిలిచి నోబెల్‌ బహుమతి గ్రహీత. మయన్మార్‌ సైనిక నియంతృత్వ ముఠా (మిలిటరీ జుంటా) ప్రభు త్వం వ్యక్తి స్వేచ్ఛను, మానవ హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి ఆంగ్‌ సాన్‌ సూకీకి గృహ నిర్బంధ శిక్ష విధించింది. ఏ గృహాన్నయితే ఉద్యమ కేంద్రంగా మలుచుకొన్నారో, అందులోనే దాదాపు రెండు దశాబ్దాల పాటు కఠినమైన శిక్షను ఆంగ్‌ సాన్‌ సూకీ అనుభవించింది. ఆ చారిత్రాత్మకమైన గృహంలోనే తొంబై నిమిషాల పాటు వారిరువురూ సమావేశమై చర్చలు జరపడం, రంగూన్‌ లోని అమెరికా దౌత్యాధికారి ఇంటిలో మరో మూడు గంటల పాటు చర్చలను (డిన్నర్‌ మీట్‌) కొనసాగించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. ప్రజాస్వామ్యం కోసం ఆంగ్‌ సాన్‌ సూకీ సాగిస్తున్న వీరోచిత పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు గా కొందరు ఈ పరిణామాలను చూస్తున్నారు.

అమెరికా కన్ను మయన్మార్‌పై పడింది. మన పొరుగునున్న పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్ట కుండా సైనిక నియంతలకు వెన్నుదన్నుగా నిలిచింది అమెరికానే. అఫ్ఘానిస్థాన్‌ లో సామాజిక ప్రగతికి పునాదులు వేసిన నాటి నజీబుల్లా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ముస్లిం ఛాందసవాదులను పెంచిపోషించి, ఆ దేశాన్ని ప్రస్తుత దుస్థితికి దిగజార్చిన ఘనతా అమెరికాదే. అరబ్‌ దేశాలలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోవడానికి వీల్లేని విధంగా ప్యూడల్‌ శక్తులతో అంటకాగుతు న్నది. లాటిన్‌ అమెరికా దేశాలలో నియంతలను కుర్చీలపై కూర్చోబెట్టింది, వారికి రక్షణకవచంగా నిలబడిందీ అమెరికానే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో అస్థిరత్వాన్ని ప్రోత్సహించిందీ, నియంతలను, ఉగ్రవాద శక్తులను, అరాచక శక్తులను పెంచిపోషించిందీ అమెరికన్‌ సామ్రాజ్యవాదమే. అందుకే ఆంగ్‌ సాన్‌ సూకీ పైన, మయన్మార్‌ దేశంపైన బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లిం టన్‌ కనబరుస్తున్న అత్యుత్సాహంపై కీడెంచి మేలెంచాలి అన్న నానుడి గుర్తొస్తుంది.

ఏడాది క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత దేశ పర్యటనలో భాగంగా పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో మయన్మార్‌ పరిణామాలను ప్రస్తావించారు. మన దేశాధినేతలకు చురకలు కూడా అంటించా రు. శాంతియుతంగా సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను బర్మాలోలాగా అణ చివేస్తే, ప్రపంచలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రేక్షకపాత్ర వహించలేవు. దశాబ్దాల పాటు రాజకీయ ఖైదీలను జైళ్ళలో నిర్భందించడం, నిరసనలు వ్యక్తంచేసే పౌరుల ను కాల్చిచంపడం ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల ఫలితాలను గౌరవించని మ యన్మార్‌ ప్రభుత్వ పోకడలను ప్రపంచం గమనిస్తున్నది. మానవ హక్కుల ఉల్లం ఘనలను అంతర్జాతీయ సమాజం, ప్రత్యేకంగా అమెరికా, భారత్‌ వంటి దే శాలు తీవ్రంగా ఖండించాలి. భారత్‌ ఇలాంటి అంశాలపై అంతర్జాతీయ వేదికలపై స్పం దించకుండా తరచు మౌనం ప్రదర్శిస్తున్నది.నిరసించినంత మాత్రాన ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొన్నట్లుకాదు.

