Friday, April 3, 2015

నైతిక పతనం వైపు చట్ట సభల సభ్యుల అడుగులు!

ప్రచురణ: సూర్య దినపత్రిక, ఏప్రిల్ 3, 2014

పార్లమెంటు ఉభయ సభలు, రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ, జమ్మూ & కాశ్మీర్, చత్తీస్ ఘర్ శాసన సభల సమావేశాల తీరు తెన్నులను గమనించిన వారికి  జుగుప్స కలిగింది. చట్ట సభల సభ్యుల్లో దిగజారిపోతున్న ప్రమాణాల పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నది.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలు చట్ట సభలు. చట్ట‌ సభల సభ్యులు ఉన్నతమైన నైతిక‌ ప్రమాణాలను,  చట్టాలను, చట్ట సభల నియమ నిబంధనలను, సాంప్రదాయాలను, క్రమశిక్షణను పాటించినప్పుడే చట్ట సభలకు వన్నె వస్తుంది. అప్పుడే చట్ట సభలపైన, సభ్యులపైన ప్రజలకు విశ్వాసం, గౌరవం పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుంది. రాజకీయాలు, నైతికత మధ్య విడదీయలేని బంధం ఉన్నది. ఈ బంధాన్ని రాజకీయ నాయకత్వం అపభ్రంశం పట్టించడం మూలంగా స‌మాజంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ప్రజా ప్రాతినిథ్య వేదికలు పతనం వైపు పయనిస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమంలోనూ, స్వాతంత్ర్యానంతరం రెండు మూడు దశాబ్దాల వరకు రాజకీయ రంగ‍ం త్యాగధనులతో నిండి ఉన్నది. నిస్వార్థ ప్రజా సేవే గీటురాయిగా రాజకీయ రంగంలో ప్రవేశించిన వారు  చట్ట సభలకు ఎన్నుకోబడినంత కాలం దేశం, ప్రజల యొక్క‌ విస్తృత ప్రయోజనాలే కొలబద్దగా చర్చలు జరిగేవి. సహజంగానే ప్రభుత్వాల వర్గ స్వభావాన్ని బట్టి విధానాల రూపకల్పన, అమలు జరిగేవి. భిన్న భావజాలాలు, దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించడంలో ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పవచ్చు. అందు వల్ల‌ వారి మాటకు సమాజం విలువిచ్చేది. ఎప్పుడైతే నైతిక విలువలకు పాతరేసి, డ(గ)బ్బు రాజకీయాలు ఆధిపత్యంలోకి వచ్చాయో సమాజంలో కూడా అవినీతి, అక్రమాలు పెరిగాయి. ఆశ్రిత పక్షపాతం పెరిగింది. నైతిక విలువలకు విలువలేని దుస్థితి నెలకొన్నది.
ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఉద్యమాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం కోసం ప్రజలు తెగించి ఉద్యమాలు చేస్తున్నారు. అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. మన దేశంలో ఉనికిలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవడానికి బదులు పునాదులనే గొడ్డలి పెట్టుకు గురిచేస్తున్న దుష్పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకొన్నాయి. యు.పి.ఎ.-2 ప్రభుత్వ నిర్వాకాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎలాంటి హానికరమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయో, వాటి దుష్ప్రభావం వల్ల‌ చట్ట‌ సభల స్థాయి ఏ విధంగా దిగజార్చబడిందో బోధపడుతుంది. దేశ స్వావ‌లంబనకు ప్రమాదకరమైన మరియు ప్రజావ్యతిరేకమైన‌ చట్టాలకు ఆమోద ముద్ర వేయించుకోవడానికి పాలక పక్షం ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందో, కడకు సి.బి.ఐ.ని రాజకీయ ఆయుధంగా దుర్వినియోగం చేసిందో చూశాం.