Tuesday, December 27, 2011

రాజకీయ చదరంగంలో " లోక్ పాల్ "

అవినీతిపై ఖడ్గం ఝుళిపించిన అన్నా హజారేకి , గనుల మాఫియా లీడర్ గాలి జనార్థనరెడ్డి అనుచరుడు శ్రీరాములుకు ప్రజలు ఏకకాలంలో జేజేలు పలికారు . " తాను ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు " అన్న" అన్నా హజారే మాట "ను అక్షరాలా నిజం చేస్తూ బళ్ళారి ప్రజలు ఇటీవల శాసన సభా స్థానానికి జరిగిన‌ మధ్యంతర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాములును గెలిపించారు . ఓబుళాపురం ఇనుప ఖనిజం గనులను మింగేశాడన్న సి . బి .ఐ . కేసులో అరెస్టయిన గాలి జనార్ధనరెడ్డి కొన్ని నెలలుగా చంచల్ గూడా జైలులో ఊచలు లెక్కబెడుతూ రోజులు గడుపుతున్నాడు . ఆయన నమ్మిన బంటు శ్రీరాములు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి , మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తే నలబై వేల ఓట్ల ఆధిక్యతతో గెలిపించి , ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రసారమాధ్యమాలు వార్తలను ప్రసారం చేశాయి . కర్నాటక రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దరావత్తు కోల్పోయారు . దేశాన్నేలుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకొన్నది . దీన్ని బట్టి " ధనం మాట్లాడుతుంటే సత్యం మౌనం వహిస్తుంది " అన్న నానుడి గుర్తుకురావడం సహజం . చట్టాల కోసం పోరాటాలు చేయడంతో పాటు ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఇతర అంశాలపై దృష్టి సారించి , ప్రజా చైతన్యానికి , ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమించాల్సిన అవశ్యకతను ఈ ఘటన నొక్కిచెబుతున్నది .

అవినీతిపై ప్రజలు కన్నెర్రజేశారు . అయితే , అవినీతిపరులు భారీ ఆధిక్యతతో ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూ చట్ట సభల్లోకి రాజఠీవితో అడుగు పెడుతున్నారు . ఏమిటీ వైచిత్య్రం . ప్రజలు అవినీతిని అసహ్యించుకొంటున్నారన్నది ముమ్మాటికీ నిజం . కానీ దొంగ చేతికి తాళమిచ్చినట్టు , అవినీతిపరుల చేతుల్లోనే రాజ్యాధికారాన్ని పెడుతున్నారు . ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు , రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొంటే లంచగొండులని ముద్ర వేయడానికి అధారాలు కనిపిస్తాయి . ఈ వ్యవహారంలో లంచం ఇచ్చేవాడు బాధితుడు , తీసుకొనే వాడు లబ్ధిదారుడు . కల్తీ మద్యం లేదా యం . ఆర్ . పి . కంటే ఎక్కువ ధరకు మద్యాన్నిఅమ్మి డబ్బు సంపాదిస్తే అక్రమార్జన సొమ్మని తెలిసిపోతుంది . ప్రజాకర్షణ పథకాల అమలులో అధికార దుర్వినియోగానికి పాల్పడి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే అందులోని రాజకీయ స్వార్థం ప్రజలకు బోధపడుతుంది .

కానీ , మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా సంస్థల వద్ద వందలు , వేలు , లక్షల కోట్ల రూపాయల‌ విలువజేసే సంపద ఎలా పోగుబడుతున్నదో ! ఏది నీతిగా సంపాదించిన సొమ్మో ! ఏది నీతిబాహ్యంగా అవినీతికి పాలడికూడబెట్టుకొన్నారో !సామాన్యులకు అంతు చిక్కని అవినీతి మాయాజాలంగా మిగిలిపోతున్నది . ఇదీ నేడు అమలులో ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక నీతి , లక్షణం . ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్య నిథి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు , అలాగే బహిరంగ మార్కెట్ నుండి కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనుల ముసుగులో కమీషన్లు , పర్సంటేజీలు , వాటాలు వేసుకొని ప్రజాధనాన్ని మింగేస్తున్నారు . ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిపోతున్నది . అయినా కోపం రావడం లేదంటే కారణం ఆ సొమ్ము తమ సొమ్ముగా భావించే చైతన్యం ప్రజల్లో కొరవడిందని చెప్పవచ్చు .

