Wednesday, June 25, 2014

స్మృతి పథం

 నేటికి 39 సంవ‌త్సరాల క్రితం, 1975 జూన్ 15న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జన్సీని ప్రకటించారు. 
ఆ నిరంకుశమైన చీకటి పాలన చేదు అనుభవం నాకు కాస్తా ఉన్నది. నెనప్పుడు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బి.కాం. ప్రథమ సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. నాడు డిగ్రీ విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలను రోజుకొకటి చొప్పున నిర్వహించేది. పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించాలని కోరుతూ మా కళాశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ ఉన్న గోడలపై ఒక రోజు అర్థరాత్రి వాలరైటింగ్స్ వ్రాస్తుంటే రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు దళం నాతో పాటు ఉన్న మరో నలుగురిని అరెస్టు చేశారు. మమ్మల్ని ఏ చట్టం క్రింద అరెస్టు చేశారని అడిగిన పాపానికి నా మిత్రులిద్దర్ని పోలీసులు చితకబాదారు. తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, తూర్పు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ఖాళీ లేకపోవడంతో పశ్చిమ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ‌ నిర్భందించి, ఉదయం బేయిల్ పై విడుదల చేశారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో ఒకతను హెడ్ కానిస్టేబులు కుమారుడు కూడా ఉన్నాడు. కారణం చెప్పకుండా అప్రజాస్వామ్యంగా అరెస్టులు చేసి జైళ్ళలో నెలల తరబడి నిర్భందిచే వారు. ఎలాంటి విచారణలు జరిపే వారు కాదు. ఎమర్జన్సీ నిరంకుశ పాలనకు సంబంధించిన చిన్నపాటి చేదు అనుభవమే కావచ్చు కానీ అనుభవించాను.
సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్ నారాయణ నిర్వహించిన ఉద్యమాన్ని మితవాద అభివృద్ధి నిరోధక ఉద్యమంగా, ఫాసిస్టు ఉద్యమంగా నిర్వచించి, ఆ ప్రతీఘాత ఉద్యమానికి వ్యతిరేకంగా 1975 డిసెంబరు మొదటి వారంలో ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక మహాసభను పాట్నాలో నిర్వహించారు. దానికి 50 దేశాలకు నుండి ప్రతినిథులు వచ్చి పాల్గొన్నారు. భారత దేశ‍ నలుమూలల నుండి దాదాపు ఆరు వేల మంది ప్రతినిథులు పాల్గొన్నారు. నేను ఎ.ఐ.యస్.ఎఫ్. ప్రతినిథిగా తిరుపతి నుండి వెళ్ళి పాల్గొన్నాను. మహాసభ ముగింపులో జరిగిన బహిరంగ సభకు ఐదు లక్షల మందికిపైగా ప్రజానీకం పాల్గొన్నారని వేదికప నుంచి నిర్వాహకులు ప్రకటించారు. నా జీవిత‍ంలో మొట్టమొదట పాల్గొన్న‌ భారీ బహిరంగ సభ అదే. గడ్డ గట్టే చలిలో తరలివచ్చిన ఆ ప్రజానీకానికి వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రతినిథులు జేజేలు పలికారు.
నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) వెర్రితలలు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురిచేసింది. నియంతృత్వ పాలన సాగించబడింది. పాట్నా మహాసభలో పాల్గొన్న నాకు పశ్చాత్తాపం పడడం మినహా మరేమి మిగలలేదు. నాటి ఘటనలను గుర్తు చేసుకొనే అవకాశం కల్పించిన నీలాయపాలెం విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు.

No comments:

Post a Comment