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోద ముద్ర వేయించుకోవడానికి కాంగ్రెస్ అనుసరించిన పద్ధతులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వుల పాలు చేయడమే కాదు, గొడ్డలి పెట్టుకు గురిచేసింది. రాజ్యాంగస్ఫూర్తిని, సాంప్రదాయాలను, నిబంధనలను తుంగలో తొక్కి, లోక్ సభ ద్వారాలు మూసేసి, ప్రసారమాధ్య‌మాలను అనుమతించ కుండా, బిల్లును వ్యతిరేకించిన గౌరవ సభ్యులపై భౌతిక‌ దాడి, అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, సభలో ఏం జరుగుతున్నదో సభలో ఉన్న సభ్యులకే బోధపడని తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన చీకటి బిల్లు ఆమోదించబడిందని ప్రకటించబడింది. పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కైతే ఏంతటి నిరంకుశ చట్టాన్నైనా తీసుకురావచ్చని ఈ ఘటన రుజువు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలో పదేళ్ళ పాటు పాలన సాగించిన యుపిఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాల ఆమోదానికి అనైతిక పద్ధతులకు పాల్పడడం, మరీ ప్రత్యేకించి ఎన్నికలకు ముందు అనేక కీలకాంశాలపై చట్టాలు తీసుకురావడం ప్రబల నిదర్శనం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అన్న నానుడిగా పార్లమెంటే గాడి తప్పి పని చేస్తుంటే ఇహ శాసన సభల సంగతి చెప్పాలా! అత్యున్నత వేదికైన‌ పార్లమెంటు స్థాయిని ఆ దుస్థితికి చేర్చిన తరువాత మిగిలిన చట్ట సభల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకోవడం దురాశ అవుతుందేమో!    
గడచిన మూడు దశాబ్దాలుగా క్రమేపీ రాజకీయ రంగంలో అనైతికత, అవినీతి పెరిగిపోయాయి. హత్యా నేరాల కంటే ఆర్థిక నేరాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను తొలిచేస్తాయని అత్యున్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. అలాంటి దేశ ద్రోహం చేసిన వ్యక్తులు నిర్భీతిగా చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. సహజంగానే వారి రక్షణార్థం నేరచరితులను తమ‌ వెంట చట్ట సభల్లోకి తీసుకొస్తున్నారు. రాజకీయ పార్టీలు నేరచరితులను అభ్యర్థులుగా నిలుచోబెడితే, చైతన్యరాహిత్యంతో డబ్బు, మద్యం, కులం, మతం, తెగ, ప్రాంతం వంటి వాటికి ప్రభావితులౌతున్న‌ ప్రజలు ఓట్లేసి నేరచరితులను గెలిపిస్తున్నారు. అలాంటి వారికి భారత రాజ్యాంగం, చట్టాలు, చట్ట‌ సభల నియమ నిబంధనలు, చట్ట సభల సభ్యుల కుండవలసిన నైతికత పట్ల శ్రద్ధా భక్తులుగానీ, గౌరవంగానీ ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రత్యర్థులపైన ఆవేశంతో ఊగి పోవడం, దాడులకు పూనుకోవడం, సభ్య సమాజం అసహ్యించుకొనే పదజాలంతో దూషించడం, మైకులు, బెంచీలను విరగ్గొట్టడం, కాగితాలను చించి వెదజల్లడం లాంటి చర్యలు నిత్యకృత్యంగా తయారయ్యాయి. అత్యంత దయనీయంగా చట్ట సభల సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈ దుస్థితికి కేవల‍ం ప్రతిపక్షాలనే నిందించలేం, పాలక పక్షాలు అనుసరిస్తున్న వైఖరులు కూడా కారణమని చెప్పక తప్పదు. ప్రజా సమస్యలు, రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై చట్ట సభల్లో చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించే తీరుతెన్నులతో సభలు జరగడం లేదు. సమావేశాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయబడుతున్నదనే ఆవేదన ప్రజల్లో సర్వత్రా నెలకొని ఉన్నది.