విశ్వవ్యాపితంగా ఆమోదం పొందిన మానవ హక్కులకు నిజమైన అర్థం చెప్పిన వారమ వుతాము. నియంతృ త్వ వ్యవస్థలను- ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పరివర్తన చెందించడం ద్వారా ఆసి యాలో, ప్రపంచవ్యాప్తంగా సాధించిన ప్రగతికి స్థిరత్వాన్ని కల్పించవచ్చు. పర్యవ సానంగా ప్రపంచంలో భద్రతను పెంపొందించవచ్చునని ఆ యన హితబోధ కూడా చేసి వెళ్ళారు. దీన్ని బట్టి దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తన ప్రా బల్యాన్ని పెంచుకోవడం, ఆర్థికంగా బలపడి, రాజకీయంగా పెనుసవాలుగా నిలి చిన చైనాకు చికాకులు సృష్టించడమే అమెరికా లక్ష్యంగా స్పష్టమవుతున్నది. ఆ వ్యూహంలో భారతదేశాన్ని కూడా ఇరికించాలనే దుష్టతలంపూ ఉన్నది.

ఆ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేయడానికి అమెరికా ఉపక్రమించింది.1955 లో జాన్‌ పోస్టర్‌ డూలెస్‌ పర్యటన తదనంతరం ప్రప్రథమంగా అ మెరికా విదేశాంగ కార్యదర్శి హోదాలో హిల్లరీ క్లిం టన్‌ దౌత్యపరంగా మూడు రోజులపాటు ఈ ఏడా ది చివరిలో మయన్మార్‌లో పర్యటించారు. సైనిక పాలకుల నుండి ఏడాది క్రితమే నూతనంగా పరి పాలనా బాధ్యతలను స్వీకరించిన మయన్మార్‌ పౌరప్రభుత్వ అధినేతలతో, ప్రజాస్వామ్య ఉద్యమ నేత, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీతోనూ సమాలోచనలు జరిపారు. మయన్మార్‌ ప్రభుత్వం నిర్బంధకాండకు స్వస్తి చెప్పాలని, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, మైనారిటీ తెగల ప్రజానీకానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచా రాన్ని నిలిపివేయాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని హిల్లరీ క్లింటన్‌ కోరారు. ప్రజాస్వా మ్య సంస్కరణల అమలు తీరుతెన్నులపై అధారపడి ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని కొనసాగించడమే కాకుండా పెంచుతామని సెలవిచ్చారు. ఆంగ్‌ సాన్‌ సూకీతో సమావేశంలో- మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉమ్మడిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞకూడా చేశారు.

అంతర్జాతీయ సమాజం నుండి వెలివేతకు గురై, ఆర్థిక ఆంక్షలకు, నిర్బంధానికి గురైన మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్కరణలను కలిసి ప్రోత్సహిస్తామన్నారు. కలిసి ముందడుగు వేస్తే ప్రజాస్వామ్య సాధనలో వె నుదిరిగి చూసే ప్రసక్తే ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని ఆంగ్‌ సాన్‌ సూకీ వెల్లడించారు. సైన్యం కనుసన్నల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మయన్మార్‌ పౌర ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను కాస్త సడలింపుచేసింది. ఆంగ్‌ సాన్‌ సూకీ తో పాటు రాజకీయ ఖైదీలలో కొంత మందిని విడుదల చేసింది. ఎన్నికల నిర్వహ ణ వంటి కొన్ని ప్రజాస్వామ్య సంస్కరణలను అమలు చేస్తున్నది. ఈ పూర్వ రంగం లో హిల్లరీ క్లింటన్‌ పర్యటన సాగింది. సైన్యం మద్దతున్న పార్టీకి భారీ ఆధి క్యాన్ని సాధించి పెట్టడానికి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