అలాగే , సహజవనరులైన‌ భూమి , భూగర్భంలో లభించే ఇనుము , బాక్సట్ , బెరైటీస్ , గ్రానైట్స్ , బొగ్గు , భూ ఉపరితలంపై దొరికే ఇసుక , కృష్ణా _ గోదావరి బేసిన్ లోని స‌ముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న చమురు , సహజవాయు నిల్వలు , సముద్ర తీరంలో లభి‍స్తున్న" బీచ్ శాన్డ్స్ " వగైరా అమూల్యమైన ఖనిజ సంపద దొడ్డిదారిన తరలిపోతున్నది . ప్రభుత్వ రంగంలో సాధించిన శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్ళించి అక్రమార్జనపరుల బొక్కశాలలకు చేరుతున్నాయి . అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు , పరిపాలనా యంత్రాంగంలో కీలక పాత్రదారులైన ఉన్నతాధికారులు , కార్పోరేట్ సంస్థలు మరియు సంపన్న వర్గాలు అపవిత్ర కూటమిగా ఏర్పడి చట్టం కళ్ళుగప్పి జాతి సంపదను కొల్లగొడుతున్నారు . ఈ అవినీతి కుంభకోణాల్లో ఇచ్చేవాడు , పుచ్చుకొనేవాడు ఇద్దరూ లబ్ధిపొందుతున్నవారే . నష్టపోతున్నది దేశ ప్రజలు , కానీ వ్యక్తులుగా ఎవ్వరూ తాము నష్టపోయామన్న భావన కలగడం లేదు . పర్యవసానంగా దోపిడి యదేచ్ఛగా కొనసాగుతున్నది . దేశంలో మిలియనేర్లు , బిలియనేర్లు ( కుబేర్లు ) సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతున్నది . జలగల్లా జాతి సంపదకు కన్నం వేసి దోచుకొంటున్నా ప్రజల‌ ఉమ్మడి ఆస్తి దోపిడీకి గురౌతున్నదనే స్పృహ కొరవడింది . నిరక్ష్యరాస్యులుగా ఉన్న 35 శాతం మంది అమాయక ప్రజలు ఈ ఆర్థిక నీతి లోని మోసాన్ని పసిగట్ట లేక పోవచ్చు , కానీ అక్షరాస్యులైన మధ్య తరగతి ప్రజలు , బుద్ధి జీవులు కూడా ఈ విషయంలో చైతన్యయుతంగా స్పందించడం లేదు . కారణం ప్రత్యక్షంగా తమ సొమ్ముకు చిల్లు పడలేదు కాబట్టి ఈ ఆర్థిక దోపిడి పట్ల నిరాసక్తత చూపెడుతున్నారా ! అనిపిస్తుంది .

లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల‌ 2 జి స్పెక్ట్రం టెలికం కుంభకోణం , కృష్ణా _ గోదావరి బేసిన్ లోని సజవాయువు నిక్షేపాల రిలయన్స్ కుంభకోణం , ఓబులాపురం ఇనుప ఖనిజాన్ని గనుల మాఫియా లీడర్ గాలి జనార్థనరెడ్డి దొడ్డిలోకి చేర్చిన‌ అక్రమ లీజుల కుంభకోణం , ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ కుంభకోణం , విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సట్ నిక్షేపాలు జిందాల్ కంపెనీకి కట్టబెట్టిన వైనం వగైరా వగైరా కుంభకోణాల తాజా చరిత్ర ప్రజల కళ్ళ ముందు సాక్షత్కరిస్తున్నది . ఎలాంటి శసబిష‌లకు తావులేకుండా సి‍. బి . ఐ . విచారణలు వీటిని దృవపరుస్తున్నాయి . అయితే అడ్డంగా దొరికిన వారు మాత్రమే దొంగలుగా ముద్రపడి జైళ్ళలో ఉన్నారు . దొరకని వారు లేదా రాజ్యాధికారం అండ పుష్కలంగా ఉన్న వారు ఘరానా పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణి అయిపోతూనే ఉన్నారు . దొంగలుగా దొరికిన వాళ్ళనన్నా సంఘ బహిష్కృతులుగా చూడడానికి బదులు , వారికి ఘన స్వాగతాలు పలికే అనుచరగణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారాలపట్టి కనిమొళి తీహార్ జైలు నుండి బైయిలు పై విడుదలైతేనే ఆమెకు డిల్లీ , మద్రాసు మహానగరాలలో కటౌట్లతో , ప్లెక్సీ బ్యానర్లు , బజాబజంత్రీలు , మంది మార్బలంతో డి . య . కె . పార్టీ నాయకత్వం చేసిన హడావుడి , స్వాగత దృశ్యాలు తిలకించినప్పుడు సభ్య సమాజం తల దించుకొన్నది . స్వాతంత్రోద్యమంలో జైలుకెళ్ళొచ్చిన ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవం లభించిందో ! లేదో ! అనుమానమే . లోపమెక్కడుంది ? వ్యవస్థలోనా ! చట్టాల్లోనా ! ప్రజల చైతన్యంలోనా !