ప్రతి ఏడాది మార్చి 31 లోపు వార్షిక బడ్జెట్లకు చట్ట సభలైన పార్లమెంటు లేదా ఆయా శాసన సభల ఆమోదం  లేకపోతే ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోతాయి. కాబట్టి ఆదాయ‌, వ్యయాల అంచనాల‌తో కూడిన‌ వార్షిక బడ్జెట్లను రూపొందించి చట్ట సభల్లో ప్రవేశ పెట్టి తూతూ మంత్రంగా చర్చలు జరిపి, ఆమోద ముద్ర వేయించుకోవడం ఒక తంతుగా మారింది. రాజ్యాంగ బద్ధమైన నిబంధనలను సంతృప్తి పరచడం కోసమేనన్నట్లు చట్ట సభల నిర్వహణను పాలక పార్టీలు దిగజార్చాయి. సభా సమావేశాలను వేదికగా ఉపయోగించుకొని ప్రభుత్వం, పాలక పార్టీపైన దుమ్మెత్తి పోయడమే తమ పని అన్న‌ట్లు ప్రతిపక్షాలు తలపోస్తున్నాయి. ఫలితంగా చట్ట సభలు కాస్తా రంచ బండల కంటే అధ్వాన్నంగా తయారైనాయి.
ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపైన‌, ప్రజా ఉద్యమాల వాణిని శక్తివంతంగా వినిపించడానికి ప్రయత్నించే సభ్యుల నోరు నొక్కడానికి పాలక పక్షాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఉన్నాయి. అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థిక శాఖామాత్యులు కె‍.యం.మణి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి అనర్హుడని వామపక్ష, ప్రజాతంత్ర కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ సభా నిర్వహణను అడ్డుకోవడం, సభలో విధ్వంసం సృష్టించారని ఐదుగురు సభ్యులను శాసన సభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీపై రాజస్తాన్ శాసనసభలో గొడవ చేసిన 8 మంది కాంగ్రెస్ శాసన సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. చత్తీస్ ఘర్ మరియు జమ్మూ&కాశ్మీర్ శాసన సభలలో కూడా ఈ తరహా అల్లర్లే జరిగాయి.
ఎన్నికల వాగ్దానాలు - చిత్తశుద్ధి: ఎలాగైనా అధికారాన్ని చెరబట్టాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం కాని, అలివిగాని ఎన్నికల వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక మోసపూరిత మాటలతో కాలం వెళ్ళబుచ్చడానికి ప్రయత్నించడం పరిపాటిగా మారిపోయింది. దాని ప్రభావం చట్ట సభల పనితీరుపై అనివార్యంగా పడుతున్నది. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని నిలదీయడం ద్వారా ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని సహజంగానే ప్రయత్నిస్తాయి. దానిని నుంచి తప్పించుకోవడానికి పాలక పక్షం  చర్చను ప్రక్క దారి పట్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగా అప్రస్తుతమైన, అసంబద్ధమైన అంశాలను, వివాదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఫలితంగా వాదప్రతివాదనలు, ఒకరి నేర‌ చరిత్రను మరొకరు తవ్వి దుమ్మెత్తి పోయడానికి పూనుకోవడం, దుర్భాషలాడుకోవడం, హావభావాలతో తోటి సభ్యుల హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరించడం నిత్యకృత్యంగా మారిపోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చోటు చేసుకొన్న ఘటనల పట్ల సభ్యసమాజం తీవ్ర అభ్యంతరం, నిరసన తెలియజేసే పరిస్థితులు కల్పించబడ్డాయి. సభ లోపల, వెలుపల కొంత మంది సభ్యుల ప్రవర్తన, ఉచ్చరించిన భాష, హావభావాలు చట్ట సభల సభ్యుల గౌరవ మర్యాదలను బుగ్గి పాలు చేశాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన‌ ఒక మహిళా సభ్యురాలు ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని ప్రసార మాధ్యమాల ముందు "నన్నేమి చేయగలరు రేప్ చేస్తారా? హత్య చేస్తారా? వాళ్ళకు రేప్ చేసే ధైర్యం లేదు, హత్య చేసే శక్తి లేదు, ఏం పీకుతారు? " అని బహిరంగంగా మాట్లాడడం, పాలక పక్ష సభ్యుడొకరు సభ లోపలే "ఒరేయ్ నిన్ను పాతరేస్తాను" అని హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆ గౌరవ సభ్యుల స్థాయి ఏ పాటిదో వీటిని బట్టి అంచనా వేసుకోవచ్చు. ఈ తరహా భూతులతో సభ్యులు వారి గౌరవ మర్యాదలను వారే మట్టిమాలు చేసుకోవడమే కాకుండా చట్ట సభల ఔన్నత్యానికి తీవ్రభంగం కలిగించారు. ఈ దుస్థితికి కారకులు మీరంటే మీరని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు, డిమాండ్లు చేసుకొన్నారు. వాటిని అలా ఉంచితే కొంత మంది సభ్యుల ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగాను, అభ్యంతరకరంగాను, సభ్యసమాజం ఛీదరించుకొనేలా ఉన్నాయి. ఇలాంటి వారినా మనం శాసన సభ్యులుగా ఎన్నుకొన్నదని పక్షాత్తాపపడే దుస్థితికి ప్రజలు నెట్టబడ్డారు.