రాజ్యాంగపరంగా దేశంపై సైన్యం ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. గత ఎన్నికలను ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ పార్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ బహిష్కరించింది. మయన్మార్‌ పై అమెరికా, యూరప్‌ ఆంక్షలు కొన సాగుతున్నాయి. తాజా పరిణామాల దృష్ట్యా వాటిని ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థలు సంకేతాలిస్తున్నాయి. మయన్మార్‌ ప్రభుత్వం గత కొంత కాలంగా చైనాతో సన్నిహితంగా ఉంటు న్న ట్లు బోధపడుతున్నది. మయన్మార్‌లోని సైనిక నియంతల ముఠా పాలనను ప్రపం చమంతా వెలివేసినా, తన వ్యూహంలో భాగంగా చైనా అంటకాగినమాట వాస్తవం. మయన్మార్‌లో, ఆగ్నేయాసియా ప్రాంతంలో చైనా పలుకుబడిని తగ్గించాలనే ప్రయత్నాలలో వాషింగ్టన్‌ ఉన్నదని, అందుకే ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నదని, ఆ వ్యూహంలో భాగంగానే హిల్లరీ క్లింటన్‌ పర్యటించారని విశ్లేష కులు భావిస్తున్నారు.

ఇటీవల ఎన్‌ఎల్‌డీ రాజకీయ పార్టీగా మళ్ళీ రిజిస్టర్‌ అయింది. సమీప భవిష్యత్తు లో పార్లమెంటుకు జరు గనున్న ఉపఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు చేస్తున్నారు. 1990లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ అధిక్యతతో గెలుపొందినా మిలిటరీ జుంటా ఎన్నికల ఫలితాలను గుర్తించ నిరాకరించి ఆంగ్‌ సా న్‌ సూకీని ఇరవై ఏండ్ల పాటు నిర్బంధంలో ఉంచిం ది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసింది.మయన్మార్‌తో భారత్‌ సంబంధాలు ఒడుదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బర్మా అధినేత యూనూ, మన దేశ ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉన్న రోజుల్లో నెలకొన్న దౌత్యపరమైన సత్సంబంధాలు 1962 వరకు సాఫీగా ఉన్నాయి. అటుపై ఆ పాలనా పగ్గాలను సైన్యం చేజిక్కించుకోవడంతో నియంతృత్వ పాలన మొదలయ్యింది. నాటి నుంచి స్నేహ సంబంధాలు మసకబారుతూ వచ్చాయి.

1987లో నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ బర్మా పర్యటనతో దౌత్యసంబంధాల లో నూతన అధ్యాయం మొదలయ్యిందనుకొన్న నేపథ్యంలో 1988లో ప్రజాస్వా మ్యం కోసం పెల్లుబుకిన ఉద్యమాన్ని మిలిటరీ జుంటా కర్కశంగా అణచి వేయ డానికి పూనుకోవడంతో బెడిసికొట్టాయి. భారత దేశం ఉద్యమానికి సంపూర్ణ మ ద్దతు ప్రకటించడంతో మయన్మార్‌తో దౌత్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 1989లో బర్మా పేరు మార్చుకొని మయన్మార్‌గా ఆవిర్భవించింది. మళ్ళీ 1993 నుంచి దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి . భారత్‌, మయన్మార్‌ దౌత్య సంబంధాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. మయన్మార్‌ దేశ ఉత్పత్తులకు భారత్‌ పెద్ద మార్కెట్‌. మొత్తం ఎగుమతుల్లో 25 శాతం మన దేశానికే తరలివస్తున్నాయి. అలాగే దిగుమతులనూ అధికంగానే చేసు కొంటున్నది.