సమాజం మూలుగుల్నిపీల్చిపిప్పి చేస్తున్న అవినీతి చెదలుకు మూలాలెక్కడున్నాయి ? దాని నిర్మూలనకు మందేంటి ? అన్నదే కీలకమైన సమస్య . అవినీతి అంతానికి "చారిత్రాత్మకమైన‌ " లోక్ పాల్ చట్టానికి ఇదిగో ! బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నామని కాంగ్రెస్ నేతృత్వంలోని యు . పి . ఎ . ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోజు పెట్టింది . నిప్పుల కొలిమిలో కర్రును పెట్టి , ఇహ సాన పట్టండన్నట్లు ప్రతిపక్షాలకు సవాలు విసిరింది . ప‌రిపాలనానుభవంలో ఇతరుల కంటే రెండాకులు ఎగమేసిన కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదిత బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఆమోదం పొందకుండా ఉండడానికి వీలుగా అవసరమైన మెలికలు పెట్టి కూర్చున్నది . ఉత్తర‌ ప్రదేశ్ ఎన్నికల్లో లబ్దిపొందాలనే కుచ్చితత్వంతో రిజర్వేషన్ల అంశాన్ని తెలివిగా తెర మీదకు తెచ్చింది . దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఆ వివాదం చాటున లోక్ పాల్ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో ఆమోదం పొందకుండానే వాయిదా పడతాయి . ఎన్నికల ప్రకటన వెలువడింది కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పి చేతులు దులిపేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి .అలాగే కొన్ని అసంబద్దమైన , నిరుపయోగమైన , బలహీనమైన అంశాలను గుదిగుచ్చి బిల్లులో పొందుపరిచారనిపిస్తుంది . తద్వారా వాటిని యధాతదంగా అంగీకరిస్తే బిల్లు చట్టమైనా చట్టుబండగా మిగిలిపోయేలా రూపొందించారు .

మరొకవైపున " తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న" చందంగా తాము ప్రతిపాదించిన జన్ లోక్ పాల్ బిల్లుకు ఎలాంటి సవరణలూ చేయకుండా వెంటనే పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలని మంకుపట్టుతో తమ‌దైన శైలిలో అన్నా హజారే బృందం ఆందోళనకు ఉపక్రమిస్తున్నది . ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి ఆందోళన చేసే హక్కు , స్వేచ్ఛ వారికున్నది . వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన , ప్రశ్నించాల్సిన అవసరం లేదు . సంకుచిత రాజకీయాలను ఆపాదించే కుసంస్కారుల మాటలకు విలువా లేదు . ప్రజా ఉద్యమాలున్నప్పుడే ప్రభుత్వాలలో కొంతైనా చలనం ఉంటుంది . మన‍ం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం . దాన్ని గౌరవించడమే కాదు , పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది . మౌలిక సమస్యల పరిష్కారానికి మెరుగైన , పదునైన శాసనాల ఆవశ్యకత ఉన్నది . వాటి సాధన కోసం ప్రజల భాగస్వామ్యంతో అలుపెరగని ఉద్యమాలు సాగించాల్సిందే . అందులో ఇసుమంతు సందేహం లేదు . సమస్యల్లా ! లోక్ పాల్ చట్టమొక్కటే అవినీతి మహమ్మారిని తుదముట్టించే సర్వరోగ నివారిణి అన్న ఆలోచనే లోపభూయిష్టమైనది .