నవ్వుల పాలౌతున్న ఫిరాయింపుల నిరోధక‌ చట్టం: భారత‌ రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా తీసుకురాబడిన 'ఫిరాయింపుల వ్యతిరేక చట్టం' 1985 మార్చి 1 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ సవరణ 91 ద్వారా సవరించబడిన‌ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం 2004 జనవరి 1 నుండి అమలులో ఉన్నది. దీని ప్రకారం శాసన సభాపక్షంలో 2/3 వ వంతు సభ్యులు మాతృపార్టీ నుంచి చీలిపోయి, వేరే కుంపటి పెట్టుకోవడంగానీ లేదా మరొక పార్టీలో చేరడం గానీ జరిగినప్పుడు మాత్రమే సభ్యులు అనర్హులుగా ప్రకటించబడరు. అలాగే మొత్తం పార్టీని మరొక పార్టీలో విలీనం చేయాలన్నా ఒక్క సభ్యుడు లేదా సభ్యురాలు వ్యతిరేకించినా వారు సభ్యత్వం కోల్పోకుండా మాతృ పార్టీకి వారసులుగా కొనసాగుతారు. ఉదాహరణకు చిరంజీవి నెలకొల్పిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు శాసన సభ్యురాలుగా ఉండిన కీ.శే.శోభానాగిరెడ్డి గారు విలీనాన్ని వ్యతిరేకించినా ఆమె అనర్హురాలుగా ప్రకటించబడ లేదు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలలో చోటు చేసుకొన్న తాజా పరిణామాలు రాజకీయ రంగంలో అనారోగ్యకరమైన దోరణులకు ప్రతిబింబాలుగా నిలిచాయి. టిడిపి ఎన్నికల చిహ్నంపై గెలుపొందిన ఒక శాసన సభ్యుడు పార్టీ ఫిరాయించి, పాలక పార్టీలో చేరి మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయన తన‌ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినా దాన్ని ఇంకా ఆమోదించలేదు. ఇది అనైతికమైనది, చట్ట వ్యతిరేకమైనదని ఆ సభ్యుని మాతృ పార్టీకి చెందిన మిగిలిన సభ్యులు శాసన సభా వేదికలో నిరసన తెలియజేయడంతో ఆ సభ్యులను సభా సమావేశాలు ముగిసే వరకు సభ నుండి సస్పెoడ్ చేయడం జరిగింది. శాసన మండలిలో తెలుగు దేశం పార్టీకి చెందిన మెజారిటి సభ్యులు టి.ఆర్.యస్. పార్టీలో చేరడంతో మొత్తం శాసన సభా పక్షమే టి.ఆర్.యస్.లో విలీనమైనట్లు ప్రకటించబడింది. సర్వసాధారణంగా శాసన సభా పక్షం నాయకత్వాన్ని శాసన సభ మరియు శాసన మండలి సభ్యులు మొత్తం కలిసి ఎన్నుకొంటారు. మరి ఈ చర్య న్యాయ సమీక్షకు నిలుస్తుందా! లేదా అన్నది అటు ప్రక్కన బెట్టి చూసినా ఇప్పటికీ టిడిపికి ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన మండలి సభ్యుల ఉనికి ప్రశ్నార్థకమయ్యింది.