ధాయిలాండ్‌ , చైనా , సింగపూర్‌ తరువాత ఆ దేశానికి నాలుగవ పె ద్ద వాణిజ్య భాగస్వామి భారత్‌. 1994లో కుదుర్చుకొన్న సరిహద్దు వాణిజ్యాన్ని మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌ సరిహద్దుల్లో గుర్తించిన కేంద్రాల నుండి అభి వృద్ధి చేసుకోవడానికి ఆమోదించారు. 2001లో భారత సైనిక సరిహద్దు రహదారి సంస్థ నిర్మించిన రహదారిని భారత్‌ మయన్మార్‌ మైత్రీ రహదారిగా పిలుస్తున్నారు. 160 కి.మీ.గల ఈ రహదారితో ఈశాన్య రాష్ట్రాలకు దక్షిణాసియా, ఆగ్నేయాసి యాలతో రవాణా సంబంధాలు ఏర్పడ్డాయి. 1990 నుండి ఆగ్నేయాసియాలోని మయన్మార్‌తో సహా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహసం బంధాలను పునర్నిర్వ చించుకోవాలన్న తలంపు మన దేశాధినేతలకు వచ్చింది. భారత్‌కు, ఆగ్నేయాసి యాకు ఈశాన్యరాష్ట్రాలు గేట్‌వే టు సౌత్‌ ఈస్ట్‌ ఏసియాగా పిలచే సహజసిద్ధమైన ప్రాంతం.

ఆగ్నేయాసియాలోని దేశాలతో దౌత్య పరమైన సంబంధాలను, వాణిజ్య లావాదేవీలను పటిష్ఠం చేసుకొనే వైపు దృష్టి కేం ద్రీకరించలేదనే అపవాదు మన పాలకులపై ఉన్నది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలన్నీ అసోషియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ నేషన్స్‌ (ఏసియాన్‌)గా ఏర్పడ్డాయి. సహజంగానే చైనాకు ఆ కూటమిపై పట్టు పెరిగింది. మన దేశానికి సార్క్‌లో మాత్రమే సభ్యత్వం ఉన్నది. బే ఆఫ్‌ బెం గాల్‌ మల్టిసెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కో ఆపరేష న్‌ (బిమ్స్‌ టెక్‌) సంస్థను 1997లో భారత్‌, థాయిలాండ్‌, బాంగ్లాదేశ్‌, శ్రీలంక నెలకొల్పాయి. మయన్మార్‌, నేపాల్‌, భూటాన్‌ కూడా తరువాత అందులో చేరాయి. మన దేశానికి సరిహద్దు దే శం మయన్మార్‌. పర్యవసానంగా మన దేశం తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదు ర్కొంటున్నది. అక్రమంగా దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయి.

ఆ కారణం వ ల్లే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ఆ దేశంలో అధికారంలోఉన్న సైనిక నియంతలతో ఇచ్చిపుచ్చుకొనే మైత్రీ సంబంధాలు అవసరమని భావించి మెతక వైఖరిని అనుస రిస్తూ వస్తున్నది. కాబట్టే ఆంగ్‌ సాన్‌ సూకీ నాయకత్వంలో దశాబ్దాలుగా ప్రజాస్వా మ్యం కోసం పోరాడుతున్న ప్రగతి కాముక శక్తులకు మద్దతివ్వడానికి జంకే పరి స్థితుల్లో మన ప్రభుత్వం పడిపోయింది. అందుకే ఒబామా మన రాజకీయ నాయ కత్వాన్ని రెచ్చగొట్టడానికి డిల్లీ పర్యటన సందర్భంగా ప్రయత్నించారు. 20 11 అక్టోబరులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మయన్మార్‌ దేశాధ్యక్షుడు మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు కుదుర్చుకొన్న ఒడంబడికలోకూడా నర్మగర్భంగానే ఆ దేశ ఆంతరంగిక విషయాల ప్రస్తావన జరిగింది.

ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణం వైపు చేపడుతున్న చర్యలను స్వాగతిస్తూ, ఆ ప్రక్రియకు తోడ్పా టును అందిస్తామని మాత్రమే పేర్కొన్నాం.ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌ అభ్యర్థిత్వానికి మయన్మార్‌ అధ్యక్షుడు మద్దతు ప్రటించారు. వాణిజ్య పరంగా, దౌత్యపరంగా, భద్రతా పరంగా, ప్రాంతీయంగా చూసినా, భౌగోళిక, రాజకీయాంశాలను పరిగణలోకి తీసుకొన్నా మయన్మార్‌తో మనదేశానికి వ్యూహాత్మక అవసరాలు, ఉభయ దేశాలకు బహుళ ప్రయోజనాలు ముడిబడి ఉన్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసు కొంటున్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యంత జాగరూకతతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది.

No comments:

Post a Comment