అవినీతికి మూలాలు ఈ రాజకీయ‌ వ్యవస్థలోనే ఉన్నాయి . రాజకీయ రంగాన్ని , వ్యాపార రంగంగా రూపాంతరం చెందించారు . ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకొన్నా , ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నది . ఎన్నికల్లో ధనప్రభావాన్ని నిరోధించకుండా అవినీతికి కళ్ళెం వేయడం అసాధ్యం . లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థి నలబై ఐదు లక్షల రూపాయలు వరకు ఎన్నికల వ్యయానికి ఎన్నికల కమీషన్ అనుమతించింది . అంటే సంపన్నులు తప్ప సామాన్యులు , పేదవారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదన్న మాట . అందుకే దామాషా ఎన్నికల విధానాన్ని అమలుచేయాలి . విధానాల ప్రాతిపదికపై రాజకీయ పార్టీలకు ఓట్లేసే చైతన్యాన్ని ప్రజలకు కల్పించాలి . ఎన్నికల సంస్కరణలపై అమరజీవి ఇంద్రజిత్ గుప్తా కమిటీ సమర్పించిన నివేదిక పార్లమెంటు లైబ్రరీలో దిగాలుగా పడి ఉన్నది . దాని దుమ్ముదులిపి అమలుకు పూనుకోవాలి .

రాజకీయ వ్యవస్థ అవినీతిమయమైపోయింది కాబట్టి అవినీతిని ఫటాపంచల్ చేయడానికి అన్నాహజారే కంకణబద్దుడైనాడని , ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కార్పోరేట్ ప్రసారమాధ్యమాలు జడివానలా ప్రచారాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాయి . అనూహ్యంగా లభించిన ప్రజాదరణ , ప్రచారంతో ఆయన మునగ చెట్టెక్కి కూర్చొన్నాడు . బృందగానం చేసే వారూ చేస్తూనే ఉన్నారు . వారిలో హేతుబద్దత , విసక్షణ లోపించినట్లు కనపడుతున్నది . లోక్ పాల్ చట్టం ఒక ఆయుధం మాత్రమే . అందువల్ల వీలైనంత పటిష్టవంతమైన చట్టం రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉన్నది . ముసాయిదా బిల్లు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే రీతిలో ఉన్నదన్న సద్వివిమర్శలు వెల్లువెత్తాయి .

1)కేంద్ర నేర పరిశోధనా సంస్థ సి . బి . ఐ . ని లోక్ పాల్ పరిథిలోకి తీసుకురావాలా లేదా అన్న అంశంపై వివాదం నడుస్తున్నది . ఒకటి మాత్రం స్పష్టం . ఇప్పటి వరకు డిల్లీ గద్దెనెక్కిన ప్రతి రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి సి . బి . ఐ . సంస్థను నియంత్రిస్తూ వచ్చాయి . ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు ఆ సంస్థను ఆయుధంగా వాడుకొన్న ఉదంతాలు కోకొల్లలు . పర్యవసానంగా దాని విశ్వసనీయత దెబ్బతిన్నది . సి . బి . ఐ . కి రాజ్యాంగబద్దంగా స్వయంప్రతిపత్తి కల్పించి రాజకీయ జోక్యానికి ఏ మాత్రం తావులేకుండా చేయాలి . ప్రధాన మంత్రి , ప్రతిపక్ష నాయకుడు లేదా నాయకురాలు , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన చేత నియమించబడిన ప్రతినిథితో కూడిన కమిటీ సి . బి . ఐ . డైరెక్టర్ ను ఎంపిక చేసే విధానాన్నితాజాగా ప్రతిపాదించారు . కానీ , ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల బదిలీలు , పదోన్నతుల అంశాన్ని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అధీనంలోనే కొనసాగించడం ద్వారా పరిపాలనా నియంత్రణ పగ్గాలను ప్రభుత్వం చేతుల్లోనే అట్టిపెట్టుకొన్నది . అది చాలు పాలక‌ పార్టీ సి . బి . ఐ ని తన కనుసన్నల్లో ఉంచుకోవడానికి . ఈ పెడదోరణులకు స్వస్తి చెప్పి ఎన్నికల సంఘం తరహాలో స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి వీలుగా చట్టంలో మార్పు చేయాలి .

2) ఛైర్మన్ తో కలిపి తొమ్మిది మంది సభ్యుల లోక్ పాల్ నియామకానికి ప్రధానమంత్రి , లోక్ సభ స్పీకర్ , ప్రతిపక్ష నాయకుడు లేదా నాయకురాలు , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన చేత నియమించబడిన ప్రతినిథిలతో కూడిన ఐదు మంది ఎంపిక కమిటీని నెలకొల్పుతారు . వారిలో ఎవరినైనా తొలగించాల్సి వస్తే కనీసం వంద మంది పార్లమెంటు సభ్యుల వ్రాత పూర్వకమైన పిర్యాదు చేస్తేనే సాధ్యమవుతుంది .