ఫిరాంయిపుల వ్యతిరేక చట్టం అమలులోకి వచ్చిన తరువాత అమెరికా, భారత దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందడానికి నాటి యు.పి.ఏ. ప్రభుత్వం ప్రోత్సహించిన ఫిరాయింపుల ఘటన వరకు 62 మంది లోక్ సభ సభ్యులపై పిర్యాదు చేయబడితే వారిలో 26 మంది అనర్హులుగా ప్రకటించబడ్డారు. పెద్దల సభ అయిన రాజ్యసభ సభ్యులు నలుగురిపైన ఫిర్యాదులు చేయబడ్డాయి. వివిధ రాష్ట్రాలలో 2004 వరకు 268 మంది శాసన సభ్యులపై పార్టీ ఫిరాయింపుల కేసులు నమోదైతే వారిలో 155 మంది అనర్హులుగా ప్రకటించబడ్డారు. అయినా పిరాయింపుల నిరోధక చట్టం ఒక చట్టుబండలాగా మిగిలిపోయింది.
ప్రశ్నార్థకమవుతున్న చట్ట సభల ఔన్నత్యం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతి అత్యంత కీలకమైన పాత్రదారి. నిష్పాక్షికంగా, రాగ ద్వేషాలకు అతీతంగా, పారదర్శకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పునాదులను పటిష్టపరిచే తీరుతెన్నులతో సభను నిర్వహి‍చాల్సిన బాధ్యత సభాపతిపై ఉన్నది. అందుకే సభాపతిగా ఎన్నికైన వారు తమ పార్టీకి రాజీనామా చేస్తే రాజకీయ అనుబంధాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆ స్థానానికి వన్నె తెచ్చిన వారవుతారని భావించబడుతున్నది. ఆ సస్సాంప్రదాయాన్ని చట్టం కూడా ప్రోత్సహిస్తున్నది. ఆ దృష్టితోనే సభాపతిగా ఎన్నికైన సభ్యుడు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి రాజీనామా చేసినా సభ్యత్వం కోల్పోరని పిరాయింపుల‌ నిరోధక చట్టంలో కూడా మినహాయింపు ఇవ్వబడింది. అప్పుడే సభాపతి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఉపకరిస్తుందని, సాధ్యమైనంత వరకు విమర్శలకు తావు లేకుండా సభాకార్యక్రమాలను నిష్పాక్షికంగా ఫలవంతంగా నిర్వహించడానికి వాతావరణం సృష్టించ బడుతుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ సస్సాంప్రదాయం ఆచరించక పోవడం మూలంగా సభాపతి నిష్పాక్షికతపై తరచూ విపక్షాలు పెదవి విరిచే పరిస్థితులు నెలకొంటున్నాయి. సభాపతి పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న‌ ఆరోపణలను కొన్ని సంద‌ర్భాలలో ప్రతిపక్షాలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ అలాంటి అనారోగ్యకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నెలకొనడాన్ని గమనిస్తూనే ఉన్నాం. కడకు సభ్యులు విజ్ఞత కోల్పోయి ఆవేశాలతో ఊగిపోతూ ప్రవర్తించిన తీరు, ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల మూడు రోజుల సస్పెంషన్, వాకౌట్ చేస్తున్నామని ప్రకటించకుండానే ప్రతిపక్షం సభ నుండి నిష్క్రమించడం, గవర్నరుకు ఫిర్యాదు, సభాపతిపై అవిశ్వాస తీర్మానాన్ని అందజేయడం, ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి అనుమతించే వరకు సభా సమావేశాలకు హాజరు కాబోమని ఆవేశంతో ప్రతిజ్ఞ చేయడం లాంటి దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీ నాయకత్వం పునరాలోచించుకొని సభా సమావేశాలకు హాజరుకావడం, స్పీకర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరి‍చుకోవడం ద్వారా కథ సుఖాంత మయ్యిందనిపించారు. కానీ, అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని చేసిన పిర్యాదులు అలా పెండింగ్ లోనే ఉన్నాయి. 
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నాణ్యత రోజు రోజుకూ పలచనౌతున్నది. సభాకార్యక్రమాలను ప్రసారమాధ్యమాలు ప్రజలకు త్వరితగతిన చేరవేస్తున్నాయి. సభ్యుల పనితీరుపైన‌, ప్రవర్తనపైన అవగాహన చేసుకోవడానికి వార్తలు, టివిల్లో ప్రసారమవుతున్న‌దృశ్యాలు ప్రజలకు ఎంత‌గానో దోహదపడుతున్నాయి. చట్ట సభల్లో జరుగుతున్న అల్లరి దృశ్యాలు జుగుప్సాకరంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చట సభల్లో పాటిoచాల్సిన సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, హుందాతనానికి భంగం కలిగించే చర్యలకు పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సభ్యులు పాల్పడాన్ని ఆయా పార్టీల నాయకత్వాలు కట్టడి చేయకపోతే ప్రజల నుండి విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఈ దిగజారుడు ప్రక్రియకు అడ్డుకట్ట వేయకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తు అంధ‌కారంగా తయారవుతుంది. చట్ట సభల సభ్యులను ప్రజలు 'రోల్ మోడల్స్'గా భావిస్తారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన చట్ట సభల సభ్యులే దారి తప్పి ప్రవర్తిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పుతుంది. చట్ట సభలను సమర్థవంతంగా పని చేయించడంలో పాలక, ప్రతిపక్షాలకు గురుతరమైన‌ బాధ్యత ఉన్నదని గుర్తించాలి.
చట్ట సభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకoగా తమ పని విధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలు వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటుంది. వైవిద్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత‌ రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉన్నది, తదనుగుణంగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడి ఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్య వ్యవస్థ కోసం అడుగు ముందుకు వేయాలి. బహుళ పార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో చట్ట సభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. ఆర్థిక నేరస్తులు, వ్యవస్థీకృత నేరాల చరిత్ర ఉన్నవారు చట్టసభల్లోకి ప్రవేశించకుండా సమగ్రమైన, పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం. తద్వారా మాత్రమే దిగజారుతున్న‌ చట్ట సభల ప్రమాణాలకు అడ్డుకట్ట వేసి, వాటి ఔన్నత్యాన్ని పునరుద్ధించడానికి వీలౌతుంది.
                                                                                                               


1 comment:

  1. ప్రజాస్వామ్యమే ధనిక వర్గాల చేతిలో బందీగా మారాక చట్ట సభలలో విలువలుండవు. అవి ప్రజల కొరకు పని చేస్తాయనుకోవడం భ్రమ. అమెరికా చట్ట సభలలో దీర్ఘకాలంగా స్వతంత్ర అభ్యర్ధిగా ఉంటూ వస్తున్న బెర్నీ సాండర్స్ అక్కడి సభల పని తీరును ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలేవీ చట్ట రూపంలో సభముందుకు రావు, కనీస వేతనమూ, సంపన్నులపై పెంచాలనీ ప్రజలు కోకుంటున్నా అవి చట్ట రూపం తీసుకోవు. వ్యాపారాలకి రాయితీలు, సౌలభ్యాలూ కలిగించే విషయాలు మాత్రమే సభ ముందుకొస్తాయి. అదే యిక్కడా జరుగుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తున్న సమయంలో ఉభయ సభలలో పెట్టూబడులకు పన్ను రాయితీనే ప్రధానాంశ మయింది. సామాన్య ప్రజల ప్రయోజనాలు సంపన్నుల సంక్షేమంపైనే ఆధారపడి వుంటాయనే భ్రమని రాజకీయ పక్షాలన్నీ కలగలిసి కల్పిస్తున్నాయి. ఎన్నికలు ఎంతగా దిగజారితే, ప్రజాస్వామ్యమూ అదే స్థాయిలో దిగజారుతుంది. ప్రజలు ఎవరికి ఓటేసినా అధికారం సంపన్నులదే ఔతున్న నేపధ్యంలో చట్ట సభల తీరుపట్ల వాపోయి ప్రయోజనం లేదు. ఎందుకలా జరుగుతోందో ప్రజలకు చెప్పాలి. ప్రస్తుత ఆర్ధిక సామాజిక వ్యవస్థకీ చట్ట సభల పనితీరుకూ ఉన్న సంబంధాన్ని ప్రజలకు విశద పర్చాలి. మార్చడానికి ఏంచేయ గలరో వివరించాలి.

    ReplyDelete