3) లోక్ పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో లోకాయుక్తలను నెలకొల్పాలి . మనది సమాఖ్య వ్యవస్థ కాబట్టి రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ద కూడదనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు . ఇది అసంబద్ధమైన , పసలేని వాదన మాత్రమే .

4) ప్రభుత్వ ఉద్యోగుల్లోని ' ' ఎ ' మరియు ' బి ' గ్రేడ్ వారినే లోక్ పాల్ పరిథిలోకి తీసుకొచ్చారు . ' సి ' మరియు ' డి ' శ్రేణి ఉద్యోగులను కూడా చేర్చాలన్నది అంతసమంజసం కాదు . వీరు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ పరిథిలో ఉన్నారు . సి . వి . సి . సమర్థతను , పని విధానాన్ని మెరుగుపరచే చర్యలను చేపట్టాలని కోరడం హేతుబద్దంగా ఉంటుంది .

5) కొన్ని మినహాయింపులతో ప్రధాన మంత్రిని కూడా లోక్ పాల్ పరిథిలోకి తీసుకురావడం ఆ మేరకు శుభ పరిణామమే .

6) పిర్యాదు లేకుండా లోక్ పాల్ తనకు తానుగా ( సూమోటో ) కేసులను స్వీకరించి , చేపట్ట కూడదనే షరతు లోక్ పాల్ పని విధానానికి ముందరి కాళ్ళ బంధం వేయడమే అవుతుంది . అలాంటి నిబంధనలను తొలగించేలా ప్రతిపక్షాలు వత్తిడి చేయాలి .

7) స్థానిక సంస్థల్లో అవినీతిని అరికట్టే అంశాన్నిపరిగణలోకే తీసుకొన్నట్లు లేదు . లోకాయుక్త పరిథిలోకి స్థానిక సంస్థలను తీసుకురావాలి . తద్వారా ప్రజాజీవితంతో సంబంధం ఉన్న అన్ని రంగాలు , విభాగాలలో ని అవినీతి , అక్రమాలపై యుద్ధం ప్రకటించాలి .

8) జాతి సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ అవినీతి , అక్రమార్జనకు " పుల్ స్టాప్ " పెట్టే ఆలోచ‌నే ప్రభుత్వం చేయ‌లేదు . అవినీతి , అక్రమార్జన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుకల్పిస్తూ చట్టంలో పొందుపరచాలి .

9) స్వేచ్ఛగా , నిస్పాక్షికంగా , రాగద్వేషాలకు అతీతంగా , పారదర్శికంగా , జవాబుదారీతనంతో అవినీతికి అడ్డుకట్ట వేయడమే ఏకైకలక్ష్యంగా పనిచేసే పటిష్టమైన లోక్ పాల్ కు రాజ్యాంగబద్దత కల్పించాలి.

10) భారత రాజ్యాంగ ముఖ పత్రంపై లిఖించిన జాతి లక్ష్యాల సాధన , పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మరే ఇతర వ్యవస్థలనూ నిర్వీర్యం చేయడంగానీ , విచ్ఛిన్నం చేయడంగానీ దేశానికి క్షేమం కాదు .

దేశ సరిహద్దులను , భద్రతను కంటికి రెప్పలా పరిరక్షించడానికి ఒకే వ్యవస్థ కాకుండా పదాతిదళం , వాయుసేన , నావికాదళం అని మూడు సైనిక విభాగాలను నెలకొల్పారు . కారణం ఒకే వ్యవస్థ క్రింద ఉంటే అధికారకేంద్రీకరణ పర్యవసానంగా దుష్పరిణామాలకు అవకాశం ఉంటుందని కీడెంచి మేలెంచాలన్న దృక్పథంతో రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఉండవచ్చు . అలాగే లోక్ పాల్ ఛత్రం క్రిందికి కీలకమైన ఇతర వ్యవస్థలను తీసుకొచ్చి , అపరిమితమైన అధికారాలను కట్టబెడితే , ఎవరికీ జవాబుదారీ కాని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర హాని జరుగుతుంది .

No comments:

Post a